రాజ్యాంగం ముసుగు తీసిన నాలుగు నవలలు

 

(ప్రముఖ రచయిత అక్కినేని కుటుంబరావు రచించిన నాలుగు నవలల్లో చిత్రించిన రాజ్యాంగ నైతికత గురించి విశ్లేషిస్తూ ప్రముఖ రచయిత్రి ఓల్గా ‘సంతులిత’ అనే పుస్తకం రాశారు. ఈ పుస్తక ఆవిష్కరణ సెప్టెంబర్ 12న ఢిల్లీలోని కేంద్ర సాహిత్య అకాడమీలో జరిగింది. ఈ సందర్భంగా చేసిన ప్రసంగ వ్యాసం) 

ఆధునిక తెలుగు సాహిత్యంలో సామాజిక చైతన్య ప్రభావం ఎక్కువ. చాలా నవలలు, కథలు, కవితలు సమాజంలోని అంశాలను ఇతివృత్తంగా తీసుకుని వచ్చాయి. చాలా రచనల్లో వ్యవస్థ దోపిడీ స్వభావం మనకు కనపడుతుంది. మారుతున్న సమాజానికి అనుగుణంగా దోపిడీ వ్యవస్థలు మారుతున్నాయా? లేక కొత్త రూపంలో దోపిడీ, అణిచివేత జరుగుతుందా అన్న ప్రశ్నలను రచయితలు ఎప్పటికప్పుడు వేస్తూనే ఉన్నారు.

‘అబద్దం లేకుండా సాక్ష్యం కావాలంటే ఈ భూప్రపంచకమందు ఎక్కడైనా సాక్ష్యం అనేది ఉంటుందా మీరు అనుభవం లేకుండా నీతులు చెబుతున్నారు కాని.. హైకోర్టులో వకీళ్లు కూడా తిరగేసి కొట్టమంటారు.. నీ పుణ్యం ఉంటుంది బాబూ.. నిజం, అబద్దం అని తేలగొట్టక ఏదో ఒక తడక అల్లి తయారు చేస్తే కాని ఆబోరు దక్కదు..’ అని గురజాడ ‘కన్యాశుల్కం’లో హెడ్ కానిస్టేబుల్ గిరీశంతో అంటాడు. ‘స్వాతంత్య్రం వస్తే ఆ గాడిద కొడుకు హెడ్ కానిస్టేబుల్ మారతాడా..’ అని మరో పాత్ర అంటుంది.. న్యాయవ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, శాంతిభద్రతల వ్యవస్థ ఎంత బూటకమైనదో గురజాడ కన్యాశుల్కం చెబుతుంది. అదే విధంగా ఉన్నవ మాలపల్లి, వట్టికోట ఆళ్వారు స్వామి ప్రజల మనిషి, మహీధర రామ్మోహన్ రావు రథచక్రాలు, దాశరథి చిల్లర దేవుళ్లు ఇలా ఎన్నో మనకు వ్యవస్థలో దుర్మార్గాల్ని తెలియజేస్తాయి.

అందరికీ సమాన హక్కుల్ని ప్రసాదిస్తూ, స్వేచ్చా స్వాతంత్య్రాలకు విలువ ఇస్తూ, ప్రాథమిక హక్కుల్ని కల్పిస్తూ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకుంటూ స్వాతంత్య్రం తర్వాత మనం భారత రాజ్యాంగం ఏర్పర్చుకున్న తర్వాత అయినా పరిస్థితులు ఏమైనా మారాయా? రాజ్యాంగం వచ్చింది కాని సమాజంలో వర్గ స్వభావం మారలేదు. ఒక పుస్తకం రాసుకున్నంత మాత్రాన సమాజంలో వర్గ స్వభావం మారుతుందా? అసలు రాజ్యాంగం ఎవరికోసం సమాజంలో ఉన్నవారికోసమా? లేక లేనివారికోసమా? అణిచివేసే వారికోసమా లేక అణగారిన వర్గాల వారికోసమా? పోరాడే వారికోసమా? లేక పోరాడేవారిని తొక్కిపెట్టడం కోసమా? రాజ్యాంగం కులం, మతం, జాతి, ప్రాంతం మొదలైన వాటి ఆధిపత్య స్వభావాన్ని మార్చివేసిందా? పేదలకు, ధనికులకు మధ్య అగాధాన్ని చెరిపివేసిందా? అగ్రకులాలకూ, దళితులకు మధ్య తేడాను తగ్గించిందా? స్త్రీలకు, పురుషులకు మధ్య తేడా తగ్గించిందా? స్వాతంత్య్రం తర్వాత రాజ్యాంగ యంత్రాంగపు వర్గ స్వభావం ఎంత మేరకు మారింది?

స్వాతంత్య్రం తర్వాత ఎన్నో రచనలు మనకు రాజ్యాంగ యంత్రాంగపు వర్గ స్వభావం మారలేదని నిరూపిస్తున్నాయి. అభ్యుదయకవులు, దిగంబర కవులు, విప్లవరచయితలు, శ్రీశ్రీ, ఆలూరి బైరాగి, రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు, కొడవటిగంటి కుటుంబరావు, చలం, రంగనాయకమ్మ, వరవరరావు, అల్లం రాజయ్య, కేశవరెడ్డి, అంపశయ్య నవీన్, ఓల్గా, అక్కినేని కుటుంబరావు మొదలైన వారందరి రచనలుచదివితే మన రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థ బూటకపు స్వభావం గురించి అర్థమవుతుంది.

volga book release

అయితే సాహిత్య విమర్శ ఈమేరకు ఎంతవరకు న్యాయం చేసింది? మన రచనల్లోచిత్రించిన వ్యవస్థ దుర్మార్గ స్వభావాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఎన్ని విమర్శనాత్మక గ్రంథాలు వచ్చాయి? యూనివర్సిటీల్లో చాలా పరిశోధనా వ్యాసాలు, గ్రంథాలు వచ్చాయి. వరవరరావు  ‘ప్రజల మనిషి’ నవలపై పరిశోధనా గ్రంథం రాశారు. కాళీపట్నం ‘యజ్ఞం’ గురించి పరిశోధనా గ్రంథాలు వచ్చాయి. కాని నిర్దిష్టంగా మన రాజ్యాంగ వ్యవస్థ బూటకత్వాన్ని, రాజ్యాంగ నైతికతను ఆయా రచనల్లో ఎత్తి చూపుతూ వచ్చిన రచనలు చాలా తక్కువ. ఓల్గా గారు అక్కినేని కుటుంబరావు నవలల్లో రాజ్యాంగ నైతికతను విశ్లేషిస్తూ విమర్శనా గ్రంథం రాయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన మొత్తం సమాజం రాజ్యాంగం అనే చట్రం పరిధిలో నడుస్తుందని చెప్పుకుంటాం. ఇంటా, బయటా మన జీవితాల్ని రాజ్యాంగ యంత్రాంగం నిర్దేశిస్తుంది. మన చుట్టూ ఉన్న పార్లమెంట్, అసెంబ్లీలు, ముఖ్యమంత్రులు, నేతలు, మన ఎన్నికలు, న్యాయస్థానాలు, పోలీస్ స్టేషన్లు ఇవన్నీ రాజ్యాంగానికి అనుగుణంగా నడుస్తున్నవే. సమాజంలో సంక్షోభాలు ఏర్పడుతున్నకొద్దీ వీటి ప్రాధాన్యత పెరుగుతుంది. మన జీవితాల్లో రాజ్యాంగం ప్రవేశించిందన్న మాటలో అవాస్తవం లేదు. కాని నిజంగా రాజ్యాంగం రాజ్యాంగం ప్రకారం అమలు అవుతున్నదా? దాని బూటకపు స్వభావం ఏమిటి? దాని వర్గ స్వభావం ఏమిటి? అన్న అంశాలను మన రచనల్లోంచి ఎత్తి చూపడం ఇప్పుడు చాలా అవసరం.

గురజాడ రచించిన కన్యాశుల్కంల్లోను, రావిశాస్త్రి రచనల్లోను రాజ్యాంగయంత్రాంగం ప్రభావం గురించి బాలగోపాల్ రెండు వ్యాసాలు రాశారు. కన్యాశుల్కంలో న్యాయవ్యవస్థలో చిత్రించిన బూటకత్వాన్ని బాలగోపాల్ ఎత్తి చూపారు. హత్యకేసుపెట్టకుండా లంచం పుచ్చుకున్న హెడ్‌కానిస్టేబుల్ గురించి రాస్తారు. ‘డిప్టీ కలెక్టర్‌కు డబ్బు వ్యసనం లేదు’ కాని స్త్రీవ్యసనం కద్దు.. అని కరటక శాస్త్రి చేత అనిపిస్తాడు. ‘దరిద్రపు సంస్కృతం వదిలిపెట్టి ఇంగ్లీషు నేర్చుకుని నూతన రాజ్యాంగ యంత్రంంలో ఏదో ఒక అంతస్తులో కలిసిపోదామన్న ఆశ శిష్యుడికి ఉన్నందువల్లే లుబ్దావధాన్లుతో వివాహం ఆడడానికి అమ్మాయి వేషం వేసుకుంటాడు.. ఈ ఆశే లేకపోతే కన్యాశుల్కమే లేదు’ అని బాలగోపాల్ తీర్మానిస్తారు. రావిశాస్త్రి రచనల్లో నేరానికీ, రాజ్యాంగ యంత్రాంగానికీ ఉన్న పరస్పరతతో న్యాయవాదులూ, న్యాయమూర్తులూ భాగం పంచుకంటారని మనకు అర్థం అవుతుంది.

‘కట్నం సదివిచ్చుకుని కేసును తేలగొట్టేయడం’ ఎలాగో ముత్యాలమ్మ వంటి నిరక్షరాస్యురాలికి తెలుసు. ‘ఈ నోకంలో డబ్బూ, యాపారం తప్ప మరేట్నేదు.’. అని ఆమె జీవితసత్యాన్ని చెబుతోంది. ఆమె నేరం చేసానని ఒప్పుకోదు కాని కేసు ఒప్పేసుకుంటానని చెబుతుంది. పేదలు కేసులు ఒప్పేసుకోవాల్సి వస్తే చాలా మంది న్యాయమూర్తులు కేసులు తేలగొట్టేస్తారు. కేసులు తేలగొట్టేస్తే న్యాయమూర్తులకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. అది ఢిల్లీ స్థాయిలో కూడా మనం అర్థమవుతుంది. కేసులు తేలగొట్టేసిన న్యాయమూర్తులు గవర్నర్లు కావచ్చు. మానవ హక్కుల కమిషన్ చైర్మన్లు కావచ్చు. రాజ్యసభ సభ్యత్వాలు పొందవచ్చు. ఇంకేమేదైనా పొందవచ్చు. రాజకీయ నాయకత్వానికీ, న్యాయ, అధికార యంత్రాంగానికీ మధ్య లాలూచీలు, ఒప్పందాల మూలంగానే ఈ రాజ్యాంగ వ్యవస్థ సాగుతుందన్న విషయంలో అవాస్తవం లేదు. ఇక సంస్కరణల తర్వాత మరో వ్యవస్థ ఒకటి ఏర్పడింది. అది కార్పొరేట్ వ్యవస్థ. అది అన్ని వ్యవస్థల్నీ ప్రభావితం చేసేంతగా విస్తరించింది. పార్లమెంట్‌లోనూ, చట్ట సభల్లోనూ, ప్రభుత్వ యంత్రాంగాల్లోనూ, చివరకు న్యాయవ్యవస్థలోనూ దాని ప్రభావం చొచ్చుకుపోయింది. ఇప్పుడు రాజ్యాంగ నైతికత అనేది మరింత చర్చనీయాంశం కావాల్సిన అవసరం ఉన్నది.

అక్కినేని కుటుంబరావు రచించిన నాలుగు నవల్లో రాజ్యాంగనైతికత గురించి విశ్లేషించారు. ఓల్గా. రాజ్యాంగ నైతికత అనే దాన్ని తొలుత రాజ్యాంగ నిర్మాత అంబేద్కరే ప్రస్తావించారు. constitutional morality is not a natural sentiment it has tobe cultivated. We must realise that our people have yet to learn it. Democracy in India is only a top-dressing on an Indian soil, which is essentially undemocratic  అంటారు. అంబేద్కర్. వన్ మ్యాన్ వన్ ఓట్ అనేది మంచిదే కాని వన్ మ్యాన్‌కు వన్ వాల్యూ ఉన్నప్పుడే రాజ్యాంగ స్ఫూర్తి సక్రమంగా అమలు అవుతుందని అంటారాయన. స్వాతంత్య్రం వచ్చిన 67 సంవత్సరాల తర్వాత అందరు వ్యక్తులకు మనం ఒకే విలువ ఇస్తున్నామా? అన్న ప్రశ్న మనం వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 

akkineni kutumba rao

అక్కినేని కుటుంబరావు నవలాసాహిత్యమంతా 15, 17,19,21, ఆర్టికల్స్ చుట్టూ తిరుగుతుందని విశ్లేషిస్తారు.. ఓల్గా. కులమత లింగ వివక్షలకు తావు లేదని, అంటరాని తనం అమలు కాకూడదని, భావ ప్రకటనా స్వేచ్చ ఉండాలని, జీవించేందుకు ప్రతి ఒక్కరికీ హక్కు ఉన్నదని ఈ అధికరణలు చెబుతాయి. కాని నిజంగా రాజ్యాంగం ప్రసాదించిన ఈ అధికరణలు అమలు అవుతున్నాయా?

‘అందరూ సమానమేంటి? ఎంతసమానమైనా బేంబళ్ల దారి వేరు..’ అని ఎంకి పాత్ర సొరాజ్జెంలో అంటుంది. అస్ప­ృశ్యత అగ్రవర్ణాల అవసరాలమేరకే ఉంటుంది. తమ అవసరాలు తీర్చేందుకు అస్ప­ృశ్యత అడ్డురాదు. దొంగతనం చేశారని జోజి అనే పాత్రను చిత్రహింసలు పెట్టి చంపుతారు కమ్మదొరలు. మళ్లీ ఆ కేసును మాలపల్లి యువకులపైనే నెట్టివేస్తారు. యజమానులపై కేసులు పెట్టిన వారే జైలు పాలయ్యారు. జనంలో చైతన్యం అడగడానికి వెళితే ‘మీరింతమంది ఒక్కసారిగా రావడం ఎంతఘోరమైన తప్పో మీకు తెలువదురా.. ఈ విషయం తెలిస్తే ఢిల్లీనుంచి గవర్నమెంట్ సైన్యాలు వచ్చి మిమ్మల్నందర్నీ చంపి కవాతుకొట్టుకెళ్తాయిరా పిచ్చి సన్నాసుల్లారా.. ‘అని కాంగ్రెస్ ప్రతినిధి బ్రహ్మం గారు వారిని భయపెడతారు. ఇదే నవలలలో కూలీ రేట్ల గురించి అడిగిన తిరపతిని చంపి శవాన్ని కాలవలో తోసేస్తారు. మాలవాళ్లు వాళ్లే కొట్టుకున్నారని నిరూపిస్తారు.అవును.. సమాజంలో ప్రశ్నించిన వారిని వ్యవస్థ ఎక్కువ గాసహించదు. భూస్వామిని ప్రశ్నించినా, రాజకీయనాయకుడిని ప్రశ్నించినా, ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, పోలీసుల్ని ప్రశ్నించినా బూటకపు ఎన్‌కౌంటర్లు తప్పవు.. రాజ్యాంగం పేడకుప్పమీద కట్టిన రాజభవనమని అంబేద్కర్ చెప్పిన మాటలు నిజమయ్యాయని ఓల్గా వ్యాఖ్యానిస్తారు.

కుటుంబరావు తన మరో నవల ‘కార్మిక గీతం’ లో యజమానులు కార్మిక చట్టాలను ఎలా ఉల్లంఘించిందీ వివరంగా రాశారు. ‘పోలీసులు, మీడియా, అధికారులు అన్నీ కార్మికుల పక్షం కాకుండా యజమాన్యాల వైపు ఉండే రాజ్యాధికార చట్ర స్వభావాన్ని కార్మిక గీతంలో కుటుంబరావు వాస్తవికంగా చూపిస్తారు.. ‘అని ఓల్గా చెప్పారు. ‘కార్మికగీతం’ పుస్తకాన్ని దాదాపు రెండు దశాబ్దాల క్రితం నేను సమీక్షించాను. అప్పటికీ ఇప్పటికీ కార్మికుల జీవితంలో పెద్దగా మార్పులు లేవు. అయితే కొత్త రూపంలో ఇప్పుడు అణిచివేత ప్రారంభమైంది. భూముల స్వా«ధీనాన్ని, సెజ్‌లను వ్యతిరేకించిన వారిని ఊచకోత కోస్తే ప్రశ్నించేవారు లేరు. పోలీసుల కాల్పుల్లో నలుగురో ఐదుగురో చనిపోతే కాని వార్తల్లో రావడం లేదు. ఎందుకంటే గతంలో లాగానే రాజ్యాంగంలోని అన్ని వ్యవస్థలూ మిలాఖత్ అయిపోయాయి. కార్పోరేట్లు డబ్బులు వెదజల్లి ప్రకటనలు ఇచ్చి మీడియాతో సహా అన్ని వ్యవస్థల్నీ నోరుమూయించే కొత్త సంస్క­ృతి ప్రారంభమైంది. వీటిపై కూడా సాహిత్యం రావాల్సిన అవసరం ఉన్నది.

కుటుంబరావు మరో నవల ‘మోహన రాగం’ లో రాజ్యాంగంలో ప్రజల జీవించే హక్కునూ, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను ప్రణాళికా కర్తలే విస్మరించిన తీరును రాశారని ఓల్గా విశ్లేషించారు. ప్రభుత్వ పథకాల్లోని బూటకత్వాన్ని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగబద్దంగా నడుచుకుంటామని ప్రమాణం చేసిన శానస సభ్యులు ఖాప్ పంచాయతీలను సమర్థిస్తూ మాట్లాడతారని, వారికి శిక్షలుండవని ఓల్గా అంటారు. ఇక ‘కొల్లేటి జాడలు’ నవలలో మార్కెట్ వ్యవస్థ పర్యావరణాన్ని ఎలా హతమారుస్తుందో కుటుంబరావు వివరిస్తారు. మార్కెట్ అవసరాలకోసం, పెట్టుబడి ప్రయోజనాలకోసం జీవ వైవి«ధ్యంతో ఆటలాడుకుంటున్న వైనాన్ని ఆయన చెబుతారు. ‘వేల సంవత్సరాలుగా జీవ వైవి«ధ్యాన్ని అనేక విధాలుగా రక్షిస్తూ, గౌరవిస్తూ వస్తున్న ప్రజలకు వాటిపై ఉన్న హక్కులను గుర్తించకుండా, ఆ ప్రజలు చేసిన పనికి విలువ ఇవ్వకుండా ఉండటమంటే అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే..’ అంటారు ఓల్గా. ప్రజల జీవనాధారాలకు ముప్పు తెచ్చిపెట్టడమంటే వారి జీవించే హక్కుని హరించి వేయటం కాదా అని ఆమె ప్రశ్నిస్తారు. ఈక్రమంలో కోర్టు తీర్పుల్ని ఏ విధంగా ఉల్లంఘిస్తున్నారో కూడా ఆమె చెబుతారు. పెద్ద పెద్ద బడాకంపెనీలకోసం పర్యావరణ చట్టాల్ని కూడా ప్రభుత్వాలు ఎలా సడలిస్తున్నారో తెలిసిన తర్వాత మనకు కొల్లేటి జాడలు సారం మరింత అర్థమవుతుంది.

అసలు ఒక రచయిత సమాజంలో దోపిడీని, వర్గ స్వభావాన్ని సమాజంలోని ప్రజల జీవితాల ఆధారంగానే అద్బుతంగా చెప్పడం గొప్ప విషయం అయితే రచయిత ఏమి చెప్పాడన్న విషయాన్ని వివరించడం మరో గొప్ప విషయం. అలా వివరించడం ద్వారా రాజ్యాంగం ఉనికినే ఆమె ప్రశ్నించారు. ‘రాజ్యాంగ ఉల్లంఘనను ఆపడం ఎలా? రాజ్యాంగ వాదాన్ని, రాజ్యాంగ నైతికతను ప్రజల్లోకి తీసుకెళ్లి వారి చైతన్యం పెంచటం కంటే మార్గం ఉందా?’ అని ఆమె ప్రశ్నిస్తారు. అవునుప్రశ్నించడం ద్వారానే ప్రజల్లో చైతన్యం వస్తుంది. నా ప్రశ్న. ఒక్కటే మనకు లిఖిత రాజ్యాంగం ఉన్నది కాని అది ఎవరికోసం? వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడుతూ, ఎన్నికల్లో వేలకోట్లు ఖర్చులు పెడుతూ, ప్రజల్ని మభ్యపెడుతూ, అసమానత్వాల్నిపెంచుతున్న కోసమా? వాటిని చూసీ చూడనట్లుంటూ అవినీతిలో భాగస్వామ్యం పంచుకుంటున్న అధికార, న్యాయయంత్రాంగం కోసమా? రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తూ తిరుగుబాటు చేసే వాడు విప్లవకారుడైతే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, దానితో చెలగాటమాటుకుంటున్న వారిని ప్రజాస్వామిక వాదులనాలా? మన జీవితాలతో రాజ్యాంగయంత్రం ఆడుకుంటున్న క్రీడల్ని, పెంచి పోషిస్తున్న అసమానతలను, ప్రశ్నార్థకమైన రాజ్యాంగ నైతికతను మనం సాహిత్యంలో ప్రతిఫలింపచేయాలంటే ప్రజాజీవనాన్ని లోతుగా అధ్యయనం చేయాలి.

-కృష్ణుడు

మీ మాటలు

  1. రాజ్యాంగం ముసుగు తీయడం లాంటి మాటలు వాడటం కంటే …మన వల్లనే రాజ్యాంగం ఫెయిల్ అయింది అని అందం సబబు….డబ్బులు వున్నావాల్ల్లు,పరపతి ఉన్న వాళ్ళు దాన్ని మిస్యూస్ చేసారు….అది రాజ్యాంగం తప్పు కాదు…అలానే రాజ్యాంగం ని కాలమాన పరిస్తితులు బట్టి మర్హ్సుకోవాచు….కాబట్టి…మన తప్పుని వేరే వాళ్ళ మీద నెట్టడం రైట్ కాదు…రాజ్యాంగ సవరణలు చేసుకునే రైట్ వుంది…అది ఉస్ చ్యని పోలితిసింస్ రాంగ్….

  2. balasudhakarmouli says:

    అక్కినేని కుటుంబరావ్ గారి సొరాజ్జిం నవల, కార్మిక గీతం నవల చదివాను. చాలా గొప్పగా రాసారు. ఓల్గా గారు ఆయన నవలల మీద రాయడం, అవి అకాడమీ విడుదల కావడం బాగుంది.

  3. చాలా మంచిసమీక్షావ్యాసం.

Leave a Reply to Thirupalu Cancel reply

*