పంజరం లో రంగుల ఆకాశం

బి. అనూరాధ

అరుణ్ ఫరేరా “సంకెళ్ళ సవ్వడి” పుస్తకానికి బి. అనురాధ రాసిన ముందుమాట నుంచి..

 

ఏ దేశంలోనైనా ప్రజాస్వామ్యం ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఆ దేశపు జైళ్లను చూడాలి అని ఎవరన్నారో కానీ అది అక్షరాలా నిజం. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని పాలకులు నిస్సిగ్గుగా చాటుకొనే భారతదేశంలో అసలేం జరుగుతుందో తెలుసుకోవాలంటే జైళ్ళలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. జైళ్లను బయటనుండి సందర్శించేవారికి తెలిసే విషయాలు పెద్దగా ఏమీ ఉండవు. లోపల ఏంజరుగుతుందో బయట ప్రపంచానికి ఏమాత్రం అర్థంకాదు. అరుణ్‌ పుస్తకం మనకా ప్రపంచాన్ని చూపిస్తుంది.

ఈ పుస్తకం తెలుగు అనువాదానికి ముందుమాట రాయడానికి నాకున్న ఏకైక అర్హత నేను జైలు జీవితానికి ఒక ‘ఇన్‌సైడర్‌’ని కావడమే. ఒకేలాంటి రాజకీయ విశ్వాసాలు కలిగి ఉన్నా, సామాజిక కార్యకర్తగా దాదాపు ఒకేకాలం లో రెండు దశాబ్దాలు పనిచేసినా, జైల్లో పడేవరకూ అరుణ్‌తో నాకు పరిచయం లేకుండింది. తాను మహారాష్ట్ర జైల్లోనూ నేను జార్ఖండ్‌లోని హజారీబాగ్‌ జైల్లోనూ ఉన్నప్పుడు, అక్కడున్న వేరే రాజకీయ ఖైదీలతో నాకు కలంస్నేహం ఉండింది. అప్పుడు నా ఉత్తరాలను వాళ్ళు సామూహికంగా చదువుకొనేవాళ్ళు. నా ఉత్తరాలు కొన్నిటికి తన బొమ్మలతో ప్రతిస్పందించేవాడు అరుణ్‌. అలా తాను మన కళ్ళముందించిన జైలు జీవితంలోని రంగులు కొన్నిటిని మాతోనూ పంచుకొని, మా నలుపుతెలుపుల జైలు జీవితానికి రంగులద్దే ప్రయత్నం చేశాడు. అలా పరిచయమైన అరుణ్‌ని విడుదలయ్యాకనే చూశాను. జైలు జీవితం నాకిచ్చిన ఒక మంచి స్నేహితుడు అరుణ్‌ అయితే, జైలు జీవితం వల్ల అరుణ్‌ మనకిచ్చిన మంచి కానుక ఈ పుస్తకం.

ఆ కాలంలో ఉత్తరాల కోసం మేము ఎంత ఉద్విగ్నతతో ఎదురు చూసేవాళ్లమంటే అన్నం సహించేది కాదు. అందువల్లే కావచ్చు అరుణ్‌ కూడా ఇందులో తాను చెప్పదలుచుకొన్న ప్రతి విషయాన్ని తాను బైటికి రాసిన ఉత్తరం తో మొదలుపెట్టాడు. తను ఎంచుకొన్న ఈ పద్ధతి వల్ల ఈ పుస్తకాన్ని కింద పెట్టకుండా చదివేస్తాం. అరుణ్‌ కేవలం బొమ్మలు వెయ్యడమే కాదు. తానొక కార్టూనిస్టు కూడా. కాబట్టి, తన బొమ్మల్లోనే కాకుండా తన రచనలో కూడా ఆ వ్యంగ్యం మనకి అడుగడునా కనిపిస్తుంది. ఇది తన శైలికి ఒక ప్రత్యేకతని ఆపాదించింది.

చీకటి కొట్లులాగా పిలవబడే జైళ్ళలో అసలేం జరుగుతుంది? ఎలా గడుపుతారు అన్నన్ని యేళ్ళు? మనం ఎన్నడూ వినని ఒక కొత్త భాష. అది జైలు కే ప్రత్యేకం. అక్కడ మనం మనుషులం కాదు శాల్తీలం. ప్రతిరోజూ మూడు సార్లు లెక్కల్లో తేలాక, గిన్తీలు, తలాశీలు వంటి రొటీన్లతో, ములాకాత్‌లు, తారీఖ్‌ లు వంటి విశేషాలతో, ”గిరాదేంగే”, ”పీ.సీ.ఆర్‌ కరాదేంగే” వంటి ధమ్కీలతో ఆశ నిరాశల మధ్య ఉద్వేగాలు, అప్పుడప్పుడు కొన్ని ఉత్సాహాలు, ఎదురుచూపులు, అనేక దిగుళ్ళు ఎన్ని ఉన్నా ఖైదీని చివరవరకు నిలిపి ఉంచేది ‘ఆశ’ ఒక్కటే. వాటి తాలూకు రంగులన్నీ అరుణ్‌ పుస్తకంలో ప్రతి పేజీలోను కనపడతాయి.

జైళ్ళలోని అవసరాలు ఖైదీల్లోని సృజనని అద్భుతంగా బయటకు తీస్తాయి. అందుకు ఈ పుస్తకంలో కొల్లలుగా ఉదాహరణలు కనిపిస్తాయి. క్రికెట్‌ ఆడడానికి బంతి తయారుచెయ్యడంలో కావచ్చు, ఏకాంతంలో ఉంచినా ఒకరికొకరు సమాచారం పంపుకోవడంలో కావచ్చు, ఏ రకంగానూ రుచిలేని తిండిని బాగుచేసుకోవడంలో కావచ్చు, ఐదు నిమిషాల్లోనే బట్టలు ఉతుక్కొని, స్నానం చెయ్యగల నేర్పుని సంపాదించడంలో కావచ్చు, పెన్నుల్లో ఖాళీ అయిన రీఫిల్స్‌ ని ఉపయోగించి చెప్పుల్ని మరమ్మత్తు చెయ్యడంలో కావచ్చు – ఆ సృజనకి సాటిలేదు.

ఖైదీలకి బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంచడం కారాగార వాసంలోని ముఖ్య ఉద్దేశ్యం. అయితే ఆ ఖైదీలు రాజకీయ ఖైదీలైతే కనుక వాళ్ళు తాము ఎక్కడున్నా ప్రజల మధ్య ఉన్నామనే అనుకొంటారు కనుక వాళ్ళని మిగతా ఖైదీల నుంచి వేరు చేసి వంటరిగా ఉంచే ఏర్పాట్లు దేశంలోని అన్ని కేంద్రీయ కారాగారాల్లోనూ ప్రత్యేక శ్రధ్ధతో చేసింది. అవే అండా బ్యారక్‌ లు. అత్యంత భద్రత కలిగినవి రాజ్యం దృష్టిలో. అరుణ్‌ కూడా అటువంటి అండా బ్యారక్‌ లోనే తన జైలు జీవితం మొత్తాన్ని గడిపాడు. అందులో ఉండే ఒంటరి సెల్స్‌ గురించి అరుణ్‌ ఇలా అంటాడు.

”….ఈ సెల్స్‌లోకి కాంతి చొరబడదు. సెల్‌లో నుంచి మీకు బయట ఏమీ కనపడదు. ఒక ఆకుపచ్చని చెట్టులేదు. ఆకాశం ముక్క లేదు. ‘అండా’ కు మధ్యలో ఎత్తుగా ఒక కాపలా స్తంభం ఉంటుంది. ఆ స్తంభం పైకెక్కి చూస్తే ఈ మొత్తం ఆవరణ ఒక పెద్ద, గాలి చొరబడని సిమెంటు గుడ్డు లాగా కనపడుతుంది. అయితే ఒక ముఖ్యమైన తేడా ఉంది. ఈ గుడ్డును పగలగొట్టడం అసాధ్యం. బహుశా ఈ గుడ్డు లోపల ఉండే ఖైదీలే పగిలిపోవాలని దీన్ని తయారుచేశారేమో!!”

”…… అండా నిర్మాణంలోని ఈ పాశవికమైన ఊపిరిసలపనితనం కన్నా మనిషితో సంబంధం లేకపోవడమే మీ ఊపిరిని బిగదీస్తుంది” అంటాడు.

జైలు లో దేన్నయినా కటకటాల్లోనించే చూడాలి. ఎందుకంటే ఆ చీకటకొట్ల బయట

ఉండే ఆవరణ పై కప్పు ఖాళీగా ఉండకుండా ఇనుప జాలీ తో మూసివేసి ఉంటుంది.

”పిట్ట కూడా దూరలేదు” అని మనం కేవలం ఒక అలంకారం కోసం వాడే ప్రయోగం ఇక్కడ అక్షరాలా వాస్తవం. అలాగే బావి పైనా అంతే. ఇనుప జాలీతో మూత పెట్టినట్టు ఉండే బావిలోనుండి, సన్నగా పొడుగ్గా ఉండే డబ్బాల్లాంటి ప్రత్యేక బక్కెట్లతోనే నీళ్ళు తోడుకోవాలి. ఇలాంటివి ఒక ఎత్తయితే బయటి సమాజంలో ఏమాత్రం ఊహించలేని విపరీత పరిస్థితులు జైల్లో మనకి తారసపడుతుంటాయి.

మహిళల హక్కుల కోసం పోరాటంలో రెండు దశాబ్దాల కార్యాచరణలో ఎన్నో వరకట్న హత్యలకి వ్యతిరేకంగా పోరాడినందుకు నేనూ, వరకట్న హత్యలు చేసో, వాటికి ప్రేరేపించో జైలుకి వచ్చిన స్త్రీలూ ఒకేచోట సుదీర్ఘ కాలం కలిసిఉండాల్సిరావడం. జైలు జీవితంలో మాత్రమే ఉండే ఒక అసంబద్ధత ఇది. అలాంటి విపరీత పరిస్థితులను అరుణ్‌ కూడా ఎదుర్కొన్నాడు. నిజానికి అంతకంటే తీవ్రమైనది. ఖైర్లాంజీ హత్యాకాండలోని నిందితులతో, అరుణ్‌ ఫాసీయార్డులో ఉండాల్సి రావడం అటువంటిదే.

”అంతటికీ కారణం సురేఖ భోట్‌మాంగే నే ……ఆమె మా మీద ఫిర్యాదు చేసె ధైర్యం చేసింది. మిగిలిన దళితులలాగా కాక ఎప్పుడూ బైటకి మాట్లాడు తుండేది. సాహసికంగా ఉండేది” అని వాళ్ళు అరుణ్‌తో చేసిన వాదనలు విన్నప్పుడు ‘డాటర్‌ ఆఫ్‌ ఇండియా’లో నిర్భయ పట్ల తమ చర్యలను సరిగ్గా ఇలాంటి వాదనలతోనే సమర్ధించుకొన్న ముఖేష్‌ సింగ్‌ గుర్తుకు వస్తాడు. ఇలాంటి వారితో కలిసి రోజంతా కలిసి ఉండాల్సిరావడం ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ అలవాటుపడతాం. జనరల్‌ బ్యారక్‌ లలో కనీసం కొంతమంది నైనా దూరంగా పెట్టగల అవకాశం ఉంటుంది కానీ ముఖ్యంగా ఫాసీయార్డు లాంటి చోట్ల మనుషులే కరువయిన ఒక వాతావరణంలో మాట్లాడాలన్నా ఉన్నది వాళ్ళే. కాసేపు ఉల్లాసం కోసం ఆటలాడుకోవాలన్నా ఉన్నది వాళ్ళే అయినప్పుడు, మనుషుల్లోని అమానుషత్వాన్ని, క్రూరత్వాన్ని తాత్కాలికంగా విస్మరించడం నేర్చుకొంటాం. అరుణ్‌ కూడా అలానే నేర్చుకొన్నాడు. ”సమాజంలో అతి అసహ్యానికి గురైన వారితో సుదీర్ఘ కాలం నిర్బంధంలో కలిసి ఉండడంలోని అనివార్యతలు ఇవి” అంటాడు.

ఈ పుస్తకంలో అరుణ్‌ కేవలం జైలు జీవితాన్ని గురించి మాత్రమే రాయలేదు. తాను జైలుకి వచ్చిన నేపథ్యం, తన రాజకీయ విశ్వాసాల గురించి కూడా రాశాడు. ఆ రకంగా జైలు జీవితానికి సంబందించిన ”సమయ సందర్భాలను” కూడా మనకి పరిచయం చేస్తాడు. అలాగే సమకాలీన రాజకీయాలను గురించి కూడా అవకాశమున్న ప్రతి సందర్భంలోనూ చర్చించాడు.

అరుణ్‌ 1990 ల మొదట్లో ముంబైలోని సెయింట్‌ జేవియర్‌ కాలేజీలో విద్యార్థిగా ఉన్న కాలంలో అణగారిన ప్రజలకు సంక్షేమ చర్యలు అందించే శిబిరాలను గ్రామాలలో నడపటం ద్వారా సామాజిక కార్యాచరణ లోకి ప్రవేశించాడు. ఆ క్రమంలోనే భారత సమాజం స్వభావాన్ని గురించి కూడా తన కార్యాచరణనుంచే గ్రహించడం మొదలు పెట్టాడు. ”భారత సమాజం వర్గ, కుల అంతరాలతో ముక్కలైందనీ, అసంఖ్యాకమైన వైరుధ్యాలతో నిండి ఉన్నదనీ” గుర్తించాడు. ”వ్యవస్థలు మారకుండా దాతృత్వం ఎంత అర్థరహితమో” గ్రహించాడు.

బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత పునరావాస చర్యలలో పాల్గొన్నాడు. కాలేజీ క్యాంటీన్‌ కార్మికుల జీవితాలను దగ్గరగా చూసి, వాళ్ళ హక్కుల కోసం జరిపే పోరాటాలలో సహాయపడుతున్న క్రమంలో విప్లవ విద్యార్థి సంస్థలలో ఒకటైన విద్యార్థి ప్రగతి సంఘటన్‌లో చేరాడు. కాలేజీ చదువు ముగిశాక ‘నవజవాన్‌ భారత్‌ సభ’ అనే యువజన సంస్థలో పనిచేశాడు. ఈ సంస్థలో పనిచేస్తూ ముంబయి లోని అట్టడుగు ప్రజల నివాస స్థలాలైన ”మురికివాడలను” తన నివాసంగా చేసుకొన్నాడు. శివసేన ప్రభుత్వం ఆధ్వర్యంలో రోడ్డునపడ్డ బస్తీవాసులను సంఘటిత పరిచే ఆందోళనలు నిర్వహించడంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. అలనాడు భగత్‌ సింగ్‌ నిర్మించిన సంస్థలాగే ఇదీ నిషేధానికి గురయ్యింది. ప్రపంచీకరణ వ్యతిరేక ఆందోళనల్లో తలమునకలుగా పాల్గొన్నాడు. ఇలాంటి రాజకీయ కార్యాచరణలో ఉన్నవారికి అరెస్టులు కొత్తకాదు. కాబట్టి తాను ఎప్పుడైనా అరెస్టు కావచ్చని అరుణ్‌ ఊహిస్తూనే ఉన్నాడు. ఊహించలేక పోయిన విషయం ఏమంటే తన అరెస్టు జరిగిన తీరు, ఆ తరవాత తనపైన జరిగిన అత్యాచారాలు, తనని, తనతో పాటుగా అరెస్టు కాకపోయినా అయ్యారని పోలీసులు అరెస్టు చూపిన ఇతర రాజకీయ కార్యకర్తలను ఎంత భయానక చిత్రహింసలకు గురిచేశారో చదువుతుంటే శరీరం గగుర్పొడుస్తుంది. అందుకే కస్టడీ మరణాలను అత్యధికంగా నమోదు చేసిన రాష్ట్రం మహారాష్ట్ర కావడం యాదృచ్ఛికం కాదంటాడు.

పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగా పెట్టిన చిత్రహింసలు ఒక ఎత్తైతే కొన్ని నేరుగా చిత్రహింసలు పెట్టకుండానే అలాంటి పరిస్థితులను కల్పించి కష్టపెట్టడం మరొక ఎత్తు. ఉదాహరణకు పోలీసులు తన చెప్పులను ఎక్కడోపెట్టి మర్చిపోయి (?) తనని ఒట్ఠి కాళ్లతో జైలుకి పంపడం. ఎర్రని ఎండలో బొబ్బలెక్కించే తారురోడ్డు మీద జైలు గేటునుంచి కోర్టు వ్యాను వరకూ కాలిపోయే రోడ్డుమీద నడవలేక పరిగెత్తేవాడినని రాశాడు. రెండు నెలల వరకూ ఇదే పరిస్థితి.

ఇలాంటి పరిస్థితులని, నిరాశా నిస్పృహ కలిగించే జైలు వాతావరణాన్ని భరిస్తూ కూడా అరుణ్‌ కానీ, తన సహచర రాజకీయఖైదీలు కానీ తమ సెన్సాఫ్‌ హ్యూమర్‌ని ఏమాత్రం కోల్పోలేదు. అక్కడ జరిగే ఇటువంటి వాటికి కాలేజీ విద్యార్థుల్లాగా ముద్దు పేర్లు పెట్టుకోవడం… ఉదాహరణకు ఖైదీలకి మానవ హక్కులేంటని సుప్రీం కోర్టు తీర్పులపై విసుక్కొని, ఖైదీలకి ”బుద్ధి చెప్పడానికి” ఒక జైలర్‌ ఎంచుకొన్న భౌతిక హింసా కార్యక్రమానికి ”సాయంకాలం భజన” అని, ఆయన బదిలీ తరవాత చొక్కా చేతులు పైకి మడిచి సల్మాన్‌ స్టైల్‌ లో రుబాబ్‌ చేసే యువ జైలర్‌కి ”ధభంగ్‌” అని పేర్లు పెట్టడం వంటివి. అక్కడ జరిగే తతంగాలను వర్ణించేటప్పుడు కూడా ఆ హాస్యం, ఆ వర్ణనలు అంత బాధలోనూ నవ్వు తెప్పిస్తాయి. నిజానికి రాజకీయ ఖైదీలకి ఎప్పుడూ బలం అదే. ఎలాంటి పరిస్థితిలోనైనా నవ్వగలగడం. ముఖ్యంగా తానూ, తన సహచరులూ ఈ నవ్వులని తమకే పరిమితం చేసుకోకుండా ఇతర రాష్ట్రాలలో ఉన్న మాలాంటి వారికి కూడా ఉత్తరాల ద్వారా పంచారు. మా కలం స్నేహం వల్ల మేమంతా వేరు వేరు రాష్ట్రాల్లోని, వేరు వేరు కేంద్ర కారాగారాల్లో ఉన్నప్పటికి అందరం ఇంగ్లీష్‌ వార్తాపత్రికల్లో మొట్టమొదట చూసేది కాల్విన్‌ అండ్‌ హాబ్స్‌ కార్టూన్‌ అని తెలుసుకొని ఆశ్చర్యపోయాం. ఎలాంటి నిరాశలో ఉన్నా కాల్విన్‌ మమ్మల్ని ఒక్కసారైనా మనసారా నవ్వించేవాడు.

తరవాత కాలంలో ముంబై నుండి బదిలీ అయి వచ్చిన వెర్నన్‌, శ్రీధర్‌ అనే మరో ఇద్దరు రాజకీయ ఖైదీలు జైల్లో ”వకీల్‌ అంకుల్స్‌”గా పేరు పొందారు. నిజంగా వకీళ్ళు కాకపోయినా అంతకంటే ఎక్కువగా న్యాయసహాయాన్ని జైల్లో ఉంటూనే

అందించారు. ఆ సహాయాన్ని అందుకొన్న వారిలో రాజకీయ ఖైదీలకన్నా చాలా

ఎక్కువ సంఖ్యలో సామాన్య ఖైదీలే ఉన్నారు. ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌ కేంద్ర

కారాగారంలోని ఎందరో మహిళలకి అటువంటి సహాయాన్ని నేను ”వకీల్‌ అంకుల్స్‌” సహాయంతోనే చెయ్యగలిగాను.

ఈ పుస్తకంలో అరుణ్‌ తాను చదివిన అనేక పుస్తకాల గురించి కూడా ప్రస్తావించాడు. జైలు జీవితంలో ఉన్నప్పుడు పుస్తకాలు ఒక ఆక్సిజన్‌లాగా పనిచేస్తాయి. అయితే అవి ఎప్పుడూ ఒక లగ్జరీనే. ఈ విషయంలో మాత్రం అరుణ్‌ ”అదృష్టవంతుడే”. వాళ్ళకి దొరికినట్టు అందరికీ ఒక అలెన్‌ వాటర్స్‌ దొరకాలిగా!! బ్రిటన్‌ దేశస్థుడైన ఆయనకి వాళ్ళ దేశం నుండి ఒక సంస్థ చేసిన సాయం వల్ల అది సాధ్యం అయ్యింది. అసలు జైల్లోని వాళ్ళకి పుస్తకాలు సరఫరా చెయ్యడానికే ఒక సంస్థ ఉండాలనిపిస్తుంది. అయితే పుస్తకాలను అనుమతించని జైళ్ళు అనేకం ఇంకా ఉన్నాయి. అయినా అది అడ్డంకి కాదు పోరాడి సాధించు కోవాల్సిందే. అరుణ్‌ జైల్లో ఉన్నప్పుడు అనేక చిత్రాలు గీశాడు. ఆ కార్యక్రమాన్ని వాళ్ళు ‘కలర్స్‌

ఆఫ్‌ ది కేజ్‌’ అని ఇష్టంగా పిలుచుకొన్నారు. తరవాత తాను ఇంగ్లీషులో రాసిన ఈ పుస్తకానికి కూడా అదే పేరు పెట్టాడు. ఇంగ్లీషులో ఎంతో ఆసక్తికరంగా రాసిన ఈ పుస్తకాన్ని అద్భుతంగా అనువాదం చేసి వేణుగోపాల్‌ పూర్తి న్యాయం చేశాడు. ఇంగ్లీషు పుస్తకాన్ని ఎంత ఆసక్తిగా, ఉద్విగ్నంగా, కిందపెట్టకుండా చదువుతామో, అంతే బాగా అసలు తెలుగులోనే ఈ పుస్తకం రాశాడా అనిపించేలా అనువాదం నడిచింది. అందుకు వేణు చాలా అభినందనీయుడు.

ప్రస్తుత పరిస్థితిలో ఏటికి ఎదురీదడం ప్రతి ఒక్కరూ తమతమ జీవితాల్లో తప్పక చెయ్యవలిసి వస్తోంది. ఎలాంటి పరిస్థితిలోనైనా అలా ఈది చూపించిన జీవితం తన జైలు జీవితం. అరుణ్‌ వేసిన ‘ఆశ’ అనే చిత్రంలో లాగానే చీకటి కొట్టులాంటి జైలు జీవితం గురించీ, అందులో నుండి లాల్‌ గేట్‌ బయట పరుచుకొన్న రంగుల ప్రపంచం (అదీ ఒక పెద్ద జైలు లాంటిదే అయినప్పటికి) గురించీ మనతో పంచుకొన్నభావోద్వేగాలే సంకెళ్ళ సవ్వడి.

      ఒక ‘మావోయిస్ట్’ ఖైదీ జైలు అనుభవాలు

సంకెళ్ళ సవ్వడి

రచన: అరుణ్ ఫరేరా

తెలుగు అనువాదం: ఎన్. వేణుగోపాల్

మలుపు ప్రచురణ, హైదరాబాద్

వివరాలకు సందర్శిం చండి :

www.malupubooks.blogspot.com

మీ మాటలు

  1. vijay kumar says:

    Who really believes in constitution in India?

  2. నిశీధి says:

    తమ చర్యలను సరిగ్గా ఇలాంటి వాదనలతోనే సమర్ధించుకొన్న ముఖేష్‌ సింగ్‌ గుర్తుకు వస్తాడు. ఇలాంటి వారితో కలిసి రోజంతా కలిసి ఉండాల్సిరావడం ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ అలవాటుపడతాం << ఎంత నిజం అయితే మీరు జైళ్లలో మాత్రమే అన్నారు , మనకు తెలిసి పయోముఖ ముఖేష్ లు చుట్టూ ఎంతమందో . చాల మంచి ఇంట్రడక్షన్ .

  3. N.RAJANI says:

    అను ముందుమాట చదివితేనే ఒక ఆవేదన గా అనిపించింది ఇక పుస్తకం కచిటంగా చదవాలి బుక్ రిలీజ్ మీటింగ్ కి వద్దామనుకున్నా వీలు కాలేదు .బాగుంది అను

  4. srinivas says:

    నేను కూడా చాల ఎల్లా క్రితం ( ఎనభయ్యో దశకమొలొ )వరంగల్ కేంద్ర కారాగారంలో వార్త పత్రికలను వేయించాను; లోపల వాళ్ళకి బాహ్య ప్రపంచంలో ఎం జరుగుతున్నదో తెలుపదానికి ; సుమారుగా 3 సంవత్సరాలు తరువాత వచ్చిన ఒక అధికారి వాటిని mani pinchhaadu ; pai mundu maata chaduvuthute malli pata ghyapkalu gurthu kosthunnayi !

  5. చందు తులసి says:

    బయట ఏం జరుగుతోందో ఖైదీలకు తెలియాల్సిందే……అంతకన్నా జైలు లోపల ఏం జరుగుతోందో …….బయట సమాజానికి తెలియాలి…పరివర్తన కేంద్రాలుగా ఉండాల్సిన కేంద్రాలు…..నరకకూపంగా ఎందుకు మారుతున్నాయి. ? మిగత అధికార వ్యవస్థల్లా జైైళ్లు కూడా ఎవరి ప్రయోజనాలు కాపాడుతున్నాయి…..? అనురాధ గారు మీరు చేయాల్సింది…..చెప్పాల్సింది చాలా ఉంది.

మీ మాటలు

*