ఖమ్మం సాహిత్య చరిత్ర రచనకి ఇది శ్రీకారం!

 

kaifiyath

సాంస్కృతిక  పునర్వికాసానికి ఖమ్మం జిల్లా తోడ్పాటు చిరస్మరణీయమైనది. ఆధునిక కాలంలో తెలంగాణాలో  సాంస్కృతిక పునరుజ్జీవనానికి పునాది హైదరాబాద్‌లో 1901లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం స్థాపనతో పడింది.. ఈ భాషానిలయం స్థాపనంలో తెంగాణలోని ప్రముఖమైన సంస్థానాధీశులు వారికి తోడుగా కొమర్రాజు క్ష్మణరావు, రావిచెట్టు రంగారావు, నాయని వెంకట రంగారావు, మైలవరపు నరసింహారావు, ఆదిపూడి సోమనాథరావు తదితరులు కీలక పాత్ర పోషించారు.

ఈ ప్రముఖ సంస్థానాధీశుల్లో నేటి ఖమ్మం జిల్లాకు చెందిన పాల్వంచ సంస్థానాధీశులు రాజా పార్థసారథి అప్పారావు ఆర్థికంగా ఆదుకోవడమే గాకుండా లైబ్రరీ ప్రారంభ సమావేశంలో ప్రసంగించారు కూడా. శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానియానికి జీవితాంతం రాజపోషకునిగా ఉన్నారు. ఈయనకు ‘సాహిత్య విశారద’ అనే బిరుదు కూడా ఉంది. పాల్వంచలో ‘ఆంధ్రవాఙ్మయ సేవాసమితి’ని స్థాపించి దాని తరపున ప్రత్యేక సాహిత్య సంచికను ‘కిన్నెర’ పేరిట ప్రచురించారు. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి వ్యాసభారతాన్ని యథాతథంగా అనువదించి అచ్చేసేందుకు అనేకమంది పోషకుల్ని ఆర్థిక సహాయం అర్థించాడు. అందరూ నిరాకరించారు. చివరికి పార్థసారథి అప్పారావు చేసిన సహాయముతో దాన్ని ఆయన ముద్రించాడు. అంతేగాదు శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాష నిలయం స్థాపన కాంలో 11 ఏళ్ళ బాలుడిగా సమావేశానికి వచ్చిన వారందరికీ తాంబూలాలు అందించి అనంతర కాలంలో తెలుగుజాతి గర్వించే పరిశోధనలను, రచనలు చేసిన ఆదిరాజు వీరభద్రరావు కూడా ఖమ్మం జిల్లా (మధిర తాూకా, దెందుకూరు) వాడే! అంటే తెంగాణ పునర్వికాసానికి ఖమ్మం తోడ్పాటు ఏమిటో అర్థమౌతుంది. చందాల కేశవదాసు, మాడపాటి తిరుమలరావు, మాడపాటి రామచంద్రరావు, జమలాపురం వెంకటేశ్వరరావు, సోమరాజు రామానుజరావు, సోమరాజు ఇందుమతీ దేవి, జమలాపురం కేశవరావు, పండిట్‌ రుద్రదేవ్‌, హీరాలాల్‌ మోరియా, సర్వదేవభట్ల నరసింహమూర్తి, సర్వదేవభట్ల రామనాథం, ఊటుకూరి రంగారావు, కౌముది, సుగ్గు అక్షయలింగం గుప్త, ఎ. పూర్ణానంద గుప్త, గెల్లా కేశవరావు, ఉత్ప సత్యనారాయణాచార్య, ఇటికాల నీలకంఠరావు, దాశరథి సోదరులు, కోదాటి నారాయణరావు, బొమ్మకంటి సత్యనారాయణ, చేకూరి కాశయ్య, శీలం సిద్ధారెడ్డి, జలగం వెంగళరావు, డి.రామలింగం, బెల్లంకొండ రంగాచార్యులు, బెల్లంకొండ చంద్రమౌళి శాస్త్రి, బెల్లంకొండ లక్ష్మణసూరి, పబ్బరాజు గోపాలరావు, పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు, పాలడుగు వెంకటేశ్వరరావు, జాతశ్రీ, విశిష్ట పరిశోధకులు దూపాటి వేంకటరమణాచార్యుల మిత్రులు అన్నపరెడ్డి పల్లికి చెందిన జమీందారు కాళ్లూరి వెంకటరామారావు ఇలా ఎందరో మహానుభావు తెంగాణ రాజకీయ, సాంస్కృతిక, సాహిత్య రంగాల్లో తమదైన ప్రత్యేకమైన ముద్రను వేసిండ్రు.

సాయుధ పోరాట కాలంలో పర్చా దుర్గాప్రసాదరావు, పి.వెంకటేశ్వరరావు, వట్టికొండ రామకోటయ్య, అడ్లూరి అయోధ్యరామకవి(?), తాళ్ళూరి రామానుజస్వామి, కవిరాజమూర్తి, హీరాలాల్‌ మోరియా, డి.రామలింగం, విరివిగా రచనలు చేసిండ్రు. ఇందులో కమ్యూనిస్టులున్నారు. కాంగ్రెస్‌ సానుభూతి పరులూ ఉన్నారు. తమ భావాజాలాకు అనుగుణంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడానికి కృషి చేసిండ్రు.

మరుగున పడ్డ ఎన్నో తెలంగాణ సాహిత్య సాంస్కృతిక, చారిత్రక అంశాలను మలుగులోకి తెచ్చి ప్రాచుర్యం కల్పించిన పరిశోధకులు శేషాద్రి రమణకవులు. ఇంకా వెలుగులోకి రావాల్సిన విషయాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ పరిశోధనంతా చేసింది రమణకవులు పేరిట దూపాటి వేంకట రమణాచార్యులు. ఖమ్మం జిల్లాకు ఈయనకు విడదీయరాని బంధం ఉంది. దూపాటి రెండో సోదరి భద్రాచలం దగ్గరలోని అన్నపరెడ్డిపల్లిలో నివాసం ఉండేది. అందువల్ల తరచూ అక్కడికి వస్తూ ఉండేవాడు. ఈయన మొట్టమొదట తెంగాణాలో పరిశోధన మొదలు బెట్టింది ఖమ్మం జిల్లా నుంచే! ఎర్రుపాలెం కరణం, భాషాప్రియులైన జమలాపురం వెంకటకిషన్‌రావు ఇంట్లో ఆయన తోడ్పాటుతో పరిశోధక ప్రయాణం సాగించాడు. ఈ ప్రయాణంలో కొన్ని వందల అముద్రిత తాళపత్రాలను సేకరించారు. ఇదే గ్రామానికి చెందిన అడ్వకేటు మాడపాటి తిరుమలరావు కూడా అండగా నిలిచాడు. అలా తెలంగాణ పరిశోధనకు చేయూత లభించింది. అంతకముందు 1922లో ఆదిరాజు వీరభద్రరావు హైదరాబాద్‌లో ఆంధ్ర పరిశోధక మండలిని ఏర్పాటు చేసిండు.

ఈ పరిశోధక మండలి 1923లో కొమర్రాజు క్ష్మణరావు చనిపోవడంతో అది ‘కొమర్రాజు లక్ష్మణరావు ఆంధ్ర పరిశోధక మండలి’గా మారింది. ఈ మండలి తరపున ‘తెంగాణ శాసనాలు’ ప్రచురించడంలోనూ, ఆ తర్వాత ఆధునిక తెంగాణ ఆత్మగౌరవాన్ని సాహిత్య రంగంలో సగౌరవంగా నిబెట్టిన ‘గోలకొండ కవుల సంచిక’ మలువడడంలోనూ ఆదిరాజు వీరభద్రరావు విశేషమైన కృషి చేసిండు. ఇది ఖమ్మం జిల్లాకే గౌరవ కారణం. ఈ గోలకొండ కవు సంచికలో ఖమ్మం జిల్లాకు చెందిన దాదాపు 30 మంది కవున్నారు. ఇందులో జ్ఞానమాంబ, సోమరాజు ఇందుమతీదేవి రచనలు కూడా చోటు చేసుకున్నాయి. వీరిద్దరు కూడా కవిత్వ పుస్తకాలను అచ్చేసిండ్రు. ఆంధ్రప్రదేశ్‌ అవతరణకు ముందే అర్వపల్లి సత్యవతీదేవి, పబ్బరాజు ఇందిరాదేవి లాంటి కథకులు ఈ ప్రాంతం నుంచి రాసిండ్రు. సోమరాజు ఇందుమతీదేవి సోదరుడు సోమరాజు రామానుజరావు తెలుగు సాహిత్యంలో చిరస్థాయిలో నిలిచిపోయే రంగూన్‌ రౌడీ, స్వరాజ్య రథం లాంటి నాటకాలు రాసిండు. అనేక నవలలు  వెలువరించిండు. ఇందులో స్వరాజ్య రథం నాటకాన్ని బ్రిటీష్‌ ప్రభుత్వం నిషేధించింది. ఇందుమతీదేవి ఖండిక సంపుటి విజయవాడ నుంచి వెలువడింది. సరిహద్దు ప్రాంతం కావడంతోటి ఆంధ్రప్రాంతంతో ఇక్కడి రచయితలకు సన్నిహిత సంబంధాలుండేవి. వేలూరి శివరామ శాస్త్రితో పాటు అనేకమంది ఆంధ్రప్రాంత కవి పండితులు ఈ జిల్లాతో మొదటి నుంచి పెనవేసుకుపోయిండ్రు. తెలుగుతో పాటు ఉర్దూ కూడా ఈ జిల్లా రచయితలను ప్రభావితం చేసింది. గ్రంథాలయోద్యమంలో ఇక్కడి విజ్ఞాన నికేతనం, కుకునూరు, పాల్వంచ, ఎఱ్ఱుపాలెం, రేమిడిచర్ల, మధిర తదితర గ్రంథాయాలు కీలక పాత్ర పోషించాయి. తెంగాణలోనే మొట్టమొదటి సారిగా సింగరేణిలో అఖిలాంధ్ర గ్రంథాలయ సభలు జరిగాయి. ఈ సభకు హైదరాబాద్‌ నుంచి సురవరం ప్రతాపరెడ్డితో పాటు చాలామంది హాజరయ్యారు. ఇది స్థానికుల్లో చాలా చైతన్యాన్ని నింపింది.

khammam kathalu

ఖమ్మం జిల్లా రచయిత మీద ఉర్దూ, ఇంగ్లీషుతో బాటుగా పక్కనున్న ఆంధ్రప్రాంతం వారి ప్రభావం కూడా ఉండింది. హీరాలాల్‌ మోరియా, కవిరాజమూర్తి (సర్వదేవభట్ల నరసింహమూర్తి)పై ప్రేమ్‌చంద్‌, కిషన్‌చందర్‌ లాంటి ఉర్దూ కవుల, కథకుల ప్రభావం ఎక్కువగా ఉండింది. ఖమ్మం జిల్లా నుంచి మొదట ఆధునికత రీతిలో కథలు రాసింది మాడపాటి రామచంద్రరావు. ‘తిమిర ఝంజుమ్’ అనే కవితా సంకలనాన్ని ప్రచురించిన ‘మంజు’దావూద్‌ అలీ కాశ్మీరీ భాషలో కూడా రచను చేసిండు. ఉర్దూ కవి సికిందర్‌ మొహసిన్‌ గురజాడ ‘దేశమును ప్రేమించుమన్న’ గేయాన్ని ఉర్దూ పాఠకుకులకు అందించిండు. మోరియా, కవిరాజ మూర్తి ఇద్దరూ ఉర్దూలో కవిత్వం, కథలు, నవలలు రాసిండ్రు. వీరు ఉర్దూలో రాసినవి ఊటుకూరు రంగారావు, ఇటికాల నీకంఠరావు, కొలిపాక మదుసూదనరావు, గిడుతూరి సూర్యం లాంటి వాండ్లు తెలుగులోకి తర్జుమా చేసిండ్రు. అలాగే డి.రామలింగం లాంటి వారు తెలుగుసాహిత్యాన్ని ‘ఇండియన్‌ లిటరేచర్‌’ సంచిక ద్వారా 60వ దశకం నుంచి ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేసిండ్రు. ఇప్పటికీ ఇంగ్లీషు మాత్రమే తెలిసిన వారికి తెలుగు సాహిత్యం గురించి తెలుసుకోవాలంటే ఈయన రాసిన వ్యాసాలే ప్రధాన ఆధారం. ఖమ్మం కథకుల్లో ఎక్కువ మంది, ఆనాటి మాడపాటి రామచంద్రుడు మొదలు షంషాద్‌ బేగం వరకూ  తాము పుట్టినూరు నుంచి వివిధ ప్రాంతాలకు, దేశాలకు ‘వలస’ లేదా జీవనోపాధి కోసం ప్రయాణం చేసినవారే కావడం విశేషం. మొబిలిటీ (చలనశీలత) కథకుడికి కొత్త కోణాల్ని అందిస్తుంది. కొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తుంది. కొత్త ప్రదేశాలు, కొత్త వ్యక్తులతో పరిచయం, కొత్త వాతావరణం అన్నీ కగలిపి తాము అనుభవిస్తున్న, అనుభవించిన జీవితాలను పోల్చి చూసుకొని కథలుగా రికార్డు చేసిండ్రు. మెరుగైన సమాజం కోసం చేసిన సాహితీ కృషి ఇది.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రెండు రాష్ట్రాల్లోనూ తెలుగులో రాసే ముస్లిం రచయితలు ఎక్కువగా ఉన్న జిల్లా కూడా ఖమ్మమే అని చెప్పొచ్చు. షంషుద్దీన్‌ (కౌముది), దావూద్‌ అలీ, సికిందర్‌ మొహసిన్‌, ఎం.ఎ.రెహమాన్‌, దిలావర్‌, సయ్యద్‌ షఫీ, అఫ్సర్‌, షేక్‌ రఫీ, హనీఫ్‌, షుకూర్‌, షాజహానా, ఇక్బాల్‌ చంద్‌, ఖాజా, అక్బర్‌, షంషాద్‌ ఇట్లా అనేకమంది కవులు, రచయితలు తెలుగులో రాసిండ్రు. ఇంకా రాస్తున్నరు. అయితే వీళ్ళందరూ స్వాతంత్య్రానంతర తరం(?) కావడం, అప్పటికి ఉర్దూ మాధ్యమంలో బోధించే స్కూల్స్  ఖమ్మం ప్రాంతంలో లేకపోవడం, చుట్టూ తెలుగు వాతావరణమే ఉండడంతో అనివార్యంగా వీళ్ళు తెలుగులో రాయాల్సి వచ్చింది. దాని వల్ల ఉర్దూ సాహిత్యం నిఖార్సయిన తెలంగాణ జీవితాన్ని రికార్డు చేసే అవకాశం కోల్పోయింది.         ఈ ద్వివిదీ భావం చరిత్రలో కూడా కనబడుతుంది. దాశరథీ శతకముతో పాటు తన కీర్తనతో ‘ఎవడబ్బా సొమ్మాని కుకుతు వున్నావ్‌’ అని రాముడినే ప్రశ్నించిన కంచర్ల గోపన్న (రామదాసు) తానీషా కాంలో ఖైదు అనుభవిస్తాడు. అలాగే భద్రాచం ప్రాంతం వాడైన భల్లా పేరయకవి తన ‘భద్రగిరి శతకము’లో ముస్లిం రాజుల్ని నిందిస్తాడు.

‘‘అచ్ఛిద్ర కర్ణుయాజ్ఞ నుండగలేక

తురకల కెదురుగా పరుగ లేక

చేరి ఖానులకు తాజీములీయగ లేక

మును నమాజు ధ్వనుల్‌ వినుగలేక

‘‘కాడు చేసిరి కదా కళ్యాణ మండపా

గార వాహన గృహాంగనమలెల్ల

‘‘సంస్క తాంధ్రోక్తుల సారంఋడివోయె

నపసవ్య భాషల నమరె జగము

సత్రశాలంగణల్‌ చలువ పందిరులు

బబ్బరట ఖానుల చప్పరముయ్యె

‘‘పారిపోవగ నైన పట్టెలె నాకక

విడుతరే వైష్ణవ వితతి నెల్ల’’ అని రాసిండు.

jwalitha

జ్వలిత

అయితే ఇదే జిల్లాలో ఆరో నిజామ్‌ మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ చనిపోయిన తర్వాత ఆయన పేరిట 1911 జూలై 16వ తేదీనాడు ఎఱ్ఱుపాలెంలో జమలాపురం రామారావు, వెంకటకిషన్‌రావు, మాడపాటి తిరుమలరావు తదితయి పూనుకొని ‘మహబూబియా గ్రంథాలయా’న్ని ఏర్పాటు చేసిండ్రు. అలాగే మధిరలో మిరియాల నారాయణగుప్త గారు ‘ఉస్మానియా ఆంధ్ర భాషానియం’ పేరిట గ్రంథాయాన్ని ఏర్పాటు చేసిండు. ఇవి రెండు చాలా కాలం పాటు ప్రజలకు ఉచిత పుస్తక, పత్రికా పఠన సౌలభ్యాన్ని కలిగించాయి. ముస్లిం రాజు పేరిట కొన్ని దశాబ్దాల పాటు సేవ చేసిన ఈ గ్రంథాయాలు ఇప్పుడు నామరూపాలు లేకుండా పోయాయి. విదేశాల్లో కొన్ని వందల యేండ్ల క్రింతం స్థాపించబడ్డ లైబ్రరీలు ఆధునిక కాంలో కూడా నిరంతరంగా నడుస్తూ ఉన్నాయి. మన దగ్గర మాత్రం లుప్తమై పోతున్నాయి. రాజుని రాజుగా కాకుండా హిందూత్వ దృక్కోణం నుంచి చూసినప్పుడే సమస్య లెదురవుతున్నాయి. ఇప్పుడు ఉస్మాన్‌ అలీఖాన్‌ అంటే దుర్మార్గుడు, రాక్షసుడు, నిరంకుశుడు పేరిట ‘కమ్యూనిస్టు, బీజేపీ వాళ్ళు’ ఒకే రీతిగా పిలుస్తున్నారు. కమ్యూనిస్టులు మొదటి నుంచీ ఈ జిల్లాలో బలంగా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో కూడా సాయుధ పోరాట ఉద్యమం జరిగిందనే విషయాన్ని గుర్తించాలి. పోరాట వారసత్వాన్ని కాపడుకోవడం పేరిట నిజాంను నిందించడం ఎంత వరకు సమంజసమో కూడా ఆలోచించాలి.

స్వాతంత్య్రానికి పూర్వం తెలంగాణ అంతటా ఎక్కువ భాగం ఉర్దూ మాధ్యమంగానే ఉన్నత విద్య బోధన జరిగేది. అట్లా చదువుకున్న వారిలో సర్వదేవభట్ల నరసింహమూర్తి ఒకరు. ఈయన సాయుధ పోరాట కాంలో ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని చివరికి అనివార్య కారణాల వల్ల  హైదరాబాద్‌లో తలదాచుకోవాల్సి వచ్చింది. అక్కడ ఉన్నప్పుడే ‘మై గరీబ్‌ హూ(’, లాహూ కీ ఖీర్‌ లాంటి ఉర్దూ నమ రాసిండు. ఇవి తరువాత తెలుగులోకి తర్జుమా అయ్యాయి. తెలుగు మాతృభాషగా ఉండి ఎక్కువ భాగం ఉర్దూలో రాసిన రచయిత కవిరాజమూర్తి. ఈయన స్వాతంత్య్రానంతరం ‘ఉత్తర’, ‘దక్షిణ’ అన్న మారు పేర్లతో పటంచెరువు (ఇక్రిసాట్‌, మెదక్‌ జిల్లా) వ్యవసాయ క్షేత్రంలో ఉద్యోగం చేస్తూ అనేక వ్యాసాలు వెలువరించాడు. అలాగే హీరాలాల్‌ మోరియా కూడా ఉర్దూలో అనేక కథలు, నవలలు  రాసిండు. వాటన్నింటినీ ఖమ్మం మిత్రులే తెలుగులోకి తర్జుమా చేసి ప్రచురించేవారు. ఊటుకూరు రంగారావు స్వయంగా కథలు రాయడమే గాకుండా ఉర్దూలోకి కథలు తర్జుమా చేసిండు. శరధార అనే అద్భుతమైన కవితా సంపుటిని మెవరించిండు. ఇలా అటు ఉర్దూ సాహిత్యానికి, తెలుగు సాహిత్యానికి ఏక కాంలో అనేక రచనలు అందజేసిన వీరి గురించి, వీరి రచనల గురించీ ఎక్కువగా తెలియడం లేదు. వీరి సమగ్ర రచన సంపుటి వెలువడ్డట్లయితే తెలుగు సమాజం ఉర్దూ సాహిత్యంలో ఎట్లా రికార్డయ్యిందో వివరంగా తెలుసుకోవడానికి వీలు పడుతుంది. ఈ ప్రాంతానికున్న చరిత్ర కూడా పూర్తిగా ఇంకా వెలుగులోకి రాలేదు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మన మూలాల్ని మనం వెతికి పట్టుకునే పని ప్రారంభమయింది. అలాంటి పునాది పని ఈ ‘ఖమ్మం కథలు’ద్వారా జ్వలిత గారు చేస్తున్నారు. ఇక్కడి చరిత్రను కూడా తవ్వితీయడానికి ఇదొక సందర్భం కూడా. ఈ ప్రాంతానికి గొప్ప చరిత్రుంది. అది అరకొరగా కొంత రికార్డయింది. రామాయణంలోని సీత నివసించిన పర్ణశాల భద్రాచలం ప్రాంతంలోనే ఉందని ప్రముఖ పరిశోధకుడు కొమర్రాజు క్ష్మణరావు మహారాష్ట్ర పండితుల వాదనను ఖండిస్తూ నిరూపించిండు. రావణుడు ఇదే పర్ణశాల నుంచి సీతను ఎత్తుకెళ్తూ ఉంటే జఠాయువు పోరాటం చేసి నేలకొరిగిండని  ఆ ప్రాంతంలో1870ల్లో నివసించిన జాన్‌ కెయిన్‌ అనే ఆంగ్లేయుడు పత్రికల్లో పరిశోధక వ్యాసాలు మెవరించిండు. జఠాయువు`రావణాసురుడి పోరులో ఆ ప్రాంతమంతా దుమ్మురేగడంతో దానికి దుమ్ముగూడెం అని, రావణుడి రథం తాక్కుంటూ వెళ్ళిన గోదావరి ఆవలివైపు గుట్టను రథపు గుట్ట అని, జఠాయువు పాక ఉన్న ప్రాంతాన్ని జటపాక అని అదే ఏటిపాక అనీ ఆయన రాసిండు.

గ్రంథాలయోద్యమం, విద్యాలయాల స్థాపన, పరిశోధన, పత్రిక నిర్వహణ, ఆంధ్రమహాసభ, వర్తక సంఘాలు, పుస్తకప్రచురణ, రైతు ఉద్యమాలు, కమ్యూనిస్టుల కార్యకలాపాలు అన్నీ కగలిసి ఇక్కడి ప్రజల్లో చైతన్యానికి దోహదం చేశాయి. ఖమ్మంలో 1936లో స్థాపించబడ్డ విజ్ఞాన నికేతనం గ్రంథాలయ వారోత్సవాల్లో ఆంధ్రప్రాంతానికి చెందిన విశ్వనాథ సత్యనారాయణ, అంబటిపూడి వెంకటరత్నం, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, మ్లంపల్లి సోమశేఖరశర్మ, మారేపల్లి రామచంద్రశాస్త్రి, పాతూరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. వీటి కొనసాగింపుగా 1944లో సింగరేణి కారీస్‌లో 25వ ఆంధ్రదేశ గ్రంథాలయ మహాసభ జరిగింది. ‘విశాలాంధ్ర’కు ఇక్కడే బీజాలు పడ్డాయి. అంతకుముందు కరువు పీడిత ప్రాంతాల నుంచి ముఖ్యంగా రాయసీమ నుంచి పుష్కంగా నీళ్లున్న ‘బనిగండ్ల పాడు’లాంటి ప్రాంతానికి వలసవచ్చిన వారు ఇక్కడి చైతన్య, అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. దాదాపు వందేండ్లకు ముందు ఇక్కడికి వలస వచ్చినవారు స్కూల్స్, వైద్యశాలలు ఏర్పాటు చేసుకోవడంలో ముందున్నారు.

1930ల్లోనే ఇక్కడి దళితులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు. వివిధ సంస్థల కార్యకలాపాల వల్ల  ప్రజల్లో చైతన్యం పెరిగింది. ఆ చైతన్యంతోటే 1934లో ఖమ్మం జిల్లా పెదమండువ గ్రామంలో దళితు కోసం ప్రత్యేకంగా పాఠశాలను ఏర్పాటు చేసిండ్రు. ఈ పాఠశాలలో సుండ్రు రంగయ్య అనే అతను ఉపాధ్యాయుడిగా ఉండేవారు. ఆయన కూడా దళితుడే! తర్వాతి కాంలో నిజాం రాష్ట్ర హరిజన సేవక సంఘం వాళ్ళు ఈ పాఠశాలను ఆర్థికంగా ఆదుకున్నరు. పుస్తకాలు, పలకలు ఉచితంగా ఇవ్వడమే గాకుండా భవన నిర్మాణానికి కూడా ఈ సంస్థ సాయం చేసింది. దాదాపు ఇదే కాంలో ఖమ్మం తాూకాలోని ముష్టిగుంట్ల గ్రామంలో పోలీసు ఉన్నతాధికారి మౌల్వీ మహమ్మద్‌ తబియుద్దిన్‌ పూనిక మేరకు అస్పృశ్యత నివారణకు, స్త్రీ సమానత్వం కోసం సభలు జరిగాయి. ఇందులో చాలా మంది పోలీసు అధికారులు పాల్గొన్నారు. విశేషమేమిటంటే దళితులను కూడా సభా వేదికపై కూర్చుండబెట్టి సమావేశాలు నిర్వహించడం. ఈ సమావేశంలో ఖమ్మంకు చెందిన సనాతనధర్మదారణ సభ వారు ఉన్నప్పటికీ ఎలాంటి అడ్డంకులు జరగలేదని గోలకొండ పత్రికలో పేర్కొన్నారు. అలాగే మధిర తాలూకా గుండిపూడికి చెందిన నియోగి బ్రాహ్మణు జమీందార్‌ అయిన కాళ్ళూరు వెంకటరావు పినపాకలో చనిపోయారు. ఆయన స్మృత్యర్థం వారి కుమారులు రామకిషన్‌రావు, ఉమామహేశ్వరరావు ఖమ్మం పట్టణంలో హరిజన హాస్టల్‌ని      1941లో నిర్మించిండ్రు. నిజాం ప్రభుత్వంలో హైదరాబాద్‌ ఆవలి ప్రదేశంలో దళితు అభ్యున్నతికి ఎక్కువ కృషి జరిగింది ఖమ్మం జిల్లాలోనే అంటే అతిశయోక్తి కాదు. అందుకే ఈ జిల్లా విశిష్టమైనది.

 

మొత్తం తెంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాది ఒక ప్రత్యేకమైన స్థితి. భారతదేశంలో హైదరాబాద్‌ రాజ్యం బలవంతంగా విలీనమైనప్పుడు ఖమ్మం జిల్లా ఉనికిలోనే లేదు. నిజానికి 1905వరకు వరంగల్‌, ఖమ్మం రెండు జిల్లాల్ని కలిపి ఖమ్మం జిల్లాగానే పిలిచేవారు. పరిపాలనా సౌలభ్యం కోసం 1905లో జిల్లా కేంద్రాన్ని వరంగల్‌కు మార్చి ‘వరంగల్‌’ జిల్లాగా మార్చారు. భౌగోళికంగా మిగతా తెంగాణ జిల్లాతో పోల్చి చూస్తే పూర్తిగా భిన్నమైంది. గోదావరి, శబరి, కిన్నెరసాని, మున్నేరు లాంటి నదులతో, బయ్యారం ఉక్కుగనులతో, బొగ్గుగనులతో, పాలేరు నీటి వసతితో కొంత మెరుగైన పరిస్థితి ఉండింది. హైదరాబాద్‌ రాష్ట్రంలో ఏర్పడ్డ మొట్ట మొదటి ఇంకా చెప్పాంటే ఏకైక జిల్లా ఇది. హైదరాబాద్‌ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత శాంతిభద్రతలు కాపాడేందుకు, పరిపాలనా సౌలభ్యం కోసం వరంగల్‌ జిల్లాను విభజించి 1953 అక్టోబర్‌ ఒకటిన ఖమ్మం జిల్లాను ఏర్పాటు చేయడమైంది. జిల్లా ఆవిర్భావ కాలంలో ఖమ్మం, ఇల్లందు, మధిర, బూర్గుంపాడు, పాల్వంచ తాలూకాలు మాత్రమే భాగంగా ఉండేవి. ఖమ్మం తాలూకాలోని కామేపల్లి, సిరివోలు గ్రామాలను ఖమ్మం తాలూకా నుంచి తొలగించి వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌ తాలూకాలో కలిపారు. ఇవ్వాళ ఆంధ్రలో కలిపిన గ్రామా ప్రజల గోడు వింటూంటే వాళ్ళ గొంతు ఎట్లా నొక్కబడుతుందో అర్థమైతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కొందరు ఆంధ్రా ‘మేధావులు’ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఖమ్మం జిల్లాలో కలిపిన భద్రాచలంని కూడా ఆంధ్రాలో కలపాలని డిమాండ్‌ చేసిండ్రు. భద్రాచలం ప్రాంతమనేతమ ది వారి వాదన. అయితే చారిత్రకంగా చూసినట్లయితే అది అసంబద్ధ వాదన.

 

1854లో ఆర్థర్‌ కాటన్‌ ధవళేశ్వరం ఆనకట్ట కట్టే సమయంలో  పరిపానా సౌలభ్యం కోసం సూగూరు, భద్రాచం తాలూకాను బ్రిటీష్‌ వారికి ఇవ్వాల్సిందిగా నిజాం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని పురస్కరించుకొని వాటిని బ్రిటీష్‌ ప్రభుత్వానికి బదలాయించారు. భద్రాచం, రేకపల్లి తాలూకాలు 1860 వరకూ నిజాం ఆధీనంలోనే ఉండేవి. 1860లో బ్రిటీష్‌ ప్రభుత్వానికి వీటి అజమాయిషీని బదలాయించారు. ఆ తర్వాత ఈ తాలూకాని 1874లో సెంట్రల్‌ ప్రావిన్స్‌ నుంచి మద్రాసు ప్రావిన్స్‌కు బదలాయించిండ్రు. 1953లోనూ, 1959లోనూ భద్రాచలం ప్రాంతాల్లో తీవ్రమైన వరదలు వచ్చాయి. వీటిని నదికి ఆవలితీరంలో చాలా దూరంలో ఉన్న జిల్లా కేంద్రం నుంచి పాలించడం కష్టసాధ్యమయ్యేది. దాంతో ప్రజల ఇబ్బందులను అధిగమించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ప్రాంతాను ఖమ్మం జిల్లాలో కలిపారు. ఈ ఉత్తర్వు 1959 నవంబర్‌ 30 నుంచి అమల్లోకి వచ్చింది. భద్రాచలం ప్రాంత ప్రజలది మొదటి నుంచీ దయనీయమైన స్థితి. 1959లో తెంగాణలో కలపడంతో ముల్కీ రూల్స్‌ వారికి వెంటనే అమలు కాకపోవడంతో స్థానికంగా కళాశాలల్లో అడ్మిషన్లు, ఉద్యోగాలు రెండూ దక్కలేదు. దానిపై వాణీ రమణారావు లాంటి గిరిజన ఎమ్మెల్యేలు పోరాటం చేయడంతో వారిని ముల్కీలుగా గుర్తించేందుకు జలగం వెంగళరావు చొరవ తీసుకొని చట్టంలో మార్పు తీసుకొచ్చారు. అయితే ఈ మార్పుల్ని ఆసరాగా ఎక్కడెక్కడి వారో తాము కూడా తెంగాణ వారమే అని ఉద్యోగాకు పోటీపడ్డారు. నిజానికి  ప్రత్యేక తెంగాణ ఉద్యమానికి పునాది కూడా ఖమ్మం జిల్లా నుంచే పడిందంటే అతిశయోక్తి కాదు. కొత్తగూడెం థర్మల్‌ పవర్‌స్టేషన్‌లో నిబంధనలకు విరుద్ధంగా నియమించిన ఆంధ్రప్రాంత ఉద్యోగులను 1969 జనవరి పది తారీఖులోగా తొలగించి  తెంగాణ వారికి ఉద్యోగాలు ఇవ్వాలని ‘కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌’ సంఘం కార్యదర్శి వి.వై.గిరి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇది ఆచరణకు రాకపోవడంతో విద్యార్థి రవీంద్రనాథ్‌ అమరణ నిరాహార దీక్ష చేపట్టిండు. ఇది విస్తరించి తెంగాణ అంతటా ఉద్యమానికి దారితీసింది.

 

నిజానికి 1961లో తెంగాణ కోసం ప్రత్యేకంగా కేటాయించబడ్డ నిధుల నుంచి ఈ ‘కొత్తగూడెం పవర్‌ థర్మల్‌ స్టేషన్‌’ ప్రారంభ మయింది. ఇందుకోసం రైతులు 1300 ఎకరాల భూమిని ధారదత్తం చేయాల్సి వచ్చింది. ఒక వైపు భూములు పోయాయి. మరోవైపు కరువు పరిస్థితులు, తమ కండ్ల ముందట రోజువారీ ఉద్యోగాలకు కూడా ఉన్నతస్థాయి ఆంధ్ర అధికారులు తమ ప్రాంతంవారిని పిలిపించి ఉద్యోగాలిచ్చారు. ముల్కీ నిబంధనను యథేచ్ఛగా ఉల్లంఘించి స్థానికంగా భూములు కోల్పోయిన వారికి ఇవ్వాల్సిన ఉద్యోగాలు కూడా ఆంధ్ర ప్రాంతం వారికే కట్టబెట్టారు. మొదట ఎం.ఎన్‌.ఆర్‌ అని తాత్కాలిక ఉద్యోగాల పేరిట వారిని పనిలోకి తీసుకొని, తర్వాతికాంలో ‘అనుభవం’ ఉన్నవారు అని సాకు జెప్పి వారికే ఉద్యోగాలిచ్చిండ్రు. మొత్తం 1200 ఉద్యోగాల్లో తెంగాణ వారు కేవం 200 మంది కూడా లేరు. తెంగాణలో అప్పటికే 30వేల మంది ఇంజనీరింగ్‌, డిప్లొమా, డి.టి.ఐ, హెచ్‌.ఎస్‌.సి, డిగ్రీలు పాసయినవారున్నారు. ఇంత అన్యాయం జరుగుతున్న అటు ప్రభుత్వం గానీ, ఇటు ఎపిఎస్‌ఇబీ గానీ ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. నిజానికి తెలంగాణకు ఉన్న రక్షణల్ని ఆంధ్రాధికారులు ఉ్లంఘించిండ్రు. ఈ సేఫ్‌గార్డ్స్‌ 1958 నుంచీ అమల్లో ఉన్నాయి. కండ్ల ముందట అన్యాయం జరుగుతున్నా అడ్డుకోలేని అశక్తత ఆగ్రహానికి దారి తీసింది. అలా ప్రత్యేక తెంగాణ ఉద్యమానికి ఖమ్మం జిల్లా కొత్తగూడెం నుంచి పునాది పడింది. రెండో సారి 2009లో కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమైనప్పుడు రోశయ్య ప్రభుత్వం ఆయన్ని అరెస్టు చేసి ఖమ్మంకు తరలించింది. ఖమ్మంలో తెంగాణ ఉద్యమం బాలహీనంగా ఉండడంతో అక్కడి ప్రజల నుంచి వ్యతిరేకత రాదు అనేది ప్రభుత్వం ఉద్దేశ్యం. అయితే ఉద్యమాల ఖిల్లా అయిన ఖమ్మం ఒక్కటిగా తరలి వచ్చి పోరాటానికి బాసటగా నిలిచింది. లాఠీలకు వెరవకుండా ఉద్యమకారులు చూపిన తెగువ మిగతా తెంగాణ బిడ్డకు స్ఫూర్తిగా నిలిచింది.

ఈ పోరాట స్ఫూర్తితో జ్వలిత గారు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి 104 కథలతో ఈ సంకలనాన్ని వెలువరించారు.  ఈ సంకలనం మిగతా జిల్లాల వారికి స్ఫూర్తి కావాలని స్ఫూర్తి కొరుకుంటూ …

(“ఖమ్మం కథల”కు రాసిన ముందుమాటలో కొంత భాగం)

 

మీ మాటలు

  1. jwalitha says:

    ధన్యవాదాలు సర్ ,

    ఖమ్మం కథల గురించి విలువైన, వివరణాత్మక ముందు మాట రాసిననదుకు , మొదటి సారి నా వర్క్ సారంగ లొఅ పోస్ట్ చేసినందుకు

    జ్వలిత

  2. చాలా అమూల్యమైన సమాచారం అందించారు ఖమ్మంజిల్లా గురించి మరుగున పడిపోతున్న ఎన్నో చారిత్రక సాహిత్య వివరాలను గుదిగుచ్చి ముందుమాట ఇవ్వడం చాలా గొప్పవిషయం. ఖమ్మంజిల్లా కథలను ఒక సంపుటిగా తెచ్చిన జ్వలితగారికి, అధ్బుతమైన ముందుమాటనిచ్చిన సంగిశెట్టి శ్రీనివాస్ గారికి ఆత్మీయాభివందనాలు.
    సారంగకు ధన్యవాదాలు

  3. A K Prabhakar says:

    జ్వలిత సంగిశెట్టి లకు అభినందనలు . స్థానిక సామాజిక సాంస్కృతిక చరిత్ర శోధనకు ఎంతగానో ఉపయోగపడే కథల్ని వెలికి తెస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

మీ మాటలు

*