ఉత్తరమెరికా నుండి మొట్ట మొదటి తెలుగు కథ 50ఏళ్ళయిన సందర్భంగా “అమెరికాలో తెలుగు కథ” అన్న అంశంపై ప్రసంగించమని వంగూరి చిట్టెన్ రాజు గారు అడిగారు. ఆ సభలో ప్రసంగమే ఇది.
అమెరికాలో తెలుగు కథ అంటే అమెరికా రచయితలు రాసిన తెలుగు కథా, లేక అమెరికా జీవితం గురించిన తెలుగు కథా అన్న సందేహం వచ్చింది. అమెరికా జీవితం గురించే వారి భావన అయ్యుంటుందని నేను భావించి – ప్రస్తుత అమెరికా జీవిత తెలుగు కథ – దాని బాగోగులూ – భవిత గురించి నా పరిశీలన మీ అందరితో పంచుకుంటాను.
అమెరికాలో తెలుగు కథ పుట్టి ఏభయ్యేళ్ళు దాటినా అమెరికా తెలుగు కథకి ఒక రూపం, గొంతూ వచ్చింది గత పదిహేనేళ్ళుగానే అని చెప్పాల్సి వుంటుంది. అది కూడా ఇంటర్నెట్ సాంకేతిక మాధ్యమం వచ్చిన తరువాత డయాస్పోరా తెలుగు కథ అన్నది అందరి నోళ్ళల్లోనూ నలిగింది. అంతవరకూ తానా, ఆటాలకి సావనీర్లలో కథలు వచ్చినా అవన్నీ కథలుగా గుర్తించడం అన్నది తెలుగు కథా సాహిత్యకారులకి పట్ట లేదు. అడపాదడపా ఒకరిద్దరి పేర్లు వారికి తెలిసినా తెలుగు కథలో డయాస్పోరా అన్న సరికొత్త పాయని గుర్తించింది 1998, 99ల తరవాతనే!
దీనికి మొదటి కారణం కంప్యూటర్ సాంకేతిక ప్రగతి. అమెరికాలో తెలుగువారి సంఖ్యం పెరగడానికీ, సాహిత్య రంగం కొత్త పద్ధతుల్లో పాఠకులకి చేరవేయడానికీ ఇంటర్నెట్టే ముఖ్యకారణం. అప్పటి వరకూ ఎవరైనా కథ రాయాలంటే చిత్తు ప్రతి నుండి అచ్చుప్రతిలో కాగితానికి ఒక వైపునే రాసి ఇండియాలో పత్రికలకి పంపాలి. ఆ పత్రికలు వాళ్ళు అచ్చేస్తారో, చెత్త చేస్తారో తెలియని కాలం. ఇంటర్నెట్ సాహిత్య మార్గాన్ని సుగమం చేసింది. ఈమెయిల్ ద్వారా సరాసరి కథ పంపే మార్గం అయ్యింది. తెలుగులో టైపు చేసుకోవడానికి అనేక సాఫ్ట్వేర్లు వచ్చాయి. ఈ దరిలో చాలామంది కొత్త రచయితలు కలంపట్టారు, నాతో సహా!
వలసదారులతో ఏర్పడ్డ అమెరికా దేశంలో అనేక డయాస్పోరా కమ్యూనిటీలున్నాయి. చైనీస్, ఆఫ్రికన్లు, స్పానిష్ వాళ్ళు, ఐరిష్ వాళ్ళనీ వీరిలో ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఉన్న ఊరునీ, కన్నవాళ్ళనీ, దేశాన్ని వదిలి ఒక కొత్త ప్రపంచంలో అడుగు పెట్టడంటే అంత తేలికయిన విషయం కాదు. భాషా పరంగా, సాంస్కృతిక పరంగా అనేక ఒడిదుడుకులు ఉంటాయి. అవన్నీ నిలదొక్కుకొనీ తమకంటూ ఒక ప్రత్యేక ఉనికిని చాటుకోవడం ఈ డయాస్పోరా కమ్యూనిటీల ప్రత్యేక లక్షణం.
అంత వరకూ అమెరికా కథగా చెలామణీ అవుతూ వస్తున్న తెలుగు కథకులకి డయాస్పోరా అన్నది అన్వయించి, ఆ స్పృహ కల్పించింది వేలూరి వేంకటేశ్వరరావు గారు. అసలు డయాస్పోరా అంటే ఏవిటి? “The word diaspora often invokes – the imagery of traumas of seperation and dislocation, and this is certainly a very important aspect of the migratory experience. But diaspora are also potentially the sites of – hope and new beginnings. They are contested cultural – and political terrains – where individual and collective memories collide, reassemble and reconfigure.” – అని లండన్ యూనివర్శిటీలో సోషియాలజీ ప్రొఫెసర్ – Avtar Brah – “Cartographies of Diaspora” పుస్తకంలో చెప్పిన మాటలివి.
గత వందేళ్ళుగా డయాస్పోరా మీద కొన్ని వందల వ్యాసాలూ, పుస్తకలూ వచ్చాయి. ఎన్నో సిద్ధాంతలూ, ప్రతిపాదనలూ, చర్చలూ జరిగాయి. వాటిలో ఈ మధ్య పుట్టుకొచ్చిందే – Third Space Theory. ఈ పదాన్ని సృజన లేదా కోయిన్ చేసింది – Oxford University లో హోమీ.కె.భాభా అనే ఒక ఇండియన్ ప్రొఫెసరు. ఈ డయాస్పోరా కమ్యూనిటీల గురించి చెబుతూ – The diasporic communities occupy a unique interstitial third space, which enables negotiation and reconfiguration of different cultures through hybrid interactions. Third Space Theory explains the uniqueness of each person, actor or context as a “hybrid”.
దీన్ని బట్టి చూస్తే డయాస్పోరా కమ్యూనిటీల ప్రత్యేకత – మిశ్రిత జీవనం; ఏకత్వంలో భిన్నత్వం.
వీరికి రెండు కాదు – మూడు ప్రపంచాలు – మొదటి రెండూ, సొంత, వలస దేశాలయితే మూడోదే ఈ “కొత్త జాగా”. ఆ జాగాలో ఊపిరి పోసుకున్నదే డయాస్పోరా సాహిత్యం. ఈ మూడో జాగాలో రెండు పార్శ్వాలున్నాయి. ఒకటి తమదైనా డయాస్పోరా అనుభవాలకి సాహిత్య రూపం ఇవ్వడం. రెండోది – తమ సాహిత్యాన్ని వలస దేశానికి చేరవేయడం.
మొదటిది అమెరికా కథకులు చేస్తున్నారు. రెండోది – వెల్చేరు నారాయణ రావు గారు లాంటి వారు చేస్తున్నది. అంటే – మన సాహిత్యాన్ని ఇక్కడి భాషలో అంటే ఇంగ్లీషులోకి అనువదించి మన సాహిత్యాన్ని అందించడం. మొదటి చాలా తేలిక. రెండోది అతి కష్టమైనది.
ఈ డయాస్పోరా లక్షాణాల్లో మొదటి నుండి పదివరకూ ఒకటే ఉంటుంది. అది – నాస్టాల్జియా (మాతృదేశపు జ్ఞాపకాలు). మిగతావి ప్రధానంగా మూడు వర్గాలు – 1) ఎన్నేళ్ళు వలస ఉన్నా పరాయి వాళ్ళమే అన్న భావన 2) భాష, సాంస్కృతుల సంఘర్షణ 3) విలువలు, ఉనికి, ఉమ్మడితనం, దృఢమైన ఏకత్వ నిరూపణ
కారణాలు ఏమయితేనేం, సాధారణంగా డయాస్పోరా కమ్యూనిటీలన్నిటిలో ఈ పైన చెప్పిన అన్నిలక్షణాలూ కనిపించాల్సిన అవసరం లేదు. ఏ కొన్నిలక్షణాలు ఉన్నా, దానిని డయాస్పోరా గా చెప్పవచ్చు.
మాతృదేశం వదిలి వలస వచ్చిన కొత్తలో ప్రతీ ఒక్కరినీ cognitive dissonance ఆవరించుకొని ఉంటుంది. cognitive dissonance అంటే – cognitive dissonance is the mental stress or discomfort experienced by an individual, who confronted by new information that conflicts with existing beliefs, ideas, or values. రెండు విభిన్న సంస్కృతులూ, నమ్మకాల మధ్య ఊగిసలాడే డోలాయమాన స్థితి. ఈ సంఘర్షణకి అంతర్లీనగా సంస్కృతీ, అలవాట్లే హేతువులు అయ్యే అవకాశం చాలా వుంది.
ఈ సంఘర్షణలో – కొంత అస్పష్టతా, గందరగోళమూ, అపార్థమూ లేదా విబేధం ఏర్పడచ్చు. ఇవి కాకుండా కొంత ఉద్రిక్తతా, అఘాతం కూడా కలగవచ్చు. ఇవన్నీ వేరే జాతులు – అంటే అమెరికాలో ఉండే అమెరికన్లూ, ఆఫ్రికన్లూ, స్పానిష్ వాళ్ళూ, చైనీయులు, వంటి వారితో కలిసినప్పుడు కలగుతాయి. కేవలం మనుషుల మధ్యే కాకుండా వస్తుగతంగా కూడా ఉండచ్చు.
ఈ లక్షణాల కలబోత వల్ల ఒక కొత్త మిశ్రిత జాగా ఏర్పడుతుంది. దాన్నే హైబ్రిడ్ స్పేస్ అని కూడా అంటారు. డయాస్పోరా కమ్యూనిటీల ప్రత్యేకత ఈ మిశ్రిత జాగా – కేవలం వారికొక్కరికే పరిమితమైన ప్రపంచం. అందులో అనుభవాలూ, జ్ఞాపకాలూ వారికే సొంతం. అందుకే డయాస్పోరా అన్నదానికి అంత ప్రాముఖ్యత వచ్చింది. డయాస్పోరా అనుభవాల్లోంచే కొత్త సాహిత్య రూపం వెలిసింది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇక్కడ అమెరికాలో ఉన్న మనలాంటి వాళ్ళకి రెండు ప్రపంచాలు కాదు. ముచ్చటగా మూడున్నాయి. రెండు ప్రాంతాల సాహిత్యాలకి వారధిగా ఉంటూ మనకి మనం ఏర్పరుచుకున్న కొత్త సాహిత్య వాతావరణం ఈ తెలుగు డయాస్పోరా! ఇంటర్నెట్ రాక మునుపు కొంతమంది డయాస్పోరా కథలూ, అనుభవాలూ రాసినా అవి పదిమందికీ, ముఖ్యంగా తెలుగునాట అంతగా ఎవరికీ అవగాహన లేదు. ఇప్పుడు ప్రతీ పది తెలుగు కుటుంబాలకి ఒకళ్ళు అమెరికాలో ఉన్నారు. అందువల్ల వాళ్ళకీ అవగాహన పెరిగింది. తద్వారా ఇక్కడి సాహిత్యాన్ని కూడా గుర్తించడం మొదలయ్యింది. ముఖ్యంగా ఇంటర్నెట్ ఈ తెలుగు డయాస్పోరా వేదికయ్యింది. వాళ్ళకీ ఇక్కడి అలవాట్లూ, పద్ధతులూ జీవన విధానంపై కొంత అవగాహన ఏర్పడింది. అందువల్ల ఇక్కడి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ వచ్చిన సాహిత్యాన్ని అర్థం చేసుకోడం సులభం అయ్యింది. ప్రపంచపు డయాస్పోరా సాహిత్యంలో ప్రత్యేకంగా చెప్పుకో తగ్గవి – మొదట ఆఫ్రికన్లూ, రెందు స్పానిష్ వాళ్ళూ. వీళ్ళు కాకుండా చైనీస్, వియత్నమీస్ వాళ్ళూ ఉన్నారు. భారత దేశాన్ని తీసుకుంటే ఎక్కువ డయాస్పోరా సాహిత్యం వచ్చింది పంజాబీలో. వాళ్ళ తరువాతే మిగతా వారిది. దక్షిణ భారత దేశం తీసుకుంటే డయాస్పోరా కథా సాహిత్యంలో తెలుగువాళ్ళే ముందున్నారు. ఇప్పటివరకూ నాకు లభించిన వివరాల ప్రకారం సుమారు నూట ఏభైకి పైగా డయాస్పోరా కథలు వచ్చాయి. ఉజ్జాయింపుగా సుమారు 50 మంది పైగా కథకులు కనిపించారు. వారిలో విరివిగా కొంతమంది రాస్తే, ఒకటి రెండు రాసినవాళ్ళు మరికొంతమంది ఉన్నారు. ఈ నూట ఏభై కథల్లో 90 శాతం 1995 తరువాత వచ్చినవే ఎక్కువ. నేను కేవలం కథలు గురించే మాట్లాడుతున్నాను, వేరే సాహిత్య ప్రక్రియల గురించి కాదు. **
అమెరికా డయాస్పోరా కథల్లో తరచుగా కనిపించే వస్తువులు
0) ఇక్కడి రూల్సునీ, పద్ధతుల్నీ అవహేళన లేదా వెక్కిరించిన హాస్య రచనలు 1) అమెరికా చెత్త – ఇండియా గొప్ప 2) ఇక్కడి వయలెన్స్, టెర్రరిజం 3) పెళ్ళి, డేటింగ్ కల్చర్ లేదా వివాహేతర సంబంధాలు 4) కుటుంబ సమస్యలు – ముఖ్యంగా పిల్లల పెంపకం, ఇండియాలో తల్లి తండ్రులకి ఆసరా 5) ఇండియా తిరిగి వెళ్ళి పోవడం. 6) స్త్రీల గృహ హింస
అక్కడక్కడ ఒకటో, రెండో వేరే అంశాల మీద కథలు వచ్చినా స్థూలంగా ఈ కథాంశాలు దాటి ముందుకెళ్ళ లేదు. ముందుకెళ్ళక పోవడానికి కారణాలు కూడా ఉన్నాయి.
అమెరికాకి తెలుగు వారి వలస సంఖ్య గణనీయంగా పెరిగింది గత 16, 17 ఏళ్ళగానే! మిగతా జాతుల్లాగ అంటే చైనీస్, వియత్నమీస్, స్పానిష్ వాళ్ళల్లా సమాజంలో అన్ని తరగతుల విభిన్న వ్యక్తులూ ఇండియా నుండి ఇక్కడికి వలస రాలేదు. వచ్చిన వాళ్ళందరూ సరాసరి ఉద్యోగానికో, లేదా పై చదువుకో వచ్చిన వాళ్ళు తప్ప వేరే రకం వాళ్ళు కాదు. గత పదహారేళ్ళుగా వలస వచ్చిన తెలుగువాళ్ళల్లో 90 శాతం పైగా పెద్ద పెద్ద జీతాలకి వచ్చిన వాళ్ళే!
ఇక్కడున్న తెలుగువాళ్ళు అమెరికన్ మధ్య తరగతి వాళ్ళకంటే పైనే ఉన్నట్లు లెక్క. అంటే “యెబవ్ మిడిల్ క్లాస్” క్రిందకి వస్తారు. వీళ్ళందరికీ అమెరికా వ్యవస్థ లేదా జీవితంలో భాగం కావడం అన్న అవసరం లేదు.
ఎందుకంటే – ఉదయాన్నే ఆఫీసుకెళ్ళడం – సాయంత్రం రావడం – ఇంటికొచ్చి డిన్నర్ చేసి రాత్రి ఆగడో, దూకుడో సినిమా చూసుకోవడం – వీలయితే ఇండియాలో సొంత వాళ్ళని పలకరించుకోవడం – ఇంకాస్త టైము దొరికితే గ్రేట్ ఆంధ్రా సైటుకెళ్ళి గాసిప్ చదవడం – ఇవే రోజువారీ దినచర్య. వీకెండ్ వస్తే గ్రోసరీ, లేదా బర్త్ డే పార్టీలూ, మాల్స్ చుట్టూ ప్రదక్షిణాలూ ఇవి దాటి ఉండవు.
అందువల్ల వీళ్ళకి అమెరికన్ సమాజంలో భాగం అవడం కానీ, లేదా వారి జీవితాలతో సంబంధం ఏర్పరచుకోవడం కానీ చాలా చాలా తక్కువ. పోనీ పనికెళ్ళినప్పుడయినా వేరే వాళ్ళతో సంబంధం ఉంటుందా అంటే అదీ తక్కువే! అక్కడా ఇదే ఇండియన్ గ్యాంగ్! కొద్ది చైనీయులూ, మరికొంతమంది అమెరికన్లూ! వీరితో కలిసి మెలిసి తిరిగేదీ తక్కువే!
అందువల్ల ఇక్కడి అమెరికన్ సమాజంలో వుండే సమస్యలూ, తద్వారా వచ్చే ఘర్షణలూ, మంచి చెడ్డలూ తెలిసే అవకాశం సున్నా! ఇప్పుడు చెప్పినవన్నీ కథా రచయితలకీ వర్తిస్తాయి. అందువల్ల వారు రాసే కథలు కానీ, కథా వస్తువులు కానీ, పైన చెప్పిన అంశాలు దాటి వెళ్ళడం లేదు. కథా వస్తువు నేపథ్యం మాత్రమే అమెరికా అవుతోంది తప్ప మిగతాదంతా అచ్చమైన ఇండియా జీవితమే!
పేరుకి డయాస్పోరా కథ అనుకుంటున్నాం, అంతే తప్ప కథకి నేపథ్యం అమెరికానే అవ్వాల్సిన అవసరం లేని కథలు కూడా వున్నాయి. అదేకథ అమలాపురం, ఆముదాల వలసలో అయినా చక్కగా చెల్లుతుంది.
ఇది చాలా విచారించదగ్గ విషయం. మిగతా డయాస్పోరాలు, అంటే చైనీస్, మెక్సికన్ డయాస్పోరాల్లో వచ్చిన సాహిత్య వైవిధ్యం మన తెలుగు కథకి లేదు. ఎందుకంటే – మనకి ఒక స్థాయి మనుషులతోనే ప్రతీ రోజూ ప్రతిస్పందన ఉంటోంది. ఈ పరిస్థితి మారి తెలుగు కథా రచయితలు మరింత లోతుగా ఇక్కడి అధ్యయనం చేస్తే మంచి కథలు వచ్చే అవకాశం ఉంది. ** ఇహ ఈ అమెరికా తెలుగు కథలు వండి వార్చే రచయితల్ని చూస్తే – నాలుగు తరగతులుగా కనిపిస్తారు:
1) ఇక్కడి వాళ్ళు ఇక్కడి జీవితం గురించి రాసేవాళ్ళు 2) ఇక్కడి వాళ్ళు అక్కడి జీవితం లేదా అనుభవాలు గురించి ఎప్పడం ( ఇదే ఎక్కువ ) 3) అక్కడి వాళ్ళు ఇక్కడి సందర్శకులుగా వచ్చి ఇక్కడి జీవితం గురించి రాసేవాళ్ళు ఇవి కాకుండా నాలుగో కేటగరీ వుంది. ముందు ఈ మూడా చర్చించాక నాలుగోది చూద్దాం. ముందు చెప్పిన మొదటి రెండింటితే పేచీ లేదు. ఎందుకంటే ఇక్కడున్నవాళ్ళకి ఇక్కడి జీవితం బాగానే తెలిసే అవకాశం ఉంది. తెలుగునాట పెరిగి చదువుకున్నారు కనుక అక్కడి జీవితం గురించీ బాగానే తెలుస్తుంది. కాబట్టి ఆ కథల్లో కనీసం 80 శాతమయినా సాధికారత ఉండే అవకాశం చాలా ఎక్కువ.
అసలు పేచీ అల్లా మూడోది – అంటే అక్కడి వాళ్ళు నెలకో రెణ్ణెల్లకో, మహా అయితే మూణ్ణెల్లకో అమెరికా వచ్చి – ఇక్కడి జీవితాన్ని కాచి వడబోసినట్లుగా కథలు రాయడం.
కేవలం కథలే కాదు, నవలలూ, ట్రావెలాగ్లూ, చాలా వచ్చాయి. 1) అమెరికాలో ఉండే తెలుగు వారికి డాలర్లు తప్ప ఏం కనిపించవు. 2) ఎంతో యాంత్రికంగా, ఆర్టిఫిషీల్ గా బ్రతుకారు. 3) పగలు కారూ, రాత్రి గుర్రమ్మీద స్వారీ చేస్తారు. 4) రోజూ మంచి నీళ్ళ బదులు మందు తాగుతారు. 5) వాళ్ళందరివీ డొల్ల జీవితాలే తప్ప ప్రేమా ఆప్యాయతలు వుండవు. 6) ఇక్కడున్న పిల్లలు తల్లితండ్రుల్ని పట్టించుకోరు. (అక్కడికేదో ఇండియా కుటుంబాల్లో తల్లి తండ్రుల్ని మహా ప్రేమగా చూస్తున్నట్లు. ఒకే వూళ్ళో ఉండి తల్లి తండ్రుల్ని పట్టించుకోకపోయినా అక్కడ పరవాలేదు. చెల్లుతుంది కూడా)
ఈ విధంగా సాగుతాయి ఆ కథాంశాలు. ఈ కథలు చదివి అమెరికాలో ఉన్న తెలుగువాళ్ళందర్నీ పాఠకులు రాక్షసుల్లా పరిగణించే ప్రమాదం ఉంది. ఈ కేటగిరీ కథకుల్ని Diaspora Story Visitors అనచ్చు. ఇహ నాలోగోదీ, చిట్ట చివరిదీ – ఇక్కడ అంటే అమెరికాలో ఒక్క సారీ కాలు మోప కుండా ఇక్కడి జీవితం గురించి రాసే అక్కడి వాళ్ళు. నా దృష్టిలో ఇది అత్యంత ప్రమాదకరమయిన గుంపు. వీరి సాహిత్య సేద్యానికి ఆయువు పట్టు ఇంటర్నెట్. రాత్రిబవళ్ళు నెట్టులో దున్నేసి కథలు రాసేస్తారు. అవి అచ్చుకూడా అయిపోతాయి. ఖర్మా కాలి – నా లాంటి వాళ్ళు ఎవరైనా అదేవిటని ప్రశ్నిస్తే – అంతే – సరికొత్త ప్రపంచ యుద్ధానికి తెర తీసిన వాళ్ళమవుతామన్నమాట. వాళ్ళు రాయకూడదని కాదు. రాసినదానికి సాధికారత ఉండాలి కదా? పది శాతం మించి కూడా ఉండదు, ఆ రచనల్లో! ఇంటర్నెట్ వచ్చి కొత్త రచయితల్నే కాదు, సరికొత్త రచనా రీతుల్ని కూడా మోసుకొచ్చింది. ఇలా రచనలు చేసే వాళ్ళని Distance writers లేదా దూరసంచార కథకులు అనచ్చు.
ఈ విధంగా అమెరికా తెలుగు కథ సరికొత్త పుంతలు తొక్కుతూ ఇంటెర్నెట్ క్లౌడ్ మీదుగా ఎగురుతోంది. ఆశ్చర్యకరమయిన విషయం ఏవిటంటే – వలస జీవితమ్మీద వచ్చిన కథల్లో ఇక్కడ అమెరికాలో ఉన్న పోజిటివ్నెస్స్(positive aspects) మీద కథలు ఒకటో, రెండో వచ్చాయంతే! మనం అందరం సొంతూరిని, కుటుంబాలనీ వదిలేసి ఇన్ని వేల మైళ్ళ దూరం వచ్చి హాయిగా గడుపుతున్నామంటే కారణం ఇక్కడ ఉండే positiveness వలనే! నేను అమెరికా వచ్చాకా చాలా మంచి పద్ధతులు అలవర్చుకున్నాను. మొట్టమొదటిది – Time management – అంటే టైముని మేనేజ్ చెయ్యడం కాదు. మన టైముకీ, ఇతరుల కాలానికీ విలువనివ్వడం. ఉదాహరణకి – మీరెప్పుడైనా అమెరికన్ల పార్టీలకి వెళితే తెలుస్తుంది. అందరూ ఠంచనుగా టైం పాటిస్తారు. అనీ పద్ధతిగా ఉంటాయి. అలాగే – పదిమందితో కలిసి TEAM గా పనిచేయడం. ఇలా చెప్పడానికి చాలా ఉన్నాయి. అమెరికా వచ్చిన ఈ ఇరవయ్యేళ్ళల్లో ఒక్కసారి కూడా నేను లంచం ఇవ్వలేదు. ఇంకా – ఇక్కడ ఎంతో మంది వ్యాపారాలూ గట్రా చేస్తున్నారు. ఇండియాలో మనకి పక్క రాష్ట్రం వాళ్ళ పొడే గిట్టదు. అలాంటిది వేరే దేశాల వాళ్ళు వలస వస్తే మన ఇంత open గా ఉండగలమా? ఏమో – నాకు డౌటే!
ఇలాంటి అంశాలమీద కథలు అంతగా రాలేదు. వచ్చిన కథల్లో చాలా భాగం వ్యంగ్యంగా, హాస్యంగా, ఎగతాళి చేస్తూ వచ్చినవే! ఈ నేపథ్యం మారి మంచి కథలు రావాలి.
ఉదాహరణకి – చాలా కాలం క్రితం అంటే దాదాపు పదేళ్ళ క్రితం ‘ఒంటరి విహంగం’ అన్న కథొకటి రాసాను. భార్య పోయిన తరువాత ఇండియా నుండి ఓ పెద్దాయన కొడుకు దగ్గరకి అమెరికా వస్తాడు. కూతురు కూడా ఇక్కడే ఉంటుంది. కొడుకు ఒక సారి తను పనిచేసే కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఓ అమెరికన్ పెళ్ళి రిసప్షెన్ కి తండ్రిని కూడా తీసుకెళతాడు. ఆ అమెరికన్కది రెండో పెళ్ళి. మొదటి పెళ్ళంతో విడాకులు తీసుకొని ఒంటరితనం భరించలేక పెళ్ళి చేసుకున్నాడని కొడుకు తండ్రికి పెళ్ళి కెళుతూ చెబుతాడు. కొంతకాలం ఇక్కడున్నాక తండ్రి ఇండియా వెళిపోతాడు. ఇండియా వెళ్ళిన తరువాత అతనికి హార్ట్ ఎటాక్ వస్తుంది. సరిగ్గా అదే సమయానికి అమెరికాలో కోడలి ప్రసవం రావడంతో కొడుకు ఇండియా వెళ్ళడు. కొన్ని పరిస్థితుల వల్ల అది కాస్తా వాయిదా పడుతూ వస్తుంది.
సరిగ్గా అదే సమయంలో తనకి అనారోగ్యం చేసినప్పుడు సాయం చేసిన ఒకామెను తండ్రి పెళ్ళి చేసుకుంటున్నాడనీ విషయం తెలుస్తుంది. కొడుకూ, కూతుళ్ళిద్దరూ పెళ్ళిని తిరస్కరిస్తూ తండ్రిని ఆడిపోసుకుంటారు. చివరి దశలో తనెందుకు పెళ్ళి చేసుకోవల్సి వచ్చిందో చెబుతూ ఉత్తరం రాస్తాడు తండ్రి. కొడుకు ఆయన ఉత్తరాన్ని అంగీకరించక చెత్త బుట్టలో పడేస్తాడు. స్థూలంగా ఇదీ కథ.
ఈ కథ చదివాక అందరూ ముసలి వయసులో తండ్రి పెళ్ళి అవసరమని కొందరూ, అవసరం లేదని ఇంకొందరూ వ్యాఖ్యలు చేసారు తప్ప ఇది ఒక డయాస్పోరా జీవితంలో ఎదురైన సంఘర్షణగా ఒక్కరంటే ఒక్కరు వ్యాఖ్యానించ లేదు. దృష్టి అంతా తండ్రి మీదకీ, ఆయన సమస్య మీదకీ మళ్ళింది తప్ప కొడుకు తండ్రిని అంగీకరించక పోవడానికి కారణం రెండు సంస్కృతుల ఘర్షణగా ఎవరూ గుర్తించ లేదు. ఆ ఘర్షణలో అతను తన పాత అభిప్రాయం వైపే వంగాడు. కథలో కొడుకు పాత్ర #cognitive dissonance# మానసిక స్థితికి ఉదాహరణ. ఇండియాలో ఉన్న పాఠకులని వదిలేస్తే అమెరికాలో ఉన్న పాఠకులూ, కథకులూ ఇది డయాస్పోరా కథ అని చెప్పడానికి సాహసించలేదు. ఈ ఒక్క కథేకాదు, చాలామంది కథకుల రచనలకీ ఇదే పరిస్థితి వుంది. ఇది చాలా దురదృష్టకరమైన అంశం.
ఇప్పుడే ఇలా ఉంటే తెలుగు డయాస్పోరా కథ భవిష్యత్తు ఎమీ అంత ఆశాజనకంగా కనబడడం లేదు నాకు. ఇంతకు ముందు చెప్పినట్లు తెలుగు డయాస్పోరా ఇంకా శైశవ దశలోనే ఉంది. ఇప్పటివరకూ వలస వచ్చిన వాళ్ళు చాలా మందికి తెలుగు సెకండ్ లాగ్వేజ్ గానో లేదా తెలుగు మీడియం లోనో చదువుకున్నారు. అందువల్ల మా తరంలో వలస వచ్చిన వాళ్ళకి తెలుగుతో సంబంధం పోలేదు. ఎంత ఇంగ్లీషు మాట్లాడినా, తెలుగులోనే అంటే మాతృభాషలోనే ఆలోచనలు ఉంటాయి. అవే మెదడు తర్జుమా చేసి ఇంగ్లీషులో చెప్పేస్తుంది. కానీ 2000 తరువాత వచ్చిన చాలా మందికి తెలుగు చదవడం రాయడం వచ్చినా, తెలుగు భాషతోనూ, ముఖ్యంగా సాహిత్యంతో సంబధం తెగిపోయింది. అందరివీ ఇంగ్లీషు మీడియం చదువులే! ఒకళ్ళొ ఇద్దరికో తెలుగు రాయడం, చదవడం వచ్చు. అందులో వెతికితే కొంతమంది రాయడం పైన ఆసక్తి ఉండచ్చు. అందువల్ల ఇక్కడికొచ్చిన యంగ్ తెలుగు జెనరేషన్ కథకులు తయారయ్యే అవకాశాలు చాలా తక్కువ. పోనీ కొత్తగా వచ్చే వాళ్ళతో ఆశాజనకంగా కనిపిస్తోందా? అంటే అదీ లేదు.
ముందు ముందు రాబోయే వాళ్ళ పరిస్థితి ఇంకా అధ్వాన్నం. వారు పేరుకి తెలుగువాళ్ళే కానీ, తెలుగు రాయడం, చదవడం రాని వాళ్ళు. ఇప్పటికే తెలుగు పాఠకుల సంఖ్య గణనీయంగా పడిపోయిందని అనుకుంటూ ఉంటాం. ఇలాంటి వారు అమెరికా వలసవస్తే తెలుగులో రాయాల్సిన అగత్యమూ, అవసరమూ కనిపించడం లేదు. ఇప్పుడున్న పాతిక లేదా అయిదు పదుల తెలుగు కథకులే, అంటే నాలాంటి వాళ్ళు, ముసలితనం వచ్చే వరకూ కథలు రాస్తూ ఉండచ్చు. ఇవన్నీ ఆలోచిస్తే కొత్త కథకులు తయారయ్యే అవకాశాలు మృగ్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అందువల్ల ఇప్పుడున్న తెలుగు డయాస్పోరా కొత్త కథకుల్ని తయారు చేసుకోవాలి. కొత్త కథకులకి మార్గమూ, అవకాశమూ కలిగించాలి.
దానికి వంగూరి ఫౌండేషన్, లేదా ఇతర సంస్థలు తానా, ఆటా దోహదం కలిగించాలి. తెలుగు కథని పరిపుష్టం చేసుకోవడానికి సాహిత్య సమావేశాలూ, వర్క్షాపులూ, చర్చలూ వంటివి తరచుగా నిర్వహించాలి. అలాగే సావనీర్లకే అమెరికన్ తెలుగు కథా రచయితల్ని పరిమితం చెయ్యకుండా ఇక్కడ వచ్చిన డయాస్పోరా కథల్లో కొన్ని మంచివి ఏరి ఒక పుస్తకంగా తీసుకువస్తే బావుంటుంది.
అలాగే డయాస్పోరా రచనలమీద వచ్చిన సమీక్షలూ, విమర్శా కూడా పెరిగే అవకాశమూ, పరిస్థితులూ కలిగించాలి. తెలుగు సాహిత్యం అంటే ఆంధ్రా నుండి దిగుమతి చేసుకునే స్థాయి నుండి మనకి మనమే ఒక కొత్త సాహిత్య ప్రపంచాన్నీ అభివృద్ధి చేసుకోవాలి. డయాస్పోరా కథ మనకే సొంతమయినా మూడో జాగా. దానికి అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరి సహకారమూ, కృషీ అవసరం.
-గొర్తి సాయి బ్రహ్మానందం
భలేబాగా చెప్పారు.
నేను ఇలా categorize చెయ్యలేకపోయానుకానీ. నేను చదివిన డయాస్పోరా రచనల్లో సాధారణంగా అమెరికన్ సాంప్రదాయాలనీ, సంస్కృతినీ తూష్ణీకరిస్తూ, భారత సంస్కృతినిమాత్రం తలకెత్తుకోవడం కనబడుతుంది. బహుశా దీనికి మనవాళ్ళు తీసిన అమెరికన్ సినిమాలు (అమెరికా అల్లుడు, అమెరికా అబ్బాయి, హిందీలోనైతే పూరబ్ ఔర్ పశ్చిం తరహా అన్నమాట) కారణమేమో. ఇక్కడ ఇండియాలోకూడా ప్రక్క రాష్టాం వెళ్ళినప్పుడుకూడా ఒక తెలుగు గుంపుని చుట్టూ తయారుచేసుకొఇ సినిమాలూ, క్రికెట్టు, మందుపార్టీలే లోకమన్నట్లు జీవించడమేతప్ప అక్కడి సంస్కృతిని కొంత తెలుసుకుందామనో, అక్కడి కళారూపాలపై మక్కువపెంచుకుందామనో అనుకొనేవాళ్ళను నెను చాలా కొద్దిమందిని చూశ్డాను.
సాయి గారు చాల వివరంగా,విపులంగా రాసారు,ఒక పక్కే చూడకు అన్నట్లు,నిజమే ఆ అవతలి కోణం గురుంచి కూడా తెలుసుకోవాలి.తెలియచెప్పాలి.
…తెలుగువాళ్ళే కానీ, తెలుగు రాయడం, చదవడం రాని వాళ్ళు. ఇప్పటికే తెలుగు పాఠకుల సంఖ్య గణనీయంగా పడిపోయిందని అనుకుంటూ ఉంటాం.
ఇలాంటి వారు అమెరికా వలసవస్తే తెలుగులో రాయాల్సిన అగత్యమూ, అవసరమూ కనిపించడం లేదు. ఇప్పుడున్న పాతిక లేదా అయిదు పదుల తెలుగు కథకులే, అంటే నాలాంటి వాళ్ళు, ముసలితనం వచ్చే వరకూ కథలు రాస్తూ ఉండచ్చు.
దానికి వంగూరి ఫౌండేషన్, లేదా ఇతర సంస్థలు తానా, ఆటా దోహదం కలిగించాలి. తెలుగు కథని పరిపుష్టం చేసుకోవడానికి సాహిత్య సమావేశాలూ, వర్క్షాపులూ, చర్చలూ వంటివి తరచుగా నిర్వహించాలి. అలాగే సావనీర్లకే అమెరికన్ తెలుగు కథా రచయితల్ని పరిమితం చెయ్యకుండా ఇక్కడ వచ్చిన డయాస్పోరా కథల్లో కొన్ని మంచివి ఏరి ఒక పుస్తకంగా తీసుకువస్తే బావుంటుంది.
డయాస్పోరా కథ మనకే సొంతమయినా మూడో జాగా. దానికి అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరి సహకారమూ, కృషీ అవసరం.
తెలుగు డయాస్పోరా కొత్త కథకుల్ని తయారు చేసుకోవాలి. కొత్త కథకులకి మార్గమూ, అవకాశమూ కలిగించాలి.
సాయి గారు,
చక్కగా చెప్పారు. ఇవి ఒక్క అమెరికా సంయుక్త రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాదు. విభజనాంతరం ఏర్పడ్డ రెండూ రాష్త్రాల వెలుపలున్న ప్రతి తెలుగు సాహిత్యాభిమానికి వర్తిస్తుంది.
మీరు చెప్పిన వర్ణన నాకు వంద శాతం వర్తిస్తుంది.
పదిహేనేళ్ళ బట్టి అమెరికాలో వున్నా మనం సృష్టించుకున్న తెలుగు గుంపు బుడగలో జివించడమే తప్ప, దాన్ని దాటి బయటి జీవితాలని కనీసం తాకనైనా లేదు.
చూడాలని ఎంతో కోరిక వున్నా ఏదో వెనక్కు లాగుతూ వుంటుంది.
ఈ ఆంగ్ల మాధ్యమాలలో చదువువల్ల అమెరికాలోనే కాదు, ఇండియాలోనూ పాఠకుల/రచయితల కొరత వస్తుందేమొ అని బెంగవేస్తుంది.
చాలా చక్కటి, సమగ్రమైన వ్యాసం. అన్ని విషయాలనీ క్రోడీకరించి రాసిన పద్ధతి బాగుంది..!
మీ ప్రసంగ వ్యాసం చాలా బాగుంది. అభినందనలు.
కథలు — కవితలు — ఎన్ని రాసుకున్నా —– అమెరికా అయినా — అమలాపురం అయినా
—- యీ రోజుల్లో చదివే సంక్య ఎంత శాతం ??? ఎక్కడ ఉన్నారు
తెలుగు భాష — ప్రపంచ భాష — అంటూ వారం రోజుల కింద Houston లో
జరిగిన తెలుగు సబల సమాచారం చదివా —-రోజు రోజు కు కనుమ రుగు అవుతున్న
తెలుగు బాష — ప్రపంచ భాష ??? ఒక జోక్
తిరుపతి తెలుగు సబల తో కాని — అమెరికా లో జాతీయ — లోకల్ తెలుగు సంగాల లో కానీ తెలుగు వినిపించదు — కనిపించదు
తెలుగు సంగాల కు సాంబ్రాణి పొగ వేసి తాయిత్తులు కట్టాలి — యిక
ఏ దేశం లో మనం అడుగు పెట్టినా వచ్చింది బతుకు తెరువు కోసమే —
డబ్బు సంపాదన ను బట్టి విలువలు — గుర్తింపులు — మాటలు – ముచ్చట్లు —ప్రేమలు —
Manalo మనమే అంటి పెట్టు కోకుండా —దూరాల ను పెంచుతూ —?? బయిటి జీవితాల ను
తాకే దెప్పుడు ??
అమెరికా అయినా – అమలాపురం అయినా —బాబు గారు స్వంత డబ్బా వాయించుకుంటూ
రోజు టి వి ల లో కనిపించినట్లు — తెలుగు రచయితల లో కూడా అదే తిరు — అవే పోకడలు — నేటి రచయిత ల కు గుర్తింపు — అవార్డ్స్ — శాలువలు కప్పు కోవడం — ఒకరి నొకరు — పొగడుకోవడం — పేస్ బుక్ లో కనిపించడం — బట్టేరింగ్ చేయడం — యీ వ్యవస్థ లో చూస్తున్న నిజాలు — కావా ??
నిజాల కు దాపరికం దేనికి ??– దాగుడు మూతలు ఎందుకు ??
dayospora–కథలు అయినా — – దళిత ,ముస్లిం సాహిత్యం అయినా చదువే వాళ్ళు ఉంటేగా ????
——- బుచ్చి రెడ్డి గంగుల
దాదాపు పదేళ్ల క్రితం న్యూ జెర్సీలో జరిగిన సాహితీ సదస్సుకి వచ్చిన ఆంధ్రభూమి సంపాదకులు శ్రీ M.V.R. శాస్త్రిగారు ఇలా చెప్పారు: గత శతాబ్దపు చివరి దశకంలో ఆంధ్ర ప్రదేశ్ లో అసలు తెలుగు భాష ముఖాన్నికూడా చూడకుండా ప్రాథమిక విద్య నుండీ ఉన్నత విద్యదాకా చదువుకునే వెసులుబాటుని ప్రభుత్వం కల్పించిన తరువాత తెలుగు బోధన ప్రభుత్వం నడిపే బడులకు మాత్రమే పరిమితమయింది. ఈనాడు ఎంతమంది తమ పిల్లలని ఆ బళ్ళల్లో చదువుకోవడానికి పంపిస్తున్నారు?
తెలుగులో మాట్లాడుతున్నారని పిల్లలని రోజంతా ఎండలో నిల్చోబెట్టారని వచ్చిన వార్తలని ఎవరు పట్టించుకున్నారు? ప్రైవేటు స్కూళ్లల్లో చేర్పించేది తెలుగు నేర్పడానికి కాదని తల్లిదండ్రులే నిర్దేశిస్తుంటే ఇంక ఆ సంస్థలని అని మాత్రం ఏం ప్రయోజనం? ఇరవయ్యేళ్లపాటు – అంటే ఒక తరం పిల్లలు – తెలుగుభాషలో చదవడం, రాయడం రాకుండానే పట్టాలు పుచ్చుకున్నారు. వాళ్లు అమెరికా వచ్చారు, వసున్నారు. ఇంక తెలుగు కథలని చదివేవాళ్లు, రాసేవాళ్లుకూడా వాళ్ల ముందుతరాలవాళ్లే అవుతారు – అది అమెరికాలోగానీ, ఇండియాలోగానీ. ఒక పాతికేళ్ళ వయసున్న రచయితో రచయిత్రో తమ కథలకి పాఠకులు ముందుతరాలవాళ్లు మాత్రమే అవుతున్నారని గ్రహిస్తే వాళ్లు నిరాశానిస్పృహలకి లోనవడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే, generation gap వల్ల వాళ్ల కథలు ఆ పాఠకులకు నచ్చకపోవడం, దానివల్ల ఎక్కువ విమర్శలకు గురయ్యే అవకాశం చాలావుంది.
పక్కనున్న తమిళనాడులో ఈనాటికీ మాతృభాష చదవడం, రాయడం రాకుండా విద్యాభ్యాసం పూర్తిచేసే వెసలుబాటులేదు.
తెలుగునాట రెండు ప్రభుత్వాలూ వాళ్ల మానిఫెస్టోలో తెలుగుభాషలో చదవడం, రాయడం హైస్కూల్ దాకా mandatory చేస్తామని రాసుకున్నాయి. కానీ, దాన్ని ఆచరణలో పెట్టడంగూర్చి ఎంతమంది ఆయా ప్రభుత్వాలని నిలదీస్తున్నారు?
ఈనాడు అమెరికానుంచీ రాస్తున్నవాళ్లల్లో సింహభాగం – బ్రహ్మానందంగారు చెప్పినట్లు – 1998 ముందు అమెరికా వచ్చినవాళ్లే. అంటే, వాళ్లు అందరూ దాదాపు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నవాళ్లే! వాళ్లు హైస్కూలు చదువు పూర్తిచేసే సమయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హ్రస్వదృష్టితో చేసిన చట్టాల బారి పడకపోవడం వాళ్ల అదృష్టం!
“అంత వరకూ అమెరికా కథగా చెలామణీ అవుతూ వస్తున్న తెలుగు కథకులకి డయాస్పోరా అన్నది అన్వయించి, ఆ స్పృహ కల్పించింది వేలూరి వేంకటేశ్వరరావు గారు”
ఈ పై వాక్యంతో నేను ఏకీభవించను. ఆ విధంగా ప్రచారం మటుకు బాగా జరిగింది. ఆ స్పృహ కలిగించినది 1998 లో జరిగిన మొట్టమొదటి అమెరికా తెలుగు సాహితీ సదస్సు. ఆ సదస్సు నిర్వహించినది వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా.
.
రచనలు చేయడానికి NRI– RI— లు అవసరమా — ఎవరు పెట్టినా —ఎన్ని సదస్సులు
నడిపినా — రొండు రాష్ట్రాల లో — తెలుగు తనం — తెలుగు భాష —-రోజు రోజు కి తగ్గి పోతూ –
ఆంగ్ల భాష కు పట్టం గడుతూ —- మార్పు వచ్చింది ఎక్కడ —నా అనుభవం యీ 20 ఏళ్ళ లో — అమెరికా తెలుగుసంగాలు కోట్ల కొద్ది డాలర్స్ ను — సినిమా వాళ్ళ కు -రాజకీయ నాయకుల కు —బాబాల కు — జియ్యం గారాల కు కర్చు చేస్తూ —-తెలుగు భాష -తెలుగు సంస్కృతి ని పది కాలాల పాటు కాపాడుకుందాం — అన్న తిరుయే మారిపోయింది —
రాజకీయ వారసత్వం తో — నా మా పట్టింపుల తో విడి పోతూ —వారసత్వం గా — పదవుల మార్పుతో — సంగాల లో జీవిస్తూ — — రాజకీయ లబ్ది కోసం నానా అగచాట్లు పడుతూ —-
యివి మనం చూస్తున్న నిజాలు ——కుటుంభ రాజకియాల్లా — కుటుంభ సాహ్త తి సంస్థలు –donors– — గాలం వేసి పట్టుకునే నిపుణత —విదానం తెలిసి ఉంటె ఎన్ని జాతరలు
-సదస్సులు అయినా చేయ వచ్చు —— బాల కృష్ణ keynote–స్పీకర్ ——//ఇలియానా చీఫ్ గెస్ట్ ????100 వేల డాలర్లు దేవిశ్రీ ప్రసాద్ — 2 గంటల మ్యూజిక్ షో కు ???
tell-the-truth-it- is-not-crime—-
——————–బుచ్చి రెడ్డి గంగుల
NRI–RI–అనుడు అవసరమా — అమెరికా నుండి – కాని – అమల పురం నుండి కాని రాసినా రచన రచనే —(జస్ట్ clarification–)ఎవరు ఏ పేరు పెట్టినా పేరు లో ఏముంది —-
చదవడం ముఖ్యం ——- family– సాహితి సంస్థలు — మనం రాసిన పుస్తకాలు
ప్రచురిస్తే — త్రుప్తి — అంతే చాలు —
ఫండ్స్ raising– కూడా ఒక కల – అ బేస్ దొరుకుతే —అన్ని దేశాల్లో తెలుగు జాతరలు
చేయ వచ్చు —
————————————————————–
బుచ్చి రెడ్డి గంగుల
మనం ఒక్కసారి “మన ప్రాంతాన్ని” వదిలి ఎక్కడికి వెళ్లినా ఇంతేనేమో!!!
నాదొక ప్రశ్న- ఈ ప్రశ్న నన్ను చాలా కాలం నించీ వేధిస్తూంది.
“డయాస్పోరా కథ” (తెలుగు కథల విషయం లో) అంటే “అమెరికా నించి వచ్చిన తెలుగు కథలు” అని మాత్రమే అర్థమా లేక భారతమూ- అమెరికా కాని ఇతర భూభాగాల నించి వచ్చిన తెలుగు కథలకి కూడా ఈ సమూహం లో చోటుందా?
ఎందుకంటే యూరోపు, ఆస్ట్రేలియా, న్యూజీలాండు, కెనెడా, దక్షిణ ఆఫ్రికా కి కూడా తెలుగు వారి వలస పోయేరు, అక్కణ్ణించీ కూడా అక్కడక్కడా కథా రచనలూ, కవితలూ, సాహిత్య వ్యాసాలూ రాస్తున్నారు. కానీ వాటి ప్రస్తావన నేనెక్కడా చూడలేదు. “డయాస్పోరా కథలు” అని వ్యాసాలు రాసే వాళ్ళెవరూ అమెరికా తప్ప ఇంకే ప్రదేశాన్నుంచీ వచ్చే (తెలుగు) కథల గురించి ప్రస్తావించడం నా దృష్టికి రాలేదు. నేనేదైనా మిస్ అవుతున్నానా ?
శారద గారూ,
అమెరికాలీ ఉన్న తెలుగు కథకులే డయాస్పోరా రచయితలు అవ్వాల్సిన అవసరమూ, అగత్యమూ లేదు. భారతదేశాన్ని విడిచి మరో దేశంలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న ఎవరైనా డయాస్పోరా క్రిందకే వస్తారు. అది అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, అంటార్కిటికా కావచ్చు. ప్రస్తుతం అమెరికాలో ఎక్కువ తెలుగు కథకులుండడం వలన డయాస్పోరా కథల్లో వాళ్ళ గురించే ప్రస్తావించాను. మిగతా దేశాల వారి ప్రస్తావన తీసుకురాకపోవడం నా పొరపాటే! కానీ ఒక్క విషయం – అమెరికా కాకుండా మనకి మిగతా దేశాల్లో ఉన్న తెలుగు రచయితలెంతమంది?
మీలాగ ఒకరో ఇద్దరో కనిపిస్తున్నారు. ఇంకా – గత పాతికేళ్ళల్లో అమెరికా వలస వచ్చిన తెలుగు వారి సంఖ్య నమ్మశక్యం కానంతగా పెరిగిపోయింది. ఎవరైనా వాళ్ళ దేశాల్లో అనుభవాలూ, జీవితమూ కథల రూపంలో పంచుకుంటే ఖచ్చితంగా అవి డయాస్పోరా కథే అవుతుంది. అవుతుంది కాదు, అయి తీరుతుంది. అందులో సందేహం లేదు.
-బ్రహ్మానందం
బ్రహ్మానందం గారూ,
మీరే కాదు, ఇంతకుముందు అక్కడక్కడా చదివిన vyAsAlalO కూడా “డయాస్పోరా కథలు” అంటే అమెరికా కథలూ, కథకుల గురించిన ప్రస్తావనే చూసాను.
మిగతా ప్రపంచంలో కూడా తెలుగు రచయితలూ,కథకులూ వుండి వుంటారనే నా నమ్మకం. ఎందుకు వారి గొంతు కానీ, ప్రస్తావన కానీ వినిపించడం లేదన్నది అందరమూ (వారితో సహా) ఆలోచించాల్సిన విషయమే.
ఉదాహరణకి, రెండు మూడు నెలల కింద “కవితాస్త్రాలయ” అనే పుస్తకం మెల్బోర్న్ నగరం నుంచి శ్రీ తనికెళ్ళ భరణి గారి అధ్యక్షతన వెలువడింది. మూడు వందల పేజీల పుస్తకం లో దాదాపు ఇరవై మంది రచయితల రచనలు (కథలూ, కవితలూ, వ్యాసాలూ) పొందుపర్చబడ్డాయి.
నా ఉద్దేశ్యం ప్రకారం “డయస్పోరా రచనలు” గురించి రాయదల్చుకున్న వాళ్ళు ద్రష్టి మిగతా చోట్లకి కూడా సారించే ప్రయత్నం చేయాలి. అలాగే ఇతర ప్రదేశాలనుంచి సాహితీ సేవ చేస్తున్న రచయితలు తమ గొంతు విప్పడం మొదలు పెట్టాలి.
ధన్యవాదాలు
శారద
శారద గారూ,
వేరే దేశాల్లో ఉన్న కథకులూ అక్కడున్న కథకుల గురించీ, వారు రాసే కథలు గురించీ రాస్తే పదిమందికీ తెలిసే అవకాశం ఉంటుంది. రాయాలి కూడా.
ఆ చేత్తోనే మీకో పని: మీరు ఆస్ట్రేలియాలో ఉండే కథకుల గురించీ, వారి కథల గురించీ రాయండి. తద్వారా అందరికీ తెలుస్తుంది.
(నేను కథకుల గురించే మాట్లాడుతున్నాను; కవుల గురించి కాదు.)
-బ్రహ్మానందం
మంచి వ్యాసం బ్రహ్మానందం గారూ! శారదగారి సూచన గ్రాహ్యం. అయితే ఆ యా డయాస్పోరా ల గురించి అక్కడి వాళ్ళు వెలుగులోకి తెస్తే బాగుంటుంది.అనిల్ అట్లూరి రెండుతెలుగు రాష్ట్రాల లోపల / వెలుపల డయస్పోరాల గురించి ప్రస్తావినచారు.అది సాహిత్య రూపమో / కథా రూపమో కావడానికి మరికొంత టైం పట్టొచ్చు.
డియర్ సాయి బ్రహ్మానందం గారు,
మీ వ్యాసం బాగుంది. లక్షణాల్ని క్రోడీకరించి చక్కగా విశ్లేషించారు. డయాస్పోరా సాహిత్యం అనగానే చిట్టెన్ రాజు, వేలూరి వెంకటేశ్వరరావు, నారాయణస్వామి, సీతారామయ్య, అప్సర్, నిడదవోలు మాలతి మొదలైన వాళ్ళు గుర్తుకొస్తారు. అకడమిక్ వ్యాల్యూస్ తో కొనసాగిన ఈ వ్యాసం డయాస్పోరా సాహిత్యం గురించి మంచి విషయాల్ని వివరించింది. శారద గారికి ఇచ్చిన సమాధానం మీ వ్యాసాన్ని మరింత పరిపూర్ణం చేసిందనుకుంటున్నాను.
మీ
దార్ల
కథ — ల కు లేని పోనీ పేర్లను పెట్టడం —- పసిబడ్డ అనడం
కొందరి బతుకు తెరువు కోసం — వాళ్ళ వ్యాపారం కోసం — విరాళాలు సేకరిస్తూ
family.పేరుతో —-usa. లోని రచయితల పుస్తకాలు అచ్చువేసి — గుర్తింపు కోసం
ఎవ్వరు ప్రశ్నించడం చేయడం కోసం —-అన్ని లేని పోనీ చీకటి రాజకీయాలు —?? ముసుగులు —–
అందరం వచ్చింది బతుకుతెరువు కోసమే — కాని మనిషి కి మనిషి Madhya సంభంధాలు
డబ్బుతో —ముడిపడి —–
పాలన భాష — తెలుగు ఎందుకు లేదు — [ప్రాచిన భాష గా గుర్తింపు official.. గా ఎన్నడు ??
టి వి ల షో ల కు censor.. ఎందుకు లే దు అని ప్రశ్నించే రచయిత లు లేరు — నా కడుపు నిండితే చాలు —-
ఆకలి చావులు
రయితుల ఆత్మహత్యలు
లిక్కర్ చావులు
ఎన్కౌంటర్ ల గురించి
బీఫ్ తింటే —- హత్యలు —– వీటి గురించి ఏ రచయిత గళం ఎత్తారు ??
——————————-
buchhi.reddy..gangula..
ps.. రెడీ for..answer.
వ్యాసం బావుంది కానీ కొన్నివిషయాలు అంత ఖచ్చితంగా చెప్పలేమేమో. “2000 తరువాత వచ్చిన చాలా మందికి తెలుగు చదవడం రాయడం వచ్చినా, తెలుగు భాషతోనూ, ముఖ్యంగా సాహిత్యంతో సంబధం తెగిపోయింది. అందరివీ ఇంగ్లీషు మీడియం చదువులే! ఒకళ్ళొ ఇద్దరికో తెలుగు రాయడం, చదవడం వచ్చు. అందులో వెతికితే కొంతమంది రాయడం పైన ఆసక్తి ఉండచ్చు. అందువల్ల ఇక్కడికొచ్చిన యంగ్ తెలుగు జెనరేషన్ కథకులు తయారయ్యే అవకాశాలు చాలా తక్కువ. పోనీ కొత్తగా వచ్చే వాళ్ళతో ఆశాజనకంగా కనిపిస్తోందా? అంటే అదీ లేదు” – మన సిలికానాంధ్ర వారి పుణ్యమా అని చాలా మంది పిల్లలు తెలుగు నేర్చుకుంటున్నారు. అందరూ డయాస్పోరా కథలు రాయలేకపోవచ్చు. కానీ వారి తెలుగు మాట్లాట పోటీలు చూసాక మాత్రం చిగురంత ఆశ కన్పిస్తోంది.
ప్రభాకర్ గారూ: దార్ల గార్లకి కృతజ్ఞతలు:
బుచ్చిరెడ్డి గారూ: “డయాస్పోరా కథ ఇంకా పసిబిడ్డే!” ఇది నా టైటిల్ కాదు. నా ప్రసంగ పాఠం అంతే! తెలుగు వారి జీవితం రాజకీయాలూ, సినిమాల మధ్యే కొట్టు కుంటూ ఉంటుంది – అది అమెరికా అయినా; అంతరిక్షం అయినా!
ఇహ అమెరికాలో ప్రశ్నించరని ఎందుకనుకుంటున్నారు. ఏ సంస్థనయినా విమర్శించారనుకోండి. వాళ్ళని వెలేస్తారు. ఇక్కడున్న వాళ్ళల్లో చాలా మందికి కీర్తి కండూతి. దానికి పలు మార్గాలు ఉన్నాయి. అనేక ప్లాట్ఫారాలున్నాయి.
ఇహ ఇండియాలో సమస్యలమీద ప్రశ్నించడం ఒక రకంగా పనికిమాలినది. ఎందుకంటారా? ఇక్కడ బి.ఎం.డబ్లుయూలూ నడుపుతూ అక్కడి సమస్యల మీద మొసలి కన్నీళ్ళు కార్చడం వలన ఏం ప్రయోజనం? ఒకవేళ పెట్టినా ఎవరూ పట్టించుకోరు. అక్కడి సమస్యల గురించి అమెరికాలో రచయితలు గళం ఎత్తడం ఏం ప్రయోజనం ఉండదు.
సంస్థలు పక్కన పెడితే మంచి పనులు చేసేవాళ్ళు ఏ చప్పుడూ లేకుండా చేసుకుపోతూనే ఉన్నారు.
చంద్రిక గారూ:
తెలుగు లిపి చదవడం రాయడం, నాలుగైదు పద్యాలు వల్లె వేయడం వచ్చేస్తే తెలుగు భాష మీద పట్టు వచ్చేస్తుందనుకోవడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. కథలు రాయాలన్నా, లేక ఏదైనా సాహిత్య సృజన చేపట్టాలన్నా ఆ భాషలో సాహిత్యమ్మీద ఒక అవగాహనా లేదా లోతైన పరిచయం ఉంటేనే కుదురుతుంది. ఇక్కడి పిల్లలు ఎనిమిదో తరగతి వరకూ వారాం వారం తెలుగు నేర్చుకోవచ్చు గాక. ఆ తరువాతా? ఇక్కడ అమెరికాలో ఎంతో మంది తెలుగు వాళ్ళు మిడిల్ స్కూళునుంచి, హైస్కూలు వరకూ ఖచ్చితంగా స్పానిషో, ప్రెంచో చదువుతారు. హైస్కూలు అయ్యాక ఎంతమంది ఆ భాషమీద పట్టు తెచ్చుకుంటున్నారు. వేళ్ళపై లెక్క పెట్టచ్చు. అలాగే ఇంట్లో అమ్మా, నాన్నాలతో కొంత వయసు వరకూ తెలుగు మాట్లాడినా, కాలేజీకి వచ్చేసరికి ఇంగ్లీషులోనే మాటా మంతీ సాగుతాయి. తెలుగు బళ్ళల్లో చేరి తెలుగు భాష నేర్చుకున్నంత మాత్రాన (అదీ బొటా బొటీ తెలుగే – అది చెప్పే వాళ్ళల్లో ఎంతమందికి తెలుగు బాగా రాయడం, చదవడం లేదా సాహిత్యంతో పరిచయం సంపూర్ణంగా వచ్చు?) పిల్లలు తెలుగులో రచనలని చేస్తారన్నది కేవలం భ్రమ మాత్రమే!
ఇదంతా ఒక పెద్ద స్టంటు. ఎదుటివారి వీక్నెస్సుని క్యాష్ చేసుకోవడం లాంటిది. మా పిల్లలకీ తెలుగు వచ్చు అని చెప్పుకోవడం అన్న ఆత్మ తృప్తికి తప్ప ఇంకేమీ లేదు. సాహిత్యంతో సంబంధం లేని భాష చాలా కాలం నిలవదు.
ఇంకో విషయం – ఒక భాష నిలవలంటే తమ తోటి వారితో మాట్లాడ గలిగినప్పుడే నిలుస్తుంది. (మాట్లాడ్డం అంటే పై పై మాటలు – అంటే బావున్నారా? భోజనం చేసావా? ఏం సినిమాలు చూసారు? వంటి మామూలు భాష కాదు నేనుచ్ చెప్పేది. అంతెందుకు తమిళ నాడు, కర్నాటకలో చాలా మంది తెలుగువాళ్ళు ఉన్నారు. తెలుగుని ఆయా భాషలతో కలిపి మాట్లాడుకుంటారు. అలాంటి చోట నుండి ఎంతమంది రచనలు చేసారు చెప్పండి? నేను రాసింది కఠినంగా అనిపించ వచ్చు. కానీ ఇది కఠోర వాస్తవం.
ఇదంతా ఎందుకు రాయాల్సి వచ్చిందంటే నా వ్యాసం ప్రధాన లక్ష్యం డయాస్పోరా రచనల గురించీ, దాని భవిష్యత్తు గురించీ! భాష మాట్లాడుకోవడం, రాయడం గురించీ కాదు. అయినా సుదీర్ఘంగా నా ఆక్రోశం వెళ్ళగక్కాను. క్షమించండి.
గొర్తి సాయి బ్రహ్మానందం గారు!! మీ సమాధానానికి ధన్యవాదములు నా మాట మీరు పూర్తిగా గమనించాలి. చిగురంత ఆశ అని చెప్పాను కొండంత అని మాత్రం కాదు. తెలుగు బడి లో వారానికి ఒక రోజు మాత్రమే వెళ్తారు. వీరు A for Apple B for Ball అని మాత్రమే నేర్చుకుంటున్నారు అనుకుంటే చాలా పొరపాటు. ఈ పిల్లల్లో కొంత మంది తెలుగు సంఘాల సావెనీర్ లకు వ్యాసాలు రాయటం జరిగింది. World language credit పరీక్ష వ్రాసి High school second language credit hours (అంటే వీరింక high school second language తీసుకోనక్కర్లేదు) ఉత్తీర్ణులు అవడం కూడా జరిగింది. కొంత మంది కథలు translate కూడా చేస్తున్నారు. తెలుగు మాట్లాట పోటీలు లలో ఒక అమ్మాయి అద్భుతమైన ప్రతిభ కనపరిచింది. ఆ అమ్మాయి అప్పుడు హై స్కూలు లోనే చదువుతోంది మరి!! పిల్లలతో తల్లితండ్రులు బలవంతం గా కొంత మటుకే చేయించగలరు అన్నీ కాదు కదా!! ఇవన్నీ చూసిన సాక్షి ని కాబట్టి అది నిజం కాదేమో అని చెప్తున్నాను. మీతో వాదన గెలవటం నాకు ముఖ్య అంశం కాదు. ధన్యవాదములు
అయ్యా. ఎడిటర్ గారూ:
ఇలాంటి “సోది” కామెంట్లని ఎందుకు అనుమతిస్తున్నారు?! ఈయన ఏం రాస్తున్నాడో ఈయనకే తెలియదు. ఆ తెలుగు భాష చదువుతుంటే, భాష మీద విరక్తి పుడుతోంది. ఇక ఈయన మాటలకి మాకే భళ్ళున వాంతి వస్తున్నది.
సారంగ విలువైన పత్రిక, ఇక్కడ స్పేస్ విలువైనది. ఇలాంటి వాళ్ళ వల్ల ఆ స్పేస్ కి విలువ పోతోంది. దయచేసి, ఈ సోదిగాళ్ళ బారి నుంచి కాపాడండి సార్…
నిజాలు ఎప్పుడు సోది గానే ఉంటాయి సత్యవతి గారు
వాంతి కి మందులు ఉన్నాయి madam….
నాకు తెలిసే రాస్తున్నాను —
విరక్తి పుట్టే భాష మీకు కనిపించిందా —-
సారంగ మంచి వెబ్ సైట్ …అని ఎప్పుడో చెప్పాను — కాని యీ మధ్య — స్వీయ చరిత్రలు —
సాని ముచ్చట్లు —- ఎంత సాహిత్యెం ఉందో తూకం వేసి సెలవిస్తారా??
సోది గాళ్ళు — మీ తెలుగు భాష చక్కగా ఉంది కదా ????????????????????
రాయండి — జవాబు యివ్వగలను
————————————————————————
buchi.reddy.gangula..
సారంగ పాఠకులకి…
చాలా అరుదైన సందర్భాల్లో తప్ప సారంగలో కామెంట్లకి మాడరేషన్ లేదు. కాని, కొన్ని కామెంట్లు అర్థ హీనంగానూ, అసలు రచనకి ఏ మాత్రం సంబంధం లేకుండా ఉంటున్నాయి. వాటిని ఇక నించి నిర్మొహమాటంగా కత్తిరిస్తాం లేదా పూర్తిగా తొలగిస్తాం. ఈ విషయంలో మాకు పూర్తి హక్కు వుంది. దీంతో మీకు అభ్యంతరం వుంటే, ఇక్కడ కామెంట్లు రాయకండి. ఇక ఈ విషయంలో ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలూ అనుమతించం కూడా!