-మధు చిత్తర్వు
~
ప్రయాణాలంటే చాలామందికి ఇష్టం. అయితే మనం సౌకర్యవంతంగా రైలులోనో విమానంలోనే ఆ ఊరు చేరుకుని స్థానికంగా దొరికే టాక్సీ మాట్లాడుకుని చుట్టూ ఉన్న ముఖ్యమైన ప్రాంతాలు చూడడం, ఫోటోలు తీసుకోవడం చేసి సావనీర్లు కొనుక్కుని తిరిగి వస్తాం. ఇది చాలా మాములుగ చేసే యాత్ర. మహా అయితే ఒక పోస్ట్ కార్డ్ కొంటాం. లేదా బ్లాగ్లోనో ఫేస్బుక్ లోనో ఓ పోస్ట్ పెడతాం.
అయితే గమ్యం కంటే గమనమే ముఖ్యం, ప్రయాణానికే జీవితం, సాహసమే ఊపిరి అనుకునే వాళ్ళు చాలా తక్కువమంది ఉంటారు.
ఈ పుస్తకం రాసిన అజిత్ హరిసింఘాని అలాంటివాడే. పూనెలో స్పీచ్ థెరపిస్ట్గా పనిచేసే ఇతనికి, పక్షవాతం వచ్చి మాట పడిపోయిన “డీకోస్టా” గారికి చికిత్స చేయడమనేది ఒక గొప్ప స్ఫూర్తి అయింది. డీకోస్టా జె.ఆర్.డి. టాటాకి వీరాభిమాని. ఆయనకి బి.ఎం.డబ్ల్యూ కారంటే ఇష్టం. అజిత్కి మోటార్ సైకిల్ ఇష్టం. జె.ఆర్.డి. టాటా రాసిన “కీ నోట్” అనే పుస్తకంలో గుర్తు పెట్టుకున్న వాక్యం…
“…జీవితాన్ని కాస్త ప్రమాదకరంగా గడిపితే… ఆనందం, ఆత్మఫలసిద్ధి…” అనే వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ “ఎప్పుడైనా నా కోసం… సాహసం… మోటార్ సైకిల్… ” అని అడుగుతారు డీకోస్టా.
అదే ఈ యాత్రకి నాంది. ఈ అజిత్ హరిసింఘాని యాభై నాలుగేళ్ళ వయస్సు.. నెరసిన జుట్టుతో అసలు హీరోలానే లేడు. కానీ ఈ పుస్తకం ముగిసే సరికి అతన్ని ఆరాధించడం మొదలుపెడతాం. అతనితో పాటు మోటార్ సైకిల్ మీద ప్రయాణిస్తాం.
ప్రమాదం అంచుకి రమ్మని పిలిస్తే భయపడతాం. పడిపోతామని భయపడతాం. చివరికి కొండ మీద నుంచి తోస్తే ఆకాశానికి ఉజ్వలంగా ఎగిరి పోతాం.
పూనె నుంచి జమ్ము దాకా కేవలం మోటార్ సైకిల్ మీద ప్రయాణించాడు అజిత్ – చాలా తక్కువ బడ్జెట్తో. దారిలో అతని అనుభవాలు భారతదేశపు అసలైన ఆత్మని చూపిస్తాయి. అహ్మదాబాదు, మౌంట్ అబూ, ఆజ్మీర్, పుష్కర్ లాంటి ఎడారి ప్రాంతాల నుంచి సాధారణ వ్యక్తుల ఆతిథ్యం తీసుకుంటూ మనం కూడా ప్రయాణిస్తాం. రోడ్డు పక్కన సూఫీ బాబా సైకిల్ మీద మక్కా బయల్దేరానని చెబితే అతని కథ వింటాం. “భగవంతుడిచ్చిన రాజప్రాసాదంలాంటి భూమి మీద పడుకోడానికి రెండు గజాల స్థలం ఎక్కడైనా దొరుకుతుంది” అంటాడు సూఫీ బాబా. అతను చెప్పిన కథలో అమాయకుడైన యువభిక్షువు.. “ఒక్కరోజుకి ఆహారం చాలు. రేపటి గురించి భగవంతుడు చూసుకుంటాడ”ని ఎందుకు నమ్ముతాడో గ్రహిస్తాం. గురుద్వారాలో ఉచితంగా మకాం వేస్తాం. ఇనుప వంతెనని దాటుతుంటే పిట్టల గుంపులు తల మీదుగా ధ్వనులు చేసుకుంటూ వెళ్తాయి. అస్తమిస్తున్న సూర్యుడి బంగారు రంగు కాంతిలో గురుద్వారాలో కీర్తనలు వింటాం.
ఆ తర్వాత రోహతాంగ్ కనుమ దాటి నీలాకాశంలో ఎగిరే గద్దలను చూస్తాం. అజిత్తో రోడ్లు మాట్లాడుతాయి, వంపులు తిరిగే రోడ్డు మీద ఉన్నత పర్వత మార్గాలు దాటి ఎముకలు ఒణికించే రక్తం గడ్డకట్టే చలిలో ప్రయాణిస్తాం. “వెండి అనకొండ”లాంటి నదులనీ, ఆకాశంలో చందమామని చూస్తూ రాత్రుళ్ళు గడుపుతాం.
లేహ్ అంటే.. లడాఖ్ రాజధానిలో 3520 మీటర్ల ఎత్తులో బౌద్ధ మతస్థుల పండగలు, ఆరామాలను దర్శిస్తాం. విదేశీ యాత్రికులతో పరిచయాలు చేసుకుంటాం. టైగర్ హిల్ దగ్గర ద్రాస్ లోయ చూస్తాం. ఇంటి బెంగతో ఉన్న సైనికులతో స్నేహం చేస్తాం.
ఇంతెందుకు, ఈ అద్భుతమైన అనుభవాలు అన్నీ మాటల్లో చెప్పలేనివి. ఈ పుస్తకాన్ని చక్కగా అనువదించిన కొల్లూరి సోమ శంకర్ తన అద్భుతమైన భావుకతతో కథనాన్ని మరింత రక్తి కట్టించారు.
అజిత్ హరిసింఘాని గారు జమ్మూ దాకా విజయవంతంగా యాత్ర చేసి తిరిగి ఇంటికి రైల్లో వస్తుంటే.. మనకీ అదే సాహసం చేసి తిరిగి వచ్చిన “హమ్మయ్య” అనే అనుభూతి కలుగుతుంది.
జోరుగా ప్రవహించే పార్వతి నది గలగలలు, మనాలి లోని దేవదారు అడవులలోంచి వీచే చిరుగాలులు, బౌద్ధారామాలలోని గంటల చప్పుడు, మంచులో కూరుకుపోతే వచ్చే ప్రాణభయం, ప్రపంచంలో కెల్లా ఎత్తైన రహదారిలో వెచ్చగా పలకరించే సూర్యకిరణాలని అనుభవించాలంటే ఈ పుస్తకం చదవండి. ఎందుకంటే ఇది కథ కాదు, కల్పితం కాదు. ఒక సామాన్యుడు చేసిన సాహసయాత్ర. నిజంగా నిజం.
***
“ప్రయాణానికే జీవితం” పుస్తకం హైదరాబాద్లో నవోదయ బుక్ హౌస్లోనూ, విజయవాడలో నవోదయ పబ్లిషర్స్ వద్ద దొరుకుతుంది. షాపులకి వెళ్ళలేని వాళ్ళు కినిగె ద్వారా పుస్తకాన్ని ఇంటికే తెప్పించుకోవచ్చు. కినిగెలో ఈబుక్ (http://kinige.com/book/Prayananike+Jeevitam) కూడా లభిస్తుంది. 176 పేజీల ఈ పుస్తకం వెల రూ. 120/-
చక్కని సమీక్ష వ్రాసినందుకు డాక్టర్ చిత్తర్వు మధు గారికి ధన్యవాదాలు.
ఈ అద్భుతమైన యాత్రాకథనాన్ని తగ్గింపు ధరకు పొందండి కినిగె ద్వారా. ఈ బుక్ పై అదనపు 10%, ప్రింట్ పుస్తకంపై అదనపు 20% తగ్గింపు. పది రోజుల పాటు.. త్వరపడండి.
http://kinige.com/book/Prayananike+Jeevitam