జాయపసేనాని -1

OLYMPUS DIGITAL CAMERA

దృశ్యం :1

(క్రీ.శ. 1203వ సంవత్సరం . కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడు తన రాజ్య విస్తరణలో భాగంగా తీరాంధ్రదేశంపై దండయాత్రను కొనసాగిస్తున్న క్రమంలో మల్యాల చాముండసేనాని సారథ్యంలో కృష్ణానదీ ముఖద్వార ప్రాంత”మైన తలగడదీవి, హంసల దీవి,  మోపిదేవి, నాగాయ లంక, అవనిగడ్డ మొదలైన వెలనాటి మండల క్షేత్రపాలకుడైన పృధ్వీశ్వరుని ఓడించి అతని సకల సంపదనూ, అనర్ఘ మణిమాణిక్యాలనూ ఓరుగల్లు కోశాగారానికి తరలించి అతని సైన్యాధిపతియైన పినచోడుని జయించి..దివి సీమను కాకతీయ సామ్రాజ్యంలో కలుపుకొనకుండా తన రాజనీతిలో భాగంగా  అయ్యవంశీకుడైన పినచోడున్నే సామంతరాజును చేసి రాజ్యమేలుకొమ్మని ఆదేశించిన క్రమంలో…,

పినచోడుని పరమ సౌందర్యవతులైన యిద్దరు కుమార్తెలు నారాంబ, పేరాంబలను వివాహమాడి…అతని ముగ్గురు పుత్రులలో ఒకడైన జాయపలో అజ్ఞాతమై ఉన్న ప్రతిభావ్యుత్పత్తులను గ్రహిస్తున్న సమయంలో..,

గణపతిదేవుని వివాహానంతర విజయవసంతోత్సవ వేడుకల వేదిక.,

పినచోడుని సామంతరాజుగా గణపతిదేవుని ప్రకటన…ప్రతిష్టాపన సందర్భం.

స్వాగత…మంగళధ్వనులు

                                                         పిన్నచోడనాయకుని   ఆస్థాన దృశ్యం:   

 వందిమాగదులు : రాజాధిరాజ .. కాకతీ సామ్రాజ్య రాజమార్తాండ .. శత్రుభీకర కదన వీరాధివీర .. కళాధురీణ .. ప్రతిష్ఠాపనాచార్య.. కదన ప్రచండ..చోడకటక చూఱకాఱ  శ్రీశ్రీశ్రీ గణపతిదేవ చక్రవర్తులుంగారికి  వెలనాటి  ఏలిక ద్వీపీలుంటాక .. దివిచూఱంకార .. అయ్యకుల సంజాత .. శ్రీ పిన్నచోడనాయక .. సకల అమాత్య,సైనిక నాయకజన, ప్రజా సమూహాల పక్షాన జయహో..విజయహో.. స్వాగతం . .సుస్వాగతం.

( వెనుకనుండి మంగళ ధ్వనులు వినిపిస్తూండగా గణపతిదేవుడు,తన ఇద్దరు నవ వధువులు నారాంబ పేరాంబ లతో వెనుక ఇతర పరివారంతో ప్రవేశం . గంభీరంగా మెట్లెక్కి , సింహాసనాన్నధిష్టించి ఆసీనుడై .. ఆస్థానంలో పరివేష్టితులై ఉన్న పిన్నచోడనాయకుడు, మల్యాల చాముండదేవుడు, కాటమ నాయకుడు తదాది బుధజన సమూహాలకు ప్రణామంచేసి కూర్చుని విరాజిల్లగానే .. స్వాగత గీతం..3 నిముషాలు)

జన హృదయ విరాజిత భోజా

వన వసంతకాంతులొలుకు రారాజా

స్వాగతం..తామ్రపురికి ఘనస్వాగతం

 

కళాధురీణా..కదన ప్రవీణా

యుద్ధవిద్యలలొ విక్రమతేజా

శతృసంహార..పురవరాధీశ్వరా

పరమ మహేశ్వర..మండలేశ్వరా       జన!!

 

కదన ప్రచండా..విభవ దేవేంద్ర

తిమిర మార్తాండ..లక్ష్మీ నిజేశ్వర

కాకతీరుద్ర..అరివీరభయంకర

గణాధీశ్వరా ..గణపతిదేవా           జన!!                          ( సాంప్రదాయ..కూచిపూడి పద్ధతిలో నిర్వహించాలి)

 

(గణపతిదేవుదు తన ఉన్నత సింహాసనం పైనుండి లేచి .. పినచోడ నాయునివైపూ.. అమాత్య .. సైనికాధిపతులవైపూ.. సభాసదులూ.. పురప్రజలందరివైపూ.. నిర్మలంగా చూస్తూ నిలబడి )

 

 గణపతిదేవుడు: ఈ నిండు పేరోలగంలో ఆసీనులైఉన్న తామ్రపురి పూర్వపాలకులైన చోళాధీశులు,పృధ్వీశ్వరులు,వారి సైన్యాధ్యక్షులు..ప్రస్తుతం కయ్యము విడిచి మాతో నెయ్యముతో వియ్యము గరిపిన పినచోడులుంగారికి..మావెంట యుద్ధములలో పాల్గొని మాకు విజయమును సాధించిపెట్టిన మా సేనాధిపతి మల్యాల చాముండదేవుడు,కాటమ నాయకుడు..తదితర ప్రముఖులకు..మేము మా సువిశాల కాకతీయ సామ్రాజ్యంలో దైవసమానులుగా సంభావించే మా ప్రజలతోపాటు ఈ రోజునుండి మహోజ్జ్వల వీర కాకతీయ సుభిక్ష పాలనలోకి ప్రవేశిస్తున్న మా ప్రియతమ వెలనాటి ప్రజలకూ..ఈ గణపతిదేవుని వినమ్ర ప్రణామములు.

ఈరోజు ఎంతో విశిష్టమైన సుదినము.దివిసీమను కాకతీయ సామ్రాజ్యాంతర్భాగంగా ప్రకటిస్తూ నిర్వహిస్తున్న ఈ విజయోత్సవ వసంత సభలో మేమొక విస్పష్ట స్నేహపూర్వక ప్రకటనను చేస్తున్నాము.ఇక ముందు అయ్యవంశీకులైన పినచోడులుంగారు ఈ వెలనాడు ప్రాంతాన్ని కాకతీయ చక్రవర్తులమైన మా పరిపాలనా విధానాలకు లోబడి ప్రజారంజకంగా,సుభిక్షముగా మా సామంతరాజు హోదాలో ఏలుబడిని కొనసాగిస్తారని ఈ నిండు ప్రజాసభలో సాధికారికంగా ప్రకటిస్తూ..అజ్ఞాపిస్తున్నాము.

పినచోడుడు: ధన్యవాదములు మహారాజా..మా జన్మ చరితార్థమైనది.ప్రజలను కన్నబిడ్డలవలె కాచుకునే మీ పరిపాలనా సూత్రములననుసరించి మేముకూడా మీ అజ్ఞాబద్దులమై జనరంజక పాలననందిస్తామని ఇందుమూలముగా మీకు సవినయముగా హామీ ఇస్తున్నాము.

 గణపతిదేవుడు:మల్యాల చాముండదేవుడుగారూ..ఒకసారి స్థూలముగా మన కాకతీయ పాలనా విధానాన్ని ఈ తామ్రపురివాసులకు తెలియజేయండి.

 చాముండదేవుడు:చిత్తము మహరాజా.రాజు అనగా ఒక కుటుంబమునకు తండ్రివలె తన సామ్రాజ్యములోని ప్రజలందరకూ సంరక్షకుడు మాత్రమే.ప్రజల ధన మాన ప్రాణ రక్షకుడై వారి నిత్యాభివృద్ధికోసం తపిస్తూ జనరంజకముగా అందరినీ సమదృష్టితో,సమన్యాయముతో ధర్మబద్ధంగా పాలించడమే కాకతీయుల విధానము.ప్రతి ఊరూ ఒక గుడితో,ప్రక్కనే పంటపొలాలతో విరాజిల్లే చెరువూ,తల్లి ఒడివంటి బడితో ప్రశాంతముగా వర్థిల్లడమే చక్రవర్తుల అభిమతము.గొలుసుకట్టు చెరువల నిర్మాణం మన సేద్యవిధానం.

 గణపతిదేవుడు:కాటమ నాయకా మీరు చెప్పండి.

 కాటమనాయుడు:చిత్తము మహాప్రభో.ప్రతి పౌరుడూ నైతిక విలువలు నిండిన జీవన విధానముతో ధర్మబద్ధముగా జీవిస్తూ సకల యుద్ధ విద్యలలోనూ,కళా రంగాలలోనూ,వృత్తి నైపుణ్యాలతోనూ పరిపూర్ణుడుగా వర్థిల్లడమే చక్రవర్తుల ఆకాంక్ష.

(ప్రజల జయజయ ధ్వానములు)

 గణపతిదేవుడు:ఇప్పుడు..ఈ దండయాత్రలో మా విజయానికి కారకులైన మా సేనాని మల్యాల చాముండదేవుణ్ణి మేము “ద్వీపలుంటాక”బిరుదుతో సత్కరిస్తున్నాము.ఎవరక్కడ..,

పినచోడుదు:ఏర్పాట్లు చేయబడ్డాయి మహరాజా..(చేయితో సైగ చేస్తాడు)

(మంగళ వాద్యాలతో..ఖడ్గమూ..హారమూ..కిరీటమూ తెస్తారు.గణపతిదేవుడు చాముండదేవునికి వాటిని ధరింపజేసి.,)

చాముండదేవుడు:మహాప్రసాదము మహారాజా.నా జన్మ ధన్యమైనది.మున్ముందుకూడా కాకాతీసామ్రాజ్య పరిరక్షణ బాధ్యతలో నా జన్మను పునీతం చేసుకుంటానని ఇందుమూలముగా ప్రతిజ్ఞ పూనుతున్నాను.

గణపతిదేవుడు:శెహబాస్ చాముండదేవా.ఇప్పుడు ఈ మా సామ్రాజ్య విస్తరణాయాత్రలో మాకు కుడి భుజముగా సహకరించిన మరో యోధుడు కాటమ నాయకుడిని మేము “దీవి చూరకార”బిరుదుతో సత్కరిస్తున్నాము.

(మళ్ళీ మంగళ ధ్వనులు…ఖడ్గము…ప్రదానము )

కాటమ నాయకుడు:నా జన్మ సార్థకమైనది మహారాజా.యుద్ధవిద్యలలో..రాజ్యవిస్తరణ వ్యూహ రచనలో అజేయులైన మా చక్రవర్తులకు బాహుసమానుడనై కంటికి రెప్పవలె నిరంతరమూ అహర్నిశలూ కాపలాదారుడనై ప్రవర్తిస్తాననీ,కాకతీ సామ్రాజ్య రక్షణలో నా జీవిత సర్వస్వాన్నీ ధారపోస్తానని ఇందుమూలముగా ప్రమాణము చేస్తున్నాను.

 గణపతిదేవుడు:భళా కాటమనాయకా భళా.నీవు మాకు నీడవే కాదు బహిర్ ప్రాణానివి కూడా.

ఈ విజయోత్సవ సందర్భంలో మేము ఇష్టపడి పవిత్ర వివాహ కార్యముతో మా దేవేరులుగా స్వీకరించిన మా సామంతరాజు పినచోడులుంగారి కుమార్తెలు నారాంబ మరియు పేరాంబలను మా కాకతీయ సువిశాల సామ్రాజ్య పట్టపురాణులుగా ప్రకటిస్తూ దివిసీమ ప్రజల ప్రేమమయ కానుకగా మా హృదయసీమలో భద్రపరుచుకుంటున్నాము.ఈ శుభ సందర్భముగా విజయోత్సవ సంరంభాలను ప్రారంభించవలసినదిగా మాచే నియమితులైన మా సామంతరాజు పినచోడులుంగారిని ఆదేశిస్తున్నాము.

 పినచోడుడు:చిత్తము మహారాజా..శాతవాహనుల అనంతరము ఆంధ్రదేశాన్నీ,జాతినీ ఏకఛత్రాధిపత్యం కిందికి తెచ్చిన కాకతీయ మహాసామ్రాజ్యములో ప్రజలకు సంప్రాప్తించినది స్వర్ణ యుగము..స్వర్గ యుగము.మీ ప్రజారంజక పాలనలో నన్ను మీ సామంతునిగా నియమించినందుకు ధన్యవాదములు.నిబద్ధతతో,నిజాయితీగా,మీ ఆజ్ఞాబద్ధుడనై ఈ వెలనాటి సీమను విధేయంగా పాలిస్తానని ఈ నిండుసభలో ప్రమాణము చేస్తున్నాను. మానవుల మధ్య ఉందదగు మానవీయ బంధమును మన మధ్య స్థాపించి మా  కుమార్తెలు నారాంబ,పేరాంబలను మీ ధర్మపత్నులుగా స్వీకరించి మా జన్మలను ధన్యము చేసినారు.ఇక మేము ఈ పవిత్రబంధమును ప్రాణముకన్నా మిన్నగా కాపాడుకుని మీకు వినమ్రులుగా ఉంటామనీ జీవితాంతం ఋణగ్రస్తులమై ఉంటామనీ వాగ్దానము చేస్తున్నాము.

ఇక ..ఈ విజయోత్సవ కార్యక్రమంలో భాగముగా..మొదట మా వీరులచే “ఖడ్గప్రహార ప్రదర్శన”,”శబ్దవేది”,”విలువిద్యా విన్యాసము”,సాహిత్య కళారంగాలలో అభిజ్ఞతగల పండితులచే జ్ఞాన ప్రదర్శన ఏర్పాటు చేయబడ్డాయి.తమరి అనుమతికోసం నిరీక్షణ ప్రభూ.,

  గణపతిదేవుడు:కొనసాగించండి పినచోడ రాజా..మేమూ వీక్షించుటకు ఉత్సుకులమై ఉన్నాము.

  పినచోడుడు:దండనాయకా..వీరులను ప్రవేశపెట్టుము.

(మ్యూజిక్..కోలాహలం..ప్రజలు,వీక్షకుల హడవుడి..ఉత్సుకత..మొద11)

  గణ.దే: దేవీ నారాంబా..అక్కడ ప్రదర్శన క్షేత్రంలోకి ప్రవేశించి కళ్ళకు నల్లని వస్త్రమును ధరించి నిలబడి ఉన్న బాలుడు మీ సోదరుడు జాయపకదా.

  నారాంబ: ఔను మహాప్రభూ..అతను జాయపే…జాయప జన్మతః అద్భుతమైన ప్రతిభాశీలి.గజవిన్యాస శిక్షణలో,గజనియంత్రణలో..ఖడ్గప్రహార విద్యలో..ఇతరేతర సకల సైనిక యుద్ధవిద్యల్లో..ఆయుధ ప్రయోగకళల్లో అతను అజేయుడు.ఏకసంతాగ్రాహి.మా అందరి ఊహలకు మించి మహోన్నతంగా ఎదుగుతున్న పరాక్రమవంతుడు.

 గణ.దే: భళా..బాగున్నది..ముచ్చటైన రూపురేఖలు,నిండైన విగ్రహం..సౌష్టవమైన శరీరం..ఊ..

 పేరాంబ: జాయప ప్రత్యేకముగా ప్రదర్శించే “శబ్దవేది విద్య” ఎంతో ఆసక్తికరమై చూపరులను ఊపిరిసలుపకుండా చేసేది.ఎలా సాధన చేశాడో తపస్సువలె.

 గణ.దే:జాయప అక్కలిద్దరూ సృష్టికే అలంకారాలైన సౌందర్యరాసులైనప్పుడు తమ్ముడు వీరుడూ పరాక్రమశాలి కావడం సహజమేకదా..ఏమంటావు నారాంబా.

 నారాంబ:ఔనంటాను ప్రభూ..చక్రవర్తులెప్పుడూ ఉచితమే తప్ప అన్యము పలుకరుకదా.

( ప్రదర్శన కొనసాగుతూంటుంది..)

 పేరాంబ:ప్రభూ..వివాహానంతరం మేము చక్రవర్తులవెంట రావడం మిగుల ఆనందదాయకమే ఐనా..జాయపను విడిచి.. పన్నెండేళ్ళైనా నిండని మా తమ్ముని సాంగత్యాన్ని కోల్పోయి ఎడబాటును పొందవలసిరావడం కించిత్తు దుఃఖకరముగానే ఉన్నది.జాయన సాంగత్యం చంద్రునితో వెన్నెల వంటిది.

గన దే: ఉహూ..అలాగా..సోదర సాన్నిహిత్య మాధుర్యాన్నీ,వియోగ విషాదాన్నీ ఈ మహరాజు అర్థం చేసుకోగలడు దేవీ..చూడు,జాయన కళ్ళు మూసుకుని ఖడ్గచాలనానికి సిద్ధపడుతున్నాడు.

దండనాయకుడు:.సభాసదులారా.ఇప్పుడు సుశిక్షితుడైన ఒక ఖడ్గవీరునితో కళ్ళకు గంతలు కట్టుకుని పన్నెండేండ్లుకూడా నిండని “జాయన” శబ్దాధార ప్రహార నైపుణ్యంతో మనముందు వీరోచితంగా తలపడబోతున్నాడు..ఇది ఒక రోమాంచితమైన ప్రాణాంతక ప్రదర్శన..వీక్షించండి.

( కాహళి ధ్వని దీర్ఘంగా..క్రీడ ప్రారంభం..ఖడ్గముల కరకు ధ్వని..వీరోచితంగా మధ్య మధ్య కరతాళ ధ్వనులు..కేరింతలు..హాహాకారాలు..ఉద్విగ్నత..)

దండనాయకుడు: బాలవీరుడు జాయప ఖడ్గ చాలన విద్యానైపుణ్యాన్ని వీక్షించిన చక్రవర్తులకు,దేవేరులకు పురప్రముఖులందరకూ ధన్యవాదములు..ఇప్పుడు..వినోదార్థం..యువకిశోరం జాయప కొన్ని సంవత్సరాలుగా తనంత తానుగా వృద్ధిపర్చిన ఒక వింత జంతుభాషతో,హృదయంగమ సాన్నిహిత్యంతో గజసమూహాలతో మనముందు చిత్రమైన గజవిన్యాస క్రీడను ప్రదర్శిస్తారు.గజసాధకునిగా జాయప ఈ రంగంలొ అజేయుడు.

( గజ విన్యాసాలను లైట్ అండ్ షేడ్ పద్ధతిలో..మ్యూజిక్ తో చూపిస్తూ..సౌండ్ ను డిం చేస్తూ..,)

గణ.దే:(పేరాంబనుద్దేశ్యించి) మీ తమ్ములుంగారు ఈ విధముగా భిన్నమైన వివిధ రంగాల్లో విశేష ప్రజ్ఞ కలిగి విద్యావిశారదుడు కావడం మమ్మల్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతున్నది..భళా.,

 పేరాంబ: అదంతా దైవ ప్రసాదిత నైపుణ్యమె ప్రభూ.శివాజ్ఞ.జాయన సాధన..కృషి..పట్టువిడవని తపస్సమాన దీక్ష నిజముగా శ్లాఘనీయమైనదే.ప్రతిదినము ప్రాతఃసమయములో రెండవజాముననే అతను చేపట్టే నిరంతర సాధన మమ్మల్నందరినీ అబ్బురపరుస్తుంది.స్వామీ..మీరన్నట్టు చిత్రమే అతని తత్వము..నైపుణ్యము కూడా.

( ఏనుగుల చిత్ర విన్యాసాల ధ్వని..కొనసాగింపు)

ధ్వనిమాత్రంగా..

దండనాయకుడు:పది ఏనుగులు గల ఈ కరిసమూహముతో జాయన వివిధ భంగిమలలో, భిన్న శ్రేణులుగా,పరిపరి పరిస్థితులలో శాంత..ప్రసన్న..ఉగ్ర..మహోగ్ర..ఉద్విగ్న పద్ధతులలో ప్రవర్తించు విధములను ప్రదర్శిస్తారు..వీక్షించండి..చకితులమౌతాం మనం.. ( సౌండ్..గజ క్రీడ..శబ్దాలు).లైట్స్ ఆన్.

గణ.దే: భళా..బాగున్నది.జాయనయొక్క గజ నియంత్రణ..సాహిణత్వం బహుదా ప్రశంసనీయముగా ఉన్నది.మేము ముదముతో పొంగిపోయితిమి…ఊ..తర్వాత.,

దండనాయకుడు:చివరి అంశము..మహాచక్రవర్తుల సమక్షమున పురుషులు మాత్రమే చేయు సంధ్యాసమయ శివతాండవ శృంగనర్తనమును జాయన ఇపుడు ప్రదర్శిస్తారు..పంచశక్తులైన పృథ్వీ,జల,వాయు,తేజో,ఆకాశ లింగ మూర్తులను స్తోత్రం చేస్తూ..పంచముఖ శబ్దాలతో సునిశితమైన ప్రణవ,ప్రణయ,ప్రళయ నాదాలతో కూర్చిన ఈ నర్తనం కరణ,చారీ,అంగ హారాల సంపుటీకరణతో మనల్ని చకితుల్ని చేస్తుంది.ఈ నాట్యగతిని జాయన తనకుతానుగా రూపొందించుకుని కూర్చిన కళగా మహాచక్రవర్తులకు నివేదించబడుతున్నది..తిలకించండి.

గణ.దే:ఊ..మహదానందముగా ఉన్నది..ఖడ్గ విద్య..గజపాలనా నైపుణ్యము..ఇప్పుడు నృత్తమా.?పరస్పర సంబంధమే లేని ఈ భిన్న కళారంగాలలో నిపుణత్వం నిజముగా విచిత్రమే..అనితర సాధ్యమే ఇది..(పారవశ్యంతో)

“నాట్యం తన్నాటకం చైవ పూజ్యం పూర్వకథాయుతం

భావాభినయహీనంతు నృత్యమిత్యభిధీయతే

రసభావవ్యంజనాదియుక్తం నృత్యమితీర్యతే”..

అనికదా తన అభినయ దర్పణములో నందికేశ్వరుడు నాట్య,నృత్త,నృత్యములను నిర్వచించినది. అంటే పూర్వకథాయుతమై,పూజనీయమైన నాటకమే నాట్యము.భావాభినయ హీనమైనది నృత్తము.రసభావవ్యంజనాది యుక్తమైనది నృత్యము ..అని అర్థము.కానివ్వండి..మేము మిగుల ఉల్లాసభరితముగా ఈ ప్రదర్శనను వీక్షిస్తాము.

( గజ్జెల చప్పుడు.శంఖ ధ్వని..మద్దెల..మహా మద్దెల..ఉడుక్కు..పెద్ద కంచు తాళాల మేళప్రాప్తి..మార్దంగికుని బీభత్స రసవిన్యాస క్రీడ.కొనసాగుతూండగా..జాయన రంగప్రవేశం.నర్తనం..ధ్వనిపూర్వక శ్రవణం..మధ్య మధ్య..గణపతిదేవుణి పారవశ్య వ్యాఖ్యలు..భళా..అద్భుతం..మహాద్భుతం..చప్పట్లు..కేరింతలు..నవ్వులు..శ్లాఘత..పరాకాష్టల కరతాళధ్వనుల కెరటం..ఒక ఉత్తుంగ తరంగం ఎగిసి శాంతించిన స్థితి..తర్వాత..నడుస్తూ జాయన తన దగ్గరకు రాగా., )

  గణ.దే:జాయనా..నీ శృంగనర్తనము అపూర్వము..భావ,రాగ,తాళ యుక్తముగా సాగిన శివతాండవము అపురూపము.ఈ వీరనాట్యములో నీవు శివరౌద్రావాహన జరిపిన తీరు మమ్మల్ని పారవశ్యుల్ని చేసింది.భళా..(తన ఇద్దరు భార్యలనూ,పిన చోడునినీ ఉద్దేశ్యించి) ఈ బాలుడు దైవాంశసంభూతుడు..జన్మతః ప్రధాన సృజన విద్యలలో పూర్ణుడైన ఈ బాలునకు సశాస్త్రీయమైన శిక్షణ ఉన్నచో యితడు ఈ సైనిక,కళా విద్యలలో ఎంతో వన్నెకెక్కి జగత్ ప్రసిద్ధి చెందుతాడు.ఇతనిలోని కళాభిజ్ఞతను మేము గుర్తించితిమి..దేవీ..జాయనను మనతోపాటు కాకతీయుల రాజధానియగు ఓరుగల్లు నగరమునకు వెంట తోడ్కొనిపోయి అచట ఈ కళారంగాలన్నింటిలో , యుద్ధవిద్యలలో, నిష్ణాతులైన శ్రేష్టులతో ప్రామాణికమైన, శాస్త్రీయమైన శిక్షణనిప్పించెదము .. పినచోడులుంగారూ, బాలుని మాతోపాటు పంపించి సహకరించండి.

  పిన చోడుడు: ధన్యోస్మి ప్రభూ.కృతార్థులము..మా జాయన భవిష్యత్తు మీ స్పర్శతో సూర్య సందర్శనముతో కమలమువలె వికసిస్తుందిక.సకల సన్నహములను కావించెదము.

 గణ.దే:రేపే ఓరుగల్లు మహానగరమునకు మా పయనము.చాముండ నాయకా..మన సేనా పరివారమును సంసిద్ధులను చేసి జాయనతోసహా మన ప్రస్థానమునకు ఏర్పాట్లు గావింపుము.

 జాయన:( పరుగు పరుగున మెట్లెక్కి వచ్చి గణపతిదేవునికి పాదాభివందనం చేసి..ఎదుట నిలబడి)ధన్యుడను మహారాజా..మీ కరునకు,శ్లాఘతకు పాత్రుడనైన నా జన్మ ధన్యము..ఆజన్మాంతము మీకు నేను ఋణగ్రస్తుడనై,విధేయుడనై ఉంటాను.

గణ.దే:భళా జాయనా..నీవు జన్మతః ప్రతిభాశీలివి..వినమ్రుడవుకూడా.అందువల్ల రానిస్తావు.మాకు జ్వాలలో కాంతివలె తోడుండి కొనసాగు..శుభం..శివానుగ్రహ ప్రాప్తిరస్తు.

 జాయన:ధన్యులము మహారాజా..ధన్యులము.

(పిన చోడుడు,నారాంబ,పేరాంబలతో సహా..)

గణ.దే:శుభం..కాకతీయ మహాసామ్రాజ్యంలో ఒక భాగమై..దివిసీమ పినచోడుని సుపరిపాలనలో కలకాలం సకల సంపదలతో సంపన్నమై వర్థిల్లాలని ఆకాంక్షిస్తూ..సర్వం శుభం..సకలం సుభిక్షం..సెలవిక.

(గణపతి దేవుడు ప్రాంగణంనుండి నిష్క్రమిస్తారు.వెంట అనుచరగణం..తదితరులుకూడా నిష్క్రమిస్తున్న చిహ్నముగా ధ్వని..కాహళి శబ్దం)

మీ మాటలు

  1. Amarajyothi says:

    జాయపసేనాని ప్రారంభమే చాల ఆకట్టుకున్నది mukhachithram చాల అందముగా ఆకర్షణీయంగా వుంది రచయితకు మీకూ అభినందనలు అమరజ్యోతి అనకాపల్లి

  2. DrPBDVPrasad says:

    కాకతీయశిల్పం(రామప్పగుడి,సహస్రస్తంభ దేవాలయం)లో కనిపించే నృత్యభంగిమలకు ఆధారం జాయపమహా సేనాని కృతమైన నృత్త రత్నావళి.
    రణశౌర్యులైన కాకతి ప్రభువులకు జాయపవీరత్వం తోడవటంతో కాకతీయసామ్రాజ్యంవిస్తరించింది
    చారిత్రక నేపథ్యంతో జాయపసేనాని రూపకాన్ని రాస్తున్న రా.చం.మౌళి గారికి హార్దికాభినందనలు.
    కృష్ణముఖద్వారం(అనవచ్చా?;సంగమస్థలం కదా!)లో అప్పుడు అవనిగడ్డ నాగాయలంక ఉండవు.ఇవి తర్వాత ఏర్పడినవే.శ్రీకాకుళం ఘంటసాల మొవ్వ సంగమేశ్వరం హంసలదీవి ఉన్నట్లు ప్రాచీన దేవళాలు శాసనాల వలన తెలుస్తుంది
    మొవ్వ సిద్థేంద్రయోగి కూచిపూడి యక్షగానాలకు ఆద్యుడు.వారు జాయపసేనానికి అర్వాచీనులు

    • raamaa chandramouli says:

      డా.ప్రసాద్ గారు,

      మీరు చెప్పినవన్నీ నిజాలే.ఈ నాటకాన్ని ఆకాశవాణి కోసం రాయడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది.
      ధన్యవాదాలు.

      – రామా చంద్రమౌళి

  3. it was pleasure listening to it on the AIR…after long i heard something like this! it’s a wonder feat by the dramatist…thnq n regards, prof b indira

మీ మాటలు

*