దుర్గ ఆప్యాయంగా శారదను దగ్గరకు తీసుకుంది.
ఆమె ఒకవైపు లాయర్గా పనిచేస్తోంది. మరోవైపు రాజ్యాంగ సభ సభ్యురాలిగా నెలకు ఒకటి రెండు సార్లు డిల్లీ ప్రయాణాలు తప్పటం లేదు. ఆంధ్ర మహిళా సభ నిర్మాణం జరిగింది. దానిని విస్తరించే ప్రణాళికలు , దానికి కావలసిన విరాళాల సేకరణ దుర్గాబాయికి ఒక్క నిమిషం తీరిక దొరకదు. ఆమెకు ఆ తీరిక అవసరం లేదు కూడా. పని. పని. పని. ‘‘వందమంది మనుషుల పని చేస్తున్నావోయ్’’ అంది శారద.
‘‘నువ్వు? వెయ్యి చేతుల్తో పని చేస్తున్నావు. అసలు సంగతి చెప్పనా ? మనం ఇలా పని చెయ్యకుండా బతకలేం’’
‘‘సరిగ్గా చెప్పావు’’ శారద గలగలా నవ్వింది.
‘‘కాకినాడ కాంగ్రెస్ సభకొచ్చావు గుర్తుందా? ఇంటర్ చదువుతున్నావు. డాక్టర్నవుతానన్నావు. అప్పటికి నేనింకా చదువులో ప్రవేశించలేదు. ప్రవేశిస్తానో లేదో తెలియదు. నిన్ను చూసి ఆనందించాను. నువ్వు మెడిసిన్ చదివి డాక్టరవటం ఊహించుకుని, నేను గాంధీ గారిలా, నెహ్రూగారిలా, ప్రకాశం గారిలా లాయర్ నవ్వాలనుకున్నాను . ప్రాక్టీస్ చెయ్యాలనుకున్నాను ’’.
‘‘సాధించావుగా ` మనిద్దరి ప్రాక్టీసూలూ జనానికి మేలు చేస్తున్నాయి’’.
‘‘నేను ప్రాక్టీసు ఒదిలెయ్యాల్సి వచ్చేలా ఉంది’’ అంది దుర్గ నిరుత్సాహం గా .
‘‘ఎందుకు?’’
‘‘రాజ్యాంగ సభ చాలా సమయాన్ని తీసుకుంటోంది. ఢల్లీకి వెళ్ళిపోవాలి. అక్కడ ఫెడరల్ కోర్టులో చెయ్యొచ్చనుకో. వచ్చే ఏడాది ఎన్నికలొస్తున్నాయిగా. నేను పార్లమెంటుకి రావాలని నెహ్రూగారు పట్టుదలగా ఉన్నారు. వీటన్నిటితో ఇంక ప్రాక్టీసెక్కడ కుదురుతుంది?’’
‘‘పార్లమెంటులో నీలాంటి వాళ్ళుండాలోయ్ – ముఖ్యంగా హిందూకోడ్ బిల్లు వంటివి చట్టాలై రావాలంటే నీలాంటి వాళ్ళుండాలి. ప్రాక్టీసుతో కొందరికే మేలు చెయ్యగలం. పాలసీలు దేశాన్నంత ప్రభావితం చేస్తాయి గదా. నువ్వు పార్లమెంటుకి వెళ్ళి తీరాలి. రాజ్యాంగసభ ఎలా జరుగుతుందోయ్’’.
‘‘అబ్బా – చాలా తీవ్రమైన చర్చు. ఒక్కపదం గురించి గంటలు గంటలు వాదనలు . అంబేద్కర్ ఎంత గొప్పవాడనుకుంటున్నావు ? ఆయనకున్న చట్ట పరిజ్ఞానం ప్రపంచంలోనే ఎవరికైన ఉందా అనిపిస్తోంది. ఆయన ఆధ్వర్యంలో ఆడవాళ్ళకు, హరిజనులకు మేలు చేసే అంశాల తోనే తయారవుతోంది’’.
‘‘అది జరిగితే చాలు . హరిజనుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అంటరానితనాన్ని నిషెధించాలి’’.
‘‘నిషెధిస్తాం చూడు. అన్నట్టు మా రాజ్యాంగసభలో దాక్షాయణీ వేలాయుధన్ అని ఒక హరిజన స్త్రీ కేరళ నుంచి ఉంది. భలే గట్టి మనిషిలే. నువ్వూ నేనూ ఎందుకూ పనికిరాము ఆమె ముందు’’
‘‘మనం భద్ర జీవితాల నుంచి వచ్చాం. ఆమె ముళ్ళూ రాళ్ళూ గుచ్చుకున్నా లెక్కచెయ్యకుండా ఎదిగి ఉంటుంది. రాటుదేలి ఉంటుంది’’.
వాళ్ళ కబుర్లకు అంతులేదు. ఆంధ్ర మహిళా సభ చూసి శారద చాలా సంతోషించింది. ‘‘ఇలాంటివి చాలా కావాలోయ్’’ అంది ఆలోచనగా. ‘‘ఇంతకూ వచ్చిన పని చెప్పలేదు’’ ఆ రాత్రి దుర్గాబాయి అమ్మ శారద కోసం ఇష్టంగా వండినవన్నీ తిని భుక్తాయాసంలో కూర్చున్నపుడు అడిగింది దుర్గ.
‘‘దుర్గా . ఒక్కసారి నెహ్రూగారిని కలవాలోయ్. నువ్వెలాగైన నాకు ఆయనతో ఇంటర్వ్యూ ఇప్పించాలి. నిజాం నుంచి తెలంగాణాని విముక్తం చేశామని ఆయన సంతోషిస్తుండవచ్చు. కానీ తెలంగాణాలో, ఆంధ్రాలో, కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలలో జరుగుతున్న మారణకాండ ఆయనకు తెలుసా? తెలిసిన సరే నేను ఆయనకు చెప్పాలి. ఒక్కసారి ఇంటర్వ్యూ ఇప్పించాలోయ్’’.
దుర్గ నవ్వింది.
‘‘నెహ్రూ ఇప్పుడు హిందూ ముస్లిం కలహాలు , శరణార్థుల సమస్యతో సతమతమవుతున్నారు. ఒకవైపు రాజ్యాంగ సభ. అందులో అంబేద్కర్ని వ్యతిరేకించే కాంగ్రెస్ వాదులను సముదాయించలేక తలపట్టుకుంటున్నారు. ఒక్క సమస్య కాదు. అందుకే ఇలాంటి విషయాన్నీ పటేల్కి అప్పగించారు’’.
‘‘నెహ్రూ చెబితే పటేల్ పంతాలు కొంత తగ్గుతాయేమోనోయ్’’
‘‘సరే – ప్రయత్నిస్తా’’ అంది దుర్గాబాయి.
ఇద్దరూ కలిసి ఢల్లీ ప్రయాణం ఖరారు చేసుకున్నారు.
‘‘అమ్మాయ్. శారదా చాలా కాలానికి వచ్చావు. కాకినాడలో పాడినట్లు ఒక పాట పాడమ్మా. దుర్గ వీణ వాయిస్తుంది’’
‘‘త్యాగరాజ కృతులు పాడి చాలా రోజులయిందమ్మా. గొంతూ పాడయింది ఉపన్యాయసాలిచ్చీ, యిచ్చీ’’.
‘‘ఫరవ లేదులే – ఏదో ఒకటి పాడు’’
దుర్గ లోపలికి వెళ్ళి వీణ తెచ్చింది. తీగలు సరి చేస్తూ
‘‘ఈ మధ్య బెంగుళూరు నాగరత్నమ్మ కచేరీ చేసింది. ఏమీ తగ్గలేదు ఆమె గొంతులో మాధుర్యం. తిరువాయూర్లోనే ఉంటోంది. త్యాగరాజ స్వామికి ఆలయం కట్టిస్తోంది. సమాధి కూడా. తన మొత్తం ఆస్తి ఇచ్చేస్తోంది. కచేరీలు చేసి సంపాదిస్తున్నది ఆ పని కోసం’’.
‘‘ఔను. విన్నాను. ఎంత అందమైన పని, ఒక జీవితకాలంలో చేయగల పని, తన హ దయాన్నంత అర్పించి చేయగల పని లక్ష్యంగా పెట్టుకుంటే ఎంత ఆనందం దొరుకుతుందో గదా ` మన జీవితాలు చూడు ఎక్కడ బయల్దేరాము? ఎక్కడ కి వెళ్తున్నాము? ఎక్కడకి వెళ్ళాలి? ప్రశ్నలే – అంతంత పనులుండగ నేనీమధ్య ఒక చిన్న పని పెట్టుకున్నానోయ్. అదైతే ఫలితం నా జీవితకాలంలో చూడగలను. అనుభవించగలను’’.
‘‘ఏంటది?’’ ఆశ్చర్యంగా అడిగింది దుర్గ.
‘‘ఒక మంచి బత్తాయి అంటు తెప్పించి ప్రేమగా పెంచుతున్నాను. అది నవనవలాడుతూ పెరుగుతోంది. రోజూ ఉదయాన్నే దానికి నీళ్ళు పోసి ఆ ఆకుల నిగనిగలు , కొమ్మ నేవళం చూస్తుంటే కడుపు, మనసు నిండిపోతుంది. ఈ చెట్టు పెద్దదవుతుంది. తియ్యని పళ్ళు కాస్తుంది. అవి నేనూ తింటాను. అందరికీ పంచుతాను. ఆ రసం ఎంత మధురంగానో ఉండాలి అనుకుంటూ నీళ్ళు పోస్తాను. ఆ క్షణాన కలిగే ఆనందానికి సాటివచ్చేది లేదనుకో’’ దుర్గ నవ్వింది చిన్నగా.
‘‘సరే కబుర్లతోనే సరిపెడతాం ? పాట ఎత్తుకుంటాం ?’’
శారద ‘‘ఎందరో మహానుభావులు అందరికీ వందనము’’ అని మధురంగా పాడుతుంటే, దుర్గ వీణ వాయిస్తూ తనూ గొంతు కలిపితే, ఇంట్లో వారంత వింటూంటే ఆ సంగీత సంధ్య క్రమంగా సంగీత పూర్ణ పౌర్ణమి అయింది. ‘‘ఈ పాటలు పాడి ఎన్నాళ్ళయిందో ` అమ్మా మీరిద్దరూ మా పాటలూ కూడా వినాలి’’. శారద మారాం చేస్తున్నట్లు అడిగింది.
‘‘వినకపోతే ఊరుకుంటావా . పాడు’’ అంది దుర్గా .
‘‘ఆకలి మంటలు మలమల మాడే అనాథందరు లేవండోయ్’’ అని శారద గొంతెత్తి పాడుతుంటే దుర్గ కళ్ళు, మనసు ఆర్థ్రమయ్యాయి. శారద అంతటితో ఆగకుండా ‘‘అరుణ పతాకమా’’ అని పాడ వీరరసం ఉప్పొంగించింది. ‘‘ఇక జనగణమన’’ పాడకపోతే నువ్వు నన్ను కమ్యూనిస్టుని చేస్తావు. పదండి పడుకుందాం’’ అంటూ లేచింది దుర్గ.
***