ఒక వీడ్కోలు సాయింత్రం

Art: Srujan Raj

Art: Srujan Raj

ఉణుదుర్తి సుధాకర్

~

Sudhakar_Marine Linkజాన్ ఇంకా రాలేదు; చెన్నపట్నం మీదుగా స్టీమర్ లో ఇంగ్లండు తిరుగుప్రయాణానికి సర్దుకోవలసిన సామాన్లూ, చేయ్యాల్సిన ఏర్పాట్లూ ఇంకా చాలా ఉన్నాయనీ, అందుచేత ఆ రోజు సాయింత్రం ఏడుగంటలకిగానీ క్లబ్బుకి చేరుకోలేననీ ముందుగానే చెప్పాడు. ఎర్రమట్టి దిబ్బల మీద పరుచుకున్న కోరమాండల్ క్లబ్బు దొరలందరికీ స్థానిక జలాశయం. కేవలం దొరలకీ,  రాజాలకీ, జమీందార్లకే కాకుండా తగినస్థాయి కలిగిన ఇతర స్థానికులకు కూడా ప్రవేశం కల్పించవచ్చని క్లబ్బుయాజమాన్యం – తీవ్రమైన అభ్యంతరాల్ని తోసిపుచ్చి – ఇటీవలే తీర్మానించింది.

క్లబ్బులాన్స్ లో కూర్చుంటే సముద్రం స్పష్టంగా కనిపిస్తుంది; మంద్రంగా వినిపిస్తుంది. కెన్ క్లబ్బుకి చేరేటప్పటికి పడమటి ఆకాశం బాగా ఎర్రబడింది. తూర్పువైపు నుండి సముద్రపుగాలి బలంగా వీస్తోంది – చల్లగా, కాస్తంత ఉప్పగా – మధ్యాహ్నం పూట వేధించిన వేడినీ, ఉక్కనీ మృదువుగా  మరపింపజేస్తూ. క్లబ్బు ఆవరణలోని కొబ్బరి, మామిడిచెట్ల మీద బంగారు ఎండ తేనెరంగులోకి మారుతోంది. దూరంగా తీరంవెంట సరుగుడుతోటల వెనక ఇసుకతిన్నెలు ఎర్రగా మెరుస్తున్నాయి. వాటికి నేపధ్యంగా గాఢనీలంలోంచి ఊదారంగుకి మారిన సముద్రం.

‘ఇప్పుడు బాగానే ఉందిగాని చీకటి పడ్డాక దోమలబాధ తప్పదు’ అనుకుంటూ లాన్స్ లోకి నడిచాడు కెన్. తెల్లటి గుడ్డలు పరచిన గుండ్రటి టేకు మేజాలు; వాటిచుట్టూ నాలుగేసి లేతాకుపచ్చ రంగువేసిన పేము కుర్చీలు.  కుర్చీలన్నీ ఇంకా ఖాళీగా ఉన్నాయి.  కాసేపట్లో సందడి మొదలౌతుంది. పేకాటరాయుళ్ళు, పీకలదాకా తాగేవాళ్ళు భవనంలోపలే కూర్చుంటారుగనక లాన్స్ లో కాస్త ప్రశాంతంగానే ఉంటుంది.  కుర్చీలన్నీ దాటుకుంటూ వెళ్లి ఒక మూల కూర్చున్నాడు కెన్  – ‘ఇక్కడైతే చీకట్లో ఎక్కువమందికి కనిపించం’ అనుకుంటూ. ఇది జాన్ కి తను వ్యక్తిగతంగా ఇస్తూన్న వీడ్కోలువిందు. ఇంకెవర్నీ పిలవలేదు. పదింటికల్లా ముగించి బంగళాలకు బయిల్దేరాలని ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నారు.

పాగా, ఎర్రకోటూ, నీలం కమర్బంద్ ధరించిన బేరర్ పరుగెత్తుకుంటూ వచ్చి, వంగి సాయిబుల పద్ధతిలో సలాం చేసాడు.

“సింహాచలం! కైసా హై?” ఎన్నాళ్ళయినా కెన్ కి తెలుగు పట్టుబడలేదుగాని హిందుస్తానీతో నెట్టుకుపోగలడు. నేటివ్స్ తో కాస్త సఖ్యంగా ఉంటే వాళ్ళు ప్రాణాలైనా ఇస్తారని ముప్ఫై ఏళ్ల ఇండియన్ సర్వీసు చివరి దశలో అతను గ్రహించాడు. ఈ గ్రహింపు వెనుక జాన్ ప్రభావం చాలానే ఉంది. అలాగని వాళ్ళని నెత్తికెక్కించుకోకూడదు – ఇది మాత్రం ముందే తెలుసు.

కెన్ దొరంతటి వాడు తనని పేరుపెట్టి పిలిచినందుకు సంతోషం పట్టలేక పోయాడు సింహాచలం.  “అచ్ఛా హూ, సార్. క్యా లేంగే సార్” అన్నాడు.

అందాకా తనకో బీరు, జాన్ రాగానే షాంపేన్, ఆవెంటనే విస్కీ ఆర్డరు చేసాడు. దోమలురాకుండా ధూపం వెలిగించమన్నాడు. సింహాచలం పరుగుతీసాడు.  జాన్ దొర వొస్తున్నాడంటే అతనిలో ఉత్సాహం ఉప్పొంగింది. ఎప్పుడో గాని రాడు; వొచ్చినప్పుడల్లా అర్థరూపాయికి తక్కువ కాకుండా బక్షీష్ ఇస్తాడు మరి. తెలుగు ఒక మాదిరిగానైనా మాట్లాడే దొర జాన్ ఒక్కడే.

Kadha-Saranga-2-300x268

పొగాకు దాచి మడత పెట్టిన తోలు సంచీ, పైపూ కోటుజేబులోంచి తీసి టేబుల్ మీద పరిచి పైపులో పొగాకు కూరడం మొదలు పెట్టాడు కెన్. ఇండియాలో ఉన్న ముప్ఫై ఏళ్లల్లో చాలామందికి స్వాగతాలు పలికాడు;  వీడ్కోళ్ళు చెప్పాడు. వచ్చేవాళ్ళు సవాలక్ష సందేహాలతో జంకుతూ వస్తారు. వెళ్ళేటప్పుడు ఆత్మవిశ్వాసంతో పొంగిన చాతీలతో, బరువైన డబ్బు సంచులతో వెళతారు. ఇంగ్లాండు తిరిగివెళ్ళి పోతున్నామనే ఉత్సాహం, ఇండియాను వీడిపోతున్న దిగులుని అధిగమిస్తుంది. భార్యలైతే మరీను. ఎగిరి గంతేసి వెళ్ళిపోతారు. ఇంగ్లండులో  నౌకర్లు ఉండరనేదొక్కటే వాళ్ళకు దిగులు కలిగించే విషయం.  జాన్ భార్యా, పిల్లలూ ఆరు నెలల క్రిందటే వెళ్ళిపోయారు. వాళ్ళు ప్రయాణం కడుతున్నప్పుడు –

“ఏ విషయంలో ఇండియాని మీరు మిస్ అవుతారు?” అని కెన్ అడిగితే, జాన్ పిల్లలిద్దరూ తడుముకోకుండా – “మామిడిపళ్ళు” అని టపీమని జవాబు చెప్పారు. అప్పుడు వాళ్ళని చూస్తే కెన్ కి ముచ్చటేసింది. ఇప్పుడు తలుచుకుంటూంటే – తనకి భార్యా, పిల్లలూ లేకపోవడం గుర్తుకొచ్చి బాధ కలిగిస్తోంది. అసలు తను ఇండియా వచ్చినప్పుడే ఐదు, పదేళ్లకన్నా ఎక్కువ ఉండననుకున్నాడు. అలాటిది తనకన్నా తరవాత వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు; వెళ్ళిపోతున్నారు.

పాతికేళ్ళ సర్వీసు దాటాక ‘ఇక్కడేం తక్కువ? చిన్నజమీందారు లాగా బతుకుతున్నాను. ఇప్పుడు ఇంగ్లాండు వెళ్లి మాత్రం ఏం ఊడపొడవాలి?’  అన్న ఆలోచన బలపడింది. బంగాళా చుట్టూ పెంచిన తోటన్నా, తనని విడిచి ఉండలేని కుక్కలన్నా అమితమైన ప్రేమ ఏర్పరచుకున్నాడు. ఒక ఆంగ్లో-ఇండియన్ టీచర్ దగ్గరైంది. ఇంకేం కావాలి? కానీ ఎక్కడో ఏదో అసంతృప్తి.  ఎంతమంది వెళ్ళిపోయినా ఏమంత అనిపించలేదు గానీ  జాన్ వెళ్ళిపోతాడంటే మనసుకి కష్టంగా ఉంది.

సింహాచలం గ్లాసులో పోసిన బీరు గుక్కెడు తాగి, గ్లాసు కిందపెట్టి  పైపు వెలిగించాడు. చీకటవుతోంది. గాస్ దీపాలు వెలిగించారు. దోమలింకా రాలేదు. ధూపం పనిచేస్తున్నట్టుంది. పాతికేళ్ళు ఇంగ్లండులోనూ, ముప్ఫైఏళ్ళు ఇండియాలోనూ గడిపాడు. ఏది తన దేశం? ఇక్కడే పోతే ఏ వాల్తేరు సెమెట్రీ లోనో పాతిపెడతారు. ఎక్కడయితేనేం? చివరికి మట్టిలో కలిసిపోవడమే కదా?…ఛ ఛ…ఎందుకిలా ఆలోచిస్తున్నాడు?

Art: Srujan Raj

తను ఇలా దిగాలుగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు  తన అంతులేని ఉత్సాహంతో, సునిశితమైన హాస్యంతో జాన్ తనని పైకిలాగాడు? జాన్ కి ఆసక్తిలేని విషయమేదీ లేదనిపిస్తుంది. ఎన్నో విషయాల గురించి మాట్లాడతాడు. తెగ చదువుతాడు. ఏవేవో కొత్త వార్తలు, సంగతులు చెబుతూనే ఉంటాడు. అలాగని ఎవరిగురించీ చెడ్డగా చెప్పడు.   టెన్నిస్, క్రికెట్ ఆడతాడు. మంచి కార్యదక్షుడిగా పేరుపొందాడు. అతనికింకా పదేళ్ళు సర్వీసుంది. అనుకోకుండా లండన్ లోని  ఇండియా ఆఫీసులో ఉపకార్యదర్శిగా చేరమని ఉత్తర్వు వచ్చింది. అంటే రిటైరయ్యే నాటికి చాలా పెద్ద పొజిషన్ లోకి వస్తాడు. అలాంటి అరుదైన స్నేహితుడు వెళ్ళిపోతున్నాడు.

పైపు ఆరిపోయింది. కోటు లోపలి జేబులోంచి గొలుసు గడియారం తీసి చూసాడు. ఏడు దాటింది. కొన్ని టేబుళ్ల చుట్టూ జనం చేరారు. పకపకా నవ్వులు వినిపిస్తున్నాయి. దోమలు కుడుతున్నాయి. కెన్ కి చిరాగ్గా ఉంది. ఆరిన పైపుని టేబిల్ మీద విదిలించి కొట్టాడు. బూడిద బయటకొచ్చి తెల్లటి టేబిల్ క్లాత్ ని పాడుచేసింది. అతని చిరాకు ఇంకా ఎక్కువైంది. అటుగా వెళ్తున్న ఒక బేరర్ ని కసిరినట్టుగా పిలిచి మరో బీరు తీసుకురమ్మన్నాడు. సేవకుల పట్ల వ్యవహరించాల్సిన తీరుపై జాన్ నేర్పిన పాఠాలు రెండుగ్లాసుల బీరుతో ఎటో ఎగిరిపోయాయి.

ఈరోజు అతనికెందుకో జెన్నిఫర్ జ్ఞాపకం వస్తోంది. ఇరవై ఏళ్ల కిందటి మాట. లేక ఇంకా ఎక్కువే అయిందా? ఇప్పుడు తగ్గిపోయిందిగాని అప్పట్లో ప్రతీ ఏడూ చలికాలపు రోజుల్లో, అంటే క్రిస్టమస్ సెలవుల్లో పెళ్లికొడుకుల్ని వెతుక్కుంటూ ఇంగ్లండు నుండి యువతుల బృందాలు  తరలివచ్చేవి. వాళ్ళని ‘గేలం యువతులు’ అనే వాళ్ళు.  కలకత్తా, బొంబాయి, డిల్లీ, సిమ్లా – ఈ ప్రదేశాలన్నీ చుట్టబెట్టే వాళ్ళు. కొన్ని గేలాలకి చేపలు పడేవి; లేదంటే సరదాగా సెలవులు గడిపేసి ఎండలు ముదిరేలోగా తిరిగివెళ్ళిపోయేవారు. జెన్నిఫర్ కూడా అలాగే వచ్చింది. ఇక్కడే, ఈ క్లబ్బులోనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. అర్థరాత్రి వరకూ సంగీతం, డాన్సులు, నవ్వులు, కేరింతలు – అదంతా ఓ కలలా అనిపిస్తోంది. అదే రోజున ప్రపోజ్ చేద్దామనుకుంటూ ఎందుకో జంకాడు. చేసి ఉంటే ఎలా ఉండేదో? వాళ్ళిద్దరి మధ్యా ఏదో ఉందని అందరూ అనుకున్నారు.

ఆమె  జాన్ కి కజిన్. వాళ్ళింట్లోనే దిగింది. వేసవిలో తనని లండన్ రమ్మంది, ఉత్తరాలు రాస్తానంది. ఎందుకోగాని మనసు మార్చుకుంది. తను రాసిన ఉత్తరాలకి జవాబివ్వలేదు. ముడిపడుతున్న బంధాన్ని చేతులారా ఎందుకు తెంచింది? జాన్ ని అడుగుదామని చాలా సార్లు అనుకున్నాడు గాని, తీరా అడిగితే ఏ చేదునిజం చెబుతాడో అని ఊరుకున్నాడు. ఆమె నవ్వినప్పుడు బుగ్గమీద పడే సొట్ట, న్యూ ఇయర్ పార్టీ నాడు ఆమె వేసుకున్న ఎర్ర ముఖమల్ గౌను, అదే ఎరుపు లిప్ స్టిక్,  మెడలో మెరిసే ముత్యాల పేట – కళ్ళకి కట్టినట్టుగా గుర్తొస్తున్నాయి. మర్చిపోయినవి అనుకున్న సంగతులు మస్తిష్కపు మారు మూలల్లో దాగి ఉంటాయి కాబోలు; ఎప్పుడెప్పుడో ఉబికి వస్తాయి. అలా వచ్చినప్పుడల్లా కొత్తకొత్త రంగులు పులుముకొని మరీ వస్తాయి. గతానికి వర్తమానం  చేసే అలంకరణ అది. జెన్నిఫర్ ఇప్పుడెలా ఉందో? ఒకేఒక సారి మాటల సందర్భంలో జాన్  ఆమె ప్రసక్తి  తీసుకొచ్చాడు – పెళ్లి చేసుకొని గ్లాస్గోలో స్థిరపడిందని చెప్పాడు.

చీకట్లో ఎట్నుంచి ఊడిపడ్డాడోగాని, “సారీ, ఆలస్యం అయింది” అంటూ చటుక్కునవచ్చి కూర్చున్నాడు జాన్, తన ఉత్సాహభరితమైన చిరునవ్వుతో.

“ఏడుకే క్లబ్బుకి చేరాను గాని రిసెప్షన్ దగ్గర ఎప్పట్నించో కలవాలనుకుంటున్న ఒక ప్రముఖ వ్యక్తిని ఒకాయన పరిచయం చేశాడు. నాలుగు ముక్కలు మాట్లాడే సరికి ఆలస్యం అయింది”

“ఎవరా వ్యక్తి?”

“మనం ఎప్పటినుంచో వింటూన్న పేరే. సర్ ఆర్థర్”

“ఆ!? సర్ ఆర్థర్ కాటనే?!”

“ఆహా, ఆయనే!”

“ఏమంటాడు?”

“టూకీగా చెబుతాను. బ్రిటీష్ పాలనకు గుర్తుగా చిరకాలం మిగిలిపోయే ఉత్తమచిహ్నాల గురించి సంభాషణ సాగుతోంది. సీనియర్ రైల్వే అధికారి ఒకాయన – శాశ్వతంగా ఈ దేశంలో నిలిచిపోయేది భారతీయ రైల్వేవ్యవస్థ మాత్రమే అన్నాడు”.

Calcutta Club_Bearer

“అలా అంటే కాటన్ మహాశయుడు ఒప్పుకోడే?”

“అవును మరి. జవాబుగా సర్ ఆర్థర్ – రైల్వేల మీద పెడుతున్న ఖర్చులో పదోవంతు నీటి పారుదల, జలరవాణాల మీద పెడితే ఇంకా గొప్ప ప్రయోజనాలను ఈదేశస్తులు పొందిఉండేవారన్నాడు. ఈ దేశపు అపార జలసంపదని సద్వినియోగంచేసి లక్షలమందిని కరువులనుండి ఎలా శాశ్వతంగా విముక్తులను చెయ్యవచ్చో చెప్పాడు. రైల్వేలు అవసరమేగాని పంటభూములకు నీరు అందించడం పాలకుల మొదటి కర్తవ్యం అన్నాడు. భారతదేశపాలకులు ప్రాచీనకాలం నుండీ  ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూవస్తున్నారన్నాడు”.

“ఇదే అతని వాదన, ఎప్పట్నించో” అన్నాడు కెన్.

“ఈరోజున తన వాదనని హేతుబద్ధంగానే కాకుండా భావోద్వేగంతో కూడా వినిపింప జేశాడు. తక్షణ లాభనష్టాల బేరీజు కన్నా దీర్ఘకాలిక ప్రయోజనాలు, ప్రాణాల్ని కాపాడడం ముఖ్యం అన్నాడు. ఈ దృష్టి లేకపోతే భగవంతుడు పాలకులను క్షమించడన్నాడు. అతనికి హృదయానికి చాలా దగ్గరగా ఉండే ప్రతిపాదన – ఈ దేశపు నదుల్ని అనుసంధించే పథకం గురించి చెప్పాడు. ముసలాడి ఉత్సాహం చూస్తే ముచ్చటేసింది”.

“పదవీ విరమణ చేసి ఇంగ్లండు వెళ్లిపోయాడని విన్నాను?”

“నిజమే. ప్రభుత్వంవారి పిలుపుమీద సలహాదారుడిగా ఈ మధ్యనే తిరిగి వచ్చాడు. కుంఫిణీ పాలన ముగిసి ప్రత్యక్ష బ్రిటీష్ ప్రభుత్వ పాలన ఏర్పడింది గనక, ఇటువంటి నిపుణుల సలహాలతో ఇకమీదట పెద్దపెద్ద పథకాలు అమలు కాబోతున్నాయనే ఆశాభావం పెరుగుతోంది”.

“ఈరోజున సర్ ఆర్థర్ వస్తున్నట్టు క్లబ్బువాళ్ళు ముందుగా చెప్పలేదే? ఒట్టి పనికిమాలిన సజ్జు” అన్నాడు కెన్ చిరాగ్గా.

“టౌన్ హాల్లో ఆయనకి సన్మానం జరిగింది. ఆ విషయం నాకూ తెలుసుగాని వెళ్ళడం కుదరలేదు. నీక్కూడా ఆహ్వానం వచ్చి ఉండాలే? డిన్నర్ కని ఇక్కడికి తీసుకొచ్చినట్టున్నారు. నేను కలిసినప్పటికే  భోజనాలు ముగించి బయిల్దేరిపోతున్నారు”.

సర్ ఆర్థర్లాంటి మహానుభావుడిని కలుసుకొనే అవకాశం చేజారిపోయినందుకు కెన్ మనసు అసంతృప్తి తో నిండి పోయింది. అది గ్రహించిన జాన్ –

“ఇంకా కొన్నాళ్ళు ఉంటాడులే. విశాఖపట్నం పోర్టు పథకం ముందుకెళ్ళేటట్టుగా ఉంది. దానికి మరి ఈయనే ఆద్యుడు కదా. ఇరవై ఏళ్ల కిందట సర్ ఆర్థర్ ఇక్కడే యారాడ కొండమీద కుటుంబంతో సహా రెండేళ్లున్నాడు – నువ్వు వినే ఉంటావు. అప్పుడే పోర్టు నిర్మాణానికి ప్రతిపాదన చేసాడుగాని నిదులులేక కుంఫిణీ అధికారులు దాన్ని పక్కన పెట్టారు”.

“బ్రిటిష్ పాలనకు గుర్తులు అన్నావు. అంటే మనం ఇక్కడినుంచి వెళ్ళిపోయే పరిస్థితి రావచ్చునంటావా?” ఈ ఊహకందని పరిణామం కెన్ ని కంగారుపెట్టింది. తన కుక్కలూ, బంగళా, తోటా, సహచరీ గ్యాపకం వచ్చాయి – అదే క్రమంలో .

“ఇప్పట్లో కాదులే. నువ్వూనేనూ ఆ రోజు చూడం గాని ఎప్పుడో వస్తుంది. తప్పదు”.

కెన్ కాస్త ఊపిరి పీల్చుకుని, “ఇంగ్లీషు పాలనలో లేని భారతదేశం! ఊహకే అందడం లేదు” అన్నాడు.

సింహాచలం వచ్చి షాంపేన్ సీసాని కెన్ కి అందజేశాడు. పొగాకు బూడిదని తుడిచి, వైన్ గ్లాసుల్ని, వేయించిన చేప ముక్కల్నీ  టేబిల్ మీద సర్దివెళ్ళిపోయాడు. కెన్ స్వయంగా బిరడా తీసి, ఇద్దరి గ్లాసుల్లోనూ పోసాడు.

“ఛీర్స్! భారతదేశంలో నీ అద్భుత అనుభవాల్ని  గుర్తుచేసుకుంటూ, ఇంగ్లండులో మరిన్ని విజయాల్ని సాధించాలని కోరుకుంటూ –“

ఇద్దరి మధ్యా కాసేపు నిశ్శబ్దం. బీరు, షాంపేన్, విస్కీ కలగలిసిపోయి కెన్ లోలోపల గందరగోళం సృష్టిస్తున్నాయి. దూరంగా సముద్రపు హోరు. ‘మనం ఇక్కడ లేకపోవడం’ అన్న ఆలోచనే అతనికి ఇబ్బందికరంగా, చిరాగ్గా ఉంది.

“మనం వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందని ఎందుకనుకుంటున్నావు, జాన్?”

“1857లో ఏమైందో చూశాం. చావుతప్పి కన్నులొట్ట పోయింది. కేవలం లాభార్జన కోసం ఏర్పడ్డ కుంఫిణీ మాదిరిగా కాకుండా బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా వ్యవరించవలసిన రోజులొచ్చాయి. లేకపోతే ఇక్కడ మనం కొనసాగడానికి జనామోదం ఉండబోదు. వాళ్ళు తిరగబడితే మనం చెయ్యగలిగేది ఏమీలేదు. ఈ మధ్య ఇంగ్లీషు చదువులు, ముఖ్యంగా ఇంగ్లండువెళ్లి చదువుకొని తిరిగిరావడం ఎక్కువైంది. వాళ్ళంతా ఎక్కువగా మధ్యతరగతి, లేదా ఉన్నతవర్గ, అగ్రవర్ణ లాయర్లు, ఉపాధ్యాయులు; ఇంగ్లీషు చక్కగా మాట్లేడే వాళ్ళు, రాసే వాళ్ళూను. మనకి అత్యంత ప్రమాదకరమైన సమూహం ఇదే”.

కొంతమంది నేటివ్ లాయర్లు, ఉపాధ్యాయులు ఒక మూల గుమిగూడి బ్రిటీష్ సామ్రాజ్యాన్ని అంతమొందించేందుకు మంతనాలు చేస్తున్నారని ఊహించుకుంటే కెన్ కి నవ్వొచ్చింది. ఈ మాటన్నది జాన్ గనక నవ్వకుండా విన్నాడు.

“వీళ్ళ నాయకత్వంలోనే రాబోయే కాలపు తిరుగుబాట్లు పుట్టుకొస్తాయి. సిపాయిల్లోంచి కాదు. వీళ్ళని ఎదుర్కోవడానికి కొత్త ఎత్తుగడలు అవసరం. వాళ్ళకన్నా తొందరగా నేర్చుకుంటేతప్ప వాళ్ళని ఎదుర్కోలేం”.

“పాతిక ముప్ఫై ఏళ్లనుంచి ఇక్కడ పనిచేస్తున్నాం. ఈ దేశాన్ని నియంత్రిస్తున్నాం. ఇప్పుడు కొత్తగా నేర్చుకొనేదేముంది?”

Art: Srujan Raj

“ఇక్కడికి వచ్చే అధికారులకు కుంఫిణీ వారు ఇస్తూవచ్చిన తర్ఫీదు ఇంకెంతమాత్రమూ సరిపోదనన్నీ, ఇండియన్ సివిల్ సర్వీస్ అనే కొత్త విభాగాన్ని ఏర్పరచాలని 1858లో తీసుకున్న నిర్ణయాన్ని హుటాహుటిన అమలు చేస్తున్నారు.  ఈ కొత్త కాడర్ ని నిర్మించేందుకూ, మరోవైపు  గూఢచార వ్యవస్థని పటిష్టం చేసేందుకూ చాలామందిని దిల్లీలోనూ, లండన్ లోనూ కొన్ని  ప్రత్యేక విభాగాల్లో నియమిస్తున్నారు. ఇప్పుడు నాకు అప్పగించిన బాధ్యతలు కూడా ఇలాంటివే”.

ఒక్క క్షణంలో కెన్ కి మొత్తం అంతా అర్థమైపోయింది. కాని ఒక సందేహం అతన్ని పీడిస్తోంది.

“మనం లేకపోతే ఈ దేశం ముప్ఫైమూడు చెక్కలవుతుంది” అన్నాడు– కొంచెం అలకతో కూడిన స్వరంతో.

“నిజమే. మన పాలనలేకపోతే  ఈ దేశపు లోలోపలి సంఘర్షణలు, వాటితోబాటు మధ్యయుగ అవలక్షణాలు బయటపడతాయి. రైల్వేలు, టేలిగ్రఫీ, విద్యా, న్యాయవ్యవస్థలు – ఇవే దీర్ఘకాలిక ప్రగతికి మనం ఏర్పరచిన మార్గాలు.  గమ్మత్తేమిటంటే ఇవే రేప్పొద్దున్న మన పీకలకు చుట్టుకుంటాయి”.

కెన్ కిక్కు కొంచెం దిగింది. ఆసక్తిగా వింటున్నాడు. సింహాచలం ఆఖరి రౌండు విస్కీ, సలాడ్, చికెన్ బిరియానీ తీసుకొచ్చి పేర్చాడు.

“ఈ మధ్య ఒక నివేదిక చదివాను. దాంట్లో ఒక పాత్రికేయుడు – పేరు గుర్తు రావడం లేదు – 1857నాటి సంఘటనల గురించి రాస్తూ ‘తిరుగుబాటు విఫలమైందిగాని బ్రిటిష్ వారు ప్రవేశపెడుతూన్న రైల్వేలే వారి కొంపముంచుతాయి. అన్ని కులాలవాళ్ళూ రైళ్లల్లో కలసికట్టుగా ప్రయాణిస్తారు. క్రమేపీ వారిమధ్య విభేదాలు తొలగిపోతాయి’ – ఈ ధోరణిలో.  విడ్డూరంగా అనిపించినా దీంట్లో కొంత నిజం ఉంది”.

కెన్ ఇక తమాయించుకోలేక పోయాడు. “రైళ్లల్లో ప్రయాణిస్తే కుల వ్యవస్థ అంతం కావడమేమిటి? ఎవడా రాసింది?”

“ఎవరో  జర్మన్ అనుకుంటా. మొదటిసారిగా మనం ఈ దేశపు ప్రజలు, ప్రాంతాలు చేరువకాగల అవకాశాల్ని సృష్టించామన్నది మాత్రం వాస్తవం”.

“ఇదంతా సరేగాని జాన్, మళ్ళీ తిరిగి ఎప్పుడొస్తావు?” అనడిగాడు కెన్ – సంభాషణని మరో దిశలోకి మళ్లిస్తూ.

“ఏమో? ప్రభుత్వంవారు పంపితేనే”.

“ఈ దేశం వదిలి వెళ్ళాలంటే నీకేమనిపిస్తోంది?”

“నేనిక్కడికి వచ్చినప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి. బంగాళాఖాతం,  అరేబియన్ సముద్రం, హిందూమహాసముద్రం, హిమాలయా పర్వతాలు, గంగానది, వారణాసి, పాటలీపుత్రం, కపిలవస్తు, మలబార్, కోరమాండల్ – ఈ పేర్లలోనే గొప్ప చరిత్ర, సాహసకృత్యాలు, రొమాన్సు దాగి ఉన్నట్లు అనిపించేది. ఇప్పటికీ ఆ భావన అలాగే ఉంది. మా అబ్బాయి ఈ మధ్య రాసిన ఉత్తరంలో ఒక మంచి మాటన్నాడు. ఒక దేశం పేరున ఉన్న ఏకైక మహాసముద్రం  ఇండియన్ ఓషన్ అని. నిజమే కదా అనిపించింది”.

“ఇప్పుడేమనిపిస్తోంది?”

“ఇప్పుడా? భారతదేశంలో ఇన్నాళ్ళు పనిచేయడం నాకు లభించిన గొప్ప అవకాశం అనిపిస్తోంది. ఇది నా జీవితకాలపు గొప్ప అనుభవం. దీన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడి ప్రజలకోసం చెయ్యగలిగిన మంచిపనులేమైనా చెయ్యాలనేదే నా కోరిక. ఇవాళ అనుకోకుండా సర్ ఆర్థర్ ని కలుసుకున్నాక ఇలాగని మరీబలంగా అనిపిస్తున్నది. నేనీ క్లబ్బుకి వచ్చిన ఆఖరిరోజున ఆయన తటస్థపడడం దైవసంకల్పం కావచ్చు”.

కాసేపు మౌనంగా బిరియానీ తిన్నారు. భావోద్వేగంతో మాట్లాడడం జాన్ పద్ధతి కాదు. ఈ రోజు మాత్రం అతనిలో ఎక్కడో దాగిన ఉద్వేగ స్వరాలు వినిపించాయి కెన్ చెవులకి.

జాన్ కి కూడా అలా అనిపించిందేమో. “నేనిక బయిల్దేరాలి” అని ఏకపక్షంగా, ముక్తసరిగా ప్రకటించి లేచి నిటారుగా నిలబడ్డాడు. అర్థరాత్రి అయితేగాని కెన్ క్లబ్బు నుండి కదలడని జాన్ కి తెలుసు.  అయిష్టంగానే కెన్ కూడా లేచాడు; లేవగానే ఒకింత తూలాడు. కుర్చీని పట్టుకొని సంభాళించుకుని అడుగు ముందుకేసాడు. క్లబ్బు గేటువైపు నడుస్తున్నారు. నిండు పున్నమి వెన్నెల. పాదాలక్రింద ఎండుపుల్లలు విరుగుతున్నాయి.

సింహాచలం పరుగెత్తుకుంటూ వచ్చాడు. “దొరగారు పైపు మర్చిపోయారు” అని కెన్ కి అందజేశాడు. “గుడ్ నైట్ సార్” అన్నాడు వంగి సలాం చేస్తూ. జాన్ ఒక వెండి జడ రూపాయి – విక్టోరియా రాణి బొమ్మ ఉన్నది – సింహాచలం చేతిలో పెట్టాడు. అతను సలాంచేసి వెళ్ళిపోయాడు.

స్నేహితులిద్దరూ ముందుకి నడిచారు. కీచురాళ్ళ రొద; వాటి వెనుక తరంగ ఘోష. రెండు కెరటాల మధ్య కొద్దిక్షణాల ఉద్రిక్త నిశ్శబ్దం. ఆ తరవాత మళ్ళీ కెరటం విరిగిన సంరంభం.

“నేనొకటి అడుగుతాను, చెబుతావా?” అన్నాడు కెన్.

“అడుగు”.

“జెన్నిఫర్ ఎందుకు మనసు మార్చుకుంది? నీకేమైనా చెప్పిందా?”.

“నేనే ఆమెకు చెప్పాను. మీ ఇద్దరికీ జోడీ కుదరదని. నాకలా అనిపించింది మరి – అప్పట్లో”.

కెన్ ఇంకేమీ అనలేదు. గేటు సమీపించారు. వీళ్ళ రాకని గమనించిన జట్కాగుర్రం తలాడించి సకిలించింది. జట్కాసాయిబు ఉలిక్కిపడి నిద్రలేచాడు.

(వివరణలు: ఆర్థర్ కాటన్ 1860లో పదవీవిరమణచేసి ఇంగ్లండ్ వెళ్ళిపోయాడు. బ్రిటిష్ ప్రభుత్వం కోరికపై 1863లో తిరిగివచ్చి సుమారు ఏడాదిపాటు  ఉన్నాడు గాని ఆ వ్యవధిలో మళ్ళీ విశాఖపట్నం వచ్చిన దాఖలాలు లేవు. 1863లోనే ఇండియన్ సివిల్ సర్వీస్ లో చేరే అర్హతను సాధించిన మొదటి భారతీయుడు – రవీంద్రనాథ్ టాగోర్ అన్నగారైన సత్యేంద్రనాథ్ టాగోర్. రెండవ వ్యక్తి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పనిచేసిన రొమేష్ చంద్ర దత్. మూడవది బ్రహ్మోసమాజ్ లో చేరిన బిహారిలాల్ గుప్తా.  నాలగవ వ్యక్తి  సురేంద్రనాథ్ బెనర్జీ. బ్రిటిష్ పార్లమెంట్ లో మొదటి భారతీయ సభ్యుడు, సెకండ్ ఇంటర్నేషనల్ సభ్యుడైన దాదాభాయి నౌరోజీ భారతదేశపు అభివృద్ది విషయమై – 1899 వరకూ ఇంగ్లండులో జీవించిన కాటన్ ని  అనేకసార్లు సంప్రదించాడు, ఆయనతో సహకరించాడు. అన్నట్టు – ఈ కథలో జాన్ మర్చిపోయిన జర్మన్ పాత్రికేయుని పేరు కారల్ మార్క్స్).

*

 

మీ మాటలు

  1. డియర్ సుధాకర్ గారు
    మ్కిరు ఒక కొత్త రకపు రచయిత .తెలుగులో మీ శాఖ బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది .చరిత్రని కల్పనతో జత చేయ గలిగిన శక్తీ అందరికి ఉండదు .మనకి చరిత్ర అంటే అభిప్రాయాలు యదార్థ విషయాలు థెఉసుకెనె ఓపిక మీకు ఉన్నట్టు చాలామందికి ఉండదు నేనే కాటన్ జీవితం కృషి మనసు ఫౌండేషన్ వారు కోరగా అనువదించాను చూసే ఉంటారు. అనువాదం మూలం యొక్క ప్రత్యేక వాసన కలిగి ఉండాలని నేను నమ్మి చేసాను .జనం ఇంకా అటువంటి వాటికి అలవాటు పడలేదు అనుకుంటాను .అనుసరించి అర్థాలు విషయాలు మార్చి వ్రాస్తూ ఉంటారు

  2. కె.కె. రామయ్య says:

    త్రిపుర గారి ఉణుదుర్తి సుధాకర్ గారు, మీ నుంచి వచ్చిన మరో ఆణిముత్యం కధ ( కినిగే లో వచ్చిన ‘ఇద్దరు మావయ్యల కధ’ ను మించి లేదనుకోండి ).

    ” రైల్వేలు, టేలిగ్రఫీ, విద్యా, న్యాయవ్యవస్థలు – ఇవే దీర్ఘకాలిక ప్రగతికి మనం ( బ్రిటీష్ పాలకులు ) ఏర్పరచిన మార్గాలు ”
    భారత రక్షణ వ్యవస్థ ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ ప్రస్తావన రాలేదేందుకు వారి సంభాషణలో ?
    Historians often rate the ICS, together with the Railway system, the Legal system, and the Indian Army, as among the most important legacies of British rule in India.

    ICS ప్రముఖుల్లో పి.రాజగోపాలాచారి (1886), సుభాష్ చంద్ర బోసు (1920) లు కూడా గుర్తుకొస్తున్నారు.

    ‘భారతదేశం లోని అన్ని కులాలవాళ్ళూ రైళ్లల్లో కలసికట్టుగా ప్రయాణిస్తారు. క్రమేపీ వారిమధ్య విభేదాలు తొలగిపోతాయి’ అన్న జర్మన్ పాత్రికేయుదు కారల్ మార్క్స్ మహాశయుడి కల పూర్తిగా నిజమైనదా ?

    స్పందించిన కవన శర్మ గారికి కృతజ్ఞతలు.
    సర్ ఆర్థర్ కాటన్ జీవితం – కృషి Sir Arthur Cotton Jeevitam కృషి, ఆంగ్ల మూలం: కాటన్ కుమార్తె, లేడీ హోప్
    తెలుగు అనువాదం: ప్రొఫెసర్ కవన శర్మ ( పుస్తకం లభించు చోటు : http://kinige.com/book/Sir+Arthur+Cotton+Jeevitam+కృషి )

  3. vidyasagar says:

    ‘భారతదేశం లోని అన్ని కులాలవాళ్ళూ రైళ్లల్లో కలసికట్టుగా ప్రయాణిస్తారు. క్రమేపీ వారిమధ్య విభేదాలు తొలగిపోతాయి’ అన్న జర్మన్ పాత్రికేయుదు కారల్ మార్క్స్ మహాశయుడి కల పూర్తిగా నిజమైనదా ?
    మార్క్స్ ఎక్కడ అలా చెప్పారు ? దయచేసి మార్క్స్ చెప్పిన మాటలను యధాతదంగా చెప్పగలరు.

  4. Sudhakar Unudurti says:

    “Modern industry, resulting from the railway system, will dissolve the hereditary divisions of labour, upon which rest the Indian castes, those decisive impediments to Indian progress and Indian power “.
    Works of Karl Marx 1853, ‘The Future Results of British Rule in India’ .
    https://marxists.anu.edu.au/archive/marx/works/1853/07/22.htm

  5. manne sumadhur says:

    మీ కథ చాల బాగుంది .
    మన్నే సుమధుర్

మీ మాటలు

*