మా ఊరి పేరు యనక– ఒగ కత

సడ్లపల్లె చిదంబర రెడ్డి
మావూరి కాపోళ్లలో ఎక్కువ బాగము “సజ్జన”కాపోల్లే. అందుకే మావూరు సజ్జన పల్లయి, సడ్లపల్లిగా మారిందంట. అయితే దాన్ని ఇష్టంపడని గుంపోళ్లు మాత్రం ఉప్పర సజ్జయ్య అనే ఆయప్ప ఈడ వున్నెంట ఆయప్ప పేరుమిందనే “సజ్జయ్యపల్లి” సడ్లపల్లి అయ్యిందని అంటారు.
    అయితే దాంట్లో నిజ్జం లేదనిపిస్తుంది. ఊర్లో ఉప్పరోళ్లు వుండారుగానీ,ఈళ్లకి సెంటు బూమిగూడా లేదు. అందరూ ఎనుంపోతుల్తో మడకల్దున్ని, మన్ను మోయించి,కూలీనాలీ సేసుకోని బతుకుతా వున్నోళ్లే.
    అయితే మా జనాలు “సజ్జను”లేనా?? అని మీరడగొచ్చు!!నేతిబీరకాయలో  నెయ్యి వుందనే దానికి ఆ పేరొచ్చిందా?? అనే సిన్న అనుమానముగూడా రావల్ల!! ఎవరో యనకటి కాలము ఎర్రోళ్లు ఆ పేరు పెట్టింటారు! పేర్లని బట్టే బుద్దులుంటాయనుకొంటే ఈ దేశంలో జనాలందరూ అరిచ్చందురుడు,సీరామ శందురుడు అనే పేర్లే పెట్టుకొంటా వుండ్రికదా!!
     అదట్ల ఇడిస్తే మా గుంపోళ్లు దిగువ సీమనుంచి వొచ్చిరంట! వాళ్ల యనకనే ఒగ కమసలోళ్ల కుటింబంగూడా వొచ్చినంట.
     ఈ ఊర్లో మాత “కాపోల్లు” అని పిలుస్తారు.అంటే పంటలు పెట్టి “కాపుదల సేసే”(పెంచే) జనాలని అర్తం.(గొర్రెలు పెంచేవోల్లు,ఆవులు పెంచేవోల్లు,పందులు పెంచేవోల్లు..ఇట్ల)
    బూమ్మీద ఏట్నుంచి కాలువలు తవ్వేది,బావులూ సెరువులు కట్టేదీ జనాలు నేర్సినపుడు–యక్కడికీ కదలకుండా ఒగ తావే నివాసాలు సేసుకోని, నిలిసిపొయ్యి యగిసాయం(వ్యవసాయం) మొదలుపెట్టిన గుంపే కాపోల్లు!! ఈళ్లకి అరవై డెబ్బయ్యేండ్లకి ముందు పేరుకి యనక “రెడ్డి” అనే తోకలు ఉండ్లేదు.
   రాజులు, పాళ్లేగాల కాలంలో ఎక్కువ జమీన్లో పంటలు పెట్టే ఆయప్పని ఆ సుట్టూపక్క లుండే జనాల గుంపులమింద అజమాయిషీ సేసే  అదికరము ఇస్తావుండ్రి. అంటే  అందరిదగ్గరా దవసము(ధాన్యం) కందాయం(భూమి సిస్తు) వొసూలు సేసి కొంత బాగము వాల్లదగ్గిరే వుంచుకోని, మిగిలింది రాజుల కజానాలో జమా సేసే అదికారము. దాన్నే”రెడ్డిరికము” “రెడ్డి పదవి” అని పిలుస్తా వుండ్రి. (పూర్వపు విరాటుడు లోని”రాట్” పదమే క్రమంగా రెడ్డి గా రూపాంతరమయ్యినదని ఎక్కడో చదివినట్లు గుర్తు)
    దాని అర్తం తెలీని ఎర్రోల్లు రాజులు, ఎంగిలీసోల్ల కాలంలో తోకలిప్పుకోకుండా గమ్మనూరుకో నుండారు!! సొతంతరమొస్తూనే ఎగిసాయం సేసేవోల్లంతా రెడ్డీసే   అనే ఒగ పెద్ద ఆశతో దాన్ని తగిలిచ్చుకోనుండారు- అనిపిస్తుంది.
     అది అట్ల వుండని:
     మా గుంపోల్లు, కమసలోల్లు వొచ్చిరంటగదా!! పెన్నేటికి తూరుపుపక్క ఏరు పొంగి ఎత్తుతగ్గులు సమానం సేసి ఒండునింపిన విశాలమయిన బూముంటే ఆడే నిల్సిపోయిండారు. ఏటిగట్లో అంతా కాపోల్ల సేద్యాలు. ఊరికి ఆనుకోని పదయిదు ఇరవై యకరాల్దంకా ఉత్తరానికి కమసలోల్లది. రయితులకి కావాల్సిన కొడవలి, పార, గుద్దలి,గడారు…కాడీ, మేడీ,పలుగు, బండీ..ఇట్లా సామాన్లు సేసేవాల్లే కమసలోల్లు. వాళ్లకి ఆకాలానికే బయ్యమో,బక్కితో,అట్ల్లంటిదేదో శానా వున్నట్లుంది! వాళ్ల బూముల్లోనే పెద్ద కోనేరు తవ్విచ్చి(1967 ఆ ప్రాంతంలో దాన్ని మూసేశారు) గుడికట్టిచ్చిండారు. ఊరిజనాలకి రోగాలొస్తే మందులిచ్చేదీ, ఒడ్డీలకి అప్పులిచ్చేదీ వాల్లే.(కాలమయిపోయిన కళలు– అనే కతలో వాళ్లగురించి మరలా చదవగలరు)
     గుడి యనకాలే ఒగ సింతసెట్టు నాటిండారు. (దానికి వయసుమళ్లి బెంగళూరు రోడ్డుకు అడ్డంగా కొమ్ములు విరిగి పడ్తూంటే 1986 ఆ ప్రాంతంలో తొలగించేశారు) అది యంత పెద్దదంటే నేను ఇందూపురానికి సుట్టూపక్కల 500 మయిళ్లవొరుకూ మర్రి, రాగి,సింత సెట్లు యన్నో సూసిండానుగానీ ఇంత ఎత్తూ, ఇసరమూ(వెడల్పు) వున్న మాను సూడ్లేదు!! కాతకాలమొస్తే ఇరగ్గాసిన కాయల బరువుకే కొమ్ములు ఇరిగి పోతావుండె. ఆ కాతని సింతపండు యాపారము సేసే మావూరి పింజిరోల్లు కొంటావుండ్రి. ఆదుడ్లని కమసలోల్ల ఇండ్లు, మా సజ్జనకాపోల్ల ఇండ్లోల్లు వాటాల్లెక్కన పంచుకొంటా వుండ్రి.దీని ఆదారం సేసుకోనే సజ్జన పల్లి సడ్లపల్లి  అయ్యిదనుకోవొచ్చు!!
    ఇదే కాలంలో ఈతావుండే సెరువుల్లోన, ఏట్లోన, గుంతల్లోన శానా నీళ్లు వాట్లో దండిగా శాపలు వున్నంట వుంటే వాట్ని పట్టుకోని బదికేకి ఒగ బెస్తోల్ల కుటింబుమూ వొచ్చింది. వాళ్లు వూరికి దచ్చిణంపక్క బాయి తవ్విచ్చి ఇరవై యకరాలుదంకా  సేద్యం సేసుకోని ఈశ్వరుని గుడికట్టుకోని నిల్సి పొయ్యిండారు.ఈళ్లూ వైదీకం (వైద్యం) సేసే వాళ్లే. ఈళ్లు వొచ్చినంక కమసలోల్ల వైదీకము యనకబడి పొయ్యింది.(వీళ్ల వైద్యం గురించి “నాకు రోగం తగుల్కోనె” అనే కథలో వివరిస్తాను).
     మా వూరికి తూరుపుకి మూడుమైళ్ల దూరంలో రైలు రోడ్డుకు  అవతల ఇంగొగు సడ్లపల్లి వుంది. యనకటికి వానలు పడకుండ కరువు మూసుకొంటే మా సజ్జన గుంపోళ్లు ఆ ఊరిడిసి యగువసీమకి ఎల్లిపాయరంట గాని,వూరిపేరు మాత్రం అట్లేవుంది. దీన్ని పులమతి(పులిమృతి)పి. సడ్లపల్లి అని పిలుస్తారు.
   ఆదికాలములో వాన్లు ఇగ్గదీసి కొట్టినపుడు, ఏరు పొంగి దావని పడమరకి మళ్లిచ్చుకోనుంది. అందుకే మా వూరికి ఉత్తరానికి ఏటిగడ్డలో శానామంచి మాగాణిబూములు తయారయ్యిండివి. అక్కడ (సూగు= సుగ్గి= ధాన్యం) సూగు దండిగా పండిచ్చే దానికి దాన్ని (సూగు ఊరు) సూగూరు అని పిలిసినారు. దానికి ఆనుకోని వుండేదానికి మా ఊర్ని సూగూరు సడ్లపల్లి (యస్. సడ్లపల్లి) అని పిలుస్తారు!! (ఈ సూగూరు దగ్గర హిందూపురం పట్టణం కొత్తగా పురుడుపోసుకొంది.అది ముందుముందు వివరిస్తాను).
   మా గుంపు జనాలుండేది పెన్నేటికి రెండుపక్కలా మా వూర్నుంచి దిగువ సీమలో పెనుగొండ నుంచి, ఎగువసీమ కర్నాటకంలోని తొండేభావి రైలు స్టేసనుకు అవతల కలినాయకన హల్లి(కల్యాకనపల్లి) వొరుకూ వుండారు.
   ఇపుడు తోకలోల్లంతా కల్సిపోయిండారుగాని, అది యేరే కత!! మా సుట్టూపక్కల ఉరుల్లో
సడ్లపల్లొల్లంటా
నా మొగిని షడ్డుకులంటా
రాతిరికొస్తారంటా
జొన్న రొట్టెలు కాలల్లంటా..
అని నేను సన్నపిల్లోనిగా వున్నపుడు పాట్లు పాడ్తా వుండ్రి!!
****                    ****              ****                     ***
అయిదరాబాదు నుంచి బెంగుళూరికి రైల్లో పోతే దొడ్డబళ్లాపురానికి ముందే “మాక్లీ రైలు స్టేషన్” అని ఒగటొస్తుంది. ఆడ వూర్లే లేవు. కొండలకి నడిమద్య కట్టిండారు. యాలంటే దానికి ఆరేడు మైళ్లదూరంలో సుబ్బరమణ్యం స్వామి ఘాటీ అని వుంది.
    ఆడ డిశంబరు నెల్లో ఎద్దుల పరస జరుగుతా వుండె. అది దచ్చిన బారత దేశంలోనే శానా పెద్దదంట!! దానికి నెలరోజుల ముందుగానే లక్షాంతరం ఎద్దులు ఒస్తావుండె. అవి పాతకాలం జాతిమాదిరీ మేకలు, జింకలట్లా గిత్తలు కాదు.మైసూసు,హలికేరి జాతిలో బాగా సురుకయిన ఉక్కుశరీరం పుట్టుకవి!! దూరాబారమోల్లు వాట్ని రైల్లో తీసుకుపోతావుండ్రి అందుకే ఆడ స్టేషను.
    మనిషై పుట్టినంక ఆ పరసలో సూడల్లన్నా మూగ జీవాల అందసందాలు!! ఒగ ఎద్దును సూసిన కండ్లతో ఇంగొగు జతని సూసేకయితా వుండ్లేదు!! ఆ ఎద్దులకుండే సోగ కండ్లు, ముఖం మింద నక్షత్రం మాదిరీ మెరిసే తెల్ల సుక్కలు,కత్తులకంటే కొస్సిగా వుండే నిటారయిన కొమ్ములు. రాజులు మెరవణీసేసేకి నున్నగా మేపిన అరేబియా జాతి గుర్రాలుగూడా ఈ ఎద్దుల కాళ్లకింద దూరాల్సిందే!!
IMG_0011
    మంచి వయసు కుర్రల్ని కోడిగుడ్లు,వులవనూక,శెనగపప్పు,అగిశాకు,సెరుకు మోసులు తినిపిచ్చి ఉడుకు నీళ్లతో రెండుపూటా స్నానాలు సేయిస్తా, శాన ముతువర్జీగా(ప్రేమగా) పెంచుతావుండ్రి. కింద పండుకొంటే నేల ఒత్తుకొంటుందని లేపులు(పరుపులు) పరుస్తావుండ్రి.ఈగలు మైమింద వాలకుండా మనుష్యుల్నిపెట్టి ఇసనకర్రల్తో ఇసరిస్తావుండ్రి. ఇట్ల ఇంపుగా వుండే వాటికి కొమ్మలకి మెరిసే కొమ్ముకుప్పలు, మెడలో ఇత్తడి సైను,గంటలు,గగ్గిరీట్లు,గవ్వలు,దిష్టితగుల్కుండా నల్ల కురుబదారము. రంగుల నులకల్తో పేడిన మూతికి ముగజింబారము. కొమ్మలకి జండాల మాదిరీ గాలికెగిరే టేపులు. అరసేతెలుపు అద్దాల బిల్లలుంచి బొమ్మలు బొమ్మలుగా అల్లిండే బురికీలు ఒళ్లంతా కప్పుతావుండ్రి. ఇంట్లో జనాలు పెండ్లి కూతురుకంటే అందుముగా సంబరాలు సేసుకోని సింగారం సేస్తావుండ్రి. ఆడే టెంటుల్లో కత్తులూ, కఠారుల్తో కొట్టుకోనే సినీమాలు ఆడ్తావుండె. జాత్రకొచ్చిన జనాలు సినీమాలకంటే ఎద్దుల్ని సూసేకే సెవులుకోసుకొంటా వుండ్రి.
    వాట్ని సూస్తే నాకి సిన్నపుడు అనిపించేది– సింబాలు, పులులు ఎద్దుల్ని సంపి తింటావని సెప్పేది అబద్దమని!! సరకస్సులో సింబాలూ పుల్లూ దండిగా సూస్తావుంటి. అవిగానీ ఈ జాతెద్దుల్ని సూస్తే “ఇవి యాడ్నో మమ్మల్ని సంపి తినేకి పుట్టిండే కొత్త పసరాలు”అనుకోని, గుండె పగిలి సచ్చేటంత కోపుగా ఏపుగా రోషంగా వుంటావుండె.
    దూరాబారమొల్లు గూడ్సు రైల్లొ తీసుకుపోతే నూరూ ఇన్నూరు మైల్ల దూరమోల్లు మా ఊరిముందరి రోడ్లోనే తోలుకు పోతావుండ్రి. వూర్లో జనాలంతా కన్నురెప్పలు కొట్టకుండా,నోరుఎల్లబెత్తుకోని ఎద్దుల సొగసులు సూస్తావుండ్రి. దాని జతకి పరసల కాలమొస్తే గుడిముందర టెంకాయ గర్రుల్తో పెద్దగా సప్పరం ఏసి, వర్సగా గూటాలు బాత్తావుండ్రి. ఊర్లోని అందరి వాముల్లో గడ్డి తెచ్చి వామిమాదిరీ ఏస్తావుండ్రి. కొందరు గంపలు తీసుకోని ఇంటింటికీ పొయ్యి సంగటిముద్దలు, శార, మజ్జిగ, ఊరగాయి,పాకపట్టలు(విస్తర్ల లాంటివి=వక్క మట్టలు) తెస్తావుండ్రి. బాయిదగ్గర కట్టిండే గారు తొట్టీనిండా నీల్లు నించుతావుండ్రి.
    ఎద్దులు తోలుకోని వూర్లకు పొయ్యేవోల్లంతా రాతిరిపొద్దు మావూరిదగ్గరే నిల్సి, ఎద్దుల్ని మేపుకోని, సంగటితిని, బయ్యంలేకుండా పండుకోని పోతావుండ్రి. ఇట్ల అల్కూర్లో జనావరినెల్లో జరిగే సోమేశ్వస్వామి పర్స,ఊగాదికి యనకా ముందు విదురాస్వత్తనంలో జరిగే జాత్రవొరుకూ మా వూరిజనాలకంతా ఇదేపని. దాని జతకి యండకాలమొస్తే రోడ్డు పక్కలో సత్త్రం ఏసి పెసరబ్యాళ్లు,పాణకం,మజ్జిగని బాటసార్లకి పిల్సి పిల్సి పోస్తావుండ్రి.
   ఆ జాత్రల కాలంలో మాయట్లా పిల్లోల్లంతా పసరాలకతలే సెప్పుకొంటావుంటిమి. ఆ కతల్లో ఎద్దులే ఈరోలు. వాట్లో శానా మర్సిపొయ్యిండాను గానీ ఒగటిమాత్రం బాగా గురుతుంది.
    ఒగ దిగువసీమ రైతుకు అయిదారెకరాల మంచి సత్తువయిన బూమి వున్నంట. మేలుజాతి కుర్రలు కొనల్ల అని మున్నూరు రుపాయలు (అప్పుడు దినకూలీ 12 పైసలు.ఇప్పుడు (01.07.2015–నాడు) 300రు.లు దీని ఆధారంగా బేరీజు వేసుకొండి) తీసుకోని పర్సకి పాయినంట. పర్సంతాతిరిగి వాటముగా వుండే గట్టి కాళ్లని, ఒంటిమీద సుళ్లని,కంటిసూపుల్ని, ముడ్డిమింద సైగల్ని బాగ పరీచ్చలు సేసి, దళ్లాళి గాళ్లని పిల్సి యాపారము మొదలుపెట్నంట. అంత సేపటికి ఆపక్కలో ఊడుగుసెట్టుకింద ఒగ జుట్టుస్వామి బుర్రంతా ఈబూతి దిద్దుకోని మంత్రాలు సదువుకొంటా కండ్లు మూసుకోని శాస్త్రం సెప్పుతావున్నెంట.
    “ఈ యాడాది దిగువ సీమలో వానలు యగేసుకొంటాయి. తట్న ఒగ సినుగ్గూడా పడెల్లేదు”అని. ఆ మాట్లిన్న రైతుకు బయం సుట్టుకొన్నంట. తెచ్చిన దుడ్లంతా కర్చుపెట్టేకి దయిర్యం సాల్లేదంట.
    అందుకే నూర్రూపాయల్ని అట్లేమిగిలిచ్చుకోని ఇన్నూర్రూపాయల్కి ఎద్దులు కొన్నంట. అది ఎండిరూకల కాలమంట!! దుడ్లని “వొల్లం”లో పేర్సుకోని(నులకల్తో కాని,గట్టి బట్టతో కానీ అరచేతి వెడల్పు-వడిసెల ఆకారంలో– మూడడుగుల పొడవుతో ఉండే పట్టీవంటిది. దాన్లో నాణ్యాలనుంచి నడుముకు చుట్టుకొని, దానిమీద పంచె కట్టుకొనే వారు) నడుముకు సుట్టుకోని వూరికి యల్లబార్నంట.
    కంకర రోడ్లో బిరిబిర్న నడిపిస్తే గిట్టలకి కొట్టిండే నాడాలు సమిసి మెతువు కాళ్లు(గిట్టలరిగి రక్తం కారడం) పడతావని మెల్లిగా నడుస్తావున్నంట. ఆయప్ప జతలో వొళ్లు ముందరయిపాయిరంట. సూస్తావున్నట్లే మబ్బయిపాయనంట. ఈడొస్తుందూరు,ఆడొస్తుంది అని ముందర సూసుకొంటా పోతా వుండాడంట గానీ యాడా సన్న దీపంగూడా కనిపించలేదంట.
    కండ్లు సించుకొన్నాగూడా కనిపించుకుండా వుండే కారు సీకటంట! సుట్టురా మర్రిమాన్లూ, ఇప్పిమాన్లూ దెయ్యాలమాదిరీ కనిపిస్తా వుండివంట. ఆ సెట్టుల్లో నల్ల మిడతలు(కీచురాళ్లు) జిర్ర్ అని అరుస్తావుండివంట. దావపక్క గుంతల్లో సేరుకోని కప్పల్నక్కలు గొళో అని కూస్తావుండివంట. అంతసేపటికి ఒగ దొంగనాకొడుకు అడ్డమొచ్చి “ఏయ్! ఆడ నిలబడ్రా” అని అర్సినంట. ఎద్దులాయప్ప ఇనపిచ్చుకోలేదంట. దొంగోడు నాలుగడుగులు ముందరికొచ్చి, అంగీ కాలరుపట్టుకోని నిలేసి “దుడ్లు యాడుండివో బయటికి తియ్యరా” అన్నెంట. అపుడు ఈయప్పకి కోపమొచ్చి బుజం మిందుండే వార్ల శలకోలా తీసి ఒగటి అంటిచ్చినంట.
    ఆ ఏటు సురుక్కున తగుల్తూనే దొంగోడు నడ్డిలో ఇరికిచ్చుకోనుండే కొస్సిగా వుండే కత్తి తీసి ఎద్దులాయప్పాయ్ప కడుపులోకి కసుక్కున పొడిసినంట. ఆయప్ప “అయ్యో” అని ఒర్లుకొంటా నెట్తుతప్పి కిందకి పడిపాయనంట.
    అపుడు సూడన్నా నా సామిరంగా తమపాట్న తాము మూగ బసవణ్ణల మాదిరీ నడుస్తావున్న ఎద్దులు తోక తొక్కిన నాగుబాము మాదిరీ సర్ర్ న ఎనిక్కి తిరుక్కొన్నంట. కొమ్మల్తో వాన్ని మెలేసి పర్ర్ న సించేకి పాయనంట. సివంగిలు మాదిరీ ఎద్దులు మిందకొస్తూనే పరిగెత్తి పొయ్యి వాడు బాటపక్కలో వుండే సెట్టెక్కినంట.
    అంత సేపటికి ఇంగొగ దొంగొచ్చి  కిందపడిండే రైతు దుడ్లని ఎదికేది మొదలు పెట్నంట. ఒగెద్దు వాన్ని సూసి లగెత్తుకొచ్చి దూరము తరిమేసినంట. ఆతాకి ఇంగొగురు రాకుండా ఈనిన సిరుతపులిమాదిరీ కావిలి కాస్తా నిల్సిపాయనంట.
   సెట్లో ఎక్కిన దొంగని కిందికి దిగనీకుండా ముందరి కాళ్లతో నేలని గీరుకొంటా, కొమ్మల్తో బుడాన్ని(మొదల్ను)పొడుసుకొంటా తెల్లారేదంకా వుండిపాయనంట.
   ఎలుగయితూనే అది పోలీసోళ్లకి తెల్సి, రైతును ఆస్పత్రికి తీసుకపొయ్యి  బతికిచ్చిరంట!!సెట్లొ దాక్కోవుండే దొంగని జయిలుకేసి, ఎద్దులకి బంగారి కొమ్ముకుప్పల బోమానుముగా ఇచ్చిరంట!!
      ****                  ***                ***               ***
   బాటసార్లకీ, యాత్రీకుల్కీసాయం సేస్తే దానాలుసేస్తే దండిగా పుణ్యమొస్తుంది అని గుడ్డిగా నమ్మిన కాలమది!! అయితే ఆపుణ్యం పలాలేవీ మా పల్లిజనాలకి అందినట్ల రుజువులుమాత్రం యాడాలేవు!!
    వానలు ఏటిచ్చె. బాయిలు ఎండిపాయ. బోరింగులేసి బూమమ్మతల్లి పాతాళములో దాసుకోనుండే నీటి కణాల్నంతా తోడి పారేసిరి. టాట్టర్లొచ్చి ఎద్దుజాతిని దుంపనాశనం సేశ. జనాలంతా అచ్చరాలు నేర్సిరి. బతుకులు సదివేది మర్సిపాయిరి. పైర్లు నాటేది మర్సి సెరువులూ,కుంటలూ,ఏర్లూ,వాగులూ ఏకం సేసి ప్లాట్లు గీసి రాళ్లు నాటేది నేర్సిరి.
     ఇపుడు మాపల్లె లేదు. పేరుమాత్రమే వుంది. ముందరపుట్టిన సెవులకన్నా యనకపుట్టిన కొమ్ములు పెద్దవి అన్నట్ల, గువ్వనీ, గుడ్లనీ, గూటినీ దాసరిపాము(కొండచిలువ) మింగేసినట్ల నిన్నా మొన్నా నోట్ల కట్టల్తో  కండ్లు తెర్సిన హిందూపురమనే రంకుది పచ్చగా వున్న మాఊర్ని దిగమింగేసింది.
   ఇపుడు మా జనాల సేతుల్లో యర్రనోట్లు పెళపెళా!! మాటల్లో దుడ్లు గలగలా!!
   పంటల్ని పాడెకెక్కిచ్చి నోట్లని నెత్తికెక్కిచ్చుకోని బతికే దుర్మార్గం కాలము  ఇట్లే యన్నాళ్లుంటుందో సూడల్ల!!??
***

మీ మాటలు

  1. vasavi pydi says:

    బాగుంది ఊరి పేరు యనక కత యాస ఇంపుగా యద్దుల్ని సుసేకి సెవులు కోసుకుంట కాదేమో కళ్ళు కాయలు కాచేలా అని ఉండాలేమో

    • Sadlapalle Chidambara Reddy says:

      మీ భాషాభిమమానికి ధన్యవాదాలు.మీవంటివారు చాలా ఇష్టంగా చదవడం వల్లనే ఇంకా గతాన్ని తవ్వి పోయాలని ఉన్నది.

  2. నిశీధి says:

    ఇంత ఇంటరెస్టింగ్ గా చదివించేలా ఉంటె బడిలో పిల్లకాయలు ఎన్ని హిష్టరీ పాఠాలు సులభంగా చదువుకొనే పనో కదా ! నచ్చింది

    • Sadlapalle Chidambara Reddy says:

      నిషేధి గారు నేను ఉపాధ్యాయుడినే పిల్లలకు పాఠాలు 30 సంవత్సరాల పాటు చెప్పడంవల్లనే, ఇప్పుడు నేను కథలలో అనుసరిస్తున్న పధ్ధతి అబ్బివుంటుందని అనుకుంటున్నాను.మీ హృదయానికి ధన్యవాదాలు.

  3. Karunakar says:

    చాలాబాగుంది సర్. ఇంకా ఈ యాసలో చిట్టి చిట్టి కథలని raasthunnaduku నమసుమాంజలి.

    • sadlapalle chidambarareddy says:

      కరుణాకర్ గారూ మీ భాషాభి మానానికి ధన్యవాదాలు.

  4. sadlapalle chidambarareddy says:

    కరుణాకర్ గారూ మీ భాషాభి మానానికి ధన్యవాదాలు

Leave a Reply to Sadlapalle Chidambara Reddy Cancel reply

*