గమనమే గమ్యం

 

volgaజైల్లోకి వార్తలొస్తున్నాయి. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలలో చైతన్యవంతులైన యువతరం, పాతిక ముప్ఫై సంవత్సరాల వయసున్న యువతరం ప్రాణాల్ని వదులుతోంది. పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తున్నారు. ముఖ్యమైన కార్యకర్తలను కోల్పోతున్నా నాయకులకు ప్రమాదం ఎందుకర్థం కావటం లేదనే ప్రశ్న శారదను వేధిస్తోంది. ఈ సమయంలో, ఈ సందర్భంలో చేయదగిన పోరాటం ఇది కాదనే విషయం గట్టిగా మాట్లాడుతున్న వాళ్ళను శత్రువులుగా ఎందుకు చూస్తున్నారు. పైనుంచి కిందివరకూ చర్చించటం లేదెందుకని? పోరాటం ఆపమన్న వాళ్ళను ప్రాణత్యాగాలకు భయపడే పిరికివాళ్ళలా చూసే ధోరణిని పెంచుతున్నదెవరు? సమాధానం లేని ప్రశ్నలు.

ప్రదర్శనలో అరెస్టు చేసిన వారిలో పదహారుమంది మీద కేసులు పెట్టి మిగిలిన వారిని షరతులతో విడుదల చేశారు. శారదను, సూర్యావతిని వెల్లూరు పంపి మిగిలినవారిని బెజవాడలోనే ఉంచారు. కేసు విచారణ బెజవాడలోనే, విచారణకు బెజవాడ వెళ్ళేరోజు కోసం తహతహలాడుతూ ఒంటరితనంలో మగ్గిపోతోంది శారద.

బెజవాడలో కేసు విచారణకు ముందురోజే శారదను సూర్యావతిని అక్కడికి చేర్చారు. ప్రయాణమంతా మౌనమే. ఇద్దరు మంచి మిత్రులు శత్రుత్వం లేకుండా మాట్లాడుకోకపోవటం శారదకు ఇంతవరకూ అనుభవంలో లేదు. శత్రువులతో సహితం మాట్లాడి వాళ్ళను ఎదిరించటమో, ఒప్పించటమో, మందలించటమో చేసే స్వభావం శారదది. బెజవాడలో శారదకు ప్రత్యేకంగా ఒక గది ఇచ్చారు. ఒద్దని అందరితో పాటు ఉంటాననీ అన్నా వినలేదు. తన గదిలోకి వెళ్తూ మిగిలినవారి వంక ఆశగా చూసింది శారద. అందరూ తలలు పక్కకు తిప్పకున్నారు. శారద గుండెల్లో నొప్పి మొదలయింది. ఆ రోజు తిండి నిద్రా లేకుండా నీళ్ళు కూడా రాని కళ్ళతో జైలు గోడలను చూస్తూ గడిపేసింది. మర్నాడు పదిగంటల ప్రాంతంలో అందరినీ వ్యాను ఎక్కించారు. అందరినీ నవ్వుతూ పలకరించబోయింది శారద.

“ఎలా ఉన్నారోయ్ – అందరూ చిక్కిపోయారు. ఇక్కడి తిండి మీకెవరికీ సరిపడటం లేదల్లే ఉంది. పిల్లలకు పాలైనా ఇస్తున్నారా జైలు వాళ్ళు” కోటేశ్వరమ్మ “లేదు” అని చిన్నగా అన్నదో లేదో ఉమాదేవి “అనవసరమైన ప్రశ్నలకు ఎవ్వరూ జవాబులివ్వకర్లేదు” అని గట్టిగా అరిచింది. అందరి ముఖాలూ నల్లబడ్డాయి. శారదకు మొహం తిప్పేసి కూర్చున్నారు. గుండెల్లోకి రాబోతున్న కుంగుబాటుని బలంగా వెనక్కు నెట్టి “మీరు చేస్తున్నది సరి కాదోయ్” అని తనూ బైటికి చూస్తూ కూర్చుంది. కోర్డు విచారణ రొటీన్ గా జరిగింది. నాలుగు రోజుల తర్వాత మళ్ళీ వాయిదా. ఆ నాలుగు రోజులూ శారదకు, ఆమె స్నేహపూరిత స్వభావానికీ సవాలు.

సుబ్బమ్మ చూడటానికి వస్తానంటే ఒద్దంది. హాస్పిటల్లో పనిచేసిన మంగమ్మ, సుందరమ్మ వచ్చారు.

శారదను చూసి ఒకటే ఏడుపు. వారిని సముదాయించటం శారదకు కష్టమై పోయింది. నవ్వించి, బతిమాలి, బెదిరించి వాళ్ళ ఏడుపుని ఆపి విషయాలన్నీ కనుక్కుంది.

సుబ్బమ్మ ఆరోగ్యం బాగోలేదు. కానీ ఆమె ధైర్యంగానే ఉంది. పోలీసులు హాస్పిటల్ మొత్తం ఎట్లా ధ్వంసం చేశారో చెప్తూ మళ్ళీ ఏడవసాగారు. వాళ్ళను సముదాయించి పంపి జైలర్తో మాట్లాడాలని బైటికి వచ్చింది.

సూర్యావతికి ఆరోగ్యం బాగోలేదనీ హాస్పిటల్కు తీసికెళ్ళాలనీ నలుగురు జైలరు చుట్టూ చేరి అడుగుతున్నారు. జైలరు వాళ్ళ మాటలు వినిపించుకోకుండా ‘అవసరమైనపుడు మేం తీసుకువెళ్తాం మీరు చెప్పాల్సిన అవసరం లేదని తీసి పారేసినట్లు మాట్లాడుతున్నాడు,

“మిస్టర్ – వీళ్ళంతా సమాజంలో గౌరవంగా బతికే కుటుంబాల నుండి వచ్చినవాళ్ళు. మీరు ఎట్లా అంటే అట్లా మాట్లాడితే మీ సంస్కారమే బైటపడుతుంది గౌరవం ఇచ్చి పుచ్చుకోవటం తెలియదా మీకు? నేను డాక్టర్ని ఆమెను ముందు నేను చూసి హాస్పిటల్కు తీసికెళ్ళాలో లేదో చెబుతాను” అంటూ సూర్యావతి నుంచిన గదిలోకి వెళ్ళింది. కోటేశ్వరమ్మ, రాజమ్మ, కమల, సుగుణ ఆమె వెనకాలే వెళ్ళారు.

“ఉమాదేవి లేదు నయం. ఉంటే గొడవ చేసేది. సూర్యావతిని చూడనిచ్చేది కాదు” అంది రాజమ్మ

మిగిలినవాళ్ళు ఔనన్నట్లు తలలూపారు.

శారద సూర్యావతి దగ్గరకు వెళ్ళేసరికి ఆమె ఒళ్ళు తెలియకుండా నిద్రపోతోంది. నుదుటి మీద చేయివేసి చూస్తే వేడిగా ఉంది. తన గదిలోకి వెళ్ళి ధర్మామీటర్ తెచ్చి రాజమ్మ కిచ్చి నిద్రలేచాక టెంపరేచర్ చూడండి. జ్వరం ఉంది. ఈ మందు వేసి నుదుటి మీద తడిగుడ్డ వేస్తూ ఉండండి. ముందు తడిగుడ్డ వేయండి. మెలకువ వచ్చాక నే చెప్పినట్లు చేయండి. మందు పడిన గంటలో జ్వరం తగ్గకపోతే నాకు చెప్పండి. హాస్పిటల్కి పంపి రక్తపరిక్షలు చేయిద్దాం” అని చెప్పి పదడుగులు వేసి మళ్ళీ వెనక్కు వచ్చి

“సూర్యావతికి నేను వచ్చి చూశానని చెప్పకండి. జైలరు డాక్టర్ని పిలిపించాడని చెప్పండి” అని వెళ్ళిపోయింది.

మరుసటి వాయిదా రోజు కూడా శారదతో ఎవరూ మాట్లాడలేదు. కోర్టు దగ్గర వ్యాను దిగుతుంటే రాజమ్మ కూతురు విమలను ఎవరో తీసుకొచ్చారక్కడికి. రాజమ్మ కూతుర్ని ఎత్తుకుని ముద్దులు పెట్టి, ఏడుస్తున్న పిల్లను సముదాయించి గుండెలకు హత్తుకుంది. అందరి మనసుల్నీ కలచివేసింది ఆ దృశ్యం. శారదే రాజమ్మకు పురుడు పోసి ముందుగా ఆ పాపను ఎత్తుకుంది. ఆ వాత్సల్యం పొంగుకొచ్చింది శారద గుండెల్లో “రాజమ్మా – నీ కూతురెంత బాగుందే – ఇలా ఇవ్వు” అంటూ చేతులు సాచింది.

రాజమ్మ సంతోషంగా పాపను శారద చేతులకందించింది. శారద ఆ పాపను గుండెలకు హత్తుకుని ముద్దుపెట్టి “రాజమ్మా” అని ఏదో చెప్పబోతోంది. ఇంతలో ఉమాదేవి ఎక్కడినుంచి వచ్చిందో డేగలా వచ్చి శారద చేతిలోంచి పాపను లాక్కుని రాజమ్మ చేతుల్లో పెట్టి,

“రాజమ్మా నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా. అడ్డమైనవాళ్ళతో రాసుకు పూసుకు తిరుగుతావు. మనవాళ్ళు మనకు ఆదేశాలు పంపించారా లేదా? వాటి ప్రకారం నడుచుకుంటారా లేదా? లేకపోతే ద్రోహులతో కలిసిపోతారా? ఇంకోసారి ఇట్లాంటివి జరిగితే పార్టీకి రిపోర్టు చెయ్యాల్సి వస్తుంది జాగ్రత్త అని చరచరా అవతలి వైపుకు వెళ్ళిపోయింది. అందరూ నిర్ఘాంత పోయారు. కోటేశ్వరమ్మ కళ్ళవెంట నీళ్ళు.

“డాక్టర్ గారి వయసు, అనుభవం, ఆమె మనసు, మంచితనం, ఎందులోనూ సమానం కాలేని ఉమాదేవి ఇట్లా మాట్లాడొచ్చా పిల్లను ఎత్తుకున్నంత మాత్రాన కొంపలంటుకుంటాయా? ఉమాదేవికి ఇంత అధికారం ఎవరిచ్చారు?” అంది రాజమ్మకే వినిపించేటట్లు,

“ఎవరూ ఇవ్వలేదు. పార్టీ పేరుతో అధికారం చలాయిస్తోంది. అట్లా చలాయించే వారే పార్టీకి అసలైన ప్రతినిధులని పార్టీ అనుకుంటున్నంత కాలం ఉమాదేవి ఇట్లాగే మాట్లాడుతుంది” అంది రాజమ్మ

olga title

శారద మనసు పూర్తిగా విరిగిపోయింది. ముక్కలు ముక్కలయింది.

మాట్లాడకుండా కోర్టు లోపలికి వెళ్ళి తన స్థానంలో కూర్చుంది.

ఈ సారి విచారణ కొంత బాగానే సాగింది. నెల తర్వాత తీర్పు ఇస్తానన్నాడు మేజిస్ట్రేటు.

మళ్ళీ వెల్లూరు ప్రయాణం కమ్మన్నారు శారదను, సూర్యావతిని. సూర్యావతి జ్వరంతో నీరసించి ఉంది. ప్రయాణం చేయలేననీ, కొన్నాళ్ళు బెజవాడలోనే ఉంటాననీ అడిగితే జైలు అధికారులు ఒప్పకోలేదు. జైల్లో ఉన్న స్త్రీలందరూ సూర్యావతికి అడ్డుగా నిలబడ్డారు. జైలు సిబ్బంది వాళ్ళను నెడుతూ తిడుతూ సూర్యావతిని ముందుకు లాగుతున్నారు. శారద ప్రయాణానికి సిద్ధమై వచ్చినది, ఇదంతా చూసి ఆవేశంతో అటు పరిగెత్తింది. జైలు సిబ్బందిని అటూ, ఇటూ లాగి సూర్యావతికి అడ్డంగా నిలబడి “ఖబడ్డార్, మావాళ్ళ మీద చేయి వేశారంటే మీరు ఉద్యోగాలలో ఉండరు. ఆవిడ నాలుగు రోజుల్నించీ జ్వరంతో ఉంది. మీరు హాస్పిటల్కి కూడా పంపలేదు, నేను మందులిచ్చి ఈ మాత్రం నిలబడేలా చేశాను. మీరామెను చంపదల్చుకున్నారా? నీరసించి ఉన్న రోగిని బెజవాడ నుంచి వెల్లూరు దాకా ప్రయాణం చేయమంటారా? దారిలో జ్వరం తిరగబడితే, ఎమర్జెన్సీ వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? మీరు మనుషులేనా? మీకు మంచి మాటలు చెప్పిన వాళ్ళను కొడతారా? తిడతారా? రండి నన్ను కొట్టండి. నన్ను దాటి వచ్చి సూర్యావతి గారిని తీసుకెళ్ళండి.”

శారద మాటలకు సిబ్బందంతా భయపడిపోయారు. అక్కడ్నించి వెళ్ళి జైలరుతో ఏం చెప్పారో మొత్తానికి సూర్యావతి మరో నాలుగు రోజులు బెజవాడలో ఉండేందుకు ఒప్పకున్నారు.

సూర్యావతికి పాలు, పళ్ళు, మెరుగైన ఆహారం ఇస్తే తప్ప నాలుగు రోజులకైనా ఆమె కోలుకోదని చెప్పి ఇవ్వవలసిన ఆహారం, మందులు వేళ ప్రకారం కాగితాల మీద రాసి ఒక కాగితం జైలరుకి ఒక కాగితం రాజమ్మకు ఇచ్చింది.

“ధైర్యంగా ఉండండోయ్. సూర్యావతి కొచ్చింది మామూలు జ్వరమే. కాస్త బలమైన తిండి పడితే నీరసం తగ్గిపోతుంది” అని చెప్పి తను వెళ్ళి వ్యానులో కూర్చుంది.

ఇది జరిగినంత సేపూ ఉమాదేవీ, మరో నలుగురూ చిటపటలాడుతూ ఉండటం శారదతో సహా అందరూ గమనించారు.

రైలు స్టేషన్కి సుబ్బమ్మను తీసుకుని నర్సు లక్ష్మి, మంగమ్మ వచ్చారు.

సుబ్బమ్మతను కళ్ళనీళ్ళు పెట్టుకుంటే శారద తట్టుకోలేదనీ, ఎట్టి పరిస్థితులలోనూ తను ఏడవకూడదనీ గట్టిగా నిర్ణయించుకుని వచ్చింది.

“ఎట్లా ఉన్నావమ్మా” అని అడిగిన శారదకు “నాకేం. శుభ్రంగా తిని తిరుగుతున్నాను. నువ్వెట్లా ఉన్నావు. అక్కడి తిండీ, నీళ్ళూ సరిపడినట్లు లేవు. చిక్కిపోయావు. నల్లబడ్డావు”.

“జైలుకి వెళ్ళినవాళ్ళు చిక్కిపోకపోతే చాలామంది జైళ్ళకెళ్తారమ్మా తిండి మరీ అన్యాయంగా లేదులే – అక్కడ నువ్వు లేవుగా”,

“నేను లేకపోతే ఏం, మన వాళ్ళంతా ఉన్నారుగా, వెల్లూరులో సూర్యావతి ఉందంటే నేనున్నట్టే కాదూ? ఇక్కడ అందరూ ఉండనే ఉన్నారు. మీ పాటలు మీటింగులు, సరదాలు దేనికీ లోటుండదని నాకు తెలుసులే.”

“అమ్మా నటాషా ఎలా ఉంది?”

“దానికేం బాగానే ఉంది. అక్కడ విమలత్త పిల్లలు దీని ఈడు వాళ్ళేగా, అందరూ జతగా జట్టుగా బడికెళ్తున్నారు. బాగా చదువుతున్నదట. మొన్నొక రోజు ఫోనులో మాట్లాడి అమ్మమ్మా – అమ్మ వచ్చిందా? శలవల్లో నేనొచ్చే సరికి అమ్మని రమ్మని చెప్పు” అన్నది. పిచ్చితల్లి, దానికేం తెలుసు మీ గొడవలు? మూర్తి కూడా వెల్లూరేగా?”

“ఆ – వారం వారం ఇంటర్వ్యూ దొరుకుతోంది. బాగానే ఉన్నాడు”.

“పాపం పార్టీ కుర్రాళ్ళంతా చచ్చిపోతున్నారే” అంటూ ఇక ఆపుకోలేక పెద్దగా ఏడ్చింది సుబ్బమ్మ,

తల్లిని రెండు చేతుల్తో దగ్గరకు తీసుకుని శారదా ఏడ్చింది.

“బంగారంలాంటి కుర్రాళ్ళు – ఆడవాళ్ళనూ కాల్చేస్తున్నారు. ఇది మంచికి రాలేదు. ఇంతకింతా అనుభవిస్తారు ఈ కాంగ్రేసు వాళ్ళు”.

“ఊరుకోమ్మా అంతా సరవుతుంది. మేమంతా బైటికి వస్తాం. సరేనా?”

“సరేనమ్మా సరే, ఆరోగ్యం జాగ్రత్త, నా గురించీ, నటాషా గురించీ దిగులు పెట్టుకోకు. నువ్వున్నచోట నవ్వులే తప్ప దిగులుండదని నాకు తెలుసులే” అని బలవంతంగా నవ్వబోయి విఫలమైంది సుబ్బమ్మ.

రైలు కదిలే టైమయింది. ఎక్కమన్నారు పోలీసులు. మరొకసారి తల్లీ కూతుళ్ళు ఒకరినొకరు కళ్ళారా చూసుకున్నారు.

శారద వెళ్ళి రైలెక్కింది. లక్ష్మీ, మంగమ్మ, సుబ్బమ్మకు చెరోవైపు నిలబడి నెమ్మదిగా నడిపించుకుంటూ వెళ్ళారు.

శారద వెల్లూరు చేరింది.

ఒంటరితనం. చుట్టూ మనుషులు లేని ఒంటరితనం కాదు. తనవాళ్ళంటూ ఎవరూ లేని ఒంటరితనం, మానసికమైన ఏకాకితనం.

వెలి ఎలా ఉంటుందో శారదకు ప్రత్యక్షంగా అనుభవమైంది. బ్రాహ్మణ కులంలో వెలి వెయ్యటం, ప్రాయశ్చిత్తాలు జరపటం, మళ్ళీ కలుపుకోవటం వీటి గురించి చిన్నప్పుడు తండ్రి చెప్పాడు. పెద్దయ్యాక పుస్తకాల్లో చదివింది. రాజ్యలక్ష్మమ్మ అమ్మమ్మను వెలివేశారు బంధువులందరూ. వీరేశలింగం తాతయ్య వితంతు వివాహాలు చేయించేటప్పడు అందరూ వెలివేశారు. ప్రాణ స్నేహితులు కూడా సమాజానికి భయపడి దూరమయ్యారు. ఎలా భరించారు వాళ్ళు ఆ దుర్మార్గమైన ఫ్యూడల్ పద్ధతిని, అదే పద్ధతిని కమ్యూనిస్టు పార్టీ ఎలా ఆచరిస్తోంది? వెలి – కులంతో వేళ్ళూనుకుని, ముడిపడిన పద్ధతి. తమ కులానికున్న ఏ మూర్థపు కట్టుబాటుని ప్రశ్నించినా, ఎదిరించినా, ఆచరించక పోయినా, తాము గీసిన లక్ష్మణరేఖలలో ఏ రేఖను దాటినా కులపెద్దలు వెలి వేస్తారు. ఆ కుల ముద్ర పద్ధతిని కమ్యూనిస్టులూ అమలు చేయటమేమిటి? తన అభిప్రాయాలు రాసి పంపించింది. అవి పొరపాటైతే పొరపాటని మాట్లాడవచ్చు సంభాషణ కొనసాగితే గదా మంచిచెడ్డలు బైటికొచ్చేది, పొరబడితే వెలేనా? తనే సరిగా ఆలోచిస్తున్నదనీ, వారిది పొరపాటనీ తేలితే ఏం చేస్తారు? ప్రాయశ్చిత్తం ఎలా చేసుకుంటారు? ఏ బ్రాహ్మణ కులాచారం అమలుచేసి ప్రాయశ్చిత్తం చేసుకుంటారు? తమ తోటి స్త్రీలను ఈ పొరపాటు అభిప్రాయాలతో ప్రభావితం చేస్తానని భయపడుతున్నారా? తన అభిప్రాయాలు చెప్పినంత మాత్రాన వాళ్ళు మారిపోతారా? రెండోవైపు ఒకటుందని తెలియకుండా చూపే విధేయతకో, కట్టుబాటుకో విలువేముంటుంది?

ఈ విషయాల గురించి వాళ్ళతో చర్చించవద్దని తనకు సూచించవచ్చు. అలా కాకుండా శారద ద్రోహి అనీ, ఆమెతో మాట్లాడవద్దనీ, తాకవద్దనీ తన సహచరులను ఆజ్ఞాపించటం ఏ విలువల ఆధారంగా జరిగింది? ఇందులో కరడుగట్టిన కులాచారం తప్ప ప్రజాస్వామ్యం ఎక్కడుంది? శారద మనసు భగభగ మండుతోంది.

ఏం చెయ్యాలి? అనే ప్రశ్న వెంటాడుతూనే ఉంది. ఒక ఉద్యమం కోసం జైల్లో ఉండటం వేరు. జరుగుతున్న ఉద్యమంలో, పోరాటంలో భాగం కాకుండా ఎందుకిట్లా నిరర్థకంగా జైల్లో ఉండటం?

కానీ బహిరంగంగా పార్టీతో విబేధించటం మామూలు విషయం కాదు. కానీ తను రహస్యంగా రాసి పంపిన సమాచారం పార్టీ సభ్యులకూ సానుభూతి పరులకూ తెలిసిపోయింది. దానిని కూడా సహించక బహిరంగ ప్రకటన చేసినట్లే ప్రవర్తిస్తున్నారు. తనకూ పార్టీకి మధ్య గోడ కట్టేశారు. ఆ గోడ ఎంత బలంగా ఉందో ఇప్పట్లో తేలేలా లేదు.

పట్టుమని పాతికేళ్ళ లేని ఉమ ముందూ వెనకా ఆలోచించకుండా ద్రోహి అన్నది. ఆ అనటంలో ఎంత అధికారం చూపించింది. ఎలా వచ్చింది ఆమెకు ఆ అధికారం, ఆ అధికారానికి తను తలవంచిందా? ఉమకు సమాధానమైతే చెప్పలేదు. సహించింది. ఆ మాటలు అన్యాయమైనవని తెలిసినా, ఆ ధోరణి ప్రజాస్వామికం కాదని తెలిసినా తాను మాట్లాడలేదు. ఉమను వారించలేదు. పార్టీ ఆదేశం అని ఉమ అంటుంటే “ఎవరిచ్చారు ఆ ఆదేశం, నేను పార్టీ సభ్యురాలిని కాదన్నట్లు ఎందుకు మాట్లాడుతున్నావు? ఏమిటి నీ అధికారం?” అని అడగలేదు. ఎందుకంటే అంతరాంతరాలలో తనకు కూడా తెలుసు అది పార్టీ ఆదేశమని. ఎవరు నిర్ణయించి ఉంటారు? ఒకరిద్దరా? కమిటీ అంతా సమావేశమైందా? ఎలా నిర్ణయం తీసుకున్నారు తనను సంప్రదించకుండా – తన వాదన పూర్తిగా వినకుండా.

కలకత్తా మహాసభలో నెహ్రూ ప్రభుత్వాన్ని సాయుధ పోరాటం ద్వారా పడగొట్టాలనే తీర్మానానికి తను మనసా వాచా అంగీకరించలేదని చాలామందికి తెలుసు. తనే కాదు మరికొందరు పెద్దలకు కూడా సంపూర్ణాంగీకారం లేదు. వారి మీద ఈ వైఖరి తీసుకోలేదు, వారు తిరుగుబాటు చేసినట్లో, ద్రోహం చేసినట్లో ఎవరూ మాట్లాడం లేదు. కానీ తనమీద ఈ నింద ఏమిటి “ఆడదాన్ననా?” ఆ ఆలోచనకు ఉలిక్కిపడింది శారద.

ఈ పదిహేనేళ్ళలో అనేకసార్లు ఈ ప్రశ్న వచ్చింది. ప్రతిసారీ ఏదో ఒక సమాధానంతో సరకుంటోంది. ఇంకెంత కాలం ఇలా సర్దుకోవాలి? కమ్యూనిస్టులయినంతమాత్రాన ఎంతో కాలం నుంచీ అలవడిన భావాలు పోవు. కానీ నాయకత్వమైనా తమని తాము మార్చుకోవటానికీ ప్రయత్నం చేయవద్దా? సమాధానం చెప్పేదెవరు?

పురుషుల జైలులో రోజూ ఏదో ఒక కలకలం. నిరాహార దీక్షలు, అధికారులను ఎదిరించటాలు. గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మూర్తి వారానికోరోజు ఇంటర్వ్యూ తీసుకుని శారదను కలుస్తున్నాడు. ఇద్దరికీ పోరాట విరమణ జరగాలని ఉంది. తమలాగా ఆలోచిస్తున్న వాళ్ళున్నారనీ తెలుస్తోంది. రాయలసీమ కామ్రెడ్ ఒకరు తను పార్టీతో విబేధించి బైటికి వస్తున్నానని చెప్పి విడుదలయ్యాడు.

అలా చేద్దామనే ఆలోచన కొందరిలో ఉంది.

“మూర్తీ – మనం ప్రస్తుతం పార్టీ అనుసరిస్తున్న పంధాను వ్యతిరేకిస్తున్నాం. ఆ మాట నేను వివరంగా పార్టీకే ఉత్తరం ద్వారా చెప్పాను. అందుకే అందరూ నన్ను శత్రువులా చూస్తున్నారు. నిన్నూ అంతే – అలాంటప్పుడు మనం అటు పార్టీకీ కాక, ఇటు మన కుటుంబాలకూ, వృత్తులకూ కాక ఈ జైల్లో ఎందుకుంటున్నట్టు. మనం ఈ పోరాటాన్ని వ్యతిరేకిస్తున్నామని బహిరంగంగా ప్రకటించి విడుదలై మన జీవితాల్లోకి వెళదాం

మూర్తి ఆశ్చర్యంగా శారద వంక చూశాడు.

“ఆ పని చేస్తే ఇక శాశ్వతంగా పార్టీకి దూరమైనట్లే, పార్టీకి దూరమై నువ్వు బతకగలవా?’

పార్టీ ఎప్పటికైనా ఇదంతా తప్పని గ్రహిస్తుందని నాకు నమ్మకం ఉంది. సమయం పట్టవచ్చు. కానీ గ్రహిస్తుంది. అప్పడు మనం, పార్టీ ఒకటవుతాం. ఈ లోపల డాక్టర్ అవసరం బెజవాడకు ఎంతైనా ఉంది. రంగనాయకమ్మ గారు చనిపోయారని చెప్పానుగా. ఆమే, నేనూ ఇద్దరం లేకపోతే ఆడవాళ్ళకు చాలా కష్టం. ఒకవైపు మన యువకులంతా చచ్చిపోతున్నారు. ఇంకోవైపు ఆడవాళ్ళు నేను లేనందువల్ల చచ్చిపోతారనుకుంటే చాలా కష్టంగా ఉంది నా మనసుకి. నాకు ప్రాణాలు నిలబెట్టటం అనేదే కర్తవ్యం అనిపిస్తుంది.

నిజానికి ఇవాళ మనం కమ్యూనిస్టులుగా చేయాల్సిందెంతో ఉంది. నిజమే – ఆ పని చేస్తుంటే ప్రభుత్వమే నిర్బంధం విధించింది, దాన్ని మనం వేరే రకంగా ఎదిరించి ఉంటే ఇంత నష్టం తప్పేదని గట్టిగా అనిపిస్తుంది. ప్రజాభిప్రాయాన్ని కూడగట్టాలి నిర్బంధానికి వ్యతిరేకంగా – డానికి సృజనాత్మకత వ్యూహాలు రచించుకోవాల్సింది. అది కాకుండా “కంటికి కన్ను పంటికి పన్ను అంటే ఇప్పడేమయింది. మన వేలితో మన కన్నే పొడుచుకున్నట్లయింది. అంతా చీకటయిపోయింది,

ఒక చిన వెంకట్రాయుడు తయారవ్వాలంటే, ఒక చలసాని శ్రీనివాసరావు, వాసుదేవరావు, ఒక జగన్నాధరావు తయారవ్వాలంటే అది మామూలు విషయమా? అలాంటివాళ్ళు వందలు పోయారు. వాళ్ళు బతికుంటే మార్చేవాళ్ళు సమాజాన్ని – మనం ఊహించలేనట్లు – ఇప్పటికైనా మనం బహిరంగంగా ఇది తప్పని చెబితే మన వెనక వచ్చే వాళ్ళుంటారేమో, కొందరైనా మిగులుతారేమో.

మూర్తీ – నేను నిర్ణయించుకున్నాను. నీ సంగతి తేల్చుకో”

మూర్తికి కూడా మనసులో అదే ఉంది. ఈ జైలు జీవితంలో అర్థం පීඨාදිංයි. తన అంగీకారాన్ని తెలిపాడు.

శారద మూర్తి చేతులను తన చేతుల్లోకి తీసుకుంది.

“ఇక మన జీవితాలు కొన్నేళ్ళ పాటు చాలా మారతాయి. కానీ మూర్తీ నేను కమ్యూనిస్టుని, పార్టీకి దూరమైనా కమ్యూనిస్టులాగే జీవిస్తాను. నాకు నమ్మకముంది పార్టీ మళ్ళీ మనల్ని కలుపుకుంటుంది. ఈ వెలి తప్పని తెలుసుకుంటుంది”.

శారద కళ్ళల్లో మెల్లిగా నిరాశ తొలిగి ఆశ పాకుతోంది. కొన్నాళ్ళుగా నవ్వటం మర్చిపోయిన ఆమె పెదవుల మీద అతి సన్నని చిరునవ్వు మొలకెత్తింది,

*****

బెజవాడకు ఒంటరిగా తిరిగి వచ్చింది శారద. పార్టీతో విభేదిస్తున్నానని బహిరంగంగా ప్రకటించానని శారద అనుకుంది. అది పార్టీ పరిభాషలో “అండర్టేకింగ్”, “లొంగుబాటు”. ఆ పదం ఒక మనిషి జీవితాన్ని ఎలా మార్చెయ్యగలదో శారదకు క్రమంగా అర్థమవుతూ వచ్చింది. పార్టీ ఆదేశానుసారం డాక్టరుగా ప్రాక్టీసు చేస్తూ కృష్ణాజిల్లా పార్టీ బాధ్యతలు తీసుకునేందుకు కొన్నేళ్ళక్రితం వచ్చినపుడు శారదకు ఘన స్వాగతం దొరికింది. ఇపుడు స్వాగతం దొరుకుతుందనీ, దొరకాలనీ శారద అనుకోలేదు గానీ ఇంత తిరస్కారం ఎందుకుండాలో అర్థం కాలేదు. ಇಲ್ಲ, ಅಮ್ಮಿ శిధిలావస్థలో ఉండటం చూసి శారదకు గుండె చిక్కబట్టింది, నిత్యం నలభై యాభై మంది వస్తూ పోతూ, తింటూ, పాడుతూ, ఆడుతూ హాస పరిహాసాలతో కళకళలాడే ఇల్లు. కళా కాంతీ లేక దుమ్ముకొట్టుకుపోయి ఉంది. సుబ్బమ్మ ఒక్కతే ఓపికున్నపుడు ఇంత ఒండుకు తింటోంది. ఓపిక లేనపుడు మంచినీళ్ళు తాగి పడుకుంటోంది.

ఇల్లంతా తిరిగి చూసింది శారద. చూసిన కొద్దీ పట్టుదల పెరిగింది. ఇల్లు మళ్ళీ ప్రాణం పోసుకోవాలి. దానికి తను ఈ క్షణం నుంచీ పూనుకోవాలి. సుబ్బమ్మకు శారదను చూస్తూనే ప్రాణం లేచొచ్చింది.

అమ్మకు తన చేతుల్తో అన్నం తినిపించి, తను కూడా కడుపు నిండా తిని పనిలో పడింది శారద. నలుగురు మనుషుల కోసం కబురంపితే నర్సులిద్దరూ వాళ్ళను తీసుకుని వచ్చారు. హాలు, వంటిల్లు, పడకగది మళ్ళీ మామూలు స్వరూపానికి తేవటానికి సాయంత్రం దాకా పట్టింది.

సాయంత్రం పని ఆపి ధైర్యం కూడగట్టుకుని హాస్పిటల్కి వెళ్ళింది. శారద చాలా దారుణమైన దృశ్యాన్నే ఊహించుకుంటూ వెళ్ళింది గానీ అక్కడి పరిస్థితి శారద ఊహను మించిపోయింది. సర్వం నాశనమై పోయింది, తనెంతో ప్రేమగా తీర్చిదిద్దుకున్న జీవితమంతా చిందరవందరై పోయింది. చెంపలు కన్నీళ్ళతో తడిసి ఎండిపోయాయి.

ఎక్కడ మొదలు పెట్టాలి, ఎండిన కన్నీటిని చల్లని నీళ్ళు చల్లి తుడుచుకుని కాగితాలు తీసుకుని మళ్ళీ ఆ శిథిలాలయాన్ని పునరుద్ధరించటమెలాగో అనే ప్లాను వివరంగా రాసుకుంది. కావలసిన వస్తువులు, పరికరాలు జాబితా వివరంగా రాసుకుంటుంటే సుందరమ్మ ఒక్కొక్కటీ చెబుతూ సాయపడుతోంది. రాత్రి పొద్దుబోయేదాకా ఆ పనే సరిపోయింది.

ఇదంతా చేయటానికి డబ్బు? ఎంతో సంపాదించింది డాక్టర్ గా – ఒక్కరూపాయి లేదిప్పడు. ఎప్పడు వచ్చినదప్పుడే పార్టీకీ, పార్టీ ఆఫీసనదగిన ఇల్లు నడపటానికీ ఖర్చు పెట్టేసింది. ఇప్పుడు మొదలుపెట్టటానికి వెదుకులాట తప్పదు. శారదేమిటి పార్టీ కోసం సర్వం ఇచ్చినవాళ్ళెందరో శారదలాగే అందరూ దానికి గర్వపడేవారేగాని బాధపడేవారు కాదు.

శారదకు గర్వం కూడా లేదు. అది తనది అనే ఆలోచనే తప్ప ఇంకో భావం లేదు. పార్టీ, తనూ వేరని శారద అనేకమంది సభ్యులలాగానే ఒక్క క్షణం కూడా అనుకోలేదు. వ్యవస్థాపకురాలిగా పార్టీని ఏ ఇబ్బందులూ లేకుండా నడిపించే బాధ్యత తనదనీ, దానికి తన సర్వశక్తులూ ఒడ్డాలని అనుకుంది. ప్రత్యేకంగా అనుకోవాల్సిన అవసరం లేకుండానే అది శారద రక్తంలో కలిసిపోయింది. ఇప్పడు కూడా శారదకు ఒక్క క్షణం కూడా వేరే ఆలోచన రాలేదు. డబ్బు సమకూర్చి ఆసుపత్రిని బాగుచేసుకుంటే మళ్ళీ అంతా మామూలవుతుంది – అని డబ్బు కోసం ఎవరినడగాలి, ఎలా సమకూర్చాలి అనే ప్రయత్నాలు మొదలు పెట్టింది.

రెండవ రోజు సాయంత్రం ఎండిన పూల మొక్కలు పీకేసి, గడ్డీ గాదాన్ని ఏరేసి నేలంతా మళ్ళీ విత్తనాలు చల్లటానికి సిద్ధం చేస్తుండగా సరస్వతి వచ్చింది.

శారద కు మట్టి చేతులను కడుక్కునే వ్యవధానం కూడా ఇవ్వకుండా కౌగిలించుకుంది. శారద చాలా నెలల తర్వాత గలగలా నవ్వింది.

సరస్వతి కళ్ళు తుడుచుకుంటూ “ఇప్పట్లో నిన్ను చూస్తాననుకోలేదు” అంటుంటే శారద ఆప్యాయంగా సరస్వతిని లోపలికి తీసుకెళ్ళింది.

ఇన్ని నెలలుగా ఒక్క స్నేహ పూరితమైన పలకరింపు లేక ఎండిపోయిన శారద మనసు మీద సరస్వతి పలకరింపు తొలకరి జల్లులా పనిచేసింది.

“పిల్లలెలా ఉన్నారోయ్. మనోరమ పెళ్ళయిన తర్వాత వాళ్ళను చూసే అవకాశం దొరకలేదు. అసలు పెళ్ళెలా జరిగిందో తెలుసుకునే వీలు లేకుండా ఈ నిర్బంధం, నిషేధాల పనులతోనే సరిపోయిందోయ్. నటాషా విశాఖ పట్నంలో ఉంటోంది. వచ్చేవారం వెళ్ళి చూసి రావాలి. ఈ సంవత్సరం మధ్యలో బడి మార్చటం ఒద్దంటున్నారు. వచ్చే సంవత్సరం ఇక్కడకు తెచ్చుకుంటాను. అమ్మ ఆరోగ్యం అసలు బాగోలేదు. లవణం, సమరం, నౌ అందరూ ఎట్లా ఉన్నారోయ్ – రేపాదివారం పిల్లలందరినీ తీసుకుని మా ఇంటికి రారాదూ – మా ఇల్లు బోసిగా ఉంటే ఏమీ బాగోలేదోయ్ – ఎలా ఉండే ఇల్లు ఎలా అయిందో చూశావుగా – ”

శారద గలగలా మాట్లాడుతుంటే సరస్వతి ఆమె చేతుల్ని ఆప్యాయంగా తన చేతుల్లోకి తీసుకుని సవరిస్తూ ఆదివారంనాడు పిల్లలందరినీ తీసుకుని వస్తానని చెప్పింది.

“నువ్వు మంచిపని చేశావు శారదా గోరా గారూ, నేనూ ఇద్దరం అదే అనుకున్నాం”.

“నేనూ అలాగే అనుకుని వచ్చేశాను. ఎంత గొప్పవాళ్ళయినా ఒకోసారి పొరపాట్లు చేస్తారోయ్ – అలాగే మా పార్టీ కూడా – కానీ దానికి చెల్లించాల్సిన మూల్యం చాలా ఎక్కువగా ఉందోయ్ – అదే బాధ తొలిచేస్తుంది. ఎలాంటివాళ్ళు చచ్చిపోతున్నారో చూశావుగా ఇద్దరూ తమకు తెలిసిన కమ్యూనిస్టులలో చనిపోయిన వారి గురించి, జైల్లో ఉన్నవారి గురించీ మాట్లాడుకోవటంలో కాలాన్ని మర్చిపోయారు. ఆ రోజు సరస్వతిని భోజనం చెయ్యకుండా పంపించే ప్రసక్తే లేదని శారద, సుబ్బమ్మ పట్టుబట్టారు. సుబ్బమ్మతో పాటు సరస్వతి కూడా వంటకు పూనుకుంటే శారద

వాళ్ళిద్దరినీ చూస్తూ గుండెలనిండా గాలి పీల్చుకుంది.

శారదకూ సరస్వతికీ క్రొసరి క్రొసరి వడ్డిస్తుంటే సుబ్బమ్మకు మళ్ళీ జీవి తం మూమూలుగా నడుస్తుందనే నమ్మకం కలిగింది.

బాగా పొద్దు బోయాక సరస్వతి కొడుకు సమరం వచ్చి తల్లిని తీసికెళ్ళాడు. ఆ రాత్రి గాఢనిద్ర పోయింది శారద.

తెల్లవారి పనులు ముగించుకుని ఆసుపత్రికి పోదామనుకుంటుంటే అన్నపూర్ణ వచ్చింది. వెనకాలే అబ్బయ్య.

శారద ఆనందానికి అవధులు లేవు. సుబ్బమ్మను అన్నపూర్ణ అపుడపుడూ వచ్చి చూస్తూనే ఉంది.

ఒకరినొకరు ఇంతకాలం తర్వాత చూసుకుంటుంటే వాళ్ళను చూడాలని కన్నీళ్ళు గబగబా కళ్ళ నుంచి బైటికురుకుతున్నాయి.

శారద జైల్లో తనతో ఎవరూ మాట్లాడని సంగతి చెప్పి బాధపడింది. “బహుశ ఇక మీరు మీ పార్టీని, ఆ మిత్రులను మర్చిపోవాలనుకుంటానండీ” అన్నాడు అబ్బయ్య.

“ఎందుకట్లా అంటున్నావు? ఇపుడు జరుగుతున్నది పొరపాటని మావాళ్ళు ఎన్నటికీ గ్రహించరా?”

“వాళ్ళు గ్రహించవచ్చు. కానీ తమకంటే ముందు గ్రహించిన వాళ్ళను వాళ్ళు క్షమించరు. అందులో మీవంటి నాయకులను అసలు క్షమించరు”.

“నువ్వు ఎంత కాంగ్రెస్ వాడివయినా మావాళ్ళనిట్గా మాట్లాడటం బాగోలేదోయ్”

“నేను కాంగ్రెస్వాడిగా, కమ్యూనిస్టు వ్యతిరేకిగా మాట్లాడటం లేదు డాక్టర్ – పార్టీ యంత్రాంగపు స్వభావాన్ని అర్ధం చేసుకుని మాట్లాడుతున్నాను.”

“పార్టీ అంటే మనుషులు కాదా? యంత్రాంగం తయారయ్యేది మనుషులతోనే గదా?”

“ఔను. కానీ పార్టీ యంత్రాంగం, నియమ నిబంధనలు, క్రమశిక్షణ ఇవి వాటిని వాడుకోదల్చుకున్నపుడు మనుషులు తమ మానవత్వాన్ని విచక్షణను, హేతుబుద్ధిని అన్నిటినీ పక్కన పడేసే అవకాశాన్ని యంత్రాంగం కల్పిస్తుంది. అది అన్ని పార్టీలకంటే కమ్యూనిస్టు పార్టీలో అధికం. ఎందుకంటే అక్కడ వారు చేసే త్యాగాలూ అధికం. అబ్బయ్య మాటల గురించి ఆలోచించటానికి ఉందనిపించింది శారదకు. జైల్లో ఉన్నపుడు శారద కూడా పార్టీ యంత్రాంగం గురించి ఆలోచించింది.

“అబ్బా – మీ రాజకీయ చర్చలు ఆపండి. దానికి చాలా సమయం ఉంది. శారదా – ఆస్పత్రి మళ్ళీ ఎప్పడు తెరుస్తావు?”

“నెల నుంచీ రెండు నెలలు పట్టొచ్చు. ముందు కొంత బాగు చేసుకుని పని మొదలు పెడతాను. నెమ్మదిగా అంతా బాగవుతుంది’.

“మూర్తిగారు రాలేదేం?”

“ఆయన జైల్లో నుంచి రేపు బైటికి వస్తాడు. వెల్లూరు నుంచి మద్రాసు వెళ్ళి ఆ కుటుంబపు మంచి చెడ్డలు చూసి వచ్చేసరికి పది పదిహేను రోజులు పట్టొచ్చు. ఎల్లుండి నేను విశాఖపట్నం వెళ్తున్నాను. నటాషాను చూసి వస్తాను.”

“తీసుకు రావా?”

“మధ్యలో బడి మార్చటం ఎందుకు? వచ్చే ఏడు ఇక్కడి బళ్ళో చేర్పిస్తా,

“అదే నయంలే. నీ ప్రాక్టీసు మీద పూర్తిగా దృష్టి పెట్టి మళ్ళీ పుంజుకోటానికి బాగా కష్టపడాలి”.

“ఔను. డాక్టరమ్మ ఇంకెక్కడికీ పోదనే నమ్మకం కలగాలి” నవ్వింది శారద. అబ్బయ్య బెజవాడలో తన స్నేహితులను కలిసి వస్తానని వెళ్ళాడు.

అన్నపూర్ణ సుబ్బమ్మకు వంటలో సాయం చేస్తానంటే శారద ఆసుపత్రికి వెళ్ళింది.

ఆ రోజంతా ఉండి మర్నాడు ఉదయం గుంటూరు వెళ్ళిపోయారు అన్నపూర్ణ అబ్బయ్యలు.

నెమ్మదిగా అన్నీ స్వాధీనంలోకి వస్తున్నాయి శారదకు, డబ్బు అప్పగా దొరికింది. ఆస్పత్రికి ఒకొక్కటీ సమకూరుతున్నాయి.

శారద సాయంత్రాలు ఇంటింటికీ వెళ్ళి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉందీ కనుకుని, అవసరమైన వైద్యం చేసి వస్తోంది. ఒకసారి శారదను చూసి, వైద్య సహాయం పొందినవాళ్ళు ఆమెను మర్చిపోలేరు. వాళ్ళకు బోలెడంత ధైర్యం శారదను చూస్తే. మెల్లిగా ఆస్పత్రికి వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. పది, పదిహేను రోజుల్లో వస్తాడనుకున్నమూర్తి నెలరోజులకు గానీ రాలేదు. మద్రాసులో ఉండవలసి వచ్చిందని మూర్తి చెబితే శారద విని ఊరుకుంది. దేనిని ఎవరినీ ప్రశ్నించకుండా తన పనిలో మునిగిపోతేనే శాంతిగా ఉంటోంది.

మధ్యాహ్నం రెండు గంటల వరకూ పేషెంట్లు వస్తూనే ఉన్నారు. సంక్రాంతి పండగ వెళ్ళిన దగ్గరనుంచీ మామూలుగా డాక్టర్ల దగ్గర రద్దీ పెరుగుతుంది. శారద దగ్గిర మరింత పెరిగింది. చివరి పేషెంటుని చూసి పంపించి ఇంటికి వెళ్ళటానికి లేచింది. లక్ష్మి మెల్లిగా దగ్గరకు వచ్చి ఏదో చెప్పాలన్నట్లు నిలబడింది.

“ఏంటి లక్ష్మీ డబ్బేమైనా కావాలా?

“కాదు డాక్టర్ గారూ – ఇవాళ సాయంత్రం నేను రాను. మీరేమి అనుకోకపోతే నాలుగు రోజులు శలవు తీసుకుంటాను.”

“ఎందుకు? ఎక్కడికి వెళ్తావు?” కుతూహలంగా అడిగింది శారద. “చలం గారింటికమ్మా వాళ్ళు ఊరొదిలి వెళ్ళిపోతున్నారంట. నాలుగు రోజులు వాళ్ళకు సాయంగా ఉండొస్తాను.”

శారద లక్ష్మి ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. డాక్టర్ రంగనాయకమ్మ శారద జైల్లో ఉండగా చనిపోయారు. శారద విడుదలై వచ్చాక వెళ్ళి చలంగారిని, పిల్లలను పరామర్శించి రావాలని అనుకుంటూనే ఉంది. మొదటి రెండు నెలలూ ఆస్పత్రిని బాగు చేసుకోవటంలో అన్నీ మర్చిపోయింది. తర్వాత వెళ్దాం వెళ్దాం అనుకుంటూనే రోజులు గడిపేసింది. వెళ్ళి వాళ్ళ బాధను చూడగలిగే ధైర్యం లేకపోయిందా? ఇంత ఆలస్యం చేశానేమిటి? అనుకుంటూ

“ఎక్కడికి వెళ్తున్నారట?”

“తిరువణామలై వెళ్తారటమ్మా” అంది లక్ష్మి

“సరే నేనూ వస్తాను సాయంత్రం. నువ్వెళ్ళు. వెళ్ళి వాళ్ళకు కావలసినన్ని రోజులు అక్కడ ఉండు. ఇక్కడ పనుల గురించి మేం చూసుకుంటాంలే ఏం మంగమ్మా – చూసుకోలేమా?”

మంగమ్మ నవ్వి “ఎందుకు చూసుకోలేం. వెళ్ళి రా లక్ష్మీ” అంది. సాయంత్రం ఐదుగంటలకు తనకు తోచిన పళ్ళూ ఫలహారాలూ పట్టుకుని చలం గారింటికి వెళ్ళింది శారద.

చలంగారొక్కరే వరండాలో కూర్చుని ఉన్నారు. వాతావరణమంతా నిశ్శబ్దంగా ఉంది. శారద వెళ్ళి దూరంగా ఉన్న కుర్చీని ఆయనకు దగ్గరగా లాగి కూర్చుంది.

ఆయన చిరునవ్వు నవ్వి “డాక్టరు గారు లేరుగా” అన్నారు. శారదకు దు:ఖం ముంచుకొచ్చింది. దానిని నిర్ధాక్షిణ్యంగా వెనక్కి నెట్టి “అప్పడు నేను జైల్లో ఉన్నాను” అంది అంతకంటే ఏమనాలో తెలియక,

“నేనూ జైల్లోనే ఉన్నాను” అన్నారు చలం.

శారద అదేమిటన్నట్టు చూసింది.

“మీరంతా ఉన్న జైలు కాదు. ఇంకో జైలు. ఈ ప్రభుత్వాలు కట్టించినవే జైళ్ళనుకుంటారు. చాలా జైళ్ళన్నాయి. డాక్టరుగారు ఏ జైలుకీ దొరకుండా తప్పించుకుని పోయారు” మళ్ళీ చిన్నగా నవ్వి

“కమ్యూనిస్టులందర్నీ చంపేస్తున్నారటగా. నాకూ కమ్యూనిస్టవాలనుంది. ఎట్లాగో చెప్తావా?”

శారద మాట్లాడలేదు కాసేపు.

“మీరు తిరువణామలై వెళ్తున్నారట”.

“ఔను, రమణ మహర్షి పిలుస్తున్నారు రమ్మని. అందరం వెళ్తున్నాం. ఈ ఆంధ్రదేశంలో ఉండలేను నేనిక”.

“మళ్ళీ ఎప్పడొస్తారు?” “నేనా? నేనిక ఈ దేశం రాను. ఏముందిక్కడ? ఎవరున్నారు?”

“అక్కడ మాత్రం ఎవరున్నారు? ఆశ్రమంలో ఆ నియమాల్లో మీరుండలేరు”.

అక్కడ ఎవరూ లేరనేగా వెళ్ళేది. నేను ఆశ్రమంలో ఉంటానని మీరెందుకనుకున్నారు?”

“స్త్రీల విషయంలో అంత హేతుబద్ధంగా ఆలోచించే మీరు రమణమహర్షి ఫిలాసఫీనెలా అంగీకరిస్తారు?”

“భగవాన్ గురించి మీకు తెలియదు. ఆయన చూపే హేతువుని మీరు అంగీకరించరు కాబట్టి అది హేతుబద్ధం కాదంటారు. నాకు ఆయన అర్థమవుతాడు.

మీకు అర్థం కాడు. మనం మాట్లాడుకోవటం ఎందుకు?”

“మీరు లేని బెజవాడ – ”

“బెజవాడకు నేను తగను. ఐనా పాపం ఇన్నాళ్ళు భరించింది. నిజానికి నీకూ ఇది తగినది కాదు. ఇద్దరం ఇరుకుపోయాం. నేను తప్పించుకుని పోతున్నాను. నువ్వు తప్పించుకోలేవు. నీకు రాజకీయాలు కావాలి గదా”

“రాజకీయాలు అందరికీ కావాలి”.

“అందరినీ అలా అనుకోనివ్వండి, మీరు కొందరే ఎందుకు ఆక్రమించుకుంటారు” శారదకు ఆ సంభాషణ కొనసాగించాలనిపించలేదు.

“డాక్టర్ గారి గురించి చెప్పండి”

“గొప్ప మనిషి ఉన్నతం ఆమె. ఆమెకు మీరంటే ఇష్టం. చెబుతుండేది మీ గురించి” శారద ముఖంలో విషాదం చూసి,

“బాధపడవద్దు ఆమె కోసం, మన కోసం మనం బాధలు పడక తప్పదు. ఆమె గురించి ఇంకా మాట్లాడాలంటే లోపలికి వెళ్తే  వాళ్ళూ ఉన్నారు.”

శారద ఆ మాటల అర్థం గ్రహించి లేచి లోపలికి వెళ్ళింది. ఇల్లంతా ప్రయాణానికి సిద్ధమవుతున్నట్లుగా ఉంది. ఏవో మూటలు, పెట్టెలు ముందు పెట్టుకుని కూర్చున్నారు పౌ, నర్తకి.

శారదకు వాళ్ళతో అంత పరిచయం లేదు. వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుంది. పౌ డాక్టర్ రంగనాయకమ్మ చివరి ప్రయాణం గురించి చెప్పింది.

“నాన్నకు పెద్ద దెబ్బ తగిలినట్లయింది. అందుకే భగవాన్ దగ్గరకు వెళ్తున్నాం” అంది. వాళ్ళిద్దరినీ చూస్తే చలంగారి గురించి దిగులు పడనవసరం లేదనిపించింది.

వీళ్ళ ప్రేమ ఆయన్ని కాపాడుతుంది అనిపించింది. కానీ వీళ్ళేం చేస్తారు అక్కడ? ఆ ప్రశ్నకు సమాధానం కాలం చెప్పాల్సిందే. కాసేపు ఆ మాటా, ఈ మాటా మాట్లాడి, ఏం కావాలన్నా తనకు లక్ష్మితో కబురు చెయ్యమని చెప్పి బైటికి వచ్చింది.

చలంగారు అలాగే కూచుని ఉన్నారు శూన్యంలోకి చూస్తూ, ఆయనకు నమస్కారం చేసింది. చిరునవ్వే సమాధానం, వీడ్కోలు కూడా.

వేసవి శలవులకు నటాషా బెజవాడ వచ్చింది. ఎదిగే వయసులో తల్లికి దూరంగా ఉండటం వల్లనేమో నటాషాకు శారద దగ్గర అంత చనువు లేదు. శారదక్షిప్పుడు క్షణం తీరిక లేదు. ప్రాక్టీసు విపరీతంగా పెరిగింది. సాయంత్రం తనే ఇళ్ళకు వెళ్ళి వైద్యం చేయటం మానకపోవటంతో రాత్రిళ్ళు కూడా ఆలస్యం అవుతోంది. కాన్పు కేసులుంటే రాత్రంతా ఆస్పత్రిలో గడిపేస్తోంది. మూర్తి మళ్ళీ ప్రాక్టీసు పెడదామా అని ఆలోచిస్తున్నాడు, శారదకు చాలా ఇష్టమైన రాజమ్మ, కోటేశ్వరమ్మ, సూర్యావతి అందరూ జైలు నుంచి విడుదలై అట్నించి అటే అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఎవరైనా వస్తారేమో అని ఎదురుచూడటం మానలేదు శారద, తనతో కలిసి పనిచేసిన వారి మరణ వార్తలు విన్నరోజు ఏ పనీ చెయ్యలేని నిస్సత్తువ కమ్ముతుంది.

“ఎందుకు ఆపరు ఈ పోరాటాన్ని?” సమాధానం చెప్పేవాళ్ళు లేరు. రామస్వామి తనలాగే పార్టీతో విబేధిస్తున్నానని చెప్పి జైలునుంచి విడుదలయ్యాడు. ఆయనను పార్టీ బహిష్కరించిందని చెప్పి బాధపడ్డాడు. విబేధాలున్నపుడు చెప్పకుండా ఎట్లా? నేను రహస్య సమాచారాలేమీ చెప్పలేదే నన్ను ఇట్లా చెయ్యటం ఏమిటి అని ఆయన దుఃఖిస్తుంటే “ఒకసారి ఇదంతా ముగిశాక మనందరం మళ్ళీ పార్టీలో పనిచేస్తాం. బాధ పడకండి” అని ధైర్యం చెప్పింది.

ఒకరోజు మూర్తి ఒక వార్తతో వచ్చాడు.

“మనవాళ్ళు రష్యా వెళ్ళారట”.

“ఎందుకు?” ఆశ్చర్యపోయింది శారద.

“స్టాలిన్తో మాట్లాడి అ ప్పుడు తేల్చుకుంటారట పోరాట విరమణ చెయ్యాలా లేదా అని”

శారద నిర్ధాంతపోయింది. “స్టాలిన్కెలా తెలుస్తుంది. పోరాటం మొదలుపెట్టి, నిండా దానిలో మునిగి, దానిని

నడిపిస్తున్న వీళ్ళకు తెలియనిది స్టాలిన్కెలా తెలుస్తుంది?”

“ఏమో – వెళ్ళిన మాట మాత్రం నిజం”,

“నాకు నమ్మాలనిపించటం లేదు. ఇదంతా ప్రభుత్వ ప్రచారమేమో”. “కాదు శారదా, నాకు నమ్మకంగా తెలిసింది. స్టాలిన్ ఏం చెబుతాడో ఏంటో?”

‘అది పోరాటం గురించి వీళ్ళు చెప్పే దాని మీదనే ఆధారపడుతుంది. ఆయన ఇక్కడి వార్తలను రోజూ చదివి, పోరాటాన్ని అధ్యయనం చేసేంత తీరికగా ఉన్నాడా? యుద్ధం ముగిసిన తర్వాత దేశ నిర్మాణంలో మునిగి ఉండడూ? ఆయన ఏం చెబితే అది చేస్తారా? నవ్వాలా? ఏడవాలా? తెలియటం లేదు. శారదకు కోపంగా ఉంది. బాధగా ఉంది. నిజంగా ఏడవాలని ఉంది. అన్ని ఉద్వేగాలనూ అణుచుకుని తన పనిలో తను మునిగిపోయింది. కొద్దికాలంలోనే పోరాట విరమణ గురించిన ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన రావటంతో శారదకు కాస్త తెరిపి చిక్కినట్లయింది. నెమ్మదిగా పరిస్థితి చక్కబడుతుంది. అజ్ఞాతంలో ఉన్న కామైడ్స్ తిరిగి వస్తారు. జైళ్ళలో ఉన్నవారు విడుదలవుతారు. మళ్ళీ ఒక అంతర్గత చర్చ మొదలవుతుంది. సంవత్సరంలో పరిస్థితి చక్కబడి మళ్ళీ పార్టీలో పనిచేయవచ్చు అనుకుంటే ఒక వంక ఆనందం మరో వంక దు:ఖం. అమ్మా అంటూ వచ్చిన నటాషాను దగ్గరగా తీసుకుని రెండు చెంపలూ ముద్దు పెట్టుకుంది. నటాషా అడిగిన వాటికన్నీ ఒప్పకుంది. మూర్తి కోసం ఎదురుచూస్తూ కూర్చుంది.

* : * :

శారద అనుకున్న సంవత్సరం గడిచింది గానీ, మిత్రులెవరూ కలవలేదు. శారదను మూర్తిని చర్చలకో మీటింగులకో పిలవలేదు. అజ్ఞాతం నుండి తిరిగొచ్చిన వాళ్ళు కూడా శారదతో మాట్లాడేందుకు రాలేదు. పార్టీ విధానాన్ని తప్పుబట్టిన చాలామందిని ఆత్మ విమర్శ చేసుకోమని తిరిగి పార్టీలో చేర్చుకున్నారు. శారద విషయంలో అలా జరగలేదు. రామస్వామి గారిని కూడా చేరమన్నారనీ ఆయన తన ఆత్మాభిమానానికి దెబ్బ తగిలిందని తిరిగి పార్టీలోకి వెళ్ళలేదని తెలిసింది.

కొన్ని రోజుల తర్వాత ఆయనే స్వయంగా వచ్చాడు. రామస్వామికి శారదంటే చాలా అభిమానం, గౌరవం. ఆయన తన నిర్ణయూన్ని శారదకు వివరించాలనుకున్నాడు.

శారద ఆయన చెప్పింది విని ఆయన చేసింది సరైనదైనని గట్టిగా చెప్పింది. “మీరు మీ నిర్ణయం స్వతంత్రంగా తీసుకున్నారు. దానితో తప్పేమీ లేదు. మీలాంటి వాళ్ళను పోగొట్టుకున్న పార్టీ నష్టపోతుంది”.

“మీలాంటి వాళ్ళను పోగొట్టుకోలేదా? మీ విలువ తెలుసుకోలేదు గదా”

“వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉండి ఉంటాయి” పేలవంగా నవ్వింది శారద.

“మీ వృత్తి మీద మీరు కేంద్రీకరించండి. అది తక్కువ ప్రజాసేవ కాదు.”

‘అది నేనెప్పడూ ఆపలేదు. ఇప్పడు మరింత సమయం దొరికింది. మరింత పని పెంచుకోకపోతే నేను బతకలేను” జైళ్ళలో ఉన్నవారి గురించీ, చనిపోయిన వారి గురించీ మాట్లాడుకుంటుంటే కాలమే తెలియలేదు.

శారదకు ప్రసూతి కేసు ఉందని కబురొచ్చింది. రామస్వామి గారికి వీడ్కోలు చెప్పి శారద ఆస్పత్రికి వెళ్ళింది.

:* ::: *** ***

1952 జనవరిలో ఎన్నికలనే నోటిస్ వచ్చింది. రాజకీయ పార్టీలన్నీ రంగంలోకి దిగాయి. కమ్యూనిస్టులకు పోరాట విరమణ చేశామనే నిస్పృహ లేకుండా ఎన్నికలలో గెలిచి తమకు ప్రజాబలం ఉందని నిరూపించుకోవాలనే ఉత్సాహం పెరిగింది.

కాంగ్రెస్ లో గ్రూపులు ఎక్కువైపోయాయి. ప్రకాశంగారు నిండా సంవత్సరం పని చేశాడో లేదో ఆయనను దించి ఒమండూరు రామస్వామి రెడ్డియారుని ముఖ్యమంత్రిని చేసేవరకూ కామరాజ్ నిద్రపోలేదు. వాళ్ళిద్దరికీ కూడా సంవత్సరం కన్నా పొసగలేదు. కాంగ్రెస్ పార్టీ లోపలే ఆయన మీద విశ్వాస రాహిత్య తీర్మానం పెట్టి నెగ్గించి కుమారస్వామి రాజాను ముఖ్యమంత్రిని చేశారు. ఆ మంత్రి వర్గం మీద ప్రజలకు అసలు విశ్వాసం లేకుండా పోయింది. దాంతో కాంగ్రెస్ వాళ్ళు చాలా రకాల ప్రయత్నాలు చెయ్యందే గెలవలేమనుకున్నారు. ఆంధ్ర ప్రాంతంలో ప్రజలలో కమ్యూనిస్టుల మీద చాలా సానుభూతి వచ్చింది. పైగా 1952లో మొదటిసారిగా రైతు కూలీలు హరిజనులు ఓటర్లయ్యారు. జమిందార్లకు, ధనిక రైతులకు వ్యతిరేకంగా పనిచేసే కమ్యూనిస్టులంటే వారికి అభిమానం ఉండటంలో ఆశ్చర్యం లేదు. గెలవటానికి కావలసిన ప్రచార దళాలు, సాహిత్యం, అన్నీ సమరోత్సాహంతో నిండి ఉన్నాయి. శారద ఎన్నికలను దూరం నుంచి చూస్తూ తన దగ్గరకు వచ్చేవారిలో కొందరికి ప్రత్యక్షంగా మరికొందరికి పరోక్షంగా కమ్యూనిస్టులకు ఓటెయ్యమని చెబుతూ వైద్యం మీద మనసు లగ్నం చేసింది. నటాషా చదువు ఉండనే ఉంది. ఏ కొంచెం సమయం దొరికినా నటాషాతో ఆటలు పాటలు చదువులు వీటితో ఆనందంగానే ఉంటోంది. మూర్తి అసంతృప్తిగా ఉండటం శారదకు తెలుస్తూనే ఉంది. అతనికిప్పడు పని లేదు. పార్టీ కోసం మద్రాసులో ఉన్న కాస్త ప్రాక్టీసు ఒదులుకుని బెజవాడ వచ్చేశాడు. ఇప్పుడు పార్టీ పని లేదు. మళ్ళీ మద్రాసు ప్రాక్టీసంటే – ఒకవైపు ఆంధ్ర రాష్ట్రం కావాలనే ఉద్యమం ఊపందుకుంది. తీరా మద్రాసులో

కోర్టు కెళ్ళటం మొదలు పెట్టగానే హైకోర్టు బెజవాడకే రావొచ్చు మరింకెక్కడికైనా రావొచ్చు. అప్పడు మళ్ళీ కథ మొదట్నించీ మొదలుపెట్టాలి. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరూ ఇవ్వగలిగినవి కావు. పుస్తక పఠనంతో ఎంత కాలం గడపాలా అని మధన పడటం శారద గమనించింది. అందువల్లే అతను మద్రాసు తరచు వెళ్తున్నా అతని పరిస్థితి అర్ధం చేసుకుంది. మూర్తికి బెజవాడలో కంటే మద్రాసులో స్నేహితులెక్కువ. వృత్తిపరమైన చర్చలకు కూడా అదే అనువైన ప్రదేశం. “నాకీ ప్రాక్టీసు లేకపోతే ఏమయ్యేదాన్ని పిచ్చెక్కిపోయేది. పాపం మూర్తి” అని అతనికి తన సహకారం పూర్తిగా ఇచ్చింది.

దుర్గాబాయి ఎన్నికలలో పోటీ చేస్తుందంటే శారదకు చాలా సంతోషమనిపించింది. దుర్గ గెలిచి కేంద్రంలో మంత్రయితే దేశానికి చాలా మేలు జరుగుతుందని అనేకమంది లానే శారదా ఆశపడింది. దుర్గ ఎన్నికల ప్రచారంలో తాను కూడా పాల్గొందామంటే దుర్గకు పోటీగా కమ్యూనిస్టు పార్టీ తన అభ్యర్థిగా కంతేటి మోహనరావుని నిలబెట్టింది. కమ్యూనిస్టుకి వ్యతిరేకంగా ప్రచారం చెయ్యలేననిపించింది శారదకు, దుర్గ గురించి రాజమండ్రిలో ఎవరు చేసే ప్రచారం మాత్రం ఏముంటుంది. రాజమండ్రిలో ఎన్ని చైతన్య దీపాలు వెలిగించింది దుర్గ, అక్కడికి తను వెళ్ళి దుర్గను గురించి మాట్లాడటం అనవసరం అనుకుంది. రాజమండ్రిలో దుర్గ గెలవకపోతే మరింకెవరు గెలుస్తారు. ఈ ఆలోచనలతోనే దుర్గకు తన అభినందనలు తెలుపుతూ ఉత్తరం రాసింది.

అన్నపూర్ణ రాజమండ్రిలో ప్రచారానికి సిద్ధమై వచ్చింది.

దుర్గాబాయి గారితో నీకున్నంత స్నేహం నాకు లేదుగదా. కాస్త రికమెండేషన్ లెటర్ సిఫారసు చేస్తూ ఉత్తరం ఇస్తావేమోనని వచ్చాను” అంది నవ్వుతూ,

“నువ్వూ పోటీ చెయ్యాల్సింది అన్నపూర్ణా అంది శారద, అన్నపూర్ణ విరగబడి నవ్వింది. నవ్వి నవ్వి ఆయాసపడి ఆగి

“ఎన్నికలంటే ఏంటనుకున్నావు? డబ్బు, పెద్ద నాయకుల అండ ఇవన్నీ కావాలి.”

“దుర్గాబాయి డబ్బు ఖర్చు చెయ్యనవసరం లేదు. ప్రజలు ఆమె పేరు చూసి ఓటేస్తారు కదూ – ఆమె అంటే రాజమండ్రి ప్రజలకు కన్న కూతురు లాంటిది, తోడబుట్టిన చెల్లెలివంటిది. ఎన్ని పనులు చేసింది. ముఖ్యం రాజ్యాంగ సభ సభ్యురాలిగా నెగ్గుకు వచ్చింది.”

“నాకూ చాలా గౌరవం. అందుకే ఎన్నికల వరకూ రాజమండ్రిలో ఉండి దుర్గాబాయమ్మ గారికి కావాల్సిన సహకారం అందించి వద్దామని బయల్దేరా”.

“అవసరమైతే నాకూ కబురు చెయ్యవోయ్ నేనూ వస్తానోయ్”,

“అంత అవసరం రాదు. ఒక కమ్యూనిస్టు మీద పోటీ చేస్తున్న దుర్గాబాయి తరపున మరొక కమ్యూనిస్టు ప్రచారం చేయటం వింతగానే ఉంటుందనుకో – నవ్వింది అనుపూర్ణ

శారద కూడా నవ్వింది. ఆ నవ్వులో కొంచెం విషాదం కలగలిసింది.

“బాధపడకు శారదా – ”

“బాధ లేకుండా ఉండడోయ్. దాదాపు పాతికేళ్ళు ఊపిరిగా పీల్చుకున్న విశ్వాసాలు, పెంచుకున్న ఆశయాలు ఎలా తుడిచివేయగలం? ఒక్కోరోజు రాత్రి అంతా గుర్తొచ్చి గుండె నీరయిపోతుంది. అందరూ గుర్తొస్తారు. అసలేమీ అర్థం కానట్లుంటుంది. ఎందుకిలా ఎందుకిలా అని పిచ్చిగా ప్రశ్నిస్తాను. కానీ సమాధానం చెప్పేదెవరు? కాలం ఒకటే – కాలం చెప్పింది. నేననుకున్నది సరైనదని. పోరాట విరమణ చెయ్యాలని అందరూ అనుకున్నారు. చేశారు. అదే మాట వాళ్ళకంటే ముందు చెప్పటం నేరమెలా అవుతుందో దానిని వాళ్ళెలా సమర్ధించుకుంటున్నారో నాకు తెలియదు. సరే – పోనీ – నేను ఒక కమ్యూనిస్టుగానే జీవిస్తున్నాను. సభ్యత్వం పార్టీలో లేదేమో. కానీ ఆ విలువలు, పాటించే వారిలో నేనూ సభ్యురాలినే, సహచారినే. నడుస్తూనే ఉంటాను. నడక ఆపకపోవటం ముఖ్యం. నడకే ముఖ్యం. ప్రయాణమే అసలు విషయం. సారాంశం” ఆవేశంగా మాట్లాడుతున్న శారద చేతులను ఆప్యాయంగా తన చేతుల్లోకి తీసుకుంది అన్నపూర్ణ

“సాయంత్రం రైలుకి మా అమ్మాయి స్వరాజ్యం వస్తుంది శారదా. ఈ నెల రోజులూ నీతో ఉంటుంది.

“ఔనా – మరి చెప్పవేం ఇంతసేపూ. స్వరాజ్యం వస్తే ఇల్లు కళకళలాడుతోంది. నటాషాకూ బాగుంటుంది”.

“మన స్నేహం పిల్లలకు అర్థం కావాలనే స్వరాజ్యాన్ని బతిమాలి ఒప్పించాను. గుంటూరు ఒదిలి ఎక్కడికీ వెళ్ళదు. శారదానికేతన్లో పాఠాలు చెబుతుంది గదా – అదే కాలక్షేపం, పెళ్ళి చేసుకోమంటే ఒద్దంటుంది. వచ్చే ఏడు విశాఖపట్నం పంపి ఎమ్మే అన్నా చదివించాలంటున్నాడు వాళ్ళ నాన్న

“ఔ నోయ్. బియ్యేతో ఆపటం ఏంటి? అవకాశాలు లేని వాళ్ళు లేక చదవటం లేదు. స్వరాజ్యం చదవక పోవటమేమిటి?”

“అది చదువుతాననే అంది – పోయినేడాది చేరవలసింది. సరిగ్గా అదే సమయానికి ఆరోగ్యం పాడయి సంవత్సరం వృధా అయింది. పెళ్ళి – ?”

“అన్నపూర్ణా – నువ్వు కూడా పెళ్ళంటావేమిటోయ్ – హాయిగా చదువుకుని ఉద్యోగంలో చేరి అప్పడాలోచించవచ్చులే — ” అన్నపూర్ణ కూతురు తన దగ్గర నెల రోజులుంటుందంటే శారదకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది.

ఆ రాత్రి కూతురిని శారదకప్పగించి రాజమండ్రి రైలెక్కింది అన్నపూర్ణ, శారదంటే స్వరాజ్యానికి ఇంతకు ముందు గౌరవంతో పాటు భయం కూడా ఉండేది. ఆ భయంతోనే తల్లి రమ్మంటే వెంటనే ఒప్పకోలేదు. ఇరవై ఏళ్ళ స్వరాజ్యం శారదను చాలా తక్కువసార్లే చూసింది. చూసినపుడు శారద చొరవ, ఠీవి, ఎవరితోనైనా సూటిగా మాట్లాడే తీరూ ఇవన్నీ స్వరాజ్యానికి కొంత బెరుకు కలిగించాయి, అదంతా రెండు రోజుల్లో పోయేలా చేసింది శారద. స్వరాజ్యం శారదను పెద్దమ్మా అని పిలవటం మొదలుపెట్టింది. నటాషా అక్కా అక్కాఅంటూ స్వరాజ్యాన్ని ఒదలటం లేదు. ఇద్దరికీ పదకొండేళ్ళ తేడా. స్వరాజ్యం వెనకాలే తిరుగుతూ ఏవో కబుర్లు చెప్పటం అలవాటయింది నటాషాకు. శారద దగ్గరున్న పుస్తకాలు స్వరాజ్యానికి ప్రధానాహారం, చిరు తిండి కూడా అయిపోయాయి. సుబ్బమ్మగారు “ఈ స్వరాజ్యం చూడు. అన్నం తింటూ కూడా పుస్తకం వదలదు” అని చెప్తే “భేష్ అని మెచ్చుకున్నారు మూర్తి, శారదలు.

అబ్బయ్య దగ్గర ఇన్ని పుస్తకాలు, ఇంత వైవిధ్యమైన సాహిత్యం లేదు. ముఖ్యంగా ఆంగ్ల సాహిత్యం ఇంత లేదు. స్వరాజ్యం ఆ పుస్తకాల మీద పడింది.

మూర్తి రోజూ కాసేపు ఎవరో ఒక రచయిత గురించి స్వరాజ్యానికి చెప్తున్నాడు.

ఆ రోజు శారద పెందలాడే హాస్పిటల్ నుండి వచ్చింది. వరండాలో చల్లగాలి వీస్తోంది. అక్కడ కూర్చుని మూర్తి షేక్స్పియర్ నాటకాల గురించి స్వరాజ్యానికి చెబుతుండగా శారద వచ్చింది. తనూ కాసేపు వింటూ కూచుని పైకి వెళ్ళి హామ్లెట్ పుస్తకం తెచ్చింది,

“హామ్లెట్ గురించి అంత చెప్పాము. కాస్త చదివి రుచి చూపిద్దామోయ్ మనమ్మాయికి. మనం చదివి కూడా చాలా రోజులయింది కదా” మూర్తి ముఖం వికసించింది. అది వరకు ఎంత ఒత్తిడి పనిలోనూ కాసేపయినా కలిసి ఒక పుస్తకంలో కొన్ని పేజీలైనా చదివేవారు. కలిసి ఒక పాటైనా పాడుకునేవారు. రెండేళ్ళుగా స్తబ్దత – ఏ పని మీద ఆసక్తి లేకుండా ఎవరి పని వారిదన్నట్లు బతుకుతున్నారేమో స్వరాజ్యం పుణ్యమా అని మళ్ళీ సాహిత్యం వారి మనుగడలోకి వచ్చింది.

ఒఫీలియా, హామ్లెట్ ల సంభాషణలున్న భాగం తీసి పక్కపక్కనే కూచుని భావయుక్తంగా నాటకంలా చదువుతుంటే స్వరాజ్యానికి ఆశ్చర్యంగా ఆనందంగా అనిపించింది. వాళ్ళిద్దరూ ఆ పిల్లకు మానవమాత్రులుగా కనిపించలేదు. ఆ రాత్రివేళ హామ్లెట్ ఒఫీలియాలు నిజంగానే మాట్లాడుకుంటుంటే తను వింటున్నాననిపించింది. ఆ ఘట్టం చదివాక మూర్తి హామ్లెట్ సోలిలోక్వి తనొకడే చదివాడు. ఆ రాత్రి అతని గంభీరమైన కంఠస్వరం హామ్లెట్ సందిగ్ధతను పలికించిన తీరుకి పులకించింది శారద.

“ఎన్నాళ్ళయిందోయ్ నువ్విలా చదివి అని అతని చేయి పట్టుకుని భుజం మీద తలవాల్చింది.”

మూర్తి కూడా వివశుడయ్యాడు.

వారిద్దరినీ వారి ఏకాంతానికి ఒదిలి స్వరాజ్యం మెల్లిగా లేచి లోపలికి వెళ్ళింది. చల్లని ఆ రాత్రి వెన్నెల వారి మనసులలోని అశాంతిని చల్లబరిచింది. ఎంతోసేపూ వారిద్దరూ అలా కూచుని వుండిపోయారు, ఇద్దరి చెంపలూ తడిసి, గాలికి ఆరిపోతూ, మళ్ళీ తడుస్తూ ఆ రాత్రి గడిచిపోయింది.

తమ తమ ఒంటరితనాల నుంచి బైటపడేసిన స్వరాజ్యాన్ని ఎంతగానో ప్రేమించారు ఇద్దరూ. స్వరాజ్యానికి వాళ్ళిద్దరంటే ఆరాధన వంటి భావన కలిగింది. ముగ్గురూ నటాషాతో కలిసి ఆడుతూ పాడుతూ రోజులు గడుపుతుంటే నెల ఎట్లా గడిచిందో తెలియనే లేదు.

మధ్యలో అన్నపూర్ణ ఉత్తరం కొంత ఆందోళన కలిగించినా శారద ఈ ఆనందంలో దాన్ని పక్కకు నెట్టింది. ఒక రోజు సరస్వతీ, గోరాలను, వాళ్ళ పిల్లలను, మెల్లీని, లక్ష్మణరావుగారిని తను ఇంటికి భోజనానికి పిలిచింది. ఆదివారం పూర్వపు సందడంత కాకపోయినా ఇల్లు పెద్దల రాజకీయ చర్చలతో పిల్లల సాహిత్య చర్చలతో నటాషా ఆటలతో గడిచిపోయింది.

అప్పటికే లక్ష్మణరావు గారు అతడు — ఆమె నవల రాయటం, అది శారద

చొరవతో ప్రచురించటం జరిగిపోయింది. ప్రచురణ బాధ్యత కూడా శారదే తీసుకుంది. ఆ నవల మీద సమీక్షలు రాలేదని లక్ష్మణరావు గారు బాధపడుతుంటే – “దానిని సమీక్షించటం అంత తేలిక కాదు. మీరు తొందరపడొద్దు. ఆంధ్రదేశం ఆ నవలను నెత్తిన పెట్టుకుంటుంది. దానికి న్యాయం చేసే విమర్శలూ వస్తాయని” శారద, సరస్వతి, మూర్తి ఓదార్చారు. మెల్లీ నవ్వుతూ తనూ అదే అనుకుంటున్నానన్నది. అందరూ స్వరాజ్యాన్ని కూచోబెట్టి అభిప్రాయం చెప్పమన్నారు. ఆ అమ్మాయి కిందటి వారమే ఆ నవల చదివింది. స్వరాజ్యం చటుక్కున “పెద్దమ్మ, పెదనాన్నలను గురించి రాసినట్టుంది” అన్నది.

అందరూ నవ్వారు.

“మరీ నేను శాస్త్రంత లౌక్యుడినా” అన్నాడు మూర్తి

“అదంతా కాదు మీరలా ప్రేమగా ఉంటారు” అంది స్వరాజ్యం సిగ్గుపడుతూ,

“వీళ్ళిద్దరూ నాకు ఇన్స్పిరేషనే – క్రాకపోతే నవలలో కల్పన పాలు ఉండాలి కదా – ” అన్నారు లక్ష్మణరావుగారు.

“మా శారద మీ శాంతం కంటే గొప్పది. రాజీపడదు” అంది సరస్వతి,

“నిజం” అంది మెల్లి.

అంతలో సాయంత్రం ఫలహారాలొచ్చాయి. చర్చ కూడా దారి మళ్ళి ఎన్నికల వైపు తిరిగింది.

“ఉండండి. అన్నపూర్ణ రాసిన ఉత్తరం చదువుతాను” అంటూ లోపలికి వెళ్ళి ఉత్తరం తెచ్చింది శారద, అందరూ ఆసక్తిగా సరుకుని కూర్చున్నారు.

ప్రియమైన శారదా –

ఇక్కడికి వచ్చి పదిహేను రోజలవుతున్నది. మొదటి వారం ఉత్సాహంగా నియోజక వర్గాన్ని చేయాల్సిన పనుల్ని తెలుసుకోటానికే సరిపోయింది. కమ్యూనిస్టు అభ్యర్థి కంతేటి మోహనరావుకి మంచి పేరే ఉంది గానీ దుర్గాబాయి పోటీ చేసినపుడు ఆమెను కాదని ప్రజలు ఇంకెవరికి ఓటేస్తారు అనుకుని చాలా ఉత్సాహంగా పనిలో పడ్డాను. కానీ వారం తిరక్కుండానే ఎన్నో లోతులు చూపించారు. ఇప్పుడు నాకు భయంగా ఉంది. దుర్గాబాయి గెలుపు అంత తేలిక కాదనిపిస్తోంది.

కేవలం కమ్యూనిస్టుల బలమే అయితే నాకు భయం ఉండేది కాదు. జయాపజయాలు దైవాధీనాలు అనుకునో, కమ్యూనిస్టులు ప్రజల్లో అంతగా పాతుకుపోయారనో అనుకుని ఉండేదాన్ని కానీ ఇక్కడ జరుగుతున్నదేమిటంటే కాంగ్రెస్ వాళ్ళే దుర్గాబాయికి ఓటెయ్యవద్దని చెబుతున్నారు. లోపల లోపల చాలా కథలు జరుగుతున్నాయి. అసలు కారణం దుర్గాబాయి ఆడది. కేవలం ఆడది మాత్రమే కాదు. అఖండ మేధా సంపత్తి, అపారమైన దేశభక్తి, అంకితభావం, నిజాయితీ, ప్రజాసేవ తప్ప ఇంకొక ధ్యాస లేకపోవటం, నెహ్రూగారికి దుర్గాబాయి గారంటే ఉన్న గౌరవం వీటన్నిటివల్లా స్థానిక కాంగ్రెస్ పెద్దలు దుర్గాబాయి ఓడిపోవాలని కోరుకుంటున్నారు. దుర్గాబాయి గెలిస్తే మంత్రి పదవి తప్పదు. నెహ్రూ గారు ఆ సంకేతాలు ఇచ్చారు. జిల్లా నుంచి ఆవిడ మంత్రయితే జిల్లాలో ఈ మగపురుషుల అవినీతి పనులను సాగనిస్తుందా? ఆవిడ నిజాయితీతో జిల్లా బాగుపడుతుంది గానీ ఈ పెద్దలు నష్టపోతారు. ప్రజలు అందరూ నేరుగా ఆమెనే కలుస్తారు. సమస్యలు చెప్పకుంటారు. సమర్థురాలైన ఆమె పరిష్కరిస్తుంది. ప్రజలు మళ్ళీ మళ్ళీ ఆమెనే ఎన్నుకుంటారు. ఆమె తనవంటి నిజాయితీ పరులతో ఒక గ్రూపు తయారు చేసుకుంటుంది, ఇప్పటి ఆషాడ భూతులకూ, అవినీతి పరులకూ ఇక భవిష్యత్తు ఉండదు. వాళ్ళు వెధవలని వాళ్ళకే తెలుసు. వాళ్ళే జిల్లాలో అధికారం కావాలనుకుంటున్నారు. దాంతో వెనకనుంచి గోతులు తవ్వుతున్నారు. ఆ ప్రచారాలు ఆ మాటలు నేను రాయదగ్గవి కాదు, మొత్తం మీద ఇవన్నీ తెలిసి నా తల తిరిగి పోయింది. కానీ ప్రజల మీద నమ్మకం పెట్టుకున్నాను. ఇద్దరు అభ్యర్ధులూ మంచివాళ్ళే. కానీ మోహనరావు గారు దుర్గాబాయమ్మ ముందు నిలవలేడు.

కానీ శారదా, ఆడవాళ్ళు ఎన్నికల రాజకీయాలలో ప్రవేశించి గెలిచి చట్టసభల్లో సగభాగమవటం ఇంకొక వందేళ్ళకయినా జరగదు. ఈ మగవాళ్ళు అలా జరగనివ్వరు. దుర్గాబాయమ్మకున్న సద్గుణాలన్నిటితో ఒక మగవాడు పోటీచేసి ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండదు. నిజంగా ఇది దారుణం. కాని వాస్తవం. ఆడవాళ్ళు ఉద్యమాల్లో జండాలు మోయ్యుటానికి, వండి వార్చటానికి, సత్యాగ్రహులకు సేవలు చెయ్యటానికి, జైళ్ళు నింపటానికి పనికొస్తారు గానీ ఎన్నికై చట్ట సభలలోకి వెళ్ళి పదవులు పొందకూడదు. హిందూకోడ్ బిల్లు మీద ఉన్నంత వ్యతిరేకత ఉంది ఆడవాళ్ళ ఎన్నికల్లో పోటీ చేయటం మీద, దుర్గాబాయి ఒకవేళ ఓడిపోతే అది కాంగ్రెస్ వారి వల్లనే గాని కమ్యూనిస్టుల బలం వల్ల కాదు. నా మాట నమ్ము కాంగ్రెస్ లోని నీచమైన దారులు, పద్ధతులూ నాకు చాలా తెలుసు గానీ ఇంత నీచత్వం ఉందనుకోలా – ఇంక ఎంత రాసినా ఇదే – ముగిస్తాను. శక్తి వంచన లేకుండా పని చేస్తున్నాం. మహిళా దళం వాళ్ళం. ఫలితం గురించి ఆలోచించటం అనవసరం. మరో పదిహేను రోజుల్లో అంతా తేలిపోతుంది.

నీ ప్రియమైన

అన్నపూర్ణ.

అందరూ నిశ్శబ్దమై పోయారు.

గోరా గారు లేచి “సరస్వతీ – నువ్వూ పిల్లలూ తర్వాత రండి. నేను వెళ్తాను అంటూ వెళ్ళిపోయారు. ఆయన చాలా అలజడి చెందాడని అందరికీ అర్థమయింది. దుర్గాబాయి ఆయన విద్యార్థిని. ఆయన ఆందోళన సహజం.

“ఈసారి ప్రతి పార్టీ ఆడవాళ్ళనే అభ్యర్థులుగా నిలబెట్టాలని అడుగుదాం” సరస్వతి కోపంగా అంది.

అందరూ నీరసంగా నవ్వారు.

“అసలీ ఎన్నికల్లో ఇంత దుర్మార్గాలుంటే పోటీ చెయ్యటం సరే ఓట్లు కూడా వెయ్యకూడదు” అంది స్వరాజ్యం ఆవేశంగా.

“మరి ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది. మనది ప్రజాస్వామ్యం గదా” అంది మైత్రి.

అందరూ ఇద్దరిద్దరుగా మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. నటాషాకు విసుగుపుట్టి తనతో ఆడాలని పేచీ పెట్టింది. స్వరాజ్యం, మైత్రి, ఆమె చెల్లెళ్ళు నటాషా చెప్పినట్లు ఆట మొదలుపెట్టారు. అందరిలో మెల్లీ ముఖం బాగా వాడిపోయి వుండటం శారద గమనించింది. మెల్లీ భుజం తట్టి “నిరాశ పడకు. ప్రజలు ఉన్నారు. వాళ్ళమీద నమ్మకం ఉంచు” అంది.

“నాకు మోహనరావు గెలవాలనే ఉంది. కానీ ఇలా కాంగ్రెస్ ద్రోహం వల్ల కాదు” అంది మెల్లి

“నాకు అర్థమైంది” అని ఆమె భుజం చుట చెయ్యి వేసి దగ్గరకు తీసుకుంది శారద,

రాత్రి భోజనాలు చేసి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళారు. అన్నపూర్ణ ఉత్తరం గుర్తొస్తే చేదుమాత్ర నోట్లో చప్పరించాల్సి వచ్చినట్లు అనిపిస్తోంది అందరికీ. ఎన్నికలు పూర్తయిన రోజే అన్నపూర్ణ రాజమండ్రి నుంచి విజయవాడ వచ్చింది.

*

మీ మాటలు

*