మనుషులు చేసిన దేవుళ్ళారా!

 

[పోయిన వ్యాసానికి కొనసాగింపు]

 దేవుడు అనే భావన అలౌకికమైనది. కానీ మతం భౌతికమైనది (Religion is a physically existing thing). ప్రతి భౌతిక పదార్థం తన చుట్టూ ఉన్న భౌతిక పరిస్థితుల మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే తిరిగి ఆ భౌతిక పరిస్థితుల ప్రభావానికి లోనవుతుంది. అనగా మానవ సమాజంలో వచ్చే మార్పుల ప్రభావం మతం మీద పడుతుంది, అలాగే మతంలో వచ్చే మార్పుల ప్రభావం మానవ సమాజం మీద పడుతుంది. భౌతిక పదార్థాలన్నీ నిరంతరం మార్పుకు లోనయ్యేవే. ఏది ఎల్లకాలలపాటు ఒకేలా ఉండదు. ఇది మనం బాగా అర్థం చేస్కోవాల్సిన విషయం.

మతం ప్రధానంగా వాస్తవ ప్రపంచంలో కనపడని శక్తులు/ఆత్మలు/లోకాలు వగైరాల చుట్టూ తిరిగుతుంది. మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు, ఇటువంటి అలౌకిక భావనలు ప్రచారం జరగాలంటే భాష తగినంత అభివృద్ధి చెంది ఉండాలి. ఇంకా కళలు కూడా తగినంత అభివృద్ధి జరిగి వుండాలి .

ఉదాహరణకి “ఆత్మ” అనే భావనని భాష లేకుండా ఇంకొకరికి అర్థమయ్యేలా చెప్పడం ఎంత కష్టతరమైన విషయం? అలాగే బయట ప్రపంచంలో లేని ఊహాతీత శక్తులకి ఏదో ఒక రూపం కల్పించక పోతే, దాన్ని ఇతరులకి వ్యక్తపరచడం చాలా కష్టమవుతుంది.

మతం ఒక సామూహిక ఊహ. వ్యక్తిగతంగా ఎవరో ఒకరి మెదడులో పుట్టిన ఊహ సమూహంలోని అందరికీ అర్థమయితేనే అది ఒక సామూహిక ఊహగా మారుతుంది. ఇది భాషగానీ, చిత్రకళ గానీ, శిల్పకళ గానీ లేకుండా సాధ్యపడదు. ప్రారంభ దశలలో మతం యొక్క అభివృద్ధి భాష, కళ ఆటంకాలు. వాటి అభివృద్ధి మీదనే మతం అభివృద్ధి ఆధారపడి ఉంది.

ఈ క్రమాన్ని ఒక infographic తో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది.

vinod1

కొండ గుర్తు ౩:

మనుషులకి ప్రకృతి మీద అవగాహన పెరుగుతున్నా కొద్దీ కొత్త ఆవిష్కరణలు జరుగుతాయి. ఇవి మానవ జీవన విధానంలో మార్పులు తీసుకువస్తాయి. మనుషుల జీవన విధానం మారడం అంటే సమాజం మొత్తం మార్పుకి లోనవుతున్నట్టు. ఈ మార్పు తిరిగి భాష, కళ, మతాలలో మార్పులు తీసుకువస్తుంది.

పై infographని గమనించినట్టు అయితే, లోహాన్ని కనుగొన్న తరవాత కళల రంగంలో, ఆయుధాల తయారీలో ఒకే మాదిరి అభివృద్ధి మనం గమనించవచ్చు. 5000 సం|| పూర్వం రాగి, కాంస్యం ఆయుధాలు తయారయ్యాయి. అదే సమయంలో రాగి, కాంస్యం శిల్పాలు తయారుచెయ్యడం మొదలయ్యింది. రెండిటి పునాది ఒక్కటే. లోహాన్ని కరిగించి మలుచుకోవడం నేర్చుకున్న మనుషులు దాన్ని ఆయుధాలు తయారు చెయ్యడంతో పాటు, శిల్పాలు చెక్కడం లో కూడా ఉపయోగించారు. అంతకు ముందు దాకా కేవలం రాతితో శిల్పాలు చెక్కడం జరిగేది. లోహం వచ్చాక లోహపు శిల్పాల ప్రాబల్యం పెరిగింది.

మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు, “దేవుడు” అనే భావనని మనుషులు కల్పించుకున్నారు. ఆ దేవునికి రూపాన్ని కూడా మనుషులే కల్పిస్తారు. ఆ కల్పన చేసే మనుషులు ఏ కాలంలో బతుకుతున్నారు అనే దాన్ని బట్టి ఆ దేవుని రూపం ఆధారపడి ఉంటుంది. లోహమే తెలియని మనుషులు తమ దేవునికి బంగారు కిరీటాన్ని పెట్టడం అనేది అసంభవం. దీనిని తిరగేసి చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఏదైనా ఒక పురాణంలో “దేవుడు ఫలానా కత్తిని వాడాడు” అని ఉందనుకుందాం. దీని అర్థం ఆ పురాణం తయారు చేసిన కవులు ఉన్న సమాజంలో అప్పటికే లోహపు కత్తులు వాడుతున్నారని అర్థం. వారు తాము చూస్తున్న సమాజంలోని విషయాలనే కల్పనలు జోడించి రాయగలరు. ఎలాగయితే ఆటవిక మానవులు కత్తులు, రథాలు ఉన్న దేవుడిని ఊహించలేరో, అలాగే ఈ పురాణాలు తయారు చేసిన కవులు  గన్నులు, బాంబులు ఉన్న దేవుడిని ఊహించలేరు.

అలాగే హిందూ మతంలో బ్రహ్మదేవుడు తలరాత రాస్తాడు అనీ, చిత్రగుప్తుడు పాపాల చిట్టా రాస్తాడు అనీ కొన్ని కథలు ఉన్నాయి. ఇటువంటి కథలు అన్నీ “లిపి” అనేది పుట్టాక మాత్రమే తయారవ్వగలవు. ఎందుకంటే “రాయడం” అనేది తెలియని మనుషులు తాము తయారు చేసుకున్న కథల్లో “రాయడం” గురించి ప్రస్తావించడం జరగదు.

vinod2

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, నేడు ప్రపంచంలో సనాతన/పురాతన మతాలుగా చెప్పబడుతున్న మతాలన్నీ అనాగరిక యుగం ఎగువ దశలో రూపు సంతరించుకున్నవే. హిందూ, గ్రీకు, రోమను పురాణ కథలు, ఇతిహాసాలన్నీ ఈ దశలో పుట్టినవే. దీనికి సాక్ష్యం ఆ పురాణ కథల్లోనే దొరుకుతుంది.

“గ్రీకు సముద్ర దేవుడు పోసేడాన్ త్రిశూలాన్ని ఆయుధంగా వాడాడు” అని గ్రీకు పురాణాలు చెప్తున్నాయి. అలాగే “ హిందూ దేవుడు విష్ణుమూర్తి కౌమోదకి గదని ఆయుధంగా ధరించాడు.” అని హిందూ పురాణాలు చెప్తున్నాయి. అంటే ఈ పురాణ కథలు పుట్టే కాలానికే ఆయా సమాజాలలో లోహపు త్రిశూలాలు, గదలు వాడుకలో ఉన్నాయి అన్నమాట. ఇటువంటి పురాణాలు లోహాన్ని కరిగించి ఆయుధంగా మలిచే పరిజ్ఞానం సంపాదించిన సమాజాల్లోనే పుట్టగలవు. రాళ్లు తప్ప లోహం తెలియని ఆటవిక మానవులు ఇలాంటి దేవుళ్ళని, కథలని ఊహించడం అసాధ్యం. అలాగే “రాముడు రాజ్యాన్ని పరిపాలించాడు” అని ఒక పురాణం చెప్తుంది. అంటే ఈ పురాణ కథ తయారయ్యే సమయానికే రాజ్యాలు, రాచరిక వ్యవస్థ ఏర్పడిపోయాయి అన్నమాట. అడవులలో గుంపులుగా తిరిగే ఆటవిక మానవులకి, నదుల వెంట వలసలు పోయే అనాగరిక మానవులకి “రాజ్యం” అనే వ్యవస్థని ఊహించడం అసాధ్యం.

ఈ పురాణ కథలు ఎవరు తయారు చేసారు అనేది అప్రస్తుతం. ఆ కవులు ఎవరైనా సరే, వారు అనాగరిక యుగం ఎగువ దశలో ఉన్న సమాజానికి చెందినావారే. వారు తాము చూస్తున్న సమాజాన్ని (కొంత కల్పనలని జోడించి) తమ కథల్లో ప్రతిబింబించారు. వారు చూస్తున్న సమాజంలోని రథాలు, గిన్నెలు, ఆభరణాలు, కుర్చీలు, కిరీటాలు, కోటలు, భవంతులు, నగరాలు, కాలిజోళ్ళు, పట్టువస్త్రాలు వంటివన్నీ వారి కావ్యాల్లోకి దిగుమతి అయిపోయాయి. ఇవన్నీ భౌతికమయిన వస్తువులు. ఎవరో ఒకరు తయారు చేస్తే గానీ తయారు కాని వస్తువులు. దానికి వాటిని తయారు చేసే పరిజ్ఞానం కావాలి. ఈ పరిజ్ఞానం కాలంతో పాటు ఒక క్రమపద్ధతిలో అభివృద్ధి చెందుతూ వస్తుంది తప్ప మంత్రంతోనో, తంత్రంతోనో గాలిలోంచి ఊడిపడదు.

ఆ కథల్లో ఏ “దేవుని రూపం” అయితే వర్ణించబడిందో దాన్నే చిత్రకారులు, శిల్పులు తమ బొమ్మల్లో చిత్రిస్తారు. గుళ్ళలోను, ఇళ్ళలోనూ అదే రూపంతో ఉన్న విగ్రహాలు, చిత్రపటాలు పెట్టబడతాయి. ఆ దేవుని చేతిలో సహజంగానే అప్పుడు వాడబడుతున్న లోహపు ఆయుధాలే ఉంటాయి.

హాస్యాస్పదం అయిన విషయం ఏమిటంటే, మనుషులు అభివృద్ధి సాధిస్తున్న కొద్దీ దేవుని రూపంలో కూడా మార్పులు వస్తూనే ఉన్నాయి. కానీ ఏ కాలంలోని మనుషులు ఆ కాలం లో చెలామణీ లో ఉన్న దేవుని రూపమే అసలైన దేవుని రూపం అనీ, అది సృష్టి మొదటి నుంచీ అలాగే ఉందనీ, రాబోయే ఎల్లకాలాల పాటు అలాగే ఉంటుందనీ విశ్వసిస్తారు. మతంలో ఉన్న ప్రత్యేకత ఇదే.

[వచ్చే వారం]

 

మీ మాటలు

  1. Kcube Varma says:

    Baagundandi mee visleshana

మీ మాటలు

*