కృష్ణమోహన్ బాబు
“బాబూ గిఖోర్ , నీకు కొన్ని విష యాలు చెప్పవలసివుంది. ఇక్కడ పరిస్థితులు చాలా క్లిష్టంగా వున్నాయి. పన్నుల కోసం మమ్మల్ని వత్తిడి చేస్తున్నారు. మా దగ్గర డబ్బు లేదు. మీ అమ్మకి , జాన్నీకి వేసుకోవడానికి బట్టలు లేవు. నిజానికి బనీను గుడ్డల్లాంటివి వేసుకుని బతుకుతున్నాం. మాకు కొంచెం డబ్బు పంపించు బాబూ. నీ క్షేమం గురించి ఒక వుత్తరం కూడా రాయి. ఆవు చచ్చిపోయింది. మీ అమ్మకి, జాన్నీకి ఒళ్ళు కప్పుకోవడానికి ఏమీ లేదు.”
గిఖోర్ అనే కుర్రవాడికి వూరి వాళ్ళ ద్వారా వాళ్ళ నాన్న పంపిన వుత్తరం యిది. హువనేస్ తుమన్యాన్ “కథలు – గాథలు” అనే పుస్తకం లో ‘గిఖోర్ ‘ అనే కథ లోది. ఆర్మేనియన్ సాహితీ చరిత్రలో పెద్ద దిక్కుగా పేరు తెచ్చుకొన్న తుమన్యాన్.
ఫిబ్రవరి 19, 1869లో పుట్టాడు . అప్పుడు ఆర్మేనీయా రష్యన్ రాజారికం లో భాగం . తుమన్యాన్ ని ఆర్మేనీయన్ జాతి సంపదగా కొల్చుకుంటారు. ప్రతి యేడు ఏప్రిల్ లో అతనిని గుర్తు చేసుకుంటారు . ఇతను తల్లి నుంచి కథలు చెప్పడం నేర్చు కున్నాడు. 12 యేళ్ళ కి మొదటి కవిత్వం రాశాడు . కవిత్వం, కథలు, జానపద కథలు, గాథలు అలా అన్ని రకాల ప్రక్రియల్లో పేరు సంపాదించాడు . 1923, మార్చ్ 23 న చనిపోయాడు. ఈ పుస్తకం లో 6 కథలు, 9 జానపద గాథలు వున్నాయి. ఈ పుస్తకం 40 యేళ్ళ క్రితం ఒకసారి సోవియట్ అనుబంధ సంస్థ ‘ప్రగతి ప్రచురణాలయం’ వారు వేశారు. దీనిని పి. చిరంజీవినీ కుమారి గారు తెలుగు లోనికి తీసుకు వచ్చారు. నవచేతన్ పబ్లిషింగ్ హౌస్, హైదారాబాద్ వారు ఈ మధ్యనే ఈ పుస్తకాన్ని మళ్ళీ అచ్చువేశారు.
ఇందు లో మొదటి కథ ‘గిఖోర్ ‘. ఒక బీద రైతు, తన 12 యేళ్ళ కుర్రాణ్ని, బతుకు తెరువు తెలుస్తుంది, పని నేర్చు కుంటాడనుకొని, పట్నం లో షావుకారు దగ్గర జీతభత్యాలు లేని పనివాడుగా పెడతాడు. ‘ముక్కుపచ్చలారని బిడ్డని నీతి, న్యాయం లేని ఈ ప్రపంచం లోనికి తోసేయడానికి వీలులేదని’ వాళ్ళ అమ్మ ఏడుస్తుంది. తన పరిస్థితి ఎలాగూ దుర్భరంగా వుంది. కనీసం కొడుకైనా ఏదో
ఒక పని నేర్చుకుని కుటుంబాన్ని ఆదుకోపోతాడా అన్నది రైతు ఆశ. ఈసడింపులు, తిట్లు, చివాట్లు మధ్య అతి హీనమైన పరిస్థితులలో ఆ కుర్రాడు షావుకారు దగ్గర వుంటాడు. వెనక్కి వెళ్ళడానికి వీలు లేని పరిస్థితులు. తన వాళ్ళెవరినీ తిరిగి చూడకుండానే కొద్ది కాలంలోనే ఆ కుర్రాడి జీవితం కడతేరిపోతుంది. చెల్లెలి కోసం పోగు చేసిన మెరుస్తున్న బొత్తాలు, రంగురంగు కాగితం ముక్కలు, పిన్ను సూదులు, బట్టల తాన్ల పీలికలు మిగులుతాయి. 1894 లో వచ్చిన ఈ కథ తర్వాత రష్యన్ సినిమాగా కూడా వచ్చింది. ఇది ‘యూ ట్యూబ్ ‘ లో కూడా వుంది. ఇది ఈ రోజుకీ నడుస్తున్న కథే. ఇప్పటికీ ఒక్కసారి బయటికి తొంగి చూడండి. పిల్లల్ల్ని మోస్తూనో, నౌకర్లు గానో, కాఫీ హోటళ్ళలో బల్లలు తుడుస్తూనో, నాశనమవుతున్న పల్లె జీవితాల నుంచి పట్టణకీకారణ్యంలో పడ్డ గిఖోర్లు అన్ని చోట్లా కనబడుతూనే వుంటారు.
రెండో కథ ‘నా నేస్తం – నెస్సో.’ చిన్నతనంలో ఏ తారతమ్యాలు లేకుండా ఆడుకోవడమే జీవిత లక్ష్యంగా ప్రాణానికి ప్రాణంగా పల్లెటూరిలో పెరిగిన ఒక కుర్రాళ్ళ గుంపు. ఆ గుంపులో నెస్సో ఒకడు. వేసవి వెన్నెలలో నెస్సో మిగతా
కుర్రాళ్ళకి ఎన్నెన్నో కథలు చెప్పేవాడు. అప్సరసల గురించి , రత్నాల పక్షి గురించి, గుడ్డి రాజు గురించి. మిగతా కుర్రాళ్ళంతా వాడి కథల కోసం ఆత్రుతగా ఎదురు చూసేవారు. కాలప్రవాహంలో డబ్బులున్న పిల్లలు చదువులతో ముందుకెళ్ళి నాగరికంగా తయారయితే, దారిద్రంలో జీవిస్తున్న నెస్సో సామాజిక పరిస్థితుల వల్ల దొంగగా మారతాడు. ఎంత నాగరికంగా మారినా, వెన్నెల రాత్రి నెస్సో చెప్పిన కథలు తీయని జ్ఞ్యాపకాలుగా వెంటాడుతూనే వుంటాయి.
“నెస్సో దరిద్రుడు, నెస్సో అజ్ఞ్యాని. దౌర్భాగ్యం బీదరైతులకి ప్రసాదించే కష్టాలలో నెస్సో నలిగిపోయాడు. వాడికే చదువుంటే, వాడికే భవిష్యత్తు మీద భరోసా వుంటే, వాడూ మంచి వాడయ్యే వాడే. నా కంటే కూడా గుణవంతుడు అయ్యేవాడు—-” నెస్సో మిత్రుడు నెస్సోని తలచుకుని అనుకున్న మాటలు. వెనక్కి తిరిగి చూసుకుంటే మనలో చాలా మందికి యిలాంటి తడి జ్ఞ్యాపకాలు వుండే వుంటాయి.
పారిశ్రామిక ప్రగతి జీవితాలలో ప్రవేశించినపుడు మనుషుల విలువల్లో వచ్చే మార్పుని సూచిస్తుంది ‘రైల్వే లైను నిర్మాణం’ కథ.
మూడో కథ ‘పందెం’. ఆర్మేనియన్లని టర్కీ దేశస్తుల్ని విడదీశే కొండల మధ్య వున్న ‘మూతు జోర’ అనే లోయలో జరిగిన కథ. ఒక టర్కిష్ బందిపోటు, ఛాతి అనే ఆర్మేనియన్ పశువుల కాపర్ని చంపుతానని పందెం కాసి ఆ కుర్రాడి చేతిలో తనే ప్రాణాలు పోగొట్టు కున్న కథ. అయితే ఆ బందిపోటు తండ్రి తన కొడుకు చేసిన దుర్మార్గాన్ని ఖండించి వాడి తలపాగా, కత్తి, డాలు ఇచ్చేయమని అర్థించి యిలా అంటాడు “వాడి తల్లి మాత్రం ఏం చేయగలదు. ఎంతయినా తల్లి కదా! గుండె చెరువయ్యేలా ఏడుస్తోంది. వాడి బట్టలు యిచ్చేస్తే, ఆమె దగ్గరికి తీసుకుపోతాను. కరువుతీరా ఏడుస్తుంది. అప్పటికైనా ఆమె దుఖ్ఖమ్ తీరి మనసు కొంచం కుదుట పడుతుంది.”
తాము అనుకున్న పని జరుగకపోతే ఎంత దగ్గిర వాళ్ళయినా నీచంగా చిత్రించే మనిషి నైజాన్ని చెప్పే కథ, ‘ఖేచన్ మామయ్య.’
యిక చివరి కథ ‘లేడి,’ మనిషి కంటే క్రూర జంతువు మరొకటి లేదనిపించే కథ. తుపాకి పట్టి ఒక మృగాన్ని చంపిన తర్వాత దాని తల్లి దీనంగా దిక్కులు చూస్తూ ఆ పిల్ల కోసం, అది పడే తపన, మన యిళ్ళల్లో పిల్లో పిల్లవాడో చావుబతుకుల్లో వున్నప్పుడు ఆ తల్లి పడే బాధ లాంటిదే. అందుకే తోటమాలి ‘ఓవంకి ‘ అంటాడు “ మనకీ, ఈ కొండల్లో లేళ్ళకి తేడా ఏంటి? ఏమీ లేదు. మనసు మనసే. బాధ బాధే.”
యింకా గాథలలో వున్న 9 కథలు చాలా చమత్కారంగా, నవ్విస్తూ కొన్ని సందేశాలను కూడా చెబుతాయి. ‘తోక తెగిన నక్క’ అనే కథ రాజుగారు – ఏడు చేపల కథను గుర్తు చేస్తుంది. మనం ఎవరికైనా ‘ మేలు చేస్తే దాన్ని సముద్రంలో పారేసినా మళ్ళీ నీ వద్దకు ఒకనాడు తిరిగి వస్తుంది’ అన్న ఆర్మేనియన్ సామెతని పిల్లలకి ‘మాట్లాడే చేప’ కథ ద్వారా చెబుతారు. మన ‘శ్రావణ, భాద్రపద’ కథ లాంటిదే ‘తీర్ధం’ కథ. తెలివి తేటలతో కష్టాల్నించి ఎలా గట్టెక్కచ్చో చెబుతుంది ‘యజమాని – పనివాడు’ కథ. వీటన్నిటినీ మించిన తమాషా కథ, ‘వేటగాడి కోతలు .’ ఇది ఒక మ్యాజిక్ రియలిజం లాంటి కథ.
ఈ కథ చదువుతూ వుంటే దక్షిణ అమెరికా కథను దేన్నో చదువు తున్నట్లు వుంటుంది. ఇవి ముఖ్యంగా పిల్లల్ని వుద్దేశించి, వాళ్ళకి లోకరీతిని నేర్పించేవి. అందుకనే ఆ కథలు చెప్పే తీరు చదివి అనుభవించాల్సినదే గాని, మాటల్లో చెప్పేవి కాదు.
వందేళ్ళ నుంచి ఈ కథలు జనం చదువుతూనే వున్నారు. మళ్ళీ మళ్ళీ నెమరువేసుకుంటూనే వున్నారు. తెలిసిన విషయాలే అయినా ఇంత కాలం మన మధ్య ఈ కథలు బతికి వుండడం కథకుడిగా తుమన్యాన్ మ్యాజిక్. రచయితలు అనుకుంటున్న వాళ్ళు, తమ రచనలు జనాల మధ్య పది కాలాలపాటు వుండాలనుకునే వాళ్ళు ఈ కథల్లోకి తొంగి చూడండి. ఆ మ్యాజిక్ ని పట్టుకోండి. మిమ్మల్ని మీరు బతికించుకోండి.
*
మంచి పుస్తకాన్ని పరిచయం చేశారు – ధన్యవాదాలు
When discussing works by non-Indian authors please provide the complete English spelling. It will be very helpful for the readers to find the book – both the translated and the original works. Thanks.