దేవరహస్యాన్ని వెల్లడించిన ‘సేతు రహస్యం’

SetuRahasyamFrontCover

 కొల్లూరి సోమ శంకర్

~

SomaSankar2014ఒక బర్నింగ్ ఇష్యూని ప్రధానాంశంగా తీసుకుని చేసే రచన ఆ ఇష్యూ ప్రజలలో నానుతున్నంతవరకూ వెలుగులో ఉంటుంది. సమస్య విస్మృతికి గురయ్యేసరికో లేదా తాత్కాలికంగా పరిష్కారమయ్యేసరికో, ఆ రచన మరుగున పడే ప్రమాదం ఉంటుంది. అయినా రిస్క్ చేసి ఆ రచనని ప్రచురించడం అంటే రచయితకి తనమీద, కథావస్తువుమీద అంత గట్టి నమ్మకం ఉన్నట్లు. ఈ విషయాన్నే మరోసారి ఋజువు చేసారు గంగ శ్రీనివాస్.

2005లో అప్పటి కేంద్ర ప్రభుత్వం సేతుసముద్రం షిప్పింగ్ కెనాల్ ప్రాజెక్టును ఆమోదించడంతో దేశవ్యాప్తంగా సంచలానికి దారితీసింది. రవాణా నౌకలు భారతదేశపు తూర్పుతీరం నుంచి పశ్చిమ తీరానికి చేరాలంటే శ్రీలంక మీదుగా వెళ్ళవలసి ఉంది. అంతే కాకుండా సమయం ఎక్కువ పడుతోంది. ఈ సమస్యని అధిగమించేందుకు గాను రామాయణ కాలంలో శ్రీరాముడిచే నిర్మించబడిందిగా భావిస్తున్న రామసేతువును కూల్చి ఆ ప్రాంతంలో కాలవ ఏర్పాటు చేయడం ద్వారా భారీ నౌకల ప్రయాణానికి వీలు కల్పించి, సరుకు రవాణా సమయాన్ని తగ్గించవచ్చనీ, ఇంధనాన్ని ఆదా చేయవచ్చని ప్రభుత్వం భావించింది. దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు, ఆందోళనలతో ప్రభుత్వం పలు కమిటీలు వేసింది. ప్రజల మధ్య వాదోపవాదాలు జరిగాయి.

విశ్వాసానికి, హేతుబద్ధతకీ పొసగడం ఎప్పుడోగాని జరగదు. శ్రీరాముడు కట్టించిన వారధిని కూలిస్తే ఊరుకోమని హిందూ సంస్థలు, ప్రాజెక్టును అమలుచేస్తే ఆ ప్రాంతంలో వాణిజ్యం అభివృద్ధి చెంది, పరిశ్రమలు వస్తాయనీ, స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయని మరికొన్ని సంస్థలు జగడానికి దిగాయి. ఈ నేపథ్యంలో రామసేతు పూర్వపరాలను వివరిస్తూ వ్రాసిన నవల “సేతు రహస్యం”. వాస్తవాలకి కాస్త కల్పన జోడించి రామాయణ గాథలోని పద్యాలను అవసరమైన చోట ఉపయోగించుకుంటూ కథని నడిపారు రచయిత.

దేశ విదేశాలలో రామసేతువు ఒక బర్నింగ్‌ ఇష్యూగా మారి, ఈ సెగలు విదేశాలలోని ప్రవాస భారతీయులను కూడా తాకుతాయి. అక్కడ కూడా వాదోపవాదాలు జరుగుతాయి, కాని సత్యాన్వేషణ మాత్రం జరగటం లేదని తలచి, ఆ దిశగా సన్నాహాలు చేస్తారు ప్రవాస భారతీయులు. వివిధ దేశాలలో ఉంటున్న ప్రవాస భారతీయులంతా కలసి ”వరల్డ్‌ విశ్వశాంతి ఫెడరేషన్‌” గా ఏర్పడి, వివిధ సంస్థలతో కలసి పని చేయాలని ఏకాభిప్రాయానికి వస్తారు.
వారి ప్రయత్నాలలో భాగంగా ఒక కోర్‌ టీమ్‌ భారతదేశానికి సత్యాన్వేషణకై వస్తుంది. వారు ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు, ఏవిధంగా వారి సత్యాన్వేషణ సాగుతుంది, సత్యం ఏమి అనేదే ఈ నవలలోని అంశం.

GangaSrinivas

లక్ష్యానికి తగిన కార్యసాధకులను ఎంచుకోవడంతోనే విజయానికి తొలి అడుగు పడుతుంది. సాగర గర్భంలో అన్వేషణలు కొనసాగించడంలో అనుభవమూ, విశేష నైపుణ్యం ఉన్న శ్రీధర్ చాగంటి, ఓ పరిశోధనా నౌకలో సిస్టమ్ అనలిస్ట్‌గా పనిచేసే రాజేశ్, సముద్ర సంపదనీ, పర్యావరణాన్ని కాపాడడానికి కృషి చేసే కేథరిన్, శ్రీలంక ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ రిటైర్డ్ ఆఫీసర్ డా. విజయ సోమదేవ రామసేతువు సహజసిద్ధమైనదా, మానవ నిర్మితమైనదో నిగ్గు తేల్చే బృందంలో కీలక సభ్యులు.

తమ ఈ ప్రయత్నాలనీ అమెరికాలోని ఓ యూనివర్సిటీ, భారతదేశంలోని మరో ప్రముఖ విశ్వవిద్యాలయం యొక్క సంయుక్త పరిశోధనా ప్రాజెక్టుగా ప్రారంభిస్తారు. కార్యాచరణ మొదలై, బృందంలోని సభ్యులు తమ ప్రయత్నాలను వేగవంతం చేసేసరికి కొత్త కొత్త సమస్యలు ఎదురవుతాయి. రామాయాణాన్ని సంపూర్ణంగా తెలుసుకోవాలనుకుంటారు. రామాయణాన్ని వ్యాఖ్యానించడంలో విశేష అనుభవం ఉన్న భట్టుమూర్తి అనే పండితుడిని కలసి రామాయణం గురించి తెలుసుకుంటారు, తమ సందేహాలు తీర్చుకుంటారు. వీరు తమ పరిశోధనలలో ఎదురైన ఆటంకాలను ఎదుర్కోడానికి ఆధ్యాత్మికతనీ, శాస్త్రీయతని సమన్వయం చేస్తారు. ప్రాచీన గ్రంథాలలో చెప్పిన అంశాలకు వర్తమాన సాంకేతికని అన్వయించి ఆ యా అంశాలను ధృవీకరించుకుంటారు.

రామసేతువుని నలుని ఆధ్వర్యంలో ఐదు రోజులలో నిర్మించారు. వరుసగా, 14, 20, 21, 22, 23 యోజనాల చొప్పున నూరు యోజనాల పొడవు, పది యోజనాల వెడల్పు ఉన్న వారధి నిర్మించబడింది. రోజుకి 20 యోజనాలు కాకుండా, ఇలా వివిధ సంఖ్యలతో నిర్మించడం వెనుక ఉన్న దేవరహస్యం ఏమిటి? దానిని ఈ బృందం ఎలా కనిపెట్టిందనేది ఆసక్తికరం. అసలు యోజనం అంటే ఎంత దూరం? క్రోసు అంటే ఎంత దూరం? రాజస్థాన్‌లోని థార్ ఎడారి ఇసుక అడుగున ఒకప్పుడు ఎంతో ఘనమైన సంస్కృతి ఉన్న నాగరికత వర్ధిల్లిందా? ఆ నాగరికతకీ రామాయణానికి సంబంధం ఏమిటి? నవల ముగింపులో రామసేతువు నిర్మాణంలో వాడిన ఓ భారీ శిలను సముద్రం నుంచి బయటకి తెచ్చినట్లు, దానిలో ఓ రహస్య గది ఉన్నట్లు చెబుతారు రచయిత. ఆ గదికున్న తలుపు తెరవడానికి శ్రీధర్ ఏం చేసాడు? ఇంతకీ ఆ గదిలో ఏముంది? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలకు ఈ నవల జవాబులు చెబుతుంది.

రామాయణ ఘట్టం ఆధారంగా ఈ నవలని సృజించినా, మతం ముద్ర పడకుండా జాగ్రత్త వహించారు రచయిత. ఎక్కడా విసుగనిపించకుండా, ఆసక్తిగా చదివింపజేస్తుందీ నవల.

పుస్తకంలో అక్కడక్కడా బాక్స్ ఐటమ్స్‌లా ప్రాచీన సాంకేతికతకి, రహస్యాలకి సంబంధించిన చక్కని వివరాలు అందజేసారు. ఎటువంటి సాంకేతిక ఉపకరణాలు లేని రోజులలోనే వెనిస్‌కి చెందిన జెనో సోదరలు 14వ శతాబ్దిలోనే గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్‌ల మాప్ అత్యంత ఖచ్చితంగా తయారు చేయడం; 1895లో దేశంలో మొట్టమొదటి విమానయానం జరిగిన వైనం; సౌదామిని కళ గురించి, అమ్ముబోధిని గురించి చెప్పిన స్వల్ప వివరణ వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలనే ఆసక్తి కలిగిస్తుంది. శ్రీలంకలో సీతను ఉంచిన గాధకి సంబంధించి ఇప్పటికీ అక్కడ ఉన్న సీత ఏలా, సువార ఎలియా అనే ప్రదేశాల గురించి వివరించారు. సప్తఋషులలో ఒకరైన భారద్వాజ మహర్షి రచించిన అంశుబోధిని అనే వైమానిక శాస్త్రం గురించి, ప్రాచీన విమానాల గురించి చెప్పారు. 12 రకాల మేఘాల గురించి, వాటి లక్షణాల గురించి, 64 రకాల విద్యుల్లతల గురించి, 32 రకాల పిడుగుల గురించి అత్రి మహర్షి విశదీకరించినట్లు తెలియజేసారు. ప్రకాశ స్థంభన బిడలోహంతోనూ, తమోగర్భలోహంతోనూ నిర్మించే విమానాలు ప్రత్యర్థుల రాడార్లకు అందవని తెలియజేసారు. గల్ఫ్ ఆఫ్ మన్నార్‌లో ఒకప్పుడు డ్యుగోంగ్ అనే మత్స్య జాతి ఉండేడని, ఈ చేపలు క్షీరదాలని, చూడ్డానికి మత్స్యకన్యలుగా ఉండేవని చెప్పారు. ప్రస్తుతం ఈ జాతి చేపలు అంతరించిపోతున్నాయని తెలుస్తోంది. ఈ బాక్స్ ఐటమ్ అంశాలన్నీ ఆసక్తికరంగా ఉంటాయి.

రామసేతువుని అసలైన ప్రేమచిహ్నంగా నిలపాలన్న రచయిత ఆలోచన వినూత్నమైనది. సృష్టి ప్రచురణలు వారు 2008లో ప్రచురించిన ఈ 168 పేజీల నవల వెల రూ. 120/- అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలోనూ, కినిగె.కాం లోను లభిస్తుంది.
*

మీ మాటలు

*