నియ్యత్‌కు నిదర్శనం ‘ముక్త ‘

kaifiyath

‘గతానికి-వర్తమానానికి’ మధ్య వంతెన చరిత్ర. ఈ చరిత్రను ఇన్నేండ్లు ఆధిపత్య భావజాలం ఉన్నోళ్లు రాసిండ్రు. దాంతోటి అండ్ల తప్పులు దొర్లినయి. ఇప్పుడు తప్పులు సరిజేసి నియ్యత్‌గా నిజమైన విషయాల్నే చెప్పాలె. మొత్తం తెలంగాణ చరిత్రలో అందరికి తెలిసిన సంగతులు చాల తక్కువ. ఇగ స్త్రీల విషయానికొస్తే చరిత్రలో, వివక్ష, విస్మరణ రెండూ ఎక్కువే! ఎనుకట ‘మనకు తెలియని మన చరిత్ర’ పుస్తకం కొంత చరిత్రను, జీవితాల్ని రికార్డు చేసింది. ఇప్పుడు ‘మనకు తెలిసిన చరిత్ర’ కనుమరుగు కాకుండా ఉండేందుకు ‘ముక్త’ సంస్థ ‘‘ ‘అనుభవాలు-దృక్పథాలు’ విముక్తి ఉద్యమాల్లో తెలంగాణ స్త్రీలు’’ పేరిట ఒక సంచిక తీసుకొచ్చిండ్రు. తెలంగాణ మహిళల ఉద్యమ చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, కళలు ఇట్ల తీరొక్క పూలతోటి బతుకమ్మను పేర్చినట్టు విషయాల్ని అమర్చిండ్రు. నిజాయితిగ పన్జేసిండ్రు.

హైదరాబాద్‌ తెహజీబ్‌ని పట్టిస్తూ తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ, హిందీ భాషల్లో ఇందులో రచనలున్నాయి. ‘ముక్త’ ఎ తెలంగాణ విమెన్స్‌ కలెక్టివ్‌ ` పేరుకు తగ్గట్టుగానే తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాల వారి అనుభవాలను, సాహిత్యాన్ని రికార్డు చేసింది. జైలు డైరీలు పేరుతోటి తొలితరం ఉద్యమకారిణి, చిత్రకారిణి అయిన సంగెం లక్ష్మీబాయమ్మ అనుభవాన్ని, సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న రంగమ్మగారి జ్ఞాపకాన్ని, 1969 ఉద్యమంలో పాల్గొన్న సక్కుబాయి, బి.రమాదేవి, స్వదేశ్‌రాణిల అనుభవాల్ని, ప్రస్తుత ఉద్యమంలో తన పాట, మాట ద్వారా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న విమలక్క జైలు అనుభవాల్ని స్ఫూర్తినిచ్చే విధంగా రికార్డు చేసిండ్రు. ఇందులో బీసీలకు న్యాయమైన వాటా దక్కింది. గతంలో ఎప్పుడు తెలంగాణ చరిత్ర గురించి చెప్పినా సంగెం లక్ష్మిబాయమ్మ విస్మరింపబడేది. ఆమె ‘నా జైలు జ్ఞాపకాలు’ పుస్తకంగా వెలువడ్డప్పటికీ ఆ విషయం చాలా తక్కువమందికి తెలుసు. తెలిసినోళ్లు కూడా ఆ విషయాన్ని రికార్డు చేసేందుకు, చెప్పేందుకు ఎనుకముందాడిరడ్రు.  తెలంగాణ బిడ్డ ఆంధ్రాలో చదువుకొని అక్కడి ఉద్యమాల్లో పాల్గొని ఆచంట రుక్మిణీ లక్ష్మీపతి, దుర్గాబాయి దేశ్‌ముఖ్‌లతో కలిసి  గడిపిన జైలు జీవితం గురించి స్ఫూర్తిదాయకంగా ఆమె ఇందులో చెప్పిండ్రు.

mukta-1

ఈ సంచికలో (ఎందుకంటే ముక్త భిన్న పత్రిక సీరిస్‌ -1 అని పేర్కొండ్రు) మేరి మాదిగ రాసిన దీర్ఘకవిత ‘పండ్రాయి’ దళిత జీవితాన్ని కళ్లకు గట్టింది. పండ్రాయి సాక్షిగ మాదిగ స్త్రీల పోరాట చరిత్రకు సాన బెట్టింది. ఆవుకూర, ఎంకటపురం తాళ్లు, యాదగిరిగుట్ట ఎడ్ల అంగడి గురించి చెప్పింది. చెప్పుల కుట్టిన చేతులతోనే నిజంగా చరిత్రను ఇంకా చెప్పాలంటే నేను పుట్టినూరు ‘రఘునాథపురం’మాదిగోళ్ల చరిత్రను చెప్పింది. సన్న చెప్పుల మీది ఉంగుటాలు, ముకురాలు, కప్పు, కప్పు మీది తోలు జెడలు, ఎర్ర రంగు పువ్వులు అద్దిన చెప్పులకు అద్దిన చెమట చుక్కల్ని లెక్క గట్టింది. ఈ చెమటలో మాదిగ ఆడోళ్లకూ భాగముందని చెబుతూ

‘చరిత్రల చెప్పులు మొగోల్లే కుట్టలే

రెండు చేతులు కలిస్తేనే

చెప్పుల జత తయ్యారు

మాదిగ ఆడామెను

గంజిలీగ కంటే

హీనంగా తీసి పారేసే మాదిగ మొగోళ్లకి

సమస్త పురుష ప్రపంచానికి సవాల్‌గా

ఇక మా చరిత్రను మేమే తిరగరాస్తం’’ అంటూ కవిత్వమై నినదించింది.

చిందు ఎల్లమ్మ మీద వనపట్ల సుబ్బయ్య రాసిన కవిత ఈ సంచికకు వన్నె తీసుకొచ్చింది. ఇంకా చెంచుపాట, శ్యామల, కిరణ్‌కుమారి, శ్రీదేవి, రేడియం, గుడిపల్లి నిరంజన్‌ల తెలుగు కవిత్వ ముంది. తస్నీమ్‌ జోహార్‌, నుస్రత్‌ రెహానాల ఉర్దూ కవిత్వం కూడా ఇందులో చోటు చేసుకుంది.

‘బాగోతం ఏడ ఆడ్తె అదే నీ ఊరు

పెంటగడ్డల మీదే నీ నివాసం

బారాబజెకు భాగోతం సురువైతే

భూమి తకతకలెల్లె సిందయ్యి జోకో అంటూ సిగాలు

నీవు గజ్జెలు కట్టినందుకే

భాగోతానికి భాగ్యం దక్కింది

పంచభూతాలు సోకని నేల ఉండొచ్చు

నీ పాటకు వరవసించని మనిషిలేడు

నీ దరువినని జీవిలేదు’’ అంటూ చిందు ఎల్లమ్మకు సుబ్బయ్య నివాళి అర్పించిండు. అలాగే జూపాక సుభద్ర ‘నిస్సాధికారం’, గీతాంజలి ‘ఉయ్యాల’ కతలు కూడా ఇందులో ఉన్నాయి.

ఈ సంచికలో ‘కళ’కు సంబంధించి విలువైన వ్యాసాలున్నాయి. గన్‌పార్క్‌లో ‘తెలంగాణ అమరవీరుల’ శిల్పాన్ని మలిచిన ఎక్కా యాదగిరిరావు మీద వ్యాసమే గాకుండా ఆయన స్వయంగా ‘స్వాతంత్య్రానంతర ఆధునిక భారతీయ శిల్పకళ` తెలుగునాట దాని ప్రతిఫలనం’ పేరిట వ్యాసం రాసిండు. అలాగే చేర్యాల నకాషి చిత్రకళ మీద ఆంగ్లంలో కె.విమల, పెంబర్తి ఇత్తడి కళాకృతులపైన ఎస్‌.వాసుదేవ్‌, వెండితెర తొలినాయికల నెలవు హైదరాబాద్‌ పేరిట అలనాటి హైదరాబాద్‌ హీరోయిన్ల గురించి హెచ్‌.రమేశ్‌బాబుల వ్యాసాలు విలువైనవే గాకుండా మన మూలాల్ని పట్టిస్తాయి. ఇంకా శోధన శీర్షికన ఆరు వ్యాసాలున్నాయి. భాష`జాతి పేరిట కె.విమల, చేనేతపై డి.నర్సింహ్మారెడ్డిల వ్యాసాలు ఇందులో భాగమే.

mukta-2

‘చరిత్రను మలుపు తిప్పిన చైతన్య మూర్తులు’ పేరిట కె.విమల రాసిన సంపాదకీయం తెలంగాణ మహిళలు, వారి ఉద్యమాల చరిత్రను రేఖామాత్రంగానే అయినా విలువైన సమాచారాన్ని రికార్డు చేసింది. తమిళ ముస్లిం రచయిత్రి సల్మను పిలిపించి హైదారాబాద్‌లో సమావేశం నిర్వహించడమే గాకుండా గత ఐదేంద్లుగా తెలంగాణ ఉద్యమంలో మహిళలు నిర్వహిస్తున్న పాత్రను, భవిష్యత్‌ తెలంగాణ ఎజెండాను మేనిఫెస్టో రూపంగానూ, జ్వలిత, అనిశెట్టి రజిత, అఖిలేశ్వరి రామాగౌడ్‌, నీరా కిషోర్‌ల రచనల ద్వారా వెల్లడిరచారు. ఈ కలెక్టివ్‌ వర్క్‌ని బాధ్యతగా నిర్వహించిన ముక్త బృందానికి ముందుగా అభినందనలు.  ఇందులో అచ్చయిన రమాదేవి, సత్యా సూఫి, అమిల, క్రాంతి,భార్గవి, నాగమణి, సుభాషిణిల బొమ్మలు/పెయింటింగ్స్‌ వారి ప్రతిభను పట్టిస్తున్నయి. వీటన్నింటికి మించి 1969 ఉద్యమం నాటి మహిళల ర్యాలీ (హైదరాబాద్‌) ఫోటోని కవర్‌పేజిగా, 1932 నాటి అజాంజాహి మిల్స్‌ (వరంగల్‌)లో పనిచేస్తున్న మహిళల చిత్రాన్ని బ్యాక్‌కవర్‌గా వేయడం సంచిక విలువను మరింతగా పెంచింది.

ఇంత వరకు మహిళలు వెలువరించిన ఏ సంచికల్లో లేని సామాజిక న్యాయం రచయితలు, రచనల ఎంపికలో బలంగా కనిపించింది. ఈ సంచికకు ఆ ఎంపిక వన్నె తెచ్చింది. దళిత, బీసి, ముస్లిం మహిళల గురించి ఇంత లోతుగా గతంలో ఎవరూ పట్టించుకోలేదు. తెలుగుతో పాటుగా హిందీలో ‘మేరా తెలంగాణ’ వ్యాసం రాసిన స్వదేశ్‌ రాణి, ఉర్దూలో సాదిఖా నవాబ్‌ సాహెర్‌  కవిత కూడా ఇందులో చోటు చేసుకోవడమంటే తెలంగాణలో నివసించే ప్రజలందరికీ ఎంతో కొంత మేరకు ప్రాతినిధ్యం కల్పించడంగా భావించాలి. తెలుగేతరులు కూడా హైదరాబాద్‌ మాది అని గర్వంగా చెప్పుకోడానికి ఇది ఉపయోగ పడుతుంది.

ఈ సంచికలో వెలువడ్డ సుమిత్రాబాయి వ్యాసం గతంలో ఇల్లిందల సరస్వతీదేవి వెలువరించిన ‘తేజోమూర్తులు’ పుస్తకంలోనిది. అయితే వ్యాసం ఎక్కడి నుంచి తీసుకున్నారో ఇచ్చినట్లయితే గతంలో ఆ విషయం వెలుగులోకి తెచ్చినవారిని గౌరవించినట్లవుతుంది. ప్రధానంగా మహిళల చేతే వ్యాసాలు రాయించి వెలువరించి ఉండాల్సింది. యూనివర్సిటీల్లోని విద్యార్థులు ఉద్యమంలో పాల్గొనడమే గాకుండా పత్రికలు కూడా వెలువరించారు. వీరిని కూడా ఇందులో జోడిరచుకున్నట్లయితే సమగ్రత వచ్చేది. అలాగే వివిధ విశ్వవిద్యాలయాల్లో తెలంగాణపై వివిధ రంగాల్లో ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో పరిశోధన చేసిన వారున్నారు. వారి అనుభవాన్ని పత్రిక ఉపయోగించుకోలేదు. మధురాలు, లంబాడీలు, కోయలకు సంబంధించిన సాంస్కృతిక, ఉద్యమ జీవితాలు కూడా ఇందులో లేవు. అయితే సిరీస్‌లో ఇది మొదటి భాగం అని పేర్కొన్నారు. రాబోయే సంచికల్లో మరింత తెలంగాణ మహిళా ఉద్యమాల గురించి రికార్డు కావాల్సిన అవసరముంది.

1890వ దశకంలోనే హైదరాబాద్‌ ప్రభుత్వం తరపున ‘మలేరియా కమీషన్‌’ బృంద సభ్యురాలిగా, ఇంగ్లండ్‌ పర్యటించడమే గాకుండా అక్కడ వైద్య విద్యనభ్యసించిన దేశంలోనే తొలి అనస్తీషియన్‌ రూపాబాయి ఫర్దూంజీ గురించి, తెలంగాణలోని అన్ని సంస్థానాల్లో మహిళలు ఎప్పుడో ఒకప్పుడు పాలనా బాధ్యతలు చేపట్టారు. ఈ విషయాలతో బాటుగా, 1904 నాటికే మహబూబియా పాఠశాలలో ముస్లిం బాలికలకు ఇంగ్లీషు విద్య బోధించిన కళాశాల ప్రిన్సిపాల్‌ గురించి, ముంబాయిలో రచయిత్రిగా స్థిరపడ్డ బిల్కీస్‌ లతీఫ్‌, ఢల్లీిలో జర్నలిస్టుగా స్థిరపడ్డ హనీస్‌ జంగ్‌, తొలితరం డాక్టర్‌, రచయిత్రి, ఉద్యమకారిణి టి. వరలక్ష్మమ్మ గురించీ, గోలకొండ కవుల సంచికలో చోటు చేసుకున్న కవయిత్రుల గురించీ వచ్చే సంచికల్లో రచనలు చేసి ప్రస్తుత లోటుని భర్తీ చేసుకోవాలి. ముఖ్యంగా సాయుధ పోరాటంలోనూ, 1969-70ల ఉద్యమ సందర్భంలోనూ మహిళల పాత్ర గురించి ఇప్పటికీ సమగ్రమైన అంచనా లేదు. 69-70 ఉద్యమ కాలంలో అసెంబ్లీలో ఈశ్వరీబాయి, సదాలక్ష్మిలు చేసిన ‘ఫైర్‌బ్రాండ్‌’ ఉపన్యాసాలను సేకరించి పుస్తకాలుగా వేయాలి. సదాలక్ష్మి చిత్రకారిణిగా కూడా ప్రసిద్ధి. ఆమె చిత్రాలు సేకరించి అచ్చేయాలి. ఇది ప్రారంభం. ఈ పరంపర సదా కొనసాగాలి. ఈ పనిని ముక్త టీం చేయగలదు. ఎందుకంటే ఈ టీం సమన్వయంతో, సమైక్యంగా పనిచేస్తోంది. ఈ సమన్వయం సాధించడంలో ప్రధాన బాధ్యురాలు కె.విమలకు అభినందనలు.

                                                                                                                                                               -సంగిశెట్టి శ్రీనివాస్‌

 sangisetti- bharath bhushan photo

 

మీ మాటలు

*