అక్రమ నిర్బంధానికి పదేళ్ళు!

ఎన్ వేణుగోపాల్

 

venu1చాల ఇష్టమైనవాళ్లు, కౌగిలిలోకి తీసుకొని ఆ స్పర్శను అనుభవించాలని అనిపించేవాళ్లు మూడడుగుల దూరంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఇద్దరి మధ్య మాత్రమే అయిన సన్నిహిత, సున్నిత, ఆంతరంగిక సంభాషణ సాగించాలని అనిపించేవాళ్లు ఒక గజం అవతల నిలబడినప్పుడు ఏం జరుగుతుంది? కాని మీకూ వాళ్లకూ మధ్య అడ్డుగోడ. వాళ్లు కనబడుతూనే వినబడుతూనే ఉంటారు. మీరు చెయ్యి చాపలేరు. అవతలివాళ్లు చెయ్యి అందించలేరు. వాళ్లను మీరు దగ్గరికి తీసుకోలేరు. మీ కంటి తడిని వాళ్ల మునివేలుతో తుడవలేరు. మీకూ వాళ్లకూ మధ్య రెండు ఇనుప జాలీల తెర, ఆ రెండు జాలీల మధ్య ఇటు మూడు అంగుళాలు అటు మూడు అంగుళాలు వదిలి ఇనుప ఊచలు. అప్పుడు మీ హృదయం ఎట్లా రవరవలాడుతుంది? దేహం ఎట్లా స్పర్శ కోసం తపిస్తుంది? అరచెయ్యి అవతలి అరచేతి వేడిని అనుభవించాలని ఎంత కొట్టుకులాడుతుంది? గుండెలోని మాటను చెప్పనూలేక, చెప్పకుండానూ ఉండలేక గొంతు తానే గుండెను ఎలా పొదివి పట్టుకుంటుంది? మనశ్శరీరాలు వాగర్థాల లాగ కలిసిపోయి ఏ అనంతవేదనను అనుభవిస్తాయి? సామీప్యమే సుదూరమైన ఆ కఠినమైన, భయానకమైన, దుఃఖభాజనమైన ఎరుక ఎలా ఉంటుంది?

పది సంవత్సరాల కింద అటువంటి అనుభవం ఎన్నోసార్లు కలిగింది.

నిజామాబాదులో రఘునాథాలయం అనే బోర్డు ఉన్న ఎత్తైన పెద్ద కోట సింహద్వారంలోంచి లోపలికి వెళ్లి, ఒక మలుపు తిరిగితే గుట్ట మీదికి ఓ వంద మెట్లుంటాయి. ఆ మెట్లన్నీ ఎక్కితే ఒక పక్కన పాత కాలపు గడీ బంకుల లాంటి వరండా, మరొక పక్కన కొండ అంచు పిట్టగోడ. ఆ వరండాను కూడ గదిగా మార్చి అక్కడ కాపలా జవాన్లు ఉంటారు గనుక అక్కడ కూచోవడానికీ నిలబడడానికీ వీల్లేదు. ఆ వరండాకూ ఇటు లోయ పిట్టగోడకూ మధ్య సరిగ్గా ముగ్గురు మనుషులు నిలబడగలిగినంత స్థలంలో అన్నిటికన్న పై మెట్టు. దాని అవతల ‘ప్రధాన జైలు’ అని రాసి ఉన్న దిట్టమైన తలుపు. ఆ తలుపు పైభాగంలో ఇనుప జాలీ, దాని వెనుక ఇనుప ఊచలు. ఆ వెనుక మరొక ఇనుప జాలీ. ఆ తర్వాత కటకటాల తలుపు. అక్కడినుంచి ఆరడుగుల నడవా. దానికి ఒకపక్కన జైలు అధికారుల గదులు. ఆ నడవా చివర కిందికి దిగడానికి నాలుగైదు మెట్లు. మెట్ల చివర మళ్లీ ఒక చిన్న చెక్క గేటు. అది దాటి లోపలికి వెళ్లి రెండు మలుపులు తిరిగి ఇరవై ముప్పై గజాలు నడిస్తే మళ్లీ గేటు. అది దాటితే నాలుగు వైపులా ఖైదీల బారక్ లు, మధ్యలో కాపలా జవాన్ల గది, దాని పక్కన నీళ్ల ట్యాంక్. అక్కడున్న బారక్ లలో ఒకదాంట్లో దాదాపు ఇరవై రోజులు నిర్బంధంలో గడిపి పది సంవత్సరాలు గడిచింది.

 

మహారాష్ట్ర ఔరంగాబాదులో జరిగిన అరెస్టు, మానసిక హింసతో, ప్రశ్నల వేధింపులతో మూడు రోజుల పాటు అక్రమ నిర్బంధం, అబద్ధపు ఆరోపణలతో నిజామాబాదులో కేసు, ఇరవై రోజుల పాటు నిజామాబాదు జైలు జీవితం, ఐదు సంవత్సరాల పాటు సాగిన విచారణ, ఆ విచారణలో పోలీసుల అబద్ధాలు ఒకటొకటిగా తుత్తునియలు కావడం, చివరికి కేసు కొట్టివేత, నిర్దోషిగా విడుదల ఎన్నో స్థాయిలలో నామీద ప్రభావం వేశాయి. అంతకు ముందు రెండు మూడు సార్లు పోలీసు నిర్బంధంలోకీ, జైలులోకీ కూడ వెళ్లాను. అంతకు ముప్పై సంవత్సరాల ముందు నుంచీ కుటుంబ సభ్యుల, మిత్రుల అరెస్టుల సందర్భంగా వారిని కలవడానికి జైలుకు వెళ్తూ ఉన్నాను. కాని ఈసారి అనుభవం పూర్తిగా కొత్తది. మన ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ, న్యాయవ్యవస్థల పనితీరు గురించి ఆ నిర్బంధం నాకు అనుభవైకవేద్యమైన పాఠాలు నేర్పింది. స్టేట్ వర్సస్ గంటి ప్రసాదం అండ్ అదర్స్ అనే ఆ కేసులో నా సహనిందితుడు, గురువు, మిత్రుడు గంటి ప్రసాదం హత్యకు గురయి రెండు సంవత్సరాలయింది. ఆ కేసు నాటికి విప్లవ రచయితల సంఘంలో సభ్యుడిగా ఉండిన నేను ఇవాళ ఆ స్థానంలో లేను గాని, ఏ విశ్వాసాలతో ఆ నిర్బంధాన్ని అనుభవించానో ఆ విశ్వాసాలు ఇవాళ మరింత దృఢంగా ఉన్నాయి. పది సంవత్సరాలు నిండిన సందర్భంగా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి, ఆ భయోద్విగ్న అనుభవాలను, అవి ఇచ్చిన అవగాహనలను పంచుకోవాలనిపిస్తున్నది.

“ఆ అరెస్టు, కేసు, నిర్బంధం వ్యక్తిగతంగా నాకు సంబంధించినవి మాత్రమే కావు. అవి బహిరంగ ప్రజాజీవిత వ్యవహారాలు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, పౌరహక్కులు, పోలీసు వ్యవస్థ, పాలనా విధానాలు ఏ రకంగా ఉన్నాయో నగ్నంగా, బహిరంగంగా చూపిన వ్యవహారాలు. అందువల్ల ఆ అంశాలను తెలుసుకునే హక్కు, తెలుసుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉన్నాయి. మనం ఎన్నుకున్న ప్రభుత్వం, మన పన్నులలోంచి జీతాలు తీసుకుంటున్న పోలీసు వ్యవస్థ మనకోసం ఏం చేస్తున్నాయో, మనలో కొందరిని నిర్బంధించడానికి ఎన్నెన్ని అబద్ధాలు ఆడుతున్నాయో, ఎన్నెన్ని కుయుక్తులు పన్నుతున్నాయో మనం సంపూర్ణంగా తెలుసుకోవలసి ఉంది” అని నా అరెస్టు సమయానికి ప్రజాతంత్ర వారపత్రికలో నేను రాస్తుండిన ‘ఆఖరిపేజీ’ కాలంలో విడుదలై రాగానే రాశాను. (ప్రజాతంత్ర 2005 జూన్ 19-25)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ, నక్సలైట్లకూ మధ్య 2004 అక్టోబర్ లో హైదరాబాదులో తొలివిడత చర్చలు జరిగాయి. రెండు పార్టీలకు చెందిన నక్సలైట్ల ప్రతినిధులతో ఆ చర్చలు జరిగాయి. ఒకటి అంతకు ముందు వరకూ భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు లెనినిస్టు) (పీపుల్స్ వార్) గా ఉండి, సరిగ్గా చర్చల సమయంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) గా మారినది. మరొకటి భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు లెనినిస్టు) (జనశక్తి). రెండో విడత చర్చలకు నవంబర్ లో ఆహ్వానిస్తామనే ప్రభుత్వ హామీతో, రెండువైపులా కాల్పుల విరమణ ఒప్పందంతో నక్సలైట్లు వెనక్కి వెళ్లారు. కాని ఆ రెండో విడత చర్చలు జరగనే లేదు. మళ్లీ ఆహ్వానిస్తామన్న ప్రభుత్వం ఆ ప్రస్తావనే మానేసి మళ్లీ నిర్బంధం ప్రారంభించి, జనవరి 2005 తర్వాత ఎన్ కౌంటర్లు, దాడులు, కూంబింగులు, అరెస్టులు మొదలుపెట్టింది.

ప్రభుత్వం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది గనుక తామూ కట్టుబడి ఉండబోవడం లేదని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. నక్సలైట్ల వైపునుంచి ప్రతిదాడులు, ఇన్ఫార్మర్ల హత్యలు, పోలీసుస్టేషన్లపై దాడులు మళ్లీ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజాభిప్రాయం ఎలాఉన్నదో తెలుసుకోవాలని మావోయిస్టుపార్టీ రాష్ట్ర నాయకత్వం అనుకుంటున్నదనీ, విస్తృత ప్రజా సంబంధాలతో ప్రజాభిప్రాయం ఏమిటో చెప్పగల ప్రముఖులనూ, రచయితలనూ, పాత్రికేయులనూ కలవదలచుకున్నామనీ. అప్పటి మావోయిస్టు పార్టీ రాష్ట్రకమిటీ మీడియా ప్రతినిధిగా ఉన్న బలరాం (గంటి ప్రసాదం) కబురు పంపారు. ఈ విషయం మాట్లాడడానికి నేను తనను కలవడం వీలవుతుందా అని అడిగారు. ప్రభుత్వ నిర్బంధం పెరిగిన స్థితిలో తన భద్రత దృష్ట్యా ఈ కలయిక రాష్ట్రం బైట జరిగితే మంచిదని, అందువల్ల రెండు రోజుల కోసం ఔరంగాబాదు రమ్మని అడిగారు. నాతోపాటు విరసం ఉపాధ్యక్షులు, అరుణతార మాజీ సంపాదకులు, కావలి జవహర్ భారతిలో తెలుగు అధ్యాపకులు వి. చెంచయ్య, అరుణతార సంపాదకులు పినాకపాణి, అరుణతార మేనేజర్ రవికుమార్ కూడ వస్తారని రాశారు.

venu2

నేను అప్పటికి ఇరవై సంవత్సరాలుగా పాత్రికేయుడిగా ఎట్లా ఉన్నానో, అట్లాగే విరసం సభ్యుడిగా కూడ ఉన్నాను.  పాత్రికేయుడిగానూ, విరసం సభ్యుడిగానూ ఆయనను కలవడానికి నాకేమీ అభ్యంతరం కనిపించలేదు. నా వ్యక్తిత్వంలోని ఈ రెండు పార్శ్వాలమధ్య పెద్ద విభజన రేఖ ఉన్నదని నేనెప్పుడూ అనుకోలేదు. అట్లని పాత్రికేయ వృత్తి విధి నిర్వహణలోకి రాజకీయ విశ్వాసాలను తీసుకురాలేదు. మాట్లాడతానంటున్నది ఒక రాజకీయపార్టీ మీడియా ప్రతినిధి. మాట్లాడదలచుకున్నది పాత్రికేయుడిగా, విరసం సభ్యుడిగా ఉన్న నాతో. అటువంటప్పుడు అభ్యంతరం ఎందుకుండాలి? అంతకు ఆరు నెలల ముందే ఆ పార్టీ రాష్ట్రకమిటీ కార్యదర్శితో, ఇతర నాయకులతో స్వయంగా రాష్ట్ర హోంమంత్రి, మరి ముగ్గురు మంత్రులు వారంరోజులపాటు ప్రభుత్వ భవనంలోనే మాట్లాడారు. ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం హైదరాబాదులో ప్రభుత్వ మంజీర అతిథి గృహంలో ఉన్నప్పుడు వేలాది మంది కలిసి మాట్లాడారు. మరి నాకెందుకు అభ్యంతరం ఉండాలి?

నిజానికి ఆ పార్టీ మీద నిషేధం ఉన్న రోజుల్లోనే ఆ పార్టీ అగ్రనాయకులెందరినో డజన్లకొద్దీ పాత్రికేయులు రహస్యంగా కలిసి పత్రికలలో, ప్రచార సాధనాలలో ఎన్నో వార్తాకథనాలు, ఇంటర్వ్యూలు ప్రచురించారు. ఆ పార్టీ మీద నిషేధం ఉన్న రోజులలోనే ఎస్ ఆర్ శంకరన్, పొత్తూరి వెంకటేశ్వరరావు, ప్రొ. హరగోపాల్ తదితరులు ఆ పార్టీ అగ్రనాయకత్వాన్ని కలిసి, మాట్లాడి, తిరిగి వచ్చి తాము మాట్లాడిన విషయాలు అప్పటి ముఖ్యమంత్రికి తెలియజేశారు. నిషేధం ఉన్నరోజులలోనే తమ సంభాషణలను పుస్తకరూపంలో వెలువరించారు. మరి ఆ పార్టీ మీద నిషేధం కూడ లేనప్పుడు, నాయకులలో ఒకరిని కలవడానికి నాకెందుకు అభ్యంతరం ఉండాలి? ఇరవై సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో, పది సంవత్సరాలకు పైబడిన విలేకరి వృత్తిలో, ఇరవై రెండు సంవత్సరాలుగా విరసం సభ్యుడిగా కొన్ని వేల మందిని కలిసి, చర్చించి, పత్రికలలో రాసిఉన్న నేను ఇవాళ ఈయనను కలవడానికి ఎందుకు సంకోచించాలి?

అందుకే 2005 మే 28 సాయంత్రం కాచిగూడ – మన్మాడ్ ఎక్స్ ప్రెస్ లో ఔరంగాబాదు బయల్దేరాను. మర్నాడు ఉదయమే మహారాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ గెస్ట్ హౌజ్ లో నా పేరు మీదనే గది తీసుకున్నాను. కాసేపటికి ప్రసాదం, ఇతర మిత్రులు వచ్చారు. ఆ గదిలోనే ఆ రోజంతా, ఆ మర్నాడూ కూచుని మాట్లాడుకున్నాం. మే 30 సాయంత్రం ఏడు – ఏడున్నర మధ్య తలుపు తోసుకుని దాదాపు ఇరవై మంది ఆయుధధారులైన మఫ్టీ పోలీసులు వచ్చేదాకా మాట్లాడుకుంటూనే ఉన్నాం.

వాళ్లు గదిలోకి వస్తూనే, మేం ఎవరమో, ఏం చేస్తున్నామో కూడ కనుక్కోకుండానే మామీద పడ్డారు. కళ్లకు గంతలు కట్టారు. చేతులు వెనక్కి విరిచి కట్టారు. మేం జర్నలిస్టులమనీ, రచయితలమనీ చెపుతున్నా పట్టించుకోకుండా పోలీసు మార్కు ప్రవర్తన రుచి చూపించి ఒకటి రెండు దెబ్బలు వేశారు. జీపుల్లోకి తోశారు. ఔరంగాబాద్ లోనే ఉన్న వాళ్ల రహస్య స్థావరానికి తీసుకుపోయారు. ఒకరోజంతా అక్కడ ఉంచి ప్రశ్నలతో వేధించారు. చంపుతామని బెదిరించారు. మర్నాడు రాత్రి వాహనాలు ఎక్కించి, ఏడెనిమిది గంటలు ప్రయాణం చేయించారు. మరొక చోట మళ్లీ రెండు రోజులు అట్లాగే కళ్లకు గంతలతో, చేతులు వెనక్కి విరిచికట్టి ఒక గదిలో నిర్బంధించారు. అప్పటిదాకా మాపక్కన ఉన్నవాళ్లు మమ్మల్ని పట్టుకున్న మూడో రోజు మధ్యాహ్నం, “ఇక మామూలు పోలీసులు వచ్చి మీ బాధ్యత తీసుకుంటారు” అని చెప్పి వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లాక అరగంటకు వచ్చిన పోలీసులు మమ్మల్ని అలాగే కళ్లకు గంతలతో, విరిచికట్టిన చేతులతో ఒక వ్యాన్ ఎక్కించి అరగంట ప్రయాణం చేయించారు. అక్కడ మా కట్లు విప్పదీస్తే అది నిజామాబాదు డిఐజి కార్యాలయం అని మాకు తెలిసింది.

అక్కడ పత్రికా సమావేశంలో మమ్మల్ని ప్రవేశపెట్టినదాకా, అంటే మే 30 సాయంత్రం ఏడు నుంచి జూన్ 2 సాయంత్రం నాలుగు దాకా, దాదాపు 70 గంటలు మేం కళ్లకు గంతలతో, కట్టేసిన చేతులతో, ఒకరితో ఒకరం మాట్లాడుకోవడానికి వీలులేకుండా, మధ్యలో ప్రశ్నల వేధింపులతో, చంపుతామనే బెదిరింపులతో నిర్బంధంలో, మా అదృశ్యం గురించి మా కుటుంబాలు ఎలా ఆందోళన పడుతున్నాయో వేదనతో ఉన్నాం. అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల కంటె ఎక్కువసేపు కోర్టులో హాజరుపరచకుండా ఉంచుకోగూడదని, హింసించగూడదని, నిందితుల పట్లనైనా వ్యక్తిగత గౌరవాన్ని చూపాలని, చట్టబద్ధమైన విచారణలో నిస్సందేహంగా రుజువయ్యేవరకూ నిందితులను కూడ నిర్దోషులుగానే పరిగణించాలని చెప్పే చట్టాలు, ప్రజాజీవనంలో ప్రముఖులుగా, రచయితలుగా ఉన్న మాపట్లనే ఇంతగా ఉల్లంఘనకు గురైతే ఇక దేశంలో అనామకులకు, పేదలకు న్యాయం అందుతుందంటే ఎవరు నమ్ముతారు? చట్టం గురించి చదువుకుని, రాసే, మాట్లాడే, వ్యక్తీకరించుకోగలిగిన మమ్మల్నే పోలీసు వ్యవస్థ ఇలా వేధించగలిగితే, ఇక ఈ దేశంలోని కోట్లాది మంది నిరుపేద, నిరక్షరాస్య, అమాయక ప్రజానీకం మీద ఎంతటి దుర్మార్గం, దాష్టీకం అమలు కావడానికి అవకాశం ఉంది!

ఔరంగాబాదుకు మా ప్రయాణాలు, ఔరంగాబాదులో మా బస అన్నీ సంపూర్ణమైన సాక్ష్యాధారాలతో ఉన్నాయి గనుక పోలీసులకు వాటిని తారుమారు చేయడం సాధ్యం కాలేదు. అందువల్ల మేం ఔరంగాబాదులో సమావేశమయ్యామనే నిజం చెప్పారు. మరి ఆంధ్రప్రదేశ్ పోలీసులు మహారాష్ట్రలోని పట్టణానికి వెళ్లి అక్కడినుంచి ఐదుగురు వ్యక్తుల్ని ఎత్తుకురావడానికి చట్టబద్ధంగా వీల్లేదు గనుక నిజామాబాదులో అరెస్టు చేశామని అబద్ధం చెప్పారు. మేం ఔరంగాబాదు సమావేశం నుంచి నల్లమలకు తిరిగివెళ్తూ, నిజామాబాదు పరిసరాల్లో దిగి తచ్చాడుతుండగా జూన్ 2 మధ్యాహ్నం పోలీసుల చేతికి చిక్కామని కట్టుకథ అల్లారు. పోలీసు రచయితల భౌగోళిక పరిజ్ఞానం అంత ఘనంగా ఉంది! ఎవరైనా ఔరంగాబాదునుంచి నల్లమలకు వెళ్లదలచుకుంటే ఏమార్గంలో వెళతారో పటం చూస్తే ఎవరికైనా తెలుస్తుంది. అందుకు నిజామాబాదు వెళ్లనక్కరలేదు. అంతేకాదు, నా హైదరాబాద్ తిరుగుప్రయాణపు టికెట్ మన్మాడ్ – కాచిగూడ ఎక్స్ ప్రెస్ లో మే 31 సాయంత్రానికి బుక్ అయి ఉంది. చెంచయ్య, పినాకపాణి, రవికుమార్ లకు తిరుగు ప్రయాణపు టికెట్లు హమ్ సఫర్ ట్రావెల్స్ బస్సులో మే 31 సాయంత్రానికి హైదరాబాదుకు బుక్ అయిఉన్నాయి. పోలీసులు మా జేబుల్లోంచి లాగేసుకున్న ఆ టికెట్లను చించివేసి ఉండవచ్చు గాని బుక్ చేసుకున్న ఆసాములు రాలేదని రైల్వేవారి దగ్గర, బస్సు కంపెనీ దగ్గర సాక్ష్యాధారాలు ఉండే ఉంటాయి.

ఏదయినా నేరం జరిగినప్పుడు, లేదా నేరం జరగబోతున్నదని తెలిసినప్పుడు ఆ నేరస్తులను, అనుమానితులను నిర్బంధంలోకి తీసుకుని, దర్యాప్తు జరిపి, న్యాయవిచారణ కోసం న్యాయస్థానం ముందుపెట్టి, తమ ఆధారాలు చూపి, శిక్ష విధించడం ఎందుకు అవసరమో వాదనలు వినిపించవలసిన బాధ్యత పోలీసు శాఖది. అందులోనూ శాంతిభద్రతల విభాగానిది. కాని మహత్తర ప్రజాపోరాటాల చరిత్ర ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఈ సంప్రదాయం ఎప్పుడో కనుమరుగయి పోయింది. ప్రజలను నిష్కారణంగా అనుమానించడం, ప్రజాపోరాటాలను అణచివేయడం, పోరాట నాయకులను దొంగచాటుగా పట్టుకుని చంపడం, ప్రజల పక్షం తీసుకునే బుద్ధిజీవులను నిరంతర నిఘాతో వేధించడం, అందుకోసం తోచిన అబద్ధమల్లా చెప్పడం మాత్రమే పోలీసుశాఖకు తెలిసిన పనులయిపోయాయి.

ఈ క్రమంలో పోలీసులు మామూలు నేరాలను అరికట్టడం, ఆ నేరస్తులను పట్టుకోవడం, సరయిన దర్యాప్తు జరపడం, పటిష్టంగా నేరారోపణచేసి న్యాయవిచారణకు సహకరించడం వంటి అసలు పనులు మరచిపోయారు. ప్రజలను అణచివేయడం అనే ఒక్క పని చేస్తే చాలునని, అది చేస్తే లెక్క చూపనక్కరలేని నిధులూ, పదోన్నతులూ, ఇతర సౌకర్యాలూ కల్పిస్తామని పాలకులు పోలీసులకు నేర్పిపెట్టారు. ఎంతమందిని చంపితే అంత తొందరగా పదోన్నతులు కల్పించే దుర్మార్గమైన హంతక విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్షరాలా ప్రకటించి అమలు చేసింది. ఈ ప్రభుత్వ ప్రోత్సాహంవల్ల పోలీసులు ప్రజాపోరాటాలను అణచగలిగారో లేదో తెలియదు గాని, వాళ్లకు వృత్తిధర్మంగా ఉండవలసిన తెలివీ, నైపుణ్యమూ కూడ కోల్పోయారు. ఎవరి పని ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలియని అరాచకం రాజ్యం ఏలడం మొదలయింది.

ఆ అరాచకంలో భాగంగానే ఆంధ్ర ప్రదేశ్ పోలీసుశాఖలోకెల్లా క్రూరమైన స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ ఐ బి) అనే వ్యవస్థ తయారయింది. ఈ ఎస్ ఐ బి ఎవరికి జవాబుదారీయో ఎవరికీ తెలియదు. విప్లవకారులను దొంగతనంగా పట్టుకుని కాల్చిచంపడమే వాళ్ల పని. అందుకొరకు దేశంలోని ప్రధాన నగరాలన్నిటిలో వాళ్ల స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఏళ్ల తరబడి ఆ నగరాలలో తమకు కావలసిన వాళ్లకోసం వేటాడుతూ ఉండడం మినహా వాళ్లకు మరొక పని లేదు. ఔరంగాబాద్ లో మహారాష్ట్ర టూరిజం గెస్ట్ హౌజ్ లో కూచుని మాట్లాడుకుంటున్న మామీద దాడి చేసినదీ, అక్కడ తాము నిర్వహిస్తున్న రహస్య స్థావరంలో ఒకరోజంతా పెట్టుకున్నదీ వాళ్లే. రెండున్నర రోజులపాటు మాతోపాటు ఉన్నది వాళ్లే. ఆ తర్వాత వాళ్లు మమ్మల్ని మామూలు పోలీసులకు అప్పగించి వెళ్లిపోయారు. వాళ్లను మేం చూడకుండా, గుర్తు పట్టకుండా ఉండడం కోసమే మా కళ్లకు గంతలు.

ఇక మమ్మల్ని నిజామాబాదులో అప్పుడే పట్టుకున్నట్టు శాంతిభద్రతల పోలీసులు చెప్పిన అబద్ధం మీద ఆధారపడి మా మీద కేసు నిర్మాణమయింది. ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఔరంగాబాద్ లో కుట్ర పన్ని, అది అమలు చేయడానికి నల్లమల వెళుతుండగా నిజామాబాదులో పట్టుకున్నామని అల్లిన కట్టుకథ మామీద నేరారోపణ. ఆ ఎఫ్ ఐ ఆర్ తో మమ్మల్ని జుడిషియల్ కస్టడీకి పంపించడానికి నిజామాబాదు మెజస్ట్రీటు ముందర హాజరు పరచవలసి ఉండింది. నిజామాబాదులో హాజరు పరుస్తామని చివరిదాకా చెపుతూ వచ్చారు. కాని అంతకు ముందురోజు సాయంత్రం నుంచే మా అరెస్టు వార్త టివిల్లో వచ్చినందువల్ల నిజామాబాదు కోర్టుకు చాలమంది రావడంతో, చివరి నిమిషంలో ఏదో సాంకేతిక కారణం చూపి బోధన్ మెజస్ట్రీట్ ముందర హాజరుపరిచారు.

ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 120 (బి) (నేరస్వభావంగల కుట్ర), సెక్షన్ 121 (ఎ) (భారతప్రభుత్వంపై యుద్ధం చేయడానికి, లేదా యుద్ధాన్ని ప్రోత్సహించడానికి కుట్ర), సెక్షన్ 122 (భారత ప్రభుత్వంపై యుద్ధం చేసే ఉద్దేశ్యంతో ఆయుధాలు, తదితరాల సేకరణ) అనే అభియోగాలతో మా మీద కేసు నమోదు చేశారు. మా అక్రమ నిర్బంధం గురించీ, శారీరక, మానసిక చిత్ర హింసల గురించీ, పోలీసులు చెపుతున్న అబద్ధాల గురించీ బోధన్ మెజస్ట్రీట్ ముందు నేను పావుగంట పాటు వినిపించిన వాదన అరణ్యరోదన అయింది. చిన్నకోర్టులన్నిట్లోనూ న్యాయమూర్తులకు తమకు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నదనే గుర్తింపే ఉండదు. హాలులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పక్కన నిలబడి ఉన్న సర్కిల్ ఇనస్పెక్టర్ వైపో, డీ ఎస్పీ వైపో చూస్తూ వాళ్ల కనుసన్నలను బట్టి ప్రవర్తిస్తుంటారు.

venu4

మా అరెస్టుల గురించి మొత్తంగానూ, నా అరెస్టు గురించి ప్రత్యేకంగానూ చాల నిరసన వ్యక్తమయింది. అప్పటికి పదమూడు సంవత్సరాలుగా రోజుకు మూడు ఇన్సులిన్ ఇంజక్షన్లు తీసుకోవలసిన డయాబెటిక్ గా ఉన్న నా ఆరోగ్య పరిస్థితివల్ల మిత్రులు, శ్రేయోభిలాషులు కలత చెందారు. అంతర్జాతీయ సంస్థల నుంచి స్థానిక సంస్థల దాకా మా అరెస్టులను ఖండిస్తూ, మాకు సంఘీభావం తెలుపుతూ ప్రకటనలు ఇచ్చాయి. సెక్రటేరియట్ లో జరిగిన పత్రికా సమావేశంలో నా ప్రస్తావన వస్తే స్వయంగా ముఖ్యమంత్రి “ఆయనకు బెయిల్ పిటిషన్ దాఖలయితే ప్రభుత్వం వైపు నుంచి దాన్ని వ్యతిరేకించబోము. ఆయనను మళ్లీ పోలీసు విచారణకు పిలిపించబోము” అన్నారు. కాని నిజామాబాదు కోర్టులో నా బెయిల్ పిటిషన్ దాఖలు కావడానికి ముందే, విచారణకోసం తమకు అప్పగించాలని పోలీసులు కోరి ఉన్నందువల్ల నాకు బెయిల్ రాలేదు.

వెంటనే ముఖ్యమంత్రిని హైదరాబాదులోనూ, కర్నూలులోనూ పాత్రికేయ మిత్రులు ప్రశ్నించారు. “ఏదో సమాచార లోపం వల్ల అలా జరిగింది” అన్నారాయన! హైటెక్ ప్రభుత్వానికి అంత సమాచార లోపం! మళ్లీ ఐదు రోజుల తర్వాత రెండోసారి బెయిల్ దరఖాస్తు దాఖలయింది. కాని నిజామాబాదు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు నా బెయిల్ దరఖాస్తును వ్యతిరేకించగూడదనే ఆదేశమేమీ లేదు. ఆయన అన్ని బెయిల్ దరఖాస్తులనూ వ్యతిరేకించినట్టే, ఈ దరఖాస్తును కూడ వ్యతిరేకించారు. అయినా మా న్యాయవాది వాదనలోని బలంవల్ల నేనూ, మిత్రులందరమూ బెయిల్ మీద విడుదలయ్యాం. అలా నిజామాబాదు జైలులో దాదాపు ఇరవై రోజులు ఉండే అవకాశం వచ్చింది.

నిజామాబాదు జైలు తెలంగాణ జనజీవితంలో, సాహిత్యంలో ముఖ్యమైనది. వట్టికోట ఆళ్వారుస్వామి, దాశరథి కృష్ణమాచార్య వంటి మహామహులు నిజాం వ్యతిరేకపోరాటంలో ఆ జైలులో బందీలుగా ఉన్నారు. ‘నాతెలంగాణ కోటి రతనాల వీణ’ అని దాశరథి పద్యాలు రాసినది ఆ జైలులోనే. పోలీసులు చెరిపినకొద్దీ ఆ పద్యాలను మళ్లీ మళ్లీ గోడలమీద బొగ్గుతో ఆళ్వారుస్వామి రాసినదీ ఆ జైలు లోనే. ఆ జైలులోకి వెళ్లడం ఒక అపురూపమైన అనుభవం. అక్కడి గోడల మీద ఆరు దశాబ్దాల కింది దాశరథి, ఆళ్వారుస్వామి అక్షరాలు ఉన్నాయా అని వెర్రిగా వెతికాను. జైలు నుంచి బైటికి రాగానే ‘ఖిలా జైలు – దాశరథి నుంచి ఇవాళ్టి దాకా’ అని నేను రాసిన వ్యాసం ఆంధ్రజ్యోతి వివిధ లో అచ్చయింది.

జైలు జీవితం చిత్రమైనది. ఎవరు తయారు చేశారో, ఎందుకు తయారు చేశారో ఎవరికీ తెలియకుండానే ఖైదీలను శారీరక, మానసిక చిత్రహింసలకు గురిచేసే దారుణమైన నిబంధనలు అమలవుతుంటాయి. అన్నిటిలోకీ విచిత్రమైనది జీవితాన్ని కురచబార్చడం. ఉదయం ఆరింటికి బారక్ ల తాళాలు తెరుస్తారు. సాయంత్రం ఆరింటికి తాళాలు వేస్తారు. అంటే పన్నెండు గంటలు మాత్రమే బారక్ బైటి జీవితంతో సంబంధం ఉంటుంది. ఆ పన్నెండు గంటలలోకే మొత్తం ఇరవై నాలుగు గంటల జీవితాన్ని కుదించుకోవాలి. రోజుకు మూడు సార్లు ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకోవలసిన రోగగ్రస్తుడిగా నాకు ఈ నిబంధన ప్రాణాంతకమయింది. ఖైదీలను ఆత్మహత్యా ప్రయత్నం నుంచి రక్షించడానికి ఖైదీల దగ్గర అందుకు ఉపయోగపడే పరికరాలేవీ ఉండనివ్వగూడదని ఒక నిబంధన. అందువల్ల బారక్ లో నా దగ్గర ఇంజక్షన్ ఉంచుకోవడానికి వీలులేదు. అది జైలర్ గదిలో రక్షణలో ఉండేది. నా బారక్ తాళం తెరిచిన తర్వాత అరగంటకో, గంటకో ఏడు గంటల సమయంలో ఉదయపు ఫలహారం తినే ముందు జైలర్ గదికి వెళ్లి ఇంజక్షన్ తీసుకుని రావాలి. మధ్యాహ్న భోజనం పదకొండు, పన్నెండు మధ్య మళ్లీ జైలర్ దగ్గరికి వెళ్లి ఇంజక్షన్ తీసుకోవాలి. రాత్రి భోజనం బారక్ తాళాలు వేయక ముందే అంటే ఐదు, ఐదున్నర ప్రాంతాలలో పెడతారు గనుక మూడో ఇంజక్షన్ అప్పుడు తీసుకోవాలి. పోనీ ఆ అన్నం తీసుకుని పక్కన పెట్టుకుని కొన్ని గంటల తర్వాత తిందామనుకుంటే, ఆ మొద్దు బియ్యం అన్నం అరగంట ఆలస్యమైనా తినడం అసాధ్యం. అంటే కనీసం ఆరు-ఎనిమిది గంటల వ్యవధి ఉండవలసిన నా ఇన్సులిన్ ఇంజక్షన్లు నాలుగు-ఐదు గంటల వ్యవధికి మారిపోయాయి. మరొకపక్క సాయంత్రం ఇంజక్షన్ కూ ఉదయం ఇంజక్షన్ కూ మధ్య పన్నెండు గంటల వ్యవధి వచ్చింది. ఇన్సులిన్ మీద ఆధారపడే డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు ఇది ఎంత ప్రమాదకరమైన పరిణామమో చెప్పనక్కరలేదు.

venu5

అలాగే జైలు జీవితం గొప్ప అనుభవం, మహత్తర పాఠశాల. జాలీ ములాఖాత్ సంభాషణలు మానవ సంబంధాల మీద ఇనుపతెరలు కప్పుతాయి. అతి చిన్న నేరాలు చేసినందువల్లనో, అసలు నేరాలే చేయకుండానో నెలల తరబడీ, సంవత్సరాల తరబడీ జైలులో గడిపే అమాయకుల విభిన్న జీవన దృశ్యాలు కంట తడి పెట్టిస్తాయి. జైలు గ్రంథాలయంలో దొరికే పుస్తకాలూ, దినపత్రికలూ తక్కువ గనుక దొరికిన ప్రతి అక్షరాన్నీ ఆబగా చదవడం అలవాటవుతుంది. సహఖైదీలతో ఎడతెరిపిలేని చర్చలు వాటికవే వివరంగా రాయవలసిన గ్రంథాలు అవుతాయి.

బెయిల్ మీద విడుదలైన తర్వాత ఐదు సంవత్సరాలపాటు ప్రతి నెలా రెండుసార్లు మేం నిజామాబాద్ కోర్టుకు హాజరు కావలసివచ్చింది. వాదనల సమయంలో పది రోజులు నిజామాబాదులోనే ఉండవలసి వచ్చింది. ఈ వాయిదాల కోసం ప్రతిసారీ కావలి, ప్రొద్దటూరు, కర్నూలు, హైదరాబాదు వంటి సుదూర ప్రాంతాలనుంచి గంటలకొద్దీ ప్రయాణాలు చేసి, కోర్టులో రోజంతా పడిగాపులు పడి, న్యాయస్థానం చుట్టూ తిరగడంలో ఐదు సంవత్సరాల విలువైన కాలం వ్యర్థమయింది. అలా మా సమయమూ, ఆర్థిక వనరులూ, ఆరోగ్యాలూ దెబ్బతిన్న తర్వాత మామీద నేరారోపణలను పోలీసు ప్రాసిక్యూషన్ రుజువు చేయలేకపోయింది. అడిషనల్ సెషన్స్ జడ్జి సి వెంకటేష్ 2010 ఆగస్ట్ 2 న కేసు కొట్టివేస్తూ తీర్పు చెప్పారు. మమ్మల్ని నిరపరాధులుగా వదిలేశారు. మరి మేం నిరపరాధులమైతే, మమ్మల్ని అపరాధులుగా నిరూపించడానికి విఫల ప్రయత్నం చేసినవాళ్ల అపరాధం మాటేమిటి?

పోలీసులు కేసు నడిపినతీరు తప్పులతడక అని వర్ణిస్తే అది చాల చిన్నమాట అవుతుంది. మా అరెస్టు చూపిన పత్రికాసమావేశంలో భయంకరమైన నేరం జరగబోతుండగా పట్టుకున్నట్టు ఆర్భాటంగా ప్రకటించిన పోలీసులు ఏ ఒక్క ఆరోపణనూ రుజువు చేయలేకపోయారు. అసలు ఎవరిమీదనైనా సెక్షన్ 120 (బి) కింద ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయదలచుకున్నప్పుడు ముందుగా ప్రభుత్వ అనుమతి, మెజస్ట్రీట్ అనుమతి తీసుకోవాలని చట్టం చెపుతుంది. కాని ఆ అనుమతి తీసుకోకుండానే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు, కేసు నడిపారు. పోలీసు రాజ్యం నడుస్తున్నదనడానికి, స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్రాంచ్ చట్టవ్యతిరేక ప్రవర్తనకు అది తొలి నిదర్శనం. అసలు నేరారోపణలు అబద్ధం కనుకనే తర్వాత విచారణలో పోలీసు సాక్షులలో ఒక్కరు కూడ ఆ అబద్ధాన్ని రుజువు చేసే కథనం చెప్పలేకపోయారు. వాస్తవమయితే ఒకటే కథనం ఉంటుంది కాని అబద్ధం ఆడినప్పుడల్లా మారుతుంది. మమ్మల్ని నిజామాబాదు పొలిమేరల్లో అరెస్టుచేయడానికి ఒకే వాహనంలో వెళ్లామని చెప్పిన ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు ఆ వాహనం తూర్పుకు వెళ్లిందని ఒకరు చెపితే పడమటికి వెళ్లిందని మరొకరు చెప్పారు. మమ్మల్ని నిజామాబాదులో అరెస్టు చేసేటప్పుడు చూశామని పంచనామా మీద సంతకం చేసిన ఇద్దరు సాక్షులు ఆటోడ్రైవర్లు. తమ ఆటోలను పోలీసులు జప్తు చేసుకుని పోలీసు స్టేషన్ లో పెట్టుకుంటే అడగడానికి వెళ్లినప్పుడు తెల్లకాగితాల మీద పోలీసులు తమ సంతకాలు తీసుకున్నారని చెప్పారు. ఆ కాగితాలేమిటో తమకు తెలియదనీ, మమ్మల్ని తామెప్పుడూ చూడలేదనీ, మా అరెస్టుకూ పంచనామాకూ తాము సాక్షులం కాదనీ చెప్పారు.

మరొక పోలీసు సాక్షి మమ్మల్ని అరెస్టు చేసినప్పుడు మాదగ్గర విప్లవ సాహిత్యం దొరికిందని చిలకపలుకులు అప్పగించాడు. ‘విప్లవ సాహిత్యం అంటే ఏమిటి’ అని మా న్యాయవాది ప్రశ్నవేశారు. ‘విప్లవ సాహిత్యం అంటే బానిస సంకెళ్లు తెంచుకొండి అని ప్రజలకు చెప్పేది’ అని ఆ కానిస్టేబుల్ అమాయకంగా నిజం చెప్పాడు. ‘మరి అది మంచిపనే కదా’ అని న్యాయమూర్తి అడగవలసి వచ్చింది. ‘మా డిపార్టుమెంటుకు మంచిది కాదు’ అన్నాడా పోలీసు సాక్షి.

ఇక తాను చేయని అరెస్టులను చేశానని చెప్పుకోవలసి వచ్చిన దర్యాప్తు అధికారి మేం కుట్ర చేశామని చూపడానికి చాల ప్రయత్నించాడు.  మాదగ్గర తాను జప్తు చేశానని ఆయన చెప్పిన ఒక్కొక్క వస్తువునూ చూపుతూ ‘దీనిలో కుట్ర ఉందా’, ‘దీనిలో కుట్ర ఉందా’ అని మా న్యాయవాది ప్రశ్నించారు. ఏ ఒక్క వస్తువులోనూ కుట్రకు ఆధారం లేదని ఆ దర్యాప్తు అధికారి తన నోటనే చెప్పకతప్పలేదు. మరి కుట్ర చేశారనడానికి ఆధారం ఏమిటి అనే చివరి ప్రశ్నకు ‘ఆధారమేమీ లేదు’ అని దర్యాప్తు అధికారి ఒప్పుకున్నాడు.

దర్యాప్తూ లేదు, ఆ అధికారికి సంబంధమూ లేదు. కుట్రా జరగలేదు, అరెస్టు చేసినదీ ఆయన కాదు. సాక్షులుగా ప్రవేశపెట్టిన వాళ్లు సాక్షులూ కాదు. ఆధారాలుగా ప్రదర్శించినవి ఆధారాలూ కావు. అరెస్టు చేయడానికి వెళ్లామన్న పోలీసులు అరెస్టు చేసిన పోలీసులు కాదు. అలా ఎన్నెన్నో ‘కాదు’ల మీదా, ‘లేదు’ల మీదా ఆధారపడి పోలీసులు మా నేరం రుజువు చేయదలిచారు.

మమ్మల్ని మావోయిస్టుపార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడితో పాటు అరెస్టు చేశారు గాని అప్పటికి ఆ పార్టీ మీద నిషేధం లేదు. నిషేధం ఉన్నదో లేదో తెలియదని ఛార్జిషీటు తయారు చేసిన పోలీసు అధికారి అన్నాడు. అధికారికంగా నిషేధం లేకపోవచ్చు గాని నిషేధం ఉన్నట్టేనని తమకు ఉత్తర్వులు ఉన్నాయన్నాడు. ఆ ఉత్తర్వు చూపమంటే అది లేదన్నాడు. తాము చేస్తున్న పని అధికారికంగా సరైనదా కాదా, చట్టానికి లోబడినదా కాదా చెప్పలేని స్థితిలో పోలీసు అధికారులు ఉన్నారన్నమాట. అలా విచారణలో మా న్యాయవాది గొర్రెపాటి మాధవరావు చాల సమర్థంగా పోలీసుల అబద్ధాలనూ కట్టుకథలనూ అబద్ధపు సాక్ష్యాలనూ తుత్తునియలు చేశారు.

అయితే, ఇదంతా కేవలం పోలీసు అధికారుల, సాక్షుల సమర్థత, అసమర్థతలకు సంబంధించిన విషయం కాదు. స్వయంగా పాలకులే పోలీసుల శాఖకు ఈ అబద్ధపు సంస్కృతిని, హింసా సంస్కృతిని నేర్పిపెట్టారు. ‘ప్రజలు మాకు శత్రువులు. మీరు మా ఉద్యోగులు గనుక ప్రజలు మీకూ శత్రువులే. మీరు వాళ్లను అలా తప్ప మరొకరకంగా చూడడానికి వీల్లేదు. వాళ్లను ఏమిచేసినా, వేధించినా, చిత్రహింసలు పెట్టినా, చంపినా ఫరవాలేదు. హక్కుల చట్టాలు రాతకోసం మాత్రమే, పాటించనక్కరలేదు’ అని బ్రిటిష్ కాలంలో పాలకులు పోలీసుశాఖకు శిక్షణ ఇచ్చారు. (‘అన్నా తమ్ముడూ బంధువూ అని చూడకు, చంపడమే నీ ధర్మం’ అని సరిగ్గా అర్జునుడికి కృష్ణుడు బోధించిన గీత లాగ!) 1947 తర్వాత కూడ పోలీసు శాఖ పాటిస్తున్నది అవే చట్టాలను, అదే సంస్కృతిని, అదే శిక్షణను. అంతకుముందరి వలసపాలకుల సేవ నుంచి ప్రజాసేవ స్థానానికి మారడానికి తగిన శిక్షణ లేదు. ఇక 1967 తర్వాత, నక్సల్బరీ ప్రజా ప్రజ్వలనం తర్వాత ప్రజలను శత్రువులుగా చూసే సంస్కృతిని మరింత పెంచారు.

అందువల్లనే అబద్ధాలు చెప్పడం, చట్టవ్యతిరేక దమనకాండ సాగించడం, తప్పుడు కేసులు తయారుచేయడం, అవి తప్పుడువి గనుక వాటిని రుజువు చేయలేకపోవడం, కేసులు పెట్టి సంవత్సరాల తరబడి వేధిస్తే చాలుననుకోవడం పోలీసులకు అలవాటయిపోయాయి. ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ కుట్రకేసు, పార్వతీపురం కుట్రకేసు, సికిందరాబాదు కుట్రకేసు, చిత్తూరు కుట్రకేసు, రాంనగర్ కుట్రకేసు, బెంగళూరు కుట్రకేసు, ఔరంగాబాద్ కుట్రకేసు వంటి సుప్రసిద్ధమైన కుట్రకేసులలో ఒక్కకేసులోకూడ ప్రాసిక్యూషన్ తాను చేసిన నేరారోపణలను రుజువు చేయలేకపోయింది. ఒక్కకేసులో కూడ న్యాయస్థానాలు శిక్షలు విధించలేదు. ఇతర కేసుల సంగతి సరేసరి.

“మావోయిస్టు పార్టీ నాయకులు ఇద్దరితో (గంటి ప్రసాదం, సురేందర్) కలిసి కుట్రపన్నామని, ప్రభుత్వాన్ని కూలదోయడం కోసం మేం ఆయుధాలు వగైరా సేకరించామని, అది శిక్షార్హమైన నేరమని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. కాని మేం కుట్ర చేశామని రుజువు చేసే ఒక్క సాక్ష్యాన్ని కూడ ప్రాసిక్యూషన్ చూపలేకపోయింది. మేం ఆయుధాలు వగైరా సేకరించామని, ఈ ప్రభుత్వ చట్టాల ప్రకారమైనా నేరం చేశామనడానికి ఒక్క ఆధారం కూడ చూపలేకపోయింది. మొత్తం కేసు అంతా మేం ఔరంగాబాదులో మహారాష్ట్ర టూరిజం గెస్ట్ హౌజ్ లో కలిసి మాట్లాడుకున్నామనే ఆధారం తప్ప మరేమీ లేదు. అంటే మనుషులు కలిసి మాట్లాడుకోవడమే ఈ ప్రభుత్వానికి, పాలకులకు, పోలీసులకు తమను కూలదోసే కుట్రలా కనబడిందన్నమాట. ప్రభుత్వాలను కూలదోసే పని పాలకవర్గ ముఠాలు చేసుకుంటూనే ఉన్నాయి. మేం చేయదలచుకున్న పని ఈ వ్యవస్థను కూలదోసే శక్తులకు కలమూ గళమూ ఇవ్వడం. ఈ వ్యవస్థ దోపిడీ పీడనల మీద ఆధారపడి ఉన్నది గనుక, ప్రజల జీవనాన్ని దుర్భరం చేస్తున్నది గనుక ఈ వ్యవస్థను కూలదోయడం అవసరమనీ, అనివార్యమనీ, సహజమనీ, న్యాయమనీ మేం భావిస్తున్నాం. అందులో దాపరికమేమీ లేదు. అందుకొరకు మేం కుట్రలు చేయం. ప్రజలకు నిజాలు చెపుతాం. పోరాట అవసరం చెపుతాం. వారు పోరాడుతున్నప్పుడు అండగా నిలబడతాం. వారి పోరాటాలను గానం చేస్తాం. ఆ పోరాటాల గురించి ఎవరితోనైనా మాట్లాడుతాం” అని మా కేసు కొట్టివేత తర్వాత విరసం పత్రికా ప్రకటనలో ప్రకటించింది.

కోర్టులో వాదనలు ముగిసిన తర్వాత చివరిగా న్యాయమూర్తి నిందితులను ‘మీరు చెప్పుకునేది ఏమైనా ఉందా’ అని అడుగుతారు. దానికి జవాబుగా నిందితులు చేసే ప్రకటనను క్రిమినల్ ప్రొసేజర్ కోడ్ సెక్షన్ 313 వాంగ్మూలం అంటారు. నిజామాబాదు కోర్టులో 2010 జూలై 12న నేను ఆ 313 ప్రకటన చేశాను. దానిలో భాగాలు:

“మొట్టమొదట ఇటువంటి కోర్టు ప్రకటన చదవడం అనే సంప్రదాయం భారతదేశపు న్యాయస్థానాలలో వంద సంవత్సరాలకు పైగా ఉనికిలో ఉందని మీ దృష్టికి తేదలచాను. బాలగంగాధర తిలక్, అరవింద ఘోష్, వి డి సావర్కర్, మోహన్ దాస్ కరంచంద్ గాంధీ, భగత్ సింగ్, బటుకేశ్వర దత్, ఎం ఎన్ రాయ్ మొదలయిన భారత జాతీయోద్యమ నాయకులు, మీరట్ కుట్రకేసు వంటి ప్రఖ్యాత కేసుల నిందితులు కూడ ఇటువంటి కోర్టు ప్రకటనలు చేశారు. ఆశ్చర్యమూ విషాదమూ ఏమంటే సరిగ్గా ఇవాళ మామీద ప్రాసిక్యూషన్ వారు బనాయించిన సెక్షన్లే – ఐపిసి 120 (బి), 121 (ఎ), 122 – ఈ నాయకులందరిమీద కూడ అప్పటి బ్రిటిష్ ప్రభుత్వ ప్రాసిక్యూషన్ బనాయించింది. ఆ నేరారోపణలకు జవాబుగా ఆ ముద్దాయిలందరూ న్యాయస్థానాలలో తమ మీద బనాయించిన తప్పుడు కేసుల గురించి, తమ రాజకీయ విశ్వాసాల గురించి సుదీర్ఘ ప్రకటనలు చదివారు. అవన్నీ బ్రిటిష్ వలసవాద వ్యతిరేక భారత జాతీయోద్యమ చరిత్రలో భాగమైనవే.

1947 అధికార మార్పిడి తర్వాత కూడ ఇటువంటి నేరారోపణలు, వాటికి జవాబుగా న్యాయస్థానాలలో ప్రకటనలు ఎన్నో ఉన్నాయి. ‘తాకట్టులో భారతదేశం’ పేరుతో అచ్చయిన ఐదువందల పేజీల పుస్తకం తరిమెల నాగిరెడ్డి హైదరాబాదు కుట్రకేసులో ముద్దాయిగా చేసిన కోర్టు ప్రకటనే. ఆ కుట్రకేసులోనే ముద్దాయిలందరి తరఫున దేవులపల్లి వెంకటేశ్వరరావు ‘విప్లవ కమ్యూనిస్టుల కార్యక్రమం – ఎత్తుగడల వివరణ’ అనే సుదీర్ఘమైన కోర్టు ప్రకటన చదివారు. పార్వతీపురం కుట్రకేసు నిందితులలో చాలమంది కోర్టులో తమ రాజకీయ విశ్వాసాలను తెలియజెప్పే కోర్టు ప్రకటనలు చేశారు. కొండపల్లి సీతారామయ్య, కె జి సత్యమూర్తి అనేక కేసులలో ఇటువంటి కోర్టు ప్రకటనలు చేశారు. రచయితల విషయానికే వస్తే సికింద్రాబాదు కుట్రకేసు, చిత్తూరు కుట్రకేసు, రాంనగర్ కుట్రకేసు వంటి వాటిలో ముద్దాయిలైన కె. వి రమణారెడ్డి, త్రిపురనేని మధుసూదనరావు, వరవరరావు, చెరబండరాజు, ఎం టి ఖాన్ మొదలయిన వారు సుదీర్ఘమైన కోర్టు ప్రకటనలు చేశారు. అవన్నీ పుస్తకాలుగా కూడ అచ్చయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.

venu6ఈ వ్యవస్థలో సాగుతున్న దోపిడీ పీడనలను వ్యతిరేకిస్తూ రచనలు చేసేవారిని, ఉపన్యాసాలు ఇచ్చేవారిని ‘ఇదిగో ఇలా వేధిస్తాం, అక్రమ నిర్బంధాల పాలుజేస్తాం, అబద్ధపు కేసులు బనాయిస్తాం’ అని బెదిరించడానికే ఈ కేసు. ఈ దోపిడీ పీడనల వ్యవస్థను మార్చాలని ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్న వారిని కలుసుకున్నా, వారితో మాట్లాడినా వేధింపులు తప్పవు అని హెచ్చరించడానికే ఈ కేసు. ఈ వ్యవస్థ మీద వచ్చే ప్రశ్నలను మూసిపెట్టడానికే ఈ కేసు. ప్రశ్నించేవారిని, తమ ప్రశ్నల గురించి ఇతరులను ఆలోచించేలా చేసినవారిని వేధించడానికి పాలకవర్గాలు, అధికార యంత్రాంగం నిరంతరం చేసే ప్రయత్నంలో భాగమే ఈ కేసు.

నావరకు నేను గత మూడు దశాబ్దాలకు పైగా పాత్రికేయుడిగా, రచయితగా, ఉపన్యాసకుడిగా ప్రభుత్వ దుర్మార్గాలను ఎత్తి చూపడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రభుత్వాలన్నీ ప్రజా ప్రభుత్వాలుగా పాలన నెరపడం లేదని, భారత ప్రజలు తమకు తాము ఇచ్చుకున్న రాజ్యాంగంలోని ప్రవేశికను గాని, ప్రాథమిక హక్కులను గాని, ఆదేశిక సూత్రాలను గాని గౌరవించే, చిత్తశుద్ధితో అమలుచేసే ప్రభుత్వం ఇంతవరకు ఏర్పడలేదని నమ్ముతున్నాను. ఆ నమ్మకాన్ని సోదాహరణంగా ప్రజలకు వివరించడం బుద్ధిజీవిగా నా బాధ్యత అనుకుంటున్నాను. నేను ఆ బాధ్యత నిర్వహించడం పాలకులకు కంటగింపు అయినందువల్లనే, నన్ను శారీరకంగాను, మానసికంగాను వేధించడానికే, నా కృషిని అడ్డుకోవడానికే నాపై ఈ అబద్ధపు కేసు బనాయించారు.

కాని ఈ కేసు వల్ల ప్రభుత్వాలు, పోలీసులు చెప్పే అబద్ధాలే బయటపడ్డాయి. నా తాత్విక, రాజకీయ విశ్వాసాలు బలపడ్డాయి. ఈ వ్యవస్థ దోపిడీ పీడనల మీదనే ఆధారపడి ఉన్నదని, దీన్ని రద్దుచేసి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పునాదిగా ఒక కొత్త వ్యవస్థను నిర్మించక తప్పదని నా విశ్వాసం బలపడింది. ఆ కొత్త వ్యవస్థ గురించి కలలు కనేవారిని, ఆ కలలను ఇతరులతో పంచుకునే వారిని నిర్మూలించడం, నిర్బంధించడం, భయపెట్టడం, వేధించడం ఈ వ్యవస్థ లక్ష్యం అని నాకు ఈ కేసు తెలియజెప్పింది. మనిషికి కలిగే ఆలోచనలనూ, వాటిని ఇతరులతో పంచుకునే మాటలనూ చూసి ఈ వ్యవస్థ భయపడుతోందని ఈ కేసు తెలియజెప్పింది. ఈ కేసులో మాట్లాడుకోవడాన్నే నేరంగా చిత్రిస్తున్నారు. మాట్లాడుకోవడం మానవ సహజం. అది నేరం కాదు. తప్పు కాదు. మనిషిని మాట్లాడకుండా ఆపగల అధికార శక్తి ఏదీ లేదు. మాట్లాడడాన్ని నేరంగా ప్రాసిక్యూషన్ చిత్రించినా దాన్ని నేను అంగీకరించను. మనిషిగా తోటి మనుషులతో మాట్లాడకుండా ఉండబోను. మనిషిని మనిషిగా గౌరవించే మానవీయ వ్యవస్థ కోసం నా శక్తిమేరకు కృషి చేయకుండా ఉండబోను.”

నిజామాబాదులో ఒక హైటెక్ జైలు కట్టి, ఆ జైలును మార్చేశారు. మా కేసు తీర్పు నాటికే ఆ మార్పు జరిగిపోయింది. వాదనల సందర్భంగా పది రోజులు నిజామాబాదులో ఉన్నప్పుడు మేమందరమూ రఘునాథాలయంలోనుంచి పాడుబడిపోయిన పాత జైలు భవనాల పైకప్పు మీదికి ఎక్కి మాకు ఇరవై రోజులు ఆశ్రయం ఇచ్చిన ఆ స్థలాల ఫొటోలు జ్ఞాపకంగా తెచ్చుకున్నాం. పది సంవత్సరాలు గడిచిపోయింది. జ్ఞాపకంగా మిగిలిన ఆ జైలు శిథిలమైపోయింది. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా మారింది. కాని పోలీసులూ, న్యాయవ్యవస్థా, చెరసాలలూ, నిర్బంధ సంస్కృతీ ఏమీ మారినట్టు లేదు.

*

 

 

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. P V Vijay Kumar says:

    చాలా చిత్రమైన రాజ్యం మనది……
    వోటుకు కేష్ పెట్టి కొన్నా సీ ఎం కు, 2000 మంది హత్యకు అనుకూలంగా సహకరించిన పీ ఎం కు అరెస్టులంటే ఆమడంత దూరం. అవి ప్రశ్నించిన గుప్పెడు మనుష్యులకు అరదండాలు.

    వికలాంగులు, వ్యాధి గ్రస్తులు, మధ్య తరగతి విలేఖరులు ప్రభుత్వాన్ని కూల్చగలరనే అభద్రత, పునాదుల్లేని Administration system వలన వచ్చింది.
    నిబద్ధత లేని రాజకీయాలను పట్టుక్కూచుని రాజ్యం అనుక్షణం భీతావహం పొందుతుంది.

  2. …‘విప్లవ సాహిత్యం అంటే ఏమిటి’ అని మా న్యాయవాది ప్రశ్నవేశారు. ‘విప్లవ సాహిత్యం అంటే బానిస సంకెళ్లు తెంచుకొండి అని ప్రజలకు చెప్పేది’ అని ఆ కానిస్టేబుల్ అమాయకంగా నిజం చెప్పాడు. ‘మరి అది మంచిపనే కదా’ అని న్యాయమూర్తి అడగవలసి వచ్చింది. ‘మా డిపార్టుమెంటుకు మంచిది కాదు’ అన్నాడా పోలీసు సాక్షి…..

    మన పోలీసు వ్యవస్థ గురించి ఇంతకుమించి అక్కర్లేదు. మీ అక్రమ నిర్బంధాన్నిగుర్తుచేసి పాత జ్ఞాపకాలను కుదిపారు. కృతఙ్ఞతలు.

    • N Venugopal says:

      మోహన్,

      కృతజ్ఞతలు. నిజానికి నీ కిటికీపిట్ట నిర్బంధకాలాన్ని సాంద్రంగా, ఆర్ద్రంగా వ్యక్తీకరించింది. నేను రాసింది సాదా వచనం. అరుణ్ ఫెరేరా జైలు జ్ఞాపకాలు కలర్స్ ఆఫ్ కేజ్ అనువాదం చేస్తున్నప్పుడు ఆ జ్ఞాపకాలు నా జ్ఞాపకాలను మేల్కొలిపి ఇది రాయాలనిపించింది. పది సంవత్సరాలు నిండాయనే సందర్భం కలిసి వచ్చింది….

  3. అది శేషయ్య says:

    గత కొన్నాళ్లుగా ఈ వ్యాసాన్ని నా మెయిల్ దాచుకున్నాను. ఇది తప్పక చదవాల్సిన వ్యాసమనీ వేణు గోపాల్ గారి పేరు చూసినప్పుడూ వ్యాస శీర్షికను చూసినప్పుడు అనిపించింది. అయితే నాకు ఔరంగాబాద్ లో జరిగిన సమస్యతో పాటు అనంతర పరిణామాల గురించి కొంత తెలుసు. కాబట్టి ఈ వ్యాసాన్ని తీరుబాటుగా చదవాలని నిర్ణయించుకున్నాను.

    నాకు ఈ వ్యాసం ద్వారా రెండు సందేహాలు కలిగాయి . ఒక సందర్భంలో వేణు గోపాల్ గారు పాత్రికేయుడు , విలేఖరి అనే పదాలను వేర్వేరు చోట్ల వాడారు. ఈ రెండు పదాలకు అర్థాలు తెలుసుకోవాలని ఉంది. మరొక విషయం ఏమిటంటే 2005లో అనుకుంటాను. అరుణతార పత్రిక ముఖ పత్రంపై ఒక వాక్యాన్ని ప్రచురించింది. మంచి సాహిత్యం మానవత్వాన్ని స్తాపిస్తున్న వేళ.. చెడ్డ ప్రభుత్వం సాహిత్యాని వెంటాడుతోంది అని. దీనిని గుర్తు చేయడం మినహా ఈ వ్యాసం చదివిన తర్వాత నేను తెలిపే అభిప్రాయం మరో విధంగా చెప్పడం చేతకాదు. ఔరంగాబాద్ వ్యాసాన్ని ప్రస్తుత ఇరు రాష్ట్ర ప్రభుత్వ పాలన రీతుల నేపథ్యంలో విశ్లేషించడం బాగుంది. ఈ విశ్లేషణను చూసి నాకేమీ ఆశ్చర్యం కలగలేదు. ఇందులో చర్చించిన అంశాలకంటే వేణుగోపాల్ గారు గొప్ప బుద్దిజీవి. వేణు గారికీ, సారంగకూ అభినందనలూ.. కృతజ్ఞతలూ…

    • N Venugopal says:

      ఆదిశేషయ్య గారూ,

      కృతజ్ఞతలు.

      పత్రికలలో పనిచేసేవారిలో రచనలతో, అక్షరాలతో పని చేసే వారందరూ పాత్రికేయులు అని పిలవడం అలవాటయింది. పత్రికలలో సాంకేతిక సిబ్బంది కూడ చాల మంది ఉంటారు కాని ప్రభుత్వం చట్ట ప్రకారం వర్కింగ్ జర్నలిస్ట్ అనే నిర్వచనం ఒకటి ఇచ్చింది. వారినే పాత్రికేయులు, పత్రికారచయితలు అని పిలుస్తున్నాం. ఈ పాత్రికేయులలో ఒక భాగం వార్తాసేకరణ జరిపి, వార్తలు రాసేవారు. వారిని రిపోర్టర్లు, కరెస్పాండెంట్లు అంటారు, వారిని విలేఖరులు అనడం అలవాటయింది. నిశితంగా ఆలోచిస్తే ఈ మాటలతో, నిర్వచనాలతో సమస్యలు ఉన్నాయనుకోండి. నేను జనవ్యవహారంలో ఉన్నమాటలే వాడాను. నేను డెస్క్ లో పనిచేసే సబ్ ఎడిటర్ గానూ, బీట్ మీద పనిచేసిన రిపోర్టర్ గానూ ఆయా కాలాల్లో ఉన్నాను గనుక అలా రాశాను.

మీ మాటలు

*