గాయపడ్డ మనసులోంచి కరుణ -రసూల్ ఖాన్ “ఓడిన నేను” కవిత

ధిక్కా రం ,తిరస్కారం లాంటివి ప్రతిఫలించే అస్తిత్వోద్యమాలు తెలుగులో ఎన్నో కనిపిస్తాయి.మైనారిటీ వాద కవిత్వానికి,ఇతర అస్తిత్వ వాదాలకు మధ్య ఒక ప్రధాన వైరుధ్యముంది.దళిత, స్త్రీ వాదాలు ప్రాచీన సంప్రదాయాలమీద తిరుగుబాటుచేసాయి.అంతే కాలికంగా గతంపై ధిక్కారాన్ని ప్రకటించాయి.స్త్రీవాదం వర్తమాన భూమికపై ఉద్యమించినా ప్రధానంగా పైతృకసమాజం పై తిరస్కారాన్ని చూపింది. ఈ మార్గంలో చూస్తే ఈ సంఘర్షణ గతాన్ని తిరస్కరించేది.

మైనారిటీ కవిత్వం వర్తమానంలోని అంశంతో సంఘర్షణ పడుతుంది.ఒక దశలో ఈ సంఘర్షణ కారణాలతో విభేదించిన,ధిక్కరించిన వచనమూ లేకపోలేదు.ఇందులో గతితార్కికచర్చ వర్తమానంపై ఆధారపడింది. ఐ.ఏ.రీచర్డ్స్ కవిత్వంలో దృష్టి(Sense)భావన(Feeling)గొంతుక/స్వరం(Tone)బోధి(Intuition)గురించి చెప్పాడు. మైనారిటీ వాదానికి ఇతరాలకు మొదటి రెంటిలో సారూప్యతలున్నాయి. చివరి రెంటిలో ఈ కవిత్వం ప్రదర్శిస్తున్న అనుభవం వేరు. ఒక దశలో తీవ్రత,ధిక్కారం,అసహనం కలగలసిన వాక్యాలు అదేసమయంలో తన స్థితికి సంబంధించిన నిశ్చేష్ట కవిత్వంలో వ్యక్తమయ్యాయి. కొన్ని సార్లు తీవ్రతను ప్రదర్శించినా అనేకసార్లు కారుణ్యాత్మక వచనాన్ని సృజించింది.

ఈ మధ్య కాలపు కవిత్వాన్ని గమనిస్తే అస్తిత్వ వాదపు కవిత్వంలో కూడా ఒకానొక మానసిక ప్రాతినిధ్యం కనిపిస్తుంది. గతంలోని సంఘర్షణకు,ఈ కాలపు కవిత్వంలో కనిపించే సంఘర్షణకు మధ్యనున్న సున్నితమైన వ్యక్తీకరణను ఆతాలూకు గొంతును స్పష్టంగా గుర్తించవచ్చు. రసూల్ ఖాన్ చాలా రోజుల క్రితం “దువా”అనే పేరుతో తన కవిత్వాన్ని వెలువరించారు. ఈ మధ్యన తనురాసిన కవిత. ఒక సున్నితమైన సంవేదనతో మానసిక ప్రాతినిధ్యాన్ని ప్రదర్శించింది. సంభాషణలా కనిపించే  వాక్యాల నిడివితో ఒక దీర్ఘనిశ్శబ్దాన్ని ఈ కవిత మోసింది.నిజానికి ఈ సంవేదన వెనుక కొన్ని సంవత్సరాల వేచిచూడటం,తన సౌభ్రాతృత్వం అసహనాలపాలవటం లాంటి బాధ కనిపిస్తుంది.

మాటల తూటాలను/ఒకదానిపై మరొకటి ఇటుకలుగా చేసి మోస్తున్నా/బుజాల భారం తప్ప మనసు లోతు బంధం అవలేక/రాళ్ళక్రింద నలుగుతూ నేను

మాటల తూటాలను మోయటం గతాన్ని చెప్పే స్థితి వాక్యం..ముస్లిం మైనారిటీ కవిత్వం ఒక పరిమితకాల గతాన్నించే తనగొంతును విప్పుకుంది.”బుజాల భారం తప్ప/మనసు లోతు బంధం అవలేక/రాళ్ళక్రింద నలుగుతూ నేను “లో తన వర్తమాన సంఘర్షణకు కారణాన్ని ప్రతిపాదిస్తున్నారు.రెండవవాక్యం లోనూ ఇదే సంవేదన ఉంది.కాని దానికి కొంత కళాత్మక వచనాన్ని జతచేసారు.

మనం అనుకొని చేసినదంతా/మన్నించరాని నేరంగా చూస్తూ అనుబంధాల తోటలోంచి/అమాంతంగా తోసేస్తూ ఒంటరి వాడిని చేసిన నాడు/సగం కాలిన చితిలా నేను

ఒక సంస్కృతిలో,చరిత్రలో భాగస్వామికావాలనుకోవడం.దాన్నుంచి ఒంటరితనాన్ననుభవించడం.”సగం కాలిన చితిలా నేను”అనటంలో వర్తమానానుభవం ధ్వనిస్తుంది.మనుషులలోని చిత్తశుద్ధిని శంకిస్తూ,తన స్థితిని చెప్పడంతో కవిత ముగిసింది.

అన్నీ తానై అల్లుకున్న గూడును/రాళ్ళతో పడగొట్టి నవ్వుతుంటే అమాయకంగా రోధించే పక్షిలా నేను/ఆత్మీయతకు అవసరానికి మధ్య/అనాధలా నేను .”

నిజానికి తన ఉనికిని, అస్తిత్వాన్ని వ్యక్తపరిచే స్పష్టమైన వచనాన్ని ఎక్కడా రాయలేదు.కాని వచనంలోని సంలగ్నసంబంధం,గొంతు అస్తిత్వాన్ని నిరాకరించిన స్వగతాన్ని చెబుతున్నాయి..నిజానికి పై ఉదాహరణలతోపాటు అనేకసార్లు కవిత్వంలో ఈ ఉనికి కనిపిస్తుంది. గతాన్ని, ఒకింత మతపరమైన వర్తమానాన్ని స్పర్శిస్తూ చేసిన వ్యాఖ్యలనుంచి గాయపడ్డ వచనం ఇందులో శక్తినిస్తుంది.

నిజానికి ఈ వచనంలోనుంచి కొన్ని ప్రశ్నలు కూడా ఉదయిస్తాయి. గతపు తరం చేసిన అంసాలనుంచి ఈ తరంఅనుభవిస్తున్న వ్యథకు ఈ కవిత అద్దం పట్టింది. బహుశ:వెదక గలిగితే ఈ సంవేదన మరికొందరిది కూడా.

                                                                                  –ఎం.నారాయణ శర్మ

మీ మాటలు

  1. భవాని says:

    రవి కాంచని చోట కవి కాంచును అంటారు . కానీ కవికి కూడా తెలియని కోణాల్ని అతని కవిత్వంలోంచి వెలికి తీస్తారు మీ వంటి విశ్లేషకులు . పూర్తి కవిత చదవకపోయినా మీరు ఉదహరించిన వాక్యాలే ఎంతో గొప్పగా ఉన్నాయి .

Leave a Reply to భవాని Cancel reply

*