-కృష్ణ మోహన్ బాబు
~
“లేదు నేను యెప్పుడూ బరువులు ఎత్తలేదు. కాని ఒకసారి మాత్రం ఒక రాయిని లేపాను.”
ఒక్కసారిగా మేమంతా నిటారుగా ఆయిపోయాం. “ఒక రాయిని లేపారా! అది ఎంత పెద్దది ఘనదా?”
“ఎంత పెద్దగా వుంటుందది! అది చాలా చిన్న గులాకరాయి, బహుశా అరవై గ్రాములు వుంటుందేమో _ _ _ _ _ దాని కారణంగానే మికియు దీవి ముక్కలుగా పేలిపోయింది.”
“ఒక దీవి మొత్తం ముక్కలుగా పేలిపోయిందా! దానికి కారణం నువ్వు ఒక పలకరాయి లేపటమా?” మా నోటినుంచి అప్రయత్నంగా ప్రశ్న దూసుకు వచ్చింది.”
……
“అవును. ఈ వానపాములే లేకపోతే ప్రపంచం ఎడారిగా మారి వుండేదని మీకు తెలుసా? ఎకరంలో మూడవ వంతులో రెండు లక్షల వాన పాములుంటాయని మీకు తెలుసా? ఈ వానపాములు 12 నుంచి 15 అడుగుల లోతు వరకు సొరంగాలు చేస్తూ కింద మట్టిని పైకి తెస్తాయి. కాబట్టే నేల సారవంతంగా వుంటుందని మీకు తెలుసా? ప్రపంచంలో కెల్లా బలశాలి కంటే అవి బలమైనవని తెలుసా? తన బరువు కంటే 60 రెట్లు బరువుండే రాయిని వాన పాము తేలికగా కదిలించ గలదని మీకు తెలుసా ……”
“అదే కాదు అవే లేకపోయి నట్లయితే ఆధునిక కాలంలో అద్భుతాన్ని, ఒక గొప్ప ఆవిష్కరణను కోల్పోయి వుండేవాళ్ళం . అవే లేకపోతే ఈ కాలపు గొప్ప శాస్త్రజ్ఞుడికి తన అద్భుత ప్రయోగాన్ని పూర్తి చేసే అవకాశాన్ని నేను కల్పించలేక పోయేవాడిని .”
అబ్బో, అబ్బో ఇలాంటి సాహసాలు, ‘ఘనదా’ చాలా చేసేడు. ఘనదా అసలు పేరు ఘనశ్యామ్ దాస్. బక్క పలచగా, సన్నగా వుండే ‘ఘనదా’
వయస్సు 35 నుంచి 55 మధ్యలో ఎంతైనా వుండచ్చు. గత 200 సంవత్సరాల్లో ఈ భూగోళంలో ఇతను వెళ్ళని ప్రదేశం లేదు. పాలు పంచుకోని ఘటన లేదు. జేబులో డబ్బుల్లేక ఓ ఇరుకు సందులో వుండే కుర్రాళ్ళతో కలసి వుంటాడు. ఆ కుర్రాళ్ళు ఇతని సాహస గాథలు నోరు వెళ్ళ బెట్టుకు వింటూ వుంటారు. కొత్త, కొత్త కథల కోసం వాళ్ళు అతన్ని రెచ్చగొడుతూ వుంటారు. ప్రేమేంద్ర మిత్ర రాసిన “అడ్వంచర్స్ ఆఫ్ ఘనదా”కి తెలుగు రూపం “ఘనదా సాహసాలు.” నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు నెహ్రూ బాల పుస్తకాలయం సిరీస్ కింద దీన్ని తీసుకొచ్చారు. సుబీర్ రాయ్ బొమ్మలతో, కె. సురేష్ తెలుగుతో ఈ పుస్తకం మన ముందు కొచ్చింది.
బెంగాలీ సాహిత్య వృక్షానికి అనేక కొమ్మలు, ప్రతి కొమ్మా రంగురంగుల పూలతో, మత్తెక్కించే వాసనల్ని పంచుతుంది. అలాంటి ఓ బలమైన కొమ్మే ప్రేమేంద్ర . సినిమాలతో సహా అన్ని ప్రక్రియల్ని అవపోసన పట్టాడు. ఇతను జీవించిన కాలంలో (1904 – 1988) అనేక మంది సాహితీ శిఖరాలు వున్నా ప్రేమేంద్ర తన కంటూ ఒక శైలి, ఒక గొంతు, ఒక ఐడెంటిటీ తయారు చేసుకొన్నాడు. ప్రేమేంద్ర సృష్టించిన “ఘనదా” పాత్ర
సమకాలీన బెంగాలీ సాహిత్యం లో వచ్చిన డిటెక్టివ్ పాత్రల కన్నా విభిన్న మైనదే కాకుండా మనం వూహించలేని వాతావరణంలో సైంటిఫిక్ టెంపర్ మెంటుతో, చక్కటి లాజిక్ తో నడుస్తుంది. “ఘనదా సాహసాలు” మొత్తం 13 కథలు. ఒక్కో కథా ఒక్కో రకంగా వుంటుంది. ఎక్కడా ఒక్క స్త్రీ పాత్ర వాసన కూడా లేని సాహసాలు యివన్నీ. చదవాల్సిందే. చెప్పి లాభం లేదు.
ఈ పుస్తకంలో కథ లేవీ ఇండియాలో కాదు కదా, మన లాంటి మానవమాత్రులకు తెల్సిన ప్రదేశాల్లో జరగవు. ఇక్కడ ఘనదా వూహకి, జాగ్రఫీ పరిజ్ఞానానికి మనం జోహార్లు చెప్పాలి. ఎందుకంటే తను చెప్పే సాహసాని కనుకూలమైన, దీటైన స్థలం వుండాలి. వుదాహరణకి ‘ దోమ’ కథ సఖలం దీవి లో జరుగుతుంది. అది జపాన్ కి దక్షిణాన వుంది. అది వుత్తరం నుంచి దక్షిణానికి ఓ రంపంలా వుంటుంది. దక్షిణ భాగం జపానుకి చెందితే, వుత్తర భాగం రష్యాకి చెందుతుంది. ఆరు నెలలు కుండపోత వర్షాలైతే, ఆరు నెలలు చలికి గడ్డకట్టుకుని వుండే భయంకర దీవి. తీవ్ర మంచు తుఫానులు అక్కడ సాధారణం. ఇంకో కథ న్యూ హెబ్రైడ్స్ అనే చిన్న దీవుల సమూహం లో జరుగుతుంది. న్యూజిలాండ్ కి వుత్తరాన, ఆస్ట్రేలియాకి ఆగ్నేయ దిశలో వున్నాయి. ఆకాశం నుంచి చూస్తే ‘Y’ ఆకారంలో పరచిన చిన్న రాళ్ళ మాదిరి కనపడతాయి. ‘Y’ లో మూడు గీతలు కలిసే చోట వాటి రాజధాని, ఎఫేట్ వుంది. రాజధాని ఒకటే కాని పాలకులు యిద్దరు. ఇంగ్లీష్, ఫ్రెంచ్ కలసి దీన్ని పాలించేవి. మరో కథ దక్షిణ అమెరికా కి వాయవ్యమూలన ఈక్విడార్ కి పశ్చిమంగా 600 మైళ్ళ దూరంలో వున్న గలపాగోస్, నార్ బరో దీవుల్లో జరుగుతుంది. గలపాగోస్ లో ఆల్బెమార్ల లేదా ఇసాబెలా అన్నిటికంటే పెద్ద ద్వీపం. ఇది ‘J’ ఆకారంలో వుంటుంది. దీని కొస మీద ఓ చుక్క మాదిరి ద్వీపమే నార్ బరో లేదా ఫెర్నాండినా. ఇక్కడ మొదలైన కథ మరెక్కడో తేలుతుంది. ఇలా ఒక కథలో వున్న ప్రదేశం యింకో దాంట్లో వుండదు. ఆ ప్రదేశాలు మన వూహకి కూడా అందవు. అందుకే ఈ కథలు చాలా ఆశక్తిని కలిగిస్తాయి.
ఈ కథల్లో అభూత కల్పనలుండవు. చక్కటి శాస్త్రీయ విశ్లేషణతో, చిన్న పాటి సైన్స్ పరిజ్ఞానాన్ని ఆధారం చేసుకుని వుంటాయి. సైన్స్ అవగాహన లేని వాళ్ళ కు కూడా అర్ధమయ్యేలా వుంటాయి. ఒక కథ లో ఓ యూదు తీవ్రవాది, వాళ్ళ జాతిని హింసించిన జాతుల్ని రూపుమాపడం కోసం సిస్టోసర్కా గ్రెగీరియా అనే ఓ మిడత జాతి పురుగుని వాటి ఎదుగుదలకి అనువైన ఓ మారు మూల ఆఫ్రికా అడవుల్లో పెంచుతాడు. అవి వేల మైళ్ళు ప్రయాణం చేసి పచ్చగా కనిపించే దేన్నైనా సర్వ నాశనం చేయగలవు. ఘనదా వాటి మధ్య ఓ వైరస్ వున్న మిడతని ప్రవేశ పెడతాడు. ప్రపంచాన్ని కాపాడతాడు. ఈ వింతని చదివి ఆనందించ వలసిందే. ఇది మీకు ఆశక్తి కలిగించడానికి ఇచ్చిన చిన్న వుదాహరణ మాత్రమే. పదమూడు కథల్లో ఓ దాన్ని మించిన వింత మరొకటి వుంటుంది.
ఈ పుస్తకం అప్పుడప్పుడే పరిణితి చెందుతున్న పిల్లల్ని వుద్దేశించింది. అయితే, యిలాంటి పుస్తకాల్ని ప్రచురించే నేషనల్ బుక్ ట్రష్ట్ గాని, కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు గాని ఎగ్జిబిషన్ లో కేటలాగులు పంచి పెట్టడం తప్పితే, ఈ పుస్తకాల గురించిన చర్చ గాని, మారు మూల గ్రామాలకి వీటిని తీసుకెళ్ళే ప్రయత్నమే చేయటం లేదు. చదవ వలసిన వాళ్ళకి పుస్తకాలు చేరనప్పుడు వాటి ప్రయోజనం ఎలా నెరవేరుతుంది. సిటీల్లో నెట్ లు , e బుక్స్ లాంటివి అందుబాటులో వుంటాయి. మరి గ్రామాల సంగతి ఏంటి? సరే యివన్నీ పక్కన పెడితే ఈ పుస్తకం ముఖ్యంగా మనకి ఓ విషయాన్ని రుజువు చేస్తోంది. పిల్లల కథ లంటే ఒంటి కన్ను రాకాసి, నేపాల మాంత్రికుడు, భూతాలు, అభూత కల్పనలు కానక్కర లేదు. బుద్ధిని, తర్కాన్ని పెంచే యిలాంటి రచనలు కావాలి. అవి శాస్త్రీయం గా ఆలోచించేందుకు వుపయోగపడతాయి. పిల్లలు సరే, హేతు బద్ధతిని కోల్పోతున్న యిప్పటి యువకులు కూడా యిలాంటివి చదివితే సమాజానికి ఎంతో కొంత మంచిది.
*
సర్ , ఎంత మంచి కథల గురించి తెలియజేసారు!!! తప్పకుండా చదవాలి ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని .
మిడతల దండులో వైరస్ మిడతను ప్రవేశ పెట్టడంవంటి తార్కికత గొప్పగా వుంది.
స్త్రీ పాత్రల వాసన ఉంటె మరింత బావుండేదేమో ….
చదవ చక్కని పరిచయం
మీ పుస్తక పరిచయం పుస్తకం కొని చదవాలనిపింపజేసేలా వుంది. మన ఇండియన్ పుస్తకం అంటే మరీ బావుంది. నాకు యాకోవ్ పెర్ల్మన్ గారి (ఆర్వీఆర్ గారి అనువాదం) నిత్య జీవితంలో భౌతిక శాశ్త్రం పుస్తకాన్ని జ్ఞప్తికి తెస్తోంది. ప్రపంచ సాహిత్యం లోని అనేక సన్నివేశాల్లోనివీ, రోజూ చూసే సైన్సు చిక్కుముడులని అరటిపండు వొలిచినట్లుగా విప్పి చూపెట్టే కరదీపిక లాంటిదా పుస్తకం.