మరణానికి ముందు “అంతర్జ్వలనం”

-వేలూరి వెంకటేశ్వర రావు
~
మిత్రుడు బ్రహ్మానందం  నన్ను ముందుమాట రాయమని అడగటం అతనికి నాపై ఉన్న అభిమానం తప్ప వేరే కారణం కాదని నేను ఘంటా పథంగా చెప్పగలను. కథలకు, కథాసంకలనాలకు, నవలికలకు, కవిత లకు ముందుమాటలు, వెనుకమాటలు, ఉపోద్ఘాతాలూ, వగైరా- కనీసం పరిచయ వాక్యాలయినా రాయగల సమర్థత నాకు లేదు. అయినా,  సాహసించి ఈ నవల గురించి నాలుగు మాటలు చెప్పదలచుకున్నాను.
ఇంతకు ముందు బ్రహ్మానందం రాసిన కథలు, వ్యాసాలు అన్నీ  చదివాను. అతనికి చక్కని కథావస్తువు ఎంపిక చేసుకోవటం తెలుసు. అంతేకాదు; చిక్కగా  కథ చెప్పటం కూడా తెలుసు. వాస్తవ జీవితంలో ఒకటో, రెండో సంఘటనలు  కథలకు పునాదులయితే, ఒక జీవితంలో ఒడిదుడుకులన్నీ స్పృశించిన రచన నవల అవుతుంది. సాంప్రదాయకంగా నవలలో చాలా పాత్రలు వస్తాయి. అయితే, అన్ని పాత్రలనీ సమానంగా పోషించడం అవసరమా కాదా అన్నది కథానేపథ్యం, భౌతిక పరిస్థితుల పై ఆధారపడుతుంది.
Gorti
అంతర్జ్వలన నేపథ్యం అమెరికా. పై చదువుల పేరుతో అమెరికాకి వలస కొచ్చి, ఇక్కడి జీవితంలోని ఒడిదుడుకులని తట్టుకొని, మరణానికి కూత వేటు దూరంలో ఉన్న ‘నందు’ తన జీవితకథ చెబుతున్నాడు. ఉత్తమ పురుషలో చెప్పిన కథ. బహుశా, ఇరవై సంవత్సరాల క్రితం అమెరికాకి  వలసకొచ్చిన వారి అనుభవాలు  కొన్ని ఈ నవలలో ప్రతిబింబిస్తాయి.  కాలపరిమితి పరంగా చూస్తే, ఈ నవల అమెరికా వలస జీవనవ్యవస్థకి  నిజమయిన  ప్రతిబింబం అని భావించకూడదు. కారణం; కథ జరిగిన కాలవ్యవధి చాలా పరిమితం కావటమేనని నా అభిప్రాయం.
నందు- మన కథానాయకుడు ఉపోద్ఘాతం ఇలా చెబుతాడు: ‘‘అందరినీ వదిలిపోతున్నానన్న బాధ; ఏదో సాధించాలన్న కోరిక, జీవితం వైపు ఎగ్నురుతున్న ఆశ, ఈ రెంటినీ విమానం అమెరికా చేర్చింది.’’ వలసకి పోతున్న ప్రతి ఒక్కరికీ ఇది సహజమైన అనుభవం. ఈ అనుభవానికి  కాలపరిమితి లేదు.
‘‘పూర్తి కాని నాస్వప్నం ఇలా అర్థంతరంగా ముగిసిపోతుందా?’’ అని చావు బ్రతుకుల మధ్య ఉన్న వాడి ఆవేదన ఈ నవలకి ఊపిరి. అయితే వెంటనే నైరాశ్యం వెన్నుతట్టి పలకరిస్తుంది.
‘‘ఏముంది? రేపు నేను పోతాను. ఇంట్లోవాళ్ళు కొంతకాలం ఏడుస్తారు. బంధువులు బాధపడతారు. స్నేహితులు పరామర్శిస్తారు. బ్రతికుండగా పైకి అనడానికి మనసొప్పకపోయినా, పోయిన తర్వాత నేనెంత మంచి వాణ్ణో అంటూ నా గుణగణాలని పెద్దవిచేసి పైకి గట్టిగా చెప్పుకుంటారు. నేనంటే గిట్టనివాళ్ళు దేముడు నాకు మంచి శాస్తి చేశాడని లోలోపల అనుకుంటూ వారిని వారు సంతృప్తి పరుచుకుంటారు.’’
ఈ నవలలో భాష సులువుగా ఉంది. నవలని ఒక్కబిగిన చదవటానికి అనువుగా ఉన్నది. ప్రతి పాత్ర  కథనానికి అవసరమయినా, పాఠకుడు, వెనక్కి వెళ్ళి, ‘ఇతనెవరు? ఈవిడ ఎక్కడ తటస్థించింది?’ అని వెదుకు లాడే అవసరంలేదు.
‘‘…నా ధ్యేయం ఒక్కటే! ఎలాగయినా డబ్బు సంపాదించాలి. ఇక్కడే స్థిరపడిపోవాలి. ఇండియా చచ్చినా వెళ్ళను…’’ వలస వచ్చిన కొత్తల్లో కొంతమంది సంభాషణల్లో తరచు దొర్లే మాటలివి. కాస్త నిలదొక్కు కున్నాక- ‘‘…ఉద్యోగ్నం వచ్చాక పిసినారితనం ఎక్కువయ్యింది. ప్రతీ డాలరూ నాకు లెక్కే! ఇంట్లో ఫోన్‌ ఉన్నా తరచు ఫోన్‌ చేసేవాణ్ణి కాదు. చేసినా ముక్తసరిగా మూడంటే మూడు మాటలు…’’ వంటి ఆలోచనా ధోరణిలో వచ్చే మార్పులూ చాలామందిలో చూస్తూనే ఉంటాం.
ఇంకా- ‘‘…మంచిపిల్లలాగానే వుంది. చచ్చేటంత డబ్బుంది. కానీ అమ్మకీ సంబంధం నచ్చుతుందో లేదో? వాళ్ళ కులం వేరు. ఆలోచిం చగా ఈ ప్రతిపాదనా బాగానే ఉందనిపిస్తోంది…’’ అన్నవీ వింటూనే ఉంటాం. డబ్బు కులాన్ని తోసి రాజంటుంది. అంతగా కాకపోతే కాదన డానికి కులం అడ్డు ఎలాగూ  ఉంది. ఆ నెపాన్ని నెట్టేయడానికి పెద్ద వాళ్ళు ఎలాగూ ఉంటారు. కొన్నివేల మైళ్ళు దాటొచ్చినా కులం నీడలు వెంటాడూనే ఉంటాయి.
పైన చెప్పిన మాటలు కొంతమందికి చురుక్కుమనిపించవచ్చు. భుజాలు తడుముకోవచ్చు. బ్రహ్మానందం ఉద్దేశ్యం అది కాదని చెప్పడానికి నేను ఏమాత్రమూ సందేహించను. ఎందుకంటే నవలలో ఒక పాత్ర తాలూకు ఆలోచన అది.
అవసాన దశలో ఉన్న వ్యక్తి, స్వీయకథ చెప్పుకునేటప్పుడు, తన ఒప్పులన్నీ ఏకబిగిని చెప్పుకుంటాడు, కానీ తన తప్పులన్నీ ఒప్పుకుంటాడా? అంటే నిజాయితీగా ఆత్మకథ చెప్పటం సాధ్యమేనా? ఆంతరంగిక విషయాలు అన్నీ పూసగుచ్చినట్టు, దాయకుండా ఎవరైనా చెప్పగలరా?  ఈ ప్రశ్నకి సమాధానం బ్రహ్మానందం తన అంతర్జ్వలన నవలలో సమర్థ వంతంగా నిర్వహించాడు. అందుకు అతన్ని అభినందించి తీరాలి.
Antarjwalana Cover
* * * 

 ఆకస్మిక అభివృద్ధి పై ఒక వెలుగు

చంద్ర కన్నెగంటి 
దశాబ్దాలుగా తెలుగ్నువారు మెరుగైన జీవితాలకై అమెరికాకు వలస వస్తూ ఉన్నారు. గత శతాబ్దపు ఆరూ ఏడూ దశకాల్లో వైద్యులు అధిక సంఖ్యలో తరలిరాగా చివరి దశకంలో సాఫ్ట్‌వేర్‌ నిపుణుల వలస ఎక్కువ యింది. చదువుకొని, ఆ విద్యార్హతలతో ఇక్కడ ఉద్యోగ్నం సంపాదించుకునే విద్యార్థుల సంఖ్య మొదట్లో తక్కువగానే ఉన్నా క్రమేపీ అనేక రెట్లు పెరుగుతూ వస్తోంది. విద్యార్హతతో పని లేకుండా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం  సంపాదించడానికి ఇప్పుడది డొంక తిరుడుగుడు దారిగానూ, అడ్డదారి గానూ పరిణమిస్తోంది. తెలుగువారి దృష్టి ఉద్యోగాల మీద నుంచి వ్యాపారాలకు విస్తరిస్తూ ఉంది.
తొలినాళ్లలో ప్రవాస జీవితంలో వీరు ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? ఇక్కడి తిండికీ, సంస్కృతికీ అలవాటుపడడంలో తోవచూపే ముందు తరం వాళ్లు లేనప్పుడు ఎట్లా కుదురుకోగలిగారు? అప్పటి కాలపు వర్ణవివక్ష స్పష్టంగా కనిపించేదా? వీటికీ, ఇటువంటి ప్రశ్నలకి జవాబులూ, వారి అనుభవాలూ మనకు తెలిసే దారిలేదు. ఒక దారీ, తెన్నూ దొరికాక, కొంచెం వేళ్లు నిలదొక్కుకున్నాక అప్పుడు తమ సమస్యలు కథలుగా చెప్పుకోవడం మొదలెట్టారు. కథలు కనక వారి జీవితాలపై అవి ప్రసరించే వెలుతురు పరిమితంగానే ఉంటుంది.
ఇన్నేళ్లుగా క్రమంగా కలుగుతున్న  మార్పులూ, ఇక్కడి తెలుగుజాతి ప్రస్థానమూ చరిత్రగా నమోదు కావాలంటే నవల వల్లో, జీవిత చరిత్ర వల్లో తప్ప సాధ్యం కాదు. ఒకటో రెండో నవలలూ, జీవిత చరిత్రలూ రాకపోలేదు. అయితే ఎక్కువమంది ఇక్కడికి చేరుకున్న రోజులనీ, విద్యార్థి జీవితాన్నీ, సాఫ్ట్‌వేర్‌ రంగంలో పెనుమార్పుల వల్ల కొంతమంది జీవితాల్లో కలిగిన ఆకస్మిక అభివృద్ధినీ పట్టుకున్న నవలలు లేవు. మిత్రుడు గొర్తి బ్రహ్మానందం రాసిన ఈ అంతర్జ్వలన నవల ఆ పని చేస్తుంది.
మృత్యుముఖంలోని మనిషి తలపోత ఇది. విద్యార్థిగా ఈ దేశంలో అడుగు పెట్టి స్నేహితుల, ఇక్కడి తెలుగు  కుటుంబాల సాయంతో ప్రవాస జీవితంలో ఇముడుతూ, అవకాశాల్ని అంది పుచ్చుకుని పైస్థాయికి  చేరుకున్న వ్యక్తి జీవితంలోని ముఖ్యభాగాలు ఇవి. నవల నేపథ్యం చరిత్రగా కళ్లకు కడుతుంది. ఆ కాలంలో ఇక్కడ అడుగుపెట్టిన వాళ్లను గడచిన దినాల నెమరువేతలో పడవేస్తుంది.
చేయి తిరిగిన రచయిత కనుక వాక్యం సరళంగా ఉండి సాఫీగా నడుస్తూ ఆసక్తిగా చదివిస్తుంది. అతిసాధారణమూ కాని, అసాధారణమూ కాని సంఘటనలు సహజమే అనిపిస్తాయి. మానవ సహజమైన బలహీనత లను ఎత్తి చూపుతూ చివరి ఘట్టం పాఠకుడి దృక్కోణం మారుస్తుంది.
ఈ నవల మరిన్ని నవలలను ఇక్కడి రచయితలచే రాయిస్తుందనీ, ఇక్కడి జీవితాల అన్ని కోణాల్నీ తడుముతూ మరింత విస్తృతమైన కాన్వాస్‌తో నవలలు వస్తాయనీ ఆశిద్దాం.
*

మీ మాటలు

  1. మణి వడ్లమాని says:

    నవల గురుంచిన విశ్లేషణ బాగా రాసారు .విజ్ఞులు,పెద్దలు అయిన వేలూరి వెంకటేశ్వర రావు., మరో రచయత చంద్ర కన్నెగంటి సీరియల్ గా వస్తున్నప్పుడే బ్రహ్మ్మనందం గారికి మెయిల్ పెట్టాను. బహుశా వారు చూసుకుని ఉండకపోవచ్చు.వెంకటేశ్వరరావు గారు చెప్పినట్లు పాతిక సంవత్సరాల క్రితం మా పెద్దతమ్ముడు అమెరికా వెళ్ళడం,వాడు వెళ్ళిన రెండు నెలలకే నాన్నగారు అకస్మాత్తుగా పోవడం.ఇంకా చాల చాల విషయాలు గుర్తుకొచ్చాయి. మాకు. మా అమ్మ కూడా చదివింది.ఆ తరువాత మా చిన్న తమ్ముడు వెళ్ళడం అప్పటికి వాడికి ఒక . ఆధారం ఉండటం. జరిగింది.బహుశా నాలాంటి వాళ్ళకి చాల మందికి ఉంది ఉండవచ్చు.
    వారి కధనం బావుంటుంది. కోనసీమ కధలలలో చదివాను.
    చక్కటి రచన అందించిన రచయతకు అభినందనులు

  2. Brahmanandam Gorti says:

    మణి గారూ:

    మీ వ్యాఖకి కృతజ్ఞతలు.
    మీరు గతంలో నాకు మెయిల్ పెట్టినట్లుగా అన్నారు. నాకు మీ నుండి ఎటువంటి మెయిల్ రాలేదు. సాధారణంగా మెయిల్ వస్తే తప్పకుండా రిప్లయ్ ఇస్తాను.
    మీ వ్యాఖ్య గురించి కూడా మరో మిత్రుడు చెప్పేవరకూ నాకు తెలీదు.
    నవల మీకు నచ్చిందకు సంతోషంగా ఉంది.

    -సాయి బ్రహ్మానందం

మీ మాటలు

*