ఏ గాలివానలకూ కొట్టుకుపోని స్నేహ బంధాలు అవి!

Paparaju Mastar1

మా నాన్నగారు- పి.వి శర్మ- ఇంటర్ చదువుతుండగా పాలగుమ్మి పద్మరాజు గారు, వారికి గురువులు. మా పెద్ద నాన్నగారు పి. ఎల్.ఎన్.శర్మగారు (మహా విద్యావేత్త,అధ్యాపకుడుగ, ప్రిన్సిపాల్ గా కూడా విధులు నిర్వర్తించారు) పాలగుమ్మి పద్మరాజు గారు ఇరువురు కూడా భీమవరం కాలేజి లో సహద్యాయులు. పక్క పక్క ఇళ్ళలోనే వుండే వారు.

మానాన్నగారు, మాఅత్తయ్య గారు(ప్రస్తుతం వాళ్ళు ఈ లోకం లోనే లేరు) మా అమ్మగారితో చెప్పిన విషయాలని,అమ్మ నాతో చెప్పగా, నాకు గుర్తుకు ఉన్నంత మటుకు వారి శత జయంతి సందర్భంగా చంద్రునికో నూలుపోగు లా వారి గురుంచి స్మరించు కోవాలని, అవి మన సారంగా మిత్రులతో పంచుకోవాలన్న ఉద్దేశ్యంతో రాసిన నాలుగు మాటలు.

పద్మరాజు గారి వివాహం ఆయన 21వ ఏట సత్యానందం గారితో జరిగింది. అప్పుడు ఆవిడ వయస్సు 12,13సంవత్సరాలు మించి లేదట. మా అత్తయ్యగారితో,మా నాన్నమ్మ గారి తో వారి కుటుంబ సభ్యులు చాల స్నేహం గా ఉండేవారుట. వారు మద్రాసు వెళ్ళిపోయినా కూడా ఆ స్నేహబంధం కొనసాగిందిట.

వారిని గురించిన ఒక అరుదైన జ్ఞాపకం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఆ సంఘటన బహుశా 1950-52 మధ్య జరిగినట్లుగా చెప్పారు. అప్పుడు వచ్చిన అతి పెద్ద గాలివానలో వారు నివసిస్తున్న ఇంటి గోడ కూలి వారి శ్రీమతి గారికి దెబ్బతగలటం తో ఒక ఏడాది పాటు ఆవిడ కోలుకోలేకపోయారు. అప్పటి గాలివాన ఉదృతం చూసిన ఆయన తనలో కలిగిన భావాలకి అక్షరరూపం ఇచ్చిన కధే “గాలివాన”

తెలుగు కథను ప్రపంచ సాహితీ చరిత్రలో సగౌరవంగా నిలబెట్టిన ఘనత పాలగుమ్మి పద్మరాజు గారిదే. ప్రపంచ కథల పోటీని న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ పత్రిక నిర్వహించింది. భారతదేశం తరఫున హిందుస్థాన్ టైమ్స్ వారు ఈ పోటీని నిర్వహించారు. ఆంధ్రదేశం తరఫున ఆంధ్రపత్రికవారు నిర్వహించారు. ఆయన బహుభాషాకోవిదుడు. ఆయన బహుసౌమ్యుడు అని కూడా చెప్పేవారు మా నాన్నగారు.

మనుషుల్లో ఉండే వ్యతిరేక భావనలని ప్రతికూలంగా చూడటం అనేది అలవాటు చేసుకొమ్మని విద్యార్ధులకు చెప్పేవారట ఆయన.
ఆయన రాసిన కథల్లోని పాత్రలలో చాలా వరకు మన చుట్టూ సజీవంగా ఉన్నవాళ్ళే. దీనివల్ల కొన్ని సార్లు ఆయనకు చిక్కులు కూడా ఎదురయ్యాయంటాయి. బతికిన కాలేజీ, నల్ల రేగడి, రామరాజ్యానికి రహదారి, రెండో అశోకుడి మూన్నాళ్ళ పాలన ఇవన్నీ మా నాన్నగారికి ఇచ్చారు. కానీ నా దగ్గర మిగిలినది రెండో అశోకుడి మూన్నాళ్ళ పాలన నవల మాత్రమే. అదీ శిధిలావస్థలో ఉంది.
కాకపోతే వారిని చూసి మాట్లాడే అవకాశం మాకు 1978 లో వచ్చింది. అప్పుడు మేము రాజమండ్రిలో, బిజిలీ ఐస్ ఫ్యాక్టరీ దగ్గర గోటేటి రామారావు గారింట్లో ఉన్నప్పుడు. పక్కనే ఉన్న హనుమంతరావు గారింటికి వచ్చారు.

వారు ఇంకా రిక్షాలోనే ఉండగా మా నాన్నగార్ని చూసి,“ఏం తంబి బావున్నావా?” అని పలకరించారు శిష్యుల కి గురువు గుర్తు ఉండటం సహజం. కాని గురువు శిష్యుడుని గుర్తుపెట్టుకోవడం అరుదు అది విని మా నాన్నగారు ఎంతగానో చెప్పుకొని మురిసిపోయారు. తరువాత వారి కుటుంబ సహితంగా మా ఇంటికి వచ్చారు.

మా నాన్నగారు వారికి పాదాభివందనం చేసి మమ్మల్ని పరిచయం చేసి కాళ్ళకి నమస్కారం చేయమని చెప్పారు. ఏం చదువుతున్నారని నన్ను, మా చెల్లెలిని అడిగారు. డిగ్రీ చదువుతున్నామని చెప్పాము. అప్పటికే వారి పెద్ద అమ్మాయికి పెళ్లి చేసేసారు. కొంతసేపు మాట్లాడుకున్నాకా, మా నాన్నగారు మమల్ని, వాళ్ళకి ఊరంతా చూపించమని చెప్పారు. అప్పుడు నేను మా చెల్లెలు, వారి భార్యని, రెండో అమ్మాయిని తీసుకొని రాజమండ్రి బజారు, కోటగుమ్మం,గోదావరి గట్టు అదీ చూపించాము. వారు ఏదో షాపింగ్ కూడా చేసారు.

వారు వెళ్లి పోయాక మా నాన్నగారు ఒక తమషా సంగతి చెప్పారు. నాన్నగారు కాలేజి నుంచి వెళ్లిపోయేటప్పుడు జరిగిన ఫేర్వెల్ పార్టీ లో తమగుర్తుగా లెక్చరర్ల కి గిఫ్ట్ లు ఇచ్చారుట. అందులో మా నాన్నగారు కొంటె తనంతో పద్మరాజు గారికి ఒక పేస్ పౌడర్, నాన్నగారి స్నేహితుడు మా పెదనాన్న గారికి ఒక తెలుగు కాపీరైటింగ్ పుస్తకం ఇచ్చారుట. వాళ్ళు వాటిని ఏంతో స్పోర్టివ్ గా తీసుకున్నారని ఏ మాత్రం ఫీల్ అవలేదని అన్నారు. అప్పట్లో వాళ్ళ మధ్య ఆ బాంధవ్యం అంత సరదాగా ఉండేది అని అర్ధమైంది.

ఈ సందర్భంగా మరొక విషయం – 2013 లో శిరా కదంబం వారు నిర్వహిస్తున్న కార్యక్రమంలో చదివి వినిపించిన కథ- పడవ ప్రయాణం.

వారి సౌజన్యంతో ఆ లింక్ ఇక్కడ ఇస్తున్నాను.
http://www.divshare.com/download/24123097-361

Shabdakadambam – Playlist – DivShare
www.divshare.com
ఫోటో సహకారం: కే.కే. రామయ్య                                                                                                                                  -మణి వడ్లమాని

 

 

మీ మాటలు

*