సామాన్యుల గొంతుని వినిపించే ‘గడీలో దొరల పాలన’

 

కొల్లూరి సోమశంకర్

కొల్లూరి సోమశంకర్

డా. నారాయణ భట్టు మొగసాలె గారు కన్నడ భాషలో రచించిన “ఉల్లంఘన” నవల బంట్ కుటుంబంలోని ఐదు తరాల గాథ. బంట్ సముదాయం ఒకనాటి క్షత్రియులు. ప్రస్తుత కర్నాటకలోని ఉడుపి, దక్షిణ కన్నడ, కేరళ లోని కసర్‌గోడ్ జిల్లాల మధ్యలో వ్యాపించి ఉండిన “తుళునాడు”కు చెందిన భూస్వాములు బంట్ వంశీకులు. ఇటువంటి భూస్వాములు, వారి ఆస్థానాలు, పాలనా పద్ధతులు, పాలితులు, ఆచారవ్యవహారాలను నమోదు చేసిన విశిష్ట రచన ‘ఉల్లంఘన’.

తుళునాడులోని ప్రజల భాష తుళు. ఈ భాషకి లిపి లేదు. వ్రాయడానికి కన్నడ లిపినే ఉపయోగిస్తారు. తుళునాడు జనాలది విశిష్టమైన సంస్కృతి. 19వ, 20వ శతాబ్దాలలో ఈ సంస్కృతిలో వచ్చిన మార్పులు, ఈ ప్రాంతపు చరిత్రలో సంభవించిన ఘటనలను వివరిస్తుంది ఈ నవల. అటువంటి ప్రశస్తమైన నవలను “గడీలో దొరల పాలన” పేరిట తెలుగులోకి అనువదించారు శ్రీ శాఖమూరు రామగోపాల్. మూల రచన ‘ఉల్లంఘన’ ఇప్పటికే హింది, ఇంగ్లీషు, మరాఠి, మళయాళం, తమిళ భాషలలోకి అనువాదమైంది. 2008లో ప్రచురితమైన ఈ మూలకృతి కన్నడంలో ఎం.ఎ. విద్యార్థులకు పాఠ్యపుస్తకంగా ప్రవేశపెట్టబడింది. మూల రచయిత డా. నారాయణ భట్టు మొగసాలె వృత్తిపరంగా వైద్యులైనా, ప్రవృత్తిపరంగా గొప్ప సాహితీవేత్త.

సుమారు నూటయాభై సంవత్సరాల కాలంలో తుళునాడునీ, దానిలోని గడీలను ప్రభావితం చేసిన సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలను కళ్ళకి కట్టినట్లుగా వివరిస్తుందీ పుస్తకం. రాచరిక/భూస్వామ్య వ్యవస్థకి ప్రతిరూపాలైన బంట్లు కూడా గడీలను అధికార కేంద్రంగా చేసుకుని తమ అజమాయిషీ కొనసాగించారు. ఆస్థానం, సంస్థానం, కోట.. వంటి పదాలను గడీ అనే పదానికి సమానార్థాలుగా భావించవచ్చు. గడీల చరిత్ర పాలకులు – పాలితుల మధ్య ఉండే సంబంధాన్ని వ్యక్తం చేస్తుంది. భూస్వాములు, రైతు కూలీలు, కౌలుదార్ల సామాజిక జీవనంలోని భిన్నకోణాలను ప్రతిబింబించింది ఈ నవల.

తుళునాడులో మాతృస్వామ్య వ్యవస్థ ప్రధానంగా ఉంది. కుటుంబపు ఆస్తి వారసత్వంగా స్త్రీలకు దక్కుతుంది. పుట్టిన పిల్లలకు భార్య ఇంటిపేరునే పెట్టుకుంటారు. కుటుంబంలోని మగవాళ్ళు ఆస్తిపాస్తుల వ్యవహారాలను మేనేజర్లుగా నిర్వహిస్తుంటారు. ఇటువంటి గడీలలోని ఒకటైన సాంతేరుగడీ చరిత్ర ఇతివృత్తమే ఈ నవల కథాంశం. గడీ ఆధీనంలోని భూమిలో కొంతభాగాన్ని కౌలుదారులు సేద్యం చేస్తుండగా, మిగతా భూమిని వెట్టి కూలీలతో భూస్వాములే సాగు చేస్తారు. ఇటువంటి ఫ్యూడల్‌సమాజంలో కౌలుదారులకు, వెట్టి కూలీలకు; దొరసానికి (బళ్ళాల్ది), దొరకి (ఉళ్ళాయి) మధ్య ఉండే సంబంధాన్ని ఈ నవలలో దర్శించవచ్చు. వెంకప్ప, శీనప్ప, సంకప్ప, సుందర, ప్రశాంత్‌హెగ్డె గార్ల జీవితాలు; అలాగే తుంగక్క, శాంతక్క, అంబక్క, శారదక్క, ప్రజ్ఞల జీవితాలు ఈ నవలలో విస్తృతమైన కాన్వాస్‌పై అద్భుతంగా గోచరిస్తాయి

భుజించి దర్బారులోకి వచ్చి కూర్చున్న దొరవారితో, దోస్తుగా ఉన్న పావూరు గడీకి చెందిన పూంజగారు ‘సాంతేరుగడీలో అష్టమినాడు ఎందుకు చేసారు ఈ కోలాహలం విందును?’ అని ప్రశ్నించారు కుతూహలంగా. అందుకు దొరవారు ‘అష్టమి అముఖ్యం కాదు మాకు. మేము వ్యవాసాయం చేసేవాళ్ళం. అందుకే మాకు మేము పండించిన కొత్త బియ్యం వండి పండుగ లాగ తినేది ముఖ్యం అనేది గడీలో సాంప్రదాయంగా వృద్ధి చెంది వచ్చింది. గోకులాష్టమి, వినాయక చవితి, అమావాస్యలోని దీపావళి మొదలైన రోజుల కట్టుబాట్లలోని ఆచరణాలన్నీ గడీ భవంతిలో ఉన్నవి. అవన్నీ అక్కరలేదా మన సమాజంకు?’ అన్నారు.

పూంజగారికి సంతృప్తి అయ్యింది దొరవారి రైతు జ్ఞానం నుంచి. వారు, ‘ఔను, మన జాతులలో ప్రాదేశిక వ్యత్యాసాలకు అనుగుణంగా పండుగ పబ్బాలలో వివాహ, దినకర్మకాండలలో వ్యత్యాసం ఉండేది సహజమే’ అని ఒప్పుకున్నారు.

బ్రిటీషు వారి రాకతో దేశంలోని అన్ని ప్రాంతాలలో లాగానే తుళునాడులోనూ దొరల అధికారాలు క్షీణించి, పరిస్థితులు మారడాన్ని ఈ నవల చక్కగా వర్ణిస్తుంది. ఆంగ్ల పాలకులు చేసిన కొత్త చట్టాల వల్ల భూస్వాములు, కౌలుదార్లు, వెట్టికూలీల సంబంధాలలో వచ్చిన మార్పులనూ, మనుషులలో కలిగిన కొత్త ఆలోచనలను ఈ నవల ప్రతిబింబిస్తుంది.

స్వాంతంత్ర్యం కోసం జరిపిన పోరాటంలో ఈ ప్రాంతపు యువకులు పాల్గొన్న వైనాన్ని, గాంధీ గారి అనుచరులుగా మారిన జైళ్ళకు వెళ్ళిన వైనాన్ని తెలుపుతుంది ఈ నవల.

“ఆ రోజు గడీ భవంతి వర్ణించలేనట్లుగా సంబురపడింది. ఆ సంబురం ఒంబత్తుకెరె గ్రామంలోని కౌలుదార్ల నుంచి మొదలై కూలినాలి చేసి జీవించేవాళ్ళ ఇళ్ళ వరకూ వ్యాపించింది. యువకులు, వృద్ధులు అనకనే ఆబాలగోపాలం గడీ ప్రాంగణంకు ఒకరి వెనుక ఇంకొకరుగా వచ్చారు. సంకప్పకు వారందర్నీ చూసి ఎంతో సిగ్గైంది. ‘నేనేమి యుద్ధం గెల్చి వచ్చానేమి! ఉత్తిగనే ఎందుకు నన్ను చూసేందుకు వచ్చారు?’ అని అనాలని అన్పించింది అతనికి. ప్రతి యొకరు వచ్చి ‘ఎలాగున్నారు చిన్నపటేలా?’ అంటూ అడిగారు. జనం నొచ్చుకోవచ్చని అతను ప్రాంగణంలో కుర్చీ వేయించుకుని కూర్చున్నాడు. వచ్చినోళ్ళందరితోనూ సంకప్ప ‘నేనేమి ఘనంగా దేశమాత సేవ చేయలేదు. గాంధీజీతో పాటు నేను ఉండివచ్చాను వివిధ చోట్ల అంతే మరి.’ అన్నాడు.

AuthorSakhamuru

స్వతంత్ర్యం వచ్చాకా ఎదురైన పరిస్థితులు ఏలాంటివి? గ్రామం తన స్వయంప్రతిపత్తిని పోగొట్టుకుని, పట్టణాల మీద ఎందుకు ఆధారపడింది? మాతృస్వామ్య వ్యవస్థ తన ప్రాభవాన్ని ఎలా కోల్పోయిందో ఈ నవల వెల్లడిస్తుంది. కొత్త వ్యవస్థలో ఎవరు ఎవరిపై ఆధిపత్యం చలాయించారు? ఆ యా మార్పులు ఎవరెవరిని ప్రభావితం చేసాయి? ఈ వివరాలన్నింటినీ తెలుసుకోవాలంటే ఈ నవల చదవాలి.

సంకప్ప హెగ్డె గంభీరులయ్యారు. వారు ‘మన కర్నాటకలోని ఈ భూపరిమితి చట్టం లాంటి ప్రగతిపర మరియు విప్లవాత్మక … భూసంస్కరణల చట్టం… ఈ భరతభూమిలో మరే యితర రాష్ట్రంలో జారీ అయ్యింది లేదనేది నాకు గుర్తే! దాన్ని నేను వేరే వేరే మూలాల నుంచి చదివి తెల్సుకున్నాను. నిజంగా ఇది మంచి చట్టమే. అందులోనూ తీరప్రాంత జిల్లాల్లో, ముఖ్యంగా మన దక్షిణ కన్నడ జిల్లాలో ఇది అమలౌతున్న పద్ధతిలో, ఎన్నో అవాంతరాలు ఎదురౌతున్నవి. మనలో తండ్రి నుంచి సంతానంకు భూమి హక్కు వచ్చి కలిగే సంప్రదాయం ఎంతో తక్కువ. తల్లి నుంచి సంతానంకు హక్కు వచ్చే సాంప్రదాయమే ఎక్కువగా ఉంది. అయితే మారుతున్న వాతావరణంలో ప్రతీ కుటుంబం ఈ పురాతన పరంపరను ఇప్పుడు తోసి వేస్తోంది. కానూను ప్రకారం మాతృప్రధాన వ్యవస్థ అనేది ఇప్పుడు లేదు! అందుచేత మన కర్నాటకలో ఈ భూపరిమితి చట్టం ఇక్కడ ఈ జిల్లాలో అమలు చేసేడప్పుడు ఎన్నెన్నో కుటుంబాలలో ఘర్షణలు ప్రారంభమైనవి. మనుష్య సంబంధాలన్నీ నాశనమైపోయే స్థితి వచ్చింది’ అని చెబుతూ ఒక నిమిషం మౌనం దాల్చారు.

ఉడుపి ప్రాంతంలోని కన్నడిగులు హోటల్ యజమానులుగా ఎలా ఎదిగారో, తమవారిని ఎలా వృద్ధిలోకి తెచ్చారో ఈ నవల రేఖామాత్రంగా తెలియజేస్తుంది.

ఎవరికి కావాలి ఈ పొలాలు, మడులు? కాడి నాగలి మోసుకుంటూ వాన ఎండా అది ఇదీ అని మూడొందల అరవై ఐదు రోజులూ మడిగట్టు మీద గోచి బిగించి చెమట్లు కురిపించుతూ శ్రమించేదానికన్నా ‘చుయ్’ అని రెండు మసాలా దోసెలు వేసి, ఒక ముక్కుళ్ళి (గుటక పరిమాణం) కాఫీనో చాయ్‍నో టేబుల్ మీద పెట్టి ‘రండి రండి గిరాకీదారులారా’ అంటే చాలు, నోట్ల కట్టే తలొంచి క్యాష్ బాక్స్ లోపలికి వచ్చి బుద్ధిగా కూర్చుంటందంటే అదెంత కుశాలో అని అంబక్కకి అప్పుడు నవ్వు వచ్చింది. అందుకే ఇంత జనం, ఉన్న ఊరు వద్దు అంటూ పట్టణాలకు వలస వెళ్తున్నారని చెప్పారు సంకప్పణ్ణ.

వ్యవసాయాధారితమైన కుటుంబాలు క్రమంగా వ్యాపారాలవైపు మొగ్గు చూపడాన్ని ఈ నవల చిత్రిస్తుంది.

ఆదంకుట్టి క్తెతే ఆకాశంలో ఉన్న స్వర్గమే చేతికి అంది వచ్చినట్లుగా అయ్యింది. అతను తన అంగడికి వచ్చి వెళ్ళే గిరాకీదారులందరికీ కలల బీజాల్ని విత్తసాగాడు. అటువంటోళ్ళంతా తమ ఇళ్ళలోనూ ఇటువంటి బంగారు కలల విత్తనాల్ని విత్తసాగారు. జాతీయ రహదారిని ప్రారంభించే కేంద్ర మరియు రాష్ట్ర రవాణాశాఖా సచివ మహోదయులు ఆ తర్వాత తమ వాహనాలలో కాసరగోడు దాకా పయనించేదాన్ని చూసేందుకు వేలసంఖ్యలో జనం ఉదయం నుంచే జాతీయ రహదారి అంచుకు చేరారు. అక్కడక్కడ లేచి నిలబడి నిరీక్షించసాగారు.

సంస్థానాలను కేవలం చారిత్రక దృక్పథంతో మాత్రమే పరిశీలించి వ్రాసే పుస్తకాలలో కథ ఉండదు. ప్రజల వ్యథ ఉండదు. సామాజిక చిత్రణ ఉండదు. సామాన్యుల ఘోష వినిపించదు. పాలకుల శౌర్యం, మగతనానికి ప్రతీకలుగా మాత్రమే నిలిచే చరిత్ర పుస్తకాలకు భిన్నంగా, ఉల్లంఘన నవలలో సామాన్యుల గొంతు ప్రబలంగా వినిపిస్తుంది.

తెలుగు అనువాదం బావుంది. అయితే అనువాదకులు ఉపయోగించిన తెలుగు కన్నడం కలగలసిపోయిన యాస – పాఠకులకు కాస్త ఇబ్బందిగా తోచవచ్చు. ఏదేమైనా శ్రీ శాఖమూరు రామగోపాల్‌ ఒక మంచి కన్నడ నవలను తెలుగువారికి అందించారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

పుస్తకం చివర్లో “కర్నాటకలో నా తిరుగాట” అనే పేరుతో వ్రాసిన వ్యాసంలో సుప్రసిద్ధ కన్నడ రచయిత శ్రీ తమ్మాజీరావుతో కలసి తాను చేసిన సాహితీయాత్రలను పాఠకులకు కుతూహలం కలిగించేలా వివరిస్తారు శ్రీ రామగోపాల్. ఆయా అనుభవాలు చదువుతుంటే, మనం కూడా ఆయనతో ప్రయాణించినట్లు, ఆయా ప్రదేశాలు స్వయంగా దర్శించిన అనుభూతి కలుగుతుంది.

అభిజాత తెలుగు – కన్నడ భాషా అనువాద (సంశోధన) కేంద్రం వారు ప్రచురించిన ఈ పుస్తకం విశాలాంధ్ర వారి అన్ని శాఖలలోనూ లభిస్తుంది. 650 పేజీల పుస్తకం వెల రూ.600/-. ఈబుక్ కినిగెలో లభిస్తుంది.

 

రచయిత, ప్రచురణకర్త చిరునామా: Sakhamuru Ramagopal,
5-10, Road No. 21,
Deeptisri Nagar, Miyapur (post),
Hyderabad – 500 049;
Ph: 09052563666; email: ramagopal.sakhamuru@yahoo.co.in

మీ మాటలు

  1. రాంగోపాల్ గారిది బృహత్ ప్రయత్నం. ఇదే కాకుండా ఆయన కన్నడ సాహిత్యం లోంచి ఎన్నో కథలను అనువదించారు. ఈ ఏక హస్త కృషి అభినందనీయం.

  2. చందు - తులసి says:

    రామగోపాల్ గారి కృషి అభినందనీయం. వివిధ భాషల్లోని ఉత్తమ సాహిత్యం ….పరిజ్ఞానం ఉన్న వారు అందిస్తే పాఠకులకు ఆనందమే.
    సోమశంకర్ గారి పరిచయం, సమీక్ష కూడా బాగుంది. ధన్యవాదాలు..

  3. Kb Lakshmi says:

    మీ పరిచయ వచనాలు నవల కోసం పాఠకుడిని పరిగేట్టిస్తాయి Somasekhar Abhinandanalu
    కే బి Lakshmi

  4. Kb Lakshmi says:

    Sorry సోమశంకర్ అని చదువుకో గలరు

మీ మాటలు

*