గమనమే గమ్యం-26

img549

 

olgaశారద ఇంట్లో టెలిఫోను హాల్లో కాకుండా గదిలో ఉంటుంది. శారద ప్రత్యేకమైన విషయాలు మాట్లాడుకోవాలంటే వీలుగా  ఉంటుందనీ, హాల్లో అందరి ముందూ పార్టీకి సంబంధించిన విషయాలు  మాట్లాడటం మంచిది కాదనీ అలాంటి ఏర్పాటు   చేశారు. ఒకరోజు ఉదయం శారద ఆ గదిలోకి వెళ్లేసరికి మూర్తి మాట్లాడుతున్నాడు.

‘‘శారద ఉంది. విషయం ఏమిటో చెప్పండి . ఔనా ? అలాగా? మంచిది. కాముద్ని ఇక్కడ ఉంచటం కంటే మద్రాసు లో  ఉంచటం మంచిది. మానసిక రోగులకు మద్రాసులో మంచి హాస్పిటల్‌ ఉందిగా’’

శారద ఒక్క అంగలో ఫోను దగ్గరకు వెళ్ళి మూర్తి చేతిలో ఫోను తీసుకుంది.

‘‘హాల్లో – జోగయ్యా – చెప్పు. కామేశ్వరరావు కేమయింది’’.

ఐదారు నిమిషాలు  అవతల వ్యక్తి చెప్పేది  శ్రద్ధగా విని

‘‘కామేశ్వరరావుని ఇక్కడ కే తీసుకురండి . ఇక్కడ మా ఇంట్లోనే ఉంటాడు. అతని వైద్యం నేను చూసుకుంటాను. ఏం ఫరవాలేదు. ఇబ్బంది ఉంటే నేను చెప్పనా ?’’ ఫోను పెట్టేసి మూర్తి వైపు చూస్తే  అతనికి ముఖం అవమానంతో తెల్లబోవాలో , కోపంతో ఎర్రబడాలో తెలియనితనంతో తెలుపెరుపుల కలగలుపుతో  ఉంది.

‘‘మూర్తీ –  నా  తరఫున నువ్వు మాట్లాడాల్సిన పని పెట్టుకోకు. అది మనిద్దరికీ మంచిది కాదు. ముఖ్యంగా పార్టీ పనుల  విషయాలు . మన సంబంధం ఎంత దగ్గరిదైనా  నేను పార్టీలో స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సభ్యురాలిని’’.

అక్కడ నుంచి వెళ్ళిపోతూ ‘‘కామేశ్వరరావుకి పైన మేడమీది గది సిద్ధం చేయమని అమ్మతో చెప్తాను. మనం కొన్ని రోజులు  కింద గదిలోకి మారదాం’’ అంది.

‘‘నీ ఇష్టం’’ మూర్తి కోపాన్ని అణుచుకోటానికి ప్రయత్నిస్తున్నాడు.

శారద అది గమనించినా  గమనించనట్లు బైటికి వెళ్ళిపోయింది.

కామేశ్వరరావు బెంగాల్‌లో కరువు ప్రాంతాలను చూడటానికి వెళ్ళిన ఆంధ్ర బృందంతో  పాటు వెళ్ళాడు. అక్కడ పరిస్థితులను చూసి తట్టుకోలేక మతిస్థిమితం తప్పింది. ఈ కబురు ఈ ఫోన్‌ రాకముందే తెలిసింది. అతన్ని తన ఇంట్లో ఉంచుకుని నయం చేసి పంపాలని శారద అనుకుంది. మూర్తితో చెప్పింది. మూర్తి విని ఊరుకున్నాడు. మూర్తికి అభ్యంతరం ఉంటుందని శారదకు కాస్త కూడా సందేహం  లేదు.

ఇప్పుడు అతన్ని మద్రాసు పంపమనే సలహా ధారాళంగా ఇస్తున్న మూర్తిని చూస్తే కోపం వచ్చింది.

నాలుగైదు రోజులు  ఇద్దరిమధ్యా ముభావంగా, ముక్తసరి మాటలతో నడిచాక  మూర్తి భరించలేక పోయాడు.

‘‘శారదా – ఇది ఇల్లు – హాస్పిటల్‌ కాదు. కామేశ్వరరావుని ఆస్పత్రిలో ఉంచటం మంచిదని నాకనిపించింది. అందులో తప్పేముందో  నా  కర్థం కావటం లేదు’’. శారదకు మూర్తిని చూస్తె  జాలేసింది. ఇన్నేళ్ళుగా తన ఇంటికి సంబంధించిన నిర్ణయాన్నీ తనే తీసుకునే అలవాటున్న వాడు . ఆడవాళ్ళు అమాయకులు , అజ్ఞానులు , బలహీనులు  అనే ఆలోచన బాగానే ఒంటబట్టి ఉంటుంది. తను తీసుకునే తప్పు నిర్ణయాలు  సరిదిద్ది తన ఇంటిని, జీవితాన్ని  చక్కదిద్దాననుకుంటున్నాడు. సున్నితంగా తెలియజెప్పాలి.

‘‘తప్పేంలేదులేవోయ్‌. ఆ విషయం గురించి మనిద్దరికీ వేరు వేరు అభిప్రాయాలున్నపుడు ఇద్దరం మాట్లాడుకుని నిర్ణయించుకోవాల్సింది. అలా చెయ్యకపోవటం ఇద్దరి తప్పూనూ – మనకిది కాక చెయ్యటానికి చాలా పనులున్నాయి. రేపు కాముడొస్తున్నాడు కూడా – అదుగో అలా ముఖం ఎర్రగా చేసుకోకు. ముద్దొస్తావు’’ అంటూ మూర్తి నుదుటిన ఒక ముద్దు పెట్టి వెళ్ళింది శారద. మూర్తి కాస్త చల్లబడ్డాడు.

మర్నాడు  కామేశ్వరరావు వచ్చాడు . ఇల్లంతా  సందడయింది. అతన్ని చూడటానికి ఎంతమందో వస్తున్నారు. అందరిలో శారద కొందరిని మాత్రమే అతని దగ్గరకు పంపిస్తోంది. అది చాలామందికి కోపం తెప్పించింది.

కామేశ్వరం వున్న స్థితిలో అందరినీ ఒక్కసారి చూడటం ప్రమాదం అని ఎంత చెప్పినా  ముఖం గంటుపెట్టుకునే వెళ్తున్నారు.

శారద హాస్పిటల్‌ పని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ముగించుకుని కామేశ్వరరావు దగ్గరకొచ్చి కూర్చుంటోంది.

మందుతో పాటు మాట్లాడటం, అతనిచేత మాట్లాడించటం కూడా అవసరం.

మెల్లిగా కామేశ్వరరావు బెంగాల్‌లో తను చూసిన బీభత్సం గురించి మాట్లాడటం మొదలు పెట్టాడు.

శారద ఆ భీభత్సం వెనకా ఉన్న మానవ క్రూరత్వాన్ని  గురించి, ఆర్థిక కారణాల  గురించి వివరించి చెబుతోంది.

మూర్తికి పార్టీ పనులతోనే సరిపోతోంది. మనసంతా  అసంతృప్తితో నిండి పోతోంది. పార్టీ పనులలో అతనికి సహాయం చేసేవాళ్ళు  తక్కువవుతున్నారు. స్థానిక సమస్యలు  తెలియని వాడు పైనుంచి వచ్చాడని  అసహనం తెలియకుండానే అందరి మనసుల్లో తిష్టవేసుకుంది.

శారదకు పార్టీ పనులు  అసలు  లేవని కాదు గానీ అవి ఆమెకు నల్లేరు మీద నడక. ముఖ్యంగా మహిళా సంఘం పనులు  ఆమె చక్కబెట్టాలి. శారదంటే మహిళా సంఘంలో అందరికీ గౌరవమే. పనులు  చకచకా జరిగిపోతున్నాయి. హాస్పిటల్‌లో శారద ఉందంటే రోగులందరికీ ధైర్యం. గర్భీణీ స్త్రీలకు, ప్రసవానికొచ్చిన స్త్రీలకైతే అదొక ఆటవిడుపులా ఉండేది. శారద నవ్వుతూ, నవ్విస్తూ, గలగలా మాట్లాడుతూ హాస్పిటల్‌ని విశ్రాంతి మందిరంలా చేసేది. శారద లేనపుడు సుభద్రమ్మ ఇంకో పద్ధతిలో వాళ్ళను బాధ్యతగా చూసుకునేది.

ఇంట్లో వంట బాధ్యతలన్నీ సుబ్బమ్మ గారివే. శారదకు ఆ బాధ్యత ఎన్నడూ లేదు. వచ్చేపోయే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు  పరిష్కరించి పంపటమే. పార్టీ నాయకులు  తరచు వచ్చేవారు. శారద అవసరమైతేనే వారితో కూచునేది. లేకపోతే పలకరించి తన పనుల  మీద తాను వెళ్ళేది. ఇంటి ఖర్చుల  వివరాలు  మాత్రం కనుక్కుని డబ్బు ఎంత కావాలో  అంత ఉండేలా చూసేది.

ఇంటికి ఏ వేళప్పుడు ఎవరొచ్చినా  వారి ఆకలి తీరాల్సిందే. మర్యాదలు  జరగాల్సిందే.

మూర్తి ప్రాక్టీసు ఒదిలి వచ్చాడు . అతని ఆస్తి పాస్తులన్నీ మద్రాసులో కుటుంబానికి ఏ లోటూ లేకుండా చూసేందుకు  వీలైనట్టు చేసి వచ్చాడు . అలా చేసేదాకా శారద ఊరుకోలేదు. తరచు మద్రాసు వెళ్ళి రమ్మని మరీ మరీ చెప్పేది .

ఇక్కడ అతనికి ఏ లోటూ లేదు. శారద పేదవారికి  ఉచితంగా వైద్యం చేస్తూ ఇవ్వగలిగిన వారినుంచి వారిచ్చినంత తీసుకునేది. సంపన్న కుటుంబాల  వాళ్ళకు శారద హస్తవాసి మీద నమ్మకం. ధారాళంగానే ఇచ్చేవారు. వాళ్ళింటో పొల్లాలో పండే సమస్త పదార్ధాలు పంపేవారు.

ఇల్లు , హాస్పిటలూ, పార్టీ పనులు  అన్నిటినీ సమర్థతతో శారద నిర్వహిస్తున్న తీరు చూస్తె  మూర్తికి ఒకవైపు సంతోషం. ఇంకోవైపు ఆశ్చర్యం. మరోవైపు తెలియని బాధ. వీటిలో ఎప్పుడు దేనిది పై చేయి అవుతుందో అతనికే తెలిసేది కాదు. దానితో మనసులో ఎప్పుడూ ఒక అసంతృప్తి ఉండేది. శారద దానినంత గమనించలేదు.

కామేశ్వరరావు ఉన్నన్ని రోజులూ  శారదకు మరో విషయం ఆలోచించటానికి కూడా తీరిక లేకపోయింది. ఒకోరోజు హాస్పిటల్‌కి కూడా వెళ్ళేది కాదు. రాత్రింబగళ్ళూ అతనితో మాట్లాడుతూ కూర్చోవాల్సి  వచ్చేది.

olga title

మూర్తి ఒంటరితనం భరించలేకపోయాడు. శారద తన భార్య అనే విషయం పదే పదే గుర్తొచ్చేది. గుండెలో అహం తన్నుకొచ్చేది. కానీ ఏం చెయ్యాలో తెలిసేది కాదు.

ఒకసారి నాలుగు  రోజులు  వరసగా హాస్పిటల్‌కి వెళ్ళలేదు శారద. మూర్తి పైకి వెళ్ళి గొడవ పెట్టుకోకుండా ఉండలేని స్థితికి వచ్చాడు . మూర్తి మేడ మెట్లెక్కి వస్తుంటే శారద మెట్లు దిగి వస్తోంది.

‘‘ఇవాళ కూడా హాస్పిటల్‌కి వెళ్ళవా ?’’

‘‘ఓపిక లేదు మూర్తీ! రాత్రంతా  కాముడు నిద్రపోనివ్వ లేదు. ఇప్పుడే అతను నిద్రపోయాడు. నాకూ  కాసేపు పడుకుంటే గాని ఓపిక రాదు’’.

‘‘కానీ ఇన్ని రోజులు  వెళ్ళకపోతే హాస్పిటల్‌ ఎలా నడుస్తుంది’’.

‘‘ఏం ఫరవ లేదు. సుభద్ర ఉందిగా. పాపం తనకి డిగ్రీ లేదనే గానీ చాలా అనుభవం. తెలివైనది. నేను చేసినంత తనూ చెయ్యగదు. ఈ నాలుగు  రోజుల్నించీ రోజుకిద్దరు ప్రసవం అయ్యారట. కంగారేం లేదని కబురు చేసింది. నేను సాయంత్రం వెళ్తాను. సుభద్ర నాకు  కుడ భుజం అంటారే అలాంటిది. హాస్పిటల్‌ గురించి నువ్వేం కంగారు పడకు. కాముడు మరో నెల రోజుల్లో మామూలవుత డు. పాపం ఒకటే ఏడుస్తాడు. ఏమన్నా  తినమంటే  ఆకలికి చచ్చినవాళ్ళను తిన్నట్టుందంటాడు. మాటల్లో పెట్టి, చిన్నపిల్లాడి కి చెప్పినట్లు కథలు  చెప్పి తినిపించాలి. నిద్ర పెద్ద సమస్యయింది. కళ్ళు మూసుకుంటే అవే కనిపిస్తున్నాయతనికి’’ మాట్లాడుతూనే తన గదిలోకి వెళ్ళి పడుకుంది శారద.

మూర్తికి శారద ప్రతిమాటా తప్పుగానే అర్థమైంది.

సుభద్ర హాస్పిటల్‌ చూడటమేంటి? ఆమె పార్టీ మనిషి. పార్టీలో కూడా చాలా బాధ్యతగా పని చేస్తుంది. కానీ ఆమెకు హాస్పిటల్‌ అప్పగించి శారద ఈ పిచ్చివాడి కి అన్నం తినిపించి, నిద్రపుచ్చే అల్పమైన  పనులు  చేయటమేంటి ?

ఇలా దీనిని సాగనియ్య కూడదు. ఇవాళ కాముడు. రేపింకొకడు -ఇప్పటికే బైట గుసగుసలు  వినిపిస్తున్నాయి. మేడమీది గదిలో కామేశ్వరరావు, డాక్టరమ్మ ఉంటుంటే మూర్తిగారు కింద ఉంటున్నారని . తనకు శారద సంగతి తెలుసు. ఊళ్ళో అందరికీ ఏం తెలుసు?

భర్త ఇంట్లో ఉండగా తను వేరే మగాడితో వేరే గదిలో రాత్రింబగళ్ళూ గడుపుతుందంటే ఏమనుకుంటారు? అది శారదకెందుకు అర్థం కాదు. దీనిని ఎక్కడో ఒకచోట ఆపాలి.

ఇల్లూ , ఊరూ అంత హడావుడిగా ఉంది. బెంగాల్‌ కరువు గురించి సభ్యులు , నాటక ప్రదర్శనలు , బుర్ర కథలు …

ఈ హడావుడి  కొంత తగ్గాక ఒకరోజు మూర్తి సుభద్రను పార్టీ ఆఫీసుకి రమ్మని కబురు చేశాడు.

సుభద్ర పార్టీ ఆఫీసు నుంచి పిలుపు  అనగానే కాళ్ళు తొక్కుకుంటూ వచ్చింది. తీరా మూర్తి చెప్పింది వినగానే ఆమెకు చాలా సంతోషమనిపించింది.

‘‘ఆస్పత్రిలో ఉద్యోగం మానేసి పూర్తి కాలం  పార్టీ కార్యకర్తగా పనిచేయటానికి వచ్చెయ్యాలి’’.

సుభద్రకు పార్టీ అంటే ప్రాణం కన్నా  ఎక్కువ. పార్టీ కోసం ఏం చెయ్యటానికైన ఆమె సిద్ధమే. అలాంటిది పార్టీనే లోకంగా బతకటమంటే సుభద్రకు అంత కంటే కావలసింది ఏముంది. కానీ ఆస్పత్రి పనీ ఇష్టమే. అక్కడా తను అవసరం. అందువల్ల  తటపటాయించింది.

‘‘డాక్టరు గారితో ఒక్కమాట చెప్తాను. తర్వాత  నిర్ణయం తీసుకుంటా. మా ఆయనతో కూడా చెప్పాలనుకోండి . కానీ ఆయన కాదనరని నా  నమ్మకం’’. ఒక రకమైన ఉద్వేగంలో ఉంది సుభద్ర.

‘‘చూడమ్మా. డాక్టరుగారు కూడా పార్టీ ఆదేశానికి కట్టుబడి  ఉండాల్సిందే. నేను ఆమె భర్తనే కాదు. జిల్లా పార్టీ  నాయకుడనని నీకు తెలియదా? నేను నిర్ణయించి చెప్తున్నాను. నువ్వింకెవరినీ అడగక్కరలేదు. ఎవరి అనుమతీ తీసుకోనవసరం లేదు. పార్టీ నిర్ణయం. ఔనంటావా ? కాదని పార్టీని ధిక్కరిస్తావా ?’’

సుభద్ర కంగారుపడి పోయింది. పార్టీ ఆదేశం ధిక్కరించటమే! ప్రాణం పోయినా  తనా  పని చెయ్యదు.

‘‘నాకు ఇష్టమే నండీ. మీరే పని ఇస్తే అది చేస్తాను.’’

మూర్తి ఆమెకు ఆ క్షణం నుంచే పని చెప్పాడు. ఇట్నించి ఇటే ఆమె మహిళా సంఘానికి సంబంధించిన పని కోసం వెళ్ళాలి. ఆస్పత్రికి గానీ, ఇంటికి గానీ వెళ్ళే అవకాశం లేదు. పని పూర్తి చేసుకుని రాత్రికి ఇల్లు  చేరుకోవచ్చు. సుభద్ర వెళ్ళిపోయాక మూర్తి బాధ, భయం, సంతృప్తి , ఉపశమనం ఇన్ని కలిసిన మనసుతో ఏ పనీ చెయ్యలేక పుస్తకం తీసి మనసు లగ్నం చేయటానికి ప్రయత్నిస్తూ కూర్చున్నాడు.

సాయంత్రం హాస్పిటల్‌కు వచ్చిన శారద అక్కడ పరిస్థితి చూసి ఆశ్చర్యపోయింది. ఇద్దరు స్త్రీలు  నొప్పులు పడుతున్నారు. పట్టించుకునేవాళ్ళు లేరు. ఉన్న ముగ్గురు నర్సులు  ప్రసవానికి సంబంధించిన అనుభవం ఉన్నవ ళ్ళు కాదు. మరో ఆలోచన లేకుండా వాళ్ళిద్దరినీ లేబర్‌ రూం చేర్పించింది. ఇద్దరినీ హుషారు చేస్తూ, అనునయిస్తూ ప్రసవం స్త్రీ శరీరంలో చేయగల ఎంత గొప్ప కార్యమో బోధిస్తూ వారి నుదుటి మీద ముద్దు పెడుతూ వారిని సిద్ధం చేసింది.

ఇద్దరూ కనేసరికి దాదాపు మూడు గంటలు  పట్టింది. ఒక్కతే అక్కడ పనంత సంబాళించుకునే సరికి మరో గంట పట్టింది.

బైటికి వచ్చి చూస్తె  ఆ రోజు డాక్టరు గారి దగ్గర చూపించుకోటానికి వచ్చిన వాళ్ళతో హాలు , వరండా కిటకిటలాడ పోతున్నాయి.

చక, చకా ఒక్కొక్కరినే నవ్వుతూ పలకరిస్తూ ‘‘అలా చేస్తే  ఎలాగోయ్‌ నీ ఆరోగ్యం గురించి నువ్వే పట్టించుకోకపోతే ఎవరికి పడుతుంది. వేరే ఏమీ చెయ్యొద్దు. రోజూ అన్నంలో ఆకుకూర పప్పో, పచ్చడో చేసుకు తిను. సాయంత్రం ఒక వేరుశనగ పప్పుండ తిను. నెల రోజుల్లో నీరసం, గీరసం ఎగిరిపోతుంది. రక్తం పట్టాలోయ్‌ నీకు’’.

‘‘మా ఆయన ఆకుకూర ఇంట్లోకి రానివ్వడు’’.

‘‘నువ్వు తిను. ఆయనకు పెట్టకు’’.

‘‘అలా ఎలా కుదురుతుంది డాక్టరు గారూ ` ’’

‘‘ఎందుకు కుదరదు. గుప్పెడు కూర నీ కోసం నువ్వొండుకోలేవా ? ఇంటిల్లిపాదికీ వంట చేస్తావు. ఈ స్వతంత్రం లేదా ` మీ ఇల్లెక్కడ?’’

‘‘మీ ఇంటి దగ్గరేనండి ’’

‘‘ఇంకేం రోజూ పన్నెందింటికి మా ఇంటికి – ఎవర్నయిన పంపు. నీకు కావసిన ఆకుకూర మా అమ్మ చేయించి పెడుతుంది. అట్లాగే ఒక పప్పుండ ఇస్తుంది. సరేనా ?’’

వెంకమ్మ లేచి శారద రెండు కాళ్ళూ పట్టుకుంది.

‘‘ఛీ! ఛీ! అదేం పనోయ్‌. నువ్వు వెళ్ళు. బైట ఎంత మందున్నారో చూశావుగా’’.

వెంకమ్మ లాంటి ఎందరికో శారద అంటే పిచ్చి ఆరాధన. పనంతా  ముగించుకుని చిన్న నర్సు సరస్వతిని అడిగింది.

‘‘సుభద్రమ్మకి ఏమయింది? ఒంట్లో బాగాలేక ఇంటికెళ్ళిందా?’’

‘‘తెలియదమ్మా. మధ్యాహ్నం ఎవరో వచ్చి పిల్చుకెళ్ళారు. పార్టీ ఆఫీసుకి వెళ్తున్నాను. అరగంటలో వస్తానంది. మళ్ళీ రాలేదు.’’

దానిని గురించి శారద పెద్దగా ఆలోచించలేదు. ఇంత సమయం పడుతుందనుకుంటే ఎవరో ఒకరి చేత తనకు కబురు

చేసే పని గదా అనుకుని ‘‘ఒకోసారి అదీ కుదరదు. అందరం ఎంత కష్టపడుతున్నాం. ఇల్లు, పని, పార్టీ పని, సుభద్రకు పిల్లలు  కూడా. ఎంత ఓపికగా అన్నీ చక్కదిద్దుకుని వస్తుందో. తనకు ఇంట్లో అమ్మ ఎంత అండగానో ఉంది కాబట్టి గానీ ` ’’ అనుకుంటూ ఒకసారి హాస్పిటల్‌లో ప్రసవమయ్యి ఉన్న వారినీ, ప్రసవానికని వచ్చి చేరిన వారినీ పకరించి, వారిని నవ్వించి ఇంటికి బయల్దేరింది.

ఇల్లు  చేరేసరికి అలసట కమ్ముకొచ్చింది. అన్నం కూడా తినకుండా నిద్రపోవాలనిపించింది. కానీ మూర్తీ సుబ్బమ్మ ఊరుకోలేదు. మూర్తి మరీ మరీ బుజ్జగించి తినిపిస్తుంటే సుబ్బమ్మ ముసిముసిగా నవ్వుకుంటూ అవతల గదిలో కూచుంది. కడుపు నిండేసరికి శారదకు ఉత్సాహం  వచ్చింది. గబగబా లేచి తాంబూలం  చుడుతూ

‘నను పాలింప నడచి వచ్చితివో  నా  ప్రాణ నాధ’ అంటూ త్యాగరాజ కృతి  అందుకుంది. మూర్తి గొంతు కలిపాడు.

‘వనజనయన మోమును జూచుట జీ

వనమని నెనరున ` మనసు మర్మము దెసి’

అని అతను పాడితే ` మళ్ళీ పల్లవి  శారద అందుకుంది.

ఇద్దరి మనసుల్లో పట్టరాని  ప్రేమ. మూర్తి శారద చుట్టూ చేతులు  వేసి నడిపిస్తూంటే శారద ఒళ్ళూ, మనసూ పులకరించింది.

‘‘మూర్తి  ప్రేమ  ఉంటే చాలు . ఎంత పనైన చేసేస్తా’’ అనుకుంది. అతని కౌగిలిలో నిశ్చింతగా నిద్రపోయింది.

మర్నాడు  ఇద్దరూ కాఫీ తాగుతూ ముచ్చటించుకుంటూ ఉన్నారు.

‘‘నిన్న ఎంత అలిసిపోయానో – సుభద్ర లేదు. పనిమీద వెళ్తున్నానని  నాకు  కబురు చెయ్యనూ లేదు. రెండు కాన్పులు . యాభై మందికి పైగా జనం. నువ్వు చేసిన ఉపచారం వల్ల గానీ లేకపోతే ఇవాళింత హుషారుగా లేవలేకపోయేదాన్ని’’.

‘‘ఉపచారము చేసే వారున్నారని  మరువకుమా’’ అన్నాడు  మూర్తి.

‘‘మరువకురా – త్యాగరాజు  కీర్తనలో ఒక్కక్షరం కూడా మనం మార్చకూడదు’’. సీరియస్‌గా అంది శారద.

‘‘సరేం ’’ అన్నాడు  మూర్తి సరదాగా. ఇద్దరూ నవ్వుకుంటూ లేచారు. వరసగా రెండు రోజు సుభద్ర  రాలేదు. శారదాంబ ఇక ఊరుకోలేక సుభద్ర ఇంటికి వెళ్ళింది.

ఇంట్లో సుభద్ర లేదు. ఆయన పిల్లలకు  ఒండి పెడుతున్నాడు. శారదను చూసి హడావుడి  పడుతూ ఏం చెయ్యాలో తెలియనట్టు నుంచున్నాడు.

‘‘సుభద్ర లేదా?’’

‘‘లేదు. పార్టీ పనిమీద మచిలీపట్నం వెళ్ళింది.’’

‘‘పార్టీ పని మీదా ` ’’

‘‘ఔనమ్మా. ఇప్పుడామె కూడా నాలాగే పూర్తికాలం  కార్యకర్త కదా. ఇద్దరం అవస్థ పడుతున్నాం . కానీ అలవాటవుతుందిలే ` ’’

‘‘నాకు  చెప్పనే లేదు’’.

‘‘ఎక్కడమ్మా – మూడ్రోజుల నాడు  పార్టీ ఆఫీసు నుంచి వచ్చి రెండు చీరలు  సంచీలో పెట్టుకు వెళ్ళింది. రేపు పొద్దున వస్తుంది. నాకే  ఏ సంగతీ సరిగా తెలియదు. పిల్లకు  ఆమెనొదిలి ఉండటం అలవాటులేక తిప్పలు  పెడుతున్నారు.’’

శారదకు మనసంత చేదయింది. ఇదంత మూర్తికి తెలుసు . తెలియటమేమిటి అతనే చేసి ఉండాలి. ఒక్కమాట తనకు చెప్పలేదు. చెప్పే  వ్యవధానం సుభద్రకు ఇవ్వలేదు.

‘‘రేపొకసారి సుభద్రను రమ్మన్నానని చెప్పండ ’’ అంటూ బైటికి నడిచింది. మూర్తితో ఈ విషయం మాట్లాడాలని కూడా అనిపించలేదు శారదకు. మనసు ఎడారయినట్లయింది.

అతనింత పని చేసి ఆ రోజు రాత్రి తనతో –

కళ్ళల్లోకి నీళ్ళు చిమ్ముకొచ్చాయి. తమాయించుకుంటూ ఆస్పత్రికి వెళ్ళింది. వెళ్ళేలోపే  గుండె దిటవు చేసుకుంది. సుభద్ర తనకు కుడి  భుజమే – కానీ తను ఎడం చేతితో ఎక్కువ పనులు  చేస్తుంది. చేసుకోగలుగుతుంది. ప్రాక్టీసు పెట్టిన దగ్గర నుంచీ ఉన్న సుభద్రకు అన్నీ తతెలుసు. పోన్లే – పార్టీలో ఎదుగుతుంది – సుభద్ర గురించి కాదు – మూర్తి సంగతేమిటి?

***

మీ మాటలు

  1. చందు – తులసి గారూ,
    విషయం ఉండటం లేదని ఎవరంటున్నారు? విషయం లేకుండా కథను రాయటం అసలు సాధ్యమయ్యే పనేనా? కవిత్వమంటే వస్తువే, కథ అంటే ఇతివృత్తమే అనే అవగాహన పోవాలని నా కోరిక. రచనా విధానంలో మామూలుతనాన్ని వీడి అసాధారణత్వాన్ని సాధించడమే ధ్యేయం కావాలి కవులకూ రచయితలకూ. గొప్ప ఇతివృత్తాన్ని తీసుకుని మామూలుగా రాసేవాళ్లు వ్యక్తులుగా గొప్పవాళ్లవు తారేమో కాని, రచయిలుగా గొప్పవారు కారని నా అభిప్రాయం. చాసో రాసిన కథలు పైకి మామూలుగానే కనిపిస్తాయి కాని, జాగ్రత్తగా పరిశీలించి చూస్తే వాటిలోని రచనా విధానంలో finesse , ingenuity కనిపిస్తాయి. చాసో లాగా రాయటం అందరికీ సాధ్యం కాదనేది నిజమే. కాని, అట్లా రాయాలనే ప్రగాఢమైన తపన, ఆ దిశగా కృషి అవసరం. ఇతివృత్తంతోనే సంతృప్తి పడి సరిపెట్టుకోవటం మంచి విషయం కాదు అనే నేను చెప్పదల్చుకున్నది.

మీ మాటలు

*