సమాజాన్ని ఇరుకున పెట్టిన ఇస్మత్‌ చుగ్తాయి

 

-కె.బి.గోపాలం 

~

GopalamKB 1మహానటుడు శశికపూర్‌ సొంత ఖర్చుతో, సొంత ఆలోచనతో తీసిన సినిమా ఒకటి ఉంది. అది అర్థంలేని ప్రేమ గురించిన సినిమా. అందులో నాయకుడు ఒక బ్రిటిష్‌ ఆఫీసర్‌ కూతురిని మరీ మరీ ప్రేమించేస్తాడు. మనకికక్కడ ఆ సినిమా ముఖ్యం కాదు. హీరోయిన్‌ తల్లి పాత్రలో శశికపూర్‌ భార్య జెనిఫర్‌ కనిపిస్తుంది. ఆమెకు తల్లిగా ముగ్గుబుట్టలాంటి తల ఉన్న ఒక ముసలావిడ కనిపిస్తుంది. ఆమె సినిమా మొత్తంలోనూ మాట్లాడదు. కానీ, కథలో బలమయిన భాగంగా మిగులుతుంది. నిజానికి ఆ పాత్రలో కనిపించిన వ్యక్తి సినీ నటి కాదు! ఆమె ప్రసిద్ధ రచయిత్రి ఇస్మత్‌ చుగ్తాయి!  సాహిత్య రంగంలో అందరూ ఆమెను ఇస్మత్‌ ఆపా అంటారు. ఉర్దూలో ఆపా అంటే అక్కయ్య. సినిమాలో చూచినవాళ్లకు ఆ వ్యక్తి గురించి అభిప్రాయాలు ఏర్పడే వీలే లేదు. మహా కలిగితే, జాలి కలుగుతుంది. కానీ, ఇస్మత్‌ ఫయర్‌ బ్రాండ్‌ రచయిత్రి. ఆమె క్రూరులకే క్రూరుడయిన చంగేజ్‌ ఖాన్‌ వంశంలో పుట్టిందని ఎక్కడో చదివినట్టు గుర్తు.

ఇస్మత్‌ చుగ్తాయి పుట్టుకతోనే తిరుగుబాటు స్వభావం గల మనిషి. మగరాయుడులాగ బతికింది. తన యిష్టం వచ్చినట్టు బతికింది. ఆవిడ కథలు, నవలలు, వ్యాసాల్లో కూడా అదే పద్ధతి బలంగా కనిపించింది. సమకాలీనుడు సాదత్‌ హసన్‌ మంటో కూడా ఈ రకం మనిషే. అతను బతుకంతా కష్టపడ్డాడు. ఇస్మత్‌ మాత్రం బతుకంతా పోరాడుతూనే ఉన్నది.

ఇస్మత్‌ చుగ్తాయి 1915లో పుట్టిందన్నారు. ఈ మధ్యన మాత్రం 1911లో అంటున్నారు. ముస్లిం కుటుంబాలో ముఖ్యంగా ఆడపిల్లలకు చదువు అవసరం లేదని గట్టి కట్టుబాట్లు ఉన్న ఆ కాలంలోనే, ఇస్మత్‌ ఎదురుతిరిగింది. బడికి వెళ్లింది. అక్కడితో ఆపకుండా గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసింది. సుమారు మూడు సంవత్సరాల పాటు వేరు వేరు చోట్ల పంతులమ్మగా పనిచేసింది. ఇంకా పైకి చదువుకున్నది. ఏకంగా ఇన్‌స్పెక్టర్‌ ఆప్‌ స్కూల్స్‌ ఉద్యోగానికి ఎక్కింది. ఆ కారణంగా ఆమె బొంబాయి వెళ్లవలసి వచ్చింది. అక్కడ ఇస్మత్‌ పెళ్లి కూడా చేసుకున్నది. ఇద్దరు అమ్మాయిలను కన్నది.  ఉద్యోగం మానేసి రచనతోనే కాలం గడుపుతూ, చివరి దాకా అక్కడే బతికింది.

ఇస్మత్‌ చుగ్తాయి రచనారంగంలోకి రావడానికి బొంబాయిలోని వామపక్ష అభ్యుదయ రచయితల బృందం కారణం అంటారు. నిజానికి ఆ బృందంలో సభ్యురాలయిన రషీద్‌ జహా అనే గైనకాలజిస్ట్‌ ఇస్మత్‌ మీద నిజమయిన ప్రభావం కనబరచిన వ్యక్తి. ఆ డాక్టరమ్మ ఆదర్శభావాన్నింటినీ పొందుపరుస్తూ కథలు రాసేది. ఆ ప్రభావంతోనే ఇస్మత్‌ కూడా నాటకాలు, కథలు, వ్యాసాలు రాయడం మొదుపెట్టింది. 1945లో ఆమె రాసిన నవల ఉర్దూ సాహిత్యంలోనే గొప్ప రచనల్లో ఒకటిగా పేరు పొందింది. నవల పేరును తెలుగులో ‘వంకర గీత’ అని చెప్పుకోవచ్చు. ఆ నవల నిజానికి రాసిన తరువాత యాభయి సంవత్సరాలకు అచ్చయింది. అందులో ఆమె ఆడవారి లైంగికతను, ఆ విషయంగా వచ్చే సమస్యలను జంకు లేకుండా చర్చించింది. అయితే, అది అసలు సిసయిలన నవల. వ్యాసాల పోగు కాదు. చెప్పదలచుకున్న విషయాన్నీ బలంగా చిత్రించిన ఒక పాత్రలోనుంచే వస్తాయి. ఆ పాత్ర బహుశా స్వయంగా ఇస్మత్‌ అన్నారు పరిశీలకలు.  పాత్రలో ఇస్మత్‌ వ్యక్తిత్వంలోని మిగతా అంశాలు లేకపోవచ్చు. ఈమె రచయిత్రి. నవలలోని కథా నాయిక మాత్రం పుస్తకాలు పట్టని మనిషి. అసలు కళంటేనే ఆసక్తి లేని మామూలు అమ్మాయి. కనుకనే ఆ పాత్ర, ఆమె చుట్టూ అల్లిన కథ, చివరికి నవల, చాలా సహజంగానే కనిపిస్తాయి. చర్చకు అసలు ఆధారం కథానాయిక షంషాద్‌ పెళ్లి. ఆమెకు దొరికిన మొగుడు ఇంగ్లీషు మనిషి. అప్పట్లో అదొక పద్ధతి. రెండవ ప్రపంచయుద్ధం కారణంగా ఆ మొగుడు షంషాద్‌ను వదిలి వెళిపోతాడు. ఆమెకు మొత్తం కంపెనీ మీద బ్రిటీష్‌వారి మీదా కోపం వస్తుంది. మొగుణ్ణి ఆమె చీదరించుకుంటుంది. వదిలేస్తుంది కూడా!

Akkadi MeghamFeatured

ఈ నవల రాసేనాటికి చుగ్తాయికి పెళ్లయింది. భర్త షాహిద్‌ కూడా కలంబలం మనిషి. ‘నేను మామూలు ఆడమనిషిని కాదు. నా వల్ల కష్టాలు కలగవచ్చు. నేను బతుకులో బంధనాన్నీ తెంపుకున్నాను. మళ్లీ ఒకసారి కట్టుబాట్లకు లొంగేది లేదు. బుద్ధిగా భార్యగా, జీవించడం, నటించడం నావల్ల కాదు’ అని ఆమె భర్తతో చెప్పిందట. చుగ్తాయి పెళ్లి తరువాత కూడా రచనలు కొనసాగించింది. దుప్పటి అనే కథలో అప్పటికి ఎవరూ నోరు విప్పి మాట్లాడని లైంగిక సమస్యను గురించి రాసింది. ఆడమనిషి మరో ఆడమనిషితో సెక్స్‌ అనుభవించడాన్ని చర్చించింది. కనుక ఇస్మత్‌ కోర్టు పాలయింది.  కన్నబిడ్డను చంకనెత్తుకుని ఆమె కోర్టు చుట్టూ తిరగవసి వచ్చింది. ఆ తరువాత జీవితంలో ఇటువంటి అపభ్రంశపు సంఘటనలు ఎదురు కాలేదుగానీ, కుటుంబ జీవితం సాఫీగా సాగింది లేదు. రచన కారణంగా ఆమెకు గొప్ప పేరు వచ్చింది. ఆమె తీరు అలాగే కొనసాగింది. భయం లేకుండా ఆమె కలం ముందుకు సాగింది. బతుకు కూడా భయం లేకుండానే ముందుకు సాగింది. అయినా, గొప్ప ఒడిదుడుకులు మాత్రం ఎదురు కాలేదు.

కుటుంబ జీవితం గుంభనంగా సాగింది. అయినా, ఏ భర్తకు భార్య ఖ్యాతి నచ్చదు. ఇస్మత్‌ పేరు పెరుగుతున్నకొద్దీ, భర్త ఆమె నుంచి దూరం కాసాగాడు. ఈమె మాత్రం ఎక్కడా భర్త గురించి ఒక్క ముక్క రాయలేదు. అవసరం వచ్చిన చోట  ఆయన తన నేస్తము, సహచరుడు, సముడు, అని మాత్రమే అంటూ వచ్చింది. మామూలుగా రచనల్లో కల్పన పేరుతో నిజాలు కనపడతాయి. అనుభవాలు కనపడతాయి. ఆలోచనకన్నా, ఈ అనుభవాలే బలంగా కనపడతాయి. అయినా, ఇస్మత్‌ చుగ్తాయి తన రచనల్లో ఎక్కడా తన వైవాహిక జీవితం గురించి, భర్త గురించి లోతుగా రాసిన సందర్భాలు కనిపించలేదు.

ఈ దేశంలో నాటికీ నేటికీ ముస్లిం స్త్రీ జీవితాలు తెర వెనుక వరకే పరిమితమయి ఉన్నాయి. ఇస్మత్‌ మాత్రం ఆ తెరలను చింపేసింది. అది తొలగించడం కాదు. కథన్నింటిలోనూ ఆడవాళ్ల కష్టాలను గురించి అలవిమాలిన ధైర్యంతో  గొప్ప సత్యాలను చెప్పింది. ముఖ్యంగా సినీపరిశ్రమలోని అమ్మాయిల కష్టాలను వర్ణించిన తీరు దేశాన్ని కుదిపింది. చెప్పకుండా జరిగే వ్యభిచారం ఆమె కథల్లో చాలా చోట్ల వస్తువుగా మారింది. అయినాసరే, ఆ కథలేవీ సంచనాత్మకంగా మాత్రం లేవు. లైంగిక పరంగా మనుషులను కిత కితలు పెట్టేవి కూడా కావు. భయంకర సత్యాలను అంత భయంకరంగానూ  బయటపెట్టి భయపెట్టే రచనలవి!

ఇస్మత్‌ పేరు చెప్పగానే ‘లిహాఫ్‌’ అనే పేరుగల ఆమె కథ అందరికి గుర్తు వస్తుంది. తెలుగులో చెప్పాలంటే శీర్షిక ‘దుప్పటి’. ‘ద క్విల్ట్’  అనే పేరును వెదికితే నెట్‌లో ఈ కథ దొరకవచ్చు. కథ తనకు తెలిసిన ముస్లిం జనానా పరిస్థితుల్లో నడుస్తుంది. అక్కడ సెక్స్‌ కోరికను తీర్చుకోవడానికి ఆడవాళ్లు ఆడవాళ్లనే వాడుకోవడం గురించి ఇస్మత్‌ ఆ కాలంలోనే రాసిందంటే, అది ఆశ్చర్యం మాత్రమే కాదు, అద్భుతం అనవచ్చు. కథ గొప్ప దుమారాన్ని రేపింది. కానీ సరదాగా సాగుతుంది. చాలాకాలంగా చర్చకు, కోర్టు కేసుకు ఆధారమయిన ఈ కథ చాలామందికి తెలిసే ఉంటుంది.

ఇస్మత్‌ రాసిన కథలో ‘పవిత్ర ధర్మం’ అనే అర్థం వచ్చే పేరుగల మరో కథ గొప్పది. ఈ కథ అంతగా చర్చకు గురి కాలేదేమో! దిల్లీలోని ఒక ముస్లిం కుటుంబం, గౌరవం కలది. ఇంటి ఆడకూతురు సమీనాకు తగిన సంబంధం చూచి పెళ్లి చేయాలనుకుంటారు. సరిగ్గా లగ్నానికి ముందు రోజు అమ్మాయి అలహాబాద్‌కు చెందిన ఒక త్రివేదీ, బ్రాహ్మణ కుర్రవాడితో  లేచిపోతుంది. అనుకున్నట్టుగానే వాళ్లు అలహాబాద్‌ చేరుకుంటారు. అబ్బాయి కుటుంబంవాళ్లు సమీనాను హిందువుగా మారుస్తారు. కొంతకాలానికి అమ్మాయి ధైర్యం చేసి అమ్మానాన్నలకు ఉత్తరం రాస్తుంది. వెంటనే తల్లి తన భర్తతో అన్నట్టు రాసిన మాట ఏమిటో తెలుసా? ‘పదండి, అలహాబాద్‌ వెళ్లి ఇద్దరినీ షూట్‌ చేద్దాం’ అని! కథ తల్లిదండ్రుల దృష్టి నుంచి నడుస్తుంది.

కొంతకాలం గడుస్తుంది. కోపతాపాలు కొంత తగ్గుతాయి. సమీనా తండ్రి అలహాబాద్‌ పోతాడు. కూతురు అల్లుళ్లను  దిల్లీకి పిలవాలని, ఒక రకంగా సంధి చేసుకోవాలని అక్కడ ఉద్దేశం. అతని తీరు చూచిన త్రివేదీలు అభ్యంతరం చెప్పరు.  ఇక్కడ దిల్లీలో మాత్రం ముస్లిం పద్దతిలో ఆ జంటకు మరోసారి పెళ్లి చేయాలని ఏర్పాట్లు జరుగుతాయి. అంటే, అబ్బాయి  మతం పుచ్చుకోవాలి. సమీనా కూడా తిరిగి మతంలోకి రావాలి. చిత్రంగా సమీనా భర్త ఒప్పుకుంటాడు. అమ్మాయి మాత్రం ఎదురు తిరుగుతుంది. ఇక అక్కడ గొప్ప చర్చ జరుగుతూ కథ ముందుకు సాగుతుంది. సమీనా, భర్త తాషార్‌ ఇద్దరూ ఎక్కడికో పారిపోతారు. రెండు వేపులా కుటుంబాలు వేసిన పథకాలు అర్థంతరంగా ఆగిపోతాయి. పారిపోయిన తరువాత  సమీనా తన తల్లిదండ్రుకు ఒక ఉత్తరం రాస్తుంది. అది కథకు ప్రాణం.

‘అయితే, నాన్నా, అంతలో నీవు రంగం మీదికి దిగావు. నువ్వు చాలా గొప్ప నటుడివి. మామగారిని మెప్పించి నీవు ఒప్పించిన తీరుతో నేను కదిలిపోయాను. మా మామగారు గొప్ప మనసున్న మనిషని నాకు నేను నచ్చచెప్పుకున్నాను.  ఆయన నిజానికి తన మనుషులను వాడి మమ్మల్నిద్దరినీ బనారస్‌ చేర్చాడు. మా మీద మొట్టమొదట మంత్రదండం ప్రయోగించింది ఆయనే! ఇక నీవు వచ్చి క్షమిస్తున్నానంటూ చల్లగా చెప్పి మమ్మల్ని దిల్లీ చేర్చావు. అయితే ఆ తరువాత నీ అసలు రూపం బయటపడింది. బజారులో బిచ్చగాడు కోతులను ఆడిరచినట్టు నీవు నన్ను, నా భర్తను ఆడింపజూచావు. మేమిదంతా సరదాగా ఉందనుకుని చూస్తూ ఉండిపోయాము. అయితే భయపడకు, నీ రహస్యాన్ని మేము అంత సులభంగా బయటపెట్టము. రేపు పొద్దున పత్రికలో విషయం చూస్తే, మా మామగారి మనసులో బాంబు పేలుతుంది, తప్పదు. ముస్లిం పెళ్లి సంగతి వాళ్లకు తెలిసిపోతుంది. మేము వాళ్లను వదిలి వచ్చేశాము. ఇక మీకు కూడా సెలవు. మేము ఎక్కడికి పోతున్నది నీకు పట్టకూడదు. మా వల్ల బాధ కలిగితే, క్షమించండి. కాదు, మేము మిమ్మల్ని బాధపెట్టింది లేదు. మీరే మమ్మల్ని కష్టపెట్టారు. నిజానికి క్షమాపణ చెప్పవలసింది మీరే! మమ్మల్ని మీరు నవ్వుపాలు చేశారు. మీకు నచ్చిన విధంగా మీ పాటకు మమ్మల్ని కోతుల్లాగ ఆడించదలిచారు. మీరు అమ్మానాన్నలేనా? ’

చెప్పా పెట్టకుండా లేచిపోయి పెళ్లి చేసుకున్నది తాను. కానీ, ఎదురుతిరిగి తప్పంతా తలిదండ్రుల మీద రుద్దే చోటికి వచ్చిందంటే రచయిత్రి ఇస్మత్‌ ఆపాను మెచ్చుకోకుండా ఉండలేము. మతాలు రుద్దాలని రెండు వేపులా తల్లిదండ్రులు చేసిన  తప్పుడు ప్రయత్నాలను ఆధారంగా తీసుకుని అక్కయ్య ఈ పని చేయగలిగింది. కుటుంబ గౌరవం, అన్ని రకాల గౌరవం  నిలిస్తే చాలు, మిగతా ఎన్ని తప్పులు చేసినా ఫరవాలేదనుకున్న పెద్దల తప్పులను ఈ కథలో ఆమె ఎత్తి చూపింది. ఉత్తర భారతదేశంలో ఈమధ్యన జరుగుతున్న ‘గౌరవ హత్యలు’ ఈ సందర్భంగా మనసులో మెదిలితే తప్పు కాదు. ఇన్నేళ్లయినా,  పరిస్థితి మారలేదు. ఇస్మత్‌ చుగ్తాయి లాంటి రచయిత్రులు ఇంకా రావాలన్న భావం మనసుల్లో బలపడుతుంది. పెళ్లి అనే వ్యవస్థ మీద రచయిత్రి ఫెడీలుమని కొట్టిన చెంపదెబ్బ ఈ ‘పవిత్ర ధర్మం’.

ఈ రచయిత్రి కథలు ఇంచుమించుగా అన్నీ ఇదే పద్ధతిలో సాగుతాయి. సమాజంలోని సమస్యల మీద చక్కని చెణుకులను విసురుతాయి. ఈమె కలంలాగే మాటలు కూడా చాలా పదునుగలవి.

కథను ఎత్తుకుంటే చాలు వెతకనవసరం లేకుండా, ఆలోచలను ముప్పిరిగొంటాయి. వాటికి తగినట్టే వెల్లువల్లాగ మాటలు కూడా ప్రవహిస్తాయి. ఎక్కడా ప్రయత్నించి, తడుముకుని రాసిన తీరు కనిపించదు. ఆమె మాట్లాడుతూ ఉంటే కూడా అంతే వేగంగా ఉండేదట! నిజానికి మాటు దొర్లేవట. వంట గదిలోకి వచ్చిందంటే, గోల చేసేసేదట. అంటే, కొంచెం తొందరపాటు మనిషి అని అర్థంచేసుకోవచ్చు. పిండి పిసకకముందే పెనం మీద రొట్టె కాల్చ గలిగిన మనిషి ఇస్మత్‌!   ఆలోచనల్లోనే వంటంతా ముగించే ఈ రచయిత్రి రచనల్లో దూకుడు కనిపించడంలో ఆశ్చర్యం లేదు. అది అప్పటి పాఠకును, విమర్శకులను అందరినీ అదరగొట్టిన తీరు. ఒక తోటి రచయిత్రి ఈమె స్వభావాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ,  చక్కని మాట చెప్పింది. ఇస్మత్‌ వంట ఇంట్లోకి వెళుతుంది, తన ఆలోచనలతోనే కడుపు నింపుకుని బయటకు వచ్చేస్తుంది, అన్నారావిడ.

ఇస్మత్‌ చుగ్తాయి తన స్వంత కథను కూడా రాసింది. అందులో మొగమాటం లేకుండా తన తీరు గురించి, తిరుగుబాటు మనస్తత్వం గురించి వివరించింది. చిన్నప్పటి తీరు, పెళ్లినాటిదాకా సాగిందని చెప్పేసుకున్నది. ఆ సంఘటను చదివేవారికి ఆమె మాటలోని చమత్కార ధోరణి, మనసులోని విషయం చెప్పడానికి హాస్యాన్ని వాడుకున్న తీరు చక్కగా ఎదురవుతాయి. చకితులను చేస్తాయి. మొత్తానికి మంచి మాటలతోనే ఇస్మత్‌ తాను చెప్పదలచుకున్న సంగతులు చెప్పేస్తుంది.  అమ్మాయి పెద్దదవుతున్నదని వాళ్ల నాన్న వంట నేర్చుకోమన్నాడట. బడికి వెళ్లడం అవసరం లేదేమో అని కూడా అన్నాడట.

‘ఇస్మత్‌! అమ్మాయిలు వంట చేస్తారమ్మా. అత్తవారింటికి వెళ్లిన తరువాత అక్కడ వాళ్లకు ఏం పెడతావు?’ అని నచ్చజెబుతూ, మెత్తగా చెప్పాడట వాళ్ల నాన్న! ఆమె మాత్రం ‘నా మొగుడు లేనివాడయితే, కిచిడీ మాత్రం వండుకుని తింటాం. ఇక కలిగినవాడయితే, వంట వాడిని పెట్టుకుంటాం’ అన్నది. ఆ దెబ్బతో ఆ తండ్రికి సంగతి అర్థమైపోయి ఉండాలి. అయినా, పట్టలేక ‘అయితే నీవేం చేస్తావు?’ అని అడిగాడు. ‘నా అన్నదమ్ముల్లాగ నేను కూడా చదువుకుంటాను’ అన్నది ఆ గడుగ్గాయి అమ్మాయి మొండిగా.

తండ్రికి ఇక తప్పలేదు. ఒక బంధువును అమ్మాయికి చదువు చెప్పమని నియమించాడు. నాలుగయిదు నెలలు పగలు, రాత్రీ ట్యూషన్‌ సాగింది. ఆ తరువాత బడికి పోతే, పరీక్ష పెట్టి ఏకంగా ఆమెను నాలుగవ తరగతిలో చేర్చుకున్నారు.  అక్కడ డబుల్‌ ప్రమోషన్‌ దొరికింది. అంటే, అయిదు అవసరం లేకుండానే ఆరవ క్లాసుకు చేరింది. ఆమె తెలివి గురించి  చెప్పడానికి ఈ రెండు మాటలు చాలు. ఆమె నాకు స్వతంత్రం కావాలి. చదువు లేకుండా ఆడదానికి స్వతంత్రం అందదు,  చదువుకోని అమ్మాయికి పెళ్లయితే, వాళ్ళాయన ఆమెను ‘చదువురాని దానివి’ ‘మొద్దువు’ అంటాడు! మగమహారాజు పనిలోకి వెళితే, ఆయన మళ్లీ వచ్చేదాకా ఆ మొద్దు వేచి ఉండక తప్పదు. నేను మాత్రం అట్లా ఉండదచుకోలేదు. కనుకనే చేతనయినంత వేగంగా చదువుకుంటాను, అన్నది ఇస్మత్‌.

ఇస్మత్‌ కుటుంబంవాళ్లు అభ్యుదయ భావాలుగల వాళ్లేమీ కాదు. అయినా, ఆమె పట్టు వదలలేదు. చదువుకుని తీరాలన్నది. గడపదాటి బయటకు రాగలిగింది. చివరకు పెళ్లి కూడా తన ఇష్టం వచ్చిన మనిషినే చేసుకున్నది.

ఇస్మత్‌ గురించి, ఆమె స్వభావం గురించి మరింత తెలుసుకోవడానికి ఆమె కోర్టు కేస్‌ వివరాలను చదివితే అర్థమవుతుంది. ఆ వివరాలను ఆమే రాసి అందించింది. చాలా గొప్ప రచనలు చేసినవాళ్లు కూడా, పొందని కీర్తి కోర్టు కేసులో చిక్కుకున్న రచయితలు పొందుతారు! సల్మాన్‌ రుష్దీ అందుకు ఒక ఉదాహరణ. లిహాఫ్‌ అంటే, దుప్పటి అన్న ఆడవాళ్ల మరుగు వ్యవహారాలను గురించిన కథలో బూతు ఎక్కువయిందని ఆమె మీద కేసు వేశారు. ఇస్మత్‌ మాత్రం పరిస్థితికి కదిలిపోయిన దాఖలాలు కనిపించవు. ఆ సమయంలో ఆమె లాహోర్‌లో  సాదత్‌ హసన్‌ మంటో ఇంట్లో భర్తతో సహా విడిది చేసింది. అక్కడ జరిగిన సరదా సంగతులు, అంత సరదాగానూ కోర్టు వ్యవహారం గురించి కూడా చెప్పింది.  అసలు కథలో బూతు ఉందా? అన్న చర్చ కూడా ఇంట్లోనే బాగా జరిగింది, అంటుంది ఇస్మత్‌. వాళ్లకు అక్కడ సాదత్‌ హసన్‌ మంటో ఆతిథ్యం ఇచ్చాడు. అతను ఈమె కన్నా ధైర్యం గల రచయిత. కనీసం ఈమెతో సమానంగా ధైర్యం గల రచయిత. రచనలు, కోర్టు కేసు, బెదిరింపు కారణంగానే అతను లాహోర్‌ చేరాడు.

కథ గురించి కోర్టులో జరిగిన వాటికన్నా, సభ్య సమాజంలోనే ఎక్కువ చర్చలు జరిగాయి. భర్త మిత్రుడు అస్లమ్‌ ఈమె కథను తీవ్రంగా విమర్శించాడు. ఇస్మత్‌ మాత్రం గౌరవంగా ఎదురుతిరిగి ‘ఈ కథ రాయడం పాపంగా పరిగణింప బడుతుందని నాకు ఎవ్వరూ చెప్పలేదు. ఈ దుర్మార్గపద్ధతి గురించి రాయకూడదని ఎక్కడా చదివిన గుర్తూ లేదు. నేనేమో బొమ్మగీయగల కళాకారిణిని కాదు. నా మెదడు కేవలం మామూలు కెమెరా వంటిది. దానికేదయినా కనిపిస్తే, చెప్పకుండానే పనిలోకి దిగుతుంది. నా చేతులు అప్రయత్నంగా పనిలోకి దిగుతాయి. కలానికి పని చెపుతాయి. నా కలానికి పని చెప్పేది నా మెదడు. ఆ రెంటి మధ్యకు వచ్చే ధైర్యం నాకు ఉండదు’ అంటూ జవాబిచ్చింది. అది ఎదురులేని జవాబు. గౌరవం గల కుటుంబాలు అనుకొనే చోట్ల కూడా తెరమరుగున జరుగుతున్న తప్పులు నిజానికి పాపాలు అని ఇస్మత్‌ గట్టిగా నమ్మింది.  కథ చదివితే, పాఠకులకు కలిగే భావాలు వేరు. రచయిత్రి అనుకున్నది అంతకన్నా బలంగా ఉందేమో! కొన్ని సంగతులు మన దృష్టిలోకి వస్తే, పట్టనట్టు ఉండడం మంచిది కాదు, అంటుంది ఈ రచయిత్రి. అంటే, కథకు ఆధారమయిన సంగతి ఈమె కళ్ల ముందుకు వాస్తవంగానే వచ్చిందని, అది క్పన కాదని, అర్థమవుతుంది. కనుకనే, ఆమె కదిలిపోయి తన ప్రతిక్రియను కథ రూపంలో చెప్పింది.

కోర్టులో జరిగిన నాటకాన్ని కూడా ఇస్మత్‌ చుగ్తాయి చక్కగా వివరించి చెప్పింది. చాలామంది ఆ దంపతులకు క్షమాపణలతో లేదా అపరాధ రుసుముతో తప్పించుకుంటే మంచిదని సలహా ఇచ్చారట. కానీ, వీళ్లు ఒప్పుకోలేదు. కేసు సాగింది. ఒకరి తర్వాత ఒకరుగా సాక్షులు వచ్చి కథను బూతుగా నిలబెట్టేందుకు ఏవో చెపుతున్నారు. రచయిత్రి పక్షం లాయరు వేసిన ఎదురుప్రశ్నతో వాళ్లంతా వెనుదిరగవలసి వచ్చింది. ఒక పెద్ద మనిషి ఒక వాక్యాన్ని ఎత్తుకుని, ‘ప్రేమికులను  ఎంచుకుంటున్నది’ అన్న మాట బూతు అన్నాడు. లాయర్‌ ఎదురుతిరిగి, ‘అందులో ఏమిటి బూతు? ప్రేమికులా? ఎంచుకోవడమా?’ అని అడిగాడు. ఆ దెబ్బతో ఆ సాక్షి, అట్లాగే కేసు వీగిపోవడం మొదలయింది.

లిహాఫ్‌ గురించి కేసు జరుగుతున్నది. అప్పట్లో ఆ వివరాలను వార్తాపత్రికల వారందరూ ఎప్పటికప్పుడు అచ్చు వేశారు. ఇస్మత్‌ మామగారు అప్పుడొక ఉత్తరం రాశారు. ‘కోడలికి కొంత సలహా ఇవ్వండి. ఆమె అల్లా గురించి, ప్రవక్త గురించి రాస్తే బాగుంటుందని చెప్పండి. అప్పుడయినా, ఆమెకు ఆశీర్వచనాలు అందుతాయేమో! కోర్టు కేసు, అందునా,  బూతు గురించి` ఇదంతా మాకు బాధగా ఉంది. దేవుడు అందరినీ కాపాడుగాక!’ అని ఆయన అందులో రాశారు.

లాహోర్‌లో వీళ్లు సాదత్‌ హసన్‌ మంటోతో ఉన్నారు. ఆ సమయంలోనే మంటో మీద కూడా అదే అభియోగంతో  కేసు మొదయింది. అదే రోజున, అదే సమయానికి అతనికి కేసు కూడా చర్చకు వస్తుంది. ఇంటికి వచ్చిన మంటో అదేదో  విక్టోరియా క్రాస్‌ అంటే, ఇప్పటి పద్మ అవార్డు లాంటిది అందినంత ఆనందంగా ఉన్నాడట! ఇస్మత్‌కు మాత్రం ఆయన గురించి బాధగా ఉంది. అయినా బయటకు కనపరచలేదు.

కోర్టు కేస్‌ కన్నా, విమర్శిస్తూ వచ్చిన ఉత్తరాలు ఇస్మత్‌ను ఎక్కువగా కష్టపెట్టాయి. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమె రాసిన తీరు ఒక్క ఇస్మత్‌కే తగును. ‘నాకు బురద, బల్లి, ఊసరవెల్లులంటే చచ్చే భయం. కొంతమంది మహా ధైర్య వంతులమంటూ, బోర విరుచుకుని తిరుగుతారు. చచ్చిన ఎలుక కనిపిస్తే మాత్రం వాళ్ల అసలు సంగతి బయటపడుతుంది.  నాకు ఉత్తరాలను చూస్తే అంత భయమూ అయ్యేది. వాటిలో పాములు, తేళ్లు, పైథాన్‌లు ఉన్నాయన్నంత భయం! అనుమానంగా విప్పిన ఉత్తరంలో ఆ పాములు, తేళ్లు కనిపించినా, తప్పకుండా చదివేదాన్ని. అప్పుడు వెంటనే వాటికి అగ్గి పెట్టేదాన్ని. ఉత్తరాలు షాహిద్‌, అంటే, మా ఆయన కంటపడితే మరోసారి విడాకుల వ్యవహారం చర్చకు వస్తుంది.

సంచలనం పుట్టించిన ఆ కథను రాసినప్పుడు ఇస్మత్‌ తన అన్నగారి ఇంట్లోఉండేది. కథను ఆమె రాత్రిపూట రాసింది. మరుసటినాడు వదినగారికి చదివి వినిపించింది. ఆమె కథ గురించి వ్యాఖ్యానించలేదు. కానీ, అది ఎవరి గురించి రాసిందో అర్థం చేసుకుంది. ఆ తరువాత కథను ఇస్మత్‌ మరొక బంధువు అమ్మాయికి చదివి వినిపించింది. ఆమె ‘ఏం రాశావు? నాకేమీ అర్థం కాలేదు’ అన్నది. కథను అందుకున్న పత్రిక సంపాదకుడు ఏమాటా అనకుండా, వెంటనే దాన్ని అచ్చువేశాడు. అప్పటికి ఇస్మత్‌కు పెళ్లి కాలేదు. కాబోయే భర్త షాహీద్‌ కథను చదివాడు. అది తనకు నచ్చలేదన్నాడు.  ఆ తరువాత కొంత చర్చ కూడా జరిగింది. అయినా పెళ్లి జరిగింది.

అసలు బూతు అన్నది నిర్వఛనానికి అందని సంగతి. ఇవాళ సినిమా, అందునా, తెలుగు సినిమా చూస్తున్నవాళ్లకు  బూతు, పచ్చిబూతు కూడా అవాటయిపోయినయి. ఆడ, మగ పిల్లలతో కలిసి ఆ రకం సినిమాను చూస్తున్నారు. పిల్లలు  కళ్లార్పకుండా బూతు మాట్లాడుతున్నారు. ఇక రచనలో రతి గురించి చెప్పినా, అది వివరంగా లేకుంటే బూతు కాదు.  ఈమధ్యన కూడా ఎన్నో పుస్తకాల గురించి చర్చలు జరిగాయి. ఆడ, మగ సంబంధాలను పచ్చిగా వివరించడం వేరు. వెచ్చగా సూచించడం వేరు అంటున్నారు. మతకల్లోలాలను గురించి కూడా ఇంచుమించు ఈ రకం వాదనలే వినిపించాయి.   ఒక మతాన్ని గొప్ప చేసి చూపితే తప్పు, ఒక మతం అంటూ ఎంత రాసినా తప్పులేదు అన్నది ఇప్పటి పంథా.

ఇస్మత్‌ చుగ్తాయి ఆ కాలంలోనే మతం సమస్యను కూడా మర్మంగా చెప్పే ప్రయత్నం చేసింది. ఈ ప్రపంచంలో అందరికీ తెలిసిన సత్యాలు కొన్ని ఉంటాయి. కానీ కొందరు మాత్రమే వాటిని గురించి బాహాటంగా చెప్పగలుగుతారు. కొందరు రచయితలు మాత్రమే ఈ రకం సంగతును గురించి రాయగలుగుతారు. ఇస్మత్‌ చుగ్తాయి  ఈ రకం మనుషులో అందరికన్నా ముందుంటారు. ఆమె రాసిన కథలో ఒక ‘స్ట్రాంగ్‌ వాయిస్‌’ వినిపిస్తుంది. ఒక బేగం అఖ్తర్‌, ఒక నూర్జహాన్‌, ఒక మల్లికా ఫుఖ్‌రాజ్‌ గళంలోని బలం ఇస్మత్‌ కథల్లో కూడా కనిపిస్తుంది.

ఇస్మత్‌ రాసిన కథల్లో మొదట్లో ఉన్న గట్టి గొంతుక, తరువాత కొంచెం మెత్తబడిందని పరిశీకులు అన్నారు. అయినా, ఆమె ఆడవారి కష్టాలను గురించి, వర్గ విభేదాలను గురించి, మిగతా అందరికన్నా చాలా బాగా రాశారు. కొన్ని కథలో కూలీవాళ్లను గురించి రాసిన తీరు గొప్పగా ఉంటుంది. ‘ఈ చేతులకు చట్టాలు తెలియవు. ఇవి కేవలం చేతులు.  మురికిని కడిగే చేతులు, ముసలితనాన్ని మోసే చేతులు, మకిలిబారిన ఈ చేతులు భూమి ముఖానికి మెరుగులు అద్దుతున్నాయి’ అంటూ కవితాధోరణిలో ఆమె చెప్పిన మాటలు బీదతనానికి పాడిన హారతిగా వినిపిస్తాయి. అరవయ్యేళ్లనాడే అంత ధైర్యంగా కడగండ్ల బతుకును కథలుగా చెప్పి సమాజం మకిలిని కడగబూనిన ఇస్మత్‌ గురించి ఎంత చెప్పినా చాలదు.

నా సృజన, నా బంధనాలు నేను కోరి తెచ్చుకున్నవి. అవి నా అదుపులోనే ఉన్నాయి. నేను వేసిన పెయింటింగ్‌లు  నా గదిలో వేలాడుతూనే ఉన్నాయి. పచ్చని చేలు, ఆడుకుంటున్న పిల్లలు, ఎగిరే పక్షులు, నిట్టూర్పు,నవ్వు, దూరాన మొగుళ్లు మరెన్నింటినో నేను పట్టేసుకున్నాను అంటుంది ఆవిడ ఒకచోట. వర్గ విభేదాలు, వాటి హద్దులు ఈమె కథలో  కనిపించే వస్తువు. వాటి గురించి చెప్పడానికి ‘ధనిక గౌరవ కుటుంబాలు’ ఎంతగా పనికివచ్చాయో, అంతగానూ బీద బతుకులు కూడా ఆమె కథకు ఆసరా అయ్యాయి.

చుగ్తాయి వర్ణించిన ప్రపంచం ఇప్పుడు లేకపోవచ్చు. అది లేకుండా కావాలన్నదే, ఆమె కోరిక. కథలో ఆమె వంటి వారు అప్పటి పరిస్థితును కంటికి కట్టి చూపకపోతే, అవి కలకాలం నిలిచేవేమో! నిలవకూడదు అనుకున్న ఇస్మత్‌ వంటి రచయిత కోరిక ఫలించింది. కనుకనే, ఆమె హాయిగా వెళ్లి పోయింది. చివరి రోజుల్లో, తనను తిరిగి తన చోటికి చేర్చమని కోరుకున్నది ఆమె. అంటే, ఆమె మనసునిండా గతం నిండి ఉన్నదన్నమాట!  ఆమె కథల్లో చదివి మనం ఇప్పుడు అప్పటి సమాజాన్ని మనసులోనే చిత్రించుకోవాలి. అప్పుడు సమాజంలో వచ్చిన మార్పు మనకు అర్థమవుతాయి. మిగిలి ఉన్న కొన్ని సమస్యలు కూడా మనకు మరింత బాగా మనసుకు ఎక్కుతాయి.

ఉర్దూతో పరిచయం ఉన్నవాళ్లకు ఆమె శైలిలోని ప్రత్యేకత బాగా అర్థమవుతుంది. కానీ, ఆమె కథను అనువాదాల ద్వారానే ఎక్కువగా చదివారు. అనువాదాలు ఎంత బాగా వచ్చిందీ చెప్పగలగడం మరో కష్టం. కవితలాగ గల గలా పారే ఆమె మాటలు అవసరమయిన చోట చటుక్కున ఆగిపోతాయి. చిన్న వాక్యం ఒకటి పడుతుంది,  చదువరిని  ఆశ్చర్యంలో ముంచుతుంది.

ఇస్మత్‌ మరణం తరువాత నివాళి రాస్తూ, మరొక మంచి రచయిత్రి ఖుర్రతులైన్‌ హైదర్‌ అన్న మాటలు వినదగ్గవి.  ‘ఇస్మత్‌ పుట్టిన వంశానికి పూర్వజులలో చంగేజ్‌ఖాన్‌ ఒకరు. అతను ఒక గుడారంలో బతికాడు. ఆ గుడారానికి బంగారం శిఖరం ఉండేది. ఖాన్‌ సైన్యం గుర్రాలమీద కదులుతూ ఉండేది. వాళ్ల గుడారాలన్నింటిమీదా బంగారు పై కప్పులు ఉండేవి. ఆ సైన్యానికి ‘బంగారు సైన్యం’ అని పేరు. ఉర్దూలో దాన్ని ‘ఉర్దూ`ఎ`ముతల్లా’ అనేవారు. సైన్యంలో పుట్టిన భాష కనుక అది ఉర్దూ అయింది. ఇస్మత్‌కు సైన్యం భాష ఉర్దూ అసలయిన ఆడపడుచు పద్ధతిలో అందింది. కత్తిలాంటి వాడి, మెత్తనయిన హాస్యం కలగలిసి అది ఆమె చేత భావచిత్రాలు గీయించింది. ఆమె కథలన్నీ అనుకోకుండా అటువంటి చిత్రాలుగా పాఠకులకు అందాయి. మరొకరికి వీలుగాని శైలి, ఇస్మత్‌కు సొంతమయింది. ఆమెను ఇస్మత్‌ ఖానమ్‌ అంటాను నేను. అంటే, ఆమె ‘ఆడ చంగేజ్‌ఖాన్‌’!

ఇద్దరి మీదా కేసు నడుస్తున్న సమయంలోనే, ఇస్మత్‌, మంటోతో ఒక మాట అన్నది ‘మంటో సాహిబ్‌, క్షమాపణ చెప్పేస్తే పోతుందా? వచ్చిన పైసలతో హాయిగా షాపింగ్‌ చేయవచ్చు’ అన్నది. మంటో మాత్రం కళ్లు పెద్దవిగా తెరిచి, ‘చెత్త’ అన్నాడట! మంటో ఒప్పుకోడుగాక ఒప్పుకోడు. ‘నీవు ఒక్కర్తివి క్షమాపణ చెప్పవచ్చుకదా?’ అన్నారు చుట్టూ ఉన్నవారు. ‘మీకు మంటో గురించి తెలియదు. నన్ను ఇక బతకనివ్వడు. అతని కోపం ముందు వీళ్లు వేసే శిక్షను భరించడం సులభమని పిస్తుంది’ అన్నది ఇస్మత్‌.

ఆశ్చర్యంగా చివరకు వీళ్లకు శిక్ష లేకుండానే కేసు ముగిసింది. జడ్జ్‌ ఇస్మత్‌ను తన ఛాంబర్‌లోకి పిలిపించి, గౌరవంగా మాట్లాడాడు. ‘నేను మీ కథలన్నీ చదివాను. వాటిలో ఎక్కడా బూతు లేదు. లిహాఫ్‌లో అసలే లేదు. మంటో కథలు మాత్రం కంగాళీగా ఉంటాయి’ అన్నాడు. ‘ఈ ప్రపంచమంతా కంగాళీయే కదా?’ అన్నది ఇస్మత్‌. ఆ పెంటనంతా  ఎత్తి వెదజ్లడం అవసరమా అని జడ్జ్‌ అడిగాడు. ఆ పనిచేస్తే, అది అందరికీ కనపడుతుంది. కనుక ఏదో చేయాలన్న భావం కలుగుతుంది అన్నది ఇస్మత్‌. జడ్జ్‌ నవ్వి ఊరుకున్నాడు. కేస్‌ గెలిచినందుకు ప్రత్యేకించి సంతోషపడింది లేదు అంటుంది ఇస్మత్‌. తనదయిన పద్ధతిలో, మళ్లీ లాహోర్‌కి రావడానికి అవకాశం ఉండదేమోనని బాధ కలిగింది అని మాత్రం అంటుంది.

 

(ఇస్మత్ చుగ్తాయి కథ తెలుగు తర్జుమా వచ్చే గురువారం)

మీ మాటలు

  1. “సమాజాన్ని ఇరుకున పెట్టిన ఇస్మత్ చుగ్తాయ్ ” – శీర్శిక పేరు అదిరింది .
    చుగ్తాయ్ గురించి ఎవరు చెప్పిన వింటాను , ఏం రాసినా చదువుతాను – అంతే !
    మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడికి దుష్ట చతుష్టయం ఆర్తనాదాలు కర్ణ పేయంగా ఉన్నట్టు చుగ్తాయ్ సమాజాన్ని ఇరుకున పెట్టిన ఏ కథ చదివినా నాకూ “కర్ణ పేయమే ”
    స్మైల్ గారు ఆమె “లిహాఫ్ ” కథను “కంబళి” పేరుతో ఆంద్ర ప్రభ వీక్లీ లో (20 ఏళ్ళ క్రితం ) అనువాదం చేసినప్పుడు – నా కళ్ళు బైర్లు కమ్మాయి . అది మొదలు చుగ్తాయ్ అంటే పడి చస్తా – గొరుసు

  2. Doctor Nalini says:

    పి. సత్యవతి గారు ఇస్మత్ చుగ్ తాయి కథలు అనువదించి నపుడు ఆమెని అభినందించకుండా ఉండలేక పోయాను . చుగ్తాయి కథలు చదువుతూ ఎవరైన మనల్ని గమనిస్తున్నరేమో అని జంకడం సహజం . ఒకప్పుడు మా కజిన్స్ చలంని అలా చదివే వారు. లిఫాఫా కథ చదివాక ఇస్మత్ అభిమానులు కాకుండా వుండటం అసాధ్యం. ఆమె గుండె దిటవుతనం మనల్ని ఆమె వెంట నడిపిస్తుంది . అలాంటి జీవితాల రహస్యాలని ఆమె విప్పుతుంటే అబ్బురంగా తెలుసుకోవాలనిపిస్తుంది . గోపాలం గారి పరిచయం చాల బాగుంది. ఆమె నిజం గానే సభ్య సమాజాన్ని ఇరుకున పెట్టింది.

  3. 2014 లో వచ్చిన డేడ్ ఇష్కియా కొంచెం లిహాఫ్ కధ ని పోలి ఉంటుందని ఒక వెబ్ సైట్ లో చదివినప్పుడు మొదటి సారి ఇస్మత్ పేరు విన్నాను. మంచి కధ…మీ పరిచయం మళ్ళీ ఆమెని ఆ కధని గుర్తు చేసింది

  4. Aranya Krishna says:

    గొప్ప పరిచయం. ఇస్మత్ చుగ్ తాయి గురించి వినటమే కానీ తెలియదు. ఈ పరిచయం ఆమె రచనలపట్ల ఆసక్తిని రేపింది. ధన్యవాదాలు.

  5. కమలా దాస్ గుర్తొచ్చింది. ఆవిడ ముస్లిం మతం పుచ్చుకొని సూరయ్య అనే పెరుపెట్టుకోవటం, తను బురఖా వేసుకోవటాన్ని సమర్ధిస్తూ రాసింది కూడా గుర్తొచ్చింది.

    – శశాంక

  6. కె.కె. రామయ్య says:

    ఇస్మత్ ఆపా కధలను తెలుగులోకి అద్భుతంగా అనువదించారు పి. సత్యవతి గారు. ఆ “ఇస్మత్ చుగ్తాయ్ కధలు” పుస్తకాన్ని నవోదయ బుక్ హౌస్, కాచిగూడ, హైదరాబాదు ( క్రింద ఇచ్చిన వారి వెబ్ సైట్ లింకు ) నుండి తెప్పించుకోవచ్చు.

    http://www.telugubooks.in/collections/stories/products/ismath-chugtaay-kathalu

  7. చుగ్తాయి అంటే పరమ ఇష్టం, ఆరాధన. ఈ వ్యాసం చదివాక ఆమె మీద గౌరవం, నాలో ధైర్యం పెరిగాయి.

  8. స్వాగతం గోపాలం గారు. చాలమంది ఇక్కడ ఎదురుచూస్తుంటారు. వారిలో నేను కూడ ఒకడిని. అఫ్సర్‌కి నెనర్లు.

Leave a Reply to Doctor Nalini Cancel reply

*