అశోక్ : తెలంగాణా కవిత్వంలో కొత్త గొంతుక

-నారాయణ స్వామి వెంకట యోగి 

~

swamy1

అదో అందమైన అబద్దాల ఆదివారం సాయంత్రం. అంతర్జాలంలో ఆంధ్రజ్యోతి వివిధ చూద్దామని తెరిచా.
(ఓ పది రోజుల కింద సౌత్ కెరోలైనా లో చార్లెస్టన్ లో ఒక చర్చ్ లో 9 మంది నల్లజాతి వాళ్ళని ఒక తెల్ల జాతీయుడు నిష్కారణంగా (వాడి కారణమొక్కటే – నల్ల జాతి వారి పట్ల కరడు గట్టిన ద్వేషం) , నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేసిండు.)
 ‘ఓ ప్రభువా హంతకుడిని క్షమించు’ అనే పద్యం కనబడింది. యెవరో అశోక్ కుంబం రాచెస్టర్ మినెసోటా అని ఉంది.
ఓ ప్రభువా
హంతకుడిని  క్షమించు
వాడు అగ్నాని
అహంకారి
మనిషి రంగు తప్ప
మనిషి తనం యెరుగనోడు
జెండాల మీద ప్రేమే తప్ప
జనంతో కలిసి బ్రతుకనోడు
వాడు నీ బిడ్డడే
కాకపోతే మానవవేటకు మరిగినోడు
మనుషుల కాల్చి కుప్పేయడం నేర్చినోడు
వాడిని దయతో దీవించి
కరుణతో లాలించు
ఓ ప్రభువా
మేము హంతకున్ని క్షమిస్తున్నాము
ప్రపంచాన్ని మా చేతులచుట్టూ తిప్పే
మా పిల్లల పోగొట్టుకున్నాము
అలసటొచ్చినప్పుడో ఆపదొచ్చినప్పుడో
తలనిమిరి ధైర్యమిచ్చే
అమ్మా నాన్నల పోగొట్టుకున్నాము
గత వర్తమానాల  కష్టసుఖాల తలపోస్తూ
అభద్రమైన భవిష్యత్తుపై సహితం ఆశలు రేపే
తాత అవ్వల పోగొట్టుకున్నాము
తరతరాల వంతెనలన్నీ ధ్వంసమైపోయి
పారుతున్న నెత్తురు
పొంగుతున్న దుఃఖం
కారుతున్న కన్నీళ్ళు
గడ్దకట్టుకుపోయాక
ఇక చివరకు మిగిలింది
హంతకుడిని క్షమించుడే కదా!
విలువ లేని బతుకులు
ఎప్పుడు పోతవో తెలియని ప్రాణాలు
మృత్యు  రూపాన్ని కనిపెట్టలేని జీవితాలు
ఇవేవీ ముఖ్యం కావు
మేము మనుషులమా కాదా అని అంచనా వేయడానికి
ఇప్పుడు పరీక్షకు నిలిచింది మా మా మానవత్వ నిరూపణే
వాడు శిక్షించాలి
మేము క్షమించాలి
అదే కదా ధర్మం ప్రభూ!
పద్యం మొత్తం ఒక్క సారే ఊపిరి తీసుకోకుండా చదివా . ఒక ప్రార్థనలా బిగ్గరగా చదివా . ఒక కెరటం ఛెళ్ళున చరిచింది ముఖాన్ని. చివరి మూడు వాక్యాలు కుదిపేసాయి. అవును, మళ్లా ఒక నాలుగు నెలల తర్వాత చదివినా  ఈ వాక్యాలంతే కుదిపేస్తున్నాయి. మరింతగా చరుస్తున్నాయి ముఖమ్మీద.
మొత్తం పద్య నిర్మాణం చూస్తే ఈ పద్యంలో అశోక్,  క్రైస్తవ ప్రార్థనా పద్దతి ఉపయోగించినట్టు తెలుస్తూనే ఉంది. అయితే జాలీ కరుణలతో పద్యాన్ని నడిపి చివరికొచ్చేసరికల్లా ఒక రకమైన వ్యంగ్యంతో కూడిన చిరు కోపాన్ని అదీ అశక్తతలోంచీ, మరీ ఎక్కువ అసహనపు కోపమనిపించని సహనత్వంలోంచీ తమకు బోధించబడిన ‘ధర్మాన్ని’  గుర్తు చేస్తూ పలికాడా వాక్యాలను. మా మానవత్వాన్ని నిరూపించుకోవాలంటే వాడెన్ని సార్లు శిక్షించినా మేము క్షమించాల్సిందే కదా ప్రభువా అని అడుగుతున్నాడు చంపబడ్డ ఆ నల్ల జాతీయుల్లోకి పరకాయ ప్రవేశం చేసి. పిల్లలనీ, అమ్మానాన్నలనీ పోగొట్టుకున్నామని చెప్తూ  ‘తరతరాల వంతెనలు ధ్వంసమై’ అన్న వాక్యంతో ఆ మొనొటొనాసిటీ కి కళ్ళెం వేసి యెందుకు హంతకులను క్షమించడం మాత్రమే మిగిలిందో చెప్తాడు. అక్కడ పద్యాన్ని ఒక అద్భుతమైన మలుపు తిప్పాడు. అగ్నానీ అహంకారీ అయిన హంతకుడిని క్షమించడం తప్ప యేమీ మిగలనోళ్ళం అని పాపులను క్షమించమనే నీతిని అభాసు చేసాడు. నల్ల జాతీయులు  మనుషులుగా గుర్తింపబడాలంటే వారికి  న్యాయం జరగడం కన్నా వారు  క్షమించడమే ముఖ్యం చేస్తున్న జాత్యహంకార వ్యవస్థ మీద పదునైన కత్తుల్లాంటి కవితా వాక్యాలను దూసాడు అశోక్. మొత్తం పద్యం సూటిగా ఉన్నట్టనిపించినా అంతా సులభంగా అర్థమయినట్టనిపించినా మళ్లా మళ్లా చదువుతున్న కొద్దీ కొత్త అర్థాలు పరిస్థితి పట్ల కొత్త క్రోధాల్నీ కలుగజేస్తుందీ పద్యం. మొత్తం పద్యం చాలా సూటిగా ఉత్ప్రేక్షలూ, ఉపమానాలూ లేకుండా సాగుతుంది.  కానీ జాగ్రత్తగా చూస్తే మొత్తం పద్యమే ఒక ఉత్ప్రేక్ష. ఈ సమాజంలో మేము మనుషులుగా గుర్తింపబడాలి అంటే మాకు జరిగిన అన్యాయానికి న్యాయం అడగడం కాక, హంతకున్ని క్షమించడం తప్ప మరో మార్గం లేని నిస్సహాయతను చాలా బలంగా సూచించే ఉత్ప్రేక్ష (metaphor). అందుకే పద్యం బలంగా చదివిన కొద్దీ కొత్తగా ఉంటుంది.
పద్యం చదివాక అశోక్ తో మాట్లాడాలనిపించింది. మినెసోటా లోని రాచెస్టర్ లో ఒక వైద్య కళాశాల లో బయోయెథిక్స్ బోధించే ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు తను. తెలంగాణా లో నల్గొండ జిల్లా ఆజంపూర్ లో పేద రైతాంగ కుటుంబంలో పుట్టి హైదరాబాదు నిజాం కళాశాల లో తత్వశాస్త్రం, సామాజిక శాస్త్రం మానసిక శాస్త్రం లో బీయే చేసి, నెదర్లాండులో పోస్టు గ్రాడుయేషన్, కెనడా లో పీయెఎచ్ డీ, డాక్టొరల్ ఫెలోషిప్  చేసినంక యిప్పుడు మేయో క్లినిక్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా బోధిస్తున్నాడు. పలకరించగానే యెంతో ఆప్యాయంగా మాట్లాడి తన ఆసక్తుల గురించి వివరంగా చెప్పిండు. తన ఇతర పద్యాలను కూడా ఒక చోట చేర్చి పంపిండు.
అన్ని పద్యాలూ బాగున్నయి. పద్యాలు కావాలని రాసినట్టో, అందంగా రాయాలని ప్రయత్నించి రాసినట్టో కృతకంగా లేవు. అన్నింటి లోనూ ఒక సహజ త్వం ఉన్నది. అదే వాటి సౌందర్యం. అన్నీ సూటిగా డొంక తిరుగుడు లేకుండ ఉన్నయి.   అన్నీ సామాజిక సమస్యల పట్ల స్పందనలే. అశోక్ తాను అన్యాయమని అనుకున్న వాటికి, సమాజంలో అధికారపు ఆజమాయిషీ దుర్మార్గాల ఫలితాలనుకున్నవాటికీ  వెంటనే స్పందిస్తున్నాడు. క్రౌంచపక్షి మరణానికి వెంటనే స్పందించే వాల్మీకి లాగా. బాధా, దుఃఖమూ వేదనా పరిస్థితుల పట్ల ఆగ్రహ ప్రకటనా, పరిస్థితులు మారాలనే బలమైన ఆకాంక్ష వెంటనే పద్యాల రూపంలో బలంగా సూటిగా డొంకతిరుగుడు లేకుండా ప్రకటిస్తున్నాడు. నీళ్ళు నమలడం లేని, యెక్కువ ఉపమానాలూ ఉత్ప్రేక్షలూ లేని కవితా పద్దతినెంచుకున్నాడు. భాషనూ, వాక్యాలనూ తన ఉద్వేగంతో నింపి కవితా వాక్యాలు చేసి సంధిస్తున్నాడు. పద్య నిర్మాణం లోనూ చెప్పే పద్దతిలోనూ ఉద్వేగాన్ని నింపి తను చెప్పదల్చుకున్న దానిని బలంగా చెప్తున్నాడు. గుర్తుంచుకునేటట్టు చెప్తున్నాడు.
తెలంగాణ ప్రభుత్వం చీప్ లిక్కర్ తీసుకురావాలనుకున్నప్పుడు, ‘బంగారు తెలంగాణ బలికోరుతున్నది/  బలవంతమేమీలేదు/  బారులు తీరండి’ అని అంటాడు. ‘బలవంతమేమీ లేదు’  అని పాదం విరిచి ‘బారులు తీరండి’ అనడంలో ప్రతిభ చూపిస్తాడు. అంతకు ముందే “పుష్కరాలను మించిన పుణ్యకార్యమిది/  ప్రతి పూట మరువకుండ/  మత్తుల,  మందుల / మునిగి తేలండి’ అని వ్యంగ్యం ప్రకటిస్తాడు. అట్లే నల్లజాతీయుల అభద్రత గురించి కూడా ‘మై డియర్ బ్లాక్ అమెరికా’  అని ఒక పద్యం. ‘చేతులెప్పుడూ గాలిలోనె ఉంచు / జీసస్ శిలువ మీద ఉన్నట్టు / అల్లాని వేడుకున్నట్టు/ .. నల్లని నీ రూపం సహితం వాడికి మారణాయుధంగానే కనబడుతుంది / అందుకే నీ చావుకి నువ్వా కారణమని ముందే ప్రకటించు … వాడి నిఘంటువు లో నువ్వొక తప్పిదానివి దారి తప్పిన జీవితానివి పొంచిఉన్న ప్రమాదానివి …’ అంటూ రాస్తాడు.
తెలంగాణ రాష్ట్రం యేర్పడి తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో చురుగ్గా పాల్గొని తర్వాత మావోయిస్టులలో చేరి బూటకపు ఎంకౌంటర్ లో కాల్చి చంపబడిన నిండా ఇరవై నిండని వివేక్ కోసం రాసిన పద్యంలో
 ‘నువ్వెవరో నాకు తెలిసింది/
నీ అమరత్వం బ్రేకింక్ న్యూస్ అయినప్పుడే కదా/ అయినా నువ్వొక గ్నాపకమై నన్ను యెందుకు వెంటాడుతున్నవు? /…నువ్వు నడిచిన దారి పొడువున / నీ పాదముద్రలు వెతికే పనికై/ నా మనసు యెందుకు వెంపర్లాడుతున్నది?/ భద్ర జీవితపు సరిహద్దులు చెరిపి/ యాంత్రిక జీవనాన్ని/మాంత్రిక కాలాన్ని / శాసిస్తున్న నీ త్యాగం/ ఒక మరణాన్ని కాదు / ఒక సమన్యాయ విలువను గుర్తు చేస్తుంది ..అని అంటాడు ఉద్వేగంగా. యాంత్రిక జీవనమూ మాంత్రిక కాలమూ – అశోక్ వాడిన ఈ పదచిత్రాలు సమకాలీన సమాజమూ, కాలమూ, జీవితాన్నీ అద్భుతంగా చిత్రిక పడుతున్నయి.
రైతుల ఆత్మహత్యలగురించి రాస్తూ ‘ఇక ఈ తంతు నాపి నాకు స్వేచ్ఛనివ్వండి / సాలు మీద సాలు దున్నే / ఆ బక్క రైతు / బుడ్డగోసినై రుణం తీర్చుకుంట’  అని తన సంఘీభావాన్ని ప్ర కటి స్తడు.
అశోక్ బలమైన కవి. గొప్ప ఉద్వేగం ఉన్న కవి. సమాజం పట్ల దోపిడీ పీడన, అణచివేతలకు కు గురవుతున్నవారి పట్ల సంఘీభావం ఉన్న కవి. ఉన్న పరిస్థ్తి మారాలనీ కోరుకునే కవి. అది యెట్లా మారుతుందో కూడా స్పృహ ఉండి తెలిసిన కవి. అశోక్ ఇంకా రాయాలి. ఇంకా బలంగా రాయాలి. పద్యాన్ని ఒక శిల్పంలా చెక్కడం పట్ల శ్రద్ద పెట్టి యింకా రాయాలి. ఆవసర వాక్యాలూ, పదాలూ పద్యంలో ఉండకూడదన్న స్పృహ ఉన్న అశోక్ అవి లేకుండా ఇంకా శ్రద్ద పెట్టాలి. వాక్య నిర్మాణమూ, పద్య పాదాలని విరవడమూ, పదాల యెంపికా , సూటిదనం అన్ని సార్లూ పని చేయని చోట ఉపమా నాలూ,  ఉత్ప్రేక్షలూ, allusions, సూచనలతో  పద్యాన్ని బలోపేతం చేయవచ్చు అని బాగా తెలిసిన అశోక్  ఆ పని మరింత చైతన్యయుతంగా చేస్తాడని ఆశ!  తనలో ఉన్న ఉద్వేగ తుఫానులకు సరైన పద్య రూపమిచ్చి మరింత విరివిగా రాయాలని కోర్కె.

*

మీ మాటలు

  1. అశోక్ సృష్టి మీ దృష్టి రెంటికీ వందనం …

  2. Narayanaswamy says:

    మొదటి పేరా లో ఇది మిస్ అయింది – దయచేసి సరి చూసుకుని చదవండి

    ————————————————————————

    అదో అందమైన అబద్దాల ఆదివారం సాయంత్రం. అంతర్జాలంలో ఆంధ్రజ్యోతి వివిధ చూద్దామని తెరిచా.
    (ఓ పది రోజుల కింద సౌత్ కెరోలైనా లో చార్లెస్టన్ లో ఒక చర్చ్ లో 9 మంది నల్లజాతి వాళ్ళని ఒక తెల్ల జాతీయుడు నిష్కారణంగా (వాడి కారణమొక్కటే – నల్ల జాతి వారి పట్ల కరడు గట్టిన ద్వేషం) , నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేసిండు.)
    ‘ఓ ప్రభువా హంతకుడిని క్షమించు’ అనే పద్యం కనబడింది. యెవరో అశోక్ కుంబం రాచెస్టర్ మినెసోటా అని ఉంది.
    ఓ ప్రభువా
    హంతకుడిని క్షమించు
    వాడు అగ్నాని
    అహంకారి
    మనిషి రంగు తప్ప
    మనిషి తనం యెరుగనోడు
    జెండాల మీద ప్రేమే తప్ప
    జనంతో కలిసి బ్రతుకనోడు
    వాడు నీ బిడ్డడే
    కాకపోతే మానవవేటకు మరిగినోడు
    మనుషుల కాల్చి కుప్పేయడం నేర్చినోడు
    వాడిని దయతో దీవించి
    కరుణతో లాలించు
    ఓ ప్రభువా
    మేము హంతకున్ని క్షమిస్తున్నాము
    ప్రపంచాన్ని మా చేతులచుట్టూ తిప్పే
    మా పిల్లల పోగొట్టుకున్నాము
    అలసటొచ్చినప్పుడో ఆపదొచ్చినప్పుడో
    తలనిమిరి ధైర్యమిచ్చే
    అమ్మా నాన్నల పోగొట్టుకున్నాము
    గత వర్తమానాల కష్టసుఖాల తలపోస్తూ
    అభద్రమైన భవిష్యత్తుపై సహితం ఆశలు రేపే
    తాత అవ్వల పోగొట్టుకున్నాము
    తరతరాల వంతెనలన్నీ ధ్వంసమైపోయి
    పారుతున్న నెత్తురు
    పొంగుతున్న దుఃఖం
    కారుతున్న కన్నీళ్ళు
    గడ్దకట్టుకుపోయాక
    ఇక చివరకు మిగిలింది
    హంతకుడిని క్షమించుడే కదా!

    విలువ లేని బతుకులు
    ఎప్పుడు పోతవో తెలియని ప్రాణాలు
    మృత్యు రూపాన్ని కనిపెట్టలేని జీవితాలు
    ఇవేవీ ముఖ్యం కావు
    మేము మనుషులమా కాదా అని అంచనా వేయడానికి
    ఇప్పుడు పరీక్షకు నిలిచింది మా మా మానవత్వ నిరూపణే
    వాడు శిక్షించాలి
    మేము క్షమించాలి
    అదే కదా ధర్మం ప్రభూ!
    పద్యం మొత్తం ఒక్క సారే ఊపిరి తీసుకోకుండా చదివా . ఒక ప్రార్థనలా బిగ్గరగా చదివా . ఒక కెరటం ఛెళ్ళున చరిచింది ముఖాన్ని. చివరి మూడు వాక్యాలు కుదిపేసాయి. అవును, మళ్లా ఒక నాలుగు నెలల తర్వాత చదివినా ఈ వాక్యాలంతే కుదిపేస్తున్నాయి. మరింతగా చరుస్తున్నాయి ముఖమ్మీద.
    మొత్తం పద్య నిర్మాణం చూస్తే ఈ పద్యంలో అశోక్, క్రైస్తవ ప్రార్థనా పద్దతి ఉపయోగించినట్టు తెలుస్తూనే ఉంది. అయితే జాలీ కరుణలతో పద్యాన్ని నడిపి చివరికొచ్చేసరికల్లా ఒక రకమైన వ్యంగ్యంతో కూడిన చిరు కోపాన్ని అదీ అశక్తతలోంచీ, మరీ ఎక్కువ అసహనపు కోపమనిపించని సహనత్వంలోంచీ తమకు బోధించబడిన ‘ధర్మాన్ని’ గుర్తు చేస్తూ పలికాడా వాక్యాలను. మా మానవత్వాన్ని నిరూపించుకోవాలంటే వాడెన్ని సార్లు శిక్షించినా మేము క్షమించాల్సిందే కదా ప్రభువా అని అడుగుతున్నాడు చంపబడ్డ ఆ నల్ల జాతీయుల్లోకి పరకాయ ప్రవేశం చేసి. పిల్లలనీ, అమ్మానాన్నలనీ పోగొట్టుకున్నామని చెప్తూ ‘తరతరాల వంతెనలు ధ్వంసమై’ అన్న వాక్యంతో ఆ మొనొటొనాసిటీ కి కళ్ళెం వేసి యెందుకు హంతకులను క్షమించడం మాత్రమే మిగిలిందో చెప్తాడు. అక్కడ పద్యాన్ని ఒక అద్భుతమైన మలుపు తిప్పాడు. అగ్నానీ అహంకారీ అయిన హంతకుడిని క్షమించడం తప్ప యేమీ మిగలనోళ్ళం అని పాపులను క్షమించమనే నీతిని అభాసు చేసాడు. నల్ల జాతీయులు మనుషులుగా గుర్తింపబడాలంటే వారికి న్యాయం జరగడం కన్నా వారు క్షమించడమే ముఖ్యం చేస్తున్న జాత్యహంకార వ్యవస్థ మీద పదునైన కత్తుల్లాంటి కవితా వాక్యాలను దూసాడు అశోక్. మొత్తం పద్యం సూటిగా ఉన్నట్టనిపించినా అంతా సులభంగా అర్థమయినట్టనిపించినా మళ్లా మళ్లా చదువుతున్న కొద్దీ కొత్త అర్థాలు పరిస్థితి పట్ల కొత్త క్రోధాల్నీ కలుగజేస్తుందీ పద్యం. మొత్తం పద్యం చాలా సూటిగా ఉత్ప్రేక్షలూ, ఉపమానాలూ లేకుండా సాగుతుంది. కానీ జాగ్రత్తగా చూస్తే మొత్తం పద్యమే ఒక ఉత్ప్రేక్ష. ఈ సమాజంలో మేము మనుషులుగా గుర్తింపబడాలి అంటే మాకు జరిగిన అన్యాయానికి న్యాయం అడగడం కాక, హంతకున్ని క్షమించడం తప్ప మరో మార్గం లేని నిస్సహాయతను చాలా బలంగా సూచించే ఉత్ప్రేక్ష (metaphor). అందుకే పద్యం బలంగా చదివిన కొద్దీ కొత్తగా ఉంటుంది.

  3. చందు - తులసి says:

    అశోక్ గారి కవిత…చాలా బాగుంది. చివరి వాక్యాలు చెర్నాకోల దెబ్బలా తగిలాయి. మీరు రాసిన తీరు బాగుంది స్వామి గారు.

    • V. Usha Rani says:

      అశోక్ గారి కవిత దాని గురించిన వెంకటస్వామి గారి విశదీకరణ చాల బావుంది.

  4. అవును, అశోక్ ది కొత్త గొంతుక, శక్తివంతమైన గొంతుక. తెలంగాణా పునర్నిర్మాణానికి ఇలాటి no holds barred అప్రోచ్ చాల అవసరం. అశోక్ ఇంకా ఎక్కువ కవిత్వం రాయాలని కోరుకుంటూ….

  5. Wilson Sudhakar says:

    Telangaana
    ani raasaaru. Deergham
    చూడలేకపోతున్నాం

  6. Ashok Kumbamu says:

    అందరికి కృతజ్ణతలు!

Leave a Reply to Wilson Sudhakar Cancel reply

*