-గుర్రం సీతారాములు
~
అరుణ్ సాగర్ తెలుగు బుద్దిజీవుల్లో ఒక మర్యాదగల పాత్రికేయుడు. చూడడానికి అత్యాదునికునిగా కనిపించే అతను ఆరణాల అచ్చం ఆదివాసీ. అకస్మాత్ గా అయన గుండె పనిచేయడం ఆగింది. అరుణ్ తండ్రి టి.వి.ఆర్ చంద్రం అంటే గోదావరీ నదీలోయ పరీవాహక ప్రాంతం లో, పోడుకోసం గూడుకోసం, తునికాకు రేటుకోసం జీవితం త్యాగం చేసిన ఒక నికార్సయిన, నిబద్దత కలిగిన సాధారణ కార్యకర్త . ఉమ్మడి కమ్యునిస్ట్ పార్టీ నుండి మార్క్సిస్ట్ పార్టీ దాకా బద్రాచలం ప్రాంత పార్టీ నిర్మాతల్లో ఒకడుగా ఆయన తాను నడిచిన నేలంతా పోరాటాల విత్తనాలు చల్లి ప్రజల జ్ఞాపకాల్లో మిగిలే ఉన్నాడు.
ప్రపంచ వ్యాప్తంగా భూమి ఇరుసుగా అనేక సాయుధ, విముక్తి పోరాటాలు జరిగినవి. అవి వలసవాదుల కబ్జానుంచి భూమిని విముక్తి చేసుకునే క్రమం లో, స్వతంత్రం ఒక మేడిపండు అని, అది కేవలం అది ఒక అధికార మార్పిడీ అని అనేక ప్రత్యామ్నాయ, అస్తిత్వ వాద ఉద్యమాలు నడిచాయి. ఆ క్రమం లో అంతులేని రక్తపాతాలు జరిగినవి. వీటేనక టి.వి.ఆర్ చంద్రం తరం చేసిన త్యాగాలూ ఉన్నవి. బద్రాచలం, బస్తర్ నేలలు దశాబ్దాల పోరు భూమిగా పోరాట వారసత్వాన్ని కలగన్నది, దాని పొరల్లో పేరుకు పోయిన రక్తపు మరకల తడి ఆరని చిత్తడి నేలలు అవి . ఒక నాడు మహోజ్వలంగా వెలిగిన స్థానిక సంచార జాతుల రాజ్యాలు, రాజులు వర్తమాన పోరాటాల మూలంగా కనుమరుగు అయ్యాయి . ఆధునికత పేరుతో జరిగిన అభివృద్ధి కోట్లాది మంది అత్మగౌరవంగా బ్రతికిన నేలనుంచి విడదీయ బడుతున్నారు . ఇలా వలస పాలన నుంచి విముక్తి పొందిన అనేక దేశాలలో దాదాపు ఇరవై కోట్లకు పైగా విస్తాపనకు తాకిడికి చిద్రం అయ్యారు అని లెక్కలు చెబుతున్నాయి.ఇంత విద్వంశం జరుగుతున్నా ‘నాగరికతకు’ ఆవడ కారడవుల్లో నాగరికం అని పిలవబడుతున్న ప్రపంచానికి వేల ఏళ్ళ దూరంలో, సెలయేటి నీరంత ప్రశాంతంగా, తమదయిన, అవధులు లేని, ఆంక్షలు లేని, దోపిడీ, పీడన లేని అసలు రేపు ఏంటి ? స్వంత ఆస్తి ఏంటి ? అనే ఆధునిక భావనల గాలి సోకనంత స్వచ్చంగా బ్రతుకుతున్న కోట్లాది మంది గోదావరి పరీవాహక ఒడ్డున ఉన్నారు.
తాళ్లూరి అరుణ్ సాగర్ ఉరఫ్ చంద్రం గారబ్బాయి నాలుగున్నర దశబ్దాల కింద కొంట అనే చిన్న గిరిజన గ్రామం లో కుడివైపు సీలేరు (ఆంధ్రప్రదేశ్ ) ఎడమవైపు శబరి (చత్తీష్ ఘడ్) దాని నడుమ కాసింత నేల ఒడిసా లో బాగం అయిన ఆయన రాసుకున్నట్లు ‘ సరిగ్గా కొమ్ముబూర లా వంపుతిరిగిన చోట’ తన ఇంటి కిటికీ లోంచి శబరీ గోదారీ సంగమస్థలి లో కడంచున, ఆధునికత, పురాస్మ్రుతుల జ్ఞాపకాల సంగర్షణ ల మధ్య, భారత కల్లోల విస్పోటనల, ఖాకీ పద ఘట్టనల , ప్రత్యామ్నాయ భావ స్రవంతుల మధ్య ఆయన బాల్యం పురుడు పోసుకుంది. అలా కడగొట్టు నాగరికత విలసిల్లిన ప్రాంతాన అయన కవిత్వ మూలాలు ఉన్నాయి. అక్కడే ఒక మైదాన వాసి- మూలవాసీ నిర్వాశితుడు అవడం ఒక్కటి కాదని అన్నాడు.
అరుణ్ సాగర్ కవిత్వం లో కాసింత ఆంత్రోపాలజీ, నల్లజాతీ సంగీత సొబగు, అత్యాధునికమైన జీవితం లో ఒక మెట్రోపాలిటన్ జీవితం లో ఉన్న సందిగ్ధత, ఇన్ని వైరుధ్యాలు ఉన్నా త్యాగానికి లింగ వివక్ష వద్దనీ తండ్రుల త్యాగాలు కొనియాడుతూ ప్రతి కొడుకూ తన తండ్రి జన్యు విశేషణగా, ఆయన కొనసాగింపుగా చేసిన అభివ్యక్తి తెలుగు సాహిత్య లోకాన ఒక కుదుపు. ‘పత్తి కాయలా గుండె పగిలిపోతుంటే పురుగు మందు తాగిన’ తండ్రుల గుండె కోతను ఆయన లాగా చెప్పే సాహసం ఎవరూ చేయలేదు. అరుణ్ సాగర్ పుట్టిన పెరిగిన నెలలో ఉన్న ఆదిమ జాతుల నడకకు ఒక లయుంది, ప్రకృతిలో బాగం అయి పరవశం తో పాడుకున్న రేల పాటలు గానం చేసుకున్న గొంతుకు ఒక శ్రుతి ఉంది. ఒక సామూహిక బృందగానం ఉంది. మట్టితో పెనవేసుకున్న వేల ఏళ్ళ జ్ఞాపకాల బరువూ ఉంది. ఒకప్పటి రాజులు ఒకప్పటి మూలవాసులు , ఇప్పటికీ గుడి బడికి దూరం అయ్యి గుడ్డి దీపాల వెలుగుల్లో కునారిల్లుతున్నారు. ఇప్పుడు బస్తర్, నల్లమల లో గోండు, కోలం జాతులు చిన్న మాత్రకు కూడా నోచుకోకుండా దోమకాటుకు, పాముకాటుకు బలవుతూ ప్రకృతితో యుద్ధం చేస్తున్నారు. ఇప్పడు అడివి మనాదితో మంచం ఎక్కింది. నాగరికతకు దూరం అయినా నమ్మిన నేల కపాడుద్ది అనే బరోసా తో పోడు తో ఏటికి ఏతం పెట్టి ఎట్టి మనుషుల నుండి భూమిని గుంజుకునే ఆధునిక రాజ్యాన్ని ఎదిరించ లేక పోతున్న బడుగు జీవులకు అరుణ్ సాగర్ ధైర్య వచనం అయ్యాడు.
అరుణ్ సాగర్ పుట్టిన ఊరులో కుమ్మూరు ఇరపా సీతక్క తన నుదుటున ముద్దేట్టి ‘కలెట్టరయ్’ రావాలి బిడ్డా అని దీవించింది ఆమె ఆకాంక్ష వినడానికి బాగానే ఉన్నా, ఆయన దృష్టిలో అది కేవలం అధికార దర్పానికి తప్ప కడగొట్టు జీవితం లో వెలుగును నింపదనీ, ‘కలెట్టరయ్’ అనపకాయ బుర్రలూ వెదురునార విల్లులూ, ఎద్దు పుర్రెలో గుదిగుచ్చిన నెమలి పించాలు ఇంట్లో అలంకరణ కు పెట్టుకోవడం తప్పా వాళ్ళ తలరాతలు మార్చని అభివృద్దిని ఈసడించుకున్న అరుణ్ పాత్రికేయుడిగా వాళ్ళకు ఏదన్నా చేయాలి అని ఎన్ని కలలు కన్నాడో. స్వతంత్రం, అభివృద్ధి, స్వయం ప్రతిపత్తి లాంటి లాబొరేటరీ లో తయారు చేయబడుతున్న ఆధునిక పదజాలం ఆ అలగా జనాల విముక్తికి ఏనాటికీ ఉపయోగ పడదనీ ఆయనకు తెలుసు. ‘సమీకృత అభివృద్ధి-సాంస్కృతిక పృధక్కరణ-సామాజిక సమగ్రత’ వినడానికి గొప్పగా ఉన్నా అవన్నీ డొల్ల పదాలనీ ఎరిగిన వాడు , ఆరున్నర దశాబ్దాల అభివృద్ధి గిరిజన సంక్షేమ సూత్రాలూ ‘అప్లయిడ్ ఆంత్రోపాలజీ పరిశోదనలో వాడేసుకుని అలగా జనాల బతుకుల్ని మాత్రం నట్టనడి జలాశయాల్లో ముంచేస్తారా, అని అక్రోశించడం కూడా తెలుసు.ఇంత లోతయిన జీవితం ఆచరణ ఉన్న కవి నాడి అంచనా వేయడం లో తెలుగు మేధో సమాజం మరుగుజ్జు తనాన్ని నిరూపించు కుంది. కవితా వాకిళ్ళలో ఇమడని ఆయన వచనం చానా ఆలస్యం గా కవిత్వం గా చర్చించ బడ్డది. తండ్రుల వ్యధలూ సీదర సేంద్రయ్య లు అర్దంతర నిష్క్రమనలూ, ఆధునిక పద బందాల్లో తెలుగు కవిత్వానికి కాసింత ఆసరా అయ్యాయి.
చివరిరోజుల్లో అయన జీవితం అయ్యలనుండి వచ్చిన చైతన్యం ఎక్కిరించిన వైనాన్ని మౌనంగా స్వీకరించాడు. అది ఆయన్ను ఎంత బాదపెట్టిందో ఆయనకు దగ్గరగా ఉన్న మిత్రులకు నాకన్నా బాగా తెలుసు. సిరలు ధమనులు పగిలి నెత్తురు చిమ్మెంతగా’ విలవిల్లాడు అతను. ఆయన జేవితం లో అదో విషాదం. ఈ విషాదాల వికట్ట హాసాల ఉక్క పోతల మధ్య ఇమడలేని ఆయన తన మృత్యు శాసనాన్ని ముందే రాసుకుండు.
ఒక మనిషి పుడతాడు పోతాడు. కానీ పోయే లోపు నిన్నుకన్న నేల చెర బడుతున్నప్పుడు కాస్తంత కన్ఫెషన్ అవసరం. కానీ అరుణ్ సాగర్ ఎకంగా కోల్పోతున్నరేల పాటకోసం మరణ వాగ్మూలం రాసుకుండు. నేలకోసం , పలవరిస్తూ, మళ్ళీ ఒక సారి ఎనభై అడుగుల లోతులో సమాధి కాబోతున్న తన ఆనవాళ్ళు దూరంగా తన బిడ్డకు చూపించి అగొ అక్కడే నీ తాతలు తండ్రులు ఒకప్పుడు ప్రాణం తో ఉన్న మనిషి జ్ఞాపకం అని కడసారి చూపిస్తూ, మనందరి సామూహిక వైపల్యాల మీద అల్లుకున్నచిన్న పిచ్చిక గూడు మ్యూజిక్ డైస్ లా చిట్టచివరి అగ్రహ ప్రకటన చేసాడు .
బహుశా తెలుగు కవిత్వ చరిత్రలో ఒక వలపోతను మరణ వాంగ్మూలం గా రాసుకున్నది అయన ఒక్కడే కావొచ్చు. జీవిక కోసం కన్న ఊరును వదిలి రావాల్సి వచ్చినప్పటికీ అయనను ప్రతి క్షణం బాల్యపు గుర్తులు వెంటాడాయి. అందుకే తప్పించుకోలేక కవిత రాసి దుఖాన్ని కడిగేసుకొనే ప్రయత్నం చేయలేదు. కొట్టుకొచ్చిన శవాలమీద నాలుగు వాక్యాలు ఏరుకొనే బ్రతకనేర్చిన తనాన్ని, కనీసం ఒక లాఠీ వైపు తేరిపార చూడలేని దౌర్భాగ్యాన్ని ఆయన చిన్న గుండె తట్టుకోలేక పోయింది. ఆచరణలో ఆయన నిజంగా నిలువెత్తు నిదర్శనం. ఆయన పుట్టిన కుటుంబంకు ఉన్న నిబద్దత, త్యాగమయ జీవితం కావొచ్చు. పెరిగిన నేలలో ఉన్న పోరాటాల వారసత్వం కావొచ్చు, వృత్తిలో, ప్రవృత్తిలో, స్నేహం లో, సహచర్యం లో అయన చుట్టూ ప్రాణంఇచ్చే స్నేహ సంపద కావొచ్చు, ఇవన్నీ ఆయన్ని పరిపూర్ణ మానవునిగా మార్చాయి. మార్కెట్ శాసించే మానవ విలువలను తూకంలో వేసి బాగిస్తుంటే ఆ ఒరవడిలో కొట్టుకొని పోకుండా, తానెక్కడ ఉన్నా తన అంతరంగం లో ఒక వెతుకులాట తో ఉండేవాడు. నిజానికి వేసవికాలం కాలం లో గోదావరిలా పైకి కనిపించే అయన లోలోపల వానాకాలంలో గోదారి వరద ఉదృతిలా అలజడి తో అల్లాడిపోయే వాడు . అలాంటి గోదావరి ప్రవాహానికి అడ్డంగా కడుతున్న ‘గాలికట్ట’ అయన గుండె కవాటాలను ఎంత ఉక్కిరిబిక్కిరి చేసిందో. అందుకే కాసింత విశ్రాంతి కోరుకుంది. ఆ విశ్రాంతి శాశ్వతంగా అరుణ్ సాగర్ ని మన నుండి దూరం చేసింది.
దశాబ్దాల పోరాటాల తర్వాత మిగిలిన తెలంగాణా పంపకాల్లో అయనకు తెలియ కుండానే ఆయన నడయాడిన నేల మారకపు విలువగా మారడం మూలాన ఎంత క్షోభను అనుభవించాడో. ఒక నాగరికతను బలవంతంగా బట్వాడా చేయడాన్ని ఎంతగా నిరసించాడో. బహుశా నిర్వాశిత సమష్య ను అత్యంత మానవీయంగా ఆయన లాగా ఎవరూ రాయలేదు. ‘కంకర తేలిన పదును, ఎర్ర మట్టి చదును, పెంచి పెద్ద జేసిన వీధి, వంటినిండా పాదముద్రలు వేసుకొని నడిచిన జాడలను మరవని వాడు’. అందుకే తన తాతల తండ్రుల వారసత్వంగా వచ్చిన పోరాడుతున్న ఆకలి కేకల కోసం కనీసం గొంతయినా కలపక పోవడం నేరం అని భావించాడు. కవిత ఆచరణకు సాటి రాదు అని తెలిసీ ఒక నినాద రచనగా ఒక విధాన అనుసరణగా కనుమరుగు అవుతున్న రేల పాటకోసం నినాదం అయ్యాడు.
పాత్రికేయ ప్రపంచం లో అరుణ్ సాగర్ జీవితాన్ని ఒక నమూనాగా చూడాలి. తన నాలుగున్నర దశాబ్దాల మొత్తం జీవితం లో రెండు దశాబ్దాల పాత్రికేయ వృత్తి, విభిన్న మాధ్యమాలు, విభిన్న సంస్కృతుల కలబోత. వృత్తిలో అంత నిబద్దత నమ్మిన విలువలకోసం బ్రతకడం కోసం శరీరాన్ని ప్రయోగ శాల మార్చుకొని, శస్త్రచికిత్స తో, వడలిన శరీరంతో ఎక్కడికి పోయినా తనతో ఒక ‘మినీ డిస్పెస్సరి’ లా ఉండేది ఆయన జీవితం. అరుణ్ జీవించింది చానా తక్కువ కాలమే అయినప్పటికీ ఇంత మందికి ఇంత దుఖాన్ని మిగిల్చి మబ్బులా మాయం అయ్యాడు. అరుణ్ సాగర్ ఈ కల్లోలాలను మనసారా అక్షరీకరించాడు. మన అందరం అపరాధ రుసుము ఎప్పటికయినా చెల్లించాలి అని ఒక వార్నింగ్ ఇచ్చిమరీ పోయాడు. అరుణ్ ! మల్లెప్పుడు కనబడతావ్ బాస్ ? నీతో మళ్ళీ లోయపల్లి, భద్రాచలం, చట్టి, కుంట, మారేడు మిల్లి, లంబసింగి, విశాక ఒడ్డు తిరగాలని ఉంది. అయినా నా పిచ్చిగానీ కొంత కాలానికి అవీ కాలగర్భంలో కనుమరుగు కాబోతున్నాయి. అవును మనందరి సామూహిక వైఫల్యాల సాక్షిగా వాగు కొమ్ముబూరలా వంపు తిరిగిన చోటు నీ పాదముద్రలూ, దమ్మక్క రోదనలాగా కనుమరుగు కాబోతున్నాయ్. కానీ నువ్విచ్చిన స్పూర్తీ కవిత్వమూ బ్రతికే ఉంటాయి అన్నా ..
*
‘
అరుణ్ సాగర్ యెందుకు ప్రేమాస్పదుడో అతని అంతరంగం ఏమిటో యింతకన్న బాగా చెప్పినవాళ్ళు వున్నారా? నాగరీకుడిగా జీవిస్తూ కూడా ఆధునికత కి దూరంగా నిలిచిపోయిన అతని హృదయ స్పందనని బాగాపట్టుకున్నాడు మిత్రుడు సీతారాములు
సీతారామన్న మీ అక్షర నివాళి కన్నీళ్ళను తెప్పించింది. ఆయన ఉండగా దగ్గరగా మాటాడలేని నా వైఫల్యం వెక్కిరిస్తుంది. నిజమే మనందరం అపరాధ రుసుం చెల్లించాల్సిన ముద్దాయిలమే తన ముందు. గొప్ప నివాళి. ధన్యవాదాలు.
తన చుట్టూ ప్రపంచంతో స్నేహంగా ప్రేమగా భాద్యతగా సరదాగా వున్నఅరుణ్ సాగర్ లాంటి మృదువైన స్నేహితుని గురించి చెపుతూనే వుండాలనిపిస్తుంది. యింకా యింకా వినాలనిపిస్తూనే వుంది. మళ్లీ యింకా రాయి. కన్నీళ్లు వూరుతునే వున్నాయి… అయినా అరుణ్ నవ్వు స్పష్టంగా కనిపిస్తోంది.
బ్రదర్ సీతారాములు అరుణ్ సాగర్ జీవితపునాది ని గొప్పగా చెప్పావు. జ్ఞాన పీఠ పురస్కార రచయిత చంద్రశేఖర కంబారని గుర్తు కు తెచ్చావు.congratulations brother
అన్న చదువుతుంటే
తనని దగ్గరనుండి చూస్తున్నట్టుగా ఉంది
జై భీం… అన్న ఎక్ష్లెన్త్…
మొత్తానికి బ్యాసం సమయానికి అందించావు!. అభినందనలు……….. ప్రచురించిన సారంగ వారికి నెనరులు
** వ్యాసం
గ్రేట్ ట్రిబ్యూట్. .!!
అరుణ్ సాగర్ మీద వచ్చిన నివాళుల్లో అతని వ్యక్తిత్వాన్నీ, అతని నేపథ్యాన్నీ ఇంత చక్కగా ఆవిష్కరించినది నా దృష్టిలో ఇదొక్కటే. సీతారాములు గారూ, మీకు నా హృదయపూర్వక అభినందనలు.
తమ్ముడు సీతారాములు..చాలా గొప్పగా రాశావు. థాంక్యూ
అరుణ్ సాగర్, కవిత్వం గురించి తెలిసినంత ఆయన వ్యక్తిగత జీవితం గురించి తెలియదు. సీతారాములు వ్యాసం వాళ్ళ చాలా విషయాలు తెలుసాయి. అయన గురించి ఇలా సీతారాములు ఒక్కడే రాయగలడు. అరుణ్ ను మనం పోగొట్టుకున్నాం. ఆయనకు ఆయన నమ్మిన కమ్యూనిస్టులే మనోవేదన కలిగించారు. వేదించారు. చివరకు ఆయన్ని మనం కోల్పోయాం. కాని అరుణ్ బతికే ఉంటాడు.
అన్న చాల బాగా రాసారు …..ఇది చదువుతుంటే మీ అనుభందం ఎలా ఉందొ అర్థం అవుతుంది .
అలగా జనాల బతుకుల్ని మాత్రం నట్టనడి జలాశయాల్లో ముంచేస్తారా అని అక్రోశించిన అరుణ్ సాగర్: … మనందరి సామూహిక వైపల్యాల మీద చిట్టచివరి అగ్రహ ప్రకటన చేసిన అరుణ్ సాగర్; … మనమందరం ఎప్పటికయినా అపరాధ రుసుము చెల్లించాలి అని ఒక వార్నింగ్ ఇచ్చిమరీ పోయిన అరుణ్ సాగర్; … తన తండ్రి చంద్రం వారసత్వ స్ఫూర్తితో తన జేగురు రంగు అక్షరాలను పాత్రికేయ ప్రపంచానికి సృజనాత్మకంగా పులిమిన అరుణ్ సాగర్; … ఎలక్ర్టానిక్ మాధ్యమంలో తన సంతకాన్ని, చెరగని ముద్రనూ మిగిల్చిన అరుణ్ సాగర్; … ఆఫ్టరాల్ అవర్ హార్ట్ ఈజ్ ఆన్ ద లెఫ్ట్ అన్న అరుణన్నకు జోహార్లు.
అరుణ్ సాగర్ నేపధ్యాన్ని, కవిత్వాన్ని, వ్యక్తిగత జీవిత నిబద్దతని చూపిస్తూ, తను ఎందుకు ప్రేమాస్పదుడో, తన అంతరంగం ఏమిటో వివరిస్తూ గొప్ప నివాళి సమర్పించిన గుర్రం సీతారాములు గారికి ( మొబైల్ : 99 51 661 001 ) కృతజ్ఞతలు.
డియర్ సీతారాములుగారు,
అరుణ్ సాగర్ గురించి స్పందనతో పాటు ఆలోచనను మిళితం చేసి అందించిన ఈ వ్యాసం ఆయనలోని అనేక కోణాల్ని పాఠకులకు తెలియజేసింది.