తమిళతల్లి మేఖలాభరణం ‘మణిమేఖల’

 

 

– రాధ మండువ

~

photoతమిళ పంచకావ్యాలలో రెండవది ‘మణిమేఖల’. ఈ కావ్యాన్ని చేరదేశరాజైన చేరన్ చెంగట్టువన్ ఆస్థానకవి శీతలైశాత్తనార్ రచించాడు. ఈ కావ్యం క్రీ.శ రెండో శతాబ్దంలో రచింపబడినది. తమిళ పంచకావ్యాలలో మొదటిదైన ‘శిలప్పదిగారం’ కి ఈ మణిమేఖల కావ్యం పొడిగింపుగా చెప్పుకోవచ్చు. ఇది ఆ రోజుల్లోనే సంఘసంస్కరణని ప్రోత్సహించే దిశగా సాగిందనీ, సర్వమతాలూ ఒకటే అని చాటి చెప్పిందనీ అంటారు. అందుకే తమిళ పండితులు ఈ కావ్యాన్ని తమిళతల్లి నడుమున ధరించే మేఖలాభరణం (ఒడ్డాణం) గా అభివర్ణిస్తారుట.

తమిళ పంచకావ్యాల్లో మొదటిది సారంగ పాఠకులకి పరిచయం చేశాను. దానికి కొనసాగింపుగా ఉన్న ఈ కథని కూడా పరిచయం చేయాలనే అభిలాషతో దీన్ని క్లుప్తంగా పరిచయం చేస్తున్నాను. ఎమ్ ఎ తెలుగులో మా పాఠ్యాంశంగా ఉన్నదీ, నాకున్న తమిళ ఫ్రెండ్స్ ను అడిగీ, కొంత ఇంటర్నెట్ సాయంతోనూ ఈ కథని రాశాను. ఈ కథని తెలిసిన వారు వారి వారి అభిప్రాయాలనీ, ఇంకా ఇక్కడ తెలియచేయని విషయాలనూ పంచుకోవలసినదిగా కోరుకుంటున్నాను.

కథాసంగ్రహం

1.

చోళ రాజ్యంలోని పూంపుహార్ పట్టణంలో కోవలుడు అనే వ్యాపారి ఉండేవాడు. అతని భార్య కణ్ణగి. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవించేవారు. చోళరాజు ప్రతి సంవత్సరం నిర్వహించే ఇంద్రోత్సవాలలో మాధవి అనే వేశ్య నాట్యం చేసింది. అప్పుడు మాధవిని చూసిన కోవలుడు భార్యను పూర్తిగా విస్మరించి మాధవితో జీవించసాగాడు. మాధవి కూడా కోవలుడు అంటే ఎంతో ప్రేమగా ఉండేది. వారిద్దరికీ పుట్టిన పాపే మణిమేఖల. మాధవే లోకంగా జీవిస్తుండటంతో కోవలుడి వ్యాపారం పూర్తిగా నాశనమైంది. తన భార్య కణ్ణగికి ఆమె పుట్టింటి వాళ్ళు ఇచ్చిన నగలతో సహా మాధవికి సమర్పించుకుని పేదవాడయ్యాడు. మాధవి అమ్మ చిత్రావతి కోవలుడిని వదిలించుకోవాలని అతన్ని నిందించడం, మాధవికి అతని మీద చెడు మాటలు చెప్పడం చేయసాగింది. ఫలితంగా – ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి అనుమానం కలిగింది.

భార్యని మోసం చేశాననే బాధతో, పాశ్చాత్తాప హృదయంతో మాధవిని వదిలి ఇంటికి చేరాడు కోవలుడు. పూలమ్ముకున్న చోట కట్టెలు కొట్టుకునే స్థితిలో ఉండలేక ధనం సంపాదించి తిరిగి తన ఊరికి రావాలని భార్యని తీసుకుని మధురైకి వెళ్ళాడు. అక్కడ దొంగతనం ఆరోపింపబడి హతుడయ్యాడు.

(చూడండి ఈ లింక్ )

కోవలుడు మరణించాడన్న వార్త విని మాధవి విపరీతమైన దు:ఖానికి లోనయింది. ప్రాపంచిక విషయాల పట్ల విరక్తియై బౌద్ధ సన్యాసినిగా మారి తన బిడ్డ మణిమేఖలతో సహా ఆశ్రమానికి వెళ్ళిపోయింది.

ఆ ఏడు చోళ రాజ్యంలో జరుగుతున్న ఇంద్రోత్సవంలో మాధవి పాల్గొనలేదని ఆమె తల్లి చిత్రావతికి అసంతృప్తిగా ఉంది. మాధవిని ఎలాగైనా మళ్ళీ వృత్తిలోనికి దించాలనే పన్నాగంతో “మాధవి నాట్యం చేయకపోవడం వలన పూహార్ పట్టణ ప్రజలంతా అసంతృప్తులై ఉన్నారని, దూషిస్తున్నారని తెలియచేసి మాధవిని పిలుచుకురా” అని మాధవి చెలికత్తె అయిన వసంతమాలని ఆశ్రమానికి పంపింది చిత్రావతి.

వసంతమాల ఆశ్రమానికి చేరి చిత్రావతి చెప్పమన్న మాటలు మాధవికి చెప్పింది. “కోవలుడు చనిపోయినా నేను ఇంకా బ్రతికే ఉన్నాను. మహాపతివ్రత అయిన మా అక్క కణ్ణగికి నేను చేసిన అన్యాయానికి ప్రతిఫలం ఇప్పటికే అనుభవిస్తున్నాను. ఈ మణిమేఖలని నా కూతురుగా కాదు. కణ్ణగి కూతురుగా పెంచదలచుకున్నాను. ఈ ఆశ్రమంలో ఉంటేనే అది సాధ్యం. ఇక్కడే బుద్దుడి పాదాలను ఆశ్రయించుకుని ఉంటామని, ఈ దు:ఖజలధిని దాటడానికి నాకిదే మార్గమని నా తల్లితో చెప్పు” అంది మాధవి ఏడుస్తూ.

అక్కడే కూర్చుని పూలమాలని కట్టుకుంటున్న మణిమేఖల తన తల్లి ఏడుస్తుంటే తనూ ఏడ్చింది. మాధవి మణిమేఖలని ఓదార్చింది. దు:ఖాన్నించి తేరుకున్న తర్వాత మాధవి మణిమేఖలను చూస్తూ “మన కన్నీటితో తడిచిన ఈ మాలని ఆ భగవంతుడికి సమర్పించరాదు. నువ్వు ఉద్యానవనానికి వెళ్ళి పూలు కోసుకుని వచ్చి మరో మాల అల్లు” అంది.

మణిమేఖల ‘సరే’నని వెళుతుండగా ఆశ్రమంలో ఉండే సుతమతి అనే ఆవిడ “ఈ ఉత్సవాల సమయంలో యుక్తవయస్సుకి వచ్చినవారు ఒంటరిగా ఉద్యానవనానికి వెళ్ళడం మంచిది కాదు. అలా వెళ్ళడం వల్ల నేను పూర్వ జీవితంలో చాలా దు:ఖానికి లోనయ్యాను. శీలాన్ని పోగొట్టుకున్నాను. నేను మణిమేఖలకి తోడుగా వెళతాను” అంది. మాధవి ఆమెకి కృతజ్ఞతలు చెప్పుకుంది.

మణిమేఖల, సుతమతులిద్దరూ ‘బుద్ధుడి విగ్రహం ఉన్న ఉద్యానవనంలోకి వెళ్దామనీ, అదైతే సదా పుష్పాలతో అలరారుతుంటుంది కనుక త్వరగా పువ్వులు కోసుకుని రావొచ్చుననీ’ అనుకున్నారు.

వసంతోత్సవాల సందర్భంగా పట్టణంలో చేసిన ఏర్పాట్లను, ఎక్కడెక్కడి నుండో వచ్చిన ప్రజలను, గారడీ వాళ్ళు చేస్తున్న వివిధ విన్యాసాలను, వింతలను చూస్తూ ఇద్దరూ వీధిలో నడుస్తున్నారు. మణిమేఖలని గమనించిన ప్రజలు ఆమె అందానికి విస్తుపోయి నిలబడ్డారు. ఆమె ఎవరో తెలిసిన వారు ‘అయ్యో! ఇంత అందమైనదాన్ని, కోమలాంగిని తల్లి సన్యాసినిగా మార్చిందే’ అనుకోసాగారు. ఆ సమయంలో వీణని వాయించుకుంటున్న ఒకడు – కోవలుడుకి అతి సన్నిహితుడు మాధవిని చూసి “అయ్యో, కోవలా నీకు, నీ కూతురుకి ఎంత అన్యాయం జరిగిపోయింది?” అని ఏడవసాగాడు. ప్రజల మాటలని, ఆ ఏడుస్తున్న వాని బాధనీ విని తల మరింతగా భూమిలోకి దించుకుని నడిచి వెళ్ళసాగింది మణిమేఖల.

manimekalai-film

 

2.

ఉద్యానవనంలోని అందమైన పువ్వులను, పొదరిళ్ళను, మండపాలనూ చూస్తూ మణిమేఖల తన దు:ఖాన్ని మర్చిపోయింది. ప్రతి మొక్కనీ, పువ్వునీ పలకరిస్తూ సున్నితంగా కొన్ని పువ్వులని కోసుకుంది. వీళ్ళు ఉద్యానవనంలో ఉండగా బయట వీధిలో ఒక ఏనుగు – మావటి వాడికి కాని, సైనికులకి కాని లొంగకుండా – వీధుల్లో పరిగెత్తసాగింది. ప్రజలు భయకంపితులై అరుస్తూ పరిగెత్తుతున్నారు. విషయం తెలిసిన చోళరాజ కుమారుడైన ఉదయకుమారుడు తన రథంలో వేగంగా అక్కడకి వచ్చి ఏనుగుని అదుపులోకి తెచ్చాడు. ప్రజలందరూ జయజయధ్వానాలు చేస్తూ అతన్ని వీధుల్లో ఊరేగించారు. ఆ సమయంలో అక్కడ వీణని చేతిలో పట్టుకుని ఏడుస్తున్న కోవలుడి సన్నిహితుడిని చూసిన ఉదయుడు అతడిని దగ్గరకి పిలిచి అతని దు:ఖానికి కారణమేమిటని అడిగాడు.

“ఇప్పుడే ఈ వీధిలో నడిచి ఉద్యానవనానికి వెళుతున్న మణిమేఖలని చూశాను. ఆమె పరిస్థితిని చూసీ, నా స్నేహితుడు కోవలుడు గుర్తుకు వచ్చీ బాధతో ఏడుస్తున్నాను” అన్నాడు.

అది విన్న ఉదయకుమారుడు “మణిమేఖల ఆశ్రమం నుండి బయటకి వచ్చి ఈ దారిలో వెళ్ళిందా?” అని అత్రంగా అడిగాడు. ఇంతకు పూర్వమే ఉదయకుమారుడు ఆమెని చూశాడు. ఆమె సౌందర్యానికి దాసోహుడై ఆమెనే వివాహమాడాలని ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. ‘ఔనంటూ’ వీణాధరుడు చెప్పింది విన్న ఉదయుడు ఆమెని ఇప్పుడు తనతో రాజమందిరానికి తీసుకు వెళ్ళడానికి అవకాశం కలిగిందన్న సంతోషంతో తన రథాన్నెక్కి వాయువేగంతో ఉద్యానవనం వైపుకి సాగిపోయాడు.

అతడిని దూరం నుంచే గమనించిన మణిమేఖల సుతమతితో “ఉదయకుమారుడు నాపై ఆశలు పెట్టుకున్నాడన్న సంగతి నీకు తెలుసు కదా! ఆశ్రమంలో ఉన్న నన్ను అతను చేరలేడు కాని ఇప్పుడు ఇక్కడ అతను నన్నేమైనా చేయగలడు. నేనిప్పుడు అతన్నించి తప్పించుకునే మార్గమేమిటో చెప్పి పుణ్యం కట్టుకో” అంది ఆందోళన పడుతూ.

వెంటనే సుతమతి ఆమెని ఉద్యానవనంలో ఉన్న బలిమండపం లోపల ఉంచి బయట తాళం వేసి ఏమీ తెలియనట్లు పువ్వులు కోయసాగింది. రథాన్ని బయట నిలిపి లోపలికొచ్చిన ఉదయుడు సుతమతితో “ఇక్కడకి మణిమేఖల వచ్చిందని విన్నాను, ఆమె ఎక్కడ ఉందో దయచేసి చెప్పు. ఆమెని వివాహమాడాలని తపించిపోతున్నాను. దయతో ఆమెని నాకు చూపించు” అని వేడుకున్నాడు.

“రాజకుమారా, ఆశ్రమవాసియైన మణిమేఖల నిన్ను చూడదు. వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపో” అంది.

అతను ఆమె మాటలను పట్టించుకోకుండా ఉద్యానవనం అంతా వెతుకుతూనే ఉన్నాడు. బలిమండపంలో ఉందేమోనన్న అనుమానంతో లోపల ప్రవేశించాలని ప్రయత్నించాడు కాని వెళ్ళే మార్గం తోచక మండపం చుట్టూ తిరగసాగాడు. ఇదంతా గమనిస్తున్న మణిమేఖల భయంతో మండపం లోపల స్పృహ తప్పి పడిపోయింది.

సుతమతి అతన్ని చేరి “ఉదయకుమారా, నీకు చెప్పేంతటి దాన్ని కాదు. మణిమేఖల తపశ్శక్తి సంపన్నురాలు. నిన్ను శపించగల సమర్థురాలు కూడా… ఆడదానికి ఇష్టం లేకుండా బలాత్కరించరాదు. ఆ సాహసం చేయడం కరికాళచోళుని వంశస్థుడివైన నీకు తగదు. దయచేసి నీ మనసు మార్చుకుని ఇక్కడ నుండి తక్షణమే బయటకి వెళ్ళు” అంది.

ఉదయకుమారుడికి ఆమె చెప్పిందేమీ తలకెక్కలేదు.

మణిమేఖలని ఎలాగైనా చూడాలనే మోహంతో ఉన్న ఉదయకుమారుడు సుతమతిని మాటల్లో పెట్టి మణిమేఖల ఎక్కడుందో తెలుసుకోవాలనుకుని “నువ్వు ఇంతకు ముందు జైన ఆశ్రమంలో ఉండేదానివి కదా! ఇప్పుడు బౌద్ధ ఆశ్రమానికి చేరావా? నీవెవరు? నీ వృత్తాంతమేమిటి?” అని అడిగాడు.

 

“ఉదయకుమారా, నా తల్లి చనిపోగానే నా తండ్రి నిత్యమూ వ్రతాలు చేస్తూ ఆశ్రమజీవితం గడిపేవాడు. ఒకసారి ఆయన పువ్వులు తెమ్మని నన్ను ఉద్యానవనానికి పంపాడు. విద్యాధరుడు అనేవాడు నన్ను చూసి మోహించి బలవంతంగా తీసుకెళ్ళిపోయాడు. కొన్నాళ్ళు నన్ను అతని వద్ద ఉంచుకుని తర్వాత ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. నేను ఎక్కడికి వెళ్ళిపోయానో తెలియని మా నాన్న నన్ను వెతుకుతూ దేశాలు తిరగసాగాడు. చివరికి ఇక్కడ కావేరీ నదిలో స్నానం చేయడానికి వచ్చి నన్ను చూసి నా వద్దకు పరుగున వచ్చాడు. ఇద్దరం జైన సంఘంలో ఉండసాగాం. అయితే ఒకరోజు ఒక ఎద్దు మా నాన్నని కడుపులో కుమ్మింది. స్పృహ కోల్పోయిన మా నాన్నని కాపాడమని జైన సంఘంలో ఉన్న వాళ్ళని అడిగాను. వాళ్ళు ఏమీ సహాయం చేయలేకపోయారు. అప్పుడు అదే దారిలో వెళుతూ మా దీనస్థితిని చూసిన ఒక బౌద్ధ సన్యాసి మమ్మల్ని తన ఆశ్రమానికి చేర్చాడు. నాన్న ప్రాణాలని కాపాడాడు. ఆ విధంగా బౌద్ధ ఆశ్రమానికి చేరుకున్నాం” అంది.

తన మాటలు అన్యచిత్తుడై వింటూ బలిమండపం వైపే చూస్తున్న ఉదయునితో సుతమతి “దయచేసి నీవు ఇక్కడ నుండి వెళ్ళిపో యువరాజా!” అంది. చెప్పిందే చెప్తూ అక్కడ నుండి తరుముతున్న సుతమతిని విసుగ్గా చూస్తూ “చిత్రావతి సహాయంతో మణిమేఖలని నా మందిరానికి రప్పించుకోనిదే నేను నిద్రపోను” అంటూ శపధం చేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఉదయుడు.

అప్పటికి బాగా చీకట్లు అలుముకున్నాయి. ఆ రాత్రికి అక్కడే నిద్రించి ఉదయాన్నే ఆశ్రమానికి వెళ్ళాలనుకుని ఇద్దరూ బలిమండపంలోని బుద్ధుని విగ్రహానికి దగ్గరగా కూర్చున్నారు. “నాకు కూడా ఉదయకుమారునిపై మనస్సు పోతోంది. అతను ఇంత అనుచితంగా ప్రవర్తిస్తున్నా నాకు అతనిపై కోపం రావడం లేదు. నా హృదయంలో ఈ కోరిక నశించిపోవుగాక” అని మణిమేఖల బుద్ధునికి నమస్కరిస్తూ వేడుకుంది.

ఆ సమయంలో ఇంద్రోత్సవాలు చూడటానికని వచ్చిన ‘మణిమేఖలాదైవం’ (మాధవి, కోవలులు ఈ దేవత పేరే పెట్టుకున్నారు మణిమేఖలకి) తాపసి రూపంలో బలిమండపంలోకి వచ్చింది. బుద్ధునికి ప్రదక్షిణం చేసి అక్కడ ఉన్న సుతమతిని, మణిమేఖలని చూస్తూ “ఎందుకు మీరింత విచారంగా ఉన్నారు?” అని అడిగింది. జరిగింది తెలుసుకుని “ఉదయకుమారుడు పోయిన జన్మలో నీకు భర్త. అప్పుడతని పేరు రాహులుడు. ఒకసారి మీ ఇద్దరూ ఉద్యానవనంలో ఉన్నారు. అతని పట్ల నువ్వు కోపంగా ఉన్నావు. రాహులుడు నిన్ను సముదాయిస్తూ నిన్ను కోపాన్ని వీడమని బ్రతిమాలుతున్నాడు. ఆ సమయంలో సాధుచక్రి అనే బౌద్ధబిక్షువు అక్కడకి వచ్చాడు. అతన్ని చూసి నువ్వు లేచి నమస్కరించావు కాని రాహులుడు అతన్ని విసుక్కున్నాడు.

ఆ తర్వాత నువ్వు ‘అలా కోప్పడకూడదు, పూజ్యులకి నమస్కరించాలి’ అని రాహులుడికి చెప్పావు అతను ఇష్టం లేకుండా, తప్పదన్నట్లు అతనికి అతిథి సత్కారం చేశాడు. ఆ రోజు ఆ బౌద్ధ బిక్షువుకి ఇచ్చిన ఆతిథ్యపుణ్యమే ఈ జన్మలో నువ్వు ఇలా బౌద్ధ ఆశ్రమవాసినిగా మారడానికి కారణం. లోకంలో ఉన్న దీనులకి నువ్వు ఆకలి బాధ తీర్చాల్సి ఉంది. నిన్ను మణిపల్లవంలోని బౌద్ధపీఠానికి చేరుస్తాను. అక్కడ నీకు అక్షయపాత్ర లభిస్తుంది. దానితో ప్రజల ఆకలి బాధను పోగొడుదువుగాని. నీకు పూర్వజన్మలో అక్కచెల్లెళ్ళు తారై, వీరై అని పేర్లు గల వారు – వాళ్ళే ఇప్పుడు మాధవి, సుతమతులు. వాళ్ళు ఈ జన్మలో కూడా నీ వెన్నంటే ఉండి ప్రజలకి సేవ చేసి తరిస్తారు” అంది.

 

తర్వాత సుతమతితో “మణిమేఖలని నేను మణిపల్లవం దీవిలో ఉన్న బౌద్ధపీఠానికి తీసుకువెళుతున్నాను. నువ్వెళ్ళి మాధవికి విషయం తెలియచేయి” అని ఆ దైవం సుతమతికి చెప్పి మణిమేఖలని తీసుకుని వెళ్ళిపోయింది.

మణిమేఖలని అక్కడ వదిలి “మణిమేఖలా, ఉదయకుమారుడు పోయిన జన్మలో నీ భర్త కనుక ఈ జన్మలో కూడా వ్యామోహాన్ని పెంచుకున్నాడు. నీ మనసు కూడా అతని పట్ల ఆకర్షణకి లోనవ్వడానికి కారణం అదే. నీలోని ఆ మోహం నశించడానికే నిన్ను ఇక్కడకి తీసుకువచ్చి బుద్ధభగవానుని పాదపీఠికను చూపించాను. నీ చేతికి అక్షయపాత్ర రాగానే నువ్వు ఆశ్రమానికి వెళ్ళు. ఆశ్రమంలో ఉన్న అరవణముని నువ్వు తర్వాత చేయవలసిన విధులని తెలియచేస్తాడు” అని చెప్పి “అవసరమైనప్పుడు నువ్వు ఎక్కడకి కావాలంటే అక్కడకి ఆకాశమార్గాన వెళ్ళవచ్చు, ఏ రూపము కావాలంటే ఆ రూపము ధరించవచ్చు” అంటూ మణిమేఖలకు ఆ శక్తులని ప్రసాదించింది.

ఆ తర్వాత మణిమేఖలాదైవం నేరుగా ఉదయకుమారుని దగ్గరకి వచ్చి “రాజకుమారా, రాజులు ధర్మమార్గాన ప్రవర్తించాలి. తపోదీక్షని స్వీకరించిన మణిమేఖల పట్ల వ్యామోహం పెంచుకుని ఆమెని బలవంతపెట్టడం నీకు మంచిది కాదు. ఆమె మీదున్న మోహాన్ని విడనాడు” అని చెప్పింది.

 

3.

 

మణిపల్లవంలో మణిమేఖల బుద్ధుని పాదపీఠానికి ప్రదక్షిణం చేస్తుండగానే ఆమె చేతికి అక్షయపాత్ర వచ్చింది. అది తీసుకుని ఆమె ఆశ్రమానికి వచ్చింది. ఆమెని చూసి మాధవి, సుతమతులు సంతోషించారు. అందరూ కలిసి ఆ పాత్రని తీసుకుని అరవణమునీశ్వరుల దగ్గరకి వెళ్ళారు. మణిమేఖల జరిగినదంతా మునీశ్వరునికి చెప్పింది.

ఆయన “మణిమేఖలా! దేశంలోని అనాథలకు, వృద్ధులకి – ఆకలిగొన్న ప్రతివారికీ ఈ అక్షయపాత్ర ద్వారా ఆకలి తీర్చగలవు. ఈ అక్షయపాత్ర నీకు అందించిన అపుత్రుడు అనే వాని గురించి చెప్తాను విను……

కాశీ నగరంలో అభంజికుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య శాలి. భర్తకు తెలియకుండా తన ప్రియునితో కలవడం వల్ల గర్భవతి అయింది. గర్భవతి అయ్యాక ఆమెలో పాశ్చాత్తాపం కలిగింది. భర్తకి ద్రోహం చేశాననే బాధతో ఇక అతని ముఖం చూడలేక, ఎక్కడికి వెళ్ళాలో దిక్కు తోచక కన్యాకుమారి వైపు సాగిపోయింది. సముద్రతీరాన మగబిడ్డను ప్రసవించి ఆ బిడ్డని కనికరం అన్నా లేకుండా అక్కడే వదిలి ఎటో వెళ్ళిపోయింది.

ఏడుస్తున్న ఆ బిడ్డని చూసి ఓ ఆవు తన పొదుగునుండి పాలని స్రవించి ఆ బిడ్డడికి తాపించింది. అలా ఏడు రోజులపాటు ఆ బిడ్డని కాపాడింది. ఏడో రోజు అటు వైపుగా వెళుతున్న ఓ బ్రాహ్మణుడు ఏడుస్తున్న శిశువునీ, ఆ శిశువుకి పాలిస్తున్న ఆవును చూశాడు. ఆ బిడ్డను తనతో తీసుకెళ్ళి ‘అపుత్రుడు’ అని పిలిచి, పెంచుకుని అన్ని వేదశాస్త్రాలలోనూ శిక్షణ ఇప్పించాడు.

ఒకరోజు అపుత్రుడు ఒక యజ్ఞానికి వెళ్ళాడు. అక్కడ యజ్ఞానికి బలి ఇవ్వాలని వథశాలలో ఒక ఆవుని కట్టేసి ఉంచారు. ఆ ఆవు దయనీయంగా జాలికొలిపేట్లు అరుస్తోంది. అపుత్రుడు ఆ రాత్రి ఎవరికీ తెలియకుండా వచ్చి ఆవుని విప్పి బయటకి తోలాడు. యజ్ఞశాల కాపలాదారులది చూసి అపుత్రుడిని పట్టుకుని బంధించారు. ‘నోరులేని పశువులను, అందునా కమ్మని పాలిచ్చే ఆవుని వధించడం ఎందుకు? దేవుడు తను పుట్టించిన బిడ్డలని తనకి బలివ్వమని ఎప్పటికీ కోరడు’ అన్నాడు అపుత్రుడు.

అందరూ అతని మాటలని గేలి చేశారు. ఇంతలో గుంపులో ఉన్న ఒకడు ‘ఈ అపుత్రుడు ఎవరో నాకు తెలుసు. శీలాన్ని కోల్పోయిన శాలి కొడుకు. ఇతను హీనుడు. హీనజాతికి చెందినవాడు. ఇతన్ని ఊళ్ళోంచే గెంటి వేయండి’ అన్నాడు.

ఆ మాటలు విన్న అపుత్రుడు ‘మీ కులం ఏమిటో, మీ కులాల పుట్టుక ఏమిటో మీకు తెలుసా? మూలాలు తోడితే అందరూ హీనజాతికి చెందినవారే, అందరూ ఉన్నతజాతికి చెందినవారే’ అన్నాడు. అక్కడున్న అందరికీ – ఆఖరికి అతన్ని పెంచుకున్నబ్రాహ్మణుడికి కూడా అపుత్రుడి వైఖరికి కోపం వచ్చింది.

అపుత్రుడు ఇక ఆ దేశాన్ని వదిలి మధురైకి చేరుకున్నాడు. అక్కడ బిక్షమెత్తుకుని తను తిని మిగిలినది చింతాదేవి ఆలయప్రాంతాల్లో ఉన్న గుడ్డివారికీ, నడవలేని వారికీ, వృద్ధులకి పంచేవాడు. ఆ ఆలయంలోనే నిద్రించేవాడు.

ఆ సమయంలో దేశం అంతా క్షామం వచ్చింది. తిండిలేక జనం అల్లల్లాడిపోతున్నారు. ఒకరోజు కొందరు బిక్షకుల గుంపు ఆకలికి తాళలేక అపుత్రుడున్న చింతాదేవి ఆలయానికి వచ్చి తమ ఆకలి తీర్చమని అడిగారు. ఏమీ చేయలేక ఆవేదనతో చింతాదేవి ముందుకి వెళ్ళి ఆపద గట్టెక్కించమని ఆమెని వేడుకున్నాడు. చింతాదేవి ప్రత్యక్షమై అతనికి ఒక బిక్షాపాత్రని ఇచ్చి ‘దీనితో అందరి ఆకలీ తీర్చు. ఇది ఎంతమంది ఆకలినైనా తీరుస్తుంది. ఎప్పటికీ వట్టిపోదు. క్షామం వచ్చినప్పుడు దీన్ని ఉపయోగించు’ అంది.

అప్పటి నుండి క్షామం పోయేంతవరకూ అపుత్రుడు ఎంతో మంది ఆకలి తీర్చాడు. తర్వాత దాన్ని మణిపల్లవంలో ఉంచాడు. అదే ఈ అక్షయపాత్ర” అని చెప్పి “మణిమేఖలా! నీ పుణ్యఫలం వల్ల ఇప్పుడు ఇది నీ చేతికి వచ్చింది. నువ్వు కూడా ఈ పాత్ర సహాయంతో అన్నార్తులకి సహాయం చెయ్యి. ముందుగా ఎవరైనా సాధుగుణం కలిగిన స్తీ్ర చేతితో ఈ అక్షయపాత్రలో బిక్షని స్వీకరించు. తర్వాత దానిలోకి బిక్ష వస్తూనే ఉంటుంది” అన్నాడు అరవణుడు.

అక్కడే ఉండి వాళ్ళ మాటలు విన్న కాయచండిక అనే ఆమె తనకి అలాంటి సాధుగుణం కలిగిన స్తీ్ర తెలుసని ఆమె పేరు అదిరై అని చెప్పింది.

ఈ కాయచండిక కంచి నగరానికి చెందినది. ఆమె భర్త పేరు కాంచనుడు. కాయచండిక ఒకసారి పొదిగై పర్వతప్రాంతాల్లో ఉన్న మునిపుంగవులని గేలి చేసి ‘ఎల్లప్పుడూ ఆకలితో బాధపడాలన్న’ శాపానికి గురై దేశాల వెంట తిరుగుతున్నది. అదిరై దగ్గర బిక్షని స్వీకరిస్తూ తన ఆకలిని తీర్చుకుంటూ పూంపుహార్ పట్టణంలో నివసిస్తోంది.

కాయచండికతో కలిసి మణిమేఖల అదిరై దగ్గరకి వెళ్ళి మొదటి బిక్ష స్వీకరించింది. అప్పటి నుండీ కాయచండిక మణిమేఖల వెన్నంటే ఉంటూ బిక్షని స్వీకరిస్తూ తన ఆకలిని తీర్చుకున్నది. కొన్నాళ్ళు మణిమేఖల వెన్నంటే ఉండి ప్రజలందరికీ మణిమేఖల దగ్గరున్న మహాన్వితమైన అక్షయపాత్ర గురించి చెప్పింది. తర్వాత తపోధారియై వింధ్యపర్వతాలకి ప్రయాణమై వెళ్ళిపోయింది కాయచండిక.

Manimekalai_Indian_epic

4.

మాధవి, మణిమేఖలలు పూర్తి సాధువులుగా మారి చింతాదేవి ఆలయ ప్రాంతంలో ఉన్నారని, అక్షయపాత్రతో అందరికీ భోజనం పెడుతున్నారని తెలుసుకున్న చిత్రావతి దిగులు చెందింది. ఎలాగైనా వారిద్దరినీ ఇంటికి రప్పించి తమ పూర్వ వైభవాన్ని పొందాలనే తపనతో ఉదయకుమారుడిని కలుసుకుని విషయం చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉదయకుమారుడు చిత్రావతికి అనేక బహుమతులు ఇచ్చి మండపానికి వెళ్ళాడు. మణిమేఖలని కలుసుకుని ఆమెని అనేక విధాలుగా బలవంతపెట్టాడు. ఆమె అతనికి ఎంత చెప్పినా వినకుండా లాక్కుపోవడానికి యత్నించసాగాడు. ఆమె అతన్నించి తప్పించుకుని ఆలయంలోకి పరిగెత్తింది. సాయంత్రం వరకూ ఆమె కోసం ఆలయం బయటే వేచి ఉండి ఇక ఏమీ చేయలేక ‘తర్వాత రోజు వస్తాననీ, మనసు మార్చుకోమనీ’ చెప్తూ అక్కడనుండి వెళ్ళిపోయాడు.

తర్వాత రోజు నగరంలో చెరసాలలో ఉన్న వాళ్ళు ఆకలికి అలమటిస్తున్నారని తెలిసి మణిమేఖల చెరసాలకి ప్రయాణమైంది. అయితే ఉదయకుమారుడు ఆమెని చూస్తే వెంబడిస్తాడని తెలుసు కనుక కాయచండికలాగా రూపం మార్చుకుని నగరంలోకి వెళ్ళింది. చెరసాలలో ఉన్న వారితో మాట్లాడుతూ వాళ్ళ బాధలని వింటూ వాళ్ళకి అన్నం పెట్టింది. రాజు దగ్గరకి వెళ్ళి చెరసాలని ధర్మశాలగా మార్చమని కోరింది. ఆమె మృదుమధురమైన మాటలకి రాజుగారు ఎదురు చెప్పలేక ఆమె కోరిక ప్రకారం చెరసాలని ధర్మశాలగా మార్చారు.

ప్రతిరోజూ ఇలా ఏదో ఒక సమయంలో ఆమె కాయచండిక రూపంతో చెరసాలకి వెళ్ళి అక్కడున్న వారికి భోజనం వడ్డించసాగింది. మణిమేఖల ఎక్కడుందో తెలుసుకోవాలని కాయచండిక రూపంలో ఉన్న మణిమేఖల దగ్గరకి వచ్చి మాట్లాడుతున్నాడు ఉదయకుమారుడు. ఆమె అతనికి మంచి మాటలు బోధిస్తున్నది. ఆ సమయంలో కాయచండిక భర్త కాంచనుడు భార్యని వెతుక్కుంటూ అక్కడకి వచ్చి వారిని చూశాడు.

ఉదయకుమారుడితో ప్రేమగా మాట్లాడుతున్న మణిమేఖలని కాయచండికే అనుకున్నాడు. ‘ఆమెకి ఉదయకుమారుడితో మాటలేల? ఈతనితో ఏదో సంబంధం పెట్టుకున్నట్లుంది. అందువల్లనే శాపం తీరినా నా వద్దకు రాలేదు’ అనుకుని ఆమెని నిందించసాగాడు. కాయచండిక రూపంలో ఉన్న మణిమేఖల కాంచనుడితో “నువ్వు చింతాదేవి ఆలయానికి వెళ్ళు అక్కడ నీకు అన్ని విషయాలూ అవగతమవుతాయి, ఇప్పుడేమీ మాట్లాడవద్దు” అని చెప్పి పంపింది. మళ్ళీ ఉదయకుమారుని దగ్గరకి వెళ్ళి ‘ఈ భవబంధాలు అశాశ్వతమైనవనీ, మణిమేఖల పట్ల మోహాన్ని వదులుకోమనీ’ చెప్పింది.

ఆమె మాట్లాడుతుందేమిటో వినపడక అతనితో ఏదో గుసగుసలాడుతుందని భావించి కోపంగా చూస్తూ కాంచనుడు వెళ్ళిపోయాడు. కాసేపటికి మణిమేఖల కూడా మండపానికి చేరింది. ఆమె వెనుకనే దూరంగా వస్తున్న ఉదయకుమారుడిని గమనించి ఏం జరగబోతుందో చూడాలని కాంచనుడు ఆలయం బయట స్తంభం ప్రక్కన దాక్కున్నాడు. మోహోద్రిక్తుడైన ఉదయుడు మణిమేఖల కోసం కాయచండిక రూపంలో ఉన్న మణిమేఖలని ఆమెకి తెలియకుండా దూరంగా అనుసరిస్తూ మండపానికి వచ్చాడు. చాటునుండి అంతా గమనిస్తున్న కాంచనుడు తన భార్య కోసమే ఈ చీకట్లో కూడా వచ్చాడని ఉదయకుమారుడి మీదకి దూకి తన కరవాలంతో అతని తలని నరికివేశాడు.

కాయచండిక రూపాన్ని వదిలేసి బయటకి వచ్చిన మణిమేఖల ఉదయుడి మృతదేహాన్ని చూసి ఏడుస్తూ ‘కాయచండిక రూపంలో ఉన్నది తనేనని, తొందరపాటుతో ఉదయకుమారుడిని చంపి మహాపాపం చేసావని’ కాంచనుడితో అంది. కొన్ని నెలల క్రితమే కాయచండిక వింధ్యపర్వతాలకి వెళ్ళిందని చెప్పింది. చేసిన పనికి కుమిలిపోతూ కాంచనుడు అక్కడ నుండి వింధ్యపర్వతాల వైపు సాగిపోయాడు.

తన బిడ్డ ఉదయకుమారుడిని చంపేసింది మణిమేఖలేనని తలచి రాజుగారు మణిమేఖలని బంధించి చెరసాలలో వేశారు. అరవణస్వామిని, సుతమతిని వెంటబెట్టుకుని మాధవి అంత:పురానికి వెళ్ళి రాణికి జరిగినదంతా చెప్పింది. అరవణులకి నమస్కరించిన మహారాణి మణిమేఖల తప్పేమీ లేదని తెలుసుకుని ఆమెని బంధవిముక్తురాలిని చేసింది.

ఆశ్రమానికి చేరిన మణిమేఖల “రాకుమారుని చంపిన స్తీ్ర’ అని నన్ను ఇక్కడ జనులు నిందిస్తూనే ఉంటారు. నేను వంజి నగరానికి వెళ్ళి కణ్ణగి అమ్మకి సేవ చేసుకుంటాను, వెళ్ళడానికి అనుమతినివ్వండి” అంది. వారు ముగ్గురూ ఆమెకి దు:ఖంతో వీడ్కోలు పలికారు.

వంజి నగరానికి చేరిన మణిమేఖల కణ్ణగి దేవాలయంలోనే ఉంటూ ఆ నగరంలోని వివిధ మతాచార్యులని కలుసుకుని అన్ని మతాలలోని సారాన్ని గ్రహించింది. అన్ని మతాలూ ఒకటే అని తెలుసుకుంది. అదే అందరికీ బోధిస్తూ తన అక్షయ పాత్రతో అన్నార్తుల క్షుద్బాధని తీరుస్తూ గడపసాగింది.

మణిపల్లవంలో ఉన్నట్లుగానే వంజి నగరంలో కూడా బుద్ధభగవానుని పాదపీఠికను, చుట్టూ దేవాలయాన్నీ నిర్మించింది. బుద్ధభగవానుని దయ వల్ల మణిమేఖల జనన మరణాల రహస్యాన్ని గ్రహించుకుని తపోదీక్షలో లీనమైంది.

కొన్నాళ్ళకి మాధవి, సుతమతులు, అరవణమునులు – ముగ్గురూ మణిమేఖల దగ్గరకి చేరుకున్నారు. ఆమె వారిని సంతోషంగా స్వాగతించి వారికి కావలసిన సదుపాయాలను సమకూర్చింది. ఆ తర్వాత ఆమె తన జీవితమంతా బౌద్ధధర్మాలను బోధిస్తూ జీవితాన్ని ధన్యతగావించుకుని ముక్తినొందింది.

 

*****

 

 

 

 

 

మీ మాటలు

  1. వనజ తాతినేని says:

    కథ ..కథ లో ఉప కథలు అన్నీ ఆసక్తిగా ఉంది చివరి వరకు చదివించింది. మణి మేఖల అంటే అమ్మవారి వడ్డాణం అని విన్నాను . ఇప్పుడు వివరంగా చదివాను . థాంక్ యూ రాధ గారు .

  2. కథ చివరివరకు ఆసక్తిగా చదివించింది రాధగారూ . క్లుప్తంగా నైనా చాలా వివరంగా ఉంది. ఇంత మహా కావ్యాన్ని ఉపకథలు తో సహా వివరించిన విధం బావుంది.

  3. ధన్యవాదాలు వనజగారు, శ్రీలత గారు.

  4. అసురుడు says:

    మేడమ్ చాలా రాశారు. మిగిలినవి కూడా పరిచయం చేయండి. ప్రైమరీ లెవల్లో వీటి గురించి తెలుగులో కూడా కొంత చదివాం. మీరు సంక్షిప్తంగా అయినా మంచి పరిచయం చేశారు.మంచి రచనా సరళి.ఇంకా చదవాలని అన్పిస్తున్నది.

  5. రాధ మండువ says:

    తప్పకుండా మిగిలిన మూడు కావ్యాలనీ పరిచయం చేస్తానండి. అయితే మిగిలిని మూడు చిన్నవి కాబట్టి మూడూ ఒకే వ్యాసంలో పరిచయం చేయాలని రాస్తున్నాను. త్వరలో షేర్ చేసుకుంటాను. థాంక్ యు అసురుడు గారూ… (ఏమిటో ఈ పేరు? :) )

  6. venugopala naidu kandyana says:

    గొప్ప కధను సంక్షిప్తంగానైన అద్భుత రీతిలో నడిపించారు.బౌద్ధంలో
    మనిమేఖలకు విశిష్ట స్థానం ఉంది. మీ కృషి
    ప్రసంసనీయం.మిగిలిన మూడు కధల కోసం ఎదురు చూస్తున్నాం.

    • రాధ మండువ says:

      థాంక్ యు. తప్పకుండా పరిచయం చేస్తాను. మూడింటినీ ఒకే వ్యాసంలో.

  7. అక్కా, మణిమేఖల కథ తెలుసుకున్నాను. ధన్యవాదాలు. ఇద చదివి బాధ కలిగింది! నాకైతే మణిమేఖల వుదయనుడిని పెళ్లి చేసుకుని సంతోషంగా వుంటే బావుండేది అనిపిస్తుంది. పాపం ఉదయనుడు వుట్టి పుణ్యానికి చనిపోయాడు. బుద్ధుడు చిన్న బిడ్డనూ, భార్యనీ వదిలి సన్యాసి కావడం, తరువాయి కాలంలో తన కొడుకుకి కూడా సన్యాసం ఇప్పించడం నాకు ఎందుకో నచ్చదు. నా ఆలోచనా పరిధి అంతే! కర్మ సన్యాసం కన్నా కర్మానుష్టానమే మేలు అని కృష్ణుడు చెప్పింది నాకు నచ్చుతుంది. ఎందుకనో బుద్ధుడు సన్యాసానికి ప్రాధాన్యత ఇచ్చాడు!

  8. రాధ మండువ says:

    :) థాంక్ యు కృష్ణా, నిజమే. నాకు కూడా కర్మసిద్ధాంతమే నచ్చుతుంది. అయితే నిజమైన గాఢత ఉన్నప్పుడు, కలిగినప్పుడు ఇక చేసేదేమీ లేదు. ఆ మార్గం లో వెళ్ళిపోతారు. అయితే చాలా తక్కువ మంది మాత్రమే అంత గాఢతని కలిగి ఉంటారు. జీవితాంతం నిలుపుకోగలుగుతారు.

  9. వెంకట్ కొండపల్లి says:

    రాధ గారు, మణిమేఖల ను పరిచయం చేసి నందుకు కృతజ్ఞతలు .

Leave a Reply to వనజ తాతినేని Cancel reply

*