యుద్ధం. యుద్ధం యుద్ధం. ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా ఇదే మాట. రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. హిట్లరు విజృంభిస్తున్నాడు. సామ్రాజ్యవాద దేశాల దగ్గరున్న సంపద, అధికారాల మీద అతని కన్నుపడిరది. బ్రిటన్తో సహా మిగిలిన యూరోపియన్ దేశాలను జయిస్తే ప్రపంచమంతా పాదాక్రాంతమవుతుందనుకున్నాడు. బ్రిటీష్ ప్రభుత్వం అన్ని వలసదేశాల ప్రజలనూ యుద్ధంలో తమకు సహకరించమంది. ఆ మాట అన్నది గానీ బలవంతంగానే యుద్ధంలోనికి ప్రజలను లాగుతోంది. కాంగ్రెస్ వారికి, కమ్యూనిస్టులకూ కూడా బ్రిటీష్ ప్రభుత్వంతో వ్యవహరించాల్సిన తీరుమీద ఎన్నో ఆలోచనలు . చర్చలు . వాదాలూ. యుద్ధంలో ప్రభుత్వానికి సహకరించే సమస్యే లేదని కమ్యూనిస్టు పార్టీ తీర్మానించింది. గాంధి వ్యక్తిగత సత్యాగ్రహ కార్యక్రమం ఇచ్చారు. అది అంతగా బ్రిటీష్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేది కాదనే విమర్శ కమ్యూనిస్టులు చేశారు. కమ్యూనిస్టుల మీద బ్రిటీష్ ప్రభుత్వం నిషేధం విధించింది. దొరికిన వాళ్ళను అరెస్టు చేస్తుండటంతో అనేకమంది అజ్ఞాతవాసానికి వెళ్ళారు. నవశక్తి పత్రిక కూడా అజ్ఞాతంలోనే అచ్చయి పంపిణీ అవుతోంది. శారద పని ఇంకా పెరిగింది. అజ్ఞాతంలో ఉన్నవారికి కావలసిన బస తదితర ఏర్పాట్లు, వారి కుటుంబాలను రాజకీయంగా చైతన్యపరచటం, డాక్టరుగా పని – ఒకటి కాదు. పది పనులను ఇరవై చేతులతో చేస్తున్నా చేయవలసినది ఇంకా మిగిలే ఉంటుంది.
శారద ఉపన్యాసాలకు కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లా ప్రజలు విపరీతంగా వస్తున్నారు.
‘‘మన దేశ సంపదను, ప్రజలను తన సామ్రాజ్య రక్షణకు బ్రిటీష్ ప్రభుత్వంవాడుకుంటుంటే మనం చూస్తూ ఊరుకోకూడదు. మనం బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్యతిరేకం. యుద్ధంలో ఆ సామ్రాజ్యం బలహీనమైతే మన బలం పెరుగుతుంది. హిట్లర్ నియంత. ఫాసిస్టు, సందేహం లేదు. కానీ బ్రిటీష్ ప్రభుత్వం ప్రజాస్వామ్యం పేరుతో వలస దేశాలో నియంతల్లా వ్యవహరించటం లేదా? ఫాసిస్టు చర్యలు చేయటం లేదా? వురి తీశారే విప్లవ కారులను – జలియన్వాలాబాగ్ ఫాసిస్టు చర్యకాక మరేమిటి? అసమ్మతిని, నిరసనను నొక్కివేయటంలో హిట్లర్ రాజకీయాలోకి రాకముందే బ్రిటీష్వాళ్ళు నిపుణులయ్యారు. వారు హింసించటంలో సుశిక్షితులై ఉన్నారు. కాకపోతే చట్టమనే పేరుతో పార్లమెంటు పేరుతో ఫాసిజానికి ప్రజాస్వామ్యపు రంగు పూసారు. దానివల్ల వారి పని తేలికయింది గానీ వలస దేశాల ప్రజల మీద ఆంక్షలు , నిర్భంధాలు పెరగలేదా? ఇంగ్లండు, జర్మనీ వైరం వాళ్ళనీ, వాళ్ళనీ తేల్చుకోనివ్వండి. మనం మాత్రం సహకరించకూడదు’’.
బ్రిటీష్వాళ్ళ మీద నిప్పులు చెరుగుతూ శారద ఈ మాటలను ఉదాహరణతో చెబుతుంటే ప్రజల రక్తం మరిగేది. వారు వ్యక్తి సత్యాగ్రహం చెయ్యకుండా ఉండలేకపోయేవారు. జైళ్ళు నిండిపోతున్నాయి. కాంగ్రెస్ మంత్రులందరూ రాజీనామా చేశారు.
జాతీయ, రాష్ట్రీయ ప్రభుత్వాల ఏర్పాటుకు అనుమతిస్తే యుద్ధంలో సహకరిస్తామని కాంగ్రెస్ పార్టీ పూనా మీటింగులో తీర్మానం చేసింది. గాంధీజీకి ఈ తీర్మానం ఇష్టంలేకపోయినా సమావేశంలో ఆమోదం పొందిందంటే అర్థం ఏమిటని శారద, అన్నపూర్ణా ఆవేదన పడ్డారు. దీని వెనక రాజాజీ ఉన్నారని అన్నపూర్ణ విశ్వాసం. ప్రకాశం పంతులు గారు ఉన్నవ లక్ష్మీనారాయణ గారితో ఈ సంగతులు చర్చించేటపుడు అన్నపూర్ణ, అబ్బయ్య కూడా ఉన్నారు. ప్రకాశంగారి ఆవేదన వారికి పూర్తిగా అర్థమయ్యింది. నిజానికి ప్రకాశంగారికి ప్రజలలో ఉన్న పలుకుబడికీ, ఆయనలోని నాయకత్వ క్షణాలకు, త్యాగానికి, సాహసానికీ ఎవరూ చాలరు. కానీ కేంద్ర నాయకత్వం ప్రకాశం గారికి ఇవ్వవలసినంత విలువ ఇవ్వటం లేదని అన్నపూర్ణకి కోపం వస్తుండేది. శారదకు కూడా ప్రకాశం పంతులు గారంటే గౌరవం ఉంది గానీ, ఆయన బలాలతో పాటు బహీనతలు కూడా ఆమెకు తెలుసు. చిన్నతనం నుంచీ ఆయనను దగ్గరగా చూసింది.
ఏమైనా రాజకీయాలే ఊపిరిగా బతికే స్త్రీల సంఖ్య పెరుగుతోంది. ఇంతలో ప్రపంచ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి.
హిట్లర్కీ, సోవియట్ రష్యాకి మధ్య జరిగిన నిర్యుద్ధ ఒడంబడికను హిట్లరు ఖాతరు చేయబోవటం లేదనీ, రష్యా మీదికి కూడా దండెత్తుతాడనీ రాజకీయ వేత్తలు చెప్పుకోసాగారు. సోవియట్ రష్యా యుద్ధానికి సన్నద్ధమవుతుందనే వార్తలు మెల్లిగా వినపడటం ప్రారంభమై గట్టిగా ప్రతిధ్వనించ సాగాయి.
దీనితో కమ్యూనిస్టులు పెద్ద చిక్కులో పడ్డారు. వారి దృష్టిలో సోవియట్ రష్యా ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమానికి చుక్కాని. అది ప్రమాదంలో పడకుండా కాపుకాయాలా? మన సంగతి మనం చూసుకోవాలా? సోవియట్ రష్యా తనను తను రక్షించుకోగలదు. మనం మన సంగతి చూసుకోవాల్సిందే అన్నారు కొందరు. రష్యా యుద్ధంలో ఓడిపోతే ఇక ఏ దేశంలోనూ కమ్యూనిస్టు పార్టీ బతికిబట్ట కట్ట లేదన్నారు మరి కొందరు. చర్చలు ఎడతెగకుండా సాగాయి.
శారద మనసు, మెదడు మండిపోతున్నాయి. ప్రపంచానికి సోవియట్ రష్యా ఒక ఆశాజ్యోతి. ఆ జ్యోతి ఆరిపోకూడదు. బ్రిటీష్ ప్రభుత్వం వెయ్యి చేతుల రాక్షసి. దాని చేతులు నరకకుండా ఆ చేతులకు ఆయుధాలు అందించే పనికి పూనుకోకూడదు.
అసలీ యుద్ధమేమిటి? దీనినెలా అర్థం చేసుకోవాలి?
అగ్ర నాయకులందరూ సమావేశమయ్యారు. రోజుల తరబడి చర్చలు జరిగాక జోషిగారు తన వాదనతో అందరినీ ఒప్పించగలిగాడు.
‘‘ఇది ప్రజా యుద్దం’’ అన్నాడాయన.
సోవియట్ రష్యా యుద్ధంలోకి రాకముందు, ఇది సామ్రాజ్యవాదుల మధ్య పంపకాలు, దోపిడీ కోసం జరిపిన యుద్ధం. కానీ ఇప్పుడా స్వభావం మారింది. హిట్లరే సోవియట్లను మింగదల్చుకున్నారు. అది ప్రపంచ ప్రజలందరికీ హాని చేస్తుంది. సోవియట్ యూనియన్లో ప్రజలు యుద్దంలోకి దిగారు. ఆ ప్రజలకు తోడు మనం. ప్రజా యుద్ధం మన యుద్ధమే.
మాటలే మంత్రాలు. మాటలకు మంత్రశక్తి ఉంటుంది. వాటిలో ఉన్న భావానికి, వాటిని విన్నవారికీ మధ్య ఒక గొప్ప సమన్వయం కుదురుతుంది. ఇక వాళ్ళు ఆ మాటలకు మంత్రముగ్ధులై పోతారు వశులైపోతారు. ‘‘ప్రజాయుద్ధ’’మనేమాట కమ్యూనిస్టులలో అనేకమంది మీద మంత్రంలాగే పనిచేసింది.
శారదకు మాత్రం అది ఒక పట్టాన కొరుకుడు పడలేదు. యుద్ధంలో బ్రిటీష్వాళ్ళకు సహకరించటం ఆత్మహత్యా సదృశ్యమనిపించింది. ఇన్నాళ్ళూ యుద్ధ వ్యతిరేకత, ప్రజల్లో ప్రచారం చేసి, ఇప్పుడు హఠాత్తుగా యుద్ధానికి అనుకూలంగా మాట్లాడటమెట్లా! వాళ్ళకేం చెప్పాలి? ఎలా చెప్పాలి? శారద చాలాసేపు వాదించింది. కానీ ఫలితం లేదు. మెజారిటీ సభ్యులు ‘‘ప్రజాయుద్ధం’’లో పాల్గొనటానికి సిద్ధమైపోయారు. శారద మద్రాసు వెళ్ళి మూర్తితో మాట్లాడిరది. మూర్తి కూడా అది ప్రజాయుద్ధమనే అంగీకరించాడు. సోవియట్ రష్యా ప్రజలు హిట్లర్ నెదిరించి చేస్తున్న యుద్ధం, పోరాటం, భారతదేశంలో అసమాన త్యాగాలుగా కీర్తిస్తున్నారు. స్టాలిన్ తిరుగులేని కమ్యూనిస్టు నాయకుడిగా ప్రజల హృదయాలలో ముద్ర వేసుకుంటున్నాడు. శారద పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ప్రజాయుద్ధ భావనను అంగీకరించింది. సోవియట్ రష్యా ప్రభుత్వమూ ప్రజలు ప్రదర్శిస్తున్న సాహసం గురించి ఆమెకెలాంటి సందేహమూ లేదు. కానీ ఆమె మనసులో ఎంతో సంచలనం. జ్ఞానం వచ్చిననాటి నుంచీ ద్వేషించి వ్యతిరేకించిన బ్రిటీష్ పాలకులతో సహకరించాలంటే ఆమె భరించలేక పోతోంది. కానీ అది మింగేసి ప్రజలందరితో ఆ మాట చెప్పాలి. ఎలా చెప్పటం? చెప్పక తప్పదన్నది కమ్యూనిస్టు పార్టీ.
బెజవాడలో బహిరంగసభ పెట్టి ప్రజలకు ప్రజాయుద్ధ భావన గురించి వివరించే పని శారదకే అప్పజెప్పింది. శారద మనసులో ద్వైదీ భావం పోయిందా లేదా? పూర్తిగా పార్టీలైనుకి కట్టుబడిరదా లేదా అన్నది తేల్చుకోవాలని కొందరు సభ్యులు ఆతృత పడుతున్నారు. శారదలో ఏమాత్రం బలహీనత కనపడినా దాని ఆధారంగా క్రమశిక్షణా చర్యలు చేపట్టాని వాళ్ళ కోరిక. శారద ఒక ఆడదనే సంగతి వాళ్ళకు అనుక్షణం గుర్తొస్తుంది. శారద చదువువల్లా, చిన్నతనం నుంచీ ఉద్యమాల్లో భాగమవటం వల్లా, కమ్యూనిస్టుపార్టీ తొలితరం నిర్మాతలో మొదటి స్త్రీ అవటం వల్లా, తన ఇల్లుని పార్టీ కేంద్రంగా చేసి, తన సంపాదన లెక్కచూడకుండా పార్టీకి ఖర్చు పెట్టటం వల్లా, పార్టీ తప్ప ఇక వేరే కుటుంబం లేకుండా బతకటం వల్లా, మార్క్స్, ఎంగెల్స్ రచను అర్థం చేసుకుని వివరించగల శక్తివల్లా, శారదను అగ్రనాయకురాలిగా అంగీకరించక తప్పదు వారికి. జనంలోకి, స్త్రీలోకి చొరవగా చొచ్చుకుపోయే స్వభావం వల్లా, ఇతరులకు ఏ ఆపదా, అవసరం వచ్చినా నేనున్నానంటూ దూకే స్వభావం వల్లా శారదంటే ప్రజలో విపరీతమైన అభిమానం. దానివల్ల ఆమెకు పార్టీలో కొందరు వ్యతిరేకులు తయారయ్యారు. కొందరికైతే వారికే తెలియకుండా అంతరాంతరాల్లో శారదంటే వ్యతిరేక భావం పెరుగుతోంది. ఆమె చొరవను, ఒక ఆడదానికి ఉండకూడని క్షణంగా వాళ్ళు భావించేవారు. పురుష నాయకులతో సమానంగా తిరుగుతూ, వారి భుజాల మీద చేతులు వేసి మాట్లాడుతూ, బెరుకన్నది లేకుండా ఉండే ఆమె తీరు వారికి నచ్చదు. పెళ్ళి చేసుకోలేదు. ఎవరినో ప్రేమించింది. రకరకాల పుకార్లు. వీటన్నిటితో ఆమెమీద వారికే తెలియని వ్యతిరేకత. జ్ఞానం కలిగిన స్త్రీని, మేధావి అయిన స్త్రీని, నాయకత్వం లక్షణాలు కలిగిన స్త్రీని సహించి భరించగలిగిన స్థితిలో ఉండే పురుషులు చాలా తక్కువ. అలాంటి స్త్రీలూ తక్కువమందే కానీ జాతీయోద్యమం కొందరినైనా అలాంటి స్త్రీలను తయారు చేసింది. వాళ్ళు తయారయ్యారు. వాళ్ళను ఎప్పుడెలా అణిచివెయ్యాలా అనే తత్త్వమూ తయారైంది. నాయకులుగా ఎదగాల్సిన అనివార్యతను, నాయకులుగా తమను సహించలేని పురుష ప్రపంచానికీ మధ్య శారదలాంటి మహిళలెందరో నలుగుతున్నారు.
1942 వ సంవత్సరం నాటికి కమ్యూనిస్టులంతా దాదాపు బహిరంగంగా పని చేస్తున్నారు. ఆ రోజు శారదకు పరీక్ష. బెజవాడలో బహిరంగ సభ నిర్వహణ బాధ్యత ఆమెదే –
‘‘జనం వస్తారంటారా?’’ అడిగింది తనతోపాటు ఆ సభలో మాట్లాడాల్సిన సుబ్బారావుని.
‘‘చూద్దాం. ఎంతమంది వస్తే అంతమందితోనే ’’ అన్నాడాయన. శారద కమ్యూనిస్టుపార్టీ తీర్మానాలు, డాక్యుమెంట్లు వీటికంటే సోవియట్ యూనియన్ నాజీలను ఎదుర్కొంటున్న తీరూ, నాజీ దుర్మార్గం గురించి వివరించాలనుకుంది. నాజీల మీద ప్రజలకు ద్వేషం కలగాల్సిందే. ఫాసిజం ఏ మూలనున్నా ప్రపంచానికి కీడేగాని మేలు జరగదు. ఆ కీడుని ప్రజల చేత గుర్తింపు చేయటంలో తప్పులేదు. దానిమీద కేంద్రీకరించి మాట్లాడాలనుకుంది.
కానీ ప్రజలెంతమంది వస్తారు? కాంగ్రెస్ వాళ్ళొచ్చి మీటింగ్ భగ్నం చేస్తారా? రాళ్ళు వేస్తారా? సందేహాలున్నా ముందుకి దూకక తప్పదు. సాయంత్రం అన్సారీ పార్కులో మీటింగు దగ్గరున్న జనాన్ని చూసి శారద నిట్టూర్చింది. ఫరవాలేదు ` మూడొందల మంది దాకా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళూ వచ్చారు గానీ అల్లరి చేయకుండా మర్యాదగానే కూర్చున్నారు. శారదాంబ అంటే వారికున్న గౌరవం అది.
శారద ఏం చెబుతుందో విందామనే వాళ్ళంతా వచ్చారు.
శారద గంటకు పైగా ఫాసిస్టు ప్రమాదం గురించి మాట్లాడిరది. ప్రపంచాన్ని ఫాసిజం నుంచి రక్షించుకోవటం ప్రపంచ ప్రజలందరి కర్తవ్యం అనిప్రజలకర్థమయ్యేలా మాట్లాడిరది. మీటింగయిపోయాక జనం గ్రూపుగా విడిపోయి మాట్లాడుకుంటుంటే వింటూ వారి మధ్యగా నడుస్తోంది శారద. పార్కు చివరికొచ్చేసరికి అక్కడ అన్నపూర్ణ నించుని ఉంది. ఆమె కళ్ళల్లో కోపం, నిరసన, అసహనం.
‘‘నువ్వూ వచ్చావుటోయ్ – రా పోదాం. మా ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం’’ అంటూ అన్నపూర్ణ భుజం మీద చేయి వేసి లాక్కుపోయింది శారద. ఇల్లు చేరి సుబ్బమ్మను పలకరించి ఆమె చేతివంట తినేసరికి అన్నపూర్ణ కోపం సగం తగ్గింది. మిగిలిన సగం తగ్గకముందే మాట్లాడాలని ‘‘మీ పార్టీకి పద్ధతి, పాడూ లేదా’’ అంటూ మొదలుపెట్టింది.
‘‘ఫాసిజం’’ అంది శారద దానికి తిరుగు లేదన్నట్టుగా.
‘‘శారదా! ఫాసిజం గురించి నాకు చెప్పకు. బ్రిటీష్వాళ్ళ ఫాసిజాన్ని కళ్ళారా చూశాం. మనకు తెలియదా ? హఠాత్తుగా బ్రిటీష్వాళ్ళు ఫాసిస్టులు కాకుండా మీకు మిత్రులైపోయారు. సోవియట్ రష్యా ఎలా ఆడిస్తే అలా ఆడతారా’’.
‘‘నీకు నచ్చే సమాధానం నేను చెప్పలేను అన్నపూర్ణా. కానీ సోవియట్లకు సహాయపడటం మనందరి కర్తవ్యం. ప్రపంచంలోకెల్లా అందమైన కల ఒకటి వాస్తవమై పురుడు పోసుకుంది. పొత్తిళ్ళలో ఉన్న ఆ చిన్ని పాపాయిని రక్షించుకోకపోతే ప్రపంచానికి భవిష్యత్తనేదే లేదు. కమ్యూనిస్టుగా అది నా బాధ్యత.’’
‘‘నువ్వు ముందు భారతీయురాలివి. తర్వాతే కమ్యూనిస్టువి’’.
‘‘కమ్యూనిస్టుకు దేశాలూ, సరిహద్దులనే సంకుచితపు పరిధులు లేవు. ప్రపంచ శ్రామికులందరిదీ ఒకే జాతి. ఒకే దేశం’’ ప్రేమగా చెప్పింది శారద.
‘‘ఐతే ఇక నేను మాట్లాడేదేం లేదు. కానీ ఇది మంచిది కాదు. నీకూ మీ పార్టీకి’’.
‘‘మంచిదే అన్నపూర్ణా – హిట్లర్ వంటి నియంత కు వ్యతిరేకంగా నిలబడటం మంచిదే – నాకూ, మా పార్టీకి , మన దేశానికి.’’
‘‘హిట్లర్ నియంతే ఒప్పుకుంటాను. కానీ చర్చిల్ నియంత, మోసగాడు కాదా?’’
‘‘మా పార్టీ లైను ప్రకారం చర్చిల్ హిట్లరంత నియంత కాడు’’
‘‘నీ మనస్సాక్షికి?’’
‘‘నా మనసు పార్టీకి అంకితం. నా మనసు ఈ పనే చెయ్యిమంది.’’
‘‘నీ మనసు దివాలా తీసింది. సత్యాసత్యా విచారణ మానేసింది. విచక్షణ అడుగంటింది. మూఢత్వం ఒకటే మిగిలింది.’’
‘‘అన్నపూర్ణా ఇక మాట్లాడకు -పార్టీ మినహా జీవితం లేదు నాకు.’’
‘‘కాంగ్రెస్ ఒకవేళ ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటే నేను కాంగ్రెస్ నుంచి బైటికి వచ్చేసేదాన్ని’’.
‘‘మీ కాంగ్రెస్ వాళ్ళకు క్రమశిక్షణ లేదు. మాకు క్రమశిక్షణే ప్రాణం’’.
‘‘ఊపిరాడకుండా చేసే క్రమశిక్షణకు విలువేముంది.’’
‘‘అన్నపూర్ణా – ఒదిలెయ్యవోయ్ – మన అభిప్రాయాలు కలవవోయ్.
అన్నపూర్ణ వదలలేదు. ఆ రాత్రంతా వాదించుకుంటూనే గడిపారు. ఐనా వారి మనసుల్లో ఒకరి పట్ల ఒకరికి కొంచెం కూడా ద్వేషం కలగలేదు. అయ్యో – శారద ఇంత తెలివితక్కువగా ఉందేమిటని అన్నపూర్ణా , అన్నపూర్ణకు ఇంత ప్రపంచజ్ఞానం లేదేమిటి, అంతర్జాతీయ పరిస్థితుల గురించి పట్టించుకోదేమిటని శారదా – ఇద్దరూ ఒకరి మీద ఒకరు జాలిపడ్డారు.
ప్రజా యుద్ధపంధాను వివరించి సభను విజయవంతం చేసినందుకు శారదను పార్టీ అభినందించింది. శారదను వ్యతిరేకించేవారు నోరెత్త లేకపోయారు. శారద మాత్రం చాలా నలిగిపోయింది. మనసు చంపుకుని క్రమశిక్షణకు కట్టుబడటం అంటే అన్నపూర్ణకు చెప్పినంత తేలిక కాదు. కానీ శారద మనసులో సగంపైగా సోవియట్ స్వప్నం నిండిపోవటం వల్ల ఆమె తొందరగానే బాధ నుంచి బైటపడిరది. సోవియట్ల రక్షణ కంటే మించిన కర్తవ్యం లేదు అని స్థిరంగా నమ్మిన శారద ఇక ఉత్సాహంగా ప్రజాయుద్ధ ప్రచార రంగంలోకి దూకింది. భారతదేశం మీదా యుద్ధమేఘాలు తారాడుతున్నాయి. జపాన్ మంచి దూకుడు మీద ఉంది. మద్రాసు మీద బాంబులు పడతాయనే వార్తలూ , విశాఖపట్నం మీద బాంబులనే వార్తలతో – అందరూ ఆందోళనలో పడ్డారు. కమ్యూనిస్టు పార్టీ తన సభ్యులకు, సానుభూతి పరులకూ సైనిక శిక్షణ కూడా ఇవ్వటం మొదలు పెట్టింది. బెజవాడలో వీధుల్లో స్త్రీ పురుషులు కవాతు చేస్తున్నారు. వారిలో ఫాసిస్టు వ్యతిరేక సమరోత్సాహం ఉప్పొంగుతోంది. ప్రచార దళాల్లో నాటకాలు , బుర్ర కథలు , జానపద కళారూపాలన్నీ బైటికొచ్చాయి. అన్నిటికీ కేంద్రం శారద ఇల్లే. బెజవాడలో ఒక చిన్నపాటి కమ్యూన్ కూడా ఏర్పాటయింది. పార్టీలో పూర్తికాలం పనిచేస్తున్న వారందరూ ఒక చోటే ఉండటంతో అందరిలో ఒక విశ్వాసం, ఆత్మీయతా భావం అంకురించాయి. ఆ కమ్యూన్లో స్త్రీలు కూడా ఉండేవారు. ఒకే ఆశయంతో వచ్చి చేరిన స్త్రీ పురుషుల మధ్య ప్రేమ చిగురించడం సహజం. ఆ సంగతి శారద కనిపెట్టిందంటే ఇక వారి పెళ్ళి అయిపోయినట్టే. వారికి కూడా ఆ రోజు తమ పెళ్ళి జరుగుతుందని తెలియకుండా హఠాత్తుగా జరిపేది. ఏదో ఒక పండగ రోజు ఆ ప్రేమికులనూ, దగ్గర్లో ఉన్న పార్టీ పెద్దలనూ పిల్చి రెండు దండలు తెప్పించి వారిచేత మార్పించి పెళ్ళయిందనేది.
చిన్న టీ పార్టీ ఇచ్చేది – అందరూ సంతోషించేవారు.
‘‘మా శారద అందరి పెళ్ళిళ్ళూ చేస్తోంది. తన పెళ్ళి మాత్రం జరగదు’’ అనుకుని నిట్టూర్చేది సుబ్బమ్మ.
సుబ్బమ్మ కమ్యూనిస్టుపార్టీ సభ్యత్వం తీసుకోలేదు గానీ పార్టీ చెప్పిన పనులు ఎవరికీ తీసి పోకుండా చేసేది. ఏ వేళప్పుడు ఎవరొచ్చినా వారి ఆకలి దప్పుల సంగతి చూసేది సుబ్బమ్మే.
కమ్యూనిస్టు పార్టీకిపుడు ప్రభుత్వ అండ ఉంది. వారి మీద నిర్బంధం లేదు. పార్టీ ప్రచారం కూడా ఊపందుకుని గ్రామాల్లో బలం పెరుగుతోంది. ఇది సహించలేని ఇతర రాజకీయ పార్టీలు , ముఖ్యం కాంగ్రెస్, హీనమైన పద్ధతులకు దిగాయి. కమ్యూనిస్టు నాయకుల మీద ఆరోపణలు .
శారదకేవో సంబంధాలు అంటగట్టడం ‘‘ములుకొల’’ అనే పత్రికలో రాసే రాతలు సత్యం కాదని అందరికీ తెలిసినా, వాటి గురించి చెవులు కొరుక్కునేవారు, చర్చించేవారూ ఉండనే ఉంటారు. నిప్పు లేనిదే పొగ రాదుగా అనేవారే ఎక్కువ. ఆ కామెర్ల రోగపు పత్రికలో శారదతో కమ్యూనిస్టు నాయకుడైన రామకృష్ణ పేరు జతచేసి బురద చల్లారు. రామకృష్ణ మద్రాసులో చదువుకునే నాటినుంచీ శారదను ‘అక్కా’ అని పిల్చేవాడు. తన సందేహాలో, ఆందోళనలో నిరాశా నిస్పృహలలో శారద వంక చూసేవాడు. శారద రామకృష్ణకు స్వంత అక్కలా అండగా ఉండేది. ఆ చిన్నప్పటి చనువు పోయేది కాదు. అది పార్టీలో మొదటి నుంచీ ఉన్నవారికి తెలుసు. ఐనా సానుభూతిపరులలో ఇదొక చర్చ రేపింది. ఆ విషయం గురించి ఏదో ఒక నెపం కల్పించుకుని మాట్లాడటం మెల్లిగా మొదలైంది.
శారద పెళ్ళి చేసుకోకుండా ఉండటం నచ్చని వాళ్ళు ‘ఇది కారణం’ అని చెప్పుకోటానికి ఆ పత్రిక ఒక హీనమైన కారణాన్ని ఇచ్చినట్లయింది. రామకృష్ణ, శారదాంబా ఈ మాటకు నవ్వుకుని దానిని తీసి అవతల పడెయ్యగ సామర్థ్యం
ఉన్నవారే. కానీ ఇద్దరూ ప్రజలలో పనిచేస్తున్నారు. ఆ ప్రజలు రకరకా చైతన్యాలతో ఉన్నారు. వాళ్ళలో కొందరు తప్పకుండా అపార్థం చేసుకుంటారు. అపార్థం చేసుకుని పార్టీకి దూరమైతే పార్టీకి నష్టం. అందులోనూ ఎంతోమంది మహిళా కార్యకర్తులుగా, సానుభూతిపరులుగా ఉన్నారు. వాళ్ళంతా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చారు. శారద వాళ్ళలో కొందరికి వింతగా కనిపిస్తుంది. తమంత విధేయంగా, అణకువగా శారద పార్టీలోని పురుషులతో ప్రవర్తించటం లేదనుకుంటారు. పార్టీలో పురుషులను వీరు అన్నయ్యా, తమ్ముడూ అంటూ వాళ్ళను గౌరవిస్తూ, వారి మాటలు అక్షరాలా పాటిస్తూ, వినయంగా ఉంటారు. వారికి ఏదైనా సహాయమో, సేవో చేయగలిగితే తమ జన్మ ధన్యమన్నట్లు ఉంటారు.
శారద మగవాళ్ళతో సమానంగా, వాళ్ళకే ఆజ్ఞలిస్తూ, నవ్వుతూ తుళ్ళుతూ హాస్య చతురతతో మాట్లాడుతూ, జ్ఞానాధికారంతో శాసిస్తూ, నడిపిస్తూ ఉంటుంది. స్త్రీలలో కొందరికి శారద చాలా నచ్చుతుంది. డాక్టరమ్మలా మనమూ ఉండానుకుంటారు. కానీ చాలామంది ఆడమనిషి అలా ఉండటమేమిటి అనుకుంటారు. ఆమె చొరవ వాళ్ళకు అర్థం కాదు. ఇక మగవాళ్ళలో మొదటినుంచీ శారద పరిచయం ఉన్నవాళ్ళు, ఆమె కుటుంబ నేపథ్యం గురించి తెలిసినవాళ్ళు శారద గురించి ఏ కంప్లయింట్లూ లేకుండా ఉంటారు. మిగిలిన సభ్యులందరికీ శారదను చూస్తే బెదురు. వారికే తెలియని భయం. కోపం, ఆందోళన, ఒక ఆడమనిషి ఇలాగా ఉండేది – ఆ నవ్వటమేమిటి? రామకృష్ణంతటి వాడి భుజం మీద చెయ్యి వేసి మాట్లాడటమేంటి? ఆ మాటలేమిటి? వినయం లేదు. ఇది మాట్లాడొచ్చు, ఇది మాట్లాడకూడదని లేదు. ఇంగ్లీషు బాగా వచ్చని గర్వం. ఇంగ్లండు వెళ్ళి చదివి వచ్చిందిగా అక్కడ ఏం చేసిందో ఏమో `-ఇక్కడ మన ఆడవాళ్ళిలా తయారైతే ఇక అయినట్లే – ఇలా ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళందరికీ ములుకోల రాతలు బాగా దొరికాయి.
ఆవిడ మూలంగా దేవుడిలాంటి రామకృష్ణ మీద అపవాదు వచ్చిందని కొందరు, ఏమో ఆవిడిల్లు రహదారి బంగాళాలాంటిది. ఎవరెవరో వస్తారు పోతారు. లోపలేం జరుగుతుందో చూసిన వారెవరూ అని మరికొందరు, పార్టీకింత అప్రదిష్ట వచ్చిందని మరికొందరు, గొణగటం మొదుపెట్టారు. పైకి అందరూ ములుకోల రాతల్ని విమర్శించేవారే గానీ లోపలోపల కొందరు ఉడుకుతున్నారు. అసలా అవకాశం ములుకోలకు ఎందుకివ్వాలి మనం? అనేది వారి ప్రశ్న. రంధ్రాన్వేషకులు తామే చిల్లులు పెట్టి ఇదిగో ఇక్కడ చిల్లు వుందని గగ్గోలు పెడతారని వారికి చెప్పి సమాధాన పరిచేవారు లేకపోయారు. ఎందుకంటే ఈ విషయాల గురించి గంభీరంగా, దానిని పరిశీలించి అందులో ఉన్న సామాజిక విషయాలను గురించి, స్త్రీ పురుష సంబంధాల గురించి, ఆధునిక స్త్రీని అర్థం చేసుకోవటం గురించి బహిరంగంగా కింది నుంచి పై వరకూ చర్చ జరగటం మంచిదని ఎవరూ అనుకోవటం లేదు. అసలు ఆ ఆలోచనే ఎవరికీ రాలేదు. ఎంతకూ ఇదేదో జరగరానిది జరిగింది – దీనిని దాచిపెట్టాలి, దీని గురించి మాట్లాడకూడదు, దీనిని తుడిచేయాలి అనే అనవసర అపరాధ భావనతోనే పార్టీ పెద్దలు కూడా ఉన్నారు. చివరకు ఒకరోజు రామకృష్ణ కూడా ముఖం వేలాడేసుకుని శారద దగ్గరకు వచ్చాడు.
శారద ఎప్పటిలాగానే ‘‘చూశావటోయ్ ఈ గోల’’ అని గలగల నవ్వింది.
‘‘ఎలా నవ్వగలుగుతున్నావక్కా’’ అన్నాడు రామకృష్ణ.
‘‘నవ్వక – నువ్వు నవ్వటం లేదా? అదేంటా ముఖం అలా ఉంది. ఆ పత్రిక రాతల్ని నిజంగానే పట్టించుకున్నావా ఏంటి ` రామకృష్ణా – నీకు పిచ్చా’’ అంది ఆశ్చర్యపోతూ.
‘‘పిచ్చి నాకు కాదు. లోకానికి. లోకంలో కొందరు నమ్ముతున్నారు. దాని గురించి మాట్లాడుకుంటున్నారు.’’
‘‘నాకు చాలా బాధగా ఉంది. పార్టీలో ఇలాంటి గొడవ రావటం’’.
‘‘ఆడమగా కలిసి పని చేసేటపుడు వస్తాయి ఇలాంటి సమస్యలు. ఇంతకుముందు జరగని పని గదా – వింతగా చూస్తారు, విడ్డూరంగా చెప్పుకుంటారు. వంకర మాటలు మాట్లాడతారు. వీటి గురించి మనం బాధ పడటం కాదు. వాళ్ళతో, స్త్రీ పురుష సంబంధాల గురించి కొత్త విషయాలు కొత్త పద్ధతిలో మాట్లాడాలి. అదొక కార్యక్రమంగా ఉండాలి. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. మనం మాట్లాడుతూ మన పని చేసుకుంటూ పోతే కొన్నాళ్ళకు ఇలాంటివి సర్దుకుంటాయి. ఆడ, మగ, అన్నాచెల్లెళ్ళలానో, తండ్రీ కూతుళ్ళలానో, భార్యాభర్తలు గానో కాకుండా స్నేహితుల్లా, కామ్రేడ్స్లా కలిసి పని చెయ్యొచ్చని అర్థం చేయించాలి. ఇది చాలా పెద్ద పని. కానీ అవసరమైన పని’’.
శారద కళ్ళు ఆ పని గురించిన బాధ్యతతో మలుగుతున్నాయి.
రామకృష్ణ ఆ మాటలు పట్టించుకునే మానసిక స్థితిలో లేడు.
అందుకే అనాలోచితంగా ‘‘చాలా మందికి నీ ప్రవర్తన నచ్చటం లేదు’’ అన్నాడు.
శారద ముఖం చిట్లించింది.
‘‘అంటే – ప్రవర్తన అంటే ` ’’
రామకృష్ణ శారద ముఖం చూస్తూ ఎలా చెప్పగలిగాడో గాని
‘‘నువ్వలా ఎక్కడైనా ఎవరి ముందైనా పెద్దగా నవ్వటం, మన కామ్రేడ్స్ భుజాల మీద చేతులు వెయ్యటం, వీపు తట్టడం. నీ అతి చనువు. ఆడవాళ్ళిలా ఉంటే ప్రమాదమనుకుంటున్నారు’’.
‘‘ఎవరనుకుంటున్నారు?’’
‘‘అందరూ – సీనియర్స్ కూడా నువ్వు కొంత మారితే మంచిదనుకుంటున్నారు.’’
‘‘నువ్వేమనుకుంటున్నావు రామకృష్ణా’’
‘‘నాకు నీ గురించి తెలుసక్కా. కానీ మిగిలిన వాళ్ళకు నువ్వర్థం కావు. దానివల్ల పార్టీలో కొస్తే ఆడవాళ్ళిలా తయారవుతారని భయపడుతున్నారు.’’
శారద గంభీరమైంది. ఆమె ముఖం ఎరుపెక్కింది.
‘‘నువ్వు మాట్లాడే మాటలు నేను సీరియస్గా తీసుకుంటే నేను పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళాలి’’.
‘‘అది కాదక్కా – నా ఉద్దేశం అది కాదు. నువ్వు కాస్త మారితే – పార్టీ కోసం’’ రామకృష్ణకు తనెంత ప్రమాదంలో పడ్డాడో తెలిసి ఆగాడు.
‘‘ఏం మారాలి? గ్రామాల నుంచి ఇప్పుడే కళ్ళు తెరిచి కొత్తలోకంలో భయంగా, బెరుకుగా, జంకుగా అడుగుపెడుతున్న ఆడదానిలా నేను తలదించుకుని మగ కామ్రేడ్స్తో మాట్లాడాలా? వాళ్ళకు నేను వినయంగా ఆదేశాలు ఇవ్వాలా? వాళ్ళను నా తోటి కామ్రేడ్స్లా కాకుండా నా కంటే ఎక్కువైన వాళ్ళలా, ‘మగ’, వాళ్ళలా చూడాలా? కొంగు కప్పుకోవాలా భుజాల చుట్టూ. వాళ్ళకంటే ముందు నడవకుండా వాళ్ళ వెనకాల నడవాలా? వాళ్ళడిగితే తప్ప సలహాలివ్వకుండా ఓర్పుగా ఎదురు చూడాలా? నిజమే మహిళోద్యమ కార్యకర్తలు మగ కామ్రేడ్స్తో చాలా, పరిమితుల్లో ఉంటున్నారు. అది కొత్త కాబట్టి. ఎప్పటికీ వాళ్ళలా ఉంటే వాళ్ళకింక కమ్యూనిస్టు పార్టీ ఎందుకు?’’‘‘అదంతా నిజమే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి పోవాలిగా. ఏటికి ఎదురీదలేంగా’’.
‘‘పరిస్థితుల్ని మార్చటానికా మనం ఉంది, పరిస్థితుల్ని బట్టి పోటానికా? ఏటికి ఎదురీదాలి కమ్యూనిస్టులు . నేను ఆధునిక స్త్రీని రామకృష్ణా. బహుశ మీరు నన్ను భరించలేకపోతున్నారు. నా తల్లిదండ్రులు నేనూ ఈ సమాజం మీద ఎంత పోరాటం చేస్తే నా చదువు సాధ్యమైందనుకున్నావు? చదువుకునే రోజుల్లో నన్నెందరు ఎన్ని మాటలన్నారనుకున్నావు. బూజు దులిపినట్లు దులిపేశాను ఆ మాటల్ని. వాటన్నిటినీ పట్టించుకుంటే నేను కమ్యూనిస్టు పార్టీ నిర్మాతల్లో ఒకరినయ్యేదాన్నా. నేను ఎప్పుడూ గలగలా నవ్వటమే మీకు కనిపిస్తోంది. అలా నవ్వటం నా హక్కు అని అర్థం చేసుకుని నవ్వటానికి నాలో జరిగిన స్ట్రగుల్ నీకు తెలియదు. నీ భుజం మీద చేయి వేసి మాట్లాడతాను. నిజమే. ఆ పరిస్థితికి రావటానికి ఆటంకంగా ఉన్న ఎన్ని పర్వతాలను దాటి, సముద్రాలను ఈది వచ్చానో నువ్వు ఊహించను కూడా ఊహించలేవు. నీకు తెలియదసలు . నీకే తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? ఇంకా నేనెన్నిటికి బందీగా ఉన్నానో, ఎన్ని తెంచుకోవాలో అని ఆలోచిస్తుంటాను. మరిన్ని సంకెళ్ళు వేసుకుని ఎప్పటికీ బందీగా జైల్లో ఉండమంటావా?’’
రామకృష్ణ ముఖం నల్లగా మాడిపోయింది. గొంతు పెగుల్చుకొని
‘‘అందరూ అనుకుంటున్నారని చెప్పా గానీ – నాకేం అభ్యంతరం లేదు.’’
‘‘అబ్బా – చాలా చాలా విసుగ్గా ఉంది. అలిసిపోయాను. ప్రతివాడికీ అభ్యంతరమా లేదా అని ఆలోచించి బతకాలా నేను’’.
‘‘నన్ను సరిగా అర్థం చేసుకోవటం లేదక్కా. నేను మాట్లాడేదంతా పార్టీ కోసం’’.
‘‘పార్టీ అంటే ఏమిటి? మనందరం కాక విడిగా పార్టీ ఏమన్నా రాతి గుహా? దేవాలయమా? మనం కదా పార్టీ ఎలా ఉండాలని నిర్ణయించేది.
‘‘జనం ఒప్పుకోని పనులు ….’’
‘‘జనం ఒప్పుకునే పనుల కోసం కమ్యూనిస్టు పార్టీ ఎందుకు? భూస్వాముల దోపిడీని ఒప్పుకుంటారు జనం. తమ కర్మ అనుకుంటారు. కులాన్ని ఒప్పుకుంటారు – మనం వాటిని ఒప్పుకోమని చెప్పాలి గదా’’.
‘‘అది వేరు – ఇది వేరు. నీతి నియమాల గురించి జనం అభిప్రాయాలు అంతగా మారవు అప్పుడే.
‘‘నీతి! నీతి అంటే ఏంటి? నేను నవ్వటం, చకచకా నడవటం, పెద్దగా మాట్లాడటం అంతా నీతికి విరుద్ధంగా ఉందా? దానినుంచి నేను మారి నీతి మార్గంలోకి రావాలా?’’
‘‘నువ్వు ఆవేశంగా ఉన్నావు. అదంతా తగ్గి నిదానంగా ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది.’’
‘‘ఆడవాళ్ళు ఆవేశంగా ఉండకూడదు కాబోలు . ఆర్గ్యుమెంట్లు చెయ్యకూడదు కాబోలు . నువ్వు నా ప్రవర్తన మార్చుకోమనగానే సిగ్గుపడి భయపడి మార్చుకుని`’’
రామకృష్ణ రెండు చేతులూ ఎత్తి దణ్ణం పెట్టాడు శారదకు.
‘‘ఒదిలెయ్ ` నా మాటలు తప్పని ఒప్పుకుంటాను. క్షమించెయ్. కానీ మన శత్రువులు చేస్తున్న ప్రచారం గురించి పట్టించుకోకపోతే మనకే నష్టం జరుగుతుంది. ఏం చెయ్యాలో ఆలోచించు. నేను ఒస్తాను.’’ అంటూ రామకృష్ణ అక్కడ్నించి లేచి వెళ్ళిపోయాడు.
శారదకు గుండె మండిపోతోంది.
చివరికి – చివరికి కమ్యూనిస్టులు కూడా కట్టడి చేయటమే.
తమ గురించి ఎవరేం అనుకుంటారో అని ఆలోచించటం మొదలు పెడితే ఇక దానికి అంతెక్కడ?
ఎంతమంది మగవాళ్ళ చూపుల్ని, మాటల్ని ఎదిరించి ఇంతదూరం వచ్చింది? తను నవ్వుతూ ఉంటుందని తన జీవితం పూలబాట అనుకుంటారేమో కానీ ప్రతి సందర్భంలో పోరాటం, ఘర్షణ, రాజీ, రాజీపడక తప్పని పరిస్థితి గురించి వేధించే మనను. వీటన్నిటినీ పక్కన బెట్టి కమ్యూనిస్టు పార్టీలో పని చేస్తోంది. ఎందుకు? ఇక్కడొక కొత్త ప్రపంచం గురించిన కల, ఆశ, ఆ ప్రపంచంలో కూడా ఆంక్షలూ , నిర్భంధాలూ అయితే ఇంక ఏముంది? చదువుకుని, ఉద్యోగం చేస్తూ గుట్టుగా, గుంభనగా ఉంటూ పెళ్ళి చేసుకుని, మొగుడికి ఒళ్ళు, మనసు, సంపాదన అన్నీ అప్పగించి ఎక్కడుంది ఆధునికత ? ఆరేళ్ళ వయసునుండీ తనను ఆశపెట్టీ, ఆలోచన రేకెత్తించి, పరుగు పెట్టించిన ఆ మాటకు అర్థం ఏమిటి? పరిధులు లోపలి మాటేనా?
ఈ చిచ్చు ఆరేది కాదని అనిపించింది శారదకు. అనుకున్నట్టే అయింది. పార్టీ అత్యున్నత కమిటీ శారద వ్యవహారాన్ని పరిష్కరించాలని కూర్చుంది.
***
‘‘పరిస్థితుల్ని మార్చటానికా మనం ఉంది, పరిస్థితుల్ని బట్టి పోటానికా? ఏటికి ఎదురీదాలి కమ్యూనిస్టులు . నేను ఆధునిక స్త్రీని రామకృష్ణా. బహుశ మీరు నన్ను భరించలేకపోతున్నారు. నా తల్లిదండ్రులు నేనూ ఈ సమాజం మీద ఎంత పోరాటం చేస్తే నా చదువు సాధ్యమైందనుకున్నావు? చదువుకునే రోజుల్లో నన్నెందరు ఎన్ని మాటలన్నారనుకున్నావు. బూజు దులిపినట్లు దులిపేశాను ఆ మాటల్ని. వాటన్నిటినీ పట్టించుకుంటే నేను కమ్యూనిస్టు పార్టీ నిర్మాతల్లో ఒకరినయ్యేదాన్నా. నేను ఎప్పుడూ గలగలా నవ్వటమే మీకు కనిపిస్తోంది. అలా నవ్వటం నా హక్కు అని అర్థం చేసుకుని నవ్వటానికి నాలో జరిగిన స్ట్రగుల్ నీకు తెలియదు. నీ భుజం మీద చేయి వేసి మాట్లాడతాను. నిజమే. ఆ పరిస్థితికి రావటానికి ఆటంకంగా ఉన్న ఎన్ని పర్వతాలను దాటి, సముద్రాలను ఈది వచ్చానో నువ్వు ఊహించను కూడా ఊహించలేవు. నీకు తెలియదసలు . నీకే తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? ఇంకా నేనెన్నిటికి బందీగా ఉన్నానో, ఎన్ని తెంచుకోవాలో అని ఆలోచిస్తుంటాను. మరిన్ని సంకెళ్ళు వేసుకుని ఎప్పటికీ బందీగా జైల్లో ఉండమంటావా?’’
గ్రేట్ !!
ఎవరీ చారిత్రాత్మకమైన పాత్ర ?
కాలేజీలో చదువుతున్న రోజుల్లో నువ్వు కమ్యూనిస్టువా భారతీయుడువా అని అడగటం విన్నాను. మాస్కోలో వానకురిస్తే ఇక్కడ మన కమ్యూనిస్టులు గొడుగులేసుకుంటారు అనటం కూడా విన్నాను. కానీ నలభైలలో ముందుగా బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా ఉండి, హిట్లర్ రష్యా మీద దాడిచెయ్యటంతో బ్రిటీష్ పాలకులతో సహకరించాల్సిన పరిస్థితి రావటం కమ్యూనిస్టులను ఎంత ఇబ్బంది పెట్టిందో ఓల్గా గారి కథనం చదువుతుంటే అర్థమవుతుంది.