సైకిలూ – మూడు కవిసమయాలు

varavara.psd-1

‘చలినెగళ్లు’ (1968) తో మొదలుపెట్టి ‘జీవనాడి’ (1972), ‘ఊరేగింపు’ (1974) ల నుంచి ఒక్కొక్క కవిత తీసుకుని నేపథ్యం చెపుతున్నాను గనుక నేను నా కవితా పరిణామక్రమాన్ని వివరిస్తున్నానని పాఠకులు గ్రహించే ఉంటారు. ఈ సారికి ఆ పద్ధతి నుంచి వైదొలగి ఒక్కసారే 2006లోకి మిమ్ములను తీసుకపోతాను. అయితే అది 1975 ఎమర్జెన్సీని కూడ జ్ఞాపకం చేస్తుంది.

2014 జూలై 27 ఆదివారం సాయంత్రం హైదరాబాదు ఆబిడ్స్ గోల్డెన్ త్రెషోల్డ్ లో ‘కవి సంగమం’ లో అఫ్సర్ తన కవిత్వం వినిపించాడు. అందులో మొదటి తన కవితా సంకలనం  రక్తస్పర్శ (2006) లోని సర్వేశ్వర్ దయాల్ మరణం గురించి కవిత చదవడంతో నా మనసు ఆ రోజుల్లోకి వెళిపోయింది.

images

సర్వేశ్వర్ దయాల్ సక్సేనా నా అభిమాన హిందీ కవి. ‘తోడేలు వెంటపడితే పరుగెత్తకు. నిలబడి ఒక అగ్గిపుల్ల గియ్. తోక ముడిచి వెళిపోతుంది….’, ‘నీ ఇంట్లో శవం కుళ్లి వాసనేస్తున్నదంటే ఇంకెంత మాత్రమూ అది నీ వ్యక్తిగత సమస్య కాదు’ వంటి ఆయన కవితాచరణాలు ఎనభైలలో తెలుగు కవివేనన్నంతగా ప్రచారం పొందాయి. 1982 జూలై 2న చెరబండరాజు చనిపోయాక ఆయనపై సర్వేశ్వర్ దయాల్ ఒక మంచి ఎలిజీ రాసాడు. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత ఢిల్లీలో లెక్చరర్ గా పనిచేసిన సురా (సి వి సుబ్బారావు) ద్వారా ఆయనతో పరోక్ష పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కారణంగానే ఆయన 1983లో మేము ఢిల్లీలో తలపెట్టిన ఎ ఐ ఎల్ ఆర్ సి (ఆలిండియా లీగ్ ఫర్ రెవల్యూషనరీ కల్చర్ – అఖిల భారత విప్లవ సాంస్కృతిక సమితి) ఆవిర్భావసభకు ఆహ్వానసంఘ అధ్యక్షుడుగా ఉండడానికి ఒప్పుకున్నాడు. అట్లా ఆయన ఇటు కెవిఆర్ తోనూ, నాతోనూ ఉత్తరప్రత్యుత్తరాల్లో ఉండేవాడు. తీరా, 1983 అక్టోబర్ లో ఆవిర్భావ సభలు జరగడానికన్న ముందే ఆయన ఆకస్మికంగా మరణించాడు. అఫ్సర్ కవిత సరిగ్గా ఆ మరణం గురించే. ఒకరాత్రి పుస్తకం చదువుతూ గుండెల మీద పరచుకుని ఆ కవి శాశ్వతనిద్రలోకి వెళిపోయాడు. ఆయనను మేము చూడనే లేకపోయాం.

AU_2012033006_34_53

సర్వేశ్వర దయాల్ సక్సేనా న్యూఢిల్లీ సాకేత్ లో జర్నలిస్టు ఎంక్లేవ్ లో ఉండేవాడు. ఆయన బాల్కనీ నుంచి ఎదురుగా మిలిటరీ కంటోన్మెంట్ పార్కు. ఆ పార్కుకి రోజూ సాయంత్రం ఒక యువకుడు ఎర్ర సైకిల్ పై వచ్చి చేతిలో ఏదో పొట్లం పట్టుకుని లోనికి పోయేవాడు. కాని ఎమర్జెన్సీలో ఒక సాయంత్రం తర్వాత ఆ యువకుడు కవికి కనిపించలేదు.

‘కొత్త ఢిల్లీలో

మిలిటరీ ఇనుపకంచె బయట

ఒక ఎర్ర సైకిలూ

ఇనుపముళ్లలో చిక్కుకపోయిన

ప్రియురాలికివ్వడానికి తెచ్చిన

గోరింటాకు

రోజూ అట్లా చూస్తూ ఉండే కవి

సర్వేశ్వర్ దయాల్ సక్సేనాకు

యవ్వనస్వప్నాలను

ఎమర్జెన్సీ ఏంచేసిందో

ఎవరూ చెప్పక్కర్లేకపోయింది.’

అయితే సృజనకు, విప్లవోద్యమానికి, సాహిత్యానికి ఎమర్జెన్సీ ఆరంభమూ కాదు, చివరా కాదు. 1968లో ‘ట్రిగ్గర్ మీద వేళ్లతో రా….’ అని పిలుపు ఇచ్చిన దగ్గర్నుంచీ ఇవ్వాటిదాకా మాకు అప్రకటిత ఎమర్జెన్సీయే. అది ‘తననెప్పుడూ నిరాశపరచని మిత్రుడు’ సైకిల్ నుంచి లోచన్ ను వేరుచేసి రెండువారాలు పాకాల క్యాంపులో పెట్టి జైలుకు పంపింది. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో విప్లవ విద్యార్థులు ఎర్ర జెండాలు అందించుకున్నట్లుగా ఒకరి నుంచి ఒకరు పోరాట వారసత్వంగా పొందిన సైకిల్ నుంచి ఆజాద్ ను, ప్రసాద్ ను, రజితను దూరం చేసి ‘ఎన్ కౌంటర్’ చేసింది.

 

2006 ఆగస్టులో సిపిఐ (మావోయిస్టు) రాష్ట్ర కమిటీ కార్యదర్శి మాధవ్ (చిన్నయ్య) తో పాటు ‘ఎన్ కౌంటర్’ అయిన ఏడుగురిలో రజిత ఒకరు. ఆ ఏడుగురూ చిత్రహింసల వల్ల ఎంత మాంసం ముద్దలయ్యారంటే ఆమె కాలివేళ్ల పోలికతో మాత్రమే ఆమె సోదరి ఆమెను గుర్తుపట్టగలిగింది. రజిత విద్యార్థి ఉద్యమంలోనే కాకుండా మహిళా ఉద్యమంలో కూడ ఎంతో క్రియాశీలంగా పనిచెసింది. సంక్షేమ పథకాలను రద్దు చేయాలని చంద్రబాబు నాయుడు 1996లో పూనుకున్నప్పుడు, 2000 లో హైదరాబాదులో వరదలు వచ్చినప్పుడు పోరాటంలోను, సహాయ కార్యక్రమాలలోను అప్పటికింకా విద్యార్థిగా ఉన్న కాశీం ను రజిత తన సైకిల్ పై ఎక్కించుకుని తిప్పేదని చెప్పాడు.

          వరవరరావు

ఆగస్ట్ 12, 2014

 

 

మీ మాటలు

  1. వాసుదే says:

    వెంటాడే పద్యానికింతకంటే గొప్ప ఉదాహరణ ఉంటుందని అనుకోను–“సైకిలూ-మూడుపద్యాలు”. ఐతే పైపద్యంలోని
    “ఇనుపముళ్లలో చిక్కుకపోయిన

    ప్రియురాలికివ్వడానికి తెచ్చిన

    గోరింటాకు” అద్భుత పదసృష్టి. క్యుడోస్!

  2. chandramouli raamaa says:

    ఈ తలపోతంతా ఎంత దు@హ్ఖోద్విగ్నమో..హృదయంనిండా అగ్ని.పైకి మనిషి ఒట్టి ప్రశాంత సముద్రం.
    కాలం సైకిల్ ను జ్ఞాపకంగా మిగిల్చి వెళ్ళిపోయింది ..ఆమె ఒక నిప్పుకణిక.
    సలాం.
    -రామా చంద్రమౌళి

Leave a Reply to వాసుదే Cancel reply

*