లక్ష్మణ్ ఆదిమూలం
నదీ పరివాహక ప్రాంతాలలోనే నాగరికత అభివృద్ది చెందుతాయి . నాగరికత ఉన్న చోటనే సాహిత్యం పుడుతుంది . నదికి సాహిత్యానికి అవినాభావ సంబంధం ఉంది . . దక్షిణ భారత దేశంలోనే అతి పెద్ద నది గోదావరి . ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు సాహిత్యంలో గోదావరి పయనాన్ని , తీర ప్రాంతాలలోని దేవాలయాలను వర్ణిస్తూ సాగిన సాహిత్యం అపారం.
ఆధునిక కాలంలో వచ్చిన దృక్పదంలో కవిత్వంలో మార్పు వచ్చింది . సాహిత్యంలో కొత్త కోణం వెలుగులోనికి రావడం జరిగింది . అటువంటి కవిత్వం లోని రెండు కోణాలు ఎండ్లూరి సుధాకర్ రావు గోదావరి నది పై రాసిన కవిత్వంలో కన్పిస్తాయి . ఒక ప్రక్క గోదావరి అందాలను , గోదావరితో తనకు ఉన్న అనుబంధాన్ని కవిత్వీకరిస్తూనే , మరొక వైపు గోదావరి గుండె ఆవేదనను ఆవిష్కరించారు ఎండ్లూరి సుధాకర్ .
గ్రీష్మ కాలంలో గోదావరి స్వరూపాన్ని , ఎండిపోతున్న గోదావరిని చూసిన రచయిత తన గుండెలోని బాధని వ్యక్తం చేసాడు …
“నాన్న కొట్టినప్పుడు /ఒక మూల ముడుచుకొని
పడుకున్న అమ్మలా ఉంటుంది …
ఎండాకాలపు గోదావరి /నీటి కొవ్వు కరిగిపోతూ
పలచబడుతున్న జలచర్మంతో /ఎనీమియా పేషెంటులా ఎంతో జాలిగొలుపుతుంది “
గోదావరి నది చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యం , అందాలను వర్ణించడం , వాటిని చూసి మురిసిపోవడమే కాదు మరో కోణాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు రచయిత “ఒక సాయంత్రం గోదావరి “ అనే కవిత లో ….
“గోదావరికే గొంతుంటే / జల భాషలో శతాబ్దాల గుడిసె కథలు చెప్పేది /
సాయంత్రం షిఖారులో / గోదావరి మనోహరిలా కాదు /గొప్ప భారాన్ని దాచుకున్న తల్లిలా కనిపిస్తుంది “.
నాకు ఈ జన్మ నిచ్చిన తల్లిదండ్రుల ఆప్యాయతలను , అనురాగాలను స్మరణకు తెచ్చావు అంటూ “నువ్వు అమ్మా నాన్నవే గోదావరి” అనే కవిత లో “ నా బాల్య జ్ఞాపకాల అంతర్ ఝరీ !!/ ణీ ఒడ్డు ఒడిలో తలపెట్టుకున్నప్పుడు /అమ్మ దగ్గిర వున్నట్టుంటుంది ,ణీ ఇసుక మేనిపై పోర్లాడుతున్నప్పుడు /నాన్న గుండెల మీద ఆడుకుంటున్నట్లే వుంటుంది / నువ్వు అమ్మా నాన్నవే గోదావరి ! “
ఒకవైపు గోదావరిని ప్రత్యక్ష దేవతగా కొలిచే వారే ఆ నదీ గోదావరిని కలుషితం కావడానికి కారణం అవుతుంటే చూసి భరించలేని కవి ఆవేదన కవిత్వ రూపంలో కన్పిస్తుంది . పరిశుభ్రత పాటించాలని వచ్చిన కవితలు ఉన్నాయి .
భారతదేశంలో ముఖ్యమైన పన్నెండు నదులకు ఒక్కొక నదికి ఒక సంవత్సరానికి పుష్కరాలు జరుగుతాయి . ఆ సమయంలో నదులు ఎలా కాలుష్యానికి గురి అవుతున్నాయో రచయిత గత గోదావరి పుష్కరాల సమయంలో వెలువరించిన పుష్కర కవితలు ఈ కోణం నుంచి ఆలోచించి వచ్చిన కవితలే ….
గోదావరి పుష్కరాలకు వచ్చే లక్షల యాత్రికులు శుభ్రత పాటించక పోవడం వల్ల గోదావరి ఎంతగా కలుషితం అయ్యిందో , గోదావరి పుష్కరాల తర్వాత గోదావరిని చూసిన కవి ఆవేదన ఇలా వ్యక్తీకరించారు .
“పుష్పాలు రాలిపోయిన కొమ్మల్లా /పుష్కరాల తర్వాత /రాత్రిపూట గోదావరి
రహస్యంగా దగ్గడం గమనించాను /దుర్భరమైన దుర్వాసనలో
మూగతల్లి ముఖం మీద /మురికి టీగలు వాలడం పసిగట్టాను
గోదావరి నీటినాడి పట్టుకుంటే తెలిసింది/ఆమె పుష్కర జ్వరంతో బాధపడుతోందని “………కలుషితంగా మారుతున్న ఆ గోదావరమ్మ నీటికి నిలువెత్తు సాక్ష్యం ఈ ఖండిక .
పుష్కరాల సమయంలో గోదావరి కలుషితం కావడం వలన స్నానానికి వచ్చే యాత్రికుల ఇబ్బందులను గుర్తు చేస్తారు రచయిత ఈ కింది ఖండికలో …
“యాత్రికులకు గమనిక …పుష్కర స్నానాలయ్యాక
ఏ డెట్టాలు తోనో మళ్లీ ఒళ్లు కడుక్కోండి
ఎంత ధర్మ వుఆదుల వారికైనా
చర్మ వ్యాధులు రాకమానవు
అద్దర్లో మినిగినా …ఇద్దర్లో మినిగిగా …దద్దుర్లు తప్పవు “.
పుష్కరాలు అంటే అందరికి గుర్తుకు వచ్చేది రాజమండ్రి ,కొవ్వూరు , బాసర , ధర్మపురి ,కోటిపల్లి ఇలా ప్రసిద్ధ మైన ప్రదేశాలు అందరు అక్కడే స్నానాలు ఆచరించి గోదావరిని మురికి చేయకండి , ఇలా చూడండి ప్రకృతి ఒడిలోని గోదావరమ్మ ను అంటూ పాపికొండల మధ్య ఉన్న గోదావరిని స్పురణకు తెస్తాడు రచయిత
“పుష్కర యాత్రికులారా /మురికి రేవుల్లో ఏం మునుగుతారు ?
/అలల నగల ధగధగల /గిరిజన ప్రకృతి గోదావరి
/పాపికొండల నడుమ /పసుపు పూలదండలు దాల్చి
/అమ్మవారిలా కనబడుతుంది /ఆమెను చూసిరండి
అనుభూతి పుణ్యం లభిస్తుంది”.
అందుకే భక్తుడు కానీయండి , సగటు మనిషి కానీయండి గోదావరి కలుషితం కావడానికి కారణం అయ్యామని మమ్మల్ని క్షమించమని ఆర్తిగా అర్దిస్తాడు ఈ క్రింది ఖండికలో ఎండ్లూరి
“తల్లీ గోదావరి /మేము జలహంత కులం
మాది విషవింత కులం /నీ అందాల
జల మంగళ సూత్రాలను /మలమూత్రాలతో అపవిత్రం చేశాం
పాపాత్ములమూ /అమ్మ వొడిని పాడు చేసే పసిపాపలము
మన్నించవమ్మా /పుష్కర పునీత మాతా !”
గోదావరి గొప్పతనాన్ని కీర్తిస్తూ గడిపేయడమే కాదు , కలుషితమై పోతున్న గోదావరిని నిర్మలంగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని ,అందరు నడుం కట్టి పరిశుభ్రం చేయాలని పుష్కరాల తరవాత చేయావల్సిన కర్తవ్యాన్ని ఉపదేశిస్తాడు రచయిత ఈ ఖండికలో …
“గోదావరి /మురికి నీటి అద్దంలో
ముందు ముందు /ఎవరి ముఖాలూ కనబడవు
రండి నడుం కడదాం !/గోదావరి మురికి ముఖం కడుగుదాం !
శాస్త్రాలతో కాదు /శాస్త్రీయంగా /శాశ్వతంగా . . .
ఈ విధంగా గోదావరి నదీ ప్రస్థానం ఎంతటి వైశిష్ట్యాన్ని పొందిందో , సాహిత్యంలోను గోదావరి కవిత్వ రూపంలోనూ అంతే ప్రాచుర్యం సంపాదించుకుంది . మరీ ముఖ్యంగా పుష్కర సమయంలో గోదావరి నది కలుషితం అవుతుందో ఈ కవిత్వం నిదర్శనం . సగటు మనిషికి అనుభూతిని కలిగించడంలోను ,వాస్తవాలను ప్రబోధించడమే నేటి కవిత్వం యొక్క ఉద్దేశ్యం వాటితో పాటు గోదావరి వ్యధను ప్రతి వ్యక్తి ఆలోచించేలా చేస్తుంది ఎండ్లూరి కవిత్వం .
*
మీరు రాసిన వ్యాసం చాలా బాగుంది . ప్రముఖ కవి ఎండ్లూరి సుధాకర్ గారి గోదావరి కవిత్వం నిజంగా అక్షర సత్యం . కవిత్వం లోని ఆ రెండో కోణమే సగటు మనిషికి కావాల్సింది . లక్ష్మణ్ మీకు ధన్యవాదాలు .