మంజువాణి: ఒక వేశ్య
కొండిభొట్లు: తార్పుడుగాడు
భీమారావు పంతులు: విటుడు
(మంజువాణి తలదువ్వుకుంటూ కుర్చీపైని కూర్చుండును. కొండిభొట్లు ప్రవేశించును)
మంజు: దండం శాస్తుల్లు గార్కి. వెంకీ, శాస్తుల్లు గార్ని కూర్చోబెట్టి పీట వెయ్యే!
కొండి: సకలైశ్వర్య సిద్ధిరస్తు. పంతుళవారు పాదాక్రాంతాభవంతు….. ఆ తలవెండ్రుకలు సాక్షాత్తూ చమరీవాలాల్లాగా శోభిల్లుచున్నాయి. విన్నావా మంజువాణీ!
మంజు: ఇంకా యేవి యెలా వున్నాయి?
కొండి: యెదిన్ని వర్నించడానికి సెఖ్యం కాకుండా వున్నాయి… ముఖం చంద్రబింబంలా వున్నది. కళ్ళు కలవరేకుల్లా వున్నయి. గళం శంఖంలా వున్నది. బాహువులు లతల్లా వున్నయి. మరెవచ్చీ….
మంజు: మరెవచ్చి అక్కడ ఆగండి.
కొండి: మంజువాణీ! అధికం యేల? నీ సౌందర్యం రంభా ఊర్వశీ మేనకా తిలోత్తమాదుల్ను ధిక్కరించి వెక్కిరించి యున్నది.
మంజు: మాపంతులుగారి వెధవ అప్పగారి సాటి యేమాత్రమయ్నా వస్తుందా?
కొండి: హాశ్యానికైనా అనగూడని మాటలున్నాయి. (పొడుం పీల్చును)
మంజు: చెయ్యగాలేంది చెప్పడమా తప్పొచ్చింది?
కొండి: దేవతలు చేసే పనుల్ని, బ్రాహ్మలు చేసే పనుల్ని తప్పు పట్టకూడదు. స్వర్గంలో వాళ్ళు దేముళ్ళయితే, భూలోకంలో మేం దేముళ్ళము; అంచేతనే మమ్మల్ని భూసురులంటారు. చదువుకున్నదానివి నీకు తెలియందేమున్నది.
మంజు: వెధవల్ని తరింపజేసే భూసురోత్తములకు నమస్కారము (నిలుచుని నుదుట చేతులు మొగిడ్చి నమస్కారము చేయును) (భీమారావుపంతులు ప్రవేశించును)
భీమా: యేమిటీ నాటకం?
మంజు: ముక్కోటి దేవతలు స్వర్గంలో వుంటే, భూమ్మీద దేవతలు బ్రాహ్మణులని కొండిభొట్లు గారు శలవిచ్చారు. అందుచేత వేశ్య యింటికి అనుగ్రహించి వేంచేస్ని భూసురోత్తముల్ని కొలుస్తున్నాను.
భీమా: నీవు యెంత యెకసెక్యం చేసినా మేం దేవతలమే, అందుకు రవ్వంతైనా సందేహము లేదు.
మంజు: భూలోకంలో కృష్ణావతారం లాంటి రసికులు మీరు. కృష్ణావతారం కుదిరింది; కాని శాస్తుల్లు గారు యే దేముడి అవతారమో పోల్చలేకుండా వున్నాను.
భీమా: పట్టణం వెళ్ళినప్పుడు నేను పరంగీ స్త్రీల సహవాసం చేశానని నీకు చాడీలు చెప్పారు గనుక శాస్తుల్లు గారు సాక్షాత్తూ నారదావతారం.
మంజు: అన్నా! మరచిపోయినాను. యెంత బుద్ధి తక్కువ మనిషిని; దూరముగా నిలుచొండి. ప్రాయచ్చిత్తం చేసుకొంటేనేగాని దగ్గరకు రానియ్యను.
భీమా: శాస్త్రుల్లుగారూ! యేమిటండి ప్రాయచ్చిత్తం? నకక్షతమా, దంతక్షతమా?
కొండి: అది యెంత అదృష్టవంతులకుగాని సంప్రాప్తమవుతుంది. ముక్కుతిమ్మన్న యేమన్నాడు.
నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కిన్కబూని తా
చిన అదినాకు మన్ననయ; చెల్వగు నీ పద పల్లవంబు మ
త్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నే
ననియెద; అల్క మానవు గదా యికనైన అరాళకుంతలా
స్వేతముఖులు గనుక బ్రాహ్మడికి రజతదానం చేస్తే ప్రత్యువాయం పోతుంది. మాకుర్రవాడు మెటిక్లేషను పరీక్షకు కట్టాలి. యీబీదబ్రాహ్మడికి దానం యిస్తే సమయానికి పనికి వస్తుంది.
మంజు: నిత్య సువాసినికి సువర్నదానం చెయ్యమని లేదా?
భీమా: (తనలో) దీని తస్సాగొయ్యా! బంగారపు సరకును మళ్ళీ తెమ్మంటుంది కాబోలు. (పైకి) తొందరపని వుంది. యిప్పుడే వెళ్ళి వస్తాను. (వెళ్లిపోవును)
కొండి: మంజువాణి! బహు పుణ్యాత్మురాలివి, యేమైనా సాయం చేస్తేనే గాని కుర్రవాడు పరీక్షకు వెళ్ళే సాధనం కనబడదు.
మంజు: పంతులుగారి అప్పని అడుగరాదా?
కొండి: యెవర్నీ అడక్కుండా యేమయింది. వైదీకపాళ్ళని పుట్టించినప్పుడే బ్రహ్మ రాసిపడేశాడు. “ముష్టెత్తుకొండర్రా” అని.
మంజు: యేది యిందాకటి పద్యం చదవండీ.
కొండి: (రాగవరసను చదువును) నను భవదీయ…. (అలా చదువుతుండగా వెనకవైపు వచ్చి మంజువాణి శాస్తులు వీపు మీద తన్నును) ఓస్నీ అమ్మా శిఖా… (అని, తగ్గి) ఆహా! మల్లిపువ్వుల గుత్తా? పట్టుకుచ్చా? మలయమారుతమా వీపు తాకినది?
మంజు: సానిదాని కాలు.
కొండి: కాదు, కాదు, మన్మథుని వాడి వాలు.
మంజు: ప్రాస కుదిరింది కాని, శాస్తుల్లు గారు! యీ తాపు మదనశాస్త్రంలో క్రియక్రింద పరిగణన మవుతుందా, భూసురోత్తములను తన్నిన పాపం క్రింద పరిగణనమవుతుందా?
కొండి: పదిరూపాయలు పారేస్తే పుణ్యం కింద పరిణామం అవుతుంది.
మంజు: పాటుపడక పైసా రాదు.
కొండి: మంజువాణి! యెంత చదువుకున్నా మావంటి వాళ్ళం నీకు వక్క మాటకు సదుత్తరం చెప్పగలమా? బాపనాళ్ళని కనికరించి, ఒక డబ్బు సొమ్ము యివ్వాలి గాని.
మంజు: వేశ్యల ద్రవ్యం పాపిష్టిది. బేరం తెచ్చి రుసుం పుచ్చుకుంటే ప్రత్యువాయువుండదు.
కొండి: యీ వూళ్ళో నానాటికి రసికత సన్నగిల్లుతూన్నది. “అంధునకు గొరయ వెన్నెల” అన్నట్టు యీ వూళ్ళో మూర్ఖులకు నీ రూపలావణ్య విలాస విశేషములు అగ్రాహ్యములు. తోవంట పోయే పొన్నూరు వాళ్ళను కాచి పట్టుకోవాలి.
మంజు: పది డబ్బులు రాల్చగలిగే వాళ్ళను యెంచి మరీ పట్టుకురండి.
*
Ha missed reading your lines . finally !
రియల్లీ గ్రేట్
ఏ తప్పుకయునా డబ్బు చెల్లేస్తే సరిపోతుంది అనే ట్రైబల్ప్ సమప్రదయానికి దీనికి ఏమీ తేడా లేదు