భావుకత అంచుల్లోకి ప్రయాణం..గ్లేసియర్!

మణి వడ్లమాని 

10694228_10152765337716095_4192333521636583623_oఅసలు ఏ స్త్రీ మూర్తి లో అయినా సరే ఎప్పుడో ఒకప్పుడు మాతృప్రేమ ని చవి చూస్తాం అందరం . ఆ ప్రేమకి వయసు, జాతి, కుల, మతాల తో సంభందం లేదు. అలాంటి మాతృ ప్రేమ నాకు దక్కింది. జన్మ నిచ్చి అక్షరాలు నేర్పి,విద్యా బుద్దులు నేర్పిన ది మా అమ్మగారు అయితే సాహితీ జన్మనిచ్చి , నాచేత సాహితీక్షరాభ్యాసం చేయించి,నువ్వు రాయగలవు అంటూ నన్ను వెన్ను తట్టి ప్రోత్శాహించిన డాక్టరు మంథా భానుమతి గారి కి మాతృదినోత్సవ సందర్భంగా  శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.
డాక్టరు మంథా భానుమతి గారు కధలు మద్య వయసు నుంచి రాయడం మొదలుపెట్టి అనతి కాలం లోనే ప్రాచుర్యం పొందిన రచయిత్రి గా పేరు తెచ్చుకున్నారు. ఆవిడ మొదటి కథానిక 1993 ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో ప్రచురితం అయింది.

ఆమె రాసిన నవలలో నాకు నచ్చిన నవల గ్లేషియర్ . ఇది ఆమె మొదటి నవల , రచన మాసపత్రిక నిర్వహించిన విశ్లేషణాత్మక నవలల పోటిలో. బహుమతి వచ్చిన నవల. ఈ నవల పోటికి పంపేటప్పుడు ఆమె అనుకున్నారట బహమతి వస్తుందా,పెడుతుందా? కాకపోతే ఒక అనుభవం వస్తుంది కదా అని సాహసం చేసారుట. ఆనాటి ఆవిడ సాహసమే ఈ నాడు తెలుగు సాహితీ లోకానికి ఒక చక్కటి విశ్లేషణాత్మక పూర్వమైన నవలని అందించింది. అది అసలు ఆవిడ మొదటి రచనలా అనిపించదు. నవల సహజత్వానికి ఎంతో దగ్గర గా ఉంటుంది. మనమూ కూడా పాత్రధారులతో మమేకం అయ్యి వాళ్ళతో పాటు తెల్లటి కొండలు. వాటి మధ్య నీలం రంగు గ్లేషియర్లు. క్రింద ఆకుపచ్చని నీళ్ళల్లో తేలుతున్న తెల్లటి హిమ శకలాలు. మధ్యే మధ్యే తెల్లటి నీటి పక్షులు ఆ పైన చుట్టూ కొండలూ, అడవులూ, సరస్సులూ, జలపాతాలూ. అలా .అలస్కా అందాలను చూస్తూ వెళుతూ ఉంటాము.

వర్ణనలు చూస్తూ ఉంటె చదువుతున్న రచయిత్రిలోని భావుకతా కోణం కూడా మనకి ఆవిష్కృత మవుతుంది. నవలలో చాలా భాగం క్రూజ్ లో నడుస్తుంది. ఈ నవలలో ముఖ్యపాత్ర గ్లేషియర్ దే! దాని చుట్టురా తిరుగుతుంది కధ ఆసాంతం.

అమలాపురం లో ఉన్న స్కూల్ లో తొమ్మిదో క్లాసు చదువుతున్న శాంత దగ్గరనుంచి కధ ప్రారంభం అవుతుంది.సాంఘిక శాస్త్రం పాఠం వింటూ అందు లో ఓడలు, గ్లేషియర్స్ గురుంచి విని అవి చూస్తె యెంత బావుంటుందో అని అనుకుంటుంది. కాలం తన గతులు మార్చుకుంటూ వెళుతున్నప్పుడు దానితో పాటే మనిషి కూడా జీవితం లో ఎదుగుతుంటాడు. అలాంటి జీవనక్రమం లో శాంత కి కృష్ణ తో పెళ్ళయి,ఇద్దరు పిల్లలు పుడతారు. వాళ్ళు పెరిగి పెద్దయి, పెళ్ళిళ్ళు చేసుకుని విదేశాలలో స్థిరపడతారు. అది గో అప్పుడు మళ్ళి శాంత లో గ్లేషియర్ చూడాలనే కోరిక బలం గ కలుగుతుంది. హిమాచల్ ప్రదేశ్ లోని కులూ మనాలి వెళతారు శాంతా కృష్ణ, కాని అక్కడ శాంతకి గ్లేషియర్ దగ్గరనుంచి చూడాలనే కోరిక తీరదు . దూరం నుంచే ఆ అందాలను చూసి తృప్తి పడుతుంది. అప్పుడు కృష్ణ అంటాడు. ఇక నుంచి మనం ప్రతి ఏడు తప్పక సిమ్లా వద్దాం అప్పుడు చూద్దువు గానే లే, అలా దిగులుపడకు అని సముదాయిస్తాడు. మూడేళ్లు గడచి పోతాయి. కానీ ఏదో కారణాల వల్ల మళ్ళి సిమ్లా వెళ్ళలేకపోతారు.

Glacier_large
ఇంతలో పిల్లలు అమెరికా రమ్మనమని చెబుతారు. మొదట చిన్న కొడుకు దగ్గరకు వెళ్ళినప్పుడు శాంత తన కోరికనుచెబుతుంది. అమ్మా! నువ్వు అన్నయ్య ఊరు వెళ్తావు కదా అక్కడనుండి అలస్కా ట్రిప్ కి వెళ్ళచ్చు. అన్నయ్య అన్నీ ఏర్పాట్లు చేస్తాడు అని చెబుతాడు. అనుకున్నట్లుగా పెద్ద కొడుకు టికెట్లు కొని అలస్కా ట్రిప్ కి పంపిస్తాడు.
ఇక్కడ రచయిత్రి ప్రతి చిన్న విషయం కూడా చదువరులకు క్షుణ్ణంగా,వివరిస్తూ కధను సాగిస్తారు.ఓడ, తయారీ, అసలు క్రూజ్ లో ఏమేమి ఉంటాయి, వాటిలో ఎన్ని అంతస్తులు ఉంటాయి.,ఎన్ని డెక్ లు ఉంటాయి, ఎలా ఉండాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇత్యాది విషయాలు ఎంతో విపులంగా,విశ్లేషణ తో వివరించారు.

ఆ వారం రోజుల ట్రిప్ లో ఎంతో మంది సన్నిహితులవుతారు. వేరే వేరే దేశస్థులే కాకుండా ఇద్దరూ ఇండియన్ ఫ్యామిలీ లు కూడా వస్తారు. శాంత పాత్ర ఇలాఅనుకుంటుంది. “పరాయిదేశస్తులు ఎంతో ఆప్యాయంగా పలకరించారు. అదే మన దేశంవాళ్ళు,మనబాష బాషమాట్లాడే వారు మాత్రం అంటీముట్టనట్లుగా ఉండటం ఒకింత బాధను కలిగిస్తుంది.”
ఈ నవల ఏదో ఒక టూర్ గురించే కాకుండా,ఆ క్రూజ్ లో కలిసిన బాబ్,ఉర్సులా మధ్య నడిచేప్రేమ లోని సంఘర్షణలను చాలా బాగా మలచారు రచయిత్రి,ఆ నేపధ్యం లో ఉర్సులా ఎప్పుడూ అనుకుంటుంది, బాబ్ గ్లేషియర్ లా చలనం లేకుండా ఉంటాడని. కాని ఆమెకు క్రమేణా అర్థమవుతుంది. “ధీర గంభీరంగా ఉన్న గ్లేషియర్ కొననెమ్మదిగా వంగి కింద ఉన్న మంచు నది లో కలుస్తుందని”
అలాగే క్రూజ్ కెప్టన్, హోటల్ డైరెక్టర్ జో, పర్సర్ టెర్రీ, వీళ్ళందరూ కూడా మనకి మిత్రులుగా అనిపిస్తారు. అంటే ఆ నవల అంత గ ప్రభావితం చేస్తుంది.
“నార్తరన్ లైట్స్ ఎంతో చెప్పుకోదగ్గ విశేషం, ఆగష్టు నెలాఖరి నించీ ఏప్రిల్ మొదటివారం దాకా రాత్రిపూట ఆకాశం రంగులు పులిమేసిన ఒక చిత్రపటంలా, ఆ రంగులు రకరకాల రూపాలను సంతరించుకుంటూ వెలిగిపోతుంది. అది చూడటానికి కృష్ణ ని రమ్మన్నప్పుడు అబ్బ ఇంటికి వెళ్ళాక యు ట్యూబ్ లో చూద్దాం లే అనడం తో ,శాంత కొంత నిరుత్సాహ పడినా తను చూడటానికి ఒక్కత్తే అర్ధరాత్రి అలారం పెట్టుకుని మరీ వెళుతుంది.
మధ్య మధ్యలో అందమైన బొమ్మకు నగిషీలు చెక్కినట్లుగా నవలలో రచయిత్రి శాంత పాత్రకు భావుకతను జోడిస్తారు. ఆ భావుకత్వపు గుబాళింపు చాలా ఆహ్లాదాన్ని ఇస్తుంది. షిప్ వెళుతున్నప్పుడు సముద్రం లో దారి , ఏర్పడినట్లు రెండు పక్కలాసముద్రం చూస్తూ ప్రపంచంలో అతి సుందరమైన, రంగురంగుల ప్రదేశం అలాస్కా వే,అని శాంత అనుకుంటుంది.
ఎంతో ఇన్ఫర్మేషన్ సేకరించి,దానిని పాఠకుల కి చెప్పడంలో సఫలీకృతులు అయ్యారు. అదే విధంగా ఎవరైనా సరే ఇప్పటికిప్పుడు అలస్కా వెళ్ళడానికి వీలుగా ప్రతి చిన్న విషయం కూడా సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పారు. ఎంతైనా అధ్యాపకురాలు కదా !
నవల ఆసాంతం చదివిన తరువాత కలిగిన అనుభూతి గురుంచి మాటలలో వర్ణించడం కష్టం. అది పుస్తకం చదివిన వాళ్ళకే అనుభవైకవేద్యం అవుతుంది. అందుకే ఇది అందరూ తప్పక చదవాల్సిన నవల.
***

మీ మాటలు

  1. ఆర్.దమయంతి. says:

    సూపర్ గా వుంది రివ్యూ మణి! చాలా బాగా రాసారు.
    అభినందనలు.
    :-)

  2. చాలా చక్కగా రాసావు మణీ.నేను మనసు పడి కొన్నాను చదువుదామని .మొత్త౦ పుస్తక౦ అ౦తా చదివేసిన అనుభూతిని కలిగి౦చావు.భానక్క రామాయణ౦ మామయ్య కూడా నాకు చాలా ఇష్టమైన నవల కధలైతే మరీనూ.చాలా ఆన౦ద౦ వేసి౦ది.

  3. పుస్తక పరిచయం బావుంది మణీ, మళ్ళీ చదవాల్లనిపించేలా! అభినందనలు!

  4. మణి వడ్లమాని says:

    నాగలక్ష్మి,సుజలగారు,అండ్ దమయంతి అక్కా! t చాలా సంతోషంగా ఉంది నా వ్యాసం మీకు నచ్చినందుకు.. కల్పనా మీకు మరీ మరీ ధన్యవాదాలు నా వ్యాసం ప్రచురించినందుకు.

  5. చాలా బాగా రాసారు మణి గారూ. నాకూ నవల చదవాలనిపిస్తోంది.

  6. ధన్యవాదాలు మణీ. విశ్లేషణ చక్కగా ఉంది.

Leave a Reply to వారణాసి నాగలక్ష్మి Cancel reply

*