గమనమే గమ్యం

 

volgaదుర్గాబాయి ఎన్నికల్లో ఓడిపోయింది. రెండువందల కంటే తక్కువ ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థి గెలిచాడు. శారద దుర్గాబాయికి ఉత్తరం రాసింది. కమ్యూనిస్టు అభ్యర్థులు ఎక్కువమంది గెలిచినందుకు ఆనందపడింది. రోజులు వేగంగా గడుస్తున్నాయి. పగలూ రాత్రీ తేడా లేకుండా ఊపిరాడని పనులతో శారద పరుగిడుతోంది. దుర్గాబాయి ఓటమి కలిగించిన నిరాశ మనసులోంచి పూర్తిగా పోకముందే దుర్గాబాయి చింతామణి దేశ్ ముఖ్ ల వివాహ వార్త వచ్చింది, అన్నపూర్ణ, స్వరాజ్యం ఆ ఆనందాన్ని మోసుకుంటూ బెజవాడ వచ్చారు. స్వరాజ్యం ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్.ఎస్.సి లో చేరటానికి  వెళ్తోంది. వెళ్ళేముందు శారద పెద్దమ్మతో నాలుగు రోజులు గడపాలని ప్రయాణమైతే ఒక్కరోజుకి నేనూ మీ పెద్దమ్మతో మాట్లాడుకోటానికి వస్తానంది అన్నపూర్ణ. “నువ్వొస్తే మీరిద్దరే మాట్లాడుకుంటారు. నేనొకదాన్నే వెళ్తానంది స్వరాజ్యం. ఆ విషయం మీద కాసేపు తగవు పడిన తల్లీ కూతుళ్లను అబ్బయ్య సమాధాన పరిచాడు. “అన్నపూర్ణ ఒక్క పూట మాత్రమే ఉండి వచ్చేస్తుంది, స్వరాజ్యం నాలుగు రోజులుంటుంది” అన్న తండ్రి మాటను గొణుక్కుంటూనైనా ఒప్పకోక తప్పలేదు స్వరాజ్యానికి,

“నాకంటే నీకు శారద పెద్దమ్మ ఎక్కువైంది” నిష్టూరమాడింది తల్లి, “కాదమ్మా నువ్వూ పెద్దమ్మా చిన్నప్పటి నుంచీ స్నేహితులు. నాకు మొన్న మొన్ననే గదా పెద్దమ్మ దగ్గర చనువు. ఆమె పూర్తిగా నాకే కావాలనిపిస్తుంది, అందరికంటే నన్నే ప్రేమించాలనిపిస్తుంది. నాకు పెద్దమ్మంటే ఉన్న ప్రేమ ఎవరికీ ఉండదు – ”

తన ఉద్వేగాన్ని అణుచుకోలేక అక్కడి నుంచీ వెళ్ళిపోయింది. అన్నపూర్ణ, అబ్బయ్య ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు.

“ఏంటంత ఆవేశపడుతుంది” అన్నపూర్ణ ఆశ్చర్యపడింది.

“ఈ వయసులో పిల్లలకు కొందరిపట్ల విపరీతమైన ఆరాధన ఏర్పడుతుంది – అది మామూలే – మనకా వయసులో గాంధీ గారు ఆరాధ్యుడు కదూ – అలాగే -”

“ఇది కమ్యూనిస్టు అవదు గదా”

“ఆ భయం నాకూ ఉంది – ” నవ్వాడు అబ్బయ్య,

సాయంత్రానికి బెజవాడ చేరారు. ఆ రాత్రి మాత్రమే అన్నపూర్ణ ఉండి మర్నాడు ఉదయం వెళ్ళిపోతుంది.

రాత్రి భోజనాలయ్యాక అందరూ కూచుని కబుర్లాడుకునేటపుడు “దుర్గాబాయి గారు పెళ్ళీ చేసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది’

అంది అన్నపూర్ణ

“ఎందుకంత ఆనందం, పెళ్ళే జీవిత పరమార్థమా?” నవ్వింది శారద,

“పరమార్థమని కాదు. ఒక మంచి తోడు దొరికింది. చేసే పని మరింత బాగా చెయ్యటానికి మరింత బలం”,

“దుర్గకి ఎవరి బలమూ అరువుగా అకర్లేదు. తన బలం తనకు చాలు”.

“దుర్గ సంగతి పక్కన బెడదాం. ఆమె అసామాన్యురాలు. మిగిలిన వాళ్ళకు ఒకరికొక తోడు అక్కర్లేదా?

‘అది మనకు అలవాటైపోయింది అన్నపూర్ణా, ఒక పెళ్ళి – భార్యా భర్త. భర్త మంచివాడైతే ఫరవాలేదు. ఎందరు ఆడవాళ్ళకు వాళ్ళ భర్తలు బలమిస్తున్నారు చెప్పవోయ్, భార్యలలోని సర్వశక్తులూ లాగేసే వాళ్ళే ఎక్కువ. మనం కూడా పెళ్ళిళ్ళకు ఆనందపడటం, పిల్లలకు పెళ్ళీ తప్పనిసరిగా చెయ్యాలనుకోవటంతో ఆ ఆచారమునూ, మరొకటనూ బలపడుతుంది. దాన్ని బలపడనివ్వకూడదు. అది ఎంత బలహీనపడితే ఆడవాళ్ళకంత మంచిదోయ్”,

“చలం గారిలా మాట్లాడుతున్నావు”,

“ఆయన మూటలు నిజమని నాకనిపించినపుడు నా మాటలకు ఆయన మూటలకూ తేడా ఉండదుకదోయ్’,

స్వరాజ్యం ఎదుట ఆ మాటలు పొడిగించాలనిపించలేదు అన్నపూర్ణకు, కానీ శారద ఆపలేదు.

“స్త్రి పురుషుల మధ్య స్నేహం, ప్రేమ, సాంగత్యం, సెక్సు ఇవి ఆనందాన్నివ్వవని నేననటం లేదు. మనుషులకు సెక్సు అవసరమని తెలియని దాన్ని కాదు – కానీ పెళ్ళి తప్ప సెక్సుకి ఇంకోదారి లేకపోవటం, స్త్రీ పురుషుల స్నేహానికి వీలు లేకపోవటం ఎంత దుర్మార్గమోయ్, దానివల్ల చచ్చినట్లు పెళ్ళి చేసుకోవాలి. ఇక ఆ పెళ్ళీ ఇద్దర్నీ కుంగదీస్తుంది. ఇక ఆ పెళ్ళి నుంచి బైటపడే దారీ ఉండదు”.

‘హిందూకోడ్ బిల్లు ఒస్తోందిగా”

“బిల్లులతో చట్టాలతో పోయేంత బలహీనమైంది కాదోయ్ పెళ్ళి, కొండచిలవలా చుట్టుకుని బిగుసుకొని ఉంది.

“శుభమా అని దుర్గ పెళ్ళి గురించి మాట్లాడుతుంటే –”

“పెళ్ళి శుభం అనుకోవటంతోనే నా పేచీ – దుర్గ పెళ్ళితో కాదు. వాళ్ళిద్దరి

సంగతి గురించి కాదు – మొత్తం పెళ్ళీ అనే తప్పనిసరి చెరసాల గురించి చెబుతున్నాను”.

“ఆడవాళ్ళందరం అందులో బందీలంటావు”

olga title

“ఆడవాళ్ళనే కాదు – మగవాళ్ళు కూడా – మానవుల్ని అమానుషంగా చేస్తుందోయ్ పెళ్ళి

“మరీ దారుణంగా మాట్లాడకు శారదా”

“దారుణం నా మాటలు కాదు. పెళ్ళీ – అందులో పెత్తనం, అధికారం ఉందోయ్ – అది చాలా దారుణం”,

“దాన్నించి బైటపడేదెట్లా పెద్దమ్మా – బైటపడి ఆడవాళ్ళు మగవాళ్ళు ప్రేమగా కలవటం ఎట్లా”

“ఎట్లా అంటే ఇట్లా అని చెప్పటానికి నా దగ్గర రెడీమేడ్ సమాధానం లేదమ్మా – ఇది దారుణం అని గుర్తించటం ఒక ముందడుగని నాకనిపిస్తుంది. తర్వాతి అడుగులు చాలా ఉన్నాయి – కులం, మతం, డబ్బు – వీటి ప్రభావాల నుంచి తప్పించుకుని ప్రేమించగలిగేందుకు చేసే పోరాటాలూ – ఇలా అడుగులు వేసుకుంటూ ఆ దారిలో నడుస్తూ వెళ్ళటమే – పెళ్ళి దారుణమని సన్యాసులవటం కాదు పరిష్కారం. ప్రేమ కోసం, ఉన్నతమైన స్త్రీ పురుష సంబంధాల కోసం అన్వేషించటంలోనే ఆనందాన్ని పొందటం నేర్చుకోవాలి”

శారద వంక ఆరాధనగా చూస్తున్న స్వరాజ్యాన్ని చూస్తుంటే అన్నపూర్ణకేదో ఆందోళన.

“నాకు నిద్రోస్తోంది పడుకుందాంరా ”అని లేచింది.

“నువ్వు పడుకోమ్మా నాకు నిద్రరాటంలా” స్వరాజ్యం లేవలేదు. చేసేది లేక అన్నపూర్ణ వెళ్ళింది. స్వరాజ్యం శారదకు మరింత దగ్గర చేరి తన సందేహాలన్నీ అడగటం మొదలుపెట్టింది. శారద చెబుతుంటే శ్రద్ధగా వింటూ –

ఆ రాత్రే కాదు మిగిలిన నాలుగు రోజులూ శారదను ఒక్క క్షణం ఒదలలేదు స్వరాజ్యం. ఆమెతో పాటు ఆస్పత్రికి వెళ్ళింది. రోగుల ఇళ్ళకు వెళ్ళింది. సరస్వతీ గోరాల దగ్గరకూ, మెల్లీ లక్ష్మణరావుల దగ్గరకూ వెళ్ళింది. అదంతా కొత్త ప్రపంచంలా ఉందా అమ్మాయికి.

“ఇన్నాళ్ళూ నేనిదంతా మిస్సయ్యాను పెద్దమ్మా. అమ్మా నాన్నా ఎంత చెప్పినా

బెజవాడ వచ్చేదాన్ని కాదు. ముందే వచ్చుంటే ఎంత బాగుండేది” అంటే శారద నవ్వింది,

“ముందే వస్తే ఇంత నచ్చేది కాదేమో. ప్రతి దానికీ ఒక టైముంటుంది. కోడిగుడ్డు పిల్లవటానికున్నట్టు”

“పెద్దమ్మా – నేను ఉత్తరాలు రాస్తే సమాధానం ఇస్తావా?” “ఎందుకివ్వను పిచ్చిపిల్లా – నేను మీ పెద్దమ్మను” అని స్వరాజ్యాన్ని దగ్గరకు తీసుకుంది.

స్వరాజ్యం విశాఖపట్నంలో హాస్టల్లో ఉన్నా శలవు రోజుల్లో తమ బంధువుల ఇళ్ళకు వెళ్ళి ఇష్టమైనవన్నీ వండించుకుని తినమని శారద వాళ్ళ అడ్రసులన్నీ ఇచ్చి వాళ్ళకు ఉత్తరాలు రాసింది.

: ; ; :

“మీ వాళ్ళు చూడు ఏం చేశారో. మూడేళ్ళు తిరగకుండా ఎన్నికలు తెచ్చిపెట్టారు. మొన్నటివరకూ సాయుధ విప్లవం ద్వారా నెహ్రూ ప్రభుత్వాన్ని పడగొడతామన్నారు ఇప్పుడు — ”

“ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా పడగొట్టారు. మంచిదే గదా – అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టటంలో తప్పేమీ లేదోయ్”,

“నిన్ను వాళ్ళు శత్రువులా చూస్తున్నారు. నువ్వు మాత్రం వాళ్ళను సమర్ధించటం మానవు”,

“వాళ్ళు చేసింది సరైనది కాదని వ్యతిరేకిస్తేనే కదా వాళ్ళు నేనూ అని మాట్లాడే అవకాశం వచ్చింది. ఎన్నికల రాజకీయాలలో వాళ్ళు చేసింది కరక్టేనోయ్”

అన్నపూర్ణకు మరి మాట్లాడేందుకేమీ లేకపోయింది, ఒంట్లో బాగోలేదని శారద దగ్గర పరీక్ష చేయించుకోటానికి వచ్చింది అన్నపూర్ణ పరీక్ష చేసి మందులిచ్చాక రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు మధ్య మధ్యలో గర్భిణీ స్త్రీలు పరీక్షల కోసం వస్తున్నారు.

శారద వాళ్ళను పరీక్షిస్తూ, జాగ్రత్తలు చెప్తూ అన్నపూర్ణతో మాట్లాడుతూ ఉంది.

ఆ సమయంలో తెల్లగా సన్నగా పొడవుగా ఉన్న ఓ యువతి వచ్చింది. పక్కనే కాస్త పొట్టిగా తెల్లగా ఉన్న కుర్రవాడు. వాళ్ళిద్దరినీ చూస్తూనే శారద ముఖం విప్పారింది.

“రావోయ్ – రా – విశేషమా – అన్నపూర్ణా, ఈ అమ్మాయి ఎవరో తెలుసా? చలసాని శ్రీనివాసరావు చెల్లెలు. వీడు తమ్ముడు ప్రసాదు. హేమలత కదూ నీ పేరు”.

డాక్టర్ గారికి తామంతా గుర్తున్నందుకు ఆ అక్కాతమ్ముళ్ళు సంతోషపడ్డారు. ఔనండి. నాకిప్పుడు మూడోనెల, పరీక్ష చేయించుకుందామని వచ్చాను”.

“మీ పెళ్ళి గోరాగారు చేశారు కదూ – నే రాలేదులే – సరస్వతి చెప్పింది. మీ అన్నయ్య శ్రీనివాసరావంటే నాకెంతో అభిమానం. ఇప్పటికీ కళ్ళల్లో మెదుల్లున్నట్టే ఉంటాడు. అన్నపూర్ణా – మీ పార్టీనే పొట్టన బెట్టుకుంది. పదమ్మా పరీక్ష చేస్తాను” అంటూ పక్కకు తీసికెళ్ళి కర్టెను వేసి కబుర్లు చెబుతూ పరీక్ష చేసింది.

“శ్రీనివాసరావు ఒకరోజు మీ అందరి గురించీ చెప్పాడు. మీ నాన్నగారు బసవయ్యగారు బాగున్నారా? ఈ ప్రసాదుని చూస్తుంటే ముచ్చటేస్తోందోయ్. బాగా చదివించండి. శ్రీనివాసరావు గుర్తోస్తే మాత్రం బాధగా ఉంటుంది. గర్వంగా ఉంటుంది”,

పరీక్ష పూర్తి చేసి జాగ్రత్తలు చెప్పి మందులు తనే ఇచ్చి “క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకో. నీ పురుడు చులాగ్గా అవుతుంది” అని వాళ్ళను పంపింది గానీ శ్రీనివాసరావుని తల్చుకుంటూ కంటనీరు పెట్టింది.

అన్నపూర్ణ ఏదో చెప్పబోయేంతలో మరో గర్భిణీ స్త్రీ రావటం శారద ఆమెను పరీక్ష చేయటం – ఇలా మధ్యాహ్నం వరకూ గడిపి ఇద్దరూ భోజనానికి ఇంటికి వెళ్ళారు. ఇంటి దగ్గర మళ్ళీ రాజకీయ చర్చలు వేడి వేడిగా సాగాయి. చూస్తుండగానే ఎన్నికలు దగ్గరకొచ్చాయి, కమ్యూనిస్టుల విజయం మీద ఎవరికీ సందేహం లేదు. ఆంధ్ర రాష్ట్రంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడుతుందని అందరూ నమ్మారు,

అందరి నమ్మకాలనూ ఎన్నికలు దెబ్బతీశాయి. కమ్యూనిస్టులకు అదివరకున్న బలం కూడా లేకుండాపోయింది.ఘోరంగా ఓడిపోయారు. కారణాలనేకం. అవి ఫలితాన్ని మార్చలేవు. శారద, మూర్తీ ఆశ్చర్యపడి ఏవేవో విశ్లేషణలు చేశారు. శారదకు ఇప్పడు పార్టీతో ఏ సంబంధమూ లేదు. నాయకులెవరూ ఆమెతో మాట్లాడరు. కోటేశ్వరమ్మ, రాజమ్మ వంటివాళ్ళు ఎప్పడైనా ఎకడైనా కనపడితే ప్రాణం లేచొచ్చినట్లు పలకరిస్తారు. అంతే – ఐనా కమ్యూనిస్టు పార్టీ ఓడిందంటే శారదకు గుండె కలుక్కుమంది. బాధపడుతూ కూర్చునే తీరిక లేకపోవటమే శారదను రక్షించింది. శారద ప్రాక్టీసు విపరీతంగా పెరిగింది. హాస్పిటల్కి వచ్చేవారిని చూసి ఊరుకోదు శారద. సాయంత్రం నాలుగు నుంచీ జట్కాబండిలో బీదవాళ్ళుండే పేటలకు

వెళ్తుంది. ఇంటింటికీ వెళ్ళి యోగక్షేమాలడిగి, ఆరోగ్య సూత్రాలు చెప్పి, అవసరమైన వాళ్ళకు తనవెంట తెచ్చిన మందులిచ్చి వస్తుంది. ఏడింటి నుంచీ మళ్ళీ హాస్పిటల్, పురుళ్ళకు ఒక సమయమంటూ ఉండదు – తిండికి, నిద్రకూ కూడా సమయం లేకుండా పనిచేసే రోజులు చాలానే ఉంటాయి. బెజవాడ ప్రజలకు శారద ప్రత్యక్ష దేవత అనే భావం కలిగిందంటే అందులో ఆశ్చర్యపడటానికేమీ లేదు. ఒకరోజు మధ్యాహ్నం పనంతా పూర్తి చేసుకుని ఇక భోజనానికి ఇంటికి వెళ్దామనుకుంటూ లేస్తుంటే గదిలోకి వచ్చిన ఉమాదేవిని చూసి ఆశ్చర్యపోయింది. ఆరేళ్ళక్రితం తనను ద్రోహిగా చూసిన ఉమాదేవి – ఎవరినీ తనతో మాట్లాడనివ్వకుండా చూసిన ఉమాదేవి,

“రావోయ్ రా – ఒంట్లో ఎలా ఉంది?” నిష్కల్మషంగా నవ్వింది శారద,

“బాగానే ఉంది డాక్టర్ గారు. మీతో పనుండి వచ్చాను” ఉమాదేవి కూడా ఏమీ జరగనట్లే మాట్లాడింది,

“చెప్పు ఏమిటి పని? ఏం కావాలి?

“ఉద్యోగం డాక్టర్ గారు”

“ఉద్యోగమా?

“ఔను డాక్టర్ గారు. ఉద్యోగం చేస్తే కాస్త మా ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.

మీకు చాలా పలుకుబడి ఉంది. ఎవరితోనైనా చెప్పి ఏదైనా ఉద్యోగంలో వేయిస్తే – ఉమాదేవి బిడియంగా తలదించుకుంది.

“దాన్టేముందోయ్ – అలాగే చేద్దాం. నేను ప్రయత్నిస్తాను. ఏదో ఒకటి దొరకపోదు. నువ్వు బెంగపెట్టుకోకు. ఏదీ నాలుక చూపించు. ఎనీమిక్గా ఉన్నావు, రక్తం తక్కువగా ఉంది. మందులిస్తాను. వాటిని వాడుతూ ఆకు కూరలు బాగా తిను.”

జాగ్రత్తలు చెబుతూ మందులిచ్చింది. కుటుంబ యోగక్షేమాలడిగింది.

ఉమాదేవి శారదకు మంచి స్నేహితురాలనుకునేవారు తెలియని వారెవరన్నా అక్కడుంటే,

మరొక వారం రోజుల్లో ఉమాదేవి ఉద్యోగంలో చేరింది. శారద ఆ క్షణంలో సంతోషపడి ఆ సంగతి మర్చిపోయింది,

ఐతే హేమలత నిండు గర్భిణిగా ప్రసవానికి వచ్చినపుడు చెప్పిన మాటలు ఆమెను కాస్త బాధపెట్టకపోలేదు.

فـ

హేమలతని పార్టీ వాళ్ళంతా శారద దగ్గర పురుడు పోసుకోవద్దని బలవంతం చేశారట. ఆపాలని ప్రయత్నించారట.

“నేను మొదట్నించీ ఆమె దగ్గర చూపించుకున్నాను. ఆమె మంచి డాక్టరు. మీ రాజకీయాలతో నన్నిప్పడు వెళ్ళొద్దంటే నేనెలా మానేస్తాను. నేనావిడ దగ్గరకే వెళ్తాను” అని ఎదిరించి వచ్చానని చెబితే శారదకు చాలా చిరాకనిపించింది.

“ఇంత ఎదగని మనుషులు ఏం సాధిస్తారు?” అనిపించింది. హేమలతకు ఆడపిల్ల పుట్టింది.

‘&)

“బంగారు బొమ్మలా ఉందోయ్ నీ కూతురు’ అంటూ నవ్వుతూ, పాపను నవ్వించింది.

“నీకు కొడుకు పుడితే శ్రీనివాసరావని పేరు పెట్టుకున్నావు. పాపకేం పేరు పెడతావు. మంచి పేరు పెట్టు.”

తన దగ్గరకు వచ్చిన ప్రతివారితో స్నేహంగా మాట్లాడి తమ కష్టసుఖాలు పంచుకోటానికి, ఏ అవసరమైనా వస్తే ఆదుకోటానికీ డాక్టర్ శారదాంబ ఉందనే నమ్మకం వాళ్ళలో కలిగిస్తుంది శారద, చాలాసార్లు ఆ నమ్మకాలు నిజమవుతాయి, నా సమస్య ఇదమ్మా అంటూ వచ్చిన వాళ్ళు శారద దగ్గర నుంచి సహాయం పొందకుండా వెళ్ళరు.

వీటన్నిటితో ఇరవై నాలుగు గంటలూ చాలవన్నట్టు పనిచేస్తున్నా శారదకు మనసులో ఏదో వెలితి.

తను విడివిడి వ్యక్తులకు తన చేతిలో ఉన్న సహాయమేదో చేయగలుగుతోంది. కానీ ఎంతమందికి చేయగలుగుతుంది? ఎన్నాళ్ళు చేయగలుగుతుంది? వ్యవస్థలలో, సాగుతున్న ఆచారాలు, విధానాలలో మార్పులు రాకుండా వ్యక్తులుగా చేసే పనులకు వాటికున్న పరిమితులకూ తేడా తెలియనిది కాకామె. ఆ తేడా బాగా తెలిసే రాజకీయాలకు, జన్మనిచ్చి అభివృద్ధి చేసిన వ్యక్తి ఆమె. అందువల్ల రాజకీయ జీవితం లేని లోటు ఆమెను వేధిస్తూనే ఉంది. ఆంధ్ర రాష్ట్రం వచ్చి గుంటూరులో హైకోర్డు ఏర్పడిన తర్వాత మూర్తి కొంత నిలకడగా ప్రాక్టీసు గురించి ఆలోచించటంతో అతని అశాంతి కొంత పోయింది. ఇద్దరూ తమ తమ పనులలో మునిగిపోయారు. నటాషా చదువు, తన స్నేహితులు, బంధువులతో సంతోషంగానే ఉంది. స్వరాజ్యం శలవలకు విశాఖపట్నం నుంచి వచ్చినపుడు మాత్రం ముగ్గురినీ ఒకచోట కలుపుతుంది. పాటలు

పాడుకుంటారు విడివిడిగా – కలిసి, మూర్తీ, శారద షేక్స్పియర్, షా, ఇబ్సన్ నాటకాల నుంచి కొంత భాగమైనా చదివేదాకా ఊరుకోదు స్వరాజ్యం. ఇబ్సన్ “డాత్స్ హౌస్” లో చివరి ఘట్టం భావయుక్తంగా మూర్తి, శారదలు చదువుతుంటే స్వరాజ్యం ఉత్తేజితు రాలయ్యేది. నటాషా స్వరాజ్యం ఎప్పడొస్తుందా అని ఎదురు చూస్తుండేది. స్వరాజ్యం శలవులన్నీ బెజవాడలోనే గడుపుతోందని అన్నపూర్ణ విసుకున్నా లెక్కజేసేది కాదు. తమ్ముడున్నాడు గదమ్మా – వాడు చాలు మిమ్మల్ని సతాయించటానికి, నేను కూడా ఎందుకు” అని హాస్యంలోకి దించేది.

“వాడు మా దగ్గరే ఉండీ, నువ్వు లేకుండానూ మమ్మల్ని సతాయిస్తున్నారే తల్లీ ఏం పిల్లలో మీరు” అని అన్నపూర్ణ కోపం తెచ్చుకుంటుంటే అబ్బయ్య ఆమెను ఓదార్చి శాంతింపజేసేవాడు.

ఎన్నికల రాజకీయాలలో అన్నపూర్ణ వంటి స్త్రీలను ప్రవేశించనిచ్చే ఉద్దేశం కాంగ్రెస్ నాయకులకు లేదు. ఎన్నికల రాజకీయాలు కాక మరో రాజకీయ కార్యక్రమమూ లేదు. ఆంధ్రరాష్ట్రం వచ్చేవరకూ ఏదో ఒక పని కల్పించుకునేది. ఆంధ్రరాష్ట్రం ఏర్పడ్డ తర్వాత శారదా నికేతన్కి వెళ్ళటం, లక్ష్మీబాయమ్మ గారి ఆరోగ్యం చూసుకోవడం, ఖద్దరు అమ్మటం, వినోబా మొదలెడుతున్న సర్వోదయా ఉద్యమం గురించి తెలుసుకోవటం తప్ప పెద్ద పనులేవీ లేవు. అందువల్ల అన్నపూర్ణకు ఇంటి ధ్యాస, కుటుంబం గురించిన ఆలోచన ఎక్కువయ్యాయి. కానీ స్వరాజ్యం ఆమె చేతికి అందటం లేదు.

“స్వరాజ్యానికి పెళ్ళీ చెయ్యొద్దా అని అబ్బయ్య నడిగితే –

“డాక్టర్ గారి నడిగిరా మంచి సంబంధాలున్నాయేమో” అని నవ్వేవాడు.

“ఈ శారద ఇన్నాళ్ళకు నన్ను అశాంతిపాలు చేస్తోంది చూడండి చిత్రం” అనేది అన్నపూర్ణ

నువ్వూ నీ కూతురూ చెరో విధంగా మారారు. దానికి డాక్టర్ గారిని ఆడిపోసుకోకు’ అని మందలించేవాడు అబ్బయ్య. మళ్ళీ శారదను కలిసినపుడు

ఇద్దరూ అతుకుపోయేవారు. రాజకీయ జీవితం లేకుండా బతకటం బాగోలేదని, దాన్నించి బైటపడటం ఎట్లాగనీ చర్చించుకునేవారు, *

బెజవాడ, కృష్ణాజిల్లా నుంచి కవులు, కళాకారులు 1950 నుంచే మద్రాసు వెళ్ళటం మొదలైనా 55 నాటికి బాగా పెరిగింది. జనరల్గా జరిగే సాహిత్య

కార్యక్రమాలు బాగా తగ్గాయి. మొత్తం మీద ఒక ఉత్తేజ రహిత వాతావరణం కమ్ముకుంది. లక్ష్మణరావు మెల్లీ కూడా బెజవాడ నుండి వెళ్ళిపోతున్నారనే వార్త శారదను కలవరపరిచింది. వాళ్ళు మాస్కో వెళ్తున్నారు. సరస్వతి ఒకతే బెజవాడలో శారదలా స్థిర నివాసం – గోరాగారి నాస్తికోద్యమం, ఇతర రాజకీయ కార్యక్రమాలు సాగుతూనే ఉన్నాయి. కమ్యూనిస్టులు కొందరు పార్టీ ఒదిలి కాంగ్రెస్లో చేరారు. వారిలో నారాయణరాజు ఒకడు. అతను శారదను కూడా చేరమని చెప్తూ వస్తున్నాడు.

“ఇదేం కొత్త గాదు గదా డాక్టర్ గారు. ఎన్నిసార్లు గతంలో మనం ప్రచ్ఛన్నంగా కాంగ్రెస్లో పనిచేసి మన తీర్మానాలు అక్కడ నెగ్గించుకోలేదు. మన కార్యక్రమాలకు దేశవ్యాప్త ఆమోదం సంపాదించలేదు. ఆలోచించండి” అంటూ చెప్తుండేవాడు.

1956లో ఆంధ్రరాష్ట్రం కాస్తా ఆంధ్రప్రదేశ్ అవటంతో హైకోర్టు హైదరాబాద్ కు మారుతుందని అందరికీ అర్థమైంది. మూర్తికి ఇంకా త్వరగా అర్థమైంది. హైదరాబాదుకు మారితే మంచిదని అతనికి అనిపించింది. బెజవాడనుంచి తను కదిలేది లేదని శారద తెగేసి చెప్పాక మూర్తి తను హైదరాబాదులో తన న్యాయవాద వృత్తి కొత్తగా మొదలు పెడతానన్నాడు. మద్రాసు నుంచి కుటుంబాన్ని కూడా హైదరాబాదు మార్చాలనుకుంటున్నానంటే శారద అలాగే చెయ్యమంది. దానికి కావలసిన ఏర్పాట్లు చేసింది. మూర్తి కూతురు కల్యాణి అప్పుడప్పుడు మద్రాసునుంచి బెజవాడ వచ్చి శారద ప్రేమను పొంది వెళ్తుండేది. శారద ఆ అమ్మాయినంత ఆదరించటం, స్వంత కూతురిలా ప్రేమించటం చుట్టుపక్కల వాళ్ళకు అర్థమయ్యేది కాదు. ఒకరిద్దరు లోపలి ఆరాటం ఆపుకోలేక ఏదో ఒకటి అనేవారు –

శారద నవ్వి వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకు మనుషులెలా ఉండాలి కుటుంబ సంబంధాలు ఎంత సంకుచితంగా ఉన్నాయి, అవి ఎలా మారాలి అని ఓపికగా చెప్పేది.

వాళ్ళలో కమ్యూనిస్టు పార్టీ వాళ్ళో సానుభూతి పరులో ఉన్నారా వాళ్ళకు మరింత లోతుగా మానవ సంబంధాల గురించి వివరించేది,

కాలం నెమ్మదిగా గడుస్తోంది. సుబ్బమ్మ ఆరోగ్యం మందగించి నీరసంగా ఉంటోంది. ఈ ఒకటి రెండేళ్ళలో జరిగిన సంఘటనలు ఆమెను ఎక్కువగానే కుంగదీశాయి. శారద కూడా నటాషా గురించి, సుబ్బమ్మ గురించి శ్రద్ధ తీసుకుంటోంది. అలాంటి రోజుల్లో శారద మద్రాసు ప్రయాణం తలపెట్టాల్సి వచ్చింది. కోటేశ్వరికి ఆరోగ్యం బొత్తిగా బాగోలేదనీ, శారదను తప్పకుండా రమ్మని పదేపదే

అడుగుతోందని ఫోన్ వచ్చింది. ప్రాక్టీసు బాగా పుంజుకుంటున్న రోజులు. నాలుగు రోజులు ఊళ్ళో లేకపోవటం అంటే అంత తేలిక కాదు. కాన్పు కేసులు ఒదిలి వెళ్ళలేదు. మొదటినుంచీ శారద దగ్గర చూపించుకున్నవాళ్ళు సమయానికి శారద లేకపోతే భరించలేరు. ఎన్నో సర్దుబాట్లు చేసుకుంటే గాని శారదకు మద్రాసు ప్రయాణం కుదరలేదు. అప్పటికి ఫోను వచ్చి నెల దాటింది. కోటేశ్వరి జీవించే ఉందనే నమ్మకంతోనే వెళ్ళింది శారద, శారద నమ్మకం నిజమే గానీ కోటేశ్వరిని చూడగానే రోజులలో ఉంది అని అర్థమైంది శారదకు, తను ఇప్పటికైనా వచ్చి మంచిపని చేశాననుకుంది. కోటేశ్వరి జబ్బు, జరుగుతున్న వైద్యం అన్నీ వివరంగా తెలుసుకుంది. అంతా బాగానే ఉంది గానీ జబ్బు తగ్గేది కాదు.

కోటేశ్వరి పక్కనే కూచుని “విశాలాక్షికి కబురు పంపారా?” అని అడిగింది.

ఎవరూ సమాధానం చెప్పలేదు. “ఏం అమ్మా – విశాలాక్షికి కబురు పంపనా?” అనడిగింది. కోటేశ్వరి ఒద్దన్నట్లు తల అడ్డంగా ఊపింది.

“నన్నూ నా వృత్తినీ, తన పుటకనూ చీదరించుకు పోయింది. ఏంటమ్మా దాంతో నాకు సంబంధం – ఇన్నాళ్ళు లేనిది చచ్చేముందు కావలించుకుంటే ఒస్తుందా? మా బతుకులిట్టా ఎళ్ళమారిపోవాల్సిందే – ఒదు గానీ – నేనప్పడు చెప్పానే నా డబ్బు మంచి పనులకు పంచిపెట్టాలని – ఆ టైమొచ్చింది. డబ్బు నీ చేతికిస్తాను. నువ్వు నాగరత్నమ్మకీ, దుర్గమ్మకూ ఇచ్చిరా. తల్లీ – ఈ పుణ్యం కట్టుకో – నీ చేతులు మీదుగా ఇప్పించాలనే నిన్ను పిలిపించమని వీళ్ళ ప్రాణాలు తీశాను. బంగారు తల్లివి – ఒచ్చావు. ఈ పని ఒక్కటీ చెయ్యమ్మా” అని శారద చేతులు పట్టుకుంది.

“మంచిపని చెయ్యమంటూ ఇంత బతిమాలతావేంటమ్మా ఈ పని నా చేతుల మీదుగా జరగటం నా అదృష్టం. వెంటనే ఆ పని చేస్తాను. దుర్గాబాయి దేముంది. ఆంధ్ర మహిళా సభకు వెళ్ళి ఇచ్చి రావటమే.

నాగరత్నమ్మ గారి దగ్గరకు వెళ్ళటమే కష్టం. దూరం కదా – రైలు టిక్కెట్టు దొరకాలి – •

“ఎందుకు రెండు కార్లున్నాయి. దర్జాగా కార్లో వెళ్ళమ్మా” అని ఎవరినో పిల్చి “కారూ డ్రైవరూ సిద్ధంగా ఉన్నారా” అని అడిగింది.

మరో గంటలో కారులో దుర్గాబాయి దగ్గరకు వెళ్ళి కోటేశ్వరి ఇచ్చిన డబ్బు ఇచ్చి రసీదు తీసుకుంది.

ఆంధ్ర మహిళా సభ అంతా ఒకసారి కలయదిప్పింది దుర్గాబాయి, దుర్గాబాయికున్న

ముందు చూపును ఆ సంస్థ మీద ఆమెకున్న ప్రేమనూ ఆ సంస్థ నడుస్తున్న తీరునూ శారద మనస్ఫూర్తిగా ఆనందించింది.

“ఇదుగో – మీ ఏలూరు నుంచే వచ్చిందీ అమ్మాయి. మహా తెలివైనది. చురుకైనది”, చురుకుదనంతో మెరిసిపోతున్న ఒక యువతిని చూపింది దుర్గ, “మా ఏలూరేంటి?” “నువ్వు పోటీ చేశావుగా – ఓడిపోయావనుకో – మాలతీ శారదాంబ గారు తెలుసా? అప్పటికి నీకు ఓటు లేదేమో ”- అంది దుర్గ.

“శారదాంబ గారిని చూశానండి. ఎన్నికలప్పుడే. నేనప్పడు స్కూల్ ఫైనల్లో ఉ న్నాను. నమస్కారమండి” అంది ఆ యువతి,

“చాలా మంచి అమ్మాయి – వీళ్ళాయన నాగేశ్వరరావు అని రచయిత, జర్నలిస్టు, వీళ్ళిద్దరూ భవిష్యత్తులో చరిత్ర సృష్టిస్తారు” అంది దుర్గ మాలతి భుజం తడుతూ,

“అదంతా దుర్గాబాయమ్మ గారి అభిమానం. కొన్ని విలువలతో బతకగలిగితే చాలనుకుంటున్నాం” అంది మాలతి వినయంగా నవ్వుతూ. ఆ అమ్మాయి భుజం తట్టి ముందుకు నడిచింది శారద.

మర్నాడు తెల్లవారుఝామునే శారద తంజావూరు దగ్గర తిరువాయూరుకి ప్రయాణమైంది. సాయంత్రమవుతుండగా ఆ ఊరు చేరింది. కావేరీ నది ఒడ్డున ఉన్న త్యాగరాజస్వామి ఆలయంలోనే ఆ సమయంలో ఆవిడ ఉంటుందని తెలుసుకుని సరాసరి అక్కడికే వెళ్ళింది. ఆ ఊరు చిన్నదే గాని ముచ్చటగా ఉంది, నదికి దగ్గరగా అంత విశాలమైన స్థలంలో చిన్న ఆలయం నిర్మించటానికి ఒంటిచేత్తో పని చేసిన నాగరత్నమ్మ గారి పట్టుదలకూ, త్యాగరాజస్వామి మీద ఆమెకున్న ప్రేమకూ శారద నిండు మనసుతో చేతులెత్తి నమస్కరించింది.

తనను తాను పరిచయం చేసుకుని వచ్చిన పని చెప్పింది. నాగరత్నమ్మ సంతోషంతో శారదను దీవించింది.

త్యాగరాజస్వామి దగ్గర దీపం వెలిగించి నమస్కారం చేసింది. అక్కడే కూచున్నారు

కాసేపు ఇద్దరూ,

నాగరత్నమ్మ గారు అప్రయత్నంగా గొంతెత్తి రాగాలాపన అందుకున్నారు.

“ఏ పనికో జన్మించి తినని నన్నెంచవలదు, శ్రీరామ! నే నే పనికో జన్మించితినని.

శ్రీపతి! శ్రీరామచంద్ర! చిత్తమునకు తెలియదా? ఏ పనికో జన్మించితినని నన్నెంచవలదు”

ఆవిడ పాడుతుంటే శారద తన అదృష్ణాన్ని నమ్మలేకపోయింది. తన ఒక్కదాని ఎదుట, త్యాగరాజాలయంలో, కావేరీ ఒడ్డున ఆ సంగీత నిధి పాడుతుంటే శారద మనసు పులకించిపోయింది. కళ్ళవెంట నీళ్ళు కారాయి. మనసులో ఆ కీర్తననూ, ఆ వాతావరణాన్ని ఆ కావేరిని గాఢంగా ముద్రించుకుంది.

శారదాంబ వివరాలన్నీ ఒక్కొక్కటే ఓపికగా అడిగి తెలుసుకుంది నాగరత్నమ్మ శారదకు కూడా ఎంతో సంతోషంగా తన గురించి ఆమెకు చెబుతుంటే తనేమేమిటి, ఎవరు ఏం చేస్తోంది? అనే విషయాలు కొత్తగా తను కూడా తెలుసుకుంటు న్నట్లనిపించింది, అదొక వింత అనుభూతి అయింది.

“ఈ రాత్రికి మా ఇంట్లో ఉండి రేపు వెళ్దువు గాని రా” అని అక్కడి నుంచి శారదను ఇంటికి తీసుకెళ్ళింది.

ఇంటికి వెళ్ళాక శారద స్నానం, భోజనం చేసి కూర్చున్న తర్వాత “ఈ పుస్తకం చూశావా” అంటూ “రాధికా స్వాంతనము” అనే కావ్యాన్ని శారద చేతిలో పెట్టింది. ముద్దు పళని రాసిన కావ్యం అది. పుస్తకం తెరిచి ముందుమాట చదివింది.

చాలా అలజడి, ఆనందం, కలవరం –

ముడు పళని వేశ్య కాబట్టి వీరేశలింగం గారు ఆమె రాసిన కావ్యం నిండా పచ్చి శృంగారముందని విమర్శిస్తే – దానికి నాగరత్నమ్మ గారిచ్చిన సమాధానం ఆ ముందుమాటలో ఉంది.

ఆ మాటలలో ఎంతో అర్థముంది. ఆలోచించటానికెంతో ఉంది. అది పక్కన బెడితే నాగరత్నమ్మ ధీరత్వానికి ఆశ్చర్యపోయింది శారద – సాహసవంతురాలని అందరూ చెప్పకునే శారద.

వీరేశలింగం గారి వంటి పండితుడిని, సంస్కర్తను, ప్రజాభిమానం ఎంతగానో పొందినవాడిని అట్లా పది వాక్యాలలో కడిగివేయటానికి ఎంత సాహసం, ఎంత పాండిత్యం కావాలి? నాగరత్నమ్మ గాయకురాలనే ఇన్నాళ్ళూ అనుకుంది శారద, ఆమె మేధస్సు, విద్య, విమర్శనా శక్తి, సాహసం తెలియదు. స్త్రీలను మేధావులుగా గుర్తించరని బాధపడే తనెంత గుర్తిస్తోంది?

కోటేశ్వరి, విశాలాక్షి గుర్తొచ్చారు. కులం, కుల వృత్తులు, వీటి ఆవిర్భావం వీటి

గురించి ఆలోచించటానికి ఎంతో ఉందనిపించింది శారదకు, కులాలు పోవాలనటం తప్ప కుల అస్తిత్వం గురించి ఆలోచించటం లేదు. ఆ దిశగా ఆలోచించటానికెంతో ఉంది. కోటేశ్వరి, విశాలాక్షి నిశ్శబ్ద యుద్ధం చేశారు. నాగరత్నమ్మ, ముత్తు లక్ష్మీరెడ్డి బహిరంగంగానే పని చేశారు. ఐనా ఇంకా తేలాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. జాతి, కులం మామూలు విషయాలు కాదు. కుల నిర్మూలన అంటున్న అంబేద్కర్ రాసిన విషయాల గురించి జరగాల్సిన చర్చ జరగటం లేదు. కమ్యూనిస్టులూ పట్టించుకోవటం లేదు. ఎలా ఎక్కడ నుంచి – ఆర్థికమా, సాంఘికమూ, సంస్కృతా, వృత్తులా – శారద మనసు ఆ రాత్రి అనేక విషయాలతో అల్లకల్లోలమయింది. నిద్ర పట్టలేదు. తెల్లవారి ఎర్రని కళ్ళతో నిద్రలేచి స్నానం చేసి తల దువ్వకుంటుంటే నాగరత్నమ్మ గారి కీర్తన మధురంగా శాంతంగా వినిపించింది.

శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళ నయన

దాంతునికైన వే – దాంతునికైన

శాంతము లేక సౌఖ్యము లేదు

దార సుతులు ధన ధాన్యములుండిన

సారెకు జప తప సంపద గల్గిన

శాంతము లేక సౌఖ్యము లేదు

ఆగమ శాస్త్రములన్నియు జదివిన

బాగుగ సకల హృద్భావము దెలిసిన

శాంతము లేక సౌఖ్యము లేదు

శారద నాగరత్నమ్మ గారి పక్కన జేరి తాళం వేస్తూ తనూ మెల్లిగా గొంతు కలిపింది.

యాగాధికర్మము లన్నియు జేసిన

భాగవతులనుచు బాగుగ బేరైన

శాంతము లేక సౌఖ్యము లేదు

రాజాధిరాజ ! శ్రీ రాఘవ త్యాగ

రాజ వినుత సాధురక్షక తనకుప

శాంతము లేక సౌఖ్యము లేదు –

కీర్తన పూర్తయ్యేసరికి శారద మనసు ప్రశాంత మయింది. ఆమెకు నమస్కారం చేసి బయల్దేరింది.

దారంతా కోటేశ్వరికి నమస్కారాలు చెప్పకుంటూనే ఉంది ఈ అనుభవాన్ని తనకిచ్చినందుకు,

కోటేశ్వరికి రెండు రసీదులూ ఇచ్చి ఆ సాయంత్రమే బెజవాడ రైలెక్కింది.

బెజవాడ చేరిన రెండు రోజులకే కోటేశ్వరి చనిపోయిందని ఫోను వచ్చింది.

తను సరైన సమయానికి వెళ్ళగలిగినందుకు సంతృప్తిగా అనిపించింది. విశాలక్షికి ఫోను చేద్దామా ఒద్దా అని ఆలోచించి చివరికి రాత్రికి ఫోను చేసి చెప్పింది.

“అలాగా – జబ్బేమిటి” పొడిపొడిగా వివరాలడిగి తెలుసుకుంది విశాలాక్షి ఆ ఫోన్ పెట్టేశాక విశాలాక్షి యేడ్చిన యేడుపు శారద ఊహించనిది.

***************************

ఎమ్మెస్సీ పూర్తవుతూనే స్వరాజ్యం విశాఖపట్నం ఎ.వి.యన్ కాలేజీలో ఉద్యోగం సంపాదించింది. ఉద్యోగంలో చేరటానికి ముందు ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళమని అన్నపూర్ణ ఉత్తరాలు తీవ్రంగా రాసీ రాసీ విసుగెత్తిన తర్వాత ముందు బెజవాడ వచ్చి పెద్దమ్మను, పెదనాన్ననూ, నటాషానూ చూసి ఆ తర్వాత గుంటూరు వస్తానని స్వరాజ్యం నుండీ సమాధానం వచ్చింది. అన్నపూర్ణకు ఏదో అనుమానం తోచింది గానీ అది అబ్బయ్యతో కూడా పంచుకోలేదు. “స్వరాజ్యాన్ని నాలుగు రోజుల్లో పంపు తల్లీ అని నిష్టూరంగా శారదకో ఉత్తరం రాసి ఊరుకుంది.

స్వరాజ్యం వస్తుందంటే ఇంట్లో అందరికీ ఆనందమే. స్వరాజ్యానికి ఎవరితో ఉండే పనులు వారితో ఉంటాయి, వచ్చి ఒకరోజు అలసట తీర్చుకున్న తర్వాత శారద ఒంటరిగా ఉన్నపుడు తన మనసులో మాట బైట పెట్టింది.

పెద్దమ్మా నేను పెళ్ళీ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను”

“ఔనా – మరి రాగానే చెప్పలేదేం. మీ అమ్మానాన్నకు చెప్పావా? ఎవరతను? ఏం చేస్తాడు? స్వరాజ్యం అనుకున్నంత ఆనందమూ ప్రకటించలేదు. హడావుడీ చెయ్యలేదు శారద,

“నాకు సీనియర్ యూనివర్సిటీలో, విశాఖ పోర్టు కార్మికుల సంఘంలో పని చేస్తున్నాడు. కమ్యూనిస్టు, మా కులం కాదు. మా పెళ్ళి నువ్వే చెయ్యాలి”.

శారద ముఖంలో ఇప్పడు ఆనందం నిండిపోయింది. స్వరాజ్యాన్ని దగ్గరకు లాక్కుని,

నీ పెళ్ళి నేనెందుకు చేస్తాను. మీ అమ్మ నన్ను బతకనిస్తుందా? మీ అమ్మా నాన్నలను అంత తక్కువగా అంచనా వెయ్యకు, కమ్యూనిస్టనీ, కులాంతరమనీ వాళ్ళేమీ అభ్యంతరం పెట్టరు. ఇవాళ సాయంత్రం మనిద్దరం గుంటూరు వెళ్దాం పద. అసలు నువ్వొకదానివే వెళ్లి చెస్తే మంచిది. నా మీద నా కూతురు నమ్మకం ఉంచిందని మీ అమ్మ సంతోషపడుతుంది, వెళ్ళరాదు?”

స్వరాజ్యం ఆలోచనలో పడింది.

వెళ్తాను. కానీ రేపు సాయంత్రానికి మీరు రావాలి అంది స్వరాజ్యం,

“అలాగేవస్తా ముందు నువ్వు వెళ్ళి మూట విప్పెయ్” అని ప్రేమగా నవ్వింది. స్వరాజ్యాన్ని గుంటూరు పంపి తల్లితో ఈ కబురు చెప్పి ఆ తర్వాత సరస్వతికి, … కబురు పంపి, మర్నాడు అందరూ కలిసి గుంటూరు వెళ్ళాలని మనసులో అనుకుంది. ఇంతలో ఆస్పత్రి నుంచి కబురొచ్చింది అర్జెంటు కేసని. ఇలా వెళ్తున్నానని ఒక కేకైనా వేయకుండా చెప్పలు వేసుకుని వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంటికి వచ్చే సరికి రాత్రి పదయింది. స్వరాజ్యం వెళ్ళిపోయినట్లుంది. లేకపోతే శారద కోసం ఎదురు చూస్తూ వరండాలో కూచుని ఉండేది. శారద తల్లి నిద్రపోతూ ఉంటుందనుకుంటూనే సుబ్బమ్మ గదిలోకి వెళ్ళింది. ఆమె నిద్రపోతోంది. నిద్రలో అమాయకంగా, నవ్వు ముఖంతో ప్రశాంతంగా ఉన్న తల్లిని చూస్తే శారదకు ప్రేమ గుండెల్లో నుంచి పొంగుకువచ్చింది. నెమ్మదిగా ఆమె మీదికి వంగి నుదుటి మీద మెల్లిగా పెదవుల్లాన్చింది. శారద పెదవులు ఒక్క క్షణం ఆ నుదుటి మీదే గట్టిగా అడ్డుకున్నాయి. శారద చటుక్కున లేచింది. ఒకక్షణం భయ సందేహాలతో అలాగే చూసింది. చేయి పట్టుకునే సరికి అర్ధమైపోయింది. తల్లి పక్కనే కూలబడి పోయింది శారద. మనసంతా నిరామయమయింది.

“నాకు చెప్పకుండా ఏ చిన్న పనీ చేసేదానివి కాదు. ఇంత పెద్ద పని చేశావేమి టమ్మా అనుకుంది మనసులో –

కళ్ళవెంట నీళ్ళు కారుతున్నాయి. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. శారదకు ఎవరినీ పిలవాలనిపించలేదు. తల్లి ముఖం చూస్తూ, ఆమె చేతిని తన చేతితో నిమురుతూ అలాగే కూచుండిపోయింది.

తల్లి బోళా మనిషనీ, అంత సమర్థురాలు కాదనీ అందరూ అనుకుంటారు. కానీ చాలా తెలివైనదని తనకొక్కదానికే తెలుసు. సమాజంలో, ఇంట్లో వచ్చే మార్పులను

366 • ఓల్లా

చివరివరకూ అర్థం చేసుకుని ఆనందంగా వాటితో సహజీవనం చేసింది. తన చిన్న చిన్న ఆచార వ్యవహారాలకు కాస్త చోటుంచుకుంది. దేనికీ రొష్టు పడలేదు. కష్టాలు వస్తాయి పోతాయి అనుకుంది. జీవించటంలో అంతకంటే తెలివైన మార్గం ఏముంటుంది? ఎన్నెన్నో జ్ఞాపకాలు శారదకు,

తనమీద తల్లికున్న నమ్మకం ప్రేమ ఎన్ని సందర్భాల్లో అర్థమై గుండె తడయిందో అవన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొస్తున్నాయి.

రేపటి నుంచీ అమ్మ కనిపించదు. తనివిదీరా తల్లి ముఖం చూస్తూ, అడ్డం పడుతున్న కన్నీళ్ళను తుడుచుకుంటూ అక్కడే కూచుంది.

రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో రోజూ సుబ్బమ్మను దొడ్లోకి తీసుకుపోయే ఆయా వచ్చి శారద నక్కడ చూసి

“అమ్మా – ఏమైంది అంది కంగారుగా.

“అమ్మ వెళ్ళిపోయింది దుర్గా అంటూ లేచి ఆ కబురు చెప్పవలసిన వాళ్ళకు చెప్పే పనిలో పడింది.

మర్నాడు ఉదయం నుంచీ ఎందరో వచ్చి సుబ్బమ్మను చూసి, నమస్కరించి శారదను పలకరించి వెళ్తున్నారు. సాయంత్రం వరకూ బంధువులు, స్నేహితులు వస్తూనే ఉన్నారు. కానీ ఆపదలో, అవసరంలో వేళ కాని వేళల్లో వచ్చి సుబ్బమ్మ చేతి కింద నడిచే వంటగదిలో నిప్ప ఆరకుండా చేసిన ఎందరో రాలేదు. శారద కొందరు వస్తారని ఎదురు చూసింది, యువకులుగా ఉన్నప్పటి నుంచీ అమ్మా అంటూ పిల్చి ఆమె ఆప్యాయతను పంచుకున్న కొందరు చివరిసారిగా ఆమెను చూడటానికి వస్తారని చూసింది. రాలేదు. అన్నపూర్ణ, సరస్వతి శారదను ఒదలకుండా కూర్చున్నారు, ఆ తల్లీ కూతుళ్ళ అనుబంధం వీరిద్దరికి బాగా తెలుసు. ఒక వైద్యురాలిగా మృత్యువుని అర్థం చేసుకోగలిగినా కూతురిగా ఆ వాస్తవాన్ని మింగటం శారదకైనా కష్టమేనని చాలామంది అనుకున్నారు.

ఆనాటి సూర్యాస్తమయంలో కలిసిపోయింది సుబ్బమ్మ,

శారద మనసింకా పచ్చిగా ఉన్నా స్వరాజ్యం పెళ్ళీ గురించి అన్నపూర్ణతో మాట్లాడాలని తల్లిపోయిన వారం రోజుల్లోనే గుంటూరు వెళ్ళింది.

అన్నపూర్ణకు శారద వచ్చిన పని తెలుసు. కానీ తెలియనట్లే వేరే సంగతులు చెప్తూ పోయింది,

“అవన్నీ ఆపవోయ్ – స్వరాజ్యం పెళ్ళి సంగతేమిటి? మీరేమనుకుంటున్నారు? అన్నపూర్ణ ముఖం వివర్ణమైంది,

“నాకిష్టం లేదు శారదా, అబ్బయ్య అమ్మాయి ఇష్టం. నాదేం లేదంటున్నాడు. నాకు కులం గురించి పట్టింపు లేదు. కానీ అలవాట్లలో, ఆచారాల్లో తేడాల వల్ల తర్వాత్తర్వాత సమస్యలొస్తాయి అని భయంగా ఉంది”

ఏ పెళ్ళీలోనైనా సమస్యలొస్తాయి. ఒస్తే ఎదిరిస్తాం గానీ సమస్యలొస్తాయని చేతులు ముడుచుకు కూచుంటామా?”

‘నాకెలా చెప్పాలో అర్థం కావటం లేదు – హరిజనుల బాగు కోసం నేనూ పని చేశా. కానీ ఒక హరిజనుడు అల్లడవుతాడంటే ఒప్పకోలేకపోతున్నా

“వాళ్ళూ నువ్వూ వేరు వేరనుకుని – వాళ్ళు నీకంటే తక్కువని, వాళ్ళను ఉద్ధరించటం మంచిపని, వాళ్ళకు మేలు చేస్తున్నాననీ నువ్వు హరిజనోద్యమంలో పని చేశావు, వాళ్ళను నీతో సమానమని అనుకోలేదన్న మాట – అదేంటోయ్ – నువ్విలా ఉండటం ఏమీ బాగోలేదోయ్ – అంది శారద.

అన్నపూర్ణ తలదించుకు కూచుంది.

స్వరాజ్యం తల్లి గురించి అవమానపడుతూ ముఖం ఎర్రగా చేసుకుంది. అబ్బయ్య సమస్య తనది కానట్లు ఏదో పుస్తకం తిరగేస్తూ కూచున్నాడు, “సరస్వతి కూతురు మనోరమ పెళ్ళీ గుర్తులేదా? గాంధీ గారే చేయాలనుకున్నారు. ఆయన మరణించాక గాని అది కుదరలేదు. గాంధీ ఆశ్రమంలో నెహ్రూ చేతుల మీద జరిగింది. వాళ్ళిద్దరూ ఎంత బాగుంటారు. నాకు తెలిసి వాళ్ళకే సమస్యలూ లేవు. ఇప్పడు లవణానికి జాషువా గారమ్మాయితో పెళ్ళీ ఎంత ప్రేమగా సంతోషంగా ఉన్నారు వాళ్ళు, అసలు – ఎప్పట్నించి నువ్వు గాంధీగారి శిష్యురాలివి – నువ్వనాల్సిన మాట లేనా ఇవి?

“మనోరమ సంజీవరావుల పెళ్ళికి గాంధీగారు ఎంత ఆలోచించారు. వాళ్ళిద్దరూ గాంధీ ఆశ్రమంలో ఏడాదిపైగా కలిసి పనిచేసి ఒకర్నొకరు అర్ధం చేసుకున్నారు, హేమలత జాషువాగారి సంస్కారం పంచుకుని పెరిగిన పిల్ల –

“అమ్మా – నేనూ సుందర్రావూ రెండేళ్ళ నుంచీ ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. సుందర్రావు నీకంటే చాలా సంస్కారవంతుడు.” ఆవేశంగా అంది స్వరాజ్యం,

“ఔను. నేనే సంస్కారం లేనిదాన్ని హీనురాల్ని అంటూ ఏడుపు మొదలెట్టింది అన్నపూర్ణ

“ఈ ఇంట్లో జరగవలసిన మాటలు కావివి. అన్నపూర్ణా – నాకసలు అర్థం కావటం లేదోయ్ – ఆ అబ్బాయి బాగా చదువుకున్నవాడు. ఆ చదువుతో సంపాదించుకుని తానొకడే ఎదిగిపోవాలనుకోకుండా అందరి బాగు కోసం పని చేస్తున్నాడు, కులం కారణంగా నువ్వు – అన్నపూర్ణవి – కూతురి ప్రేమను ఒప్పకోవటోయ్ – ”

“ఆదర్శాల కోసం పెళ్ళీళ్ళు చేసుకోకూడదు” కఠినంగా అంది అన్నపూర్ణ

పెద్దమ్మా – నేను ఆదర్శాల కోసం చేసుకోవటం లేదు. సుందరం మా దరిద్రపు కమ్మ కులంలో పుట్టినా, బ్రాహ్మణ కులంలో పుట్టినా అతని సంస్కారం ఇదే అయితే నేనతన్ని ప్రేమించేదాన్ని – అతను హరిజనుడనీ, మా పెళ్ళి ఆదర్శమనీ నేను అనుకోవటం లేదు. అమ్మని అది నమ్మమనండి. స్వరాజ్యం తీవ్రతకు అందరూ భయపడ్డారు.

పెద్దమ్మా – ఈ కాంగ్రెస్ హరిజనోద్ధరణ ఒట్టి బూటకం, అందులో ఈ కమ్మ, రెడ్డి కాంగ్రెస్ వాళ్ళది మరీ బూటకం. నేను అమ్మమ్మ గారి ఊరెళ్ళినపుడు చూశానుగా – వీళ్ళు కుర్చీలలో మంచాల మీదా దర్జాగా కూర్చుంటారు. హరిజనులొచ్చి కింద కూచోవాలి. ఇళ్ళల్లోకి రానివ్వరు. మళ్ళీ బ్రాహ్మలు తమని వంటిళ్ళలోకి రానివ్వరని ఏడుస్తారు. వీళ్ళేమో అంటరానితనం పాటిస్తారు. మీరు కమ్యూనిస్టులు గాబట్టి మీరట్లా ఉండరేమో – కమ్మ బ్రాహ్మలు పెద్దమ్మా ఈ కాంగ్రెస్ వాళ్ళంతా –

అందరూ కాసేపు నిశ్శబ్దమై పోయారు. స్వరాజ్యం మాటల్లో నిజం అందరికీ తెలుసు,

శారద అంటరానితనం పాటించకూడదనే ప్రత్యేకమైన స్పృహతో ఉంటుంది. మహిళా సంఘంలో పదే పదే చెప్పింది. ఆచరింపచేసింది. ఐనా కొందరు కులాన్ని అధిగమించలేదనీ, స్వరాజ్యం చెప్పినవి కమ్యూనిస్టుల ఇళ్ళల్లో కూడా జరుగుతాయని శారదకు తెలుసు. కానీ అన్నపూర్ణ ఇంత సంకుచితంగా ఆలోచిస్తుందని అసలు అనుకోలేదు.

“అన్నపూర్ణా – అంబేద్కర్ రైటనిపిస్తోంది. కుల నిర్మూలనే జరగవలసిన మొదటి పని – తర్వాతే మిగిలిన విషయాలు, కులాంతర వివాహాల వల్లనే కులం లేకుండా

పోతుందని ఆయన చెప్పిన మాటల్లో ఎంత నిజం ఉందో నాకివాళ అర్థమవుతోంది. నీకే ఇంత వ్యతిరేకత ఉంటే ఇక మామూలు వాళ్ళ సంగతేంటి?”

నాకిప్పుడు దేశోద్ధరణ గురించి ఉపన్యాసం ఇవ్వకు శారదా – నా కూతురి భవిష్యత్తు నాకు ముఖ్యం.”

“నీ కూతురి భవిష్యత్తు, దేశ భవిష్యత్తు వేరని ఎందుకనుకుంటావు?” అబ్బయ్య కలగజేసుకున్నాడు.

“ఇది మాటలతో, వాదనలతో పరిష్కారమయ్యే సమస్య కాదు డాక్టర్ గారు. ఇవన్నీ అనవసరం, స్వరాజ్యం మేజరు, స్వతంత్రురాలు, అది వెళ్ళి దానిష్టం వచ్చిన పెళ్ళీ చేసుకోవచ్చు.

“థాంక్స్ నాన్నా తేల్చి చెప్పావు, పెద్దమ్మా – నేను నీతో వస్తాను ఉండు” అని బట్టలు మార్చుకుని వచ్చింది.

అన్నపూర్ణ మాట్లాడకుండా కూర్చుంది, వారించలేదు.

పద పెద్దమ్మా” అని స్వరాజ్యం తొందర చేస్తోంది.

“ఏంటోయ్ ఇది – ఈ పిచ్చి, మూర్ఖత్వం ఏంటి నీకు? స్వరాజ్యాన్ని దగ్గరకు తీసుకో – మీ ఇద్దరూ ఆనందంగా కూతురి పెళ్ళి చెయ్యండి. ఆనందంగా జరగాల్సిన పనిని అశాంతిమయం చేసుకోకండి”,

ఎంత చెప్పినా అన్నపూర్ణ కరగలేదు.

చివరికి కట్టుబట్టలతో స్వరాజ్యం శారద వెంట ఆమె ఇంటికి వచ్చింది. శారద ఎన్నో కులాంతర వివాహాలు, దండల పెళ్ళిళ్ళు తన ఇంట్లో చేయించింది. కానీ అన్నపూర్ణ కూతురి పెళ్ళీ ఇట్లా తన ఇంట్లో జరుగుతుందని అనుకోలేదు. అన్నపూర్ణ, అబ్బయ్య, శారద కుటుంబంలో వారేనని అందరూ అనుకుంటారు. వాళ్ళిద్దరూ రాకుండా వాళ్ళ కూతురి పెళ్ళి శారద ఇంట్లో జరగటం అందరికీ ఆశ్చర్యమే. తల్లి రాని లోటు తెలియకుండా స్వరాజ్యానికి తనే తల్లయింది శారద, సరస్వతి, గోరా, మెల్లీ, లక్ష్మణరావుల సహాయం ఉంది. సుందర్రావు కుటుంబం కూడా శారద ఇంట్లోనే దిగారు, సుందర్రావు తల్లిదండ్రులు సంకోచంతో దూరదూరంగా ఉంటే శారద వాళ్ళకు బెజవాడంతా తిప్పి చూపి, అందరి ఇళ్ళకూ తీసికెళ్ళి, వాళ్ళందరి వద్దా వీళ్ళను గౌరవించి మొత్తానికి వాళ్ళ బెరుకు పోగొట్టింది.

సుందర్రావు బంధువులు పాతికమంది దాకా వచ్చారు. మరో పాతికమంది బెజవాడ మిత్రులు. గోరా గారి అధ్యక్షతన, శారద నిర్వహణలో ఆనందంగా జరిగిపోయింది.

పెళ్ళయిన మర్నాడే స్వరాజ్యం, సుందర్రావులు విశాఖపట్నం వెళ్ళిపోయారు. అన్నపూర్ణ గురించి ఆలోచిస్తూంటే శారదకు కులం ఎంత పెద్ద సమస్యో అర్థమయింది. “ఇన్నాళ్ళూ ఆడవాళ్ళే అన్నిటిలో అధమస్థానంలో ఉన్నారనుకున్నాను. మాల మూదిగలు, వృత్తి కులాల వాళ్ళు, అక్కడ స్త్రీలూ — అసలు జరగవలసిన పనంతా అక్కడే ఉంది. కులాలు లేనట్టు నటించటమే స్వతంత్రోద్యమం, కమ్యూనిస్టు ఉద్యమాలూ నేర్పాయా? అంబేద్కర్ని మళ్ళీ చదవాలి” అనుకుంది శారద.

************

విశాఖపట్నం వెళ్ళి స్వరాజ్యాన్ని చూడాలి అనుకుంటూనే అయిదు నెలలు గడిచి పోయాయి. వెళ్ళి వాళ్ళకు కావలసిన సామాను కొనిచ్చి రావాలనేది శారద ఆరాటం. శారద రేపా మాపా అని ఆలోచిస్తుండగానే స్వరాజ్యం వచ్చేసింది. ఉత్తరమన్నా రాయకుండా దిగిన ఆ పిల్లను చూస్తే శారదకు విషయం అర్థమయింది. ఐనా పైకేమీ మాట్లాడకుండా

“ఎప్పటికప్పుడు విశాఖపట్నం రావాలనుకుంటూనే ఆలస్యమైంది” అంది.

స్వరాజ్యం నవ్వి పర్లేదులే పెద్దమ్మా మేం బాగానే ఉన్నాం.

ఏ అవసరం వచ్చినా నీకు ఉంతరం రాయనా?” అంది శారద హాస్పిటల్కి బయలు దేరుతుంటే నేనూ వస్తాను పెద్దమ్మా అంది తప్పు

చేసినట్లు,

“ఇద్దరూ హాస్పిటల్కి వెళ్ళారు. శారద ఇన్ పేషెంట్స్ని చూసి వస్తానని వెళ్ళింది.

ఓ గంటలో కన్సల్టింగ్ రూంకి వచ్చేసరికి స్వరాజ్యం దిగులుగా కూచుని ఉంది.

“ఎన్నో నెల? శారద కుర్చీలో కూచుంటూ అడిగింది.

“మూడో నెల అనుకుంటా”

“అనుకుంటా బుద్ధిలేదూ? ఎమ్.ఎస్.సి. చదివావు. కాస్త జాగ్రత్త పడలేక పోయావా??

“ఎబార్షన్ కుదరదా పెద్దమ్మా

 

మీ మాటలు

*