ఒక నేల కన్నీరు

నీటిపై రాత్రి పరిచిన మౌనాన్ని 

ఒక్క వెలుగు పరుగులెత్తిస్తుంది. 

ఏళ్ళుగా మనిషి గుండెలో నెలకొన్న స్తబ్ధత ని 

ఒక్క అక్షరం బ్రద్దలు చేస్తుంది

”సొన కాలువల అపూర్వ పురా గాధ ” లెనిన్ ధనిశెట్టి వ్రాసిన 36  పేజీల చిన్న పుస్తకం చదివినప్పుడు నాకు కలిగిన భావం ఇది .

జీవితపు ఒడ్డున నడుస్తున్నప్పుడు ఎన్నో పోరాటాల చైతన్యపు  అలలు అక్షరాల నురగను అద్దుకొని మనను తాకి ఉలికిపాటును తెస్తూనే ఉంటాయి . కాని కొన్ని మన సమాంతర ఆలోచన దోరణి తో మమేకమై హృదయాన్ని ముంచేస్తూ ఉంటాయి .

”ప్రకృతి మన ఆశకు తగినంత ఇస్తుంది ,దురాశకు కాదు ”…. మహాత్మ గాంధి .

కోస్తా తీరం లో ముఖ్యంగా నెల్లూరు జిల్లా లో సముద్రతీర ఇసుక దిబ్బలలో తమకు తామే ఊరుతూ ఎన్నో వేల ఎకరాల పంటకు ఆలవాలం అవుతూ ముప్పై ఊర్లకు జీవాన్ని పోస్తూ పడమర నుండి తూర్పుకు ప్రవహిస్తున్న రెండువందల వేల ఏళ్ళ క్రితపు ”సొన కాలువలు ” పారిశ్రామిక పాదాల కింద  స్వార్ధపరులకు సంపదలుగా మారుతూ ఎలా ఉనికిని కోల్పోతున్నాయో  చెప్పే పరిశోధన , వేదన , రోదన ల పుస్తకం ఇది .

దీన్ని ప్రచురించిన అనంతుడు ఫౌండేషన్ వారు దీని గూర్చి వివరిస్తూ  ”విభజనానంతరం సీమాంద్రకు ఇవ్వబోయే ఒక సామాజిక సమస్యను పరిచయం చేసే మొట్ట మొదటి స్నేహపూర్వక సాహిత్య కానుక ఇది ” అనడం దీనిలో ఉన్న రచయిత చిత్త శుద్ధి ని ,రచానా శైలిని మనకు పరిచయం చేస్తుంది .

ఒకానొక రోజు తనను తియ్యటి నీళ్ళతో చల్లటి నీడతో సేద తీర్చిన సొన కాలువలు ,తామే రచయిత ఆలోచనగా మారి తమ సమస్యల సాధన వైపు ఉపక్రమించేలా చేయడం …. రచయిత తన మాటల్లో చెప్పడం ఈ పుస్తకానికి మంచి శైలి ని చేకూర్చింది . ఇక రచయిత  సొన కాలువల మీద చేసిన చారిత్రక  పరిశోదనలు , తిరిగి తిరిగి సాధించిన సాక్ష్యాలు, సమస్యను ప్రతిబింబించిన శైలి …. సొన కాలువల ఆవేదన మన కళ్ళ ముందు కదిలి మోయలేని ఆవేదనతో పుస్తకాన్ని  ఆపకుండా చదివిస్తాయి . నిజానికి ఇదేమి కాలక్షేపపు పుస్తకం కాదు , కాని వర్తమాన సమస్యని మన గుండె గదిలో ఉంచి  ఆలోచనలో పడవేయాలన్న లెనిన్ గారి ఆలోచన సఫలం అయింది .

లెనిన్ ధనిసెట్టి

లెనిన్ ధనిసెట్టి

”సొన కాలువల సోయగాలు చూసాను. సంవత్సరాలు తరబడి అనేక ఋతువుల్లో, అనేక సమయాల్లో, నిశ్శబ్దంగా … సడి చేయకుండా వాటి ఉచ్వాస నిచ్వాసాలు వింటూ సొన కాలువలతో పాటు నేను  ప్రవహించాను ” అనే రచయిత మాటలతో మనం కూడా ఆ ఇసుక దారుల వెంట ,వాటి చారిత్రిక వైభవాల వెంట, వెన్నెల వెలుగుల వెంట ,అవి పండించే పాడి పంటల వెంట, వాటితో అల్లుకున్న జీవ సమూహాల వెంట ,తాటి చెట్ల గుంపుల వెంట, ఒక జియోలాజికల్ అద్భుతం వెంట , ఒక నిస్వార్ధ ఆశయం వెంట, ఒక తవ్వుతున్న నేలతల్లి గుండె మంట వెంట ….. మనసున్న మనిషిగా కదలిపోతాము .

తాను వ్రాసే ప్రతి వాక్యానికి సాక్ష్యంగా రచయిత చూపే ఒక వ్యాసమో, ఒక చరిత్రో ,ఒక జి . ఓ నో చూస్తూ ఉంటె ఒకింత ఆగి అతనిని అభినందించాలి అనిపిస్తుంది .

”The Earth has music for those who can listen ” అంటారు రచయిత ఒక దగ్గర. వినగలిగిన వాళ్లకి ఇందులో సొన కాలువల రోదన వినిపిస్తుంది. మనసుగల వాళ్ళని కదిలిస్తుంది. ఎక్కడో నెల్లూరు జిల్లా లోని సొన కాలువల సమస్యకి, దానిని మనముందు ఉంచిన  రచయితకి , ఎక్కడో నల్గొండ లో ఉన్న ప్రచురణ కర్తలకు ఉన్న సంబంధం ఏమిటి? ఇద్దరు అదే సముద్రం పై నుండి వచ్చిన మేఘాలు ఇచ్చిన నీరు తాగి భూమాత ఇచ్చిన గింజలు తిన్న ఋణం తప్ప .

”In man vs Nature ,nature laughs at last ” అంటారు రచయిత . ఇంకా చివరిగా ”Iam not in them,they are in mine ” అని ప్రకృతి తో తన మమేకాన్ని వివరిస్తారు. ప్రకృతి పై మమకారం కలిగి వాస్తవ జీవిత పధం లో దానికి ఏర్పడే ముప్పు గురించి హృదయమున్న మనిషిగా తెలుసుకోవాలి అనుకున్న ప్రతి వారు కొని చదవవలిసిన పుస్తకం.

Price:20/-

for orders: Anantudu Foundation, Kondagadapa (vi), Mothukuru (Mandal), Nalgonda Telangana. ph:9866061350

mail id :

doctorlenin@gmail.com, mothkurusrinivas@yahoo.co.in

 – వాయుగుండ్ల శశి కళ

మీ మాటలు

  1. శశి గారు ,
    నాకు తెలీని పుస్తకం గురించి తెలుసుకున్నాను.చాలా బాగా పరిచయం చేసారు.

  2. మాల గారు థాంక్యు

  3. వేణూశ్రీకాంత్ says:

    చాలా బాగుందండీ.

  4. ఎక్కడో నెల్లూరు జిల్లా లోని సొన కాలువల సమస్యకి, దానిని మనముందు ఉంచిన రచయితకి , ఎక్కడో నల్గొండ లో ఉన్న ప్రచురణ కర్తలకు ఉన్న సంబంధం ఏమిటి? ఇద్దరు అదే సముద్రం పై నుండి వచ్చిన మేఘాలు ఇచ్చిన నీరు తాగి భూమాత ఇచ్చిన గింజలు తిన్న ఋణం తప్ప .

    అంతే కదా ఎక్కడైనా ఏ మారు మూలనైనా మనిషి జీవనాన్ని దెబ్బతీసే అభివృద్ధి నమూనాలు ఒకటే. అందరం మాటాడి స్పందించాల్సిన అవసరముంది. కదలిక లేకపోతే వీళ్ళు మొసల్లుకంటే ప్రమాదకరమైన వాళ్ళు. శ్రీకాకుళంలోని బీళ్ళును బొగ్గు విద్యుదుత్పత్తి కేంద్రాలుగా మార్చి పర్యావరణంతో పాటూ ఇక్కడి మనుషుల ఉనికినే ప్రశ్నార్ధకం చేస్తుంటే ఇక్కటి ప్రజలు తిరగబడి పోరాటాలు చేస్తున్నారు. అధికార ప్రతిపక్ష నాయకులకు భాగస్వామ్య పెట్టుబడులుందదంతో ఒక దగ్గర వద్దనే వాడే మరో చోట శతృవుగా మారి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. లెనిన్ ధనిసెట్టి లాంటి వారి కృశి శ్లాఘనీయం. మీ పరిచయం బాగుంది సోదరీ..

  5. కె క్యూబ్ అన్నయ్య ,వేణు గారు థాంక్యు

  6. balachendrudu says:

    థాంక్స్ ససి గారు తెలుగు సాహిత్యం లో వచ్చిన అతి కొద్ది మంచి పుస్తకాలలూ ఇది ఒకటి
    ఊపిరి సలపని వేగం తో మనల్ని చదివిస్తుంది లెనిన్ ekkada vuntaroo aayana kathalu konni chadivanu
    రాయడం మానేసిన మంచి కధకుడు lenin

  7. sasi kala says:

    బాల చంద్రుడు గారు థాంక్యు

  8. కిరణ్ కుమార్ కే says:

    పారిశ్రామిక అభివృద్ధి పేరుతొ జరుగుతున్నా ప్రక్రుతి ద్వంసంపై ఎన్ని పుస్తకాలు రాసినను అవి తక్కువే. మీరు ఈ పుస్తకాన్ని పరిచయం చేసిన విధానం బాగుంది. ఇలాంటి పుస్తకాలను ఎంకరేజ్ చెయ్యాల్సిన అవసరం చాల ఉంది. ధన్యవాదములు శశికళ గారు.

  9. కిరణ్ గారు థాంక్యు

Leave a Reply to కిరణ్ కుమార్ కే Cancel reply

*