పెనుచీకటి నిమిషంలో వెలుగు రవ్వ ఆలూరి బైరాగి!

 

‘చాయ’ సాంస్కృతిక సంస్థ ఆరవ సమావేశం ఆదివారం నవంబెర్ 1న హైదరాబాద్ ప్రెస్ క్లబ్, సోమాజిగూడ లో “కవి బైరాగి” రచనల మీద జరిగింది. అంబటి సురేంద్ర రాజు, తెలిదేవర భానుమూర్తి, ఆదిత్య కొర్రపాటి, అనంతు చింతలపల్లి “కవి బైరాగి” గురించి ఎన్నో కొత్త కోణాలు ముందుకు తెచ్చారు . ఈ ముచ్చట్లన్ని youtube  లో “Chaaya Conducts Chikati Thovalo Prasnala Jadi” link  లో మీరు చూస్తూ వినవచ్చు. సభకి వచ్చిన వారందరికి వందకు పైగా బైరాగి సంపూర్ణ రచనలు కానుకగా ఇవ్వడం జరిగింది. గత మూడు దశాబ్దాలలో బైరాగి మీద హైదరాబాద్ లో సభాముఖంగా చర్చించలేదన్నది మిత్రుల మాట. ఈ కార్యక్రమం కోసం బి. యల్. నారాయణ తెనాలి నుంచి రాసిన ప్రత్యేక వ్యాసం మీకందిస్తున్నాం.

 

BLఆలూరి బైరాగి .. ద్వితీయ సహస్రాబ్ది మహాకవి. ప్రపంచానుభుతితో తన స్వీయానుభూతిని మేళవించి ఆధునిక తెలుగు కవిత్వంలో తనదైన ముద్ర వేసుకున్నాడు. జీవుని వేదనకు స్వరమిచ్చిన కవి ఆయన. జీవించింది తక్కువ కాలమే.. ఆ సమయంలోనే త్రికాల మానవ వేదనను కవితార్చన చేసాడు. జీవతంలో రాజీపడకుండా ‘బైరాగి’ జీవితాన్ని గడిపి, ఈ ప్రపంచంతో కూడా పేచీపడ్డట్టుగా అనిపించిన బైరాగి, కవిగా పూర్నాయుష్కుడనని నిరూపించుకున్నారు. నిరాశావాదిగా, సంశయాత్మక కవిగా ఆయనను విమర్శించేవారున్నా, ‘ఆగబోదు తుపాను’ అని గర్జించిన బైరాగి నిరాశావాది ఎలా అవుతారని ప్రశ్నించేవారూ లేకపోలేదు.

తెనాలిలోని అయితానగర్ లో 1925 సెప్టెంబర్ 5న జన్మించిన ఆలూరి బైరాగి చౌదరి, అమ్మ ఒడిలోంచి చదువుల బడిలోకి అడుగిడినా అనుదిన విద్యావ్యాసంగం ఆయనకు రుచించలేదు. తండ్రి వెంకట్రాయుడు జాతీయాభిమానంతో బైరగికి హిందీ అక్షరాభ్యాసం చేయించారు. గాంధేయవాది యలిమించిలి వెంకటప్పయ్య తెనాలిలో 1935లొ ప్రారంభించిన హిందీ పాఠశాలలో మధ్యమ చదివాడు. అప్పటికి బైరాగికి పదేళ్ళు. మరో గురువు   ప్రజనందన శర్మ వద్ద రాష్ట్రభాష, విశారద పూర్తి చేశాడు. అప్పటికే పుస్తకాలంటే ఆశక్తి కలిగిన బైరాగి, కనిపించిన పుస్తకన్నల్లా చదువుతూ జ్ఞాన తృష్ణను తీర్చుకునేవాడు. 13వ ఏట హిందీ లో ఉన్నతవిద్య కోసమని బీహార్ లోని  ముజాఫర్ ఫూర్ కు వెళ్లి నాలుగేళ్ళు హిందీ, సంస్కృతం నేర్చుకున్నాడు. అక్కడే తన 15వ ఏట తొలిసారిగా హిందీ కవిత రాసి, కవి సమ్మేళనంలో పాల్గొని ప్రశంసలు పొందాడు. 1941 లో స్వస్థలం తిరిగొచ్చాడు. తల్లి సరస్వతి మరణం ఆయనను కుంగదీసింది. క్విట్ ఇండియా ఉద్యమానికి ఆకర్షితుడై రహస్యంగా కరపత్రాలను పంచాడు. ఎం ఎన్ రాయ్ ప్రారంభిన రాడికల్ డెమోక్రాటిక్ పార్టీ నాయకులతో పరిచయాలేర్పడి, బైరాగి జీవతంలో ముఖ్యమైన మలుపుకు దారితీసింది. మార్కిస్టు తత్వశాస్త్రం, ఎం ఎన్ రాయ్ సిద్ధాంతాలు బైరాగిని ఒక విలక్షణమైన దార్శ కునిగా, విశ్వ మానవ ద్రుష్టి పథగామిగా తీర్చి దిద్దాయి.

ఇరవై ఏళ్లకే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, సంస్కృతం, బెంగాలీ భాషల్లో పాండిత్యాన్ని సంపాదించిన బైరాగి, 1946 లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని హై స్కూల్ ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితం ఆరంభించాడు. అక్కడనుంచి తన తెలుగు కవితా సంకలనం ‘చీకటి నీడలు’ వెలువరించాడు. సినీనిర్మాత, తన పినతండ్రి చక్రపాణి కోరిక ప్రకారం మద్రాసుకు మకాం మార్చాడు. హిందీ ‘చందమామ’ సంపాదకుడిగా మరో మజిలీని ప్రారంభించిన బైరాగి, కమ్మని నీతి కథలను గేయరూపంలో అందిస్తూనే, హిందీ కవితా సంకలనం ‘పలాయన్’ తెచ్చారు. పిల్లల కోసం అయన రాసిన నీతి కథలు బాలసాహిత్యంలో వాటికవే సాటి అంటారు. తెలుగులో రాయని వైయుక్తిక ప్రేమ కవిత్వాన్ని అయన హిందీ లో అద్భుతమైన సౌందర్య ద్రుష్టిలో వెలువరించారు. స్వేచ్చాప్రియుడైన బైరాగి, చందమామ పత్రిక నుంచి కొద్దికాలానికే బయటకొచ్చేసాడు. తన కవితా ప్రస్థానంలో ముఖ్యమైన ‘నూతిలో గొంతుకలు’ తో మానవ సహజవేదనకు గాఢమైన అభివ్యక్తిని ఇచ్చారు. ‘దివ్యభవనం’ కథ సంపుటిని తీసుకొచ్చాడు. మహాజలపాతం వంటి పద గుంభనం, అనన్యమైన భావోద్వేగం, అనితర సాధ్యమైన ధారాశుద్ధి కలిగిన బైరాగి ఎప్పుడూ సమూహంలో ఒంటరిగానే ఉండేవాడు. అతడి కవితల్లోని నిరాశను చూసి విరాగి అనేవారు. అయినా బైరాగి జీవతంలో తలమునకలు కాలేదు. ప్రవాహంలో పడికొట్టుకుపోలేదు. వీక్షణంతో పరికించి జీవితాన్ని వివిధ కోణాల్లో చూశాడు.  ఎక్స్-రే కళ్ళతో చీకటిని చీల్చి వెలుగు చూశాడు. తనకంటూ ప్రత్యేకంగా నిర్మించుకున్న సాహితీ జగత్తులో నివసించిన బైరాగి, సమాజంలోని పీడిత, తాడిత ప్రజల బాధామయ జీవిత గాధలను తన కవిత్వపు ప్రతి పంక్తిలోను జీవింప జేశాడు.

బైరాగికి 14వ ఏడూ వచ్చేసరికి స్వాతంత్ర్య సమరం ముమ్మరంగా సాగుతోంది. రెండో ప్రపంచయుద్ధం ఆరంభమైంది. విపరీతంగా జననష్టం జరుగోతోంది. అందుకు స్పందించిన బైరాగిలోని కవి హృదయం, ఈ హత్యలకై జవాబు ఏ ద్రోహుల నడగాలో/ ఈ రుధిరం చేసిన మరకలు ఏ రుధిరం కడగాలో‘ అంటూ పలికింది. ఇదే దశలో తెలుగునాట కవితా ధోరణుల్లో మార్పు వచ్చింది. భావ విప్లవ జ్వాలలకు ప్రభావితుడైన కవుల్లో బైరాగి కూడా ఒకరు. సమాజాన్ని మార్చటమెలాగని ఆరాటపడ్డ బైరాగి, ‘శబ్దం లేదు గాలి లేదు / చీకటికి జాలి లేదు / చూపులేని రూపులేని / రేపులేని మాపులేని / ఈ పెనుచీకటి నిముసం/బ్రతుకుల నల్లని కుబుసం‘ అని నిస్పృహ వెలిబుచ్చారు.

మరో చోట ప్రగల్భ నిరీక్షణతో నిండిన పండిన ఈ నిశ్శబ్దంలో / వేచివున్నవాడే ప్రతి ఒక్కడు / మార్పుకొరకు తీర్పుకోరకు/ఓర్పుగలిగి/ చరమ ఘంటారావం కొరకు / తప్పిపోయిన భావం కొరకు‘ అంటూ ఆశావాదం ప్రకటించాడు. ‘వినతి’ అనే కవితలో ‘ప్రతి అక్షరమొక భటుడు / ప్రతి పదమూ ఒక శకటూ/ ప్రతి ఊహ ఒక వ్యూహం / జీవన శకాంతక సంకుల సమరంలో కవితను, ఏమనుకున్నావు? అని కవి గమ్యాన్ని నిర్దేశించాడు. బైరాగి రాసిన ప్రతి వాక్యంలో పాతమీద తిరుగుబాటు, కొత్త కోసం ఆరాటం కనిపిస్తాయి. సంఘంలోని ఏ ఒక్క అనాచరమూ, అనర్థమూ అయన ద్రుష్టిని తప్పుకోలేదు. అవినీతి, అక్రమాలతో నిండిన ఈ జీవితపు చీకటి నుంచి ఆకాశపు వెలుతురులోకి చొచ్చుకుపోయే విహంగ స్వేచ్చ బైరాగి జీవితం, కవిత్వమంతటా ప్రసరించింది. అయన కవిత్వాన్ని అందంగా రాయలనుకోలేదు. ఆవేశం తో రాసాడు .

హైదరాబాద్ లో జరిగిన ఈ సభ బైరాగి పునః సమీక్షకి కొత్త ఆగమ గీతి.

హైదరాబాద్ లో జరిగిన ఈ సభ బైరాగి పునః సమీక్షకి కొత్త ఆగమ గీతి.

రాజకీయ ప్రత్యర్థులను వేలాదిగా జైళ్ళలోకి పంపిస్తున్న 1965లొ వీరులు నీలఖంటులు మృత్యుంజయులు /వేదనల విషం త్రాగి జనతకు /మహితకు / సమతామృతం పంచుతారు / మృత్యువు వారికీ వంగి చేస్తుంది జోహారు/ వగపు వలదు ‘ అంటూ ఆశారేఖలు చిందిచాడు. వర్తమాన సమాజంలో ఆశించిన ఫలితాలు మృగ్యమైనపుడు ఉన్న సమాజాన్ని మార్చాలని ఆరాట పడటం సహజమే. అలాగని, బైరాగి పడక కుర్చీలో పడుకుని కలల్లోకి పలాయనం చేయలేదు. చీకటి, తుపాను, విధ్వంసం, నెత్తురు బైరాగి కవిత్వమంతటా అలుముకున్నాయి. వినాశ సుందరరుపం వీక్షించిన వాడెవడూ వికాస జడస్తూపం రక్షింప బూనడెవడూ, జగుప్స మన ఆదర్శం, ప్రేయసి మన విద్వంసం’ అంటాడు. సమాజంలోని లోటుపాట్లను, సామాన్యుల జీవితాల్లోని ఒడిదుడుకులను, పీడితుల పాట్లను చూసి హృదయం ద్రవించి, ఆ వేదననే కవిత్వంగా హృదయానికి హత్తుకునేలా చెప్పారాయన. ‘కిర్తికనక సౌధపు తలవాకిట పడిగాపులు’ అయన ఎన్నడూ కాయలేదు. మేధకు, క్రియకు మధ్య, ఆశయానికి సంశయానికి మధ్య, సాధనకు, సాధ్యానికి మధ్య పడిన నీడలు తుడిచేందుకు నడుం బిగించి నడిచాడు.

వేదన నుంచి సంశయానికి, సంశయం నుంచి హేతుబద్దతతో బతుకు బాటలోకి పయనం సాగించాడు. నిస్సహాయ మానవ జీవితాలను అవలోకిస్తూ, ఆకలి! తన శిశువులనే చంపే తల్లుల ఆకలి / పూటకూటికై శీలం అమ్మే కన్యల ఆకలి‘  అంటూ ఆకలి కేకల అర్థం చెప్పాడు. దిక్కు లేక వ్యభిచార వృత్తిలోకి దిగిన వారిని, అణాపూలు/కానీ తాంబూలం / నలిగిన చీరలు / చీకటి ముసుగులు / ఇదా నీకు జివతమిచ్చిన బహుమానం’ అని జాలిచూపుతూ, ప్రపంచపు ఫార్సు పైన నీ బతుకు వ్యంగ్య చిత్రం’ అంటాడు.

అనిల్ అందరికీ కానుక చేసిన బైరాగి పుస్తకాలు

అనిల్ అందరికీ కానుక చేసిన బైరాగి పుస్తకాలు

పీడిత జనావళికి ప్రతినిధిగా బైరాగి వెలువరించిన గ్రంథాలు తక్కువే అయినా అవే ఆయనను తెలుగు, హిందీ సాహిత్యంలో ధ్రువతారగ నిలిపాయి. అయన రాసిన ‘ఆగమగీతి’ కావ్యానికి రాష్ట్ర సాహిత్య అకాడమి, కేంద్ర సాహిత్య అకాడమి అవార్డులు లభించాయి. ‘చీకటి నీడలు’, ‘నూతిలో గొంతుకలు’ తెలుగు కవితా సంకలనాలు, ‘పలాయన్’ హిందీ  కవితా సంకలనం, ‘దివ్యభవనం’, ‘త్రిశంకు స్వర్గం’ తెలుగు కథా సంకలనాలు. తెలుగులో ఆధునిక కవితా, ప్రముఖ ఆధునిక తెలుగు కవితల హిందీ కావ్యానువాదం, ఇంకా అనేక కవితలు పలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ‘వినతి’, ‘రంగులతోట’, ‘పగిలిన అద్దం’, ‘నైశ్యగీతి’, ‘పుడమికి కన్నెరికం’, ‘కెందామర’, ‘మూడు సంకేతాలు’, ‘అరచిత కవితా’ వంటి కవితలు అయన భావుకతను, కల్పనాశక్తికి ప్రతీకలు. ‘నాక్కొంచం నమ్మకమివ్వు’ కవిత ఆయనకు బాగా పేరు తెచ్చి పెట్టింది. ఈ కవితను శ్రీ శ్రీ ఇంగ్లిష్ లోకి అనువందించారు. ‘ముఝె కించిత్ విశ్వస్ దేవ్’ శిర్షికతో దీనిని నిఖిలేశ్వర్ 1962 లోనే హిందీలోకి అనువందించగ, స్వయంగా బైరాగి, ఆ తర్వాత యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ కూడా ఈ కవితను హిందీ లోకి అనువందించారు.

తన రచనలతో సాహితీ సమాజంలో ఎంతగా ఎదిగినా బైరాగి జీవితాన్ని చాలా నిరాడంబరంగా గడిపారు. పరిస్తితులను బట్టి అవసరాలను తగ్గించుకొన్నాడు. కవిత్వం, కథలు, వ్యాసాలతో వచ్చే అదాయంతోనే కాలక్షేపం చేశాడు. అతడికి ముగ్గురు సోదరులు ఎదిగివచ్చి, బైరాగి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్దపడినా, ఎందుచేతనో ఒంటగారిగానే జీవించాడు. ఆరోగ్యం క్రమంగా క్షిణించిన ఆహార నియమాలు పాటించలేదు. 1978 సెప్టెంబర్ 9న కన్నుమూశారు.

 *

 

 

 

మీ మాటలు

  1. చాలా బావుంది. “అణా పూసలు..కానీ తాంబూలమ్” అన్నచోట ‘కాణీ’ అని వుండాలనుకుంట. గమనించగలరు.

    • B.L.Narayana, Journalist, Tenali says:

      థాంక్స్ సర్, యూనికోడ్ టైపింగ్ నేను నేర్చుకోలేదు…పిడిఎఫ్ లో పంపిన స్టొరీ…ఎందుకు మారిందో తెలియదు…మీరు చెప్పింది కరెక్ట్.. థాంక్స్ సర్.

  2. చందు - తులసి says:

    నారాయణ గారూ..విలువైన సమాచారం. మీరు రాసిన తీరూ బాగుంది..
    బైరాగి లాంటి వారి గురించి..నేటి తరానికి తెలియజేయాలన్న అనిల్ బత్తుల ప్రయత్నం అభినందనలు..

    • B.L.Narayana, Sr journalist, Tenali says:

      థాంక్స్ …సారంగ కు రాసిన తోలి స్టొరీ ..ప్రచురించిన సంపాదక వర్గానికి, మీకు థాంక్స్

  3. Akbar pasha says:

    Narayanjee .. Sarangakuu ekkesaavaa! Ika ee pathakulakuu storeele storeelu kadaa! Emito.. Tenali neetilone undemo? Antha baagaa raayinche mahima! Ee vyasamlo akshara doshaalu ekkuvocchayi. Emayinaa congrates. All the success!

Leave a Reply to B.L.Narayana, Sr journalist, Tenali Cancel reply

*