‘ప్రగతి’ ఆయన వేలిముద్ర

2
ఒక మనిషి వ్యక్తిత్వాన్ని వారి బాడీ లాంగ్వేజీతోనే కాదు, సదరు వ్యక్తి నవ్వును బట్టి కూడా చక్కగా అంచనా వేయవచ్చును. ఆరోగ్యం నిండిన నవ్వు, హాయిగా నవ్వే తీరు ఆ వ్కక్తి తాలూకు సంతృప్తికరమైన జీవితాన్నే కాదు, సాఫీగా సాగుతున్న సంస్థ తీరుతెన్నులనూ పట్టిస్తుంది. ప్రగతి ఆఫ్ సెట్ ప్రింటర్స్ లిమిటెడ్ వ్యవస్థాపక చైర్మెన్ పరుచూరి హనుమంతరావు విషయంలో ఇదే నిరూపితం అవుతోంది. ఆయన గుండెనిండా నవ్వుతూ మాట్లాడుతుంటే వారు సాధించిన ‘ప్రగతి’ సప్తవర్ణ ఇంద్రధనుస్సు వలే ఆవిష్కారం అవుతున్నది.

ఆరు దశబ్దాల ప్రగతి రథ సారథి అయిన హనుమంతరావు లాల్చీ పైజామా ధరిస్తారు. ఆయనది సుఖం, శాంతి, సంతృప్తులను ఇముడ్చుకున్న ఛామన ఛాయ, మేను. రెడ్ హిల్స్ లోని వారి ప్రధాన కార్యాలయంలో సందర్శకుల కోసం వేసిన ఒక సోఫాలో కూచుని ఆయనతో ముఖాముఖి మాట్లాడుతుంటే, తెలుగు ప్రజలు అంతర్జాతీయంగా స్థిరంగా వేసిన కొన్ని ముద్రల్లో వీరిదీ ఒకటా అన్న సోయి కలగనే కలగదు. అంత సింప్లిసిటీ వారిది.

మాటల్లో మధ్యలో సందేహం కలిగి, ‘ మీరు రెగ్యులర్ గా కూచునే ప్లేస్ ఏది?’ అంటే, ‘ నా కంటూ కుర్చీలేదు. నిజమే. నేను చెయిర్ లేని చైర్మెన్ ను’ అంటూ నవ్వేశారు.

నవ్వుతూనే ఆయన లేచి నిదానంగా ముందుకు దారి తీశారు. ఆయనతో పాటు నడుస్తూ ప్రింటింగ్ కార్యాలయాన్ని, పని జరిగే చోట్లను చూస్తుంటే, యంత్రాలన్నీ ఒక్క క్షణం గౌరవ వందనం చేసి మళ్లీ పరుగందుకున్నాయా అన్నట్టు చలిస్తున్నాయి.

సన్నటి చప్పుడుతో ఆ యంత్రాలు పనిచేస్తుంటే ఒక్కో మిషను వద్ద ఆగి, జరుగుతున్న పని క్వాలిటీని అంచనా వేస్తూ హనుమంతరావు ముందుకు వెళ్లసాగారు. ఆకస్మాత్తుగా ఆయన ఒక చోట ఆగి, మిషన్ ఆపరేటర్ బసవరాజును పరిచయం చేశారు. ‘ ఈయన మా తొలి ఉద్యోగుల్లో ఒకరు. పైన, బైండింగ్ సెక్షన్ లో మహ్మద్ మెయినుద్దీన్ ఉన్నారు. ఆమయనా అంతే. సంస్థ స్థాపించిన తొలి రోజుల్నుంచీ మా కుటుంభంలో దాదాపు ఐదొందల సిబ్బంది పనిచేస్తున్నారు’ చెప్పారాయన.

‘మా వర్క్ ఫోర్స్’ ఘనత ఉద్యోగులను సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకోవడం ఒక్కటే కాదు, కస్టమర్లకు ప్రింట్ చేసిన మెటీరియల్ ను సప్లై చేసే కంపెనీగా కాకుండా ఆయా సంస్థల భాగస్వామిగా  సజీవ సంబంధాలు నెరుపుతాం. మా ‘ప్రగతి’కి ఇదే సూత్రం’ అని వివరించారాయన.

+++
1
‘ప్రగతి’కి ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. 1979లో ప్రగతి దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ఫొటో టైప్ సెట్టింగ్ సర్వీసులను ప్రారంభించింది. 1985లో మొదటి కలర్ ఆఫ్ సెట్ ప్రింటింగ్ ప్రెస్ ను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత 1988లో తొలిసారిగా కంప్యూటర్డ్ కంట్రోల్డ్ రిజిస్టర్, ఇంక్ కీ సెట్టింగ్ ను ఇన్ స్టాల్ చేసిన ఘనత కూడా వీరిదే. అలాగే, కంప్యూటర్ టు ప్లేట్ టెక్నాలజీని ప్రారంభించి, మ్యాన్యువల్ గా ప్లేట్లు తయారు చేసే పద్ధతికి స్వస్తి చెప్పడం వీరితోనే ప్రారంభం. అలా ప్రగతి క్వాలిటీ ముద్రణలోకి వెళ్లింది. ఇలా తక్కువ సమయంలో ఎక్కువ నాణ్యతగల సేవలు అందించే ప్రింటర్స్ గా ‘ప్రగతి’ దేశవిదేశాల్లో పేరు గడించింది.

ఆ విషయాలను వివరించి చెబుతూ, ‘నలభై ఐదేళ్లక్రితం పన్నెండువేల రూపాయలతో ప్రగతిని ప్రారంభించాను. ఒకే ఒక ట్రెడిల్ మిషన్ తో నేను ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టాను. తర్వాత నా కుమారులు నరేంద్ర, మహేంద్రలు వచ్చారు. ప్రగతికి కావాల్సిన ఆఫ్ సెట్ మిషనరీలు తెచ్చారు. క్రమంగా ఐ.టి.పరిజ్ఞానాన్ని అనేక విధాలుగా ఇమిడ్చారు. ఇంతలో అమెరికాలోని రాఛెస్టర్ యూనివర్సిటీలో చదువుకున్న నా పెద్ద మనవడు హర్ష వచ్చి చేరాడు. తను ప్రింటింగ్ పరిజ్ఞానానికి అవసరమైన సైంటిఫిక్ అప్రోచ్ ను జోడిస్తున్నాడు. త్వరలో మరో మనవడు హేమంత్ ( మెకానికల్ ఇంజనీర్) జతకావచ్చు’ ఉత్సాహంగా చెప్పారాయన.

అంటే, ఈ సంస్థది మూడు తరాల ప్రగతి అన్నమాట. ఒక్కొక్కరు ఒక్కో దశను వేగవంతం చేశారు. అందరూ నమ్మింది ఒకటే. ఫోకస్, కమిట్ మెంట్, డెడికేషన్.  ఇవి కాకుండా టెక్నాలజీ, మౌలిక వసతులు, నిపుణులను సమకూర్చుకోవడం- వీటితో ప్రీప్రెస్, ప్రింటింగ్, ఫినిషింగ్, బైండింగ్ రంగాల్లో అమితశ్రద్ధ తీసుకుంటూ భారతదేశంలోనే కాదు, ప్రపంవ వ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు హై క్వాలిటీ ప్రింట్ సర్వీసులు అందిస్తున్న సంస్థగా ప్రగతి పురోగమిస్తోంది.

‘ఒక్క మాటలో చెప్పాలంటే, ఓ ప్రింటింగ్ ప్రెస్ గా ప్రారంభమై ఐటి సర్వీసులు అందించే మేటి సంస్థగా ప్రగతి నేడు పేరొందింది’ అని సంక్షిప్తంగా ఆయన వివరించారు.

ఏదో  ఫోన్ వస్తే మాట్లాడుతూ ఆయన మిషన్లన్నీ దాటుకుంటూ మళ్లీ మొదటి అంతస్థులోని కార్యాలయానికి తిరిగి వచ్చారు. వస్తూ, అక్కడి టేబుల్ పై ఉంచిన ఏనుగు విగ్రహం వద్ద ఆగి, ‘ప్రింటింగ్ కమ్యూనిటీ యావత్తూ కలగనే పురస్కారం ఇదే’ అంటూ ఆగారాయన.

నిజం. ‘సౌత్ ఆఫ్రికన్  పల్ప్ అండ్ పేపర్ ఇండస్ట్రీస్ వారు ప్రతి ఏడాది ప్రింటింగ్ కాంపిటిషన్లు నిర్వహిస్తారు. ఈ పోటీల్లో గత సంవత్సరం కేటలాగ్ విభాగంలో ప్రగతి ‘ఇంటర్నేషనల్ ప్రింటర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం దక్కించుకుంది. ఏనుగు ప్రతి రూపం అదే’ అని చెప్పారాయన. అంతటితో ఊరుకోకుండా, ఏనుగు పురస్కారం వచ్చాక తొట్టతొలి మిషనుతో ( ట్రెడిల్ ప్రెస్) తాను దిగిన ఫొటోను కూడా తెప్పించి చూపించారాయన. ‘ ఈ పురస్కారంతో మేం ప్రింటింగ్ టెక్నాలజీలో ఉన్నత శిఖరం అధిరోహించాం. ఇక, ఆ శిఖరంపై నిలదొక్కుకోవడమే మా ముందున్న కర్తవ్యం’ చెప్పారాయన. చెబుతూ, మరింత సన్నిహితంగా ఆయన నిర్మించిన ‘ ప్రగతి’ని చూపించారు.

అదేమిటో కాదు, అంగుటి. వేలిముద్ర. ‘థంబ్ ఇంప్రెషనే మా లోగో’ అని వేలెత్తి చూపారాయన. విజిటింగ్ కార్డు అందిస్తూ, ఆ ముద్ర తనదే అని హాయిగా నవ్వుతూ చెప్పారు. చూస్తే, ఆ లోగోలో సప్తవర్ణాలున్నాయి. తాము ఇముడ్చుకున్న సాంకేతిక ప్రతిభ, శ్రమశక్తికి సంకేతంగా అది మెరిసిపోతుండగా ఆయన తన కుమారులు నరేంద్ర, మహేంద్రలను, మనవడు హర్షలను పరిచయం చేశారు, ఇక ముందు వారిదే ‘ప్రగతి’ అని!

– కందుకూరి రమేష్ బాబు

( 18 మార్చి 2007 వార్త దినపత్రికలో ప్రచురితమైన ‘అంతర్ముఖం’ శీర్షికా వ్యాసం)

3
పూర్తిపేరు: పరుచూరి హనుమంతరావు
మారుపేరు: ‘ప్రగతి’ హనుమంతరావు
స్వస్థలం: చిట్టూర్పు, కృష్ఝాజిల్లా
చదువు: బిఎ
అభిరుచి:బాస్కెట్ బాల్
ఇష్టమైన రంగు: ఎరుపు
అభిమానించే వ్యక్తులు: లెనిన్, మావో
‘ప్రగతి’ స్థాపన: 1962
ప్రగతికి ముందు: సారథి స్టూడియో మేనేజర్, విశాలాంధ్ర విలేకరి, ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ విద్యార్థి నేత, మూడేళ్ల జైలు జీవితం.
ప్రగతి కార్యాలయాలు: హైదరాబాద్, బెంగుళూర్,కోల్ కోత్తా, ముంబై, న్యూఢిల్లీ, న్యూయార్క్.

కస్టమర్లు: బజాజ్, ఇన్ఫోసిస్, ఫోర్ట్ ఇండియా, మెర్సిడెస్, పాన్ అమెరికా, ఐటిసి, తాజ్ గ్రూప్, బిబిసి, రెడ్డి ల్యాబ్స్, ఎల్ అండ్ టి, హచ్, ఇంకా చాలా…
ఇష్టమైన జాబ్ వర్క్:  పెళ్లి పత్రిక అచ్చేయడం.

మీ మాటలు

  1. bathula vv apparao says:

    యోధుడా, రెడ్ సెల్యూట్

Leave a Reply to bathula vv apparao Cancel reply

*