జలజల కురిసి తడిపే దళిత కతలు

suma1

‘పొయ్యిగడ్డల కధలు’ రాసిన సుమ వయసు ఇరవై అంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.

ఈ చిట్టి పొట్టి కధల్లో ద్రవిడ దళిత సంస్కృతిని పొయ్యిగడ్డ చుట్టూ పోగు చేసి చూపించింది సుమ. ఈ కధలలో ఉన్న పాత్రల సజీవతను విదిలిస్తే ఆమె బతుకుతున్న సమాజంలో ఉన్న సామాజిక, రాజకీయ, ఆర్ధిక, కుటుంబ, కుల రీతులు జలజల రాలతాయి. పట్టణ జీవితంలో రెండు మూడు తరాలు పరాయీకరణను చెంది, గ్రామాల్లో తమ అస్తిత్వాన్ని క్రమంగా కోల్పోతున్న వారికి తమ మూలాలకు సంబంధించిన మట్టి వాసనలు భాష రూపంలో, వ్యవహార రూపంలో ఈ కధలు పరిమళిస్తుంటే ఒక పులకరింత కలుగుతుంది.

మర్చిపోతున్నఅనేక తేట తెలుగు పదాలు ఈ పాత్రల ద్వారా చదువుతుంటే పరవశం కలుగుతుంది. యుగ యుగాలుగా మనిషి భూమి మీద శ్రమిస్తూ నేర్చుకొన్న విజ్ఞానం తరం నుండి తరానికి బదిలీ అవుతూ సామెతల రూపంలో ఒక శాస్త్రంగా మార్పు చెంది, మనిషి జీవితానికి ఎంత ఉపయుక్తంగా మారిందో ఈ కధలు వివరిస్తాయి. ఇవన్నీ సుమ కనిపెట్టి మేధోపరంగా విశ్లేషించి రాసిందని కాదు. ఆమె అలవోకగా, నిజాయితీగా తన చుట్టూ ఉన్న బతుకుల్లోనుండి పరిచిన సంగతులు ఈ విషయాలను మనకు తేటతెల్లం చేస్తాయి.

భారతదేశంలో మూడొంతుల బ్రతుకులు సుమ చెప్పిన విధంగానే ఉన్నాయి. అయితే ఎంతమంది పేరెన్నిక కన్న రచయితలు ఈ బ్రతుకుల గురించి కలాలు విదిలించారు? ఎవరి సమూహాల గురించే వాళ్ళే రాసుకోవాల్సిన చారిత్రిక సందర్భం ఇప్పుడు వచ్చింది. నన్నయ్యలు, తిక్కన్నలు తమ గురించి రాస్తారని ఆశిస్తే ఇప్పటి వరకు జరిగినట్లుగానే మెజారిటీ బతుకు చిత్రాలు చరిత్ర గుహల్లో శాశ్వతంగా పూడుకొని పోతాయి.

“మా యమ్మ , మా అబ్బ” అంటూ అమాయకంగా సుమ భారత మూలవాసుల జీవన వైవిధ్యాన్ని మౌఖిక భాషలో గ్రంధస్థం చేసింది. ‘కజ్జాయల’ తయారీ గురించి చెబుతూనే పండగ చేయటానికి మేకను అమ్మాల్సిన కుటుంబ ఆర్ధిక పరిస్థితుల గురించి చెబుతుంది. శాస్తాలు ఎలా చేయాలో చెబుతూ రాగులు, కాకి జొన్నలు, సాసువులు, యెర్నూగులు, అలసందలు జమిలీగా ఎలా పండిస్తారో కూడా వివరిస్తుంది. ‘జున్నటుకులు’ రామక్క బాల్యవివాహం, బిడ్డలు కోసం పడిన కష్టాన్ని చెబుతాయి. ‘వంచిన చారు’ పేదింటి పత్యాన్నిగురించి చెబితే ‘పెసల బేడల పాయసం’ పల్లెల్లో కులవివక్ష గురించి ఎలుగెత్తి చాటుతుంది. గువ్వ గూడంత ఇంట్లో ఉంటూ శ్రమ ఆధారమైన కుటుంబాలలో పండే ప్రేమా పాశాలను ఈ కధలు వర్ణిస్తాయి. దళితవాడల్లోని సామూహిక ఆనందాలను, డబ్బుఇవ్వలేక పోయినా చెమటను ఇచ్చి పుచ్చుకొని చేసుకొనే సహాయ సహకారాల గురించి చెబుతాయి ఈ కధలు. పిల్లెక్కమ్మ, సప్పలమ్మ, మారెమ్మ, కావేరమ్మ లాంటి అమ్మ తల్లులే ఇంకా పల్లెవాసుల ఆధ్యాత్మిక దైవాలనే వాస్తవాన్ని ఈ కధలు వివరిస్తాయి. దళిత ప్రజలకు గుడి బయట మాత్రమే దేవుడికి దండం పెట్టుకొనే అనుమతి ఉన్న “పబ్బతి” గురించి ఈ కధలు ధైర్యంగా మాట్లాడతాయి. ఒకటేమిటి. ఈ అసమాన ప్రపంచంలో వంకరైనా రీతి, రివాజుల గురించి … వాటిల్లో అయిష్టంగానే ఇమిడి పోతూ తనదైన సమాజం చేస్తున్న ఒడుదుడుకుల ప్రయాణం గురించి సుమ విశదంగా రాసింది.

ఆధిపత్య వర్గాల భావజాలం సమాజాన్ని ఎలాగైతే ఏలుతుందో, వారి భాష కూడా అధికార ప్రతిపత్తి సంపాదించి సాహిత్యాన్ని శాసించే ప్రయత్నం చేస్తుంది. ఇటీవల కొంత మంది రచయితలు జీవిత దృశ్యాలను మాండలికాలలో అందించి ఈ భాషా దొరతనంపై తమ ధిక్కారం ప్రకటిస్తున్నారు. సుమకు ఈ భాషా సంబంధమైన చర్చలు తెలియవు. ఆమె తన చుట్టూ అల్లుకొని ఉన్న బ్రతుకులను తనకు తెలిసిన భాషలోనే రాసింది. ఈ అవకాశం గతంలో తీసుకోక ఎంతమంది సాహితీకారులను చరిత్ర కోల్పోయిందో కదా అనే ఆలోచన రాక మానదు. సుమ రాసిన వంటకాలలోనే కాకుండా ఆమె వాడిన మాండలికంలో ఉన్న రుచి కూడా నోరూరిస్తుంది. “మూలిల్లు, తెల, కడి , సంబళం, కొత్త మొరము, బైరొడ్ల బియ్యం, వన్నెలు, తరాతీరులు, పబ్బితి, కొమ్మిరి, సాసువులు, మక్కిరి, సడ్డిగ, ఎట్టము తోలటం, కణజము, దూర్లు” లాంటి పదాలు సంతోష పెడతాయి. “మగోనకి మొలకలు వచ్చి, ఉబ్బోనకి ఉబ్బిబ్బి లేస్తాయట పుటగోగులు” లాంటి సామెతలు మానవుడు ప్రకృతితో నెరిపిన సావాసం నుండి పుట్టినవే. ఎంత గొప్ప అనువాదకులు అయినా ఈ సామెతలను ఇతర భాషలలోకి అనువదించలేరు. తెలుగుభాషతో పాటు మనం ఈ సైన్స్ ను కూడా కోల్పోతున్నామనే తెలుగు భాషావేత్తల ఆవేదన అత్యంత గౌరవించదగింది.

శ్రమ జీవుల్లో ఆహార విధానానికి శ్రమకు వున్న ప్రత్యక్ష సంబంధం గురించి బహు సులువుగా చెప్పింది సుమ. ఆమె చెప్పిన వంటలకు ముడి పదార్ధాలు ఆ తావులో పండుతున్న పంటలే. ఈ ముడి పదార్ధాలు వాళ్ళు శ్రమించిన భూమిలో మొలిచి నేరుగా కడుపులోకి పోయేవి. ఈ ప్రక్రియ మొత్తంలో జరిగే శ్రమలో కుటుంబ సభ్యులందరు పాలు పంచుకొంటారు. వండిన తరువాత వచ్చే గమ్ములను పీలుస్తూ చుట్టాలు, ఇరుగుపొరుగుల వారితో కలిసి ఆ వంటలను పంచుకోవటం వారి సామాజిక ఏకతను సూచిస్తుంది.20140524_225439 - Copy

 

సుమ చూపించిన ప్రపంచం కాల్పనికం కాదు. ఇరవయి ఒకటో శతాభ్ధంలో ఇంకా పలిక తోలి, సడ్డిగను మడకకు కట్టి, చేనంతా సాళ్లు పెట్టుకొని, ఎట్టము తోలి చేసే వ్యవసాయం అమలులో ఉంది. ఇది కృష్ణగిరి జిల్లా హోసూరులోనే కాదు భారతదేశం నలుమూలల ఈ రకమైన వ్యవసాయ పద్దతులు ఉన్నాయి. రాగులు, జొన్నలు, యెర్నూగులు, అలసందలు లాంటి చిరు ధాన్యాల మెట్ట సాగు మీద ఎన్నో కుటుంబాలు జరుగుబాటు అవుతున్న నడుస్తున్న చరిత్ర ఇది. ఉడుకుడుకు సంగటిని ఉలవచారుతోనూ, చల్లి పిండిని పచ్చికొమ్మిరిలో నంజుకొని తినే సమాజం నుండి రాసిన వాస్తవాలు ఇవి. కొడవళ్ళు తట్టుకోవటం, ఆకురాయికి పూజ చేయటం, సప్పలమ్మ పరసకు బోయి మొక్కి రావటం … ఎక్కడో జానపద సినిమాల్లో కాదు, భారతదేశ భూభాగంలో మెజారిటీ ప్రజల జీవిత చిత్రాలు ఇవి.

సుమ రాసిన కధలలో ఎక్కడా అసంబద్ధ విషయాలు లేవు. అవాస్తవాలు లేవు. పెచ్చు చేసి చెప్పటం లేదు. చెప్పదలుచుకొన్న విషయంలో నిజాయితీ, స్పష్టత … బాషలో సరళత .. ముగింపులో గడసరితనం … ఈమె కధల ప్రత్యేకత. “మా నగవులు విని ‘ఓహో ఇక్కడెక్కడో చిలకలు ఉన్నెట్లు ఉండాయే’ అనుకోని గోరటి గువ్వలు ఎగురుకొంటా వచ్చి మా ఇంటి మీద వాలినాయి.”, “ మా లొట్టలు చూసి పొద్దప్పకు కూడా నోరూరినట్లుంది. ఆయప్ప నోటి నీళ్ళు ఉత్తరోనా అయి ఊరి మింద పడినాయి.”, “ఆ పొద్దు నగువుల్తో మా ఇల్లంతా నిండిపోయింది. నగువుల నడుమ మేమంత సందు చేసుకొని ముడుక్కొంటిమి.” … ఇలాంటి చెమక్కులు ప్రతి కధ చివర అలరిస్తాయి.

ఈ రోజు ఫాస్ట్ ఫుడ్స్ లో ఎక్కువగా కనిపించే నూడీల్స్, శాస్తాల పేరుతో ఉడకబెట్టిన రాగిపిండితో చేసి పానకంతో కలిపి తింటారనే విషయం ఆశ్చర్యం కలిగించక మానదు. ఇక్కడ నుండి ఇంకొద్దిగా ముందుకు పోయి ఆలోచిస్తే సుమ చెప్పిన వంటలు మన దేశ మూల వాసుల ఆహారపు అలవాట్లకు సంబంధించినవి. ఆ అలవాట్లు అక్కడ పండే పంటలు, జీవరాసులు, భౌగోళిక స్థితిగతులు, వాతావరణ పరిస్థితులు మొదలైన వాటి మీద ఆధార పడి ఉంటాయి. ఈ సహజసిద్ధమైన అనుబంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం మనకీ నాడు సామ్రాజ్యవాద దేశాల నుండి వస్తుంది. ఆహార పరిశ్రమలలో మనం తినే వేరుశనగ ఉండల దగ్గర నుండి కోడి మాంసాల దాకా మల్టీ నేషనల్ కంపెనీలు ప్రవేశించాయి. నగరాలు, పట్టణాల ప్రజల ఆహారాల్లో మార్కెట్ ప్రవేశం జరిగిపోయింది. ప్రపంచీకరణను ఎదిరించే ప్రయత్నంలో మన స్థానిక వంటలను, స్థానిక దుస్తులను ఒక సృహతో కాపాడుకోవటం నేడు మన ముందు ఉన్న కర్తవ్యం.

మనిషి సాంస్కృతిక, సామాజిక పయనం సహజత్వం వైపు జరిగితేనే అదే అభివృద్ధి అవుతుంది. ఈ రోజు అభివృద్ధి పేరుతో మనం చేస్తున్న ప్రయాణం ఎండమావుల వైపే. “తెలుగు జాతి దళితైజ్ కావాలని” కోరుకోవటం అంటే మన భాషా సంస్కృత్తుల్లో మూల వాసనలు కాపాడుకొంటూ … ఎక్కడ సహజమైన వ్యవహారాలు, సహజమైన జీవన విధానాలు రాజ్యం ఏలుతున్నాయో వాటిని కాపాడుకొనటమే. వాటిని ఇప్పటికీ మిగుల్చుకొన్న సమూహాలు దళితులు, ఆదివాసీలే. భారతదేశ మూలవాసులైన దళిత సంస్కృతికి దడికట్టి పహరా కాయాల్సిన బాధ్యత సామాజిక సృహను కలిగిన వ్యక్తుల మీద, సమూహాల మీద ఉన్న ఈ సందర్భంలో ఈ పుస్తకాన్ని సుమ రాయటం, కృష్ణగిరి జిల్లా రచయితలు శ్రద్ధగా ప్రచురించటం … ఈ సంధి, సంశయ కాలానికి … రేపటి రోజున మనం చేయబోతున్న యుద్ధాలకు అత్యంత అవసరమైన సంగతి.

 -రమాసుందరి బత్తుల

ramasundari

 

 

మీ మాటలు

  1. Thirupalu says:

    ” పొయిగడ్డ కధలు” పేరే చాలా అందంగా వుమ్దమ్డి మీ సమీక్ష లాగే!
    //ఎక్కడ సహజమైన వ్యవహారాలు, సహజమైన జీవన విధానాలు రాజ్యం ఏలుతున్నాయో వాటిని కాపాడుకోవాలి.// చాలా బాగా చెప్పారు.

మీ మాటలు

*