మధ్యతరగతి స్త్రీల మనోలోకంలో ద్వివేదుల విశాలాక్షి

untitled

సాహితీ ప్రపంచానికి మణిపూస శ్రీమతి ద్వివేదుల విశాలాక్షిగారు, ఎన్నో నవలలు,కదలు,వ్యాసాలు వ్రాసారు. పాత తరం,కొత్త తరం ఎవరైనా కాని ఆమె రాసినవన్నీ అందరికీ మార్గదర్శకాలే. ఆమె రచనలు పాఠకులను చేయిపట్టి తమతో పాటే తీసుకోని వెళతాయి. రాజలక్ష్మీ ఫౌండేషన్‌ లిటరరీ అవార్డు (1999) సహా 13 పురస్కారాలను విశాలాక్షి అందుకున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆమెకు 1998లో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఎంతోమంది విద్యార్థులు ఆమె రచనలపై పరిశోధనలు జరిపి ఎంఫిల్‌, పీహెచ్‌డీలు పొందారు.

ఇక వారు రాసిన నవలలో ముఖ్యంగా స్త్రీ పాత్రల కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. కొవ్వొత్తి లోని లలిత, మారిన విలువలలో జానకి, గ్రహణం విడిచింది లోని భారతి, గోమతి లో గోమతి, రేపటి వెలుగు లో శారద ,ఎక్కవలసిన రైలు లో మాధవి, ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో పాత్రలు. వారి రచనలలోని గొప్పదనం ,ఆ పాత్రలు ,ప్రదేశాలు కూడా మనకు బాగా పరిచయం ఉన్నట్లుగా అనిపిస్తాయి. ఉదాహరణకి కొవ్వొత్తి లో నాయకుడు ప్రకాశం ఇల్లుని ఈ విధంగా వర్ణిస్తారు “అది ఒక పాత లోగిలి,చిన్న,చిన్న వాటాలు”. ఈ వర్ణన ఇంచుమించుగా అన్ని నవలలో ఉంటుంది. అంటే అప్పటి మధ్యతరగతి జీవితాన్నిదర్పణం పట్టి చూపించారు. నలభైయేళ్ల క్రితం వాళ్ళకి ఇలాంటి ఇళ్ళు గుర్తు ఉండే ఉంటాయి. ముఖ్యంగా ఆవిడ రచనలలో ఎన్నడూ శ్రీమంతుల దర్పం కనిపించదు. మధ్యతరగతి జీవన విధాన గురుంచి ఎక్కువ రాసేవారు ఇప్పుడు మనం down-to-earth అంటాం కదా! అలాంటి పాత్రలనే సృష్టించారు.

వారు రాసిన నవలల నుండి కొన్ని మచ్చుతునకలు.

నాకు బాగా నచ్చిన పాత్రలు   గోమతి, రేపటి వెలుగు(శారద), కొవ్వొత్తి(లలిత) ఎక్కవలసిన రైలు లోని(మాధవి) పాత్రలను వాటి స్వభావాలను గనక పరిశీలిస్తే,

గోమతి: చిన్ననాటి స్నేహం ముగ్గురి మధ్య ముప్పేటలా పెనవేసుకొన్న బంధం. ఇది ఒక triangular love story . నవలలోకి వెళితే   ”అట్లతద్దోయి ఆరట్లోయి” అన్న చిన్న పిల్లల కేకలతో నవల మొదలవుతుంది. కధానాయిక గోమతి కి అది చూసి మనసు గతం లోకి పరగులు తీస్తుంది. చిన్నప్పటి నుంచి. మేనత్త కొడుకు గోపాలం, స్నేహితుడు గోవిందు. ముగ్గురూ ఒక జట్టు. ఊరి చివరనున్న ఆఫీస్ బంగ్లా గేటు ఎక్కి జామ కాయలు కోయడం, అక్కడే ఉన్న ఆకు సంపెంగ పూలు కోసు కోవడం,స్కూల్ లో మాస్టారు చేత దెబ్బలు తినడం ఇవన్నీ ఇంట్లో తెలిసి పెద్దవాళ్లు తిట్టడం జరుగుతూ ఉంటాయి.

పెద్ద అయ్యాక అభిమానాలూ పెరుగుతాయి, బావ మరదళ్ల మధ్య కానీ గోమతి తల్లి వల్ల తెలియని దూరం పెరుగుతుంది . “చిలకలా తిరుగుతోంది పిల్ల,వదినా! మా గోవిందు కి మీ గోమతిని చేసుంటాను” అని తల్లితో నేస్తం,పక్క్టింటి అబ్బాయి గోవిందు వాళ్ళ అమ్మ అడిగిన వెంటనే గోమతి తల్లి తండ్రులు గడపలోకి వచ్చిన సంబంధం,ఎరిగున్న వాళ్ళు,కాదనడానికి తగ్గ కారణం ఏమి లేదని పెళ్లి చేస్తారు. బోటా బొటి సంపాదన, పట్నం లో కాపురం. పైగా అదే సమయం లో గోవిందు కాలు విరగడం,ఉద్యోగంపోవడం ఒకటే సారి జరుగుతాయి. ఈ క్రమం లో గోమతి, సంసారభారాన్ని మోసేందుకు ఉద్యోగం లో చేరుతుంది. అక్కడ ఆమె పై ఆఫీసర్ బావ గోపాలమే. ఆడపడచు మీద ఉన్న చులకన భావం తో మేనల్లుడు గోపాలాన్ని చిన్న చూపు చూస్తుంది గోమతి తల్లి.

అది తెలిసి గోమతి మీద ప్రేమను బయట పెట్టలేకపోతాడు. కానీ స్నేహితుడు గోవిందు ఇది ముందే పసిగట్టి గోమతి తనకే దక్కాలన్న స్వార్ధంతో గోపాలం కంటే ముందు వెళ్లి తన ప్రేమని చెప్పేస్తాడు. వాళ్ళు ఎప్పుడు కలుసుకునే మందార చెట్టు దగ్గర. వెంటనే గోమతి సరే అంటుంది. అది విని భంగపాటు తో గోపాలం ఇంట్లో చెప్పకుండా వెళ్లి పోతాడు. కొంతకాలానికి తన ఆఫీస్ లోనే ఉద్యోగానికి వచ్చిన గోమతి తో పూర్వంలా చనువుగా ఉండటం సహించలేని గోవిందు గోమతిని సూటి పోటి మాటలు అంటాడు. కొన్ని రోజులు ఘర్షణల మధ్యే జీవితం గడుపుతారు. చివరకి గోవిందు గోమతి జీవితం నుంచి తొలగి పోవడానికి నిశ్చయించుకొని ఉత్తరం రాసి రైలు ఎక్కుతాడు. ఎక్కిన రైలు కొంచెము దూరం వెళ్లి ఆగుతుంది. ఎవరో అంటారు రైలు కిందబడి ఒక ఆడకూతురు ఆత్మహత్య చేసుకుందని అది విన్న గోవిందు మటుకు, గోమతి కి ఆ గతి పట్టదు.చక్కగా గోపాలం తో హాయిగా ఉంటుందిలే అని సమాధానపడతాడు. కానీ అతనికి  తెలియని నిజం  గోమతి  కి తన మీద ప్రేమ ఏమాత్రము తగ్గ లేదని .తన కోసమే రైలు ఎక్కబోయి పది పోయి చని పోయిందని .

  ఈ నవలలో నాయిక  ధైర్య వంతురాలైన  చివరకి  విధి వశాత్తు రైలు కింద పడి  మరణిస్తుంది.

 

రేపటి వెలుగు: ఈ నవలలో కూడా మధ్యతరగతి కుటుంబీకులు శారద తల్లితండ్రులు. ముందు పుట్టిన ఇద్దరు అక్కలకు పెళ్ళిళ్ళు అవుతాయి. అప్పులు, బాధ్యతలతో తల మునగలు గా ఉంటాడు తండ్రి.ఇక రేపో మాపో రిటైర్ అవుతాడు, గుండెల మిద కుంపటి లా పెళ్లికేదిగిన మూడో కూతురు.అని ఆలోచించిన తల్లి కూతురి తో అంటుంది, “చదివిన చదువు చాల్లే ఏదో మా శక్తి కొద్ది గంత కు తగ్గ బొంతను చూసి పెళ్లి చేస్తాను”.

కాని స్వతంత్ర భావాలూ గల శారద అందుకు ఒప్పుకోదు స్వశక్తి మిద నిలబడాలని అనుకుంటుంది. అదృష్టం ఆమెకు అనుకోని విధంగా వేలువిడిచిన మేనమామరూపం లో వస్తుంది. అతనితో వాళ్లింటికి పట్నం వెళుతుంది. అక్కడ తన ఈడుదైన అరవింద తో పరిచయం. ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆ క్రమం లో అనిల్ తో పరిచయం ఆమెకి చక్కటి మధురభావనలను కలిగిస్తుంది. అరవింద కి ఒక పంజాబీ తో పెళ్లి అవుతుంది. అతని స్నేహితుడే అనిల్ బెనర్జీ, బెంగాలీ వాడు . శారదను చూసి ఆమె మృదువైన స్వభావం చూసి , ఇష్టపడతాడు. కాని ఆమె ఎటూ నిర్ణయించుకోలేక పోతుంది. ఇంతలో తల్లి “జాగ్రత్తగా ఉండు, ఎక్కడో ఉన్నావు మాకు తలియకుండా కొంపలుముంచకు అంటుంది”.

తల్లి మాటలకూ శారద బాధ పడుతుంది.అప్పుడే అనిల్ దగ్గర్నుంచి ఉత్తరం వస్తుంది “నువ్వు ఇతరుల ఒత్తిడికి,అధికారానికి తల ఒగ్గేదానివి కావన్న సంగతి నాకు తెలుసు. అందుకే నువ్వంటే నాకింత గౌరవం, ఇష్టం, ఆరాధన” అన్న అనిల్ మాటల తో ఆమె హృదయం ఉప్పొంగుతుంది. అందులోనే నిన్ను కలవడానికి మా అక్క సిద్దేశ్వరి వస్తోంది. రేపు నువ్వు ఎయిర్ పోర్ట్ కి వెళ్ళు అని ఆమెకి రాస్తాడు.ఆ ఉత్తరం చదువుకున్న శారద ఆ రాత్రి కమ్మని కలలతో తేలిపోతూ ,అందమైన రేపు గురుంచి ఎదురుచూచ్తుంది. ఆ రేపు లో ఎన్నో కొత్త ఆశలు, కోటి కోరికల వెలుగులు విరజిమ్ముతూ అందంగా, మనోహరంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ వెలుగుల కాంతులు ఆమె మనసు నిండా పరచు కొన్నాయి.

రేపటి వెలుగు నాయిక శారద మృదుస్వభావి, కార్యసాధకరాలు                                  

కొవ్వొత్తి: ఇందులో కథానాయిక లలిత, …చిన్నప్పటి నుంచి,తన కోసంకాక, ఇతరులకోసమే బ్రతకడం నేర్చుకున్న లలిత. తల్లి కావాలన్న అతి సహజమైన కోరికను తీర్చుకోలేని దురదృష్టవంతురాలు లలిత. కొవ్వొత్తిలా తను కరిగి పోతూ ఇతరులకు వెలుగు నిచ్చే కొవ్వొత్తికి తన చుట్టురా చీకటే మిగుల్తుంది.ఆ నాటి సాంఘిక పరిస్థితుల కి అద్దం పట్టిన నవల ఇది. రచయిత్రి ఒక్క మాట అంటారు చివరిలో “ప్రకాశించే శక్తి ఉన్నంతవరకు వెలుగును ఇస్తూనే ఉండాలని”

లలిత ఒక నాటి మధ్య తరగతి మహిళల కి ప్రతి రూపం

ఎక్కవలసిన రైలు: మాధవి ,పోట్ట్టపోసుకోవడం కోసం ఉద్యోగానికి పట్నం వస్తుంది. ఉద్యోగం ఇచ్చిన పెద్ద మనిషి చాల మంచి వాడు. ఇంట్లో పిల్లలా చూసుకుంటాడు. వారి బంధువు సుందరమూర్తి, ఒకర్నొకరు ఇష్టపడతారు. జీవితాన్ని ఏంటో సుందరం గ ఊహించుకుంటూ బంగారు కలలుకంటున్న మాధవి ఒక్క సారిగా వాస్తవ ప్రపంచం లోకి వస్తుంది. తనకు సుందరమూర్తి కి గల అంతరం తెలుసుకొని రెండో పెళ్ళివాడైన వాసుదేవమూర్తి ని చేసుకుంటుంది. మాధవి ని పెళ్లి చేసుకోలేక పోయిన సుందరమూర్తి ఎక్కవలసిన రైలు అతడు ఎక్కకుండానే వెళ్ళిపోతున్న రైలు వెనుక ఎర్రదీపాలు అతన్ని చూసి వెక్కిరిస్తున్నాయి, అతని మనసు ,కాలం విలువ తెలుసుకొని బుద్దిహినుడా,జీవితం లో నీకిది గుణపాఠం అంటూ హెచ్చరించింది. అని ముగిస్తారు.

ఇందులో మాధవి పాత్ర ఒక సజీవమైన పాత్ర. కోరింది దొరకక పోయినా,దొరికిన దానితో ఆత్మ వంచన చేసుకోకుండా,తృప్తి పడే పాత్ర.

విశాలాక్షి గారి రచనలలో ఒక గమ్మతైన విషయం కనిపిస్తుంది. ఆమె రాసిన తల్లి పాత్రల కొంచెము,కోపం,దురుసుస్వభావంగా ఉండేవి అయితే, అత్తగారి పాత్రలు మాత్రం ఎప్పుడూ కూడా కోడలని ప్రేమతో చూసుకుంటూ, అభిమానంగా ,సపోర్ట్ ఇచ్చే విధంగా ,ఉంటాయి.

ఇలా మన కళ్ళ ముందు సజీవంగా తిరగాడే పాత్రలు ఎన్నో ఎన్నోన్నో సృష్టంచిన ఘనత శ్రీమతి ద్వివేదులవిశాలాక్షి గారిది. ఆ మహా రచయిత్రికి సారంగ సాహిత్య వార పత్రిక తరపున సాహితీ నివాళులు సమర్పిస్తూ……………

-మణి వడ్లమాని

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. alluri gouri lakshmi says:

    బావుంది మణీ ! పాత్రల పరిచయం చేసావు.
    ఆ నవలలు చదివిన భావన కలిగింది
    థాంక్స్..మంచి వ్యాసం రాసావ్

  2. Jagadeeshwar Reddy Gorusu says:

    ఈ మధ్య కూడా చెప్పిన గుర్తు … ద్వివేదుల విశాలాక్షి గారు గొప్ప రచయిత్రి అనడానికి ఆమె రాసిన ” మనస్వి ” ఒక్క కథ చాలు. ఇక నవలల గురించి చెప్పక్కర లేదు. విశాలాక్షి, అరవింద లాంటి వాళ్ళు ప్రత్యేకమయిన రచయిత్రులు. నా చిన్న తనం లో ఆంద్ర ప్రభలో వచ్చిన ఎక్కవలసిన రైలు , రేపటి వెలుగు సీరియళ్ళు, వాటికి బాపు గారి బొమ్మలు ఇంకా కళ్ళకు కట్టినట్టు ఉన్నాయి . విశాలాక్షి గారిని 10 ఏళ్ళ కిందట (విశాఖ, పెద్ద వాల్తేర్ లోని స్వర్ణముఖి అపార్ట్మెంట్స్ లో ఉండగా ) కలిసిన గుర్తు .

  3. Rajesh Yalla says:

    విశాలాక్షి గారి రచనలపై చక్కని వ్యాసం. చక్కగా సమీక్షించారు మణిగారూ! అభినందనలు.

  4. amarendra dasari says:

    నా టీనేజ్ లో ఒక వేపు కోడూరి/ yeddanapudi మరోవేపు రంగనాయకమ్మ/ రావి శాస్త్రి ..నడుమ విశాలాక్షి/ మాలతీ చెందూర్..ఐ లవుడ్ హర్ హరివిల్లు ..దాన్ని ఇప్పటికి ఒక పాతిక సార్లు చదివాను ..ఆవిడను రెండు మూడు సార్లు కలిసాను..a ఫ్రెండ్లీ పర్సన్ , ఫ్రెండ్లీ రైటర్ ..

  5. psmlakshmi says:

    వివరణ చక్కగా వున్నది మణిగారూ

  6. Mani Vadlamani says:

    నా వ్యాసం చదివి స్పందిచిన వారందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు .

  7. Anasuya Kanneganti says:

    మణి v మణి ..గారూ నిజానికి నేను ద్వివేదుల విశాలాక్షి గారి పుస్తకాలు ఏవైనా చదివేనో లేదో గుర్తులేదు ..కానీ వారు , విశాఖపట్నం వారింటికి రమ్మని లేఖిని అధ్యక్షులు శ్రీమతి డా.వాసా ప్రభావతి గారి ద్వారా లేఖిని సభ్యులందరినీ ఆహ్వానించిన సందర్భంగా ఒకసారి విశాలాక్షి గారి గురించి వాసా గారికి , నాకూ డిస్కషన్ వచ్చింది..ఆ ప్రాంతం రెండు రోజుల పాటు ఏదైనా ప్రోగ్రాం వేద్దామా అన్న ఆలోచన చేసాము . కాని ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు ..ఆ సందర్భంగా వారి పుస్తకాలు చదవాలని చాల ద్రఢంగా అనుకున్నాను కూడా ..కానీ ఈలోపే వారు వెళ్ళిపోవటం జరిగింది ..అయితే ఎం ? వారి కలం విదిల్చిన అక్షర ముత్యాలు వారు లేనప్పటికీ ఎప్పటికీ నిలిచే ఉంటాయి ..అయితే వారి మీద నీవు వ్రాసిన ఆ వ్యాసం, వారి రచనల్ని నీదైన శైలిలో నువ్వు వివరించిన తీరు చాల బాగుంది..ఈ ఆలోచన రావటం అభినందనీయం….

  8. Mani Vadlamani says:

    ధన్యవాదాలు అనసూయా ! నా వ్యాసం చదివి స్పందించి నందుకు .

Leave a Reply to Mani Vadlamani Cancel reply

*