సుదూరాలకు వ్యాపించి ఉంది.దాదాపుగా నిండు జీవితమని పిలుచుకోగలిగినన్నాళ్ళూ జీవించిన తను ఈ రోజు మన మధ్య లేడని , ఇక భౌతికంగా తన పలకరింపు, నింపాదితనంతో కూడిన తన చిరునవ్వు ఇక ఉండబోవని అనుకోవడం తీరని దుఃఖాన్ని కలిగిస్తుంది.బహుశా కొన్ని సార్లు మరణం కూడా ఒక సందర్భంగా మన మధ్య వచ్చి నిలబడుతుంది కాబోలు. పుట్టుక లాగే మరణం కూడా అతి సహజంగా భావించి , దాని గురించి ఏనాడూ ఇసుమంత జంకు కూడా ప్రదర్శించని వ్యక్తి మరణం గురించి ఈనాడు దుఃఖించడం వెనుక ఆయన బతికిన రోజుల నిండుదనమే ఉంది.
వయసు రీత్యా ఆయన విరసంలో ఎంత పెద్దవాడో చురుకుదనంలోనూ, కలగొలుపుదనంలోనూ అంత బాలకుడు. ఉమ్మడి కమ్యునిష్టు ఉద్యమం నుండి నక్సల్బరీ- మావోయిష్టు ఉద్యమాల దాకా ఎంతో విస్తృతమైన ఆచరణ, అనుభవం ఉన్న తనను, అన్ని విధాల అల్పులమైన మేము ఏక వచన ప్రయోగం చేసినా, చిన్నా పెద్దా తేడా లేకుండా సి.పి. అని సంబోధించినా అది ఆయన మా మీద చూపించిన ప్రేమ వల్లే సాధ్యమైంది. కొత్తగా సాహిత్య, సాంస్కృతిక వాతావరణంలోకి వచ్చిన మాబోటి వాళ్ళతో ఆయన భుజాల మీద చేతులు వేసి నడిచేవాడు. బాబూ అని పిలుస్తుండేవాడు.
ఇప్పుడు – చలసాని గురించి తారీకులూ గట్రా వివరాలు లేకుండా, కేవలం చెదురు మదురు ఙ్ఞాపకాల మీద ఆధార పడి ఆయన గురించి తలపోస్తున్నప్పుడు
దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉండే ఆయన రచనా విధానమే గుర్తుకొస్తున్నది. సి.పి ఏది రాసినా దాని పుట్టుపూర్వోత్తరాల ప్రస్తావన లేకుండా ఉండదు. వ్యక్తులను ప్రస్తావించినా, సంఘటనల గురించి రాసినా దేశ కాలాలను తప్పకుండా ప్రస్తావించేవాడు. ఇట్లా సవివరంగా రాసేందుకు ఆయన మేధ సదా సంసిద్ధంగా ఉండేది. ఈ శక్తితోనే ఆయన కృష్ణాబాయిగారితో కలిసి శ్రీశ్రీ , కోకుల సమగ్ర సంపుటాలను పాఠకుల ముందుకు తేగలిగాడు.
అయితే ఆయన చివరి దశకాల్లో వయసు రీత్యా ఈ శక్తి కొద్దికొద్దిగా మందగిస్తూ వచ్చింది. విరసం మహాసభల్లోనూ, సాహిత్య పాఠశాలల్లోనూ విరసం పతాక గీతం
“ఎత్తినాం విరసం జెండా” పాటతో కార్యక్రమాలను ప్రారంభించడం ఆనవాయితీ. ఈ పాటను ఎప్పుడూ చలసానే పాడేవాడు. లయబద్ధంగా ఆయన పాడుతుంటే మిగిలిన వాళ్ళు
ఆయనను అనుసరించేవాళ్ళు. అయితే ఒకసారి విశాఖపట్నంలో జరిగిన సభల్లో అనుకుంటాను. పాటలోని ఒక చరణంలో కొన్ని పాదాల దగ్గర ఆయన తడబడ్డాడు. ఆ
తర్వాత వెంటనే సరి దిద్దుకున్నా, పతాకావిష్కరణ కార్యక్రమం అయిపోగానే ఆయన తన ఙ్ఞాపక శక్తిని పరీక్షించుకోవడం కోసం, సీరియస్గా కలం, కాగితం
తీసుకొని పతాక గీతాన్ని మొదటి పాదం నుండి చివరి దాకా తడబాటూ లేకుండా రాసి చూసుకొని సంతృప్తి పడ్డాడు.
మాటల సందర్భంలో ఏదైనా కవిత్వమో, కతో, నవలో, విమర్శో చర్చకు వచ్చినప్పుడు, వాటికి సంబంధించిన వాచకంలోని పంక్తులూ, విడి భాగాలనూ ఆయన
స్పష్టంగా, ఖచ్చితంగా గుర్తు పట్టేవాడు. అవసరమైతే వాటిని నిర్ధారించుకోవడం కోసం వాటి గురించి తెలిసి ఉంటుందనుకున్న వ్యక్తులతో వెంటనే ఫోన్ ద్వారాగానీ, ఉత్తరం ద్వారా గానీ సంప్రదించి నిర్ధారణ చేసుకొనేవాడు. నికోలాయ్ ఓస్త్రావ్స్కీ- కాకలు తీరిన యోధులు నవలలోని కొన్ని పంక్తులను నిర్ధారించుకోవడం కోసం ఆయన నాకు ఓసారి ఇలాగే ఉత్తరం రాసాడు.
వ్యక్తిగతమైన పనులు, ఇష్టాలు, ఇతరేతరాలూ ఎన్ని ఉన్నా ఉద్యమావసరాలే ఆయనకు ప్రథమ ప్రాధాన్యం. ఒకసారి అరుణతార పనుల మీద నేను రెండు రోజుల పాటు
విజయవాడలో ఉండాల్సొచ్చింది. ఇతర పనుల మీద ఆయన కూడా సరిగ్గా అప్పుడే విజయవాడకు వచ్చాడు. అక్కడ నేనున్నానని తెలుసుకొని, తన పనులు త్వరత్వరగా
ముగించుకొని నాకు తోడుగా ఉండడం కోసం మిగిలిన సమయం అంతా ఆ రెండు రోజుల పాటూ ప్రెస్లోనే గడిపాడు.
తొంభై ఐదు తర్వాత విరసంలో సభ్యులుగా చేరిన మాకు ఒక వైపు విప్లవోద్యమాన్ని సమర్ధిస్తూనే, మరో వైపు వివిధ అస్తిత్వ ధోరణులనూ, సామాజిక మార్పులనూ సమన్వయం చేసుకోవడంలో సందేహాలు కలుగుతుండేవి. ఇట్లాంటి సందర్భాల్లో ఏ రకమైన జంకూగొంకూ లేకుండా మాటాడుకునేందుకు చలసానిని మించిన మనిషి మరొకరు ఉన్నట్టుగా మాకు అనిపించలేదు. చర్చించడానికీ, అభిప్రాయాలను వ్యక్తపరచడానికీ, అవి ఎలాంటి స్వరంతో ఉన్నా చలసాని సదా ఆహ్వానించేవాడు.
వ్యక్తుల అభిప్రాయాలనూ, అనుభవాలనూ, పరిమితులనూ గౌరవిస్తూనే, అవసరమైనప్పుడు వాటిని విబేధించేవాడు. అది కూడా మనుషులు తమ పట్ల ఎలాంటి
సున్నితత్వాన్ని కోరుకుంటారో, అదే సున్నితత్వంతో తన అభిప్రాయలను చెప్పేవాడు. భిన్నాభిప్రాయాలను ప్రకటించినందుకో, తీవ్ర స్వరంతో
విమర్శించినందుకో, వ్యక్తిగతమైన పరిమితులు, బలహీనతల కారణంగా, ఆయన- మనుషులను పక్కన పెట్టినట్టుగా నేనెప్పుడూ వినలేదు.
ఇట్టాంటి జీవితం వల్లనే ఆయన పరిచయాలు, మానవసంబంధాలు కళ్ళూ చెదిరేంత విస్తృతంగా మారి ఉంటాయి. ఉమ్మడి కమ్యునిష్టు ఉద్యమం మొదలుకొని
ఇప్పటిదాకా, వివిధ సామాజిక చలనాలకు గురుతులుగా నిలబడ్డ అసంఖ్యాక వ్యక్తులతో ఆయనకు సంబంధాలు ఏర్పడి ఉంటాయి. ఇట్టాంటి మానవ సంబంధాల వల్లనే
ఆయన విరసానికీ, ప్రగతిశీల, పౌరహక్కుల ఉద్యమాలకూ ఎనలేని సేవలందించగలిగాడు. ఆయా పోరాటాల మీద నిర్భందం విరుచుకపడినప్పుడు తనకున్న వేల చేతులతో పాలక వర్గాల కుట్రలను ప్రజల్లోకి తీసుక పోగలిగాడు.
ఆయన ఇంటి ముఖ ద్వారానికి మార్క్స్, బుద్ధుడు, అంబేద్కర్ చిత్తరువులు తగిలించి ఉండేవి. వీరు ముగ్గురూ భారత నూతన ప్రజాస్వామిక విప్లవానికి
అత్యావశ్యక మార్గదర్శులు అని ఆయన మాతో అన్నాడు. వలసవాదం ఏ రూపంలో ఉన్నా ఆయన తీవ్రంగా అస్యహించుకొనేవాడు. గూగీవాధియాంగో ఒక సారి తన ఇంటికి తన కోసం ఫ్జోన్ చేయడాన్ని అపురూపంగా ఆయన చెప్పడం నేను స్వయానా రెండు మూడు సార్లు విన్నాను. వీరస్టాలినిష్టుగా పిలవబడడాన్ని ఇష్టపడే తను స్టాలిన్
బలహీనతల గురించి ప్రస్తావించినప్పుడు సావధానంగా వినేవాడు.
అన్నింటికీ మించి మనుషుల జీవితాల్లో సంక్షోబాలు ఏర్పడినప్పుడు అందరికి మించిన ఆర్తిని ఆయన ప్రదర్శించేవాడు. ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా,
ఉద్యోగ సమస్య అయినా , కుటుంబ సమస్యలయినా అనేక మంది ఆయన వైపు చూడడం నాకు తెలుసు. ఆయనవి గరుత్మంతుని రెక్కలు. ఇలాంటి సందర్భాల్లో ఆయన ఇల్లు సొంత ఇంటిని మించి తలుపులు చాచుకొనేది.
ఇంత గొప్ప సామాజిక సంబంధాలు ఉన్నప్పటికీ వాటిని ఆయన తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం, విలాసాల కోసం వాడుకున్న సందర్భం నాకు తెలిసి ఒక్కటి కూడా
లేదు. నిరాడంబరత, కార్యశీలత కలగలిసిన అపురూపమైన మనిషి చలసాని.
“అన్నింటికీ మించి మనుషుల జీవితాల్లో సంక్షోబాలు ఏర్పడినప్పుడు అందరికి మించిన ఆర్తిని ఆయన ప్రదర్శించేవాడు. ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా, ఉద్యోగ సమస్య అయినా , కుటుంబ సమస్యలయినా అనేక మంది ఆయన వైపు చూడడం నాకు తెలుసు. ఆయనవి గరుత్మంతుని రెక్కలు. ఇలాంటి సందర్భాల్లో ఆయన ఇల్లు సొంత ఇంటిని మించి తలుపులు చాచుకొనేది.”
– చాలా బాగా రాశారు.
నాగరాజూ.. సీపీ హృదయాన్ని ఆర్ద్రంగా ఆవిష్కరించావు. బాబూ అని పిలిచే ఆ పిలుపు ఇక వినిపించదన్న దుఖంతో..
నాగరాజ్ మీ స్పందన హృద్యంగా ఉంది .ఆ విశాఖ సముద్రాన్ని దూరం నుంచే నేను చూస్థూ గౌరవించాను …..సముద్రాన్ని అలానే గౌర విన్చా లీమో కదా ….
చలసాని గురించి మీకున్న జ్ఞాపకాలను తెలుసుకోవడం ఆనందంగా ఉంది సర్. అయన ఎత్తినాం విరసం జెండా పాటతో పాటు ఈ విప్లవాగ్నులు ఎచటివని అడిగితే అనే పాటా పాడేవారు. అయితే ఇందులోని కొన్ని ఫంక్తులను మార్చి పాడటం వంటివి జరిగేవి. అయినా తానూ బతికినంత కాలమూ విస్తృతమైన ప్రజా ప్రయోజనాలకు చెందిన మార్గాన్ని వదులుకోలేదు. ఇది విప్లవ రాజకీయాల గొప్పా, విరసం గొప్పా, చలసాని జావించిన కాలం గొప్పా, వ్యక్తిగా చలసాని గొప్పా, ఇదిగో ఆయన గురించి అతి జాగ్రత్తగా చూసే మీ వంటి ఆలోచనాపరుల గొప్పా ఆలోచిస్తూ పోవడమే. దీనంతటికీ నేపథ్యంగా ఉన్న మన చలసాని జ్ఞాపకాల రూపంలో మన బతికే ఉంటారు.. సర్