ఒకపరి జననం ఒకపరి మరణం

001

   –సి.ఉమాదేవి 

~

 

నిబద్ధతతో విశ్లేషణాత్మకంగా పరిశీలించి,  పరిశోధించి పాఠకులను తన రచనాపఠిమతో ఆయస్కాంతంలా ఆకర్షించేలా రచనచేయగలగడం రామా చంద్రమౌళిగారి ఒరవడి.పైగా రచనలోని లోతైన భావాలను వెలికి తీయించే పనిని మనకు తెలియకుండానే మనకే అప్పగిస్తారు.అక్కడక్కడా తటిల్లున మెరిసే పద మెరుపుల చురకలు ఒకొక్కసారి ఉరుములై గర్జిస్తాయి.

మనిషి జీవితంలో జననం చలనం,మరణం నిశ్చలనం.ఈ రెండు స్థితులనడుమ పయనం మనిషి మనుగడకై చేసే సంగ్రామం.

లోకానికి మనిషి పుట్టుకను తెలుపుతూ తొణికిన తొలి భాష్పం రాగరంజితం.అదే మనిషి మరణాంతరం  నలుగురి తలబోతలో ఒదిగినప్పుడు ‘ నీవు మరణించలేదు, అందరి గుండెల్లో పదిలమై శాశ్వతంగా జీవించే ఉంటావు’ అని ఆనాటి భాష్పానికి భాష్యం చెప్తుంది. నిజమే! మనిషిగా జన్మించాక మరణించక తప్పదు.అయితే మరణించాక కూడా జీవించాలి.అయితే ఆ జీవనంలో  లక్ష్యమనేది లేకపోతే అది మరణమే.అందుకే నేటి యువతకు దిశానిర్దేశం చేసి ప్రోద్బలం అందించాలి.గురిపెట్టిన లక్ష్యానికి చేరువకావాలంటే మార్గం సుగమం కావాలంటారు రచయిత.ఆలోచనలను చదవాలంటారు.నిజమే కదా!

‘ ది వాకర్ బ్రాండ్’ పాదరక్షల వ్యాపారంలో అగ్రగామిగా నిలవడానికి చోదకశక్తినందించిన వ్యక్తి లోల.ఆమే ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా విభిన్నఆలోచనలతో కంపెనీని ఊర్ధ్వపథంలో నిలిపింది.డబ్బు,పదవులు, అధికారాలు, ఆధిపత్యాలు కొందరికి ఆనందాన్నిస్తాయి.కాని కొందరికి తమ నైపుణ్యం అందించిన విజయాలు ఆనందంకన్నా అమితమైన తృప్తిని కలిగిస్తాయి.పరిమళకు అర్థమైన లోల మనసు ఇదే.సర్చ్,రిసెర్చ్ రామా చంద్రమౌళి గారి మంత్రాక్షరాలు.రచయిత తనకు నిర్దేశించిన బాటలో తన అడుగులను బలంగా ముద్రించుకోగలిగిన సదాశివ, జాతిని ప్రభావితం చేయగలిగే ఆవిష్కరణల దిశగా పయనిస్తాడు.అయితే విజయవ్యూహాల్లో మానవీయ స్పర్శను దర్శించాలనడం మానవతను ఆరాధించేవారికి దైవదర్శనమే!సౌరశక్తిని వినియోగంలోకి తెచ్చుకుని సోలార్ సిటీ రూపకల్పన,బ్యాటరీతో నాలుగు నిమిషాలు ఛార్జింగ్ చేస్తే మూడువందల కిలోమీటర్లు ప్రయాణం చేయగలిగే  ‘ లోల మోటర్ బైక్ ’

రూపకల్పనపై  ఉదహరించిన దృశ్యం(పవర్ పాయింట్ ప్రజంటేషన్ ) నవల ముగింపులో ఉత్సుకత కలిగించిన అంశం. ప్రజాప్రతినిధుల అండ దొరకడం అతడిని లక్ష్యదిశగా నడిపింది. “ జాగ్రత్తగా విను లోలా!” అని సదాశివ చెప్తున్న మాటలను మనము కూడా  చెవి ఒగ్గి వింటాము.ఘంటసాల,ముఖేష్ ఈనాడు లేరు.అయినా చిరస్మరణీయులే అని చెప్పే సదాశివ చరిత్రలో మిగిలిపోవాలన్న ఆకాంక్షపై దృష్టి కేంద్రీకరిస్తాడు.తను  రూపొందించాలనుకునే పరిశ్రమలకు ప్రభుత్వ వెన్నుదన్నేకాదు లోల తోడ్పాటును కోరుకుంటాడు.  తన పదవికి రాజీనామా చేసి లోల అతడి ఆహ్వానం మేరకు కలిసి పనిచేయడమేకాదు,కలిసి జీవించాలనుకుని తీసుకున్న నిర్ణయంతో మనము కళ్యాణమస్తు అని నవల ముగిస్తాము.అయితే వెంటాడే ఆలోచనలు తలుపులు మూయవు.అదే నవలకున్న సుగుణం.చదివిన పుస్తకంనుండి ఏదైనా కాస్త నేర్చుకోవాలనుకునే శ్రద్ధ ఉన్నవారికి  ఈ పుస్తకం కరదీపిక అనడంలో అతిశయోక్తి లేదు.

*

 

మీ మాటలు

  1. raamaa chandramouli says:

    ఉమాదేవిగారూ మీ విశ్లేషనాత్మక పుస్తక పరిచయానికి ధన్యవాదాలు.

    – రామా చంద్రమౌళి , వరంగల్లు

  2. ఆకట్టుకునే భావం,భాష మీ స్వంతం.ధన్యవాదాలు రామా చంద్రమౌళిగారు.

  3. Ee navala vrayadaaniki writer ki yemainaa nepadhyam undaa! telusukovaali ani undhi . Nice narration mam

Leave a Reply to Sasikala Cancel reply

*