మహాత్ముడి అడుగు జాడల్లో….

satyam mandapati రెండేళ్ళ క్రితం మేము ఇండియా వెళ్ళినప్పుడు, ఆస్టిన్ నించీ ముందు భారత రాజధాని ఢిల్లీకి వెళ్ళి, తర్వాత ఆంధ్రాకి వెళ్ళాం. నేను ఎప్పుడో, కొన్ని దశాబ్దాల క్రితం కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో చదివేటప్పుడు, మా కాలేజీ విజ్ఞాన యాత్రలో వెళ్ళానుగానీ, ఇప్పుడు ఇన్నాళ్ళకి శ్రీమతితోనూ, మా వంశోధ్ధారకుడితోనూ వెళ్ళాం.

ఢిల్లీలో చూడవలసినవే కాక, ఆగ్రా, జైపూర్, అమృత్సర్, వాఘా సరిహద్దు మొదలైనవి కూడా చూశాం.

ఈ వ్యాసంలో మాత్రం ఒక్క ఢిల్లీ గురించే వ్రాస్తున్నాను.
ఎన్నో దశాబ్దాల తర్వాత డిల్లీ చూస్తున్నానేమో, అంతా వింతగా కనిపించింది. ముఖ్యంగా ఆరోజుల్లో ఢిల్లీ చూసినప్పుడు, ఏ విషయాలు పట్టించుకోకుండా, మిగతా స్టూడెంట్ కుర్రాళ్ళతో కలిసి సరదాగా చూశాం. ఇప్పుడు, ఎన్నో దేశాల రాజధానులు, ఇతర పెద్ద నగరాలు చూసిన తర్వాత, డిల్లీ నగరాన్ని ఇంకొక కొత్త కోణంలో చూశాను.
నేను మామూలుగా ఈ విహారయాత్రలు వ్రాస్తున్నప్పుడు, ముందుగా ఆయా ప్రదేశాల గురించి కొంత చరిత్ర కొన్ని గణాంకాలు ఇవ్వటం ఒక అలవాటుగా చేసుకున్నాను. అందుకని ఢిల్లీ గురించి కొంచెం తెలుసుకుందాం.
బ్రిటిష్ వారు వచ్చేదాకా, భారతదేశం అనే ఒక దేశం ఈనాటి ఎల్లలతో మనకి లేనే లేదు. రకరకాల సామ్రాజ్యాలు ఢిల్లీ రాజధానిగా వుండేవిగానీ, నేను చారిత్రకంగా అంత వెనక్కి వెళ్ళటం లేదు.
మొఘల్ సామ్రాజ్య కాలం నుండి, ముఖ్యంగా 1799 నుండి 1849 వరకూ ఆ సామ్రాజ్యానికి మాత్రం, ఢిల్లీ కేంద్రంగా వుంటూ వచ్చింది. తర్వాత బ్రిటిష్ రాజ్ కాలంలో, డిసెంబరు 1911 వరకూ భారత రాజధానిగా కలకత్తా నగరం వుండేది.1900 ప్రారంభంలో బ్రిటిష్ పరిపాలనా కాలంలో భారత రాజధానిని, కలకత్తా నుండి ఢిల్లీకి మార్చాలనే ప్రతిపాదన వచ్చింది. బ్రిటిష్ రాజ్ పెద్దలు పరిపాలనా సౌలభ్యం కోసం, రాజధానిని ఢిల్లీకి మార్చడమే ఉత్తమమని భావించారు. భారత చక్రవర్తి 5వ జార్జి, భారత రాజధాని, కలకత్తా నుండి ఢిల్లీకి మార్చాలని ప్రకటించాడు.
భారత స్వాతంత్ర్యం తరువాత, 1947లో, కొద్దిపాటి స్వయంప్రతిపత్తిని ఇచ్చి, భారత ప్రభుత్వంచే నియమించబడ్డ ప్రధాన కమీషనరుకు పరిపాలనాధికారాలు ఇవ్వబడ్డాయి. 1956లో ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటింపబడింది, అలాగే ప్రధాన కమీషనర్ స్థానే లెఫ్టినెంట్ గవర్నర్ని నియమించారు. పూర్వపు జాతీయ రాజధాని ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు.
ఢిల్లీ – న్యూ ఢిల్లీ ప్రాంతీయ వైశాల్యం 17,841 చదరపు మైళ్ళు, అందులో 21,753,486 జనాభా వున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఒక దేశానికి రాజధాని నగరం ఎంత అందంగా, శుభ్రంగా వుండాలి అనేది న్యూడిల్లీ నగరం చెబుతుంటే, అదే రాజధాని చెత్తా, చెదారంతో ఎంత అశుభ్రంగా వుంటుందో పాత ఢిల్లీ చెబుతుంది.

satya3
కొత్త ఢిల్లీ నగరం నన్ను ఆకట్టుకుందనే చెప్పాలి. పెద్ద పెద్ద రోడ్లు, శుభ్రంగా వున్నాయి. కార్లు, స్కూటర్లలో వెళ్ళేవాళ్ళు మన హైద్రాబాదులోలా కాకుండా, రూల్స్ పాటించి ఒక పద్ధతిగా, రోడ్డు మీద వెడుతుంటే ముచ్చటగా వుంది. పెట్రోలు వాడకం తగ్గించి, నాట్యురల్ గాస్ వాడుతున్న విధానం కూడా నాకు నచ్చింది. బస్సులూ, ఆటోలు, టాక్సీలు, నాట్యురల్ గాస్ మీద నడుస్తుంటే, వాటికి ఆకుపచ్చరంగు వేశారు. చాల రోడ్లకి ఇరుపక్కలా, పచ్చటి చెట్లూ, పూల మొక్కలూ, అందాన్నే కాక చల్లటి నీడనూ ఇస్తున్నాయి.
ఇక ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు, మన ఉత్సాహాన్ని బట్టీ, అభిరుచిని బట్టీ ఎన్నో వున్నాయి. చరిత్ర మీద సరదా వున్నవారికి, ఇక్కడ చూడటానికి ఎన్నో వున్నాయి.

satyam1మొగలాయీల కాలం నాటి, కుతుబ్ మీనార్, జమా మసీదు, ఎర్రకోట, హుమాయూన్ సమాధి.. ఇలా ఎన్నో వున్నాయి. కుతుబ్ మీనార్ ప్రపంచం మొత్తం మీద, ఇటుకలతో కట్టిన ఎత్తయిన బురుజు అని చెప్పారు. దీన్ని1206వ సంవత్సరంలో కట్టారుట. దీనిమీద ఖురాన్ లోని కొన్ని నీతి వాక్యాలు చెక్కారు. అక్కడే ఒక ఇనుప స్థంభం, ఏనాటిదో ఇంకా తుప్పు పట్టకుండా వుంది.

తర్వాత ఎర్ర కోట చూశాం. దాన్ని 1638లో ఆనాటి మొగల్ చక్రవర్తి షాజహాన్ కట్టించాడు. దీన్ని రెండు వందల సంవత్సరాలు, నలుగురు చక్రవర్తులు తమ నివాస స్థలంగా వాడుకున్నారు. గోడలు రెండు మైళ్ళ పొడుగున వున్నాయి. ఆగ్రాలోని తాజ్ మహల్ నిర్మాణ విశేషాలు చూసి, ఇది కట్టారు అంటారు. ఇక్కడ రాత్రి పూట లైట్ అండ్ సౌండ్ షో వుంటుంది అన్నారు కానీ, మేము అక్కడికి పగలు వెళ్ళటం వల్ల అది చూడలేదు. 
జమా మసీదు దగ్గరలోనే వుంది. దాన్ని 1650లో కట్టారు. ఇది భారతదేశంలోకల్లా పెద్ద మసీదు. దీనిని కట్టటానికి 13 సంవత్సరాలు పట్టిందిట. 25,000 మంది భక్తులు పట్టేంత స్థలం వుంది అక్కడ. ఇది కూడా షాజహాన్ కట్టించినదే.

హుమాయూన్ సమాధి 1570లో కట్టారు. రెండవ మొగల్ చక్రవర్తి హుమాయూన్ అక్కడే సమాధి చేయ బడ్డాడు.
బహాయ్ మతం వారు కట్టిన ‘లోటస్ టెంపుల్’ ఇంకొక చెప్పుకోదగ్గ కట్టడం.

ఇక జంతర్ మంతర్ కూడా ఢిల్లీలోనే వుంది, కానీ మేము జైపూరులో అది చూసినందువల్ల అక్కడికి వెళ్ళలేదు.
పార్లమెంట్, రాష్ట్రపతి భవన్ మొదలైనవి బయట నించే చూశాం. విశాలమైన రోడ్లు, రకరకాల చెట్లతో ఎంతో అందంగా వుండే ప్రదేశం.
చెప్పుకోదగ్గ ఇంకొకటి, ఇండియా గేట్. మేము సాయంత్రం వెళ్ళటం వల్ల, పగటి పూట ఎలా వుంటుందో చూశాం, రాత్రి పూట లైట్లలో ఎలా వుంటుందో చూశాం. 1921లో కట్టిన, 138 అడుగుల ఎత్తైన గొప్ప కట్టడం ఇది.

satya2
ఇక మేము, ముఖ్యంగా నేను, ఢిల్లీ వెళ్ళిన కారణం చెబుతాను. నాకు మొదటినించీ మహాత్మా గాంధీ అంటే ఎంతో గౌరవం, భక్తీ, ప్రేమ, ఒక విధమైన ఆరాధనా భావం వుంది. ఒక అతి సామాన్యుడైన మనిషి, ఒక దేశ చరిత్రనే మార్చగల శక్తిమంతుడవుతాడెలా అవుతాడో, చేసి చూపించిన మనిషి. ప్రపంచంలో మూడు వంతుల దేశాల్ని, తమ చేతుల్లో పెట్టుకుని ఆటలాడిస్తూ, దేశ సంపదని దోచుకుంటున్న బ్రిటిష్ ప్రభుత్వాన్ని, ఒక్క అంగవస్త్రం కట్టుకుని, కేవలం అహింసా మార్గంతో, వారిని గడగడలాడించిన ధీరుడు, మహాత్ముడు మన గాంధీ. మార్టిన్ లూధర్ కింగ్, మాండేలా, మదర్ థెరేసా లాటి వారందరూ మహాత్ముడికి ఏకలవ్య శిష్యులే! అలాటి నా అభిమాన మహాత్ముడి సమాధి దగ్గర నివాళి అర్పించటం, ఆయన తన జీవితంలో చివరి మూడు నెలలు పైగా గడిపిన బిర్లా భవన్ చూడటం, నా తీరని కోరికలు. అందుకే ఒక రోజంతా, ఆ రెండూ చూడటానికే కేటాయించాం.
ఆరోజు ప్రొద్దున్నే బిర్లా భవన్ చూడటానికి వెళ్ళాం. దాదాపు సాయంత్రం దాకా అక్కడే వుండి, తర్వాత గాంధీ సమాధి చూడటానికి వెళ్ళాం.

ఆనాటి బిర్లా భవన్, పేరే ఈనాటి ‘గాంధీ స్మృతి’.

మహాత్మా గాంధీ, తన చివరి నూట నలభై రోజులు, ఇక్కడే ప్రశాంతంగా గడిపారు.

satya4
ఆయన నివసించిన గది, పరుపు, రుద్రాక్షమాల, వ్రాసుకునే బల్లా, చరఖా, ఒక చిన్న చెంబు, చేతి కర్ర, మూడుకోతుల బొమ్మ – ఇవే ఆయన చిరాస్థులు… కోట్లమంది ప్రజల హృదయాలే ఆయనకి స్థిరాస్తులు మరి!

ఆయన జీవిత విశేషాలూ, ఆయన ఆచరించి, చెప్పిన ఎన్నో సూక్తులు, ఆయన గురించి ప్త్రపంచ ప్రసిద్ధులైన కొందరు చెప్పిన మాటలు… కొన్ని వందల ఫొటోలు, చిత్రాలూ వున్నాయి. ఒక్కటీ వదిలిపెట్టకుండా అన్నీ దీక్షగా చూడటమే కాక, నేనూ వాటికి ఫొటోలు తీసి, భద్రంగా దాచుకున్నాను. కొన్ని విడియోలు, వార్తా చిత్ర సినిమాలు చూపిస్తున్నారు.
ఆయన చివరిరోజు, ప్రార్ధన చేయటం కోసం వెడుతున్నప్పుడు, వెళ్ళిన దారిలో ఆయన పాదాలను ముద్రించారు.

satya

చివరికి ఆయన చనిపోయిన చోటు చూస్తుంటే, నిజంగా నాకు కన్నీరు ఆగలేదు.
ఎంతటి మహాత్ముడి జీవితం ఎలా అంతమయింది అని బాధ వేసింది.

ఢిల్లీ దరిదాపుల్లోని చిన్న చిన్న పిల్లల్ని, వాళ్ళ స్కూలు అధికారులు తీసుకు వచ్చి, మహాత్ముడి జీవిత విశేషాలని వివరించి చెబుతుంటే, నాకు ఎంతో ముచ్చట వేసింది. ఈ తరం పిల్లలకు మన స్వాతంత్ర పోరాటం గురించీ, ఆ పోరాటంలో అసువులు బాసిన మహోన్నత వ్యక్తుల గురించీ చెప్పటం ఎంతో అవసరం.

చివరగా యమునా నదీ తీరాన వున్న రాజ్ ఘాట్ చూశాం. అక్కడే నెహ్రూ, ఇందిర మొదలైన పలువురు రాజకీయ నాయకుల సమాధులు వున్నాయి. నాకు అవేవీ చూడబుధ్ధవలేదు. సరాసరి గాంధీ సమాధి దగ్గరకు వెళ్ళాం.

stya1ఆ సమాధి దగ్గర, కళ్ళు మూసుకుని మౌనంగా నుంచుని వుంటే.. అదొక అనిర్వచనీయమైన అనుభూతి. అలా దాదాపు ఒక పావుగంట పైనే, కదలకుండా నుంచున్నాను. మనసులో ఎన్నో ఆలోచనలు. స్వాతంత్ర సమరం, మహాత్ముడి జీవితం, నేను ఆయన గురించి చదివిన పుస్తకాలు, ముఖ్యంగా ఆయన వ్రాసిన పుస్తకం, “My Experiments with Truth”, అట్టిన్బరో తీసిన ‘గాంధీ’ సినిమా అన్నీ కళ్ళ ముందు కదలాడాయి. అలా ఎంత సేపు నుంచున్నానో నాకే తెలియలేదు. తర్వాత శ్రీమతి అంది, ‘ఏమిటి.. అంతసేపు కదలకుండా నుంచున్నావ్. నిన్ను డిస్టర్బ్ చేయటం ఎందుకులే అని వూరుకున్నాను” అని.

 

అంతటి మహాత్ముడికి మనం ఇచ్చే నివాళి ఒక్కటే! ఆయన చెప్పిన, చేసిన గొప్ప పనులు మనమూ పూర్తిగా అర్ధం చేసుకోవటానికి, కనీస ప్రయత్నం చేయటం! అర్ధమయినవి మనసా, వాచా ఆచరించటం!

-సత్యం మందపాటి

satyam mandapati

మీ మాటలు

*