ప్రపంచంలోని అన్ని వృత్తులలోకీ పురాతనమైనది వేశ్యావృత్తి. మనుషుల్లోనే కాదు, దేవతల్లోనూ వేశ్యలున్నారని మన పురాణాలు చెప్తున్నాయి. రంభాది అప్సరసలు అందుకు ఉదాహరణగా కన్పిస్తున్నారు. దేవేంద్రుడు తన సింహాసనాన్ని కాపాడు కోవడానికి వేశ్యల సేవల్ని పొందినట్టుగా పురాణాలు వివరిస్తున్నాయి. వేశ్యల్ని సమాజం ఎలా ఉపయోగించు కొన్నదో, రాజులు ఎలా ఉపయోగించు కొన్నారో అనేక చోట్ల రికార్డైంది. వాళ్ళ జీవితాలు ఎంత దయనీయంగా గడుస్తాయో వర్ణించే రచనలు కొల్ల. కానీ, వేశ్యల ఆలోచనలు, వాళ్ళు అభ్యసించే విద్యలూ, వాళ్ళ వృత్తిలో ఎదురయ్యే సమస్యలు, విటుల్ని ఆకర్షించేందుకు వాళ్ళు పన్నే ఎత్తుగడలూ… వీటిని గురించి సాహిత్యం తక్కువగానే మాట్లాడింది.
ఏదో వెతుకుతుంటే మరేదో దొరికినట్టు లూషియన్ రాసిన మైమ్స్ ఆఫ్ ది కోర్ట్జాన్స్ అనే పుస్తకం కళ్ళ బడింది. క్రీస్తు శకం ఒకటో శతాబ్దిలో రాసినట్టుగా చెప్తున్న ఈ గ్రంధం ఆ కాలంలోని వేశ్యల జీవితాలను, వాళ్ళ ఆలోచనలను, ఆ వృత్తిలో ఉండే సాదక బాధకాలనూ చక్కగా వివరిస్తుంది. ఆనాటి సమాజ స్వరూపం కూడా పరోక్షంగా మనకు కన్పిస్తూనే ఉంటుంది. ఒక్కొక్క సంభాషణ ఒకటి రెండు పేజీలకు మించకుండా అశ్లీలానికి పెద్దగా తావివ్వకుండా రచనా నిర్వహణలో లూషియన్ చూపిన నైపుణ్యం అబ్బుర పరుస్తుంది. ఈ పుస్తకం చదివాక ఇలాంటి రచనలు భారతీయ భాషల్లో ఉన్నాయా అని వెదికాను. నేను చూసినంతలో దొరకలేదు.
ఐతే, సంస్కృతంలో భాణం అనే ప్రక్రియలో రాయబడిన రచనల్లో ఈ బాపతు ఉన్నాయని విన్నాను. దశవిధ రూపకాల్లో ఒకటైన భాణం అనేది ఏకాంకిక రూపంలో ఉంటుందనీ, భాణంలో వస్తువు ధూర్తచరితం అయ్యుండాలనీ, నాయకుడు విటుడై ఉండాలనీ విన్నాను. నాకు సంస్కృతం రాకపోవడం వల్లా, తెలుగులో భాణాలకు అనువాదాలు లభించకపోవడం వల్లా, వాటిని పరిశీలించే అవకాశం కుదరలేదు.
ఒకటికి రెండుసార్లు ఈ సంభాషణలు చదివిన తర్వాత తెలుగులో సుప్రసిద్ధమైన కన్యాశుల్కం, చింతామణి, మధుసేవ వంటి నాటకాలలోని కొన్ని సంభాషణలు వస్తువులో లూషియన్ రచనను పోలి ఉన్నాయని అనిపించింది. అలాగే, మల్లాది రామకృష్ణ శాస్త్రి, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గార్ల కథల్లోని కొన్ని సంభాషణలు కూడా! క్రీడాభిరామం లోని ఒకటి రెండు సన్నివేశాలను సంభాషణ రూపంలోకి మారిస్తే ఇలాంటి రచనలోకి ఒదుగుతాయని అనిపించింది. వెంటనే వీటన్నిటినీ ఒకచోట సంకలనంగా కూర్చి ఒకటికి నాలుగు సార్లు చదివాను. తెలుగులోని ఆయా నాటకాల్లోనుంచి అతి స్వల్ప మార్పులతో ఈ సన్నివేశాలను వేరుచేసి లూషియన్ సంభాషణలతో కలిపి చదివినప్పుడు ఆయా సన్నివేశాలు కొత్త రూపాన్నీ, కొత్త భావాన్నీ సంతరించుకోవడం గమనించాను. మొత్తమ్మీద వీటిని చదవడం ఒక విలక్షణమైన అనుభవంగా భావించాను.
ఉత్సాహంకొద్దీ చూపించగా, ఈ కూర్పు మొత్తాన్నీ చదివిన మిత్రులు పెద్ది రామారావు దీన్ని పుస్తకంగా తెస్తే బాగుంటుందని అన్నారు. అక్కడి నుంచి పుస్తకంగా తేవడం గురించి ఆలోచించాను. ఏమిటి ప్రయోజనం? ఎందుకు తేవాలి? ఈ ప్రశ్నలకు నాకు సంతృప్తి కలిగించిన సమాధానాలు రెండు. ఒకటి, ఇలాంటి పుస్తకం తెలుగులో లేదు కాబట్టి. రెండు, పుస్తకంలోని వస్తువు ఆసక్తికరమైనది కాబట్టి కొందరైనా చదువుతారు. నాకీ జ్ఞానం కలగటం వల్ల బహుశా ఈ సంభాషణలు పుస్తక రూపంలో రావొచ్చు.
(ఈ సంభాషణలు వచ్చే వారం నుంచి వరసగా…)
*
Wow idea . If possible it should be printed properly .And thanks a lot for the article which added an interesting book to my ‘To read’ list .
మృత్యుంజయరావు గారు,
మంచి ప్రయత్నమండి. అభినందనలు. తెలుగులో ఇలాంటిదే ఒక అరుదైన పుస్తకం పద్యాల్లో
ఉంది. వేశ్యావిలాపం పేరుతో వరదా మంగయ్య అనే ఆయన రాశాడు. 1922లొ వచ్చింది. మీరు మెయిల్ ఐడీ ఇస్తే మెయిల్ చేస్తాను.
మోహన్ గారూ!
చంద్రరేఖావిలాపం అనే పుస్తకం నేను చదివాను. కానీ అది నేలబారు రచన. మీరు చెప్పే వేశ్యావిలాపం గురించి నేను వినలేదు. దయచేసి పంపండి. నా ఇ మెయిల్ ఐ.డి. ఇక్కడ ఇస్తున్నాను. pinnamaneni _ mr @ yahoo . com . ధన్యవాదాలు.
అభినందనలు సర్.,
ధన్యవాదాలు భాస్కర్ గారూ!
మంచి పరిశొధన
కాదేదీ రచన కనర్హం..
ఆసక్తి కరమైన అంశం…
ఇంతవరకు అంతగా స్పృశించబడని అంశం కూడా
ఆ సంభాషణా సమయాల కోసం ఎదురుచూస్తుంటామ్ మృత్యుంజయ రావు గారు…
ఈ తరహాలో ఇదే మొదటి యత్నమనుకుంటాను. అభినందనలు. ప్రయోజనాత్మకంగా తీసుకు వచ్చేందుకు కృషి చేయండి.
ఆసక్తికరంగా ఉంది