రచనలో వినిపించే స్వరం ఎవరిది?!

 10565093_10152677529194683_7972848941163645770_n

పసునూరు రవీందర్ కథలు చదువుతున్న సమయంలోనే యింకో వేపు సమకాలీన అమెరికన్ కథ మీద జరుగుతున్న వొక చర్చ నన్ను అమితంగా ఆకట్టుకుంది – రవీందర్ తన కథల్లో సాగిస్తున్న అన్వేషణకీ, ఈ చర్చకి చాలా దగ్గరి చుట్టరికం వుందికాబట్టి. ఈ చర్చలోంచి మూడు విషయాలు ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించాలి:

ఒకటి – వొక సమకాలీన సందర్భం లేదా సంఘటన అది ఇంకా జరుగుతూ వుండగానే దాన్ని కథ చేయగలమా? అంటే- ఇంకో రకంగా చెప్పాలంటే, జీవితంలోని immediacy (తక్షణికత)ని కథా లక్షణంగా మార్చగలమా?

రెండు: కథలో రచయిత అసలు స్వరం (authorial voice) ఎంతవరకూ వినిపించవచ్చు?

మూడు: భిన్నకులాలూ మతాలూ వున్న సమూహాల్లో భిన్నస్వరాలు ఎలాంటి ప్రాతినిధ్యాన్ని (representation) కోరుకుంటాయి?

రవీందర్ కథల్లో ఈ మూడు విషయాలూ వొక బలమైన వాదాన్ని వినిపిస్తాయి. రవీందర్ తన కథల్ని “తెలంగాణా దళిత కథలు” అంటున్నాడు. ఆ విధంగా తన కథల్ని భిన్నంగా చదవడానికి తనే వొక తలుపు తీసి మనల్ని ముందుకు తీసుకువెళ్తున్నాడు.

అయితే, అలాంటి వొక “తెలంగాణా దళిత” తలుపు తెరచి, తన చదువరిని ఆ తలుపులోంచే తనని చదివి తీరాలని అతనేమీ మంకు పట్టు పట్టడం లేదు. నేను చదివినంత వరకూ, నాకు అర్థమైనంత వరకూ కథని discourse గా మార్చి, ఆ కథలోంచి వొక చర్చని సహనంతో తీసుకువచ్చి, అంతే సహనంతో మిగిలిన గొంతులు వినడానికి కూడా సిద్ధంగా వుండే కొద్దిమంది రచయితల్లో రవీందర్ వొకడని కచ్చితంగా చెప్పగలను.

అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా సంపుటిలో కథకుడిగా రవీందర్ మనం తెలిసీ తెలిసీ దాచిపెట్టే కొన్ని కీలకమైన విషయాలను uncover చేస్తున్నాడు.

Uncover అనే మాటని నేను “to allow (something) to be seen by removing a covering” అనే కచ్చితమైన అర్థంలో వాడుతున్నాను, ఎందుకంటే రవీందర్ ఈ సంపుటికి ఇచ్చిన శీర్షిక ద్వారానే కాకుండా, పుస్తకం లోపలి కథల్లో కూడా ఖాయంగా చేస్తున్న పనే అదే కాబట్టి! ఈ uncovering కీ, పైన ప్రస్తావించిన మూడు విషయాలకూ –immediacy, authorial voice, representation కీ చుట్టరికం వుంది. రవీందర్ కథల్లో ఇతరేతర అంశాలు చాలా వున్నప్పటికీ, అతను అతనుగా ఈ కథల్లో అచ్చంగా ఏం చేస్తున్నాడో చెప్పడం మాత్రమే యిక్కడ నా ప్రయత్నం.

1

ఇప్పటికి అరవయ్యేడు ఏళ్ల కిందట అమెరికా కథానిక వొక రూపాన్ని వెతుక్కుంటున్న సమయంలో Martha Foley అనే విమర్శకురాలు ఇలా రాసింది : It is a literary truism that there must be a period of distillation before the real impact of some tremendous event, either historical or personal, can emerge in writing.

ఆమె ప్రధానంగా కథలో సమకాలీనత గురించి మాట్లాడుతోంది. వొక సంఘటన జరిగిన వెంటనే లేదా, వొక సందర్భం కొనసాగుతూ వుండగానో దాన్ని కథగా మలచలేమన్నది ఆమె వాదం. కొంత కాలం గడిస్తే తప్ప ఆ సంఘటనా, సందర్భం నిజమైన ప్రభావం ఏమిటో తెలీదనీ, అది తెలిస్తే గాని దాన్ని కథగా మలచలేమనీ ఆమె అభిప్రాయం. అంటే, ఆ అనుభవం పక్వమయ్యే దాకా ఎదురుచూడాలని ఆమె అనేది.

ఎవరు ఎన్ని రకాలుగా నిర్వచనాలు చెప్పినా, కవిత్వం ఉద్వేగ కళ. వొక వుద్వేగాన్ని వ్యక్తీకరించగలిగితే కవిత్వం పని చాలా మటుకు అయిపోయినట్టే. దానికి భిన్నంగా కథ అనేది ప్రధానంగా ఆలోచనకి సంబంధించిన ప్రక్రియ. కేవలం వుద్వేగానికే పరిమితమయిపోతానంటే ఆ కథని అంత తేలికగా వొప్పుకోలేం. అనుభవ సారం ఎంతో కొంత కథలో ఇమడాలి. కథ చదివాక కొంత నిగ్రహమైన ఆలోచనని కూడా చదువరి కోరుకుంటాడు. ఆ మేరకు Martha Foley వాదంలో ఎంతో కొంత నిజం లేకపోలేదు. కాని, అది కొంత మాత్రమే!

కాని, 9/11 తరవాత వచ్చిన అమెరికన్ కథకులూ, విమర్శకులూ ఈ వాదాన్ని పడనివ్వడం లేదు. వొక ఏదో సందర్భంలో శ్రీశ్రీ అన్నారట: దినదినాభివృద్ది కాదు, క్షణ క్షణాభివృద్ది కోరుకుంటున్నానని! అభివృద్ధి వేగాన్ని క్షణాలతో కొలుస్తున్న కాలం ఇది. ముఖ్యంగా సాంకేతిక విప్లవం వచ్చాక ప్రపంచం చాలా మారిపోయింది. భౌతిక సాంకేతికత, వ్యక్తి మానసికతా రెండూ వొక విధమైన అంతుపట్టని యుద్ధంలో కూరుకుపోతున్న దశ ఇది. ఈ రెండీటికి మధ్యా వుండే దూరాన్ని ఇప్పుడిప్పుడే తెలుగు కథా రచయితలు పట్టించుకుంటున్నారు. కథల్లో అత్యాధునిక కమ్యూనికేషన్ సాధనాలూ, సోషల్ మీడియా నెట్ వర్కుల ప్రస్తావనా, వాటి పర్యవసానాలూ కథల్లోకి అనివార్యంగా ప్రవేశిస్తున్నాయి. అంటే, గ్లోబలైజేషన్ కి సంబంధించి రెండో దశలోకి తెలుగుకథ ప్రవేశించిందనే చెప్పాలి. రవీందర్ ఈ కథా సంపుటికి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని పేరు పెట్టడం ఈ దశకి బలమైన సంకేతం. అలా పేరు పెట్టడం ద్వారా జీవితంలోని immediacy (తక్షణికత)ని తన కథా లక్షణంగా చెప్పక చెప్తున్నాడు రవీందర్.

రవీందర్ వ్యక్తీకరణలో ఈ తక్షణికత ఎలాంటి కథలుగా మారుతోంది? కాలానికి అతీతమైన నిర్జీవ విషయాల్నితన కథకి వస్తువుగా ఎట్టి పరిస్థితిలోనూ తీసుకోలేడు రవీందర్. తన కాలంలో తన స్థలంలో నిలబడి మాట్లాడడం అతని కథకి జీవలక్షణం. ఈ సంపుటిలోని మొదటి కథ –వెరేవర్ యు గో -అనే కథలోనే రవీందర్ ఈ లక్షణానికి నాంది పలుకుతాడు. ఇప్పటికీ మనలోని కొంత మంది “లౌకికులు” మనకే కులాలూ మతాలూ ప్రాంతాలూ లేవని వొక అమూర్త మానవ ముఖాన్ని(abstract human face) తొడుక్కొని వుంటారు. వాళ్ళు తొడుక్కుంటే పర్లేదు కాని, ఇతరులు కూడా అలాంటిదేదో ముసుగు తొడుక్కోకపోతే అనుమానంగా చూస్తారు. కాని, కులాలూ మతాలూ ప్రాంతాలూ ఇంకా ఇంకా బలంగా మన ఉనికిని నిర్ణయిస్తూనే వున్నాయని, అవి వేరే రూపం దాల్చి మన మధ్యనే   వున్నాయని గుర్తించడానికి నిరాకరిస్తారు. ఇది తెలిసీ తెలిసీ నిరాకరించడం! “ఎహె గీ కాలంల …క్యాస్ట్ గీస్ట్ ఎక్కడిది సార్?!” అనే పెద్దమనిషి తరహా ముసుగు uncover చేసే కథ ఇది.

రవీందర్ కథల్లో చాలా మటుకు కులం ముఖ్యమైన విషయంగా మారడంలో ఆశ్చర్యమేమీ లేదు. పది నిజాల కంటే వొక అబద్దం ఎక్కువ ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. పైగా, ఆ అబద్ధం ఆ పది నిజాల్ని కప్పిపుచ్చేది అయితే కోపం ఇంకా కట్టలు తెచ్చుకుంటుంది. రవీందర్ కథల్లో ఈ సామాజిక అధర్మం మీద ధర్మాగ్రహం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే, వొక్కో కథనీ దగ్గిరగా చదువుకుంటూ వెళ్తే, అతనిలో కేవలం కోపం మాత్రమే లేదనీ, ఆ కోపాన్ని నిగ్రహించుకొని మాట్లాడే శక్తి కూడా చాలానే ఉందనీ అర్థమవుతుంది. ఆ నిగ్రహం తన చుట్టూ వున్న అధర్మాన్ని ఆలోచనతో చూడడం వల్ల సాధ్యపడిందనీ అర్థమవుతుంది. ఉదాహరణకు: గోవర్ణం కథ. మొదటి సారి ఈ కథ చదివినప్పుడు ఇందులోని కథాంశాన్ని నేను నమ్మలేకపోయాను. అంటే, నాగరికుల మీద నాకూ కొన్ని భ్రమలున్నాయని, ఆ భ్రమ వల్లనే ఈ కథని నేను మొదట నమ్మలేకపోయాననీ తరవాత నన్ను నేను తర్కించుకుంటే అర్థమైంది. ఈ కథలోని విషయం నా కవరేజీ పరిధిలో లేకపోవడం కూడా ఇంకో కారణం కావచ్చు.

రవీందర్ కథలు ఎలాంటి కనువిప్పు కలిగిస్తాయో అదొక ఉదాహరణ మాత్రమే. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా కథలో వొక పాత్ర చేత అనిపిస్తాడు రవీందర్. “పట్నంల కూడా కులముంటదే. కాకుంటే బయిటికి కనిపించకుంట దాని పని అది చేస్తుంటది. దానితో దెబ్బతిన్నోల్లకే అది కనిపిస్తది దాన్ని పాటిస్తూ, ఆదిపత్యం చెలాయించే పెద్దకులపోళ్ళకి అది లేనట్టుగా భ్రమింప జేస్తది. గందుకే, ఇగ బాధపదేటోళ్ళు బాధపడుతుంటే, బాధపెడ్తున్నోల్లు మాత్రం కులమెక్కడిదని నీతులు చెబ్తుంటరే!” ఇది వొక పాత్రలోంచి రవీందర్ ఆవేదన, ఆగ్రహం!

సమకాలీనం అన్న మాటని తెలుగు సాహిత్యంలో చాలా అన్యాయంగా వాడేస్తున్నారు. నిజానికి సమకాలీనం అనదగ్గ రచనలు చాలా తక్కువగా వస్తున్నాయి. రచయితలు వొక ఊహా ప్రపంచాన్ని నిర్మించుకొని, అదే సమకాలీనం అనుకుంటూ ఆ లోకంలోనే అందరూ ఉండాలన్న అందంగా నిర్మిస్తున్న కాలం ఇది. ముఖ్యంగా చాలా మంది కథకులకు (ఇక కవుల సంగతి చెప్పక్కరలేదు!) సమకాలీన రాజకీయాలను అర్థం చేసుకునే శక్తి లేదు. వాళ్ళ చదువూ అవగాహనా అందుకు సరిపోవడం లేదన్నది నా అభిప్రాయం. తమ చుట్టూ వున్న లోకం రాజకీయ అతీతంగా, పరిశుద్ధంగా ఉండాలన్న భ్రమ ఇంకా చాలా మందిలో వుంది. కార్పోరేట్ జమానాలో కులాలు లేవనడం ఎంత అబద్దమో దానికి పది రెట్లు అబద్దం ఈ రాజకీయాతీత కలవరింత. అయితే, రాజకీయ లోకంలో ఇంకా వేరే భ్రమలు కొన్ని వున్నాయి. అలాంటి భ్రమల నిలువుటద్దం ఊగి..ఊగి ఉయ్యాల కథ.

రవీందర్ కథలు అచ్చంగా సమకాలీన కథలు- నాకు అర్థమైనంత వరకూ ఆ సమకాలీనత ఎంత సమకాలీనం అంటే అవి ఈ క్షణపు వేగాన్ని అందుకుంటున్న కథలు. ప్రతి కథలోనూ వొక పట్టి పీడిస్తున్న ఇప్పటి సమస్యా, దాని ఆనుపానులు తెలుసుకోవాలనుకునే తపనా, అన్నిటికీ మించి రవీందర్ పరాయీ స్వరాల మీద ఆధారపడకుండా తన గొంతుకతో మాట్లాడాలన్న వెతుకులాటా ఈ కథల లక్షణం.

ఈ కథల్లోంచి రవీందర్ స్వరాన్ని ఎలా వినాలో ఇప్పుడు మాట్లాడుకుందాం. కథలో రచయిత అసలు స్వరం (authorial voice) ఎంతవరకూ వినిపించవచ్చు? అన్న రెండో విషయానికి వద్దాం.

1545666_10152155164074683_826845966_n

 

2

 

“What do you have to say?”

“This. I have this to say, and I want you to listen to my voice, to the tone of my voice, because that will tell you what I have to say.”

–          Elizabeth Strout, 2013.

కథలో గానీ కథనంలోగానీ రచయిత కనిపించకూడదనీ, రచయిత స్వరం వినిపించకూడదనీ చాలా కాలంగా వొక సాహిత్య సౌందర్య భ్రాంతిని మనం నమ్ముతూ వచ్చాం; ఇప్పటికీ నమ్ముతున్నాం. అలాంటి స్వరాన్ని సవరించుకునే నెపం మీద చాలా మంది కథకులు సాహిత్యంలో సమకాలీన లేదా తక్షణ వాస్తవికతని వాయిదా వేస్తూ వెళ్తారు. ఆ అనుభవం పరిపక్వమైన తరవాతనే మాట్లాడుకుందామనుకునే ధోరణి తక్షణ జీవితాన్ని గురించి ఏమీ అనలేని స్థితికి రచయితని నెట్టేస్తుంది. అంటే, తక్షణ జీవితం మొత్తంగానే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అయిపోతుంది మన సాహిత్యంలో!

అస్తిత్వవాద రచనల్లో రచయిత స్వరం మీద ఎలాంటి కట్టుబాట్లూ లేవు. ఇలాంటి రచనల్లో సౌందర్యం కేవలం రూపపరమైన పరిమితుల్లో మాత్రమే వుండిపోదు. రచయిత చెప్పదలచుకున్న విషయమూ దాని సూటిదనం కూడా రచనా సౌందర్యంలో విడదీయలేని భాగమవుతాయి. ఫలానా విషయం కచ్చితంగా మాట్లాడి తీరాలన్న అస్తిత్వ కట్టుబాటు రచనని నడిపిస్తుంది. అయితే, ఆ “ఫలానా” రచయితని బలహీనపరచవచ్చు కూడా- అంటే, వొక విధంగా కథన సౌందర్యం పట్ల ప్రత్యేక దృష్టి వున్న రచయిత కంటే, అస్తిత్వవాద రచయితకి శిల్పం ఎక్కువ కత్తి మీద సాము అవుతుంది, తన స్వరం బలహీనపడకుండా కథనం కుంటుపడకుండా చదువరిని వొకే దృక్కోణంలో ఖైదు చేయకుండా కథ నడిపించాలి కాబట్టి!

రవీందర్ కథనంలో ఇలాంటి సందిగ్ధం కనిపించదు. ఏం చెప్పాలో అతనికి కచ్చితంగా తెలుసు. అంతకంటే ముఖ్యంగా ఎలా చెప్పాలో కూడా తెలుసు. ఉదాహరణకు పెంజీకటి కథ. జీవితంలోని కొన్ని అనుభవాల్ని వొక మహాకావ్యం లేదా మహానవల (శ్రీశ్రీ, రావిశాస్త్రిలు వాడిన అర్థంలోనే) గా వ్యక్తం చేయాలన్న సృజనాత్మక కోరిక మనవాళ్ళలో కొత్త కాదు. కాని, అవి రెండూ సైజుకి సంబంధించిన అంశాలు అనుకున్నప్పుడే సమస్య. సాహిత్య రూపం అనే భావన స్వభావం మారింది అనుకోడానికి సిద్ధంగా వుంటే, చిన్న కవిత చిన్న కథ కూడా వొక మహాకావ్యం, మహానవల చేయగలిగే పని చేస్తుంది. శ్రీశ్రీ ‘ఆహా” కవిత నా దృష్టిలోమహాకావ్యమే, అలాగే, రావిశాస్త్రి ‘పిపీలికం’ మహానవలే! రవీందర్ కథ పెంజీకటి ఇక్కడ అచ్చులో కొన్ని పేజీలే కాని, ఆ కథ ఆవిష్కరించే జీవితం వొక మహానవల పరిమాణంలో వుంది.

ఈ కథని ఊహించడంలో రవీందర్ వెళ్ళిన దూరాలు నాకు ఆసక్తి కలిగించాయి. ఈ కథారూపంలో నాటకానికి సంబంధించిన నిర్మాణ అంశాల్ని చాలా సహజంగా, ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాడు. అంతకంటే ఎక్కువగా వొక నవలకి కావలసిన జీవితపు ముడిసరుకు తీసుకొని, దాన్ని కొన్ని పేజీల కథలోకి కుదించడం రవీందర్ శిల్ప విజయం.

అయితే, రవీందర్ కథనస్వరానికి వున్న నిర్దిష్టత వల్లనే ఇది సాధ్యపడిందని నా నమ్మకం. కథావస్తువుని objective గా తీసుకొని, అందులో subjective tone ని కాపాడుకుంటూ వెళ్ళడం ద్వారా రవీందర్ ఈ కథల్లో శిల్పపరంగా కనీసం రెండు మూడు అడుగులు అదనంగా నడుచుకుంటూ వెళ్ళాడని నేను అనుకున్నా. ఈ నడవడంలో అతనిలో వున్న కథకుడు వొక కొత్త ఆత్మవిశ్వాసంతో మెరవడం కూడా నేను చూస్తున్నా.

సాహిత్య వాతావరణం ఆసక్తికరంగా కనిపిస్తున్నప్పటికీ- రచయిత వ్యక్తిగత స్థాయిలో ఎంతో కొంత నిరాశలోకీ, దిగులులోకి నెట్టివేయబడుతున్న కాలం కాని కాలంలో ఆ రచయితస్వరంలో, నడకలో ఈ ఆత్మవిశ్వాసం ఎటు నించి వస్తుంది?

నాకు తెలిసీ అది ఆ రచయిత తనని తాను ధీమాగా ధిక్కారంగా అలాగే కొంచెం open గా తెరుచుకునే representative vision (ప్రాతినిధ్యపు దృష్టి) నించి వస్తుంది. అస్తిత్వ వాద రచయిత ఇతర బహుముఖాలకి ఎంత open గా వుండగలడు? అన్న ప్రశ్న కూడా ఇక్కడ వస్తుంది.

 

3

రవీందర్ కథలు రాస్తున్న ప్రస్తుత దశలో కేవలం తెలంగాణా కథలే కాదు, దళిత కథలే కాదు. ఇతర అస్తిత్వాల రచనలూ వస్తున్నాయి. కాని, ఈ కథలకి రవీందర్ “తెలంగాణా దళిత కథలు” అని ఉపశీర్షిక పెట్టుకున్నాడు. అలా బహిరంగంగా తన అస్తిత్వం ప్రకటించుకోవడంలో వొక సౌకర్యమూ అసౌకర్యమూ వున్నాయి. ఆ అస్తిత్వ కోణం నించి మాత్రమే తనని చూడాలన్న కట్టడి అతను చదువరికి పెడ్తున్నాడా? పెడితే, అప్పుడు చదువరి కోరుకునే స్వేచ్చ ఏమవుతుంది?

ముఖ్యంగా సాహిత్య రంగంలో అన్ని వేపులా చదువరి వొక open-endedness ని కోరుకుంటున్న కాలం ఇది. అదే సమయంలో అనేక రకాల ప్రాతినిధ్యాలు రచనలలోకి వస్తున్నాయి. రవీందర్ కథల్ని నేను రవీందర్ చెప్పిన “తెలంగాణా దళిత” కోణం నించి మాత్రమే కాదు, వాటిని నా వైపు నించి – అంటే నాకు వుండే భిన్న అస్తిత్వాల – నించి కూడా చదువుతాను. నా reading ని రవీందర్ కట్టడి చేయలేడు, చేయాలనే వుద్దేశం కూడా అతనికి వుండకపోవచ్చు. కాని, వొక చదువరిగా నేను నా ప్రపంచంలోకి రవీందర్ ని ఎలా పిలుచుకోవాలి?

The other – అన్యత్వం- అన్న భావన ఇప్పుడు సాహిత్య రంగంలోనే కాదు, సామాజిక రంగంలోనూ పెద్ద సమస్యే. ఎందుకంటే, సమాజంలోని representations తప్పనిసరిగా సాహిత్యంలోకి వస్తాయి కాబట్టి-

If literature is a “representation of life,” then representation is exactly the place where “life” in all its social and subjective complexity, gets into the literary work. (W.J.T. Mitchell)

ఈ విషయాన్ని ఎలాంటి సంశయాలూ లేకుండా వొప్పుకుంటాను కాబట్టి, రవీందర్ open చేసే “social and subjective complexities” నాకు కావాలి. అయితే, చదువరిగా నాకు వుండే అవే complexities తోనే నేనూ రవీందర్ ప్రపంచంలోకి వెళ్ళాలి. “తెలంగాణా” “దళిత” అన్నప్పుడు రవీందర్ నాకు వొక doubly oppressed identity కేంద్రంగా పనిచేసే ప్రపంచంలోకి తీసుకువెళ్తున్నాడు. అంటే, రెండు ప్రాతినిధ్యాల మధ్యకు తీసుకు వెళ్తున్నాడు. అవి రెండూ కాని నాదైన ప్రాతినిధ్య భూమికతో నేను ఈ కథల్లోకి వెళ్ళాలి. అంటే, మా ఇద్దరి మధ్య వొక dialogic space తెరుచుకోవాలన్నమాట.

మన సాహిత్యంలో ఇలాంటి dialogic space కి ఇంకా అనువైన కాలం రాలేదు. తన సానుకూల క్షేత్రం (comfort zone) నించి విడివడి ఇతర spaces లోకి వెళ్ళే మానసిక సంసిద్ధత లేదా స్వాతంత్రం ఇంకా రాలేదు మనలో చాలా మందికి – అలాంటి మానసిక స్వాతంత్రం లేనప్పుడు రవీందర్ గాని ఇంకో రచయిత కాని, తను ఫలానా అని కచ్చితంగా చెప్పుకున్నప్పుడు అది మొదట్లో చాలా అసౌకర్యంగా, uneasy గా వుంటుంది. కాని, అలా వుండడమే మంచిది. ఆ తరవాతి సంభాషణ హాయిగా వుంటుంది. నా భిన్నమైన అస్తిత్వ కోణం నించి నేను రవీందర్ “తెలంగాణా” “దళిత” కథలు చదువుతున్నప్పుడు యీ కథల్లోని జీవితం, వాతావరణం, పాత్రలు, సంఘర్షణలూ, ఉద్యమాలూ, ఆశలూ నిస్పృహలూ నాకు తెలిసిన లోకంలో నా కవరేజ్ ఏరియాలో లేని సంగతుల్ని, లేదా నేను కవర్ చేయడానికి ఇష్టపడని/ నిరాకరించే విషయాల్నీ రవీందర్ నాకు “ఇదీ” అని pointed గా చూపిస్తున్నాడు. సాహిత్యంలో తన representation గురించి resolute concerns వున్న బుద్ధిజీవి అయిన రచయిత మాత్రమే ఇలాంటి concern తో మనల్ని పలకరిస్తాడు. అయితే, నేను ఇక్కడ resolute అని దాన్ని qualify చేయడాన్ని మీరు గమనించాలి.

రవీందర్ కి తెలంగాణా దళిత వాదం అతని రచనా జీవన విధానం. అతని అనేక సామాజిక సాంస్కృతిక సాహిత్య అంశాలు దాని చుట్టూ తిరుగుతాయి. దాన్నించి అతన్ని విడిగా చూడలేనట్టే, అతని imaginative realm ని కూడా వొక వేరే ద్వీపంగా ఊహించలేం. అదే realmలో వుంటూ వొక కథకుడిగా రవీందర్ చాలా జీవితాన్ని ఈ కథల్లో కవర్ చేస్తున్నాడు. దాన్ని నేను resolute concern అని అంటున్నా. అస్తిత్వవాదం విధించే కనిపించని సంకెలని గౌరవిస్తూనే, జీవితంలోని ఇతర ప్రాతినిధ్య అంశాలని సృజనాత్మకంగా అక్కున చేర్చుకోవడంలో రవీందర్ మూలతత్వం అర్థమవుతుంది. బహుశా, ఆ కారణంగానే రవీందర్ ఆవిష్కరిస్తున్న తెలంగాణా దళిత దృశ్యం ఇక్కడ నిండు కాన్వాస్ మీద convincing గా కనిపిస్తుంది. అయితే, ఇంకాస్త ముందుకు వెళ్లి, రవీందర్ కథలు కేవలం “తెలంగాణా దళిత” కథలు కావనీ, “తెలంగాణా దళిత రాజకీయ” కథలనీ చెప్పడం అతని కథాతత్వానికి అతికినట్టు సరిపోతుంది. అస్తిత్వవాద రాజకీయ కోణం అనేది తెలుగు సాహిత్యంలో ఇంకా సరిగా ఆవిష్కారం కావడం లేదన్నది నిజం. ఎందుకంటే, ఆ విషయాన్ని సవిమర్శతో చూసే సంయమనం ఇంకా మనకి రాలేదు. వాదాలని ఉద్వేగ దశలోనే కాకుండా, వాటి తరవాతి ఆలోచనాత్మక దశని కూడా చూడగలిగే వోర్పు వున్నప్పుడు మాత్రమే రచయితకి రాజకీయ విమర్శ సాధ్యపడుతుంది. “పొద్దయింది” “ఊగి ఊగి ఉయ్యాల..” “అన్నీ తానై..”లాంటి కథల్లో ఈ కోణాన్ని చూడవచ్చు. ఉద్విగ్న రాజకీయ సన్నివేశంలో బతుకుతూ కూడా, రచయితగా ఎలాంటి objectivity ని వ్యక్తం చేయవచ్చో రవీందర్ ఇక్కడ రుజువు చేస్తున్నాడు.

4

నాలుగు ముక్కల్లో ఏ రచన గురించి అయినా ఎంత న్యాయం చేయగలమో ఇంకా నాకు అపనమ్మకమే. మన దగ్గిర వున్న విమర్శ సాధనాలు చాలా చాలా కొద్ది. మన ముందు వున్న జీవితాలు సంక్లిష్టంగా వున్నప్పుడు, కథకులు ఆ సంక్లిష్టతని అందుకొని దానికి తగిన కాన్వాస్ కోసం వెతుక్కునే తపనలో వున్నపుడు, విమర్శ స్థాయిలో మాట్లాడేది అంత తృప్తినివ్వదు. అందుకే, చదువరికి తన spaceలో తను సంచరించే స్వేచ్చనిచ్చే రచనని, విమర్శని నేను ఇష్టపడ్తాను. అలాగే, రచయిత తనకి తానుగా ఇచ్చే స్వేచ్ఛ కూడా నాకు ఇష్టం. రవీందర్ కూడా అలాంటి స్వేచ్చని ఇష్టపడే తాత్వికుడు. ఈ కథల్లో నాకు కొన్ని వర్ణనలు నాకు అసంతృప్తి కలిగించిన మాట వాస్తవం. ఉదాహరణకు : “జాగీరు” కథలో “మా ఇద్దరి మధ్య స్నేహ కుసుమాలు విరబూశాయి.” లాంటి వాక్యాలు చాలా archaic గా అనిపించాయి. ఈ కథల్లో సాధారణంగా కనిపించే రవీందర్ వాక్యాలకు పూర్తి వ్యతిరేకమైన వర్ణనా శైలి అది. అది శైలిని మరింత కమ్ముకోకుండానే వాటికి దూరంగా వుండి రాయాలసిన అవసరం ఇప్పటి రచయితలకి వుంది.

ఆ వొక్క చిన్న లోపం మినహాయించి రవీందర్ కథాభాష చాలా హాయిగా వుంటుంది, కొత్త భాషని నిజమయిన యాసని కథలోకి అద్భుతంగా తీసుకువచ్చాడు రవీందర్. అతను తీసుకువస్తున్న paradigm shift కి ఈ భాషతో సహా అతని వస్తువూ, సంవిధానమూ, కథాకథనమూ బాగా వొదిగాయి. తెలంగాణా దళిత జీవితాల్లో balanced diet పెద్ద కల. కాని, తెలంగాణా దళిత కథల్లో ఆ balanced diet కలగా మిగలకూడదన్న మొండి పట్టుదల రవీందర్ లో కనిపిస్తుంది. అది ఇప్పుడు ఇలాంటి కథా ధోరణికి చాలా అవసరం.

–          అఫ్సర్

జులై 5, 2014.

 

 

 

 

 

మీ మాటలు

  1. buchireddy gangula says:

    పుస్తకం పేరు భాగుంది — సమీక్ష గొప్పగా ఉంది

    మంచి కథా రచయిత రవీందర్ గారు — వారి కథల్లో
    నిజాయితి — వాస్తవం కనిపిస్తుంది —

    పట్నం అయినా పల్లె అయినా
    అమెరికా అయినా అమలాపురం అయినా
    యింకా కుల పట్టింపులు లే ని దే క్క da
    *************************************************************
    బుచ్చి రెడ్డి గంగుల

  2. k.sreedevy says:

    అప్సర్ గారు చాలా….. బాగుంది. మంచి విశ్లేషణ వ్యాసం.

  3. Veloori Krishnamoorthy says:

    అఫ్సర్గారు,

    రవీందర్ గారి దళిత కథలపై మీ సమీక్ష చాల బాగుందండి. పాలపిట్ట లోను మీ రచనలు చదువు తుంటాను. అభినందనలు.

    కృష్ణ మూర్తి, మైసూరు

  4. పట్నం అయినా పల్లె అయినా యింకా కుల పట్టింపులు భారత దేశం లో అది కనిపించని ముసుగులో దానిపని …………….

    రవీందర్ గారి దళిత కథలు చాల బాగుంటాయి తను చెప్పాలనుకున్న విషయం సూటిగా హృదయాల్లోకి మన కళ్ళముందు జరుగుతున్నట్లుగా నిజ జీవితం లో మన కళ్ళముందే జరిగినట్లు గా ఉంటాయి.

    కవర్ పేజి చాలబగున్నది.

    అఫ్సర్ గారు మీ విశ్లేషన చాల బాగున్నది

  5. dasaraju ramarao says:

    పసునూరి కవిత రాసినా, కథ రాసినా, వ్యాసం రాసినా, పాట రాసినా దళిత జీవితాన్ని వివిధకోణాల్లో బలంగా వినిపిస్తాడు. అణగారినతనాన్ని అగ్రహాజ్యోతి గ ప్రస్పుటిస్తాడు. కవర్ పేజి, టైటిల్ ,అఫ్సర్ గారి విశ్లేషణ కథకుడికి న్యాయం చేసినట్లున్నయి. ఇద్దరికీ మనస్పూర్తిగా నా కరచాలనం.

  6. మీ సమీక్ష చాలా బావుంది!

Leave a Reply to dasaraju ramarao Cancel reply

*