ఘర్ వాపసీ ప్రేలాపనలు: రచయితల్లో ఎందుకింత మౌనం?!

గతం సంధించిన ప్రశ్నలనే వర్తమానం మళ్లీ సంధించి ఏదో కొత్త జ్ఞానం కనుగొన్నట్టు నటిస్తుంటే ఎలా ఉంటుంది? ఎప్పుడో దహనం చేయవలసిన, కుళ్లిపోయిన శవానికి చందనకర్పూర వాదనలు అద్దుతుంటే ఎలా ఉంటుంది? పారేయవలసిన పాచి అన్నానికి మళ్లీ ఒకసారి మసాలా దట్టించి తిరగమోత పెట్టి వడ్డించజూస్తుంటే ఎలా ఉంటుంది? ఇంతకన్న అర్థరహితమైన, ప్రమాదకరమైన, హాస్యాస్పదమైన కార్యక్రమాన్ని రాజకీయ సామాజిక నిర్వాహకులు నిస్సిగ్గుగా సాగిస్తుంటే సమాజమంతా మౌనంగా నిర్లిప్తంగా చూస్తున్నది. కాలం మారుతున్నదా లేదా, మనం మారుతున్నామా లేదా అని సందేహం కలుగుతున్నది. సంఘపరివార్ నాయకులు దేశవ్యాప్తంగా ప్రారంభించిన ఘర్ వాపసీ కార్యక్రమం చూసి, దాని పట్ల సమాజం స్పందించవలసినంతగా స్పందించకపోవడం చూసి నిస్సహాయ ఆగ్రహం నన్ను రెండు మూడు నెలలుగా కలవరపెడుతున్నది.

ఘర్ వాపసీ గురించి వినగానే నాకు ‘ప్రజలమనిషి’లో వట్టికోట ఆళ్వారుస్వామి మతాంతరీకరణ గురించి సృష్టించిన అద్భుతమైన సన్నివేశాలు గుర్తొచ్చాయి. ‘దేశభక్తి’ తొలిపాఠంలో ‘నిన్న వచ్చారింగిలీషులు/ మొన్న వచ్చిరి ముసలమనులటు/ మొన్న వచ్చిన వాడ వీవని/ మరచి వేరులు పెట్టకోయ్’ అని రాసిన, ఆ తర్వాత ‘పెద్ద మసీదు’ కథ రాసిన గురజాడ అప్పారావు గుర్తొచ్చారు. ‘మనకా మతాభిమానం’ అంటూ ‘హిందూ’ మతస్థులమనుకునేవాళ్ల కుహనా ఆభిజాత్యాన్ని తుత్తునియలు చేసిన శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గుర్తుకు వచ్చారు. గత శతాబ్ది తొలి పాదంలో, మధ్య భాగంలో కనబడిన ఆ స్పందన, చైతన్యం, ప్రశ్నించే స్ఫూర్తి ఇప్పుడు కరవైపోతున్నదా అని తీవ్ర విచారం కలిగింది. మతోన్మాదుల ఘర్ వాపసీ ప్రేలాపనలకు గతానికీ వర్తమానానికీ ఎడతెగకుండా జరుగుతున్న సంభాషణ నుంచి ఎన్ని జవాబులు చెప్పవచ్చు గదా అనిపించింది.

ఘర్ వాపసీ నినాదం నిజానికి మతవిద్వేషానికి ముసుగు. ‘ఇంటికి తిరిగిరండి’ అని పిలుస్తున్నవారు చూపుతున్నది ఇల్లూ కాదు, తిరిగివస్తే ఏ ఇంట్లో ఉంచుతారో, అసలు ప్రాణాలతో ఉంచుతారో లేదో తెలియదు. ఇంతకూ అది పిలుపు కూడ కాదు. అది ఒక బెదిరింపు. నేరారోపణ. వేధింపు. భీతావహ వాతావరణం సృష్టించడానికి హంతకశక్తులను ప్రేరేపించే ఉచ్ఛాటన. అది సరిగ్గా అడాల్ఫ్ హిట్లర్ ఇతర మతస్తుల పట్ల, ముఖ్యంగా యూదుల పట్ల ప్రదర్శించిన వ్యతిరేకత లాంటిది. కాకపోతే ఈసారి అది తోసేసే, చిత్రహింసలు పెట్టే. చంపేసే రూపాన్ని కాసేపటికోసం దాచుకుని పిలిచే ముఖాన్ని ప్రదర్శిస్తున్నది. ‘ఈ పిలుపుకు రాకపోయావో, చూసుకో ఏం చేస్తానో’ అనే బెదిరింపు అది. పిడికెడు మందిని ఆకర్షించగలిగినా లేకపోయినా, కోట్లాది మందిని బెదురుకు, అభద్రతకు గురిచేసి, తమ నేల మీద తాము బెరుకుబెరుకుగా జీవించేలా చేసే యుద్ధారావం అది. అనేక సంస్కృతుల, భాషల, మతాల, కులాల బహుళత్వపు భారతీయతను ఏకత్వంలోకి, అది కూడ సంఘపరివార్ నిర్వచించే బ్రాహ్మణీయ సంకుచిత హిందుత్వలోకి కుదించదలచిన మతరాజకీయాల ఎత్తుగడ అది. ఘర్ వాపసీ అనే మాటకు ఇంటికి తిరిగిరావడం అనే తటస్థమైన అర్థమే కనబడుతుంది. అది ఆత్మీయ పునరాగమనం లాగే, పునర్మిలనం లాగే అనిపిస్తుంది. కాని అసలు లక్ష్యం ఇతర మతాల పట్ల ద్వేషం. ఇతర మతస్తుల పట్ల ద్వేషం. మతాల మధ్య, మనుషుల మధ్య భేదాన్ని, అసహనాన్ని, అనుమానాన్ని, విద్వేషాన్ని, రక్తపిపాసను, హంతక దాడులను ప్రోత్సహించి, మతం పెట్టుబడిపై రాజకీయ లాభాలను సంపాదించదలచిన క్షుద్రక్రీడ అది.

‘భారతదేశంలో ఉండాలంటే హిందువులు కావలసిందే’ అనే సంఘ పరివార్ శక్తుల బెదిరింపులకు కొనసాగింపే ఘర్ వాపసీ. ప్రస్తుతం ఇతర మతాలను అవలంబిస్తున్న భారతీయుల పూర్వీకులందరూ హిందువులేననీ, వారు పాలకుల బలప్రయోగం వల్లనో, మతబోధకుల ప్రలోభాల వల్లనో మతాంతరీకరణ చెందారనీ, అందువల్ల ప్రస్తుత హైందవేతరులందరూ తిరిగి ఇంటికి రావాలనీ ఒక అచారిత్రక కుతర్కాన్ని సంఘపరివార్ శక్తులు తయారు చేశాయి. ఈ తర్కానికి పరాకాష్టగా ఒక కేంద్ర మంత్రి ఢిల్లీ ఎన్నికల ప్రచార సభలో ప్రజలను రామ్ జాదే (రాముడి సంతానం) అవుతారా, హరామ్ జాదే (అక్రమ సంతానం) అవుతారా తేల్చుకొమ్మని సవాల్ విసిరింది. ముస్లిం యువకులు హిందూ యువతులను ఆకర్షించి పెళ్లి చేసుకుని, హిందూ మతస్తుల సంఖ్య తగ్గించడానికీ, ముస్లింల సంఖ్య పెంచడానికీ కుట్ర పన్నుతున్నారనీ, ఈ లవ్ జిహాద్ ను అడ్డుకోవాలనీ సంఘ పరివార్ పిలుపునిస్తోంది. దీనికి ప్రతిగా ‘బహు లావో – బేటీ బచావో’ అని నినాదం ఇస్తోంది.

rss-muslims-conversions-pti

ఈ ప్రమాదకర మత రాజకీయాల నేపథ్యంలోనే ఘర్ వాపసీ నినాద స్థాయి నుంచి ఆచరణ స్థాయికి మారింది. సంఘపరివార్ లో బలప్రయోగశక్తిగా పేరుపొందిన బజరంగ్ దళ్ తో పాటు, కొత్తగా ఇందుకోసమే పుట్టిన ధర్మ్ జాగరణ్ సమితి ఆగ్రాలో దాదాపు 350 మంది వీథి బాలలను, ఫుట్ పాత్ నివాసులను, అనాథలను పోగుచేసి, వారిని “శుద్ధి” చేసి, హిందూ మతంలోకి తిరిగి చేర్చుకున్నాయి. ఈ ఘర్ వాపసీలను విస్తృతంగా సాగించి 2021 కల్లా క్రైస్తవులు, ముస్లింలు లేని, హిందువులు మాత్రమే ఉండే భారతదేశాన్ని తయారుచేస్తామని ధర్మ్ జాగరణ్ సమితి నాయకుడు రాజేశ్వర్ సింగ్ అన్నాడు. ఇటువంటి ప్రకటనలనే దేశవ్యాప్తంగా సంఘ పరివార్ నాయకులు పునరుక్తం చేస్తున్నారు.

ఈ వ్యాఖ్యలు, బెదిరింపులు మరింత ప్రమాదకర పరిణామాలకు దారితీస్తాయని ఎందరో హెచ్చరించిన తర్వాత స్వయంగా ప్రభుత్వాధినేతలు కాస్త స్వరం తగ్గించి, మార్చి ఈ పామును ఇప్పటికి బుట్టలో పెట్టారు గాని, మళ్లీ ఎప్పుడు ఆ బుట్ట మూత తీసి ప్రజలను పాముకాటుకు ఎరచేస్తారో తెలియదు.

ఈ ప్రకటనలకు, వ్యాఖ్యలకు, బెదిరింపులకు ఉపయోగిస్తున్న తర్కం అప్రజాస్వామికమైనది, రాజ్యాంగ వ్యతిరేకమైనది. భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన మతస్వేచ్ఛ మీద, ఆదేశిక సూత్రాలలో ప్రకటించుకున్న శాస్త్రీయ దృక్పథ ప్రాధాన్యత మీద దాడి ఇది. ఈ తర్కం అచారిత్రకమైనదీ, అసంబద్ధమైనదీ, అర్థరహితమైనదీ కూడ. ఎందుకంటే, హిందూ మతం అనే మతం ఒకటి ఉందా అనే ప్రశ్నను అలా ఉంచినప్పటికీ, హిందూ మతానికి ప్రాతిపదిక వర్ణాశ్రమ ధర్మం. కుల అంతరాలు. మరి ఇతర మతస్తులు గతంలో హిందూ మతంలో ఉన్నవాళ్లే అని వాదనకోసం ఒప్పుకున్నా, వారు తిరిగివస్తే ఏ కులంలో చేర్చుకుంటారనే ప్రశ్నకు సంఘపరివార్ దగ్గర జవాబు లేదు. పూర్వీకుల కులంలోకే వెళతారని కొందరు, కోరుకున్న కులంలోకి వెళ్లవచ్చునని కొందరు అంటున్నారు. పూర్వీకుల కులంలోకే వెళ్లవలసి ఉంటే ఘర్ వాపసీ కి అర్థం లేదు. కోరుకున్న కులంలోకి వెళ్లే అవకాశం ఉంటే హిందూ మతమే మిగలదు. అసలు ‘హిందూ మతం’ అనేదేదైనా ఉంటే, ఒకప్పుడు మతాంతరీకరణకు గురయ్యారనుకునేవాళ్లందరూ ఎప్పుడైనా ఆ మతం పరిధిలోనే ఉన్నారా, ఆ మతం వారిని తనలోపలికి తీసుకుందా అనేవి అనుమానాస్పదమైన, ఆధారాలు లేని అంశాలని చరిత్ర చెపుతున్నది.

అలాగే గతంలో పాలకులు బలప్రయోగంతో, మతబోధకులు ప్రలోభాలతో మతాంతరీకరణ జరిపారనే వాదన కూడ పూర్తి సత్యం కాదు. సాధారణంగా హిందుత్వవాదులు బలప్రయోగం అన్నప్పుడు ముస్లిం పాలకుల కాలాన్ని, ప్రలోభాలు అన్నప్పుడు క్రైస్తవ మతబోధకుల కాలాన్ని సూచిస్తారు. కాని నిజంగా ముస్లిం పాలకులు బలప్రయోగం ద్వారా, బ్రిటిష్ పాలకులు ప్రలోభాల ద్వారా మతాంతరీకరణ జరపదలచుకుని ఉంటే భారత సమాజంలో ముస్లింల, క్రైస్తవుల నిష్పత్తి ఇంత తక్కువగా ఉండేది కాదు. అసలు మతాంతరీకరణకు ఇలా ఆకర్షించడమే (పుల్ ఫాక్టర్) ఏకైక కారణం అనడం సరికాదు. భారత సమాజంలో మతాంతరీకరణకు అనేక సంక్లిష్ట కారణాలు ఉండే అవకాశం ఉంది. కాని ప్రధాన కారణం మాత్రం హిందూ వర్ణాశ్రమధర్మ, కుల అసమానతల సమాజం బైటికి తోయడం, వికర్షించడం (పుష్ ఫాక్టర్) కావచ్చు. ఈ సమాజంలో వివక్షకు, అసమానతకు, పీడనకు, అంటరానితనానికి గురైన వర్గాలలో అత్యధికులు అవకాశం వచ్చినప్పుడు మరొక మతం వైపు చూశారు. అందులోనూ అసమానత సహజమైనదని, భగవంతుడే సృష్టించాడని “హిందూ” మతం అంతరాలకు దైవిక సమర్థన ఇస్తుండగా, ఆ అంతరాల పీడనకు గురవుతున్నవారిని చేరవచ్చిన మతాలు కనీసం సైద్ధాంతికంగానైనా ప్రేమను, కరుణను, సౌభ్రాతృత్వాన్ని ప్రబోధించాయి.

సరే, ఈ చర్చంతా ఎలా ఉన్నా ఇంత ప్రధానమైన అంశం మీద బుద్ధిజీవులు స్పందించవలసి ఉంది. కాని తెలుగు బుద్ధిజీవులలో అతి తక్కువ మంది మాత్రమే ఘర్ వాపసీ గురించి ఆలోచించడం, స్పందించడం, మరింత తక్కువ మంది ఆ స్పందనను రచనల్లో చూపడం చూస్తే విచారం కలుగుతున్నది. కనీసం వంద సంవత్సరాల కింద గురజాడ అప్పారావు, డెబ్బై సంవత్సరాల కింద శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, అరవై సంవత్సరాల కింద వట్టికోట ఆళ్వారుస్వామి ఈ విషయంలో చూపినంత స్పందననైనా మనం ఇవాళ చూపలేకపోవడం ఎందుకో ఆలోచించాలనిపిస్తున్నది.

ఈ దేశం మాదే అని ప్రకటించే అధికారం “హిందువుల”మని చెప్పుకునేవారికి లేదని గురజాడ, శ్రీపాద ఇద్దరూ చాల స్పష్టంగా చెప్పారు. ఇంగ్లిష్ వారు నిన్న వచ్చారని, ముస్లిములు మొన్న వచ్చారని అనుకుంటే అటు మొన్న నువ్వు వచ్చావని మరచిపోయి, విభేదాలు పెట్టగూడదని గురజాడ ప్రబోధించారు. ఆ మాటలో కూడ ఇప్పుడు నిశితంగా పరిశీలిస్తే, బ్రిటిష్ వారిని భాషతోనూ, ముస్లింలను మతంతోనూ గుర్తించడం వంటి బ్రిటిష్ చరిత్రకారులు మనకు అంటించిన లోపం ఉన్నప్పటికీ, ఈ మతవైవిధ్యం విభేదాలకు, విద్వేషాలకు కారణం కాగూడదని సూచించడం ఇవాళ్టికీ అవసరమైన ప్రజాస్వామిక అవగాహన.

అలాగే ‘పెద్దమసీదు’ కథలో “కాకుళేశ్వరుడి గుడి పగలగొట్టి మ్లేచ్ఛుడు మసీదు కట్టాడు” అని ఒక పాత్రతో అనిపిస్తూనే “దేవుడెందుకూరకున్నాడు స్వామీ” అని ప్రశ్నవేయించి, “ఆ మాటే యే శాస్త్రంలోనూ కనబడదురా…” అని వ్యంగ్యంగా మనిషి చేసిన దేవుడి నిస్సహాయతను చూపించారు. అట్లాగే ‘మీ పేరేమిటి?’ కథలో హిందూ మతంలో భాగమనుకునే శైవ వైష్ణవ శాఖల మధ్య ఘర్షణలను చిత్రించారు. ‘మతములన్నియు మాసిపోవును, జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’ అని ఒక అమాయకమైన, కాని అవసరమైన ఆశను ప్రకటించారు.

ఆ తర్వాత రెండు మూడు దశాబ్దాలకు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మత మౌఢ్యాన్ని విమర్శిస్తూ, వెటకరిస్తూ రాసిన అనేక రచనల్లో ‘మనకా మతాభిమానం’ అనే అద్భుతమైన వ్యాసం ఇక్కడ గుర్తు తెచ్చుకోదగినది.

“…మన మతం యేది?

దీనికి సమాధానం రావాలంటే, ముందు, మనం యెవరమో తేల్చుకోవాలి.

మనం అంటే హిందువులం అనుకుందామా, మన సనాతనత్వం పోతుంది.

ఏమంటే?

ఈ పేరు మనకి దరిమిలా వచ్చింది.

పైగా, యిది జాతివాచకం గాని మతవాచకం కాదు.

నిజం గుర్తిస్తే, అసలు, మనం హిందువులమే కాము.

హిందూ శబ్దం మనం సృష్టించుకున్నది కాదు.

ఆ శబ్దానికి సాఫీ అయిన అర్థమూ లేదు…”

అంటూ ప్రారంభించి పాండిత్యమూ తర్కమూ వ్యంగ్యమూ కలగలిసిన, ఆయనకు సహజమైన వాదనాశక్తితో అపురూపమైన చర్చ చేసి చివరికి,

”ఈ మతాల ఉల్బణం పాతవాటితో నిలిచిపోయినా వొక దారే; కాని, యిప్పటికీ కొత్త మతాలు పుడుతూనే వున్నాయి.

బ్రహ్మ సమాజం,

ఆర్యసమాజం,

రాధాస్వామి మతం,

హరనాథ మతం,

సాయిబాబా మతం,

దివ్యజ్ఞాన మతం,

పులిమీద పుట్ర అన్నట్టు, అన్నిటికీ పైన రాజకీయమతాలు.

ఇలాగ ఆర్యుల దగ్గరినుంచీ – అంటే, ఆర్యులలోనూ ఉత్తమోత్తములైన బ్రాహ్మల దగ్గిరనుంచీ – ఆ బ్రాహ్మలలోనూ, భిన్నమతాల – భిన్న శాఖల – భిన్ననాడుల దగ్గిరనుంచీ, వేద బాహ్యుల దాకా, వేదబాహ్యులలోనూ, అస్పృశ్యులదాకా, అస్పృశ్యులలోనూ మళ్లీ అస్పృశ్యులదాకా వున్న నానావర్ణ, నానాకుల, నానావర్గ, నానాదృక్పథాల వారూ, నానా ప్రాప్యాలవారూ హిందువులు.

ఆ హిందువులం మనం.

ఈ ‘మన’కా మతాభిమానం?

థిక్!” అని ఛీత్కరించారు.

అలా గురజాడ, శ్రీపాదలలో మతం గురించి కొంత హేతువాద దృష్టితో, కొంత ప్రజాస్వామిక దృష్టితో, కొంత పాశ్చాత్య ప్రభావపు ఉదారవాద దృష్టితో కనబడిన వైఖరిని, వట్టికోట ఆళ్వారుస్వామి తన అపారమైన ప్రజాజీవితానుభవం నుంచి, మార్క్సిస్టు అవగాహన నుంచి మరింత విస్తరించారు.

హైదరాబాదు రాజ్యంలో 1938కి ముందు పరిస్థితులు ఇతివృత్తంగా రాసిన ‘ప్రజలమనిషి’ నవల సహజంగానే మతం గురించి రాయడానికి ఆయనకు అవకాశం ఇచ్చింది. నవలా కాలపు హైదరాబాద్ రాజ్యం మతరాజ్యం కాదు గాని, పాలకుల వ్యక్తిగత మతం ఇస్లాం. పాలితులలో అత్యధికులు హిందువులు అనడం కూడ నిశితంగా చూస్తే సరికాదు గాని, అటూ ఇటూ కూడ మతం పునాది మీద ప్రజాసమీకరణలు మొదలయినది ఆ కాలంలోనే. ప్రత్యక్షంగా రాజకీయ సంస్థలు ఏర్పడడానికి అవకాశం లేని స్థితిలో హిందువుల లోనూ, ముస్లింల లోనూ ఆర్యసమాజ్, హిందూ మహాసభ, ఆర్యరక్షణ సమితి, శుద్ధి ప్రచార్, హిందూ సబ్జెక్ట్స్ కమిటీ, సేవాదళ్, మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్, అంజుమన్-ఇ-తబ్లీగ్-ఇ-ఇస్లాం, అంజుమన్-ఇ-ఖాక్సరన్ వంటి మతసంస్థలెన్నో పుట్టుకువచ్చాయి. వీటిలో మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్, అంజుమన్-ఇ-తబ్లీగ్ హిందువులను మతాంతరీకరించడానికి, అనల్ మాలిక్ (ముస్లిం అయిన ప్రతి ఒక్కరూ రాజే) అనే కుహనా ఆభిజాత్యం ప్రచారం చేయడానికి ప్రయత్నించగా, అలా మారిన వారిని “శుద్ధి” చేసి తిరిగి హిందువులుగా మార్చడానికి ఆర్యసమాజ్, ఆర్య రక్షణ సమితి, శుద్ధి ప్రచార్ వంటి సంస్థలు ప్రయత్నించాయి. ఈ ప్రయత్నాలు భౌతిక ఘర్షణలుగా పరిణమించిన తర్వాత నిజాం ప్రభుత్వం 1938 సెప్టెంబర్ లో నాలుగు హిందూ సంస్థలను, మూడు ముస్లిం సంస్థలను నిషేధించింది.

ఆ చరిత్ర వివరాలు ఇక్కడ అవసరం లేదు గాని, తబ్లీగ్ (మత పరివర్తన), శుద్ధి అనే పేర్లతో అప్పుడు సాగిన వ్యవహారమే ఇప్పుడు మతాంతరీకరణ, ఘర్ వాపసీ పేర్లతో పునరావృతమవుతున్నది. ఈ తబ్లీగ్, శుద్ధి కార్యక్రమాల మత రాజకీయాలను ఆళ్వారుస్వామి ‘ప్రజలమనిషి’ లో రెండు అధ్యాయాలలో వివరంగా చిత్రించారు.

అప్పటిదాకా దొర రామభూపాల్ రావు అనుయాయిగా ఉండిన హైదరలీ “…దిమ్మెగూడెంలో హరిజనులను మహమ్మదీయులుగా చేసే సన్నాహాలు” ప్రారంభిస్తాడు. “హైదరలీ ప్రతిరోజు చావడి ముందర కూర్చొని హరిజనులతో సానుభూతిగా మాట్లాడేవాడు. వాండ్ల కష్టాలు పోయే రోజులు వచ్చాయని, ఇన్నాళ్లకు భగవంతుడు హరిజనులకు మేలు చేయబోతున్నాడని, హరిజనుల కష్టాలకు ఆలా హజ్రత్ హృదయం నీరైపోతున్నదని హరిజనులతో అంటుండేవాడు. భూములు, చదివించిన తర్వాత ఉద్యోగాలు ప్రభుత్వం ఇస్తుందని, మొత్తంపై హరిజనుల గూడెంలో సుముఖ వాతావరణం కల్పించాడు.”

ఇంతకాలమూ తమను దూరం చేసి ఉంచిన మొత్తం గ్రామంపై ఇది ఒక ప్రతీకారంగా దళితులు భావించారు. చివరికి అంజుమన్ నాయకుడు వచ్చి మతపరివర్తన జరిపే రోజున “వచ్చినప్పుడల్లా హరిజనులతో వెట్టి పనులు చేయించుకునే పోలీసు వాండ్లు ఆ రోజు చాకలి, మంగలి, కుమ్మరి వాండ్లతో చేయించుకున్నారు. హరిజనుల స్థాయి పెరిగినట్టు తోచి పోలీసువాండ్లకు ఈర్ష్య కలిగింది.” అంజుమన్ నాయకుడు తన ఉపన్యాసంలో “ఈ గ్రామంలో అందరివలె పుట్టిపెరిగినా మీరు ఊరికి దూరంగా మురికికొంపల్లో ఉంటున్నారు. మీరు పందుల్లాగ బ్రతుకుతున్నారు. వేరేవాండ్లవద్ద మీకు కుక్కలకున్న గౌరవం లేదు. మీతో పొద్దస్తమానం పని చేయించుకొని కడుపుకు నిండని కూలి, జీతాలు ఇస్తున్నారు…” అని వాస్తవ స్థితి చెపుతాడు. ప్రచారకుడు “మీరు మహమ్మదీయుల్లో కలిస్తే మీ కష్టాలు పోతాయి. మీరంతా మహమ్మదీయులతో సరిసమానముగా విద్య, ఉద్యోగాలు పొందవచ్చును. హిందువుల దేవాలయాల్లోనికి వెళ్లలేనివారు, ఊరి చేదబావులవద్దకి పోజాలనివారు స్వేచ్ఛగా మస్జిద్ లోకి వెళ్లవచ్చును. చేదబావుల్లోకి వెళ్లవచ్చును…” అంటాడు.

ఒక మతంలోని అసమానత, వివక్ష, అన్యాయం ఎట్లా మరొక మతంవైపు చూడడానికి పునాది కల్పిస్తున్నాయో వాస్తవికమైన చిత్రణ ఇది. ఆళ్వారుస్వామి అక్కడితో కూడ ఆగిపోలేదు. ఆ వికర్షణ కావలసిన ఫలితం సాధించబోదనే విమర్శ కూడ అందులోనే భాగం చేశారు. ఆ ఉపన్యాసాలు సాగుతుండగానే “యిగ హైదరలీ ఎంత జీతం యిస్తడో చూస్తం గద” అనీ, “దొర గుంజుకున్న భూములు, తీసుకున్న లంచాలు ఇప్పిస్తరా” అనీ మౌలిక సమస్యల వైపు కూడ దృష్టి మళ్లించారు.

“మహమ్మదీయులుగా మారిన హరిజనులు జీతగాండ్లుగా పనిచేయడానికి వెనుక ముందాడారు. అయితే ఏమీ పని చేయకుండా ఎన్నాళ్లు ఏ విధంగా బ్రతకడం? వెంటనే చదువులు, ఉద్యోగాలు, భూములు పొందడం సంభవమా? భూములు ఏవిధంగా లభిస్తాయి? ఎవరివల్ల, ఎవరివి, ఎప్పుడు, ఏ విధంగా భూములు హరించబడ్డాయి?…” అని మతాన్ని, మత పరివర్తనను మించిన ప్రాథమిక మానవావసరాల గురించి, రాజకీయార్థిక కారణాల గురించి మాట్లాడించారు.

ఈ మతాంతరీకరణ వెనుక రాజ్యం ఉన్నదనే అవగాహనతో కంఠీరవం దాన్ని వ్యతిరేకించినప్పుడు, “చెప్పుదెబ్బలు తింటూ, గులాములై పడివున్న మాదిగోండ్లు ఆత్మగౌరవం, సంఘమర్యాద పొంది ఉండటం ఈ బాపనోడికి సహింపరాకుండా ఉంది” అని అంజుమన్ నాయకుడితో అనిపించి, బహుశా ఆరు దశాబ్దాల తర్వాతి అస్తిత్వవాదం చేపట్టబోయే అతివాద వ్యాఖ్యలను కూడ ఆళ్వారుస్వామి ఊహించారు. “…ఇతరులు హరిజనులను అణగదొక్కుటే మీ కార్యక్రమానికి మూలకారణమైతే, ఆ హరిజనులకు మీరు ఒరగపెట్టేది కూడా ఏమీ లేదు. వాండ్లగతి ఇట్లాచేస్తే అసలే మారదు” అని కంఠీరవంతో జవాబు కూడ చెప్పించారు.

హైదరలీ గురించి “హరిజనులను మహమ్మదీయులను చేసి ఉద్ధరించ బయలుదేరిన ఈ పెద్దమనిషి అన్యాయంగా తోటి మతం వాండ్లయిన దూదేకులవారి భూమిని హిందువైన ఒక దొర ఆసరాతో హరించాడని మీరు తెలిసికోవాలె” అని న్యాయస్థానంలో కంఠీరవం చేత మళ్లీ ఒకసారి మౌలికమైన భూమి సమస్య లేవనెత్తించారు. గ్రామంలో కొమరయ్య భూమి తగాదాతో దొరకు వ్యతిరేకంగా ఏర్పడిన వాతావరణం ఈ మత పరివర్తనతో మారిపోయి, మహమ్మదీయులైన వాండ్లను శత్రువులుగా చూసే స్థితికి ఎలా దారితీసిందో చిత్రించి ఈ వ్యవహారాలు అసలు సమస్యలను ఎలా పక్కదారి పట్టిస్తాయో చెప్పారు.

తబ్లీగ్ గురించి ఎంత తీవ్రంగా రాశారో, శుద్ధి గురించి కూడ అంత తీవ్రంగానే రాశారు. మరీ ముఖ్యంగా శుద్ధి కార్యక్రమాన్ని ఊళ్లోకి దొర తెచ్చాడు గనుక దాని వెనుక ఉన్న స్వార్థప్రయోజనాలను ఎత్తి చూపారు.

శుద్ధి కార్యక్రమాన్ని విమర్శిస్తూ “తురకలైతే ఒరిగింది లేదు. హరిజనులైతే అనుభవిస్తున్నది లేదు. అన్ని ఎప్పటోల్నే ఉన్నయి” అనీ, “ప్రధానిగారు తురక, హిందువు అని అంటున్నరు. మరి ఇప్పుడు కష్టాలు చెప్పుకున్నోళ్లంతా హిందువులేనయిరి. దొర హిందువేనాయె. మానుకుంటె ఎవడన్న కొట్టొచ్చిండా” అనీ పరంధామయ్యతో అనిపించారు.

“సర్కారు మన్సులు తురకలైనా మనోడైనా చేసే గోల, ఆరాటం, తిట్లు, కొట్లు, అది కావలె, ఇది కావలె అని అల్లుండ్లోలె అన్ని సాగించుకొని పొట్టపగుల మెక్కి, మిగిలింది మూటలు కట్టుకొని పోటం లేదే” అని చాకలి సర్వయ్య, “ఆ యిందువేందో, తుర్కేందో, హైదరలీ బీట్లకు పోయినా, దొరగారి ఏనెకు పోయినా, రైతుల గెట్ల పొంటి పోయినా జీవాలను అడుగు పెట్టనియ్యరు….” అని గొల్ల వీరయ్య తమ నిత్య జీవిత అనుభవం నుంచి అసలు విషయాలు చెపుతారు.

ప్రధానంగా ఆ రెండు అధ్యాయాలు, మొత్తంగా నవల మౌలికమైన దోపిడీ, పీడనలకు మతం లేదని, అందువల్ల తబ్లీగ్, శుద్ధి అసలు సమస్యల నుంచి పక్కదారి పట్టించే అర్థరహితమైన వివాదాలని పాఠకులకు అవగాహన కలిగిస్తాయి.

ఇవాళ మళ్లీ ఒకసారి ప్రపంచీకరణ, కార్పొరేట్ దౌర్జన్యం, పెరిగిపోతున్న సామాజిక అసమానతల నేపథ్యంలో పాలకవర్గాలకు అందివస్తున్న నినాదం ఘర్ వాపసీ. హిందుత్వవాదుల గతకాలపు శుద్ధి ఇవాళ ఘర్ వాపసీ ముసుగు తగిలించుకుని బుసలు కొడుతున్న ఈ సందర్భంలో, హిందుత్వ మతోన్మాద, మతవిద్వేష రాజకీయాల గురించీ, మొత్తంగా మతవాదం గురించీ బుద్ధిజీవులు ఇంకా ఎక్కువగా మాట్లాడవలసి ఉన్నది. ఈ అనవసర వివాదాలు అసలు సమస్యల మీద ప్రజల ఆరాట పోరాటాలను పక్కదారి పట్టించడానికేనని చెప్పవలసి ఉన్నది. కనీసం గురజాడ అప్పారావు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, వట్టికోట ఆళ్వారుస్వామి సాధించిన కృషిని విస్తరించి బలోపేతం చేయవలసి ఉన్నది.

గతకాలానికి చెందిన ఆ అవగాహనలో సగమో పావో అయినా ఈ అత్యాధునిక వర్తమానంలో ఉంటే ఎంత బాగుండును!

                                                                                                                                                     -ఎన్ వేణుగోపాల్

venu

మీ మాటలు

  1. D Subrahmanyam says:

    వేణు గారు, ఎప్పటి లగే బాగారాసారు. రచయితలు ఈ విషయం మీదే కాదు, ఈ విష్యం మిద స్పందించటం లేదు.

    సుబ్రహ్మణ్యం

  2. D Subrahmanyam says:

    తప్పు వచ్చింది. దయచేసి ” ఏ విషయం మిద”అని చదవండి

    • N Venugopal says:

      డి. సుబ్రహ్మణ్యం గారూ,

      ధన్యవాదాలు. స్పందించకపోతే రచయితలే కారనుకోండి. అసలు స్పందించకుండా ఎవరూ ఉండడం లేదు. వాళ్లు స్పందిస్తున్న అనేక విషయాల కన్న ఈ విషయం తీవ్రమైనదని, అందువల్ల ఈ విషయంలో ఇంకా ఎక్కువ స్పందన ఉండాలని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం.

  3. వేణు గారు
    మంచి వ్యాసం.
    కానీ తక్షణం స్పందించ వలసిన అవసరం రచయితలకు వుమ్దక్కర లేదు. జర్నలిస్టులు,రాజకీయ నాయకులూ,పోలీసులు తక్షణమే స్పందించాలి అని నేను అనుకుంటాను.

    • N Venugopal says:

      అప్పారావు గారూ,

      ధన్యవాదాలు. రచయితలు అంటే ఆలోచనాపరులు, స్పందనాశీలురు, ఆ స్పందనను వ్యక్తీకరించేవారు అనే అర్థంలో రాశాను. కనుక లోకం మీది ఏ విషయానికైనా తక్షణం స్పందించడం రచయితల సామాజిక బాధ్యత అని నా అభిప్రాయం. ఇక మీరు రాసిన జాబితాలోని మూడు వర్గాల స్పందన ఎలా ఉంటుందో, ఏ ప్రయోజనాల కోసం ఎంత తప్పుడు స్పందనలు ఉంటాయో చరిత్రలోనూ మన కళ్లముందూ లక్షల ఉదాహరణలున్నాయి. నాకు జర్నలిస్టుల మీద కాస్త నమ్మకం గాని రాజకీయ నాయకులమీద, పోలీసుల మీద ఎంత మాత్రం నమ్మకం లేదు. అసలు వాళ్లు స్పందిస్తే తప్పుడు స్పందనే ఉంటుందని కూడ నా నమ్మకం.

  4. ‘ఘర్ వాపసీ’పై మంచి విశ్లేషణ. చాలా సమాచారం అందించారు వేనుగోపాల్‌గారూ. మతాంతరీకరణపై ఆనాడే విమర్శలు గుప్పించిన రచయితల అభిప్రాయాలనూ, వారి రచనలనూ ఉటంకించి, నేటి రచయితల మౌనాన్ని ప్రశ్నించి, ఆలోచనకు పురికొల్పారు. కవులు, రచయితలు ఇట్లాంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై స్పందించాలని కర్తవ్యాన్ని నిర్దేశించారు.

  5. Maddali Srinivas says:

    నువ్వు కూల్చేసి కట్టించినవన్నీ
    నేను కూల్చేసి కట్టించుకుంటా
    నీదో మతం నాదో మతం మనకెందుకు మానవత్వం ఫకీరా……….

    నువ్వు పిలక కత్తిరించి సుంతీ చేసినోడికి
    నేను పిలక పెట్టి విభూది పెట్టి వూరేగిస్తా
    వాడి ఆకలి పూచీ నీది కాదు నాది కాదు అల్లానో ఈశ్వరో చూసుకుంటాడులే ఫకీరా…. “అని వ్రాసాను,”ఘర్ వాపసీ”అంశం మీద. మీ వ్యాసం చదివిన తరువాత ఈ విషయము మీద నా అప్పటి ప్రతి స్పందన పేలవంగా తోస్తున్నది.

    • N Venugopal says:

      మద్దాలి శ్రీనివాస్ గారూ

      ధన్యవాదాలు.

      మీ కవిత బాగుంది. ఎక్కడ అచ్చయింది? నేను చూడలేదు. మిస్సయ్యాను. క్షమించండి.

      • Maddali Srinivas says:

        వేణు గారు,
        ఫకీరా,అనే సంబోధనాత్మక మకుటాన్ని వాడుతూ కొన్ని కవితలని ఫేస్ బుక్ లో కవిసంగమం అనే గ్రూపులో పోస్ట్ చేసాను.అమ్దులోవే ఈ రెండు చిట్టి కవితలు. మీ స్పందనకు ధన్యవాదాలు. రిప్లై ఇవ్వటంలో ఆలస్యమునకు మన్నించండి.
        శ్రీనివాస్.

  6. చాల విషయాలు తెలుస్తున్నై….మతం ఎప్పుడు జీవితం తో ముడి పది ఉండే అంశం…అది ఎ విధంగా నైన కావచ్చు ….ఈ రోజుల్లల్లో మతం అనే చర్చ మల్లి మాట్లాడం జరుగుతింది…ఇంకా ఈ విషయం మీద చర్చలు అన్ని కోణాల నుండి జరగాలి……a very informative article……massive project aimed at religious conversion to christianity….http://joshuaproject.net/….and killing people in the name of God by terror organizations too are pushing the people to think more along with what is Ghar wapasi program……..

    • N Venugopal says:

      సురేందర్ గారూ

      ధన్యవాదాలు.

      మీరు ప్రత్యక్షంగా చెప్పిన క్రైస్తవ, అన్యాపదేశంగా ప్రస్తావించిన ముస్లిం మతాంతరీకరణలు ఘర్ వాపసీ కార్యక్రమం వైపు ప్రజలను నెడుతున్నాయనే మీ అభిప్రాయంతో నేను ఏకీభవించడం లేదు.

  7. నిశీధి says:

    Finally someone dare write a sensible and most needed subject , first of of kudos on that . మీరడిగిన ప్రశ్న నిజంగా అవసరం ఇపుడు , ఫేస్బుక్ చర్చల్లో లేదా ట్విటర్ లాంటి వాటిలో ఇపుడు ఇపుడు సమాజం అర్ధం అవుతున్న చిన్న చిన్న పిల్లలు ఈ టాపిక్ మీద పోస్ట్స్ పెట్టడం చర్చించడం చూసాను కాని , సో కాల్డ్ బుద్ధ జీవులు అంతా బుద్ధిగా సొసైటీ లో మార్పులు భయాలు అలా గమనిస్తూ టైం పాస్ చేస్తున్నారు , చాల వరకు వస్తే మతం బల పడుతుంది పోతే పక్కోడి ప్రాణాలు పోతాయి , మధ్యలో దూరితే మనం వెలి పడతాం లాంటి డిస్గస్టింగ్ ఆటిట్యూడ్ తప్ప , అసలు ఈ మొత్తం నడుస్తున్న నయా డ్రామా లో కామన్ మాన్ కి కలుగుతున్న కష్టం దుఃఖం , దానికి తీసుకోవాల్సిన మెజర్స్ జరపాల్సిన చర్చలు ఏమి జరుగుతున్నట్టు లేవు . దేశం మొత్తంగా చర్చ జరగాల్సిన అంశాల మీద వ్యూహాత్మక మౌనాలు పాటించడం వల్లే జనాలకి ఒక రకంగా సాహిత్యం మీద సాహిత్య కారుల మీద నమ్మకాలు పోతున్నాయి అనుకుంటాను .

  8. సర్,
    చాల బావుంది. కొన్ని విషయాల్లో మన తెలుగు రచయితలూ క్రీస్తు పూర్వంలో ఉన్నారు. కొందరు చచ్చిన రాజులను కీర్తిస్తూ.. కొందరు బతికిన రాజులకు వంత పాడుతూ..

  9. good essay.

  10. /గతకాలానికి చెందిన ఆ అవగాహనలో సగమో పావో అయినా ఈ అత్యాధునిక వర్తమానంలో ఉంటే ఎంత బాగుండును!/
    అంటే- ఒక గురజాడ అప్పారావు, శ్రీ పాద సుభ్రమణ్య శాస్త్రి, ఒక వట్టి కోట ఆల్వార్ స్వామీ ఈ నాడు లేనట్టే గా ! ఇలా పరిమితులు విధించు కొనెమ్త గా దిగ జారి పోయినట్టా ( వారికంటే ఇంకా ముందు వుండాల్సిన రాసియితులు ఎక్కడా? ) మీ వ్యాసం రచయితులుకు చెర్ణాకోలా. బాగా ఉంది.

  11. buchireddy gangula says:

    వేణు గారు
    excellent..article..sir….
    చాలా చక్కగా చెప్పారు — మోహన్ గారు — సుబ్రహ్మణ్యం గారి కామెంట్స్ తో
    ఎకబవిస్తాను

    ఆత్మ కథలు రాసుకోవడం —-గుర్తింపు కోసం అరాతపడటం — facebook… లో కనిపించడం –బిరుదల కోసం రాజకీయాలు చేయడం —— నేటి రచయితల తీరుతెన్నులు ??
    అమెరికా అయినా — అమలాపురం అయినా — మారింది అంటూ ఏమి లేదు —— తాము
    శ్రీశ్రీ — బుచ్చిబాబు —తిలక్ — వర వ ర —శివా రెడ్డి గారల కన్నా — గొప్పగా feel… అవుతూ ——–మోడీ రాకతో బాబాలు — సంఘ పరివార్ లు — లేనిపోని కూతలు కూస్తూ ???
    మనిషి బతకడానికి మతం — కులం అవరమా ??
    అమెరికా లో కూడా — చదువుకున్న దద్దమ్మ ల కు — అగ్ర కులాల వాళ్ళ కు — నేటికి
    కుల మత పట్టింపులు లేక పోలేదు — ముస్లిమ్స్ అంటే Desha ద్రోహులు — పరాయి వాళ్ళు — అంటూ మాట్లాడే వాళ్ళు అక్కడనే కాదు — యిక్కడ అమెరికా లో కూడా దొర లు — ఉన్నారు ???
    మతం కారణం గా —Nehru గారి పదవి కా 0క్ష కారణం గా దేశం 2 ముక్కలు అయినా —-
    యింకా దేశం లో మతాన్ని రాజకీయం చేస్తూ — దేనికి ?? ఎందుకు ??
    మార్పు అవసరం
    ————————————–బుచ్చి రెడ్డి గంగుల

  12. సమాజమంతా మౌనంగా నిర్లిప్తంగా చూస్తున్నది …

    మీరన్నదే జరుగుతోంది. ఏమీ పట్టని సమాజంగా తయారైంది మనది.
    ఎటు చూస్తే అటు పట్టనితనం, దాటవేత, నిర్లిప్తత. రాష్ట్ర విభజన లాంటి
    అత్యంత సున్నితమైన అంశాన్ని కూడా ఓ ఆటలా దేశం మొత్తం అదేదో
    మనకు సంబంధించిన విషయం కానట్లుగా, పరాయి దేశపు సమస్యలా
    పరిగణించి, ప్రవర్తించిందే తప్ప అది అందరి సమస్యగా గుర్తెరగలేదు.
    ఆ ఒక్క విషయమనే కాదు, మొత్తంగా, ఏ విషయం చూసినా ఇదే ధోరణి.
    సమాజంలో మీరాశించే పావు శాతం కాదు కదా పదో శాతం కూడా
    కనుచూపు మేరలో అడ్రెస్ లేదు …

  13. N Venugopal says:

    పి మోహన్,

    బొల్లోజు బాబా,
    తిరుపాలు
    ,

    బుచ్చిరెడ్డి గంగుల,
    ఎన్ ఎం రావు బండి గార్లకు,

    ధన్యవాదాలు…

  14. Seela subhadraDevi says:

    నా మొదటి కవితాసంపుటాలలో బహుసా అప్పుడు (1973-90)మత ఘర్షణలు ఎక్కువగా వుండటం వల్ల కావచ్చు ఓ పది వరకూ కవితలు రాసాను.2001లో రాసిన దీర్ఘకవిత యుద్ధం ఒక గుండె కోత మొత్తం అమెరిక ఆఫ్ఘన్ వార్ ,అమెరికాలొ టవర్స్ కూలిన సంధర్భం నేపధ్యం లో రాసినదే అందులో మత విధ్వంశాల ను గూర్చే రాసాను

  15. అయ్యా వేణుగోపాల్ గారు,

    Gharwapasi మీకున్న అభిప్రాయం చాల తీవ్రంగా వుంది.

    1) గత 10 సవత్సరాల్లో సుమారుగా 20,000 కోట్లు ఈ దేశం లో కి christian మిషనరీస్ తీసుకొచ్చాయి.
    కనీసం 4-5 కోట్ల మంది convert అయ్యారు. అది మీకు అత్యంత పవిత్ర కార్యం ల కనిపిస్తోందా ?
    మరి దాని గురించి మీరు ఒక్క మాట మాట్లడలేదు
    2) అంత హిందూ ద్వేషం ఎందుకు ?. క్రిస్టినా మిషనరీస్ ఎన్ని దారుణాలు చేస్తున్నారో మీకు తెలుసా
    తిరుపతి కొండ మీద ప్రచారం చేసే దుస్సాహసం వారికుంది. ఈ మధ్య ఒక దుర్మార్గుడు ఏకంగా తిరుపతి కి వెళ్ళే బక్తులు అంతా పాపులు అని వీడియో youtube పెట్టాడు. కానీ ఈ మిస్సినరీస్ ఈ చిన్న మసీద్ దగ్గర కూడా ప్రచారం చెయ్యరు
    ఎందుకంటే ప్రాణాలు మిగలవని తెలుసు
    3) సౌదీ అరేబియా పెట్రో డాలర్స్ తో Wahabism అనే tribal మెంటాలిటీ ని మన దేశ ముసిలం లో పెంచుతోంది
    దాని గురించి మీరు మౌనంగా వుంటారు
    4) ఒక్కసారి సువార్త సభల్లో ఎం చెప్తారో చుడండి.Dasaradhu ఎయిడ్స్ తో చచ్చింటాడు అని చెప్పే నీచులు vuntarakkada
    కానీ అది మీకు కనపడదు వినపడదు.
    అయ్యా ఈ మేధో దివాలకోరుతనం నుండి బయటపడండి.

    • “అంత హిందూ ద్వేషం ఎందుకు ?”

      హిందుత్వ సంస్థలు చేసే పనిని వ్యతిరేకించడం హిందూ ద్వేషం అవుతుందా? హత్యలు, రేపులు చేసే నేరస్తులను వ్యతిరేకించడం మనిషిని వ్యతిరేకించడమా? ఏమిటి మీ లాజిక్?

      • సుజన గారు,

        ఇక్కడ నేరాలు గురించి మనం మాట్లాడం లేదు. Conversions గురించే చర్చ.
        నేను ఎక్కడ నేరాలని సమర్ధించ లేదు. 1940 కలం నాటి రచనలు చుపుంచి ఎందుకు విషం చిమ్మడం. Christian కన్వర్షన్ లో లేని సమస్య హిందూ కన్వర్షన్ కి ఎందుకు ? అవి చట్ట విరుద్దం అయితే కోర్ట్ కి వెళ్ళొచ్చు కదా?

    • సుజన says:

      తాలిబన్లను, ఐసిస్ ను ఖండించడం ఇస్లాంను ద్వేషించడం కాదు. సంఘపరివార్ చర్యల్ని ఖండించడం హిందూను ద్వేషించడం కాదు. ఈ వ్యాసరచయిత మతం మీద విశ్వాసం లేని నాస్తికులే అనుకున్నా ఆయన హిందువే. తనను తను ద్వేషించుకుంటారా? కనుక హిందూ ద్వేషం అనడం తప్పు. సంఘపరివార్ ద్వేషం అనండి. సంఘపరివార్ అంటేనే హిందూ కాదు. అది హిందువులు అందరికీ ప్రతినిధి కాదు. 90 ఏళ్లుగా సఘపరివార్ లేక దాని ఐడియాలజీవారు హిందూ polaraization కు ప్రయత్నిస్తున్నా లోక్ సభ ఎన్నికల్లో బిజెపికి వచ్చినవి 31 శాతం వొట్లే. అందులో కూడా ఎక్కువ శాతం వోట్లు మోడీ చెప్పిన అభివృద్ధి మీద ఆశతోనే. 53 శాతం మంది హిందూ వోటర్లు బిజెపికి బయటే ఉన్నారు. ఇంకో 90 ఏళ్ల తర్వాత కూడా హిందువులు అందరూ పరివార్ ఐడియాలజీని ఆమోదించరనే నా ఉద్దేశం. అదే జరిగితే ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించుకోవచ్చు.
      మతప్రచారం, ఇష్టపడేవారి కన్వర్షన్ చేసుకునే ప్రజాస్వామ్య హక్కు హిందువులకు కూడా ఉంది. హిందూ కన్వర్షన్లు కూడా చాలా కాలంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఘర్ వాపసిని వ్యతిరేకించడానికి కారణం, దానికి అధికారంలో ఉన్న బిజెపి మద్దతు ఇవ్వడం, బిజెపి ప్రభుత్వం మాట్లాడకపోవడం. మతాలలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం మీదే వ్యతిరేకత.
      హిందూ సంస్థలకు అందే విదేశీ నిధులు 200 కోట్లే అన్నారు. ఆ డబ్బు మీరు చెప్పిన 20 వేల కోట్లకు చేరితే సమస్యే లేదు. సంఘపరివార్ కూడా మిషనరీలతో పోటీ పడచ్చు.

      • సుజన says:

        పైన 53 శాతం హిందూ వోటర్లు అనడం పొరపాటు. మిగిలిన 69 శాతం వోటర్లలో ఎక్కువ శాతం ఉండే హిందూ వోటర్లు బిజెపికి వోటువేయలేదన్నట్టుగా దానిని తీసుకోగలరు.

      • @సుజన,
        సంఘ్ పరివార్ లో హిందువులు కాక పోతే క్రైస్తవులు ఉన్నారా? సంఘ్ పరివార్ హిందువులకు ప్రతినిధే. కాదని మీరన్నంత మాత్రన ఒరిగేదేమి ఉండదు. బిజెపి కి 31% ఓట్లు కమ్మీ ఇంగ్లిష్ మీడీయా ప్రచారం చేసిన అబద్దాల ప్రాపగండ. అయినా ఓట్ల లెక్కల ప్రస్తావన అనవసరం. కాలనికి అనుగుణంగా సంఘ్ పరివార్ వాళ్లన్నా మారుతున్నారేమో గాని, వామపక్షవాదులలో ఏ మార్పు లేదని ఈ వ్యాసం చదివితే అర్థమౌతుంది.

  16. N Venugopal says:

    అయ్యా శివ గారూ…

    మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు.

    మీ అభిప్రాయం మీది అని జవాబు రాయకుండానే ఉందామనుకున్నాను. కాని మీరు ఒకవైపు సంఘ పరివార్ ప్రచారం చేసే పచ్చి అబద్ధాలనే చిలకపలుకుల్లాగ వల్లిస్తూ, మరొకవైపు “మేధో దివాళాకోరుతనం నుండి బయటపడండి” అని నన్ను ఆదేశించారు గనుక మీ అబద్ధాలు విప్పి చెప్పడం నా బాధ్యత అయింది.

    1. భారత దేశంలో “గత 10 సంవత్సరాల్లో” “కనీసం 4-5 కోట్ల మంది” క్రైస్తవంలోకి కన్వర్ట్ అయ్యారా? ఎవరు చెప్పారు స్వామీ? భారత జనాభా 120 కోట్లు. 4-5 కోట్లంటే 3-4 శాతం అవుతుంది, మీకు కనీసమైన అంకగణిత పరిచయం ఉంటే (సంఘపరివార్ అబద్ధీకులకు ఉండదని నాకు తెలుసనుకోండి – మీకు ఉంటుందని నా ఆశ). కాని భారత జనగణన 2001 లో క్రైస్తవుల జనాభా శాతం 2.34, 2011 లో కూడ 2.34. కనీసం 0.01 శాతం కూడ పెరగలేదు. నికర అంకెల్లో చూస్తే అది 2001లో రెండు కోట్ల నలభై లక్షలు ఉన్నది, 2011లో రెండు కోట్ల ఎనభై ఐదు లక్షలు అయింది. మరి మీరు ఆ అంకెకు రెట్టింపు ఈ పదేళ్లలో కొత్తగా చేరిందంటున్నారు. ఇదేమీ సత్య సాయిబాబా ఉంగరాలు, లింగాలు సృష్టించినట్టు కాదు గదా…

    2. ప్రచారం చేస్తే, చేసుకుంటే “దారుణమా”? విశ్వ హిందూ పరిషత్ చేసేదేమిటి? ఏ మతమైనా ఇతర మతాలవారిని ఆకర్షించడానికి ప్రచారం చేస్తుంది. భారత రాజ్యాంగమే పౌరులు తమ ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించవచ్చునని, ఏ మతం లేకుండా కూడ ఉండవచ్చునని చెపుతుంది. ఇక క్రైస్తవులు ప్రచారం చేసే అబద్ధాలంటారా, అబద్ధాలు ప్రచారం చేయని మతం ఏదన్నా ఉందా? పైగా వాళ్లు మసీదుల ముందు ప్రచారం చేయరని, భయమని మీకు తెలిసిన స్టీరియో టైప్ వాదన మరొకటి. సరే, వాదన కోసం మసీదుల ముందు ప్రచారం చేస్తే ప్రాణాలు మిగలవని మీరన్న మాటే నిజమని అనుకుందాం. అది మంచిదా, చెడ్డదా? తోటి వాడు తొడకోసుకుంటే నేను మెడకోసుకుంటానన్నట్టు మీరు దానితో పోటీ పడడం ఏమిటి?

    3. వహాబీ పెట్రో డాలర్స్ కన్న ప్రమాదకరమైన ప్రపంచీకరణ విధానాలను ఈ ఇరవై ఐదేళ్లలో కాషాయం నుంచి ముదురు ఎరుపు వరకు అన్ని పాలక పక్షాలూ దేశంలోకి తీసుకొచ్చాయి. ఆ విధానాలతో అంటకాగుతున్న సంఘ పరివారానికి వహాబీల గురించి మాట్లాడే అర్హత ఉందా?

    4. రామ్ జాదే, హరామ్ జాదే అన్న “సాధ్వి” లోని, ఆ సాధ్వులను పెంచి పోషించే హిందుత్వ లోని “నీచత్వాన్ని” మొదలు గుర్తించండి. దశరథుడు ఎట్లా చచ్చాడో తర్వాత చూద్దాం…

    5. మీకు ఓపిక ఉంటే, ఒక్క అమెరికా నుంచే సంఘ పరివార్ శక్తులు ఎన్ని నిధులు ఏ అక్రమ మార్గాల్లో పోగేసి, హిందుత్వ వ్యాప్తి కోసం భారతదేశానికి పంపుతున్నాయో ఈ నివేదిక చూడండి:

    http://www.sacw.net/IMG/pdf/US_HinduNationalism_Nonprofits.pdf

    దివాళాకోరుతనం లాంటి మాటలు వాడే ముందు కాస్త ఆలోచించడానికి ప్రయత్నించండి.

    • అయ్యా శివ గారూ…

      మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు.

      మీ అభిప్రాయం మీది అని జవాబు రాయకుండానే ఉందామనుకున్నాను. కాని మీరు ఒకవైపు సంఘ పరివార్ ప్రచారం చేసే పచ్చి అబద్ధాలనే చిలకపలుకుల్లాగ వల్లిస్తూ, మరొకవైపు “మేధో దివాళాకోరుతనం నుండి బయటపడండి” అని నన్ను ఆదేశించారు గనుక మీ అబద్ధాలు విప్పి చెప్పడం నా బాధ్యత అయింది.

      (ప్రపంచాన్ని నలుపు తెలుపు లో చుస్తే ఎలా? మీ విమర్శకులు అంత సాంఘి లేనా ? )

      1. భారత దేశంలో “గత 10 సంవత్సరాల్లో” “కనీసం 4-5 కోట్ల మంది” క్రైస్తవంలోకి కన్వర్ట్ అయ్యారా? ఎవరు చెప్పారు స్వామీ? భారత జనాభా 120 కోట్లు. 4-5 కోట్లంటే 3-4 శాతం అవుతుంది, మీకు కనీసమైన అంకగణిత పరిచయం ఉంటే (సంఘపరివార్ అబద్ధీకులకు ఉండదని నాకు తెలుసనుకోండి – మీకు ఉంటుందని నా ఆశ). కాని భారత జనగణన 2001 లో క్రైస్తవుల జనాభా శాతం 2.34, 2011 లో కూడ 2.34. కనీసం 0.01 శాతం కూడ పెరగలేదు. నికర అంకెల్లో చూస్తే అది 2001లో రెండు కోట్ల నలభై లక్షలు ఉన్నది, 2011లో రెండు కోట్ల ఎనభై ఐదు లక్షలు అయింది. మరి మీరు ఆ అంకెకు రెట్టింపు ఈ పదేళ్లలో కొత్తగా చేరిందంటున్నారు. ఇదేమీ సత్య సాయిబాబా ఉంగరాలు, లింగాలు సృష్టించినట్టు కాదు గదా…

      ( అయ్యా రిజర్వేషన్స్ కోసం చాల మంది christians హిందువులుగా చలామణి అవుతున్నారు. ఇది చిన్న పిల్లాడిని అడిగిన చెప్తారు. నాకు అంక గణితం తెలుసు కానీ మీకు రియాలిటీ తెలిసినట్టు లేదు. అందుకే దళిత christians కి రిజర్వేషన్ కావాలని అంత గొడవ. అది ఇచ్చి చుడండి అసలు విషయం మీకు తెలుస్తుంది )

      2. ప్రచారం చేస్తే, చేసుకుంటే “దారుణమా”? విశ్వ హిందూ పరిషత్ చేసేదేమిటి? ఏ మతమైనా ఇతర మతాలవారిని ఆకర్షించడానికి ప్రచారం చేస్తుంది. భారత రాజ్యాంగమే పౌరులు తమ ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించవచ్చునని, ఏ మతం లేకుండా కూడ ఉండవచ్చునని చెపుతుంది. ఇక క్రైస్తవులు ప్రచారం చేసే అబద్ధాలంటారా, అబద్ధాలు ప్రచారం చేయని మతం ఏదన్నా ఉందా? పైగా వాళ్లు మసీదుల ముందు ప్రచారం చేయరని, భయమని మీకు తెలిసిన స్టీరియో టైప్ వాదన మరొకటి. సరే, వాదన కోసం మసీదుల ముందు ప్రచారం చేస్తే ప్రాణాలు మిగలవని మీరన్న మాటే నిజమని అనుకుందాం. అది మంచిదా, చెడ్డదా? తోటి వాడు తొడకోసుకుంటే నేను మెడకోసుకుంటానన్నట్టు మీరు దానితో పోటీ పడడం ఏమిటి?

      ( ప్రచారం అందరికి వున్నా హక్కు. మరి నేను చెప్పింది తిరుపతి కొండ మీద ప్రచారం.అది పబ్లిక్ ప్లేస్ కాదు. ఒక మతానికి చెందినా ప్రదేశం. అది వైకుంతం ద్వారం ముందు ప్రచారం చట్ట విరుద్దమే కాదు అనితికం కూడా దాని కూడా మీరు సమర్ధిస్తున్నారు అంటే ఏమి చెప్పాలి? మసీదు ల గురించి నేను చెప్పింది స్టీరియో టైపింగ్ అంటున్నారు కాబట్టి ఒక ఉదాహరణ చూపించండి అల ప్రచారం జరిగినదని. Christians కన్వర్షన్ లు మంచివే కానీ అదే హిందువులు చేస్తే ప్రేలాపనలు రాక్షసం . ఇది ఎటువంటి మేధావితనం ????)

      3. వహాబీ పెట్రో డాలర్స్ కన్న ప్రమాదకరమైన ప్రపంచీకరణ విధానాలను ఈ ఇరవై ఐదేళ్లలో కాషాయం నుంచి ముదురు ఎరుపు వరకు అన్ని పాలక పక్షాలూ దేశంలోకి తీసుకొచ్చాయి. ఆ విధానాలతో అంటకాగుతున్న సంఘ పరివారానికి వహాబీల గురించి మాట్లాడే అర్హత ఉందా?

      ( ఇది చాల గొప్ప లాజిక్ సర్ . ప్రపంచికరణ విధానాలు వచ్చాయి కావున ఇంకా ఏవి వచ్చిన ఒకే ?
      ఆహ . ఈ లెక్కన మీరు షరియా లా ని , స్త్రీ లని అణిచివేసే wahabism ని సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే అవి ప్రపంచీకరణ కాదు కాబట్ట్టి. మల్లి సాంఘి లే అవి తెచ్చారు కనక వారు మాట్లాడ కూడదు. రేపు ఇసిస్ వచ్చిన వాళ్ళు ఒకే. ఎందుకంటే వాళ్ళు సంగి లు కాదు ప్రపంచీకరణ కాదు. పాపం ISIS వాళ్ళకి మీరు ఇక్కడ మంగళ హరతులతో రెడీ వున్నటు తెలిసినట్టు లేదు. Wahabism రానిస్తే ISIS దాదాపు వచ్చినట్టే )

      4. రామ్ జాదే, హరామ్ జాదే అన్న “సాధ్వి” లోని, ఆ సాధ్వులను పెంచి పోషించే హిందుత్వ లోని “నీచత్వాన్ని” మొదలు గుర్తించండి. దశరథుడు ఎట్లా చచ్చాడో తర్వాత చూద్దాం…
      (రెండింటిని నిర్ద్వందంగా నేను ఖండిస్తున్నాను .బహుశ మీరు సాంఘి ల తో ఆగిపోతారు)

      5. మీకు ఓపిక ఉంటే, ఒక్క అమెరికా నుంచే సంఘ పరివార్ శక్తులు ఎన్ని నిధులు ఏ అక్రమ మార్గాల్లో పోగేసి, హిందుత్వ వ్యాప్తి కోసం భారతదేశానికి పంపుతున్నాయో ఈ నివేదిక చూడండి:

      http://www.sacw.net/IMG/pdf/US_HinduNationalism_Nonprofits.pdf
      ( అంతా కలిపితే 200 కోట్లు. నేను చెప్పిన 20,000 కోట్లు గవర్నమెంట్ ఫిగర్. కాకి లెక్క కాదు ( మీకు అర్థం అయ్యే భాషలే చెప్పాలంటే సాంఘి లెక్క కాదు). మీకు ఎలాగు అంకగణితం బాగా తెలుసు ( మీరు సాంఘి లు కాదు కదా))

      దివాళాకోరుతనం లాంటి మాటలు వాడే ముందు కాస్త ఆలోచించడానికి ప్రయత్నించండి
      ( దివాలుకోరుతనం తక్కువ మాటే అనుకుంట )

      చివరగా ఒక్క మాట. రచయితలూ ఇంతకూ ముందు conversions అప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎప్పుడో 1940 ముందు రచనల గురించి చెప్పి ఇప్పుడు హిందూ మతాన్ని ద్వేశించాల్సిన అవసరం అంతా కన్నా లేదు. మీకు ప్రత్యామ్న్యాయ ఆర్ధిక విధానాలు కావాలంటే దానికే పోరాడండి .
      అందరు అభినందిస్తారు నేను capitalism ని ఇష్టపదను . Socialism ని గౌరవిస్తాను. ఆ ముసుగులో ఒక మతాన్ని టార్గెట్ చేస్తుపోతే మీ లక్ష్యమే మీకు దూరం అవుతుంది తప్ప ప్రయోజనం లేదు. లెఫ్టిస్ట్ జనాలు అనుకున్తున్నాటుగా జనాలు ప్రాపగాండా వాళ్ళ BJP ki వోటు వెయ్యలేదు. ఈ ఒంటి కన్ను secularism వల్లనే జనాలు rightist వైపు మల్లుతున్నారు. నేను సాంఘి ని కాదు కానీ కమ్యూనిస్ట్ ని కూడా కాదు.

  17. // ప్రచారం అందరికి వున్నా హక్కు. మరి నేను చెప్పింది తిరుపతి కొండ మీద //
    ఎవరో ఏదో ప్రచారం చేస్తే మారిపోవటానికి హిందువులు అంత బలహీనంగా వున్నారా? వారు పిల్లలతో సమానమా? వారి దైవనమ్మకం స్తిరమైనది కాదా? అంత బలహీనులుగా, అమాయకులుగా ఉంటే ప్రచారం లేక పోయినా మారి పోతారు. దైవ నమ్మకానికి సామాజిక పరిస్తితులకు ఏమిటి సంబందం? ఏదో సంబందం లేక పోతే ఎవరైనా ఎందుకు మారాలి? ఇక్కడ రాజాకీయాలు మతంతో పెన వేసుకున్నాయి కనుక.

    //ఎప్పుడో 1940 ముందు రచనల గురించి చెప్పి ఇప్పుడు హిందూ మతాన్ని ద్వేశించాల్సిన అవసరం అంతా కన్నా లేదు.//
    దైవ నమ్మకం కాల మాన పరిస్తితులను బట్టి మారుతూ ఉంటాయా ? అప్పుడు ఉన్న హిందు మతానికి ఇప్పుడున్న హిందు మతాని ఏమిటి భేదం? అది మతం లో ఉన్న మార్పు కాదు. రాజకీయాల్లో వచ్చిన మార్పు. ఇక్కడ రచయిత చెప్పదలుచుకున్నది మతంతో రాజకీయాలను మిళితం చేయ టాన్ని గురించే.
    మతనమ్మకం అంటే దైవ నమ్మకం అయితే అది వ్యక్తు అవగాహనను బట్టి వారి విశ్వాసాన్ని బట్టి ఏర్పడేది. అది పూర్తిగా వ్యక్తీ గతం. అది ఒకరికోసం మారమంటే మారేది కాదు. అలా మర్చటమ్ అంటే ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని స్వేచ్ఛను దెబ్బదీయటమ్ కాదా?

    • సుజన says:

      సంఘపరివార్ ఎజెండా 1940 కన్నా పాతది. 1920, ఇంకా ముందుది. కనుక 1940 రచనలంటూ తీసిపారేయద్దు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని సామెత.

    • / ప్రచారం అందరికి వున్నా హక్కు. మరి నేను చెప్పింది తిరుపతి కొండ మీద //
      ఎవరో ఏదో ప్రచారం చేస్తే మారిపోవటానికి హిందువులు అంత బలహీనంగా వున్నారా? వారు పిల్లలతో సమానమా? వారి దైవనమ్మకం స్తిరమైనది కాదా? అంత బలహీనులుగా, అమాయకులుగా ఉంటే ప్రచారం లేక పోయినా మారి పోతారు. దైవ నమ్మకానికి సామాజిక పరిస్తితులకు ఏమిటి సంబందం? ఏదో సంబందం లేక పోతే ఎవరైనా ఎందుకు మారాలి? ఇక్కడ రాజాకీయాలు మతంతో పెన వేసుకున్నాయి కనుక.

      ఇక్కడ రెండు విషయాలు గురిచి చెప్పాలి

      1) మీరు ప్రపంచం లో అన్ని మాట్లాడుతున్నారు కానీ తిరుపతి కొండ మీద (అంటే తిరుమల లో) ప్రచారం తప్పు అని చెప్పట్లేదు. ఎందుకు ?? ఒక్క తిరుపతి ఈ కాదు, సింహాచలం, భద్రాచలం, మహానంది ఇంకా చెప్పా లంటే ఎన్నో.
      అన్ని గుడుల దగ్గర ప్రచారం చేయడం రెచ్చ గొట్ట్టడం కదా ? దాన్ని తప్పు అనడానికి మీకు నోరు రావట్లేదు.
      2) హిందువుల అంత బలహీనుల ? మరి ఇదే ఇప్పుడు GharWapsi మతం మారుతున్నా వారికీ వర్తిస్తుంది కదా
      అలాంటప్పుడు గొడవే లేదు కదా

      //ఎప్పుడో 1940 ముందు రచనల గురించి చెప్పి ఇప్పుడు హిందూ మతాన్ని ద్వేశించాల్సిన అవసరం అంతా కన్నా లేదు.//
      దైవ నమ్మకం కాల మాన పరిస్తితులను బట్టి మారుతూ ఉంటాయా ? అప్పుడు ఉన్న హిందు మతానికి ఇప్పుడున్న హిందు మతాని ఏమిటి భేదం? అది మతం లో ఉన్న మార్పు కాదు. రాజకీయాల్లో వచ్చిన మార్పు. ఇక్కడ రచయిత చెప్పదలుచుకున్నది మతంతో రాజకీయాలను మిళితం చేయ టాన్ని గురించే.
      మతనమ్మకం అంటే దైవ నమ్మకం అయితే అది వ్యక్తు అవగాహనను బట్టి వారి విశ్వాసాన్ని బట్టి ఏర్పడేది. అది పూర్తిగా వ్యక్తీ గతం. అది ఒకరికోసం మారమంటే మారేది కాదు. అలా మర్చటమ్ అంటే ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని స్వేచ్ఛను దెబ్బదీయటమ్ కాదా?

      1) 1940 లో చదువుకున్న దళితులూ ఎందరు ? బహుజనులు ఎందరు ? అస్సలు ఏమి పరిస్తిలు మారలేదు అనడం వారి శ్రమ ను & పోరాటాలను ( పోరాటాల ద్వార్స్ వారు సాధించుకున్న రిజర్వేషన్స్) ను అవమానించడం కాదా?. అప్పుడు వున్నా పరిస్తితుల్ని చూపించి ఇప్పుడు వాళ్ళు మతం మారడం కరెక్ట్ ఈ అనవచ్చా?
      Everybody has రైట్ to change their రిలీజియన్. నా సమస్యల్ల ఒక అంతర్జాతీయ మాఫియా పని కట్టుకుని
      వేల కోట్లు కుమ్మరించి, ప్రలోభాలతో ఈ పని చెయ్యడం. దళితులూ బౌద్ధం లో కి మారినప్పుడు ఎవరు ఇలాంటి ఆక్షేపణలు చెయ్యలేదు.

      2) మతాన్ని రాజకియ్యాన్నికలపడం : Y .S .R అల్లుడే ఎన్నో కన్వర్షన్ చేసాడు. ఆయన ఆశీర్వాదం తో నే misssionaries conversions ని ముమ్మరం చేసాయి. అప్పుడు మీకు సమస్య అనిపించలేద ?
      సోనియా వల్లే మిషనరీ మాఫియా చెలరేగింది అన్నది అందరికి తెలిసిన విషయం. ప్రభుత్వానికి తెలేకుండా ఇన్ని వేల కోట్లు వచ్చేవ ఇండియా లో కి ? UPA గవర్నమెంట్ సహాయం చాల వుంది ఈ conversions లో.
      BJP కచ్చింతగా మతతత్వ పార్టీ ఈ ? మరి MIM మాటేమిటి ? IUML , Kerala కాంగ్రెస్, పీస్ పార్టీ అఫ్ ఇండియా కూడా మతతత్వ పార్టీ లే ? మరి అవి వున్నా UPA Secular ఎలా అవుతుంది ? ద్వంద్వ ప్రమాణాలు మంచివి కాదు .

      • ఏ పార్టి మతం తో రాజకీయాలు చేయలేదు. గాంధి ఖిలాఫత్ ఉద్యమం సమర్ధించటం రాజకీయం కాదా! దేశ విభజన సమయంలో కలకత్తాలో జిన్నా గారికి మీటింగ్ కి కమ్యునిస్ట్ పార్టి, వాళ్ల కార్యకర్తలు హాజరయ్యి మద్దతు తెలపలేదా? హిందువుల తరపున కొద్దొ గొప్పో మాట్లాడేది ఒక్క బిజెపి పార్టినే. వారి పైన మతత్వ పార్టి అని ముద్ర వేస్తారా? మిగతా పార్టిలన్ని కడిగిన ముత్యాలా? ఇక్కడ సంఘ్ పరివార్ ను తిట్టిపోసే వారిలో ఒక్కరన్నా తిరుమలలో క్రైస్తవమత ప్రచారం చేయటం మొదలుపెడితే, ఆ సంఘటనను ఖండించారా? వీళ్ల దృష్టిలో హిందువులకు ఏ అస్తిత్వం లేదు,వాళ్లకి ఏ చరిత్రా లేదు. వాళ్లన్ని ఎవరు ఎమైనా అనవచ్చు, హిందువులు మాత్రం నోరు మూసుకొని పడి ఉండాలి.

      • ఈ సంగ్ పరివారానికి ఇంతకంటే హేతు బద్దమైన ఆలోచనలు రావేమో ? ఏదైన చర్చకు తెస్తే అసలు చర్చలో అంశాన్ని వదిలిపెట్టి , వారు చేస్తే మీరు మాట్లాడ లేదే! వీరు రాజకీయం చేస్తే ఒప్పుకున్నారు! అనడం తప్ప, న్యాయమనుకున్నది అందరికి ఒకేలాగున ఉండాలనే గాని, ఒకరికి ఒకలాగా ఇంకొకరి ఇంకోలాగా ఉండాలని కాదు. మనుషులన్న తరవాతా అందరు పాటించాలనే కదా చర్చ. ఒకడు చేసిన తప్పు ఇంకోడు చేస్తే ఒప్పు ఎలా అవుతుంది. అది పరిస్తితులను బట్టి మారుతుంది అనుకొండి. ఉదా : ఒకడు కడుపు కూటికి లేక ఎదో చిన్న దొంగతనం చేసాడంటే తీవ్ర మగా పరిగెనిమ్చే వారు అదే ఏ కోటీశ్వరుడు కోట్లు దండు కుంటుంటే చూసి చూడనట్లు పోతుంటారు. ఇక్కడ చిన్న దొంగ పెద్ద దొంగనుచూసి ఆయన చేసిన నేరం నేను చేస్తే తప్పేమిటి ? అని అందులో ఏదో మేరకు న్యాయం ఉంటుంది. కానీ పెద్ద దొంగే చిన్న దొంగను చూపిమ్ఛి వాడు చేసిన తప్పు నేనెందుకు చేయ కూడదు? అనే టపుడు ఏమనుకోవాలి? దీన్ని కూడా న్యాయమే నంటారు కుమ్దరు పెద్ద మనుషులు. ఇప్పుడు తెలుసు కోవచ్చు ” పెద్దమనుషుల ” సినిమాద్వారా మనకు అపుడే తేలియ జేశారు. పెద్ద మనుషుల స్వభావాన్ని.

      • తిరుపాలు గారు, బ్లాగులో మీరు రాసే కామెంట్లు చదువుతూంటాను.ఇప్పటివరకు హిందువుల గురించి నాలుగు మంచి వ్యాఖ్యలు మీరు రాసినట్లు చూడలేదు. అవహేళనగా ,దెప్పి పొడుపులు, రాయటం మాత్రమే చూశాను. అంతేనా! హిందువులకు ఎన్నో సుద్దులు చెప్పే మీరు, హైందవేతర మతాల వారు తప్పులు చేస్తే వాటి గురించి ప్రస్థావనే ఉండదు. హేతుబద్దత, న్యాయన్యాల గురించి చెప్పాలను కొన్న వారు అందరికి సమానంగా చెప్పాలి. సెలెక్టివ్ సెక్యులరిజం ప్రచారం, సోషల్ మీడీయా ఆవిర్భావంతో అంతమై అయిపోయాయి. మీవంటి వారి వద్దనుంచ్చి హేతుబద్దత గురించి తెలుసుకోవలసిన అవసరం హిందువులకేమి లేదు. మీకో నమస్కారం.

  18. అది మతం లో ఉన్న మార్పు కాదు. రాజకీయాల్లో వచ్చిన మార్పు. ఇక్కడ రచయిత చెప్పదలుచుకున్నది మతంతో రాజకీయాలను మిళితం చేయటాన్ని గురించే………. wonderfully abridged sentence for the entire voice of the writer.

  19. ari sitaramayya says:

    వేణు గారూ, సంఘ్ పరివార్ గురించి మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. అదొక మూర్ఘపు ఫాసిస్ట్ గుంపు. ఆత్మగౌరవానికీ పరద్వేషానికీ మధ్య తేడా తెలియని మూక.

    కానీ, సంఘ్ పరివార్ ని విమర్శించటానికి ముస్లిం పాలకుల అత్యాచారాలను వెనకేసుకు రావాల్సిన అవసరం లేదు. అలా వెనకేసుకు రావటం వల్లనే లౌకిక వాదులు హిందూమత విరోధులు, సుడో సెక్యులరిస్టులు అంటున్నారు పరివార్ జనం.

    “గతంలో పాలకులు బలప్రయోగంతో, మతబోధకులు ప్రలోభాలతో మతాంతరీకరణ జరిపారనే వాదన కూడ పూర్తి సత్యం కాదు,” అన్నారు మీరు. పూర్తి సత్యం కాదనటం బాగానే ఉంది. కాని మీ అభిప్రాయంలో అది ఎంత వరకు సత్యం? 99% నిజమైనది ఏదైనా పూర్తి సత్యం కాదు అనవచ్చు. డిల్లీ సుల్తానేట్ ఏర్పాటు చేసిన ముస్లింలు ఆఫ్ఘన్లు. ముందు దోచుకోవటానికీ తర్వాత పరిపాలించటానికీ వచ్చారు. రెండు మూడు శతాబ్దాల తర్వాత వచ్చిన ముఘల్ పాలకులు మంగోలులు. ఈ రెండు జాతుల ముస్లిం పాలకుల్లో కనీసం కొందరు భారత దేశాన్ని షరియా సూత్రాల ప్రకారం పరిపాలించారు. ముస్లిమేతరుల మీద జిజ్యా పన్ను విధించారు. ఇంకొక దేశాన్ని ఆక్రమించి ఆ దేశ ప్రజల మీద మత సంబంధమైన పన్ను కట్టించడానికి వీరికి ఎంత మత దురహంకారం ఉండాలో ఆలోచించండి. వీళ్ళ ముందు సంఘ్ పరివార్ వారు ఛోటా గుండాల్లాగా కనబడతారు నాకు. జిజ్యా పన్ను కట్టడం ధనికులకు బహుశా సులభంగా వీలయిందేమో. మరి పేదల విషయం ఏంటీ? పన్ను కట్టడం వీలు కానప్పుడు, మతం మార్చుకోవటం సులభం కదా? అది బలవంతంగా జరిగిన మతాంతీకరణా? కాదా? హిందూ మతంలో సమానత లేకపోవటం, వివక్ష ఉండటం నిర్వివాదమైన విషయాలు. తమ మతంలోని వివక్ష వల్ల మతం మార్చుకున్న వారు ఎంత మంది? ముస్లిం పాలకుల బలప్రయోగం వల్ల మార్చుకున్న వారు ఎంత మంది? ఈ విషయం మీద పరిశోధనలు జరిగే ఊంటాయి. అయితే వివరాలు నాకు తెలియవు.

    “సాధారణంగా హిందుత్వవాదులు బలప్రయోగం అన్నప్పుడు ముస్లిం పాలకుల కాలాన్ని, ప్రలోభాలు అన్నప్పుడు క్రైస్తవ మతబోధకుల కాలాన్ని సూచిస్తారు. కాని నిజంగా ముస్లిం పాలకులు బలప్రయోగం ద్వారా, బ్రిటిష్ పాలకులు ప్రలోభాల ద్వారా మతాంతరీకరణ జరపదలచుకుని ఉంటే భారత సమాజంలో ముస్లింల, క్రైస్తవుల నిష్పత్తి ఇంత తక్కువగా ఉండేది కాదు” అన్నారు మీరు. “జరపదలుచుకుని ఉంటే… ఇంత తక్కువగా ఉండేది కాదు” అనడంలో జరపదలుచుకోలేదు అన్న ధ్వని వినిపిస్తుంది. ఈ అభిప్రాయాన్ని సమర్థించే ఆధారాలు ఉన్నాయా? దేశ విభజనకు ముందు భారత దేశంలో ముస్లింలు 25% అని చదివాను ఎక్కడో. దేశాన్ని విభజించి రెండు ముస్లిం దేశాలు ఏర్పాటు చేసిన తర్వాత కూడా భారత దేశంలో ముస్లింల జనాభా ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. ఇది తక్కువా ఎక్కువా?

  20. వేణు గారూ
    ఈ ఆర్టికల్ చదవండి.
    http://archive.tehelka.com/story_main.asp?filename=ts013004shashi.asp#

    • నాగార్జున గారు,

      ఇవి మన సో కాల్డ్ secularist ల కి, కమ్యూనిస్ట్ ల కి అస్సలు కనపడవు , వినపడవు.
      ఇలాంటివి వెలుగులోకి వస్తే వాళ్ళు మౌనంగా వుంటారు కానీ ఒక హిందూ సంస్థ అందులో వందో వంతు చేస్తే
      మటుకు వీళ్ళు నానా హంగామా చేస్తారు. ఈ సెలెక్టివ్ secularism వల్లే జనాలు BJP వైపు వెళ్తున్నారు.
      You can never majority communalism without fighting minority communalism

    • వెల్లువలా విదేశీ విరాళాలు (06-Jan-2015)
      http://www.andhrajyothy.com/Artical.aspx?SID=74370&SupID=21

      సింహభాగం క్రైస్తవ మిషనరీలకే
      స్వచ్ఛంద సంస్థలకు విరాళాలపై సుప్రీంలో పిటిషన్‌
      తెలంగాణకు ‘సుప్రీం’ నోటీసులు
      సీబీఐకి ‘ఎన్‌జీవో’ల లెక్కలు చెప్పాలని ఆదేశం
      న్యూఢిల్లీ, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఏటా విదేశాల నుంచి విరాళాల రూపంలో భారత్‌కు భారీగా నిధులు వస్తుంటాయి. వీటిలో 90 శాతానికి పైగా క్రైస్తవ మిషనరీలకే వెళ్తుండటం గమనార్హం. విదేశాల నుంచి అధిక మొత్తంలో నిధులు పొందుతున్న రాషా్ట్రల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో ఉండేది. క్రైస్తవ మిషనరీలు, స్వచ్ఛంద సంస్థలకు విదేశాల నుంచి వస్తున్న విరాళాలు, ఆయా సంస్థలు పాటించాల్సిన నిబంధనలపై శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటులో పలువురు సభ్యులు ప్రశ్నించగా, కేంద్ర హోం శాఖ ఈ మేరకు సమాచారాన్ని అందించింది.
      2011-12 ఆర్థిక సంవత్సరంలో రూ.100,82,09,53,640 (100 బిలియన్లు పైగా), 2012-13 ఆర్థిక సంవత్సరంలో రూ.95,49,32,53,954 (95 బిలియన్లు పైగా), 2013-14 ఆర్థిక సంవత్సరంలో నవంబర్‌ 15వ తేదీ వరకు రూ.31,66,59,76,705 (31 బిలియన్లు పైగా) భారత్‌కు వచ్చాయి. ప్రతి ఏటా దాదాపు 160కి పైగా దేశాలకు చెందిన సంస్థలు, వ్యక్తులు ఈ నిధులను వివిధ రాషా్ట్రల్లోని స్వచ్ఛంద సంస్థలకు పంపిస్తున్నారు.

  21. వాహెద్ says:

    వేణుగారు చాలా మంచి వ్యాసం. విశ్లేషణాత్మకంగా సాగింది.
    ’’నిజంగా ముస్లిం పాలకులు బలప్రయోగం ద్వారా, బ్రిటిష్ పాలకులు ప్రలోభాల ద్వారా మతాంతరీకరణ జరపదలచుకుని ఉంటే భారత సమాజంలో ముస్లింల, క్రైస్తవుల నిష్పత్తి ఇంత తక్కువగా ఉండేది కాదు.‘‘… ఈ వాక్యాలు చదివినప్పుడు శ్రీపాద రాసిన ’’ఇలాంటి తవ్వాయి వస్తే…‘‘ కధ గుర్తుకు వచ్చింది.
    ఘర్ వాపసీ గురించి గురించి మీరు రాసిన పంక్తులు ’’ఇతర మతస్తులు గతంలో హిందూ మతంలో ఉన్నవాళ్లే అని వాదనకోసం ఒప్పుకున్నా, వారు తిరిగివస్తే ఏ కులంలో చేర్చుకుంటారనే ప్రశ్నకు సంఘపరివార్ దగ్గర జవాబు లేదు. పూర్వీకుల కులంలోకే వెళతారని కొందరు, కోరుకున్న కులంలోకి వెళ్లవచ్చునని కొందరు అంటున్నారు. …‘‘ అని రాశారు. ఇక్కడ ఒక విషయం గుర్తించవలసిందేమిటంటే, ఇస్లామ్ అనే మతం కేవలం 1400 సంవత్సరాల ముందు మాత్రమే చారిత్రకంగా ఉనికిలోకి వచ్చింది. అంతకు ముందు ముస్లిమ్ అనేవాడు (ఇస్లామీయ సైద్ధాంతిక విశ్వాసాల ప్రకారం మాట్లాడడం లేదు… చారిత్రకంగా మాట్లాడుతున్నాను) ఎవడూ లేడు. కాబట్టి అప్పుడు ముస్లిములుగా మారినవాళ్ళందరూ మతం మార్చుకున్నవాళ్ళే. ఇక్కడ కూడా ముస్లిముల పూర్వికులు మతం మార్చుకున్నవాళ్ళని చెప్పడంలో నాకు పెద్ద అభ్యంతరాలు కనబడడం లేదు. ఎవరికి ఇష్టమైన మతంలోకి వాళ్ళు వెళ్ళారు. అంతే. ఇప్పుడు ముస్లిములుగా ఉన్నవాళ్ళు వాళ్ళకు నచ్చిన మతం కాబట్టి ఉంటున్నారు.
    ఇప్పుడు ఈ పునరాగమనాలు, పునస్సమాగమాల సెంటిమెంటల్ కథ వెనుక ఉన్న కొన్ని వాస్తవాలను కూడా గమనించాలి. ఈ వాస్తవాలను గమనిస్తే ఘర్ వాపసీ ద్వారా తిరిగి వచ్చినవాళ్ళు ఏ కులంలోకి వస్తారన్న ప్రశ్నే ఉదయించదు. ఎందుకంటే అసలు ఘర్ వాపసీ అనేదే ఒక కౌంటర్ ఎత్తుగడ. మత మార్పిళ్ళను పూర్తిగా నిషేధిస్తే ఇలాంటి ఘర్ వాపసీలు ఉండవంటూ బిజేపి నేతలు చేసిన వ్యాఖ్యలు గమనించండి. ఒక మౌలికమైన హక్కును హరించడానికి, మతస్వేచ్ఛను పూర్తిగా నిరాకరించడానికి వేసిన ఎత్తుగడ మాత్రమే ఇది. ఘర్ వాపసీపై ముస్లిం, క్రయిస్తవ సంఘాలు ఆందోొళన చేస్తాయని, సెక్యులర్ సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తాయని వారికి తెలుసు. ఈ ఆందోళనలను సాకుగా చూపించి మతస్వేచ్ఛను కబళించేలా మతమార్పిళ్ళ నిషేధాన్ని అమలు చేయాలన్నదే అసలు పథకం. ఇప్పుడు శ్రీపాద రాసిన ’’ఇలాంటి తవ్వాయి వస్తే…‘‘ కధ గురించి కూడా ఆలోచించండి. చెరువు నీళ్ళ కోసం నాల్కలు ఎండిన నిమ్నకులాలు ఏ చెరువులోకి దూకాలి? అలాంటి అవకాశాలు లేకుండా చేయాలంటే, నిమ్నకులాలను అణిచి ఉంచాలంటే, ఘర్ వాపసీ వంటి కార్యక్రమాల ద్వారా ఆందోళనాకరమైన పరిస్థితి సృష్టించి మతస్వేచ్ఛను కట్టడి చేయడానికి వేసిన పథకం తప్ప ఇందులో ఘర్ వాపసీ ఏదీ లేదు.
    ఈ వ్యాసంపై వచ్చిన కామెంట్లలో సీతారామయ్య గారి కామెంటుకు ప్రతిస్పందించడం అవసరమనిపిస్తోంది.. సీతారామయ్య గారు రాసిన పంక్తులు ’’డిల్లీ సుల్తానేట్ ఏర్పాటు చేసిన ముస్లింలు ఆఫ్ఘన్లు. ముందు దోచుకోవటానికీ తర్వాత పరిపాలించటానికీ వచ్చారు. రెండు మూడు శతాబ్దాల తర్వాత వచ్చిన ముఘల్ పాలకులు మంగోలులు. ఈ రెండు జాతుల ముస్లిం పాలకుల్లో కనీసం కొందరు భారత దేశాన్ని షరియా సూత్రాల ప్రకారం పరిపాలించారు. ముస్లిమేతరుల మీద జిజ్యా పన్ను విధించారు. ఇంకొక దేశాన్ని ఆక్రమించి ఆ దేశ ప్రజల మీద మత సంబంధమైన పన్ను కట్టించడానికి వీరికి ఎంత మత దురహంకారం ఉండాలో ఆలోచించండి. వీళ్ళ ముందు సంఘ్ పరివార్ వారు ఛోటా గుండాల్లాగా కనబడతారు ‘‘…ఇందులో జిజియా పన్ను గురించి రాశారు. సీతారామయ్య గారు ఆ కాలంలో ప్రభుత్వాలు విధించిన మొత్తం పన్నుల గురించి వివరంగా రాస్తే బాగుండేది కదా.. షరియా ప్రకారం ముస్లిములు పన్నులు కట్టకుండా బతికేశారా? షరియా ప్రకారం జకాత్ ప్రభుత్వానికి పన్నులాగా చెల్లించకుండా ముస్లిములను ఆ ప్రభుత్వాలు వదిలేశాయా? ఈ సుల్తానుల కాలంలో ముస్లిం పౌరులు జకాత్ ఎంత చెల్లించేవారు? ముస్లిమేతరులు జిజియా ఎంత చెల్లించేవారు? ముస్లిమేతరుల నుంచి జకాత్ వసూలు చేసినట్లు ఎక్కడా లేదు. వాస్తవమేమంటే, ముస్లిమ్ పౌరుల నుంచి జకాత్ వసూలు చేసేవారు, ముస్లిమేతర పౌరులనుంచి జిజియా పేరుతో పన్ను వసూలు చేసేవారు. ముస్లిమేతరులపై జకాత్ విధించే అవకాశం షరియా ప్రకారం లేదు. కాని ఈ వివరాలేవీ చెప్పకుండా, జిజియా అంటే జుట్టుపన్ను, గెడ్డం పన్నంటూ అపార్ధాలు ప్రచారం చేస్తూ, ఈ జుట్టు పన్ను కేవలం హిందువులపైనే వేసేవారని చెప్పడంలో వాస్తవమెంత?
    ఇక మరో విషయం బలవంతంగా మతమార్పిళ్ళు జరపగలరా? సీతారామయ్య గారు చెప్పిన మంగోలులు మొదట ముస్లిములు కాదు, వారు ముస్లిములుగా ఎలా మారారు? వారిపై ముస్లిం సైన్యాలు దండెత్తి వారిపై ప్రభుత్వం చేశాయా? నిజానికి మంగోలులే ముస్లిం రాజ్యాలపై దండెత్తి సర్వనాశనం సృష్టించారు. మంగోలు దండయాత్రల్లో ముస్లిం రాజ్యాలు ఎలా నాశనమయ్యాయో చరిత్ర చదవండి. ఆ మంగోలులే.. విజేతలుగా ముస్లిముల భూభాగాలను ఆక్రమించుకున్న మంగోలులే తర్వాత ముస్లిములాగా మారారన్నది చరిత్రలోని వాస్తవం. మరో విషయం చెప్పమంటారా? ప్రపంచంలో ముస్లిమ్ జనాభా అత్యధికంగా ఉన్న ఇండోనేషియాపై ముస్లిం సైన్యాలు, సుల్తానులు చరిత్రలో ఎప్పుడైనా దండయాత్రలు చేశాయా? అక్కడ ముస్లిం సైన్యాలు కాలుమోపాయా? మరి ఇండోనేషియా, అలాగే మలేషియా వంటి దేశాల్లో ప్రజలు ముస్లిములుగా ఎలా మారారు?
    బలవంతం, ప్రలోభాలతో ఎవరి మతాన్నయినా మార్చడం సాధ్యం కాదు. అసలిలాంటి మతమార్పిళ్ళను ఎవరు సమర్ధించరు కూడా. నిజానికిప్పుడు ఇరాక్ గా ఉన్నది ఒకప్పటి మెసపొటేమియా. చరిత్రలో అత్యంత బలమైన పర్షియన్ సామ్రాజ్యం అది. పర్షియన్ చక్రవర్తి ఖుస్రో కాని, అతని ప్రజలు కాని ముస్లిములు కాదే. వాళ్ళు కూడా తర్వాతనే ముస్లిములుగా మారారన్నది చరిత్ర. మరో విషయం చెప్పమంటారా, ఇస్లామ్ ప్రవక్త ముహమ్మద్ (స) స్వంత తాత, ప్రవక్తకు కొండంత అండగా ఎల్లప్పుడు నిలబడిన అబ్దుల్ ముత్తలిబ్ చివరి శ్వాస వరకు ముస్లిమ్ కాలేదు. ఆయనకు నచ్చిన మతంపైనే ఆయన ఉన్నాడు. కాని ప్రవక్త ముహమ్మద్ (స)కు తన తరఫున పూర్తి సహకారం అందించాడు. ప్రవక్త (స)పై సైన్యాలు నడిపించిన సుఫ్యాన్ నిజానికి వ్యాపారంలో ప్రవక్త (స)కు భాగస్వామి. చరిత్ర మనకు చాలా పాఠాలు చెబుతుంది. మనం ఎలాంటి సంకుచితభావాలను ఇప్పుడు పెంచి పోషిస్తున్నామో అలాంటి భావాలు చరిత్రలో చాలా తక్కువగా కనబడతాయి. కనీసం మన సమీప చరిత్రలో కూడా ఇలాంటి సంకుచిత భావాలు లేవు.
    సీతారామయ్య గారు రాసిన మరో మాట ’’దేశ విభజనకు ముందు భారత దేశంలో ముస్లింలు 25% అని చదివాను ఎక్కడో. దేశాన్ని విభజించి రెండు ముస్లిం దేశాలు ఏర్పాటు చేసిన తర్వాత కూడా భారత దేశంలో ముస్లింల జనాభా ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. ఇది తక్కువా ఎక్కువా?‘‘ ఈ ప్రశ్న అడిగే ముందు సీతారామయ్య గారు, దేశవిభజన తర్వాత దేశంలో ముస్లిము జనాభా శాతం ఎంత? ఇప్పుడు ఎంత శాతం ఉంది? ముస్లిముల జనాభా పెరుగుదల రేటు ఎంత? హిందువుల జనాభా పెరుగుదల రేటు ఎంత? రెంటికీ మధ్య ఎంత తేడా ఉంది? ఆ తేడా రావడానికి కారణాలు ఏమిటి? వగైరా ప్రశ్నలపై కూడా కాస్త ఆలోచించండి. ఈ ప్రశ్నలకు జవాబులు పెద్ద కష్టం కాదు. కాస్త ఓపిగ్గా గూగుల్లో వెదికితే జవాబులు దొరకవచ్చు.

    • Srinivas Vuruputuri says:

      I don’t think, it is right to compare Zakat and Jizya and argue that one applies to Muslims and the other to non-muslims.

      Here is how Islamic State (ISIS) put it recently:

      “It said Christians who wanted to remain in the “caliphate” that the Islamic State declared this month in parts of Iraq and Syria must agree to abide by terms of a “dhimma” contract—a historic practice under which non-Muslims were protected in Muslim lands in return for a special levy known as “jizya.”

      “We offer them three choices: Islam; the dhimma contract – involving payment of jizya; if they refuse this they will have nothing but the sword,” the announcement said.”

      And this is what Quran (4:29) said:

      “Fight those from among the People of the Book who believe neither in God, nor in the Last Day, nor hold as unlawful what God and His Messenger have declared to be unlawful, nor follow the true religion, until they pay the tax willingly and agree to submit”

      And here is the example of the Prophet:

      Muhammad commanded his military leaders to fight “those who disbelieve in Allah. Make a holy war, do not embezzle the spoils; do not break your pledge; and do not mutilate (the dead) bodies; do not kill the children. When you meet your enemies who are polytheists, invite them to three courses of action. If they respond to any one of these, you also accept it and withold yourself from doing them any harm. Invite them to (accept) Islam; invite them to migrate from their lands; If they refuse to migrate, if they refuse to accept Islam, demand from them the Jizya. If they agree to pay, accept it from them and hold off your hands. If they refuse to pay the tax, seek Allah’s help and fight them.”

      How can one, then, insist that Jizya is Zakat’s alternative? If it were so just, why do we hail Akbar’s abolition of it, even now?

    • Nagarjuna says:

      బలవంతంగా మతమార్పిళ్ళు జరపగలరా? బలవంతం, ప్రలోభాలతో ఎవరి మతాన్నయినా మార్చడం సాధ్యం కాదు

      పాకిస్థాన్,బంగ్లాదేశ్ లో హిందు బాలికలను బలవంతంగా ఎత్తుకొని వేళ్లి, పెళ్ళి చేసుకొని మతం మారుస్తున్నరనే వార్తలు తరచుగా పేపర్లలో వస్తూంటాయి. ఆ దేశంలోని మేధావులు వీటీపై నిరసనలు తెలిపిన సందర్భాలు ఉన్నాయి. ఇక చరిత్రలోకి ఒకసారి తొంగి చూస్తే ఇస్లాం మతంలోకి బలవంతంగా మత మార్పిడులు జరిగినట్లు లెక్కలేనన్ని ఉదంతాలు ఉన్నాయి.

      Despite Hemu’s numbers, Akbar’s force won the battle. Hemu was captured and beheaded. His skull was sent to Kabul for display outside the ‘Delhi Darwaza.[citation needed] His torso was sent to Delhi and hanged outside Purana Quila on a “gibbet: to intimidate the Hindu population. Hemu’s wife escaped from Purana Qila, with the treasures of the fortress, and remained untraceble. Bairam Khan ordered mass executions of Hindus which continued for many years.[14] Hemu’s relatives and close Afghan supporters were caught and many of them beheaded.[15] Minarets were made of their skulls at different places. Hemu’s 82 year old father who had escaped to Alwar was traced after six months, and was beheaded for refusing to convert to Islam.[14]

      http://en.wikipedia.org/wiki/Second_Battle_of_Panipat

      There would’ve been no Islam without forced conversions: తస్లిమా
      http://www.indiatomorrow.co/nation/2418-there-would-ve-been-no-islam-without-forced-conversions-taslima

    • Nagarjuna says:

      *ఇతర మతస్తులు గతంలో హిందూ మతంలో ఉన్నవాళ్లే అని వాదనకోసం ఒప్పుకున్నా,
      వాదన కోసం ఒప్పుకొనేది ఎమిటి? వాస్తవమైతే! ఎంత మంది విదేశీ అన్యమతస్థుఇఉ ఈ దేశానికి వచ్చి స్థిరపడ్డారు?
      *వారు తిరిగివస్తే ఏ కులంలో చేర్చుకుంటారనే ప్రశ్నకు సంఘపరివార్ దగ్గర జవాబు లేదు*
      మీరేసిన ప్రశ్నలలో కొత్త దనం ఎమీ లేదు. హిందువుల కుల వ్యవస్థను ఆసరా తీసుకొని,వారిని ఇరుకున పెడదామని దాదాపు వందేళ్ల క్రిత0 నాటి ప్రశ్నలు. ఈరోజుల్లో పరిస్థితి చాలా మారింది. మిగతా మతాల వారితో పోలిస్తే హిందూ సమాజం ఎంతో మారింది. నేటి సమాజంలో ప్రజలు అగ్రవర్ణనికి చెందినంత మాత్రాన వాళ్ళని ఉన్నతులుగా పరిగణించటంలేదు. అగ్రవర్ణాల వారే వెనుకబడిన వర్గాల వారి గా గుర్తింపు కోసం తహతహ లాడుతున్నరు. కొంత మంది తెగించి దొంగ సర్టిఫికేట్ లు పెట్టుకొని రిసర్వేషన్ సౌకర్యం పొందటానికి ప్రయత్నిస్తున్నారు. నేడు ప్రతి కులాన్నిఎదో ఒక రిసర్వేషన్ కేటగిరిలో చేర్పించాలనే డిమాండ్లు పెరిగాయి. రి కన్వర్షన్ అయి తే ఏ కులానికి చెండుతాడు అనే అంశంపై గాత వారం సుప్రీం కోర్ట్ జడ్జ్ మెంట్ ఇచ్చింది.

      A person can be accorded SC status on his reconversion to Hinduism: SC
      http://www.firstpost.com/india/person-can-accorded-sc-status-reconversion-hinduism-sc-2124139.html

  22. వేణు గారిలాంటి మేధావులకు ఇవన్నీ తెలియనివి కావు.
    కాని వేల సంవత్సరాలుగా హిందూ మతం లోని బ్రాహ్మణీయ భావజాలం సాటి మనుషులను అత్యంత దారుణంగా , నీచంగా , పశువులకంటే హీనంగా , బానిసలుగా చూడటం , అన్ని రకాల అవకాశాలకు దూరంగా వుంచడం — ఇవన్నీ కూడా దేశంలో హిందువుల పట్ల , హిందూ సమాజం పట్ల వ్యతిరేకతకు కారణమైనాయి.
    ఈ సందర్భంలోనే ఇతర మతస్థులు , పరిపాలకులు అలాటివారిని చేరదీసి , వారికి కొన్ని సదుపాయాలు కల్పించడం , వారిని అక్కున చేర్చుకోవడం జరిగింది. అదే వారిని ఇతర మతాలలోకి ప్రవేశించడానికి కారణమయిన విషయం మనం మరువకూడదు.
    కాలం గడిచేకొద్దీ కొంతమేర మార్పులు జరిగినా , హిందువులుగా చెప్పుకొనేవారిపట్ల మెజారిటీ ప్రజలు వ్యతిరేకంగానే వున్నారు.అందుచేతనే హిందూమతానికి వ్యతిరేకంగా ఎలాటి కార్యక్రమాలు జరిగినా , హిందువులు ఎక్కువగా స్పందిచడం లేదు. కొద్దిమంది మాత్రం , సంఘపరివార్ లాటి సంస్థలు , హిందువులను సంఘటిత పరచడానికి ప్రయత్నాలు చేస్తూనే వున్నాయి.
    ప్రపంచవ్యాప్తంగా ఇతర మతస్తులు ప్రజలపట్ల దారుణంగా ప్రవర్తించడాన్ని , దేశంలో జరుగుతున్న బాంబు దాడులకు సెక్యులరిస్టులుగా చెప్పుకుంటున్నవారి స్పందన ఆశించినంతగా లేదని కొందరి వాదన.
    దేశంలో మైనారిటీలపట్ల జరుగుతున్న దాడులకు స్పందించినవారు , మైనారిటీల చర్యల పట్ల ఏవిధమైన నిజనిర్ధారణ కమిటీలు వేయడానికిగాని , రిపోర్టులు వ్రాయడానికిగాని ఆశించినంతగా ముందుకు రాలేకపోతున్నారని ప్రచారం జరుగుతోంది.
    అందుకే అన్యమత ప్రచారాలపట్ల , మతమార్పిడులపట్ల హిందువులు ఆచి తూచి స్పందించడం జరుగుతోంది.
    ఈ పరిణామాలు పాలకులకు వుపయోగపడేవేగాని , సామాన్య ప్రజల అభివ్రుధ్ధికి దోహదపడేవి కావు.
    అసమానతలు లేని సమాజం , ప్రజలందరకు అన్ని రంగాలలో సమాన అవకాశాలు కల్పించడం జరగనంతవరకు ఇలాటి ఘర్షణలు , వాదనలు తప్పవు.
    ప్రజలను ఈ దిశలో నడిపించవలసిన మేధావులు కూడా ఈ వాదనలవరకు వచ్చి ఆగిపోతున్నారు తప్ప , ప్రజలందరిని [ అన్ని మతాల వారినీ ] చైతన్యపరిచే కార్యక్రమం సమర్ధవంతంగా చేపట్టడం లేదు. అంతవరకూ ఈ వాదప్రతివాదనలు జరుగుతూనే వుంటాయి.

    • Manjari Lakshmi says:

      జయప్రకాశ్ రాజు గారు,
      మీ పై కామెంట్ బాగుందండీ. చాలా బాలన్సు గా చెప్పారు.

  23. ari sitaramayya says:

    వాహెద్ గారూ,

    నాక్కూడా చరిత్ర అంటే ఇష్టం.

    “ప్రపంచంలో ముస్లిమ్ జనాభా అత్యధికంగా ఉన్న ఇండోనేషియాపై ముస్లిం సైన్యాలు, సుల్తానులు చరిత్రలో ఎప్పుడైనా దండయాత్రలు చేశాయా? అక్కడ ముస్లిం సైన్యాలు కాలుమోపాయా? మరి ఇండోనేషియా, అలాగే మలేషియా వంటి దేశాల్లో ప్రజలు ముస్లిములుగా ఎలా మారారు?” అని అడిగారు మీరు.

    అవును దండయాత్రలు చేశాయి. ముస్లిం సైన్యాలు జావాను ఆక్రమించుకున్న తర్వాతే హిందూ రాజ్యం ముస్లిం రాజ్యం అయింది. అంతకు ముందే జావాలో ఇస్లాం ఉన్న మాట వాస్తవం. కానీ మూకుమ్మడిగా మత మార్పిడి జరిగింది డెమాక్ సుల్తానులు మహాపహిత్ రాజ్యాన్ని జయించిన తర్వాతనే.

    అయితే మీకు ఇంకొక సమాధానం కూడా ఇవ్వాలి. ముస్లిం రాజులందరూ ఒకే విధంగా ప్రవర్తించరు. ఇండోనేషియాలో జరిగినట్లే ఇండియాలో జరగాల్సిన అవసరం లేదు. పర్షియాను అరబ్బులు ఆక్రమించుకున్న తర్వాతే అక్కడ ఇస్లాం వచ్చింది. దక్షిణ అమెరికాను స్పానిష్ వాళ్ళు ఆక్రమించుకున్నాకే అక్కడ క్రైస్తవ మతం ఏర్పడింది. భారత దేశంలో ఎం జరిగిందో చెప్పటానికి ఈ ఉదాహరణలు ఇస్తే సరిపోతుందా? లేక ఇండియాలో ఎం జరిగిందో తెలుసుకోవాలా?

    “బలవంతం, ప్రలోభాలతో ఎవరి మతాన్నయినా మార్చడం సాధ్యం కాదు. ”
    “మనం ఎలాంటి సంకుచితభావాలను ఇప్పుడు పెంచి పోషిస్తున్నామో అలాంటి భావాలు చరిత్రలో చాలా తక్కువగా కనబడతాయి. కనీసం మన సమీప చరిత్రలో కూడా ఇలాంటి సంకుచిత భావాలు లేవు.”

    వలస సర్వ సాధారణం. వలస లేకపోతే మనుషులు ఆఫ్రికాలో మాత్రమే ఉండేవారు. వలస వెళ్ళిన వారు వారి శక్తిని బట్టి అప్పటికే స్థానికంగా ఉన్న వారిమీద తమ అధికారం చలాయించారు. తమ మతాన్ని బలపయోగం ద్వారా, ప్రలోభాల ద్వారా విస్తరించారు. ఇది ప్రపంచంలో అన్ని చోట్లా జరిగింది.

    సమీప చరిత్రలో జరగలేదంటున్నారు మీరు. కొరియా యుద్ధం తర్వాత కొరియాలో క్రైస్తవ మత విస్తరణ ఎంతగా జరిగిందో చూడండి.

    మీరన్నారే, చరిత్ర చదవండి, అని. మీరు కూడా చదివితే మంచిదని వినయపూర్వకంగా మనవి.

  24. A M Khan Yazdani ( Danny) says:

    ఘర్ వాపసి యాగ ఫలితాలు, హరామ్ జాదే కు జవాబు సంఘ్ పరివారానికి ఢిల్లీ ప్రజలు తమదైన పధ్ధతుల్లో ఇచ్చేశారు. అలాంటి జవాబులు ఇతర ప్రాంతాలవాళ్ళూ ఇవ్వాల్సే వుంది.

    “(ఘర్ వాపాసీ) అసలు లక్ష్యం ఇతర మతాల పట్ల ద్వేషం. ఇతర మతస్తుల పట్ల ద్వేషం. మతాల మధ్య, మనుషుల మధ్య భేదాన్ని, అసహనాన్ని, అనుమానాన్ని, విద్వేషాన్ని, రక్తపిపాసను, హంతక దాడులను ప్రోత్సహించి, మతం పెట్టుబడిపై రాజకీయ లాభాలను సంపాదించదలచిన క్షుద్రక్రీడ అది”.

    “పూర్వీకుల కులంలోకే వెళ్లవలసి ఉంటే ఘర్ వాపసీ కి అర్థం లేదు. కోరుకున్న కులంలోకి వెళ్లే అవకాశం ఉంటే హిందూ మతమే మిగలదు.”

    ఎన్ వేణుగోపాల్ వ్యాసంలో కీలకపైన ప్రతిపాదనలివి. చర్చ వీటికి పరిమితమై సాగితే బాగుంటుంది.

    “అసలు ఘర్ వాపసీ అనేదే ఒక కౌంటర్ ఎత్తుగడ. మత మార్పిళ్ళను పూర్తిగా నిషేధిస్తే ఇలాంటి ఘర్ వాపసీలు ఉండవంటూ బిజేపి నేతలు చేసిన వ్యాఖ్యలు గమనించండి. ఒక మౌలికమైన హక్కును హరించడానికి, మతస్వేచ్ఛను పూర్తిగా నిరాకరించడానికి వేసిన ఎత్తుగడ మాత్రమే ఇది.” అంటూ వాహెద్ చేసిన వ్యాఖ్యకూడా విలువైనది.

  25. వ్యక్తులుగా ( as individuals ) మన పరిధిలోకి వచ్చే అంశాల మీద, మనం ఏదో ఒక చర్య తీసుకోగల అంశాల మీద మనం చర్చించడం మంచిది. నాకు తెలిసి, సంఘం, మతం, దేశం, జాతి, ప్రభుత్వం, చట్టాలూ, సంస్థలూ – ఇవి అలాంటి అంశాలు కావు. ఎవఱో మతం మారుతున్నారు. ఇంకెవఱో వారిని మారుస్తున్నారు. ఓకే. కానీ వ్యక్తిగతంగా మనం ఏం చేయగలం? ఏమీ చెయ్యలేం.

  26. Sivakumara Sarma says:

    ఈ వ్యాఖ్యకి పెట్టిన శీర్షికతో రచయితల బుజాన పెద్ద భారాన్ని మోపారు వేణు గారు. “సన్యాసీ సన్యాసీ రాసుకుంటే రాలేది బూడిద” అన్న సామెతలోలాగా రచయితలు తోటి రచయితలతో తర్కాలు జరిపితే వెలువడేదేమిటి? ఇలాంటి తర్కాల్లో మూడు వర్గాలేర్పడడం సహజమే – రెండు వర్గాలు “తాము చెప్పేదే సరయినది” అనేవయితే, మూడవది, వర్గాల ప్రతిపాదనలతో ప్రమేయం లేకుండా వాదాల్లోని అంశాలని ఒపుకునేవాళ్లది. ఇంక రచయితలకి మిగిలే పాఠకులెవరు?

  27. కాలం మారేకొద్దీ జీవులను మనుషులుగా తయారు చేయక వాళ్ళ మెదడ్లలో కుల మతాల ఇంజక్షన్లు పొడిచి ముక్కలు చేసి మతాల సీసాల్లో ఇరికించి కేవలం అధికార దాహం తీర్చుకోవడానికే అని ఇప్పుడు చాల మందికి అర్థం అవుతోంది. ప్రజలు సుఖమయ జీవితం వైపు అడుగులు వేస్తున్నారు కానీ మరో వైపు కాదు అయినా మీ వేదన అర్థవంత మైనది ఆలోచించ వలసినది మీ హృదయానికి ధన్యవాదాలు.

  28. డియర్ వేణూ ,

    మీ వ్యాస౦ దానిమీద వచ్చిన స్పందనా చదివాను.
    ఘర్ వాపసి చాలా కుట్రతో వున్న నినాదం. దీనిమీద కవిత రాసి సారంగకు పంపిన మర్నాడే మీ వ్యాసం చదవడ౦ చాలా స్ఫూర్తిగా వుంది.

    కొండేపూడి నిర్మల

  29. A RAKUMARI says:

    వేణుగారు గారు నేను rss ను సమర్ధించను ఘర్వాపసి పట్ల నాకు గౌరవం కూడా ఏమి లేదు కాని మీరు హిందువులని క్రైస్తవ లో కి మతం మార్చటాని కి పెద్ద పెద్ద సభలు జరుగుతాయి వాటి పట్ల కూడా ఇదే విధంగా స్పందించి వుంటే ఇప్పుడు మిమ్ములని అంగీకరించే వారము కాని మీకు అవి అసలు తెలియదనుకుంటా ఘర్వపసి గురించి మీ ఆందోళన గమ్మతుగా వుంది rss వర్గాలు ఒక్క అమెరికానుండే హుందు మత వ్యాప్తి కోసం పంపే మనీ ఎ మార్గాల ద్వారా వస్తుందో చక్కగా చెప్పారు అలాగే క్రైస్తవ మతం లో కి హిదువులని మార్చటానికి ఇండియా లో జిహాద్ కోసం ఎంత మనీ ఎ మార్గాల ద్వారా వస్తుందో చెప్పాలి అవేమి తెలియని అమాయకులు మీరు అని నేను అనుకోను ఇతర మతస్తులు అంటే మతం మరిన హిందువులు హిందు మతాన్ని హీన పరస్తు మాట్లాడే మాటలు మీకు అసలు తెలియవా నా పెళ్లి ఐన కొత్తలో
    మతం మారిన మా ఆడపడుచు కోసం మా ఇంటికి వచ్చిన క్రైస్తవ మత ప్రచారకుడు విగ్రహాన్ని ఆరాధినచమంటే విగ్రహంతో వ్యభిచారం చేయటమే అన్నాడు ఇంకొకసారి ఆ మాట అంటే చెప్పుతో కొడతాను అని చెప్పను చర్చికి వెళ్ళటమంటే శిలువతో వ్యభిచారం చేయటమే అని చెప్పను అక్కడే వున్నా మా అత్తగారు అలానా కూడదు వాళ్ళు అంతే మాట్లాడతారుఅన్నారు ఆవిడా హిందువే విగ్రహంతో వ్యభిచారం చేయటమే అంటే మాట్లాడని అవిడ వారిగురించి మాటలాడ గానే స్పందించారు హిందులు ఇలాగె వుంటారు వాళ్ళే చైతన్యంతో వుంటే మీలాంటి వాళ్ళు వుండరు అసలు ఘర్వాపసి కుడా ఉందదు నేను హిందువుని అని గర్వంగా చెప్పుకునే దళితులు నాకు తెలుసు మా ఊరిలోనే వున్నారు చాలా చాలా నిజాయితి గా వుంటారు హిందువులుగా వారు చాలా హీనమైన స్థిలో వుండేవారు వారు ఈ ఏమాత్రం భాద్యత గా ఉండవలసిన అవసరం లేదు మనం అంటే అగ్రవర్ణలా వారు వారితో వ్యవహరించిన విధానానికి కాని చాల భాద్యతగా సహనం వ్యవహరిస్తున్నారు ఈ సమాజం తో. వారి ప్రవర్తనలో సంస్కారం వుట్టిపడుతుంది ఇప్పటికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు వారు చాల సహనంగా మార్పు కోసం ఎదురు చూస్తూ అంది వచ్చిన అవకాసాలను అంది పుచుకుంటూ ఎదుగుతున్నారు వారికి తెలుసు ఎ సమాజం కూడా లోపాలు లేకుండా లేదని హిందు మతం ఒక్కటే అసహనం తో లేదని. నాకు తెలుసు వేరే మతాలను చూసి నేర్చుకోవలసింది ఏమి లేదు హిందువులు, అన్ని మతాలు ఒక్కటే అని , మతం మనిషిని ముర్కుడిని చేస్తుందని తెలుసు,కాని హిందు మతం గుంచి మాత్రమె వ్రాసేవారిని అలాగే vadileyata అంటే కొత్తమతాన్ని సృష్టించినట్లే మీరు గతం లో క్రైస్తవ జిహదల వ్యాప్తి కోసం జగుగుతున్న విసయాల గురించి ఇక్కడిన వ్రాసి వుంటే ఇవ్వన్ని నేను వెనక్కు theesukuntanu

Leave a Reply to D Subrahmanyam Cancel reply

*