రెండేళ్ళు గడచిపోయాయంటే నమ్మబుద్ధి కావటం లేదు. శారద వచ్చేస్తుందని మూర్తి మనసు గంతులేస్తుంది. సుబ్బమ్మ హడావుడికి అంతులేదు. విశాల ఎమ్మే పాసవగానే ప్రభుత్వోద్యోగం దొరికింది. ముత్తులక్ష్మీరెడ్డి సహాయం చేసింది. దుర్గాబాయి మెట్రిక్ పాసై బెనారెస్లో చదువుతానని వెళ్ళింది.
శారద వచ్చిన రోజు బంధువులు , స్నేహితులతో ఇల్లు కిటకిట లాడిపోయింది. మూర్తికి పదినిమిషాలు శారదతో ఏకాంతంగా మాట్లాడటమే కుదరలేదు. శారదకు ప్రయాణపు బడలిక అని చెప్పే వ్యవధానం కూడా ఎవరూ ఇవ్వలేదు. దగ్గర బంధువులు సుబ్బమ్మ దగ్గర శారద పెళ్ళి ప్రస్తావన తెచ్చారు. 1935 వ సంవత్సరంలో 29 ఏళ్ళ వయసున్న స్త్రీ పెళ్ళి కాకుండా ఉండటం సాధారణ విషయం కాదు.
‘ఇపుడు ఇంగ్లండ్ వెళ్ళొచ్చిన వాళ్ళను చూడాలి శారదకు. మాటలు కాదు’’ అన్నారు కొందరు బంధువులు .
‘‘ఇప్పుడు పెళ్ళేమిటి? ఎవరు చేసుకుంటారు. ఇక్కడుండగానే చాలా వ్యవహారాలు నడిపిందట. ఇంగ్లండ్లో ఏం చేసిందో ఎవరికి తెలుసు’’ అని మూతులు విరిచారు దూరపు బంధువులు .
ఇన్ని మాటల మధ్యలోంచి శారదకు బాబాయి వరసయ్యే ఒక కార్యదక్షుడు సంబంధం గురించి మాట్లాడాడు.
‘‘ఇంగ్లండ్ వెళ్లొచ్చిన డాక్టరే ఉన్నాడు. నాకు తెలిసినవాళ్ళే. మన వాళ్ళే. మీరు సరేనంటే అబ్బాయిని తీసుకొస్తాను. ఇక్కడే ప్రాక్టీసు చేస్తున్నాడు. ఇద్దరూ కలిసి ప్రాక్టీసు చేస్తే ఇక చెప్పేదేముంది?’’ అన్న ఆయన మాటతో అందరూ నిశ్శబ్దమయ్యారు.
సుబ్బమ్మకూ, దగ్గరి బంధువులకూ ఈ మాటలు తోసిపుచ్చేందుకేమీ కనిపించలేదు.
‘‘శారదాంబతో మాట్లాడి వారం రోజుల్లో కబురు చేస్తాను’’ అంది సుబ్బమ్మ.
రెండు మూడు రోజులో ఇంట్లో హడావుడి తగ్గి తల్లీ కూతుళ్ళు కాస్త తెరిపిన పడ్డారు.
కానీ పది రోజులయినా శారదతో ఈ విషయం మాట్లాడే సమయం దొరకలేదు.
బంధువులంతా ఎటు వాళ్ళటు వెళ్ళాక ఒకరోజు రాత్రి శారద గదిలోకి వచ్చింది సుబ్బమ్మ. శారద చదువుకుంటూ ఉంది.
‘‘ఇంకా ఏం చదువమ్మా ? పొద్దు బోయింది’’ అంటూ పక్కమీద కూచుంది.
‘‘నా సంగతి సరేగాని నువ్వెందుకింత సేపు మేలుకున్నావు. ఒంట్లో బాగుందా?’’ అంటూ తల్లి నుదుటి మీద చేయి వేసి చూసింది.
‘‘ఏం లేదు ` ఏంటి చెప్పు’’ అంది.
‘‘నీ పెళ్ళి విషయం తల్లీ. చదువు పూర్తయింది. ఇంక జరగవసిది పెళ్ళే గదా. అది కూడా అయితే నా బాధ్యత తీరుతుంది. మీ రామనాధం బాబాయి చెప్పిన సంబంధం బాగానే ఉంది. ఆ అబ్బాయిని చూస్తావా?’’
శారదకు ఈ విషయం తేల్చెయ్యానిపించింది. తేల్చి చెప్పకపోతే తల్లి ఈ విషయం గురించి మధన పడుతూనే ఉంటుంది. అది అనవసరం. కష్టంగా ఉన్నా ఒకసారి సత్యం తెలిస్తే అదే క్రమంగా మనసులో ఇంకి స్థిరపడుతుంది. ఆ తరవాత అశాంతి, అలజడి తగ్గిపోతాయి.
‘‘అమ్మా. నేను చెప్పే విషయం నువ్వు బాగా అర్థం చేసుకోవాలి. నా మీద నీకు నమ్మకం ఉంది గదా.’’
సుబ్బమ్మ నవ్వి ‘‘ఏం అడుగుతున్నావే ? చెప్పు’’ అంది.
తను ఎవరినో ప్రేమించినట్టుగా శారద చెబుతుందని ఆమె ఊహించింది. అతను డాక్టర్ కాకపోయినా ఫరవాలేదు. కులమేదైనా ఫరవాలేదు. శారద ఇష్టపడే మనిషి అంతంత మాత్రంగా ఉండడు. ఒక్కక్షణంలో ఆమె మనసులోకి వచ్చారు. వారంతా తరచూ ఇంటికి వచ్చే యువకులే.
‘‘అమ్మా, నేనసు పెళ్ళి చేసుకోను’’. శారద గొంతులో గంభీరత్వం వింటే సుబ్బమ్మకు సమస్య పెద్దదనిపించింది.
‘‘ఎందుకు అలా అంటావమ్మా ? జీవితంలో అన్నీ చూడాలి. పెళ్ళి, పిల్లలూ ఇదంతా లేకుండా ఎందుకు? ఒక్క చదువేనా పరమార్థం. పెళ్ళంటే ఎందుకిష్టంలేదు’’ శారద ఆమెకి డాక్టర్గా కాక చిన్నపిల్లలా కనిపించింది.
‘‘ఇష్టంలేకపోవటం కాదమ్మా. నేను పెళ్ళాడదల్చుకున్న మనిషికి ఇదివరకే పెళ్ళయిపోయింది.’’
సుబ్బమ్మ నిర్ఘాంతపోయింది. ఆమెకు వెంటనే మూర్తి గుర్తొచ్చాడు.
‘‘ఎవరూ? మూర్తా?’’
‘‘నీకూ తెలిసే ఉంటుంది. మా యిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. కానీ పెళ్ళి మాత్రం కుదరదు’’.
సుబ్బమ్మకు గుండె నీరయింది. ఎంతో తెలివైన శారద ఇంత పెద్ద చిక్కులో ఎలా పడిరది? దీనికి పరిష్కారం ఏమిటి?
‘‘జీవితమంతా పెళ్ళి లేకుండా గడుపుతావా? ఎంత కష్టం’’ దు:ఖం తన్నుకొచ్చింది.
‘‘కష్టమేం కాదమ్మా. ఒకళ్ళని ఇష్టపడుతూ ఇంకొకళ్ళని పెళ్ళాడటమే కష్టం’’.
‘‘మూర్తి ఏమంటాడు?’’
‘‘నేనేమంటే అదే అంటాడు. అంతకన్నా ఏమనగలడు’’ నిరుత్సాహంగా నవ్వింది.
సుబ్బమ్మకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇది తలకు మించిన సమస్య అనిపించింది. శారదతప్ప దీనినెవరూ పరిష్కరించలేరనిపించింది.
‘‘అమ్మా. ఇక మాటిమాటికీ పెళ్ళి గురించి అడగొద్దు. నాకు నా పనులు ఊపిరాడకుండా ఉంటాయి. పెళ్ళి, పిల్లలు వీటన్నిటి గురించీ ఆలోచించే తీరిక లేనన్ని పనులు పెట్టుకుంటున్నాను. నేను సంతోషంగానే ఉంటానమ్మా. నా గురించి దిగులు పెట్టుకోకు’’.
సుబ్బమ్మ మెల్లిగా అక్కడినుంచి లేచి ఆమె గదిలోకి వెళ్ళింది.
కూతురు పెళ్ళి లేకుండా ఉంటుందంటే తల్లి మనసు ఒకంతట దానిని జీర్ణించుకోలేకపోతోంది.
సుబ్బమ్మకు అత్త నరసమ్మ గుర్తొచ్చింది.
పదో ఏటనే శారదకు పెళ్ళి చెయ్యమని పంతంపట్టి, ఆ పంతం నెగ్గదని తెలిసి ప్రాణానికి ప్రాణమైన కొడుకుని వదిలి కాశీకి వెళ్ళిన అత్తగారు గుర్తొచ్చింది. మళ్ళీ ఇటు రాకుండా అక్కడే కన్ను మూసిందావిడ.
ఆమెతో చెప్పుకుని భారం దించుకోవాలనిపించింది.
‘అత్తయ్యా. మన శారద పెళ్ళి చేసుకోదట. దానికి పెళ్ళి మీద కోర్కె లేక కాదు. దానికి కావసినవాడిని పొందలేక!’.
నిజానికి సుబ్బమ్మ భరించలేనిది కూడా అదే. కూతురు ఏం కావాలన్నా సమకూర్చటమే ఆమెకు తెలుసు. ప్రతిది సాధిస్తూ ఆనందంగా ముందుకు సాగిపోయే శారదే ఆమెకు తెలుసు. ఎక్కడా ఏ లోటూ ఎరుగని శారదే ఆమెకు తెలుసు. ఏ పనైనా సాధించనిదే నిద్రపోని శారదే తెలుసు.
ఆగిపోయిన శారద, కోరిక తీరదని చిన్నబోయిన శారద, ఓడిపోయిన శారద ఆమెకు తెలియదు.
‘‘పెళ్ళి ఇష్టం లేక కాదు. అది ఇష్టపడినవాడు దానికి దక్కడు’’ ఈ వాస్తవం సుబ్బమ్మకు మింగుడు పడటం లేదు.
భర్తలేని లోటు ఎన్నడూ లేనంతగా మీదకు విరుచుకుపడిరది.
‘ఎవరితో చెప్పుకోవాలి? కూతురు తనతో చెప్పుకుంది. తను ఎవరితోనూ చెప్పుకోలేదు. ఆ రాత్రంతా సుబ్బమ్మకు కలత నిద్రయింది. ఏవో కలలు. కలలో అత్తగారు నరసమ్మ కనిపించింది.
ఆమె చిన్ని శారద తల నిమురుతూ ‘పెళ్ళయితే ఏమైందే? నిన్నూ చేసుకుంటాడు. నువ్వంటే ఇష్టమున్న వాడు పెళ్ళెందుకు చేసుకోడు? చేసుకో. పెళ్ళి చేసుకో’’ అంటున్నది.
సుబ్బమ్మకు మెలకువ వచ్చింది. అత్తగారుంటే ఈ పెళ్ళి జరిపించేదేమో ఆమెకు పెళ్ళయినవాడనే పట్టింపు ఉండేది కాదా?
ఈ ఆలోచనతో సుబ్బమ్మకు కూతురి మీద జాలి పొంగుకొచ్చింది.
‘పోనీ – రెండో పెళ్ళివాడని అంటారు. అంటే అంటారు. శారదను ఇంత దూరం ఇంత స్వేచ్చగా ఒదిలినందుకే ఎంతోమంది ఎన్నో అన్నారు. కానీ శారదను రోజూ చూస్తున్న తనకు ఎంత ఆనందంగా ఉంది? పిల్ల హాయిగా గలగలా నవ్వుతూ, ఎప్పుడూ పదిమందిలో మెప్పు పొందుతూ నాయకురాలిలా వెలిగిపోతుంటే గర్వంగా అనిపిస్తుందేగాని లోకుల మాటలు ఒక్క క్షణం కూడా గుర్తు రాలేదు. ఇప్పుడు కూడా మూర్తీ శారదా కళకళలాడుతూ ఇంట్లో తిరుగుతుంటే, ఇష్టమైనవాడితో శారద సుఖపడితే ఎవరేమనుకుంటే ఏమిటి?
రెండు రోజులు పాటు ఆమె మనసులో ఈ ఆలోచనలు కల్లోలం రేపాయి. ఎంత ఆలోచించినా శారద మూర్తిని పెళ్ళాడితేనే బాగుంటుందనిపించింది. ఒక రోజు కాదు పది రోజులు మధనపడి శారదతో ఆ మాటే చెప్పింది సుబ్బమ్మ.
తల్లి ఎలా ఆ నిర్ణయానికి వచ్చి ఉంటుందో ఒక్క క్షణంలో అర్థమైంది శారదకు. కూతురి సుఖం కోసం తనకు వ్యతిరేకమైన ఆలోచనని అనుకూలం చేసుకోటానికి తల్లి తనలో తను ఎంత సంఘర్షణ పడి ఉంటుందో అర్థమై శారద తల్లిని కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ ఉధృతం తగ్గాక ‘‘అమ్మా ` దీనిని గురించి ఆలోచించటం మానెయ్యి. నా మీద నమ్మకం ఉంచు’’. అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
తల్లిని పట్టించుకోవద్దన్నది గానీ మద్రాసు పట్టణంలో తన స్నేహితులు , తోటి కామ్రేడ్స్ అందరూ ఇదే ఆలోచిస్తున్నారని శారదకు క్రమంగా తెలిసి వచ్చింది.
***
ఒకవైపు కమ్యూనిస్టు పార్టీలో దత్ – బ్రాడ్లీ థీసీస్ గురించి తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. శారద కూడా నాగపూర్ కేంద్ర కమిటి సమావేశానికి హాజరై దత్ – బ్రాడ్లీ థీసిస్ని వివరించింది. శారద ఇంగ్లండ్లో పామీదత్ని కలుసుకుంది. ఈ విషయం గురించి చర్చించింది కూడా. ఆ ధీసిస్ సరైనదనే నిర్ణయానికొచ్చింది. కమ్యూనిస్టు మీద బ్రిటీష్ ప్రభుత్వం నిర్భంధం రోజురోజుకీ పెరుగుతోంది. ఏ పనైనా రహస్యంగా చేయాలి. శక్తి సామర్ద్యాలతో, ఆదర్శావేశాలతో రగులుతున్న యువతరానికి రహస్యంగా చేసే పని చాలటం లేదు. ఇంకేదో చెయ్యాలని రగిలిపోతున్నారు. అన్నిటికంటే ముఖ్యమైన పని ప్రజలలో బ్రిటీష్ సామ్రాజ్యవాదుల మీద వ్యతిరేకతను పెంచటం. ఆ పని కాంగ్రెస్ పార్టీ సరిగా చేయటం లేదని కమ్యూనిస్టుల అభిప్రాయం. ఐతే కాంగ్రెస్లో కొందరు ఆ పనిని చాలా బాగా చేస్తున్నారు. పైగా కమ్యూనిస్టుల్లా రహస్యంగాకాక బహిరంగంగా చేస్తున్నారు. అలాంటప్పుడు కమ్యూనిస్టులు కూడా కాంగ్రెస్లో చేరి ఆ పార్టీ పేరుతోనే తామనుకున్న పని బహిరంగంగా చేయవచ్చు. జాతీయ భావాలను మరింత వేగంగా ప్రజలలోకి తీసికెళ్ళవచ్చు. రైతుల సంఘాలనూ యువజన సంఘాలను కాంగ్రెస్ పార్టీ కింద నిర్మించటం తేలిక. ఆ పని చేస్తూ ఆ సంఘాలలో కమ్యూనిస్టు భావాలు వ్యాపింపచేయాలి. ఆ భావాల పట్ల అంకితభావం చూపినవారికి కమ్యూనిస్టుపార్టీ సభ్యత్వం ఇవ్వొచ్చు. అప్పుడు అందరి శక్తియుక్తులు వందశాతం ఉపయోగపడతాయి.
ఇది స్థూలంగా దత్ – బ్రాడ్లీ థీసిస్ సారాంశం. ఇంకా దేశ రాజకీయ ఆర్థిక వ్యవహారాల గురించి ఎంతో సమాచారం, విశ్లేషణ ఉన్నా కార్యక్రమానికి సంబంధించి ఈ పని ముఖ్యమైనది. శారద దీనికి తోటి కామ్రేడ్స్ ఆమోదం సంపాదించటంలో చురుకుగా పనిచేసింది. ఫలితంగా కమ్యూనిస్టులమనుకున్నవారంతా మళ్ళీ కాంగ్రెస్లో సభ్యులయ్యారు. ఆంధ్రప్రాంతంలో ఎక్కడికక్కడ రైతుల సమస్య మీద యువతీ యువకులను సమీకరిస్తున్నారు.
శారద ప్రాక్టీసు మొదలుపెట్టడం గురించి కూడా పార్టీ చర్చించింది. మద్రాసులో కంటే బెజవాడలో ప్రాక్టీసు పెడితే బాగుంటుందని యూత్ లీగ్ అభిప్రాయపడిరది.
ఇక్కడ చైతన్యమవుతున్న యువతీయువకులను శారద బాగా నడిపించగలుగుతుంది. డాక్టర్గా కూడా శారద అవసరం మద్రాసులో కంటే బెజవాడలో ఎక్కువ ఉంది అని వారి వాదన. ఆ వాదనలో నిజముంది గానీ దాని వెనక వేరే కారణం కూడా ఉంది. అది శారదకు తెలియదు.
శారద బెజవాడ వెళితే మూర్తికి దూరమైతే వారిద్దరిలో మార్పు రావొచ్చని యూత్ లీగ్ అనుకుంది. శారద గురించి నలుగురూ నాలుగు రకాుగా అనుకోవటం గురించి సుబ్బమ్మకు బాధ లేదు గానీ పార్టీకి చాలా బాధగా ఉంది. కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలు అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి గానీ వేలెత్తి చూపించుకోకూడదు అని వారి భావన. మద్రాసులోని రాజకీయ వర్గాలలో శారద, మూర్తి ప్రేమ రకరకాలుగా ప్రచారమవుతూ ఉంది. దానిని ఆపటానికి, పార్టీని ఆంధ్రప్రాంతంలో వృద్ధి చేయటానికీ శారద బెజవాడలో ప్రాక్టీసు పెట్టటమే మంచిదని అందరూ భావించారు. అందరూ ఏకగ్రీవంగా ఆ మాట చెప్పినపుడు శారద తోసిపుచ్చలేకపోయింది.
డాక్టర్ వృత్తికీ, కమ్యూనిస్టు పార్టీకీ జీవితం అంకితం చేయాలని ఆమె నిర్ణయించుకుంది. మూర్తి కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉండటం వల్ల తమ ప్రేమ పోతుందని ఆమె అనుకోలేదు. ఇంగ్లండ్లో ఉన్న రెండేళ్ళలో వారి ప్రేమ పెరిగిందే తప్ప తరగలేదు.
శారద ఉత్సాహంగా తల్లితో బెజవాడ మకాం మార్చాలని చెప్పింది. మద్రాసు ఒదిలి వెళ్ళటం సుబ్బమ్మగారికంత ఇష్టంగాలేదు.
‘ఇది పెద్ద పట్టణం. ఇక్కడ ఇంకొకరి గురించి పట్టించుకోవటం తక్కువ. ఆ బెజవాడలో శారద ఇమడగలదా? శారద మాట, నవ్వూ, నడక అన్నిటికీ వంకపెడతారు. శారదను ఏదో రకంగా ఇబ్బంది పెడతారు’. ఇదీ సుబ్బమ్మ సందేహం. ఆ సందేహాలన్నీ చెబితే శారద నవ్వేసింది.
‘‘అమ్మా ఆ వాతావరణాన్నంతా మార్చి ఇరుకు వీధులను విశాలం చేయానే నేను బెజవాడ వెళ్దామనుకుంటున్నా. నాలాటి వాళ్ళను వందమందినైనా తయారు చెయ్యాలిగదమ్మా. అక్కడ మన పార్టీవాళ్ళు చాలామంది ఉన్నారు. నా అవసరం ఉంది. నా గురించి భయపడకు. నన్నే సముద్రంలో పడేసినా హాయిగా ఈదుకుంటూ బైటపడతా ` ’’
‘‘సముద్రం గురించి భయం లేదు శారదా ` మురుక్కాలవ గురించే ` ’’
‘‘మురుక్కాలవలను బాగు చేసుకోవాలమ్మా. లేకపోతే ప్రజల ఆరోగ్యం చెడిపోతుంది. డాక్టరుగా ప్రజారోగ్యం నా బాధ్యత. బెజవాడ వెళ్ళాలమ్మా’’ శారద బెజవాడ వెళ్ళటం గురించి గట్టిగానే అనుకుంటోందని సుబ్బమ్మ ప్రయాణపు ఏర్పాట్లలో పడిరది.
మరో నెలలో శారద బెజవాడ ప్రయాణం ఉందనగా విశాల తన పెళ్ళి శుభలేఖలు తీసుకుని వచ్చింది. విశాల ముఖంలో అంత ఆనందం, తెరిపిదనం శారద ఎన్నడూ చూడలేదు. ఎప్పుడూ ఎవరి మీదో ఫిర్యాదు చెయ్యబోతున్నట్లుండే విశాల ముఖంలో ఏదో శాంతి ఆవరించినట్టుంది. ఎప్పుడూ తన జీవితం గురించిన అసంతృప్తితో అనంగీకారంతో బతికేది విశాల . ఆమె ఇలా సంతోషంగా ఉందంటే అదంతా పెళ్ళి మహత్యమేనా అని సూటిగా అడిగేసింది శారద. విశాల సిగ్గుపడుతూ, నవ్వుతూ పెళ్ళి వివరాలు చెప్పింది. గోపాల శాస్త్రి ప్రభుత్వోద్యోగమే. బ్రాహ్మణుడు. విశాల ను ప్రేమించాననీ పెళ్ళాడతాననీ తనంత తాను వచ్చి అడిగాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయిష్టంగానే ఒప్పుకున్నారు. గోపాల శాస్త్రే ఒప్పించాడు. ఐతే వాళ్ళు ఒక షరతు పెట్టారు. విశాల ను గోపాలం వాళ్ళ మేనమామ దత్తత తీసుకుంటాడు. వాళ్ళే విశాల తల్లిదండ్రుగా వివాహం జరిపిస్తారు. విశాల తన తల్లితో సంబంధాలు పూర్తిగా ఒదిలేసుకోవాలి. విశాల చెప్తూంటేనే శారదకు కోపం వచ్చింది.
‘‘దీనికి నువ్వెలా ఒప్పుకున్నావు? ఎంత దారుణం. వాళ్ళకెంత ధైర్యం’’ శారద ఆవేశపడుతుంటే విశాల ఆశ్చర్యపోయింది.
‘‘నీకెందుకే అంత కోపం? ` నా కులం , మా అమ్మ కులవృత్తిలో ఉండటం, నాటకాలు వేయటం నాకే ఇష్టం లేదు. వాళ్ళెలా సహిస్తారు? ఎలా ఒప్పుకుంటారు. వాళ్ళడిగినదానిలో తప్పేముంది? నేను ఎమ్మేలో చేరిన దగ్గరనుంచి మా అమ్మ నుంచి దూరంగానే ఉంటున్నాను. ఇప్పుడు నేను కొత్తగా మా అమ్మకు దూరమయ్యానని అనటానికేమీ లేదు. బాధపడటానికంతకంటే ఏమీ లేదు’’.
‘‘మీ అమ్మ నిన్నెంత ప్రేమగా పెంచిందే. చదివించింది. నీ సాధింపులన్నీ భరించింది. కాల్చుకు కు తిన్నావు గదే ఆమెను. ఆమెను ఒదిలెయ్యటం అన్యాయం. ముసలితనంలో ఆమెకు దిక్కెవరే ` ’’ కోటేశ్వరిని తల్చుకుంటే శారదకు దు:ఖం వచ్చింది.
‘‘ఉందిగా – ఆ రాజ్యం ` మా పిన్ని కూతురు ` మా పిన్ని, ఆమె కూతురు మా అమ్మని అతుక్కుపోయారు. రాజ్యాన్ని నాటకాల్లోకి దించారు. ఇప్పుడు మా అమ్మకు నాకంటే రాజ్యమే ఎక్కువ. మా అమ్మకు బతకటం తెలుసులే’’ అంది విశాల గొంతు ఇంత చేసి.
‘‘నా పెళ్ళికి తప్పకుండా రావాలి. మీ అమ్మగారిని కూడా తీసుకురా’’ విశాల ఉత్సాహం చూస్తే శారదకు ఏవగింపు పుట్టుకొచ్చింది.
‘నే రాను నీ పెళ్ళికి’ అని తెగేసి చెప్పాలనిపించింది.
తల్లిని గౌరవంగా చూడనవసరం లేదని, దూరంగా ఉంచాలని విశాలకు ఏ చదువు నేర్పించింది? ఈమెకు ఏ సంస్కారం అబ్బింది? ఇదేం ఆధునికత? సంస్కర్తలు నేర్పించిన సంస్కారం ఫలితమా? తన కులాన్ని ద్వేషించే సంస్కారం, తల్లిని ఒదులు కునే తత్త్వం ఎలా అబ్బాయి విశాలకు ?
శారద మనసులో ఎన్నో ప్రశ్నలు . అన్య మనస్కంగానే విశాలను తల్లి దగ్గరకు తీసికెళ్ళింది. సుబ్బమ్మ విశాల నోరు తీపి చేసింది. విశాల పెళ్ళికి వెళ్ళకూడదనుకుంది శారద.
రెండురోజుల తర్వాత ట్రిప్లికేను మీదుగా వస్తుంటే శారదకు కోటేశ్వరిని చూడానిపించింది.
అక్కడికి వాళ్ళిల్లు దగ్గరే. కూతురు చేస్తున్న పనితో ఆమె ఏమైందో అనుకుంటూ వెళ్ళింది.
కోటేశ్వరిని చూడగానే అర్థమైంది, విశాల ఆమెను ఎంత దెబ్బ కొట్టిందో.
‘‘తెలిసిందామ్మా ? మన విశాల పెళ్ళి చేసుకుంటోంది’’ అంది కళ్ళనీళ్ళతో. కూతురి పెళ్ళి వార్తను కన్నీళ్ళతో చెప్పాల్సిన పరిస్థితికి సిగ్గుపడుతూ, వెంటనే ఆ కన్నీళ్ళు తుడిచేసుకుంది.
‘‘తెలిసిందమ్మా. తను చేసిన పని నాకేం నచ్చలేదు. వాళ్ళు కూడా తల్లితో సంబంధం ఉండకూడదనటం…’’
‘‘వాళ్ళంటారమ్మా ` వాళ్ళు పెద్దకులం వాళ్ళు’’
‘‘కానీ గౌరవం, గౌరవం అని ఏడుస్తుంటే విశాల బుద్ధేమయింది? తనను వాళ్ళు అవమానిస్తున్నారని దానికి అర్థం కావొద్దూ’’.
‘‘అయ్యో రాత ` మొదట్నించీ దానికీ నాకూ అదేగా తగాదా. పోన్లేమ్మా అది సుఖంగా ఉంటే అంతే చాలు . ఇప్పుడు మాత్రం నాతో ఉంటుందా పెడతందా? మూడునేల్లకోసారి ముఖం చూపించేది. ఇక అదీ ఉండదు. దేవుడు నాకింకో బిడ్డ నిచ్చాడమ్మా. మా రాజ్యం నేనంటే ప్రాణాలు ఇడుస్తుంది. అమ్మాయ్ – రాజ్యం’’ అని పిల వగానే వచ్చింది పదహారేళ్ళు నిండిన రాజ్యం.
శారద నివ్వెరపోయి కన్నార్పకుండా కాసేపు చూసి తేరుకుంది. రాజ్యం ఎదురుగా ఉంటే ఆ పిల్ల మీద నుంచి కళ్ళు తిప్పుకోవటం కష్టం. ఇంతింత కళ్ళు. పచ్చని, పల్చని శరీరం. మంచి ఎత్తు. బంగారు బొమ్మ అంటే ఇలా ఉంటుందనిపించింది.
శారద అతికష్టం మీద ఆ పిల్ల మీద నుంచి చూపు మరల్చుకుని కోటేశ్వరిని చూస్తూ.
‘‘చదివిస్తున్నావా అమ్మా’’ అని అడిగింది.
‘‘ఐదు వరకూ చదివిందమ్మా. ఇప్పుడు ఒక పంతులు గారొచ్చి తెలుగు వాక్యాలు చదివిస్తున్నారు. సంగీతం కూడా నేర్చుకుంటోంది’’.
‘‘ఇంగ్లీషు కూడా నేర్చుకో’’ అంది శారద మళ్ళీ రాజ్యం మాయలో పడుతూ.
‘‘నేర్పిస్తానమ్మా, ముందు ఆ పద్యాలు , పాటలు వస్తే నాటకాల్లో రాణిస్తది. ఆ తర్వాత ఇంగ్లీషు, లెక్కలూ చెప్పిస్తే లోకంలో నెగ్గుకొస్తది. విశాల లాగా దీన్ని కాలేజీ చదువుకు పంపించే ఉద్దేశం మటుకు లేదు’’ అంది కోటేశ్వరి కచ్చితంగా.
శారదకు ఫల హారం పెట్టి కాఫీ ఇచ్చి మర్యాద చేసింది.
‘‘విశాల పెళ్ళికి వెళ్ళాలని లేదమ్మా. నేను వెళ్ళను’’ అంది శారద.
‘‘అయ్యో. అట్టా చెయ్యమాకమ్మా. నీ మీదే ఆశపెట్టుకున్నాను. ఈ పిల్లకు బొత్తిగా ఎవరూ లేరు, ఏ అండా లేదు అనుకుంటే వాళ్ళు దానిని మరీ లోకువ చేస్తారమ్మా. నువ్వు, మీ అమ్మా, ఇంకా నీ స్నేహితులు గొప్పవాళ్ళెవరన్నా ఉంటే వాళ్ళను కూడా తీసుకెళ్ళమ్మా. అత్తగారింట్లో దానికి గౌరవం ఉండాలిగా’’ కోటేశ్వరి తెలివికి శారద ఆశ్చర్యపోయింది. తనను వెలివేసిన కూతురి క్షేమం గురించి ముందు చూపుతో ఆలోచించే ఆ తల్లికి నమస్కారం చేసి, పెళ్ళికి వెళ్తానని వాగ్దానం చేసి ఇంటికి వచ్చింది. ఏదన్నా ఒక పని మంచిదనుకుంటే అది పూర్తిగా చేసేంతవరకూ శారదకు నిద్రపట్టదు.
తనతోపాటు కొందరు కాంగ్రెస్ పెద్దల్ని కూడా తీసుకెళ్ళాలనుకుంది. విశాలకు కాంగ్రెస్ పెద్దలు బాగా దగ్గరివాళ్ళనే అభిప్రాయం కలిగించాలనుకుంది. ఒక్కొక్కరి ఇంటికీ వెళ్ళి వాళ్ళకు సమస్య వివరించి చెప్పి ఒక్క గంట సేపు తన స్నేహితురాలి పెళ్ళికి రమ్మని అడిగింది. శారద అడిగిన తీరుకి అందరూ ఒప్పుకున్నారు.
పెళ్ళిలో విశాల తరపున వచ్చి నిలబడిన వాళ్ళని చూసి విశాలే విస్తుపోయింది. విశాల మామగారి బంధువులంతా తలకిందుయ్యారు. వాళ్ళు మిగిలిన పనులు పక్కన బెట్టి కాంగ్రెస్ పెద్దలకు, అందునా బ్రాహ్మణ పెద్దలకు ఉపచారాలు చేస్తూ ఉండిపోయారు.
విశాల పక్కన ఎవరూ లేని సమయం చూసి శారదకు కృతజ్ఞతలు చెప్పింది. తనమీద శారదకున్న ప్రేమ మర్చిపోలేనంది.
‘‘పిచ్చిదానా. ఈ ఆలోచన నా బుర్రలో పుట్టలేదు. నేనసలు నీ పెళ్ళికి రావొద్దనుకున్నాను. మీ అమ్మ చెప్పింది ఇట్లా చేస్తే అత్త గారింట్లో నీ గౌరవం పెరుగుతుందని చెప్పింది. మీ అమ్మ బతిమాలి నా చేత ఈపని చేయించింది.’’
విశాల ముఖం పాలిపోయింది.
‘విశాలా మీ అమ్మకు నువ్వు లేవు గానీ నీకు మీ అమ్మ ఉంది. అది మర్చిపోకు. ఎప్పుడైనా అవసరమైత మీ అమ్మ దగ్గరకు సందేహం లేకుండా వెళ్ళు.’
శారద మాటలకు విశాల ముఖం మాడిపోయింది.
ఇంతలో ఎవరో వచ్చి పెళ్ళి కూతురు కావాలంటూ తీసుకుపోయారు. శారద పెళ్ళింట్లో భోజనం చేయకుండా వెళ్దామనుకుంది గానీ సుబ్బమ్మ అలా కుదరదంది. అక్కడ ఆవిడ దూరపు బంధువులెవరో కన్పించారు కూడా.
సాయంత్రం ఇదంతా మూర్తితో చెప్పి నవ్వుకుని సేద దీరింది శారద.
***