‘చేప మా కులదేవత’

drushya drushyam 46

రోజూ మనం నడిచే వీధిలో ఒక దృశ్యం ఉంటుంది.

అది సాయంత్రానికి అదృశ్యం అవుతుంది.

మళ్లీ ఉదయం. మరొక ముగ్గు.
అదీ మళ్లీ మాయం.

దృశ్యాదృశ్యం అంటే ఇదేనేమో!
ఉంటుంది, ఉండదు!

దైనందినమూ – నిత్యనూతనం.
అంతే కాబోలు.

కానీ, అదెంత చిత్రం.
మరెంతటి రుజువు.

+++

ఇంటి ముంగిలినే కాన్వాసు చేసుకుని, ప్రతి దినమూ ఒకటి చిత్రించి మళ్లీ రేపు ఉదయం మరొక దానికోసం పాతదాన్ని చెరపడం అంటే…అది నిజంగానే చిత్రలిపి. ఏ ఆధునిక చిత్రకారుడికీ మనసొప్పని చిత్రకళా రహస్యం.

బహుశా అనాదిగా సాంస్కృతిక రాయబారిగా ఉన్న ‘ఒక్క మహిళకు’ తప్పించి ఇంతటి సాహసోపేత కళా సాధన పురుషుడికి సాధ్యం కానేకాదేమో! కావచ్చు. ఇప్పడు ఆధునిక మహిళలూ చేరినప్పటికీ, ఇవ్వాళ్టికీ ఆర్ట్ గ్యాలరీలు ఇంటి ముంగిళ్ల ముందు దిగదుడిపేనేమో!

చెరిపి కొత్తది వేయడం..
వేసింది సృష్టి అనుకోకపోవడం.
అదే దృశ్యాదృశ్యం.

+++

మహ్మద్ ప్రవక్త అనేవారట,. నీటిని నిలువ చేసుకోకూడదని!
చెలిమెలో తవ్వుకుని ఆ ఊటకు దోసిలి పట్టాలట.

బహుశా అంతటి ప్రవక్త తాత్వికత ఏదో మగువ మనసుకు తెలిసే ఉంటుంది.
అందుకే, వారి కళలో పిట్ట ఇంకా ఎగిరి పోలేదు.
పక్షి లేదా ఆ చేప ఇంకా సజీవంగా ఉన్నది.

అందుకే అనిపిస్తుంది,
ముగ్గులు చిత్రకళాధి దేవతకు సహజ సౌందర్య శోభిత ఆభరణాలు
సృష్టి స్థితి లయకు సహజ పర్యవసనాలూ అని!

ఏమైనా, ఆమె నిత్య కళామతల్లి అని!

+++

ఆమె పోట్రేయట్ ( ఫోటో తీస్తుంటే సిగ్గుపడి ...)

ఆమె పోట్రేయట్ ( ఫోటో తీస్తుంటే సిగ్గుపడి …)

పల్లెటూరులోనే కాదు, పట్నంలోనూ ఆమెది అదే ధోరణి.
అడుగడుగూ ఆమెకు కాన్వాసే!
కేవలం హస్తమాత్ర సహాయంతో తనదైన ప్రజ్ఞాపాటవాలతో ఆమె ఉనికి ఒక చిత్కళ.

సౌభాగ్యం, సఫలతలకు నెలవు.
సాంప్రదాయం, సాంస్కృత సౌజన్యం,

తానే ఒక బొడ్డుతాడు.
టోటమ్.

ఒకే ఒక తెరిచిన కన్ను.
కేంద్రకం.మూడు చేపలు.
అవి కాలరేఖలే.గతం, వర్తమానం, భవిత.
అంతే.మా ఇంటిముందరి బెస్త మహిళ సంక్షిప్తత, విస్తృతికి ఈ చిత్రమే నిదర్శనం.
ఆమె ఒక సర్వనామం.
+++ఎంత చెప్పినా, ఆమె సామాన్యురాలే.
తన సృజనాత్మకతకు, కళకు, ప్రతిభకు సరైన గౌరవం ఇప్పటికీ లభించలేదు.
అందుకు ఎవర్ని నిందించాలీ అంటే ముందు నన్నే.అవును.
కొడుకును, భర్తను, సోదరుడిని, స్నేహితుడిని…మొత్తంగా పురుషులందరినీ నిందించవలసే ఉంది.
ఆ నిందను కాస్తంతైనా తొలగించుకునే ప్రయత్నంలో ఒక చిన్న ప్రయత్నం నా చిత్రలిపి.
దృశ్యాదృశ్యం

ఆమె ఇంటి ముందు ఉన్నందుకు మేల్కొన్నాను.
మా ఇల్లు మొదలు అనేక ఇండ్లు కలియ తిరిగాను. ఒకటెనుక ఒకటిగా ముంగిట్లోని చిత్రాలను వాడకట్టంతా తిరగాడ, ఇరుగు పొరుగు గల్లీలు చుట్టుముట్టి, ముషీరాబాద్ డివిజన్ వ్యాప్తంగా ఒర రెండేళ్లు పనిచేసి చూశాను. చూస్తే, వాళ్ల చేతివేళ్లనుంచి జాలువారే కళను కమ్మటి చిత్రాలుగా మలిచి సంక్రాంతికి ఒక ప్రదర్శన పెట్టాను. అందులో ఈ చిత్రం మకుటం.+++

కానీ, ఈ చిత్రం గురించి పెద్ద ఎత్తున చెప్పాలనుకుని మీడియాకు అర్థం చేయించలేక విఫలమయ్యాను.
ఈ వారం ఆ ప్రయత్నం చేసి మరొకసారి భంగపడాలని ఉంది.

బాలామణి ఈ year (2014) మల్లి అదే ముగ్గు సంక్రాంతికి వేసారు. ఆ చిత్రం క్లోజుప్ షాట్.

బాలామణి ఈ year (2014) మల్లి అదే ముగ్గు సంక్రాంతికి వేసారు. ఆ చిత్రం క్లోజుప్ షాట్.

అవును. నిజం.
ఎంత చెప్పినా…జరిగేది పెద్దగా లేకపోయినా ప్రతిసారీ భంగపడి, అలసిపోతూ కూడా మళ్లీ పని చేయబుద్దవుతుంది.
అందులో ఒక బాధ, తృప్తీ.

నిజమే మరి. ఒక రకంగా ఛాయా చిత్రలేఖనమూ మగువల ముగ్గువంటిదే, నా వరకు నాకు.
ఏ ఉద్దేశ్యం ఉన్నట్టు లేకుండా ప్రజల్ని, వారి జీవనచ్ఛాయల్ని చేసుకుంటూ వెళ్లడం అన్నది ప్రతిరోజూ వాకిలి ఊడ్చి అలుకు చల్లి ముగ్గు పెట్టడం వంటిదే.
ఆ పని ఒకటి నిత్యం జరగాలి.
దైనందిన అవసరం, శోభ.

+++

మహిళలు చేస్తున్నది అదే. నిజానికి వారు ఎన్నడూ ఏదీ ఆశించరు. ప్రశంస కూడా కోరుకోకుండా పనిచేస్తరు.
వాళ్లనుంచి ఇంకా నేర్చుకోవలసింది ఉందనుకుంటూనే ఈ చిత్రం గురించి ముఖ్యంగా మూడు మాటలు.

+++

స్త్రీ తన మనోభావాలను, ఆకాంక్షలను ఎట్లయితే చిత్రలిపితో రంగరిస్తుందో అట్లే ఒక సామూహిక అస్తిత్వాన్ని, సాంస్కృతిక ఉనికిని కూడా అపూర్వంగా చిత్రీకరిస్తుందన్న భావన కలిగింది. అందుకు ఈ చిత్రమే ఆధారం.

మూడు చేపలు.
అవును. మా ఇంటిముందువే.
హైదరాబాద్ లోని పార్సీగుట్టలో, గంగపుత్ర కాలనీలో నివసించే బాలమణి గారు వేసిన ముగ్గు ఇది.

ఆమె బెస్తామె. ‘ఒకే కన్ను…మూడు చేపల’ ఈ ముగ్గును తాను స్వయంగా ఊహించి చిత్రించిందట.
పదేళ్ల క్రితం తొలిసారి వేసిందట.
అప్పటినుంచి ఆమెను చూసి కొందరు, ఇంకొందరు.
మా కాలనీలో అనేక చేపలు ఇట్లా వాకిట్లో కనిపిస్తుంటే, వాళ్లంతా గీస్తుంటే అందుకు కారణం ‘మా ఎదురింటి పెద్ద మనిషి’ అని తెలిసి ఆశ్చర్యం.
అదే ఆశ్చర్యంతో వెళ్లి అడుగగా, అందులో ఏ విశేషం లేనట్టు చిన్నగా నవ్వింది.

‘ఇది మీరే సృష్టించారా?’ అని ఆశ్చర్యపోతూ అడిగితే, ‘సృష్టికాదు’ అని అంది.
‘మనం దేన్నయినా సృష్టించగలమా?’ అనీ అన్నది.
ఆ మాట అంటూ,  ‘మేం గంగపుత్రులం’ అన్నది.

+++

‘చేప మా కులదేవత’ అన్నది.
‘చేపల్ని మనం సృష్టిస్తమా?’ అనీ అన్నది.

+++

చాలా తక్కువగా మాట్లాడింది.
ఆ మాటల్లో తాను నిలుపుతున్న సాంస్కృతిక అస్తిత్వం, చాటుతున్న ఘన వారసత్వం …ఇవేవీ కానరాలేదు. ఒక మహిళ ఉన్నది. జానపదం అని అనడం ఇష్టంలేదు. ఆధునీకమూ అనలేను. జీవితమంత భక్తితో, ప్రేమతో ఆమె అన్న మాటలతో మనుషులను అంచనావేసుకునే ప్రయత్నానికి స్వస్తి పలకబుద్ధయింది.
అంతే.

+++

ముఖాముఖి అన్నది రద్దయింది.
సుముఖం. అంతే.

+++

04

ఆమెనూ, ఆమె ముగ్గునూ చూస్తుంటే అది ప్రదర్శన కాదని తెలిసింది.
ఒక అంతర్వాణి అని తెలిసింది.
చెప్పలేను. తెలియనివేవో అన్నీ అర్థమైన రీతి.
ఏ విశేషమూ లేని సహజత్వం తాలూకు విశిష్టత ముందు మోకరిల్లడం తప్పా మరేమీ వదిలించుకోలేని స్థితి.

స్వల్ప రేఖలే. కానీ, తమ జీవికకు మూలమైన అనాది ఛాయను ఆమెను భద్రపరచిన తీరుకు ముగ్దుడినై మౌనం దాల్చి,  దాని దృశ్యాదృశ్యాలను…గతాన్ని, భవితనూ, వర్తమానాన్నీఒకే కన్నుతో కలుపుతున్నట్టు ఆమె చిత్రంచి వాకిట్లో వుంచిన తీరుకు, చూసిన అనుభవంతో ధన్యుణ్నే అయ్యాను

+++

సరిగ్గ సంక్రాంతి రోజున ఆమె ఈ చిత్రం వాకిట్లో గీసింది.
ఆ రోజు అందరి వాకిళ్లలో రథం ముగ్గు ఊరేగుతుండగా బాలమణి గారి ఇంటి ముందు మాత్రం ఈ ‘మత్య్సం’ మూడు పువ్వులుగా ఆగుపించి ఆ ఇంటికి సిసలైన సంపద ఏమిటో చాటింది.

అంతే.
అంతకన్నా ఏమీ లేదు.

ఆమెను చూడటం కాదు, ఆమె ముగ్గును చూడటమూ కాదు, పదులు, వందలు, వేలు, లక్షలు, కోటానుకోట్ల మత్యకారుల జీవన సమరమూ, వారి జీవన లాలసా- బాలమణి గారి మునివేళ్ల నుంచి ఇట్లా అలవోకగా, ముగ్గు పిండి ద్వారా జాలువారి ఒక సాంస్కృతిక చిహ్నంగా ఆ ఉదయం శోభిల్లడం మినహా మానవేతిహాసంలో ఆ రోజుకు ఇంకో ప్రత్యేకత కనిపించలేదు.

అంతే.
అదే సంక్రాంతి.

ఆ తర్వాత ఆ చిత్రం అదృశ్యం.
అదే ఈ వారం దృశ్యాదృశ్యం.

~ కందుకూరి రమేష్ బాబు

ramesh

మీ మాటలు

  1. kirankumari says:

    ఒక కన్ను మూడు చేపల ముగ్గు అలానే కన్నులు కట్టేసింది . రేపు మా ఇంటి ముందర ఈ ముగ్గే వేసుకుంటా !
    అతి తక్కువ గీతలతో , సులభంగా నేర్చుకునేలా ఉండే ఒక్క కన్ను, మూడు చేపల ముగ్గు వేసిన కళాకారిణి బాలామణి గారికి వందనాలు!
    Traditional ,Modern art కిందకు వచ్చే అంత మంచి ముగ్గుని మాకు చూపించినందుకు,
    అందమైన మీ వ్యాఖ్యానానికి మీకు నా కృతజ్ఞతలు !
    కిరణ్ కుమారి

  2. కిరణ్ కుమారి గారు, థాంక్స్ అండీ…

Leave a Reply to kirankumari Cancel reply

*