‘కోయీ అకేలా హై కహా..’

Krish.psd

గదిలో కూర్చుంటే చలి. కాని రోడ్డుపై నడుస్తుంటే చలి ఎక్కడిది? నేలపై పాకుతున్న పొగమేఘాలు. సాయంత్రం అయిదింటికే గూళ్లకు చేరాలని తపిస్తున్న పక్షుల చప్పుళ్లు. ఒక వృద్ద చిరు వ్యాపారి ముందు నిప్పుల మధ్య కాలుతున్న పల్లీల వాసన. చెట్టుక్రింద నిలబడి వేటి వేడి టీ తాగుతూ కబుర్ల వేడిలో మునిగిపోయిన ఉద్యోగులు. బస్‌స్టాప్ వద్ద గుంపులు గుంపులుగా ఆతురతతో ఎదురు చూస్తున్న జనం. రోడ్డు దాటడానికి అవస్థ పడుతున్న గృహిణి. దృశ్యాలు మనసు తెరలపై ఇంకిపోతుంటే ఏదో ఒక పాట నిన్ను నిలిపేస్తుంది. పాదాలకు నడుస్తున్న విషయం కూడా తెలియదు.. 

‘ఆభిజా.. ఆభిజా.. ఏ సుబా ఆభిజా.. రాత్‌కో కర్ విదా.. దిల్‌రుబా ఆభిజా..’ ఎక్కడ విన్నాం ఈ పాట. అనువదించగలమా? ‘రావెరా.. రావెరా.. ఉదయమా రావెరా రాత్రినీ సాగనంపీ.. ప్రియతమా.. రావెరా..’ ఈపాట రాసిందెవరు? నిదా ఫాజిలీ కదా? ఎవరీ నిదా ఫాజిలీ? ఏదైనా పాటో, కవిత్వమో నచ్చిందంటే దాని పాదముద్రల వెంట పయనించడం మానవా? 

‘దునియా  జిసే కహతే హై జాదూకా ఖిలోనా హై.. మిల్ జాయెతో మిట్టీ హై, ఖో జాయెతో సోనా హై.’. ( ఈ ప్రపంచమొక అద్భుత ఆటబొమ్మ.. దొరికితే మట్టే.. పోగొట్టుకుంటే బంగారం) అన్న ప్రసిద్ది చెందిన వాక్యాలు రాసిన నిదా ఫాజిలీ గ్వాలియర్ వీధుల్లో సంచరిస్తూ కవిత్వాన్ని మనసులో ఒంపుకున్నాడు. ఒకరోజు వీధుల్లో నడుస్తూ గుడిలోంచి వినిపిస్తున్న సూర్‌దాస్ భజన విన్నాడు. కృష్ణుడికోసం తపిస్తూ రాధ తన చెలికత్తెల వద్ద విషాదంగా ఆలపిస్తున్న మధుర గీతిక అది. గురుదత్ ‘ప్యాసా’ కోసం సాహిర్ లూధియాన్వీ రాసిన ‘ఆజ్ సజన్ మొహె అంగ్ లగాలో.. జనమ్ సఫల్ హోజాయే..’ అని గీతాదత్ గొంతుకతో వహిదా రహమాన్ తపించిన గీతిక లాంటి పాట అది. అంతే. నిదా ఫాజిలీ కవి అయ్యారు. . 

1938లో జన్మించిన నిదా ఫాజిలీ తన తండ్రి దేశ విభజన తర్వాత పాకిస్తాన్ వెళ్లినప్పటికీ భారత్‌లోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. సూర్‌దాస్, కబీర్ , మీరా ఆయనను భారత్‌లోనే పట్టి ఉంచారు. ఢిల్లీలో జన్మించి, మన హైదరాబాద్‌లో మరణించిన డాగ్ దెహ్లివీ (నవాబ్ మీర్జాఖాన్) ప్రాచుర్యం పొందిన కవితా శైలిని కాదని తనదంటూ కొత్త శైలిని ప్రవేశపెట్టిన కవి నిదా ఫాజిలీ. నాటి ఉర్దూ కవులు కైఫీ ఆజ్మీ, సాహిర్ లూధియాన్వీ, అలీ సర్దార్ జాఫ్రీ కవితా శైలిని విమర్శిస్తూ సంచలనాత్మక వ్యాసాలు రాశారు. అప్పటివరకూ ఉర్దూ కవిత్వంలో తచ్చాడుతున్న పర్షియన్ ప్రతీకల్ని, పదాల్నీ వదిలిపెట్టి కొత్త ప్రతీకల్ని చిత్రించిన కవి ఫాజిలీ. ‘నా మనసులో ఏముందో నా పెదాలెప్పుడూ చెప్పలేవు… నా మౌనం ఏమంటుందో ఆమె అర్థం చేసుకోలేదు.’. అని ఆయన తప్ప ఎవరు రాయగలరు? 

untitled

ముంబయిలో ఉద్యోగం కోసం వీధుల్లో తిరుగుతూ పత్రికల్లో కవితలు రాస్తున్న ఫాజిలీని కమల్ అమ్రోహి గుర్తించకపోతే ఆయన దశ తిరిగేది కాదు. ‘నీ వియోగమే నా తలరాత… నీ విషాదమే నా జీవితం’ (తేరా హిజ్ర్ మేరా నసీబ్ హై.. తేరా గమ్ హీ మేరా  హయాత్ హై) అని ‘రజీయాసుల్తాన్’ కోసం ఆయన  రాసిన పాట   హిందీ సినీ ప్రపంచంలో ఆయన స్థానాన్ని సుస్థిరం చేసింది. ‘తూ ఇస్ తరా మేరీ జిందగీమే షామిల్ హై’ ( ఈ రకంగా నీవు నా జీవితంలో చేరావు), ‘హోష్‌వాలోంకో ఖబర్ క్యా బేఖుదీ క్యా ఛీజ్ హై- ఇష్క్ కీజే ఫిర్ సమఝియే జిందగీ క్యా చీజ్ హై’ (స్పృహలో ఉన్నవాడికి ఏం తెలుసు మైమరిచిపోవడం, ప్రేమలో పడు అర్థమవుతుంది.. జీవితం అంటే ఏమిటో).. అని ఎన్నో గీతాలు రాశారు. ‘సఫర్ మే దూప్‌తో హోగీ, జో చల్ సకోతే చలో, సభీ హై బీడ్ మే తుమ్ భీ, నికల్ సకోతో చలో- యహా కిసీకో కోయి రాస్తా నహీ దేతా, ముఝే గిరాకే అగర్ తుమ్ సంబల్‌సకోతో చలో..’ ( ప్రయాణంలో ఎండ ఎలాగూ ఉంటుంది, సాగిపోగలితే సాగిపో.. అంతా జనసమ్మర్థంలోనే.. బయటకు రాగలితే సాగిపో, ఇక్కడ ఎవరూ ఎవరికి దారి ఇవ్వరు, నన్ను పడేసి నీవు నిలదొక్కుకోగలిగితే సాగిపో) అన్న అద్భుతమైన గీతాలు రాశారు. ‘గోడలంటే భయపడి దిగిపోయిన నీడలు మాట్లాడుతాయి.’. అన్న వాక్యాలు ఫాజిలీ కవితల్లో వెంటాడుతాయి. జగ్జీత్ సింగ్, చిత్రాసింగ్,కవితా కృష్ణమూర్తి లాంటి వారి గొంతుల్లో ఆయన గీతాలు  నీటిబిందువులను అలంకరించుకున్న గులాబీ పూల లాంటి అసాధారణ అందాన్ని సంతరించుకున్నాయి.

ఫాజిలీ వెంటాడడానికి మరో బలమైన కారణం ఉంది. చాలా మంది కవుల్లాగా ఆయన యదాతథ స్థితిని, యాంత్రిక జీవితాన్నీ ఇష్టపడలేదు. సినిమాల్లో పాటలు రాయడాన్ని తనంతట తాను మానుకొన్నారు. మరింత సీరియస్ కవితల్ని రాయడం మొదలు పెట్టారు. ఆయన భావాలు మరింత దట్టమయ్యాయి. ఆయన ఆలోచనల్లో మరింత గాఢత అలుముకొంది. మతతత్వంపై, ముఖ్యంగా రాజ్యాంగ యంత్రంలో ఉన్న మతతత్వంపై ఆయన కలం ఎక్కుపెట్టారు. మతఘర్షణల్ని, వాటి వెనుక ఉన్న రాజకీయ శక్తుల కుతంత్రాలను ద్వేషించారు. 1992లో ముంబైలో అల్లర్లు జరిగినప్పుడు ఆయన స్వయంగా ఒక స్నేహితుడి ఇంట్లో తలదాచుకోవాల్సి వచ్చింది. ప్రస్తుత జీవితంలోని వైరుధ్యాలను, పట్టణ జీవితంలోని కృత్తిమత్వాన్ని ఎండగడుతూ కవిత్వీకరించారు. గుజరాత్ అల్లర్లైనా, సద్దాం హుస్సేన్‌ను ఉరితీసినా ఆయన ఊరుకోలేకపోయారు. 

‘ఖుదా ఖామోష్ హై’ (దేవుడు మౌనంగా ఉన్నాడు) అన్న కవితలో ఆయన ‘నేను ఒంటరిగా అంతా చేయలేను. నీవు నాతో చేరితే కొత్త ప్రపంచాన్ని సృష్టిద్దాం..’ అని ఆయన జనాన్ని సమీకరించే ప్రయత్నం చేశారు. ‘మసీదోం మందిరోంకో దునియా మే, ముఝే పహచాన్‌తే కహా హై లోగ్’ ( మసీదులు, మందిరాల ప్రపంచంలో నన్ను జనం ఎక్కడ గుర్తు పడతారు?) అని ప్రశ్నించిన ఫాజిలీ  ‘ప్రపంచాన్ని చీకట్లో ముంచి ఆకాశంలోకి వెళ్లి దేవుడిగా మారి అంతా దగ్ధం చేస్తాను’ అని ‘ఐలాన్’ అన్న కవితలో రాశారు.. ఈ కవితలు ఇప్పుడు చదువుతున్నప్పుడు మనకు ‘పీకే’ సినిమా గుర్తు రాక మానదు. ‘కరాచీ తల్లిఅయితే ముంబాయి ఆమెనుంచి వేరుపడిన కొడుకు. ఆ పవిత్ర బంధాన్ని ఎవరూ ఈనాటికీ తెంచలేకపోయారు. తెంచలేరు కూడా.. నా తల్లి నాపై కత్తి ఎత్తలేదు.. నేను ఆమె పై తుపాకీ ఎక్కుపెట్టలేదు. ఎవరు ఎవరికోసం మరి యుద్దం చేస్తున్నారు? ఎందుకోసం ఈ ఘర్షణ?’ అని ఆయన రాశారు. ‘మసీదు గుమ్మటాలు మౌనంగా ఉన్నాయి, మందిరం గంటలు మౌనంగా ఉన్నాయి..’ అన్నారు. ‘బృందావన్ కీ కృష్ణ కన్హయ్యా అల్లాహూ.. బంసీ రాధా గీతా గయ్యా అల్లాహూ’ అన్న గీతం. ‘మౌల్వీయోంకా సాజ్దా పండిత్ పూజా, మజ్జూరోంకి హైయ్యా హైయ్యా అల్లాహూ.’. అన్న వాక్యాలతో అంతమై శ్రమైకజీవన సౌందర్యంలో దైవత్వాన్ని చూపిస్తుంది. 

‘ఆద్మీ మరా నహీ, జిందా హై ఆద్మీ షాయద్, బదన్ కి అంధీ గుఫా మే ఛుపా హోగా’ ( మనిషి మరణించలేదు.. బహుశా జీవించే ఉన్నాడు, శరీరపు చీకటి గుహలో దాక్కున్నాడు), , ‘కోయీ  అకేలా హై కహా, సాత్ హై సారా జహా ‘( ఎవ రైనా ఒంటరిగా ఎక్కడున్నారు? మొత్తం ప్రపంచం వెంట ఉంది) అన్న ఆయన కవితా వాక్యాలు విన్నప్పుడు ప్రతిఘటనా ప్రపంచంలో ధిక్కార స్వరాలు వినిపించే వారిలో నేను ఒంటరివాడిని కాదనిపిస్తుంది.


-కృష్ణుడు

మీ మాటలు

  1. మీ ఈ కృష్ణపక్షం శీర్షిక కోసం ఇష్టంగా ఎదురుచూసేలా వ్రాస్తున్నారండీ..Many thanks.

మీ మాటలు

*