మేమూ మీరూ…ఇదే అసలు గొడవ!

 

-అల్లం కృష్ణ చైతన్య 

చిత్రం: అక్బర్

~

2014 సెప్టెంబర్. నిస్సహాయుడైన మనిషి, ప్రాణాలు అరచేతిల పెట్టుకుని ప్రాధేయ పడుతున్నడు. ఆకలికి కులం, మతం లేదు. ముందున్నది మనిషా, జంతువా అన్న సమాలోచన లేదు. మంచి, చెడు అన్న విచక్షణ లేదు. ముందున్నది ఆహారం మాత్రమే. వీడియో చూసిన దేశం అంతా దిగ్భ్రాంతికి గురైంది. పులిని చంపేయ్యాలన్నరు కొందరు. ఎక్కువ మంది అది క్రూర జంతువు, వేట దాని స్వభావం, దాని తప్పేమున్నది అన్నరు. చివరకు ప్రకృతి గెలిచింది. పులి నిర్దోషిగ నిలిచింది.

ఇక్కన్నే వాదం మొదలవుతది. మృగానికీ, మనిషికీ తేడా లేదా అని. మృగం-మనిషి అనీ, క్రూరత్వం మానవత్వం అనీ వాద ప్రతివాదాలు మొదలయినై. నిజమే. తేడా ఉన్నది. కానీ స్వభావం? వేట మనిషి స్వభావం. సహజ సిద్ధమైన ప్రాకృతిక లక్షణం. వేల సంవత్సరాలు మనిషి వేటాడిండు. జీవ రాశులన్నీ ఆహార చక్రంలో తమ తమ భాగాలని పంచుకున్నై. అది ప్రకృతి. అది స్వభావం. చరాచర భూప్రపంచం మీద మనిషి ప్రాథమిక మనుగడలో అంతర్భాగం వేట, మాంసాహారం.

అనాగరిక ప్రపంచం నుండి నాగరికతలు రూపు దిద్దుకోవడం మొదలయ్యింది. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, మనుగడ, సంఘటిత జీవనం లాంటి వాటికి కొత్త అవధులు, ప్రమాణాలు సృష్టించబడ్డాయి. గీతలు గీసుకోవడం మొదలయ్యింది. రోజు రోజుకూ మనం నుండి నువ్వు-నేనులు పుడుతూనే ఉన్నై. నేను గొప్ప నుండి, నాది గొప్ప అనే పరిణామం నువ్వు, నీ పుట్టుక, అసలు నీ అస్తిత్వమే తక్కువ అనే స్థాయిని దాటినంక బలమైన సంఘాలు బలాన్ని కాపాడుకోవడం కోసం బల ప్రదర్శన చేస్తనే ఉన్నై. ఎన్నుకునే అంశాల పేర్లు వేరు కావచ్చు జరిగేది మాత్రం బల ప్రదర్శనే. నేను-నువ్వుల నుండి మేము మీరులు ఏర్పడ్డంక నా వాదన మా వాదనయ్యింది. ఆల్ఫాలు, బీటాలు అదే భావజాల వ్యాప్తిని కొనసాగించిన్లు. కొన్ని తరాల తరవాత పూర్తి స్థాయి మేము, మీరుల సమాజాలు తయారయినై. దేవుడు పుట్టిండు. కులాలు పుట్టినై. మతాలూ పుట్టినై. అలవాట్లూ, నాగరికతలకు అనుగుణంగా సంఘటిత జీవనం అనేకానేక రకాలుగా వేరు పడుతూనే ఉన్నది.

జంతు హింసని వ్యతిరేకించడం మంచి విషయం. అసలు హింసనే వ్యతిరేకించడం ఇంకా గొప్ప విషయం. సమస్త జీవజాలాన్ని(తోటి మనుషులతో సహా) ప్రేమించమని చెప్పడం మంచితనం, మహానీయత్వం, మానవత్వం. ఇవి ఉన్నవాళ్ళు సంఘంతో కలిసి పని చేస్తరు. నచ్చని విషయాన్ని పెటాలు, యానిమల్ షెల్టర్లు పెట్టి ప్రేమని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందింప చేస్తరు. అయినా, సహజ సిద్ధమైన స్వభావాన్ని వదులుకోలేని వాళ్ళు అలవాట్లు మార్చుకోరు. ఒకరి ఆహారం వాళ్ళ ఇష్టం. తినని వాళ్ళు, తినే వాళ్ళు ఇద్దరూ చెడ్డ వాళ్ళు కాదు. కానీ ఇక్కడ సమస్య అది కానే కాదు. నేను మాత్రం కోళ్ళనీ, చేపలనీ, మేకలనీ తింటా, నువ్వు ఆవుల్ని తినద్దు. నేను కరెక్టు, నువ్వు తప్పు. నేను తినను కాబట్టి నువ్వు తింటే నరుకుతా. ఇందులో ప్రేమ, సౌభ్రాతృత్వం, మానవత్వం ఎక్కడ ఉంది? సరే ప్రేమతో అన్నావనుకుందాం, అని ఊరుకోవడం లేదే. వ్యతిరేకించిన కుత్తుకల తెగ్గోసి కారుతున్న రక్తాన్ని మీద పోసి చూడు నీకు ఇదే శాస్తి పడుతుందన్న వాడి మాటల్లో ప్రేమ ఎక్కడుంది? మానవత్వం ఎక్కడుంది? ధర్మం ప్రసక్తి ఎక్కడ వచ్చింది? సమస్య ఆహారం కాదు. మేము మీరుల మధ్య. సరిగ్గా ఇప్పుడే మళ్ళీ అదే ప్రశ్న. ఈ సారి వేరే మనుషుల మీద. మృగానికి, మనిషికి తేడా లేదా?

*

మీ మాటలు

  1. baagundi.. Baaga chepparu.

  2. చందు - తులసి says:

    మనిషి ఇంకా మృగలక్షణాలని వదులుకోదు… బయటకు ఎన్ని ముచ్చట్లు చెప్పినా…అవకాశం ఉన్న చోట మృగంలా మారతాడు. ముఖ్యంగా బలహీనుల దగ్గర..

Leave a Reply to చందు - తులసి Cancel reply

*