మేథో అవినీతి…మన శత్రువు!

( మే 2015 లో ‘ విడుతలై చిరుతైగల్ కచ్చి ‘  Liberation Panthers  అనే ద్రవిడ పార్టి, బుకర్ ప్రైజ్ గ్రహీత అయిన అరుంధతి రాయ్ కు, అంబేద్కర్ ఆలోచనా విధానం విస్తృత ప్రచారానికి చేసిన కృషికి గుర్తింపుగా  ‘ అంబేద్కర్ సుదర్ ‘ అవార్డ్ ను ప్రధానం చేసింది. ఆ సందర్భంగా జరిగిన పబ్లిక్ మీటింగ్ లో అరుంధతి రాయ్ ఇచ్చిన ఉపన్యాసం. తెలుగు అనువాదానికి అనుమతించిన అరుంధతి రాయ్ కు కృతఙతలు తెలియ జేస్తూ – అనువాదకుడు )  

 

అంబేద్కర్ అవార్ద్ ఇచ్చి సత్కరిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియ జేసుకుంటున్నాను. ఇది సంఘటించడానికి ఒక ప్రతీక. ఉధృతమౌతున్న ఫాసిజం కు వ్యతిరేకంగా రాజకీయ కూటములనేర్పరిచాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నా సమయం లో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని నేను అభినందిస్తున్నాను.

ఈ దేశాన్ని హిందూ జాతీయ వాద దేశం గా నిస్సిగ్గుగా మలచాలనే  అధికారం మన దేశ అగ్ర స్థానాన్ని ఆక్రమించుకుంది. అటు వేపే చక్రాలు పరిగెడుతున్నాయి ఇప్పుడు. పాఠ్యాంశాలు మారుతున్నాయి, భోధనా పద్ధతులు మారుతున్నాయి, హిందూత్వ వాదులను న్యాయవ్యవస్థ లోనే కాదు, పోలీసు, ఇంటెలిజెన్స్ మరియు సైనిక వ్యవస్థల్లో చేర్చుకుంటున్నారు.

నేను ఈ రోజు వీ హెచ్ పీ భజరంగ్ దళ్ చేపట్టిన వికారమైన వికృతమైన ‘ ఘర్ వాప్సీ కార్యక్రమం గురించి మాట్లాడ దల్చుకున్నాను. అపవిత్రతను పవిత్ర పరిచి తిరిగి హిందూత్వం లోకి అహ్వానించే ఈ కార్యక్రమం ‘ శుద్ధి ఉద్యమం ‘  గా పిలవబడేది. ఈ ఉద్యమం 150 సంవత్సరాల క్రితం మొదలయ్యింది. ఇది ఏ మతం తో నిమిత్తం లేకుండా తమ సంఖ్యను విస్తరించుకుంటూ ‘ హిందూ సంస్థానం ‘ ను ఏర్పాటు చేయాలనే కృషి చేస్తుంది. మనం ఈ రోజు దీనినే ‘ వోటు బేంక్ ‘ ఆంటున్నాము.

అసలు ‘ హిందువుల గుంపు ‘  అంటూ ఏదీ లేదు. ఇది నిజానికి కొత్తగా పుట్టుకొచ్చిన అంశం. బాబా సాహెబ్ అంబేద్కర్ ను ప్రస్తావిస్తే ” మొట్ట మొదటగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే హిందూ సమాజం అన్నదే మిథ్య. మహమ్మదీయులు ఇక్కడ సింధు ప్రాంతానికి తూర్పు దిక్కున ఉన్న వాస్తవ్యులను వేరుగా గుర్తించడానికి ఇచ్చిన పేరు అది.  ”

‘ ఓటు బేంకు ‘ లను పెంపొందించే విధానం సుమారు 100 సంవత్సరాల క్రితం, రాజ్యాలు జాతీయ రాష్ట్రాలుగా , రాచరికం ప్రాతినిధ్య రాజకీయాలతో మార్పు చెందాక  మొదలయ్యింది ప్రాతినిధ్య రాజకీయాలు, సంఖ్యా బలం గురించి ఒక ఆరాటాన్ని ( anxiety ) కలుగ జేయడం తో  హిందువులుగా పిల్చుకునే వర్గాలైన అగ్ర కులాలు తామ అధికారం నిలుపుకోడానికి మెజారిటీగా ఉన్నామని చిత్రీకరించుకోవాలని నిస్పృహతో పని చేయడం  మొదలు పెట్టాయి. అంతకు మునుపు వరకు వీళ్ళందరూ వాళ్ళ కులాల పేరుతోనే గుర్తింపబడే వాళ్ళు. సంఖ్యా బలం గురించి ఆరాటం మొదలు కానప్పుడు అప్పట్లో  నిమ్న కులాలు కులం పాశం నుండి తప్పించుకోడానికి ఏ మతం పుచ్చుకున్నా వాళ్ళకు తేడా అనిపించలేదు.

ఎప్పుడైతే  సంఖ్యా బలం ప్రాముఖ్యత పెరిగిందో –  ఎవరిని తాకడాన్ని కూడా హేయంగా చూసారో, ఎవరిని ఇన్నాళ్ళు బహిష్కృతులుగా చేసారో, ఎవరి ఇళ్ళకు వెళ్ళడం నిషిద్ధం అనుకున్నారో – అప్పుడు వీరందరినీ హిందువులుగా పరిగణించాలని నిశ్చయించుకున్నారు. కుల వ్యవస్థకు , దాని నిచ్చెన మెట్ల హక్కుల సాంప్రదా యానికి వ్యతిరేకంగా  కాక ,అస్పృశ్యతకు వ్యతిరేకంగా , కేవలం ‘ అస్పృశ్యులను ‘ హిందువుల గుంపులో ఉంచుకోవడానికి బ్రహ్మాండమైన ప్రచారం జరపడం మొదలు పెట్టారు.  అదే సమయం లో ‘ ఆర్య సమాజం ‘ ఈ ‘ శుద్ధి ఉద్యమం ‘ ను చేపట్టింది. దానినే ఈ కాలం లో పెద్ద ఎత్తున తిరిగి చేపడుతున్నారు.

సవర్ణుల సమస్య ఏంటంటే అవర్ణులను బం గ్లా లోకి అహ్వానించి వాళ్ళని వేరుగా ‘ సర్వెంట్ క్వార్టర్స్ ‘ లో ఎలా ఉంచాలా అన్నదే ! ఒక పక్క కులం పవిత్రత ను కాపాడుతూ హిందూ మెజారిటీని ఎలా సృష్టించాలి అన్నదే సమస్య. ఒక పక్క అస్పృశ్యత గురించి మాట్లాడుతూ, మరో పక్క, సాంఘిక కుల ఆచారాన్ని ఎత్తి పట్టడం వాళ్ళు కార్చే మొసలి కన్నీళ్ళు తప్ప ఏమీ కాదు.

నాకు తెలిసి బాబా సాహెబ్ అంబేద్కర్ ఆధునిక రాజకీయ నాయకుల్లో ఒక అద్భుతమైన వ్యక్తి. ఈ పద్ధతిని ఎప్పుడో గ్రహించి ఉగ్ర గొంతుకతో ద్వేషించాడు.  ఇవన్నీ ఆయనెప్పుడో తన రచనల్లో సమగ్రంగా వివరించాడు.

అయినప్పటికీ బీ జే పీ రాజకీయ నాయకులు సిగ్గు లేకుండా అంబేద్కర్ మీద ప్రేమ ప్రకటిస్తూ ప్రతి రోజు ఆయన విగ్రహాలను ఆవిష్కరిస్తూనే ఉన్నారు. ‘ ఆర్గనైజర్ ‘ అనే ఆర్ ఎస్ ఎస్ మేగజైన్ కు  అంబేద్కర్ బొమ్మను కవర్ పేజీ లా పెట్టుకున్నారు. వాళ్ళు ఆయన్ను అభిమానిస్తున్నట్టు నటిస్తూ , ఆయన భోధించిన రాజకీయాలను అడుగంటేలా  చేసి , అంబేద్కర్ ను హిందూత్వ చిహ్నం గా మార్చాలని చూస్తున్నారు.

చర్చ్ ల మీద వారి గూండాలు దాడులు చేయడం ద్వారా, నన్స్ పై అత్యాచారం చేయడం ద్వారా అంబేద్కర్ ఆశించిన తీరులో హిందూ మతాన్ని వదిలించుకుని,  క్రిస్టియన్ మతం స్వీకరించిన దళితులను  కాంధమాల్, బస్తర్ లాంటి ప్రాంతాల్లో నిత్యం భయభ్రాంతులతో జీవించేలా చేస్తున్నారు.

ఈ రోజు అతి కౄరంగా , అంబేద్కర్ పోరాటం చేసి సాదించిన రిజర్వేషన్లనే ఎర చూపించి హిందువుల గుంపులోకి రమ్మని ఆశ చూపుతున్నారు. అంటే అంబేద్కర్ వాడిన కత్తినే తిప్పి తిరిగి ఆయన సిద్ధాంతాలకే తూట్లు పొడుస్తున్నారు. ఆయన ప్రజల పేదరికం , దౌర్భల్యత ను – వారికే వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నారు.

మన దేశాన్ని ‘ సూపర్ పవర్ ‘ గా మన నాయకులు వర్ణిస్తారు. ఆ ‘ సూపర్ పవర్ ‘ దేశం లో 80 కోట్ల మంది దినానికి 20 రుపాయల కంటే తక్కువ ఆదాయం మీద బతుకుతున్నారు. అంత తక్కువ మొత్తం లో హుందాకరమైన జీవితం గడపడం సాధ్యమా ? చాలా మంది ఆఫ్రికా దేశాలు బీద దేశాలు గాను ఇండియాను ధనవంతమైన దేశం గాను ఊహించుకుంటారు. నిజానికి ఆఫ్రికా దేశాల కన్న మన దేశం లో పేదవాళ్ళు అధికంగా ఉన్నారు. మన దేశం అత్యాధిక సంఖ్యలో పోషకాహరం లేని పిల్లలకు నిలయమై ఉంది. పిడికెడు మంది కోటిశ్వరులు మన దేశం లో ఉన్న కోట్ల పేద ప్రజలకు మించిన ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నారు. మనం అవమాన కరమైన అసమానతల సమాజం లో జీవిస్తున్నాం.

మిగతా దేశాల్లో లా కాక , మన దేశం లో కుల వ్యవస్థ ఆశీర్వాదాలతో అసమానత వ్యవస్థీకృతమై ఉంది.

20 రుపాయలకన్నా తక్కువ భృతితో జీవితం సాగిస్తున్న ఆ 80 కోట్ల మంది ప్రజలలో అధికులు ప్రాజెక్టుల వలన భూమి కోల్పోయిన వాళ్ళు, పౌష్టికాహారం లేని పిల్లలు, భూమి ఇల్లు లేని నిరుపేదలు, నగరాల్లో మురికి వాడల్లో నివసించే వాళ్ళు, జైళ్ళలో మగ్గుతున్న వాళ్ళు. ఇందులో దళితులు, ఆది వాసీలు  ముస్లిం లు అధికంగా ఉన్నారు. ఈ హింసాత్మక దేశం లో జరిగే మారణ కాండల్లో , హత్యాచారాల్లో అధికంగా బలి అయ్యేది కూడా వీళ్ళే.

నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో ప్రకారం, ప్రతి 16 నిమిషాలకు దళితుల పట్ల దళితులు కాని కులాల వాళ్ళు నేరానికి పాల్పడుతున్నారు; రోజుకు నలుగురు ‘అస్పృశ్య మహిళలు ‘ స్పృశ్య ‘ కులాల వలన అత్యాచారానికి గురౌతున్నారు;  ప్రతి వారం 13 మంది దళితులు హత్య చేయబడ్డమే కాక 6 మంది దళితులు కిడ్నాప్ కు గురి కాబడుతున్నారు.

ఒక్క 2012 లోనే , ఢిల్లీ గేంగ్ రేప్ జరిగిన సంవత్సరం లో, 1574 దళిత మహిళలు రేప్ చేయబడ్డారు, 651 మంది చంపబడ్డారు ( ఒక అనుభవ సూత్రం ఏమంటే దళితుల పట్ల జరిగిన నేరాలలో 10 శాతం మాత్రమే రిపోర్ట్ చేయబడుతున్నాయి ). ఇది కేవలం రేప్, హత్యల గురించి మాత్రమే అందిన సమాచారం. ఇవి మాత్రమే కాక వలువలూడ దీయడం, బలవంతంగా మలాన్ని తినిపించడం( అక్షరాలా !! ), భూములు లాక్కోవడం, సాఘిక బహిష్కరణ, తాగు నీటిని తిరస్కరించడం లాంటివి వేరుగా ఉన్నాయి.

బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్టు ” హిందూత్వం భీతావహానికి కొలువు ”

హింస కేవలం అల్లరి మూకలకు , సాయుధ దుండగులకు సంబంధించినది మాత్రమే కాదు. అది భారత దేశ రాజ్య స్వభావం లోనే ఉంది.

ముందు నెలలో , ఏప్రిల్ 7 న, ఆంధ్ర ప్రదేశ్ లో 20 మందిని  STF  కాల్చి చంపారు. ఇంత వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. 42 మంది ముస్లిం లను  PAC  కిరాతకంగా చంపిన హషింపుర కేసులో లానే, కీళవేన్మని సంఘటనలానే, ఇంచుమించు దళితులపై జరిగే ప్రతి దాడి లానే , ఈ  STF  వాళ్ళకు ఏమీ కాదు. అదే రోజు తెలంగాణాలోవరంగల్ నుండి హైదరాబాదుకు సంకెళ్ళు వేసి తీసుకెల్తున్న  5 మంది ముస్లిం ఖైదీలను పోలీసులు కాల్చి చంపారు. 67 సంవత్సరాలలో ఇండియాకు సార్వభౌమత్యం లభించాక , దేశం లో ఉన్న రాజకీయ సమస్యలను పరిష్కరించడానికి సైన్యాన్ని ఉపయోగించని సంవత్సరం ఒక్కటి కూడా లేదు.  సైన్యం కాశ్మీర్, నాగాలాండ్, మిజోరం, మణిపూర్, గోవా, తెలంగాణా, అస్సాం, పంజాబ్, వెస్ట్ బెంగాల్ లలో ప్రతి చోటా ఉంది. దానిని ఇప్పుడు ఆదివాసీలు నివసించే మధ్య భారత దేశం లో, అక్కడి భూమిని మైనింగ్ మరియు ఇంఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల కు ఉపయోగించడం కోసం,  వాడడానికి సిద్ధమౌతున్నారు.  వేలల్లో ప్రజలను బంధిస్తున్నారు, చిత్ర హింసలు పెడుతున్నారు. ఎవరీ రాజ్య శతృవులు ? ఆలోచించండి….వాళ్ళు ముస్లిం లు, క్రిస్టియన్ లు, ఆది వాసీలు, సిక్కులు, దళితులు.

మనం సవర్ణ దేశం లో ఉన్నాం. అది నిరంతరం అవర్ణులపై , మైనారిటీలపై దాడి చేస్తూనే ఉంటుంది !!

మనది మైనారిటిల దేశం. మరి ఈ ఉన్నత వర్గానికి చెందిన మైనారిటీ సమూహం ( బ్రాహ్మణులు , బనియాలు 6 శతం కన్నా తక్కువ )  అధికారాన్ని , హక్కులను ఏ విధంగా పొందగలుగుతుంది ? ప్రజలను ఒకరి మీదకు ఒకరిని ఉసిగొప్లడం ద్వారా ! నాగాలను కాశ్మీరీల మీదకు, కాశ్మీరీలను చత్తీస్ గడ్ ప్రజల మీదకు, తమిళులను అస్సామీయుల మీదకు, వెనుకబడిన కులాలను దళితుల మీదకు, దళితులను ముస్లిం ల మీదకు ఉసిగొల్పడం చేస్తుంది.

1960, 1970 లలో ప్రతిఘటన ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. అందులో మీ పార్టీకి పూర్వ గాముకులైన దళిత్ పేంథర్స్ , నక్సలైట్లు న్యాయం గురించి , విప్లవం గురించి ఎలుగెత్తారు. భూ సంస్కరణల గురించి నినదించారు. ‘ దున్నే వాడిదే భూమి ‘ అనే నినాదం వారిది.

రోజు మన మెదళ్ళ నుండిన్యాయంఅనే అంశానికి బదులుగా  ‘ మానవ హక్కులుఅనబడే ఒక సంకుచిత అంశం వచ్చింది.

అంతో ఇంతో జరిగిన భూ సంస్కరణలు కూడా వెనక్కు మళ్ళబడ్డాయి. ఎంతో ఉధృతమైన మావోయిస్ట్ ఉద్యమాలు కూడా ఆది వాసీల భూములను ప్రైవేటు వ్యాపార సంస్థల పరం కాకుండా ఉండడానికి మాత్రమే పోరాటం చేసే స్థాయికి తగ్గి పోయాయి. ఈ రోజు 70 శాతం పైగా దళితులు భూమి లేని వాళ్ళు. పంజాబ్, బీహార్, హర్యానా, కేరళ లాంటి రాష్ట్రాల్లో ఈ సంఖ్య 90 శాతం పైనే ఉంటుంది. ఇన్ని కోట్ల మంది ఈ చర్చలో భాగం కూడా కాదు.

ఎవరు మన దేశాన్ని స్వంతం చేసుకున్న ఈ వ్యాపార సంస్థలను నడుపుతున్నారు ? – భూమి ఒక్కటే కాదు, ఆడవులు, నదులు, నీళ్ళు, విద్యుత్తు . పోర్టులు, సెల్ ఫోన్ నెట్వర్క్, టీ వీ చానల్స్, ఫిల్మ్ ప్రాడక్షన్, స్పెషల్ ఎకనమిక్ జోన్ లు  అన్ని బ్రాహ్మణులు లేదా బనియాలకు సంబంధించిన  అదాని, అంబాని, మిట్టల్, సంఘ్వి, బిర్లా, జిందాల్ లాంటి వాళ్ళే .

అత్యంత అలజడి సృష్టించిన ఫ్రెంచ్ రైటర్ ప్రొఫెసర్ థామస్ పికెటీ వ్రాసిన కొత్త పుస్తకం  Capital in the 21st century  లో మనమిప్పుడు ప్రపంచం లో చూస్తున్న ఆర్థిక అసమాటితలు పురాతన యుగం తో సమానంగా చేసి చూస్తాడు. అందుకు మహత్తరమైన గణణాంకాలతో – ఈ రోజుల్లో యూరోప్, అమెరికాలలో అసమానతలను పెంపొందించే పెద్ద పెద్ద బేంకులు , సంస్థలు ఎలా ఐశ్వర్యాన్ని తర తరాలుగా సంక్రమించుకుని వాళ్ళ వంశాలకు ఎలా సంప్రాప్తించేలా చేస్తాయో చెప్తాడు. మన దేశం లో తరాలుగా సంప్రాప్తిస్తున్న ఐశ్వర్యం, ఙానం, భోగాలు ఇవన్నీ దైవాంశ సంభూతం గా కొలవబడుతున్న హిందూ కుల వ్యవస్థ వలనే జరుగుతున్నాయి.

కేపిటలిజం కు కుల వ్యవస్థ తల్లి లాంటిది.

మనం తిరిగి మైనారిటీ సమూహాలైన బ్రాహ్మణ మరియు బనియాలు ఎలా సౌభాగ్యంగా  మనగలుగుతున్నారు అనే ప్రశ్న దగ్గరకొస్తే – కిరాతకైన భౌతిక బలం ఊయోగించడం వారి టెక్నిక్.

ప్రధానంగా ఇదే బనియా సంస్థలే మీడియాను కూడా స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళే ఏ విషయం ప్రచార అర్హత కలిగుందో నిర్ణయిస్తారు.  మీడియా ను నియత్రించడం ద్వారా దేశం  తలంపులను ఆలోచనలను నియంత్రిస్తారు. 4 ప్రధాన జాతీయ వార్తా పత్రికల్లో , 3 వైశ్యులు నడుపుతుండగా 1 బ్రాహ్మణులు నడుపుతునారు.

టైంస్ చానల్ నడుపుతున్నది జైన్ ( బనియా) , హిందుస్తాన్ టైంస్ నడుపుతున్నది బర్తియా ( మార్వాడి బనియా ), ఇండియన్ ఎక్స్ప్రెస్ నడుపుతున్నది గోయంకా ( మార్వాడి బనియా ) , ది హిందూ నడుపుతున్నది బ్రాహ్మణ కుటుంబం, దైనిక్ జాగరణ్ నడుపుతున్నది గుప్తా కుటుంబం, దైనిక్ భాస్కర్ నడుపుతున్నది అగర్వాల్ కుటుంబం. గుజరాత్ బనియా అంబాని నడుపుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ కు 27 ప్రధాన జాతీయ , ప్రాంతీయ చానల్స్ లో షేర్స్ ఉన్నాయి. అతి పెద్ద జాతీయ చానల్ జీ నెట్ వర్క్ కూడా బనియానే నడుపుతున్నది.

గణాంకాలు చెప్తున్నదేమంటే సంస్థలు తీసుకునే జర్నలిస్టులు కూడా ప్రధానంగా బ్రాహ్మణ, బనియా మరియు అగ్ర కులాల వారే. ముస్లిం జర్నలిస్టులు ఎంత మంది ఉన్నారో చేతి వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. దళితులు, ఆది వాసీల ఐతే అసలు కనబడరు.

రిజర్వేషన్ పాలసీ ని ఉద్దేశ్యపూర్వకంగా కూలదోస్తూఇదే పరిస్థితి న్యాయ వ్యవస్థలో, బ్యూరాక్రసి లో, విద్యా వ్యవస్థలో ఉంది. దళితులు అధికంగా కనిపించే స్థానాలు ఏవంటే – 90 శాతం ప్రభుత్వ మునిసిపాలిటీ లో పరిశుభ్ర కార్మికులు ! గొప్ప రాజ్యం లో 13 లక్షల స్త్రీలు ఇంకా తమ నెత్తి మీద మలం బుట్ట పెట్టుకు తిరిగి జీవనం వెళ్ళ బోస్తున్నారు.

ప్రజాస్వామ్యం  స్వేచ్చా మార్కెట్ విధానం కులవ్యవస్థను ఆధునీకరించి పఠిష్టం చేస్తున్నాయి. అయినా సరే , పేరెన్నిక గన్న భారత మేధావులు, చరిత్ర కారులు, ఆర్థికవేత్తలు, రచయితలు, కుల సమస్యను అల్పంగా చూపడం కాని లేదా మొత్తానికి విస్మరించడం కాని చేస్తున్నారు. ఇది కంటికి కనిపించని గొప్ప పథకం. ఈ తెర లేవదీసి , ఈ ప్రపంచానికి మన గొప్ప ప్రజాస్వామ్యం లో ఏం జరుగుతుందొ చూపించడం మన విధి.

ఎలక్షన్ ల సమయం లో అన్ని రాజకీయ పార్టీలు , సవర్ణ రాజకీయ నాయకులు ‘ దళిత వెనుక బడిన కులాల ‘ ఓట్ల కోసం కొట్లాడుకుంటున్నప్పుడు మాత్రం  అడుగున కప్పేసి ఉన్న కులం ఉక్కు చట్రాన్ని బయటకు తీసి పెద్ద గొంతుకతో వికృతంగా అరవడం చేస్తారు. ఒక్క సారి ఎలక్షన్ లు అయిపోయాక తమకు తెలిసిన మేథో మూర్ఖత్వం తో ఆ సమస్యను పూడ్చి పెడతారు. ఒక ప్రధాన టీ వీ యాంకర్ ఎంతో సీరియస్ గా అంబేద్కర్ కుల వ్యవస్థకు వ్యతిరేకి కాబట్టి రిజర్వేషన్ పాలసీని వ్యతిరేకించాలి అని వాదించడం చూసాను.

ఈ రోజుల్లో ఆర్థిక అవినీతి గురించి మాట్లాడ్డం ఒక ఫేషన్ గా కనిపిస్తుంది. కాని అందులో చాలా తక్కువ మంది మాత్రమే ‘ మేథో అవినీతి ‘ గురించి మాట్లాడుతున్నారు. మేథో అవినీతి దేశం లో పాటించే ఒక ఊహకందని నైతిక లంచగొండితనం

ఈ సమాజ తీరు తెన్నులు, న్యాయం గురించి పుంఖానుపుంఖాలుగా సైద్ధాంతిక వ్యాసాలు రాస్తూ అసలు కులాన్ని మొత్తంగా పక్కకు నెట్టేసే కొంత మంది పేరెన్నిక గన్న చరిత్ర కారులు, మేధావులు ఈ అవినీతిలో కూరుకుపోయారు. ఇది ఈ సమాజం కనుగొన్న అతి కౄరమైన అణచివేత విధానం.

చరిత్రలో అత్యంత హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ఇదే ‘ మేధో అవినీతి ‘ –  కుల వ్యవస్థను నమ్మిన, శ్రామికులను , స్త్రీలను , నల్ల జాతీయులను కించ పరిచిన మోహన్ దాస్ గాంధీని ప్రపంచంలో గొప్ప సాధువుగా , పేదల మితృడిగా , నల్ల అమెరికన్ ల హీరోగా, నెల్సన్ మండేలా లా, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ లా చివరికి ఈ దేశానికి జాతిపిత గా ఎత్తిపట్టడం. ఈ దేశ పునాదులను అటువంటి అసత్యాల మీద నిలబడ్డాన్ని మనం సహించరాదు.  ప్రతి స్కూల్ రూం లో తప్పనిసరిగా చేయాల్సిన అంబేద్కర్గాంధి డిబేట్  విషయాన్ని చాలా చాతుర్యంగా చీకట్లో నెట్టేసి , ఇప్పుడు లిబరల్ మేధావులు మరియు చరిత్ర కారులు వారిద్దరిని మంచి సహ ప్రయాణికుల్లా ఉన్నట్టు , ఏదో వారి మధ్య చిన్న కలహాలు ఉన్నట్టుగా చిత్రీకరిస్తూ మొత్తం అబద్ధాలే చెప్తున్నారు.

మనం అత్యవసర బాధ్యతగా పెట్టుకుని అంబేద్కర్ వారసత్వాన్ని అసత్యాలతో మార్చడాన్ని అడ్డుకోవాలి.

ఉపన్యాసం ముగించేలోపు నేను చెప్పదల్చుకున్నదేమంటే కుల వ్యవస్థను రూపు మాపడానికి మనం బ్రాహ్మినిజం, కేపిటలిజం, సామ్రాజ్య వాదం మధ్య సంబంధాన్ని గుట్టు విప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా మనం ఒక రాజకీయ సంఘటన కట్టాలి. దక్షిణ ఆఫ్రికాలో జాతి వివక్ష ఎలా నిర్మూలింపబడింది అనుకుంటున్నారు ? మొత్తం ప్రపంచం దుర్మార్గమైన వివక్షను హేయపూర్వకంగా చూడాలి. ఇండియా బయట ఉన్న వాళ్ళకు కుల వ్యవస్థ ఏంటో తెలీట్లేదు. వాళ్ళకు ఇదేదో హిందూయిజం,  శాఖాహారి ఫేషన్ సంస్కృతి, యోగా మరియు గాంధియిజం   ఫేషన్  తో కలిసిపోయిన బ్రహ్మ పదార్థం లా ఉంది.

మన లో ప్రతి ఒక్కరు మన ప్రజ్ఞా   సామర్థ్యాలు ఈ కుల వ్యవస్థను నిర్మూలించడానికి ఉపయోగించాలి.

మన ముందు ఉన్న ప్రధానమైన సవాలు ఏంటంటే – మన రాజకీయ ఐక్యతను నిరోధించే ఈ కుల విభజనను మన ఏమరుపాటుతో బలోపేతం చేయకుండా, మనం కులాన్ని ఎదుర్కోవడం. ఇది చాలా సంక్లిష్ట పోరాటం. ఎందుకంటే మన ఐక్యతను దెబ్బ తీసే రాడికల్ నినాదాలు, ప్రత్యేక వాదాలు మీరు చూస్తారు. నాకంటే మీకు బాగా తెలుసు  – శతృవర్గం లో మీ మితృవులకు ఈ విషయం చెప్పడం చాలా కష్టం. అయినా సరే తప్పదు. చెప్పాలి. అంబేద్కర్ కున్న గొప్ప ప్రజ్ఞా పాటవాల్లో ఇదొకటి.

మన లో ప్రతి ఒక్కరు మన ప్రఙ  సామర్థ్యాలు ఈ కుల వ్యవస్థను నిర్మూలించడానికి ఉపయోగించాలి.

మనం పొలాల నుండి మొదలుకుని, ఫేక్టరీలు, మురికి వాడలు, గుడిసెలు, తరగతి గదులు, యూనివర్సిటీలు, సినిమా, సాహిత్యం అన్నిటినీ కలుపుతూ ఒక సుధీర్ఘమైన దుర్భేధ్యమైన జాగృతి, అవగాహన, అవిరామ ఆచరణ అనే గొలుసును తయారు చేయాలి !!!

అనువాదం: పి. విక్టర్ విజయ కుమార్ 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. బాగుంది .అవసరం కూడా .

  2. Great clarity of Arundhati Roy! It has only one side criticism! Controlling the thought process of the Society by all means has become the right of Capitalists to develop their businesses! I think it has nothing to do with caste! Ones you have become effluent, people start looking at your caste! Nobody will ask you when you are begging on the roads! It is the human nature! Cash has no caste! Marketing has no religion! One should not theorise everything in the Society and link them to Ambedkar and Gandhi! Both are visionaries who fought to remove the ills and evils of the Society of their times! Degrading Gandhi and highlighting Ambedkar also has become fashion now-a-days! This generation is not at all bothered with this kind of thinking! They are moving ahead understanding the dynamics of the modern society!

  3. buchi reddy gangula says:

    బాగుంది సర్
    cash.has.no. caste..??plus..sex..too..
    ———————————————–
    బుచ్చి రెడ్డి గంగుల

  4. నిశీధి says:

    ఒక మంచి ఆలోచనని అనువాదించిన మీకు థాంక్స్ . ప్రస్తుతం చాలా అవసరమయిన థాట్

  5. mahamood says:

    అరుంధతి నిజంగానే గొప్ప థాట్ జనేరటర్. ఇలాంటి మేధో జనం మనకిప్పుడు అవసరం. క్రిటికల్ అప్రోచ్ లేకుండా ఒక గొప్ప జాతిని నిర్మించలెం. గాంధీ అమ్బెద్కర్ ల మధ్య పోలిక పర్సనాలిటీ లది కాదు.ఆలోచనలది.అందులో గాంధీ వేల సంవత్సరాల వెనుక వున్నాడు.అంబేద్కర్ ఒక నికార్సైన మేధావి. జ్ఞాన భండారం. ఏ భగవద్గీత పట్టుకొని గాంధీ తిరిగాడో అదే నేల మీద ఆ తాత్వికతను ఓడించడమే అంబేద్కర్ చేసింది.
    మహమూద్.

  6. కుల వ్యవస్థను నమ్మిన, శ్రామికులను , స్త్రీలను , నల్ల జాతీయులను కించ పరిచిన మోహన్ దాస్ గాంధీని ప్రపంచంలో గొప్ప సాధువుగా , పేదల మితృడిగా , నల్ల అమెరికన్ ల హీరోగా, నెల్సన్ మండేలా లా, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ లా చివరికి ఈ దేశానికి జాతిపిత గా ఎత్తిపట్టడం. ఈ దేశ పునాదులను అటువంటి అసత్యాల మీద నిలబడ్డాన్ని మనం సహించరాదు

    • Vijay Kumar says:

      అందుకే అంబేద్కర్ గురించి మాట్లాడాల్సి వస్తే గాంధీకి తన్నులు పడ్డం తో మొదలౌతుంది…..

  7. VIEW NEW says:

    మార్క్సిస్ట్ బ్రాహ్మణులకు దళిత సమస్య కనబడుతుంది కానీ ఓ. బి . సి ల సమస్య ఎందుకు కనబడడం లేదు.

  8. SreenVass ChandrGiri says:

    అరుంధతి రాయ్ నిజంగా ఒక గొప్ప థింక్ ట్యాంక్ మరియు presenter విత్ గ్రేట్ clarity . విషాదం ఏమిటంటే
    బీ .సి కులాలు అన్ని తాము హిందుత్వానికి భాదితులం అని మరచి పోయి అదే హిందుత్వ గుంపులో ముందు వరసలో నిలబడటం..
    Thanq విక్టర్ అన్న. జై Bheem !

  9. m.viswanadhareddy says:

    మనం పొలాల నుండి మొదలుకుని, ఫేక్టరీలు, మురికి వాడలు, గుడిసెలు, తరగతి గదులు, యూనివర్సిటీలు, సినిమా, సాహిత్యం అన్నిటినీ కలుపుతూ ఒక సుధీర్ఘమైన దుర్భేధ్యమైన జాగృతి, అవగాహన, అవిరామ ఆచరణ అనే గొలుసును తయారు చేయాలి !!!
    బాలగోపాల్ ని దాటి చాలా ముందుకు వచ్ఛిన చర్చ . విజయకుమార్ గారు మీ అనువాదం లో ఒక ఆలోచన ధార అద్బుతంగా సాగింది అభినందనలు

Leave a Reply to venkatrao.n Cancel reply

*