మార్కెట్ మాయలో నలుగుతున్న మన కథ ‘ఒండ్రుమట్టి’

మనం నడిచొచ్చిన చరిత్రను అంచనా వేయటం అంత తేలికైన విషయం కాదు. సామాజిక పరిణామాలను సాహిత్యీకరించడం అన్ని యుగాల రచయితలకూ సవాలే. అయినా నిత్య చలనశీలమైన సమాజ పరిణామాన్ని గురించి పట్టించుకోని, వ్యాఖ్యానించని రచయిత ఉండరు. ఒక చారిత్రక గతిలో ముఖ్యమైన మలుపుల వద్ద ఒక నిర్దిష్ట కాలపు చారిత్రక, రాజకీయార్థిక పరిణామాలను చిత్రించిన మాలపల్లి, ప్రజల మనిషి వంటి గొప్ప నవలలు మన సాహిత్యంలో ఉన్నాయి. ఎన్నో రాజకీయ సంచలనాలకు కేంద్రమైన తెలుగు సమాజం అంతే అద్భుతమైన సాహిత్యాన్ని సృజించింది. అటువంటి సాహిత్యం తిరిగి ఈ చరిత్రకు, సామాజిక పరిశీలనలకు రక్తమాంసాలను అందించింది.

అదే ఒరవడిలో సరుకుల మార్కెట్‌ తీసుకొచ్చిన మార్పులను, రాజకీయ సంచలనాలు కదలబార్చిన సామాజిక సంబంధాలను, అనేక పరిణామాలను ఇమడ్చుకున్న కీలకమైన ఒక అర్ధశతాబ్దపు కాలాన్ని నాలుగు వందల పేజీల్లో రక్తమాంసాలతో మన కళ్ళముందుంచే ప్రయత్నం చేశారు విప్లవ రచయిత నల్లూరి రుక్మిణి. మార్పును గురించి మాట్లాడాలంటే నోస్టాల్జియాలో మునిగితేలుతున్న ఇటీవలి సాహిత్య ధోరణుల్లో ఒక స్పష్టమైన శాస్త్రీయ దృక్పథంతో సమాజాన్ని పరిశీలించిన అరుదైన నవల రుక్మిణి తాజా రచన ‘ఒండ్రుమట్టి’.

సాంకేతిక అభివృద్ధిలోని అన్ని అనుకూలాంశాలను భౌతికంగా అందిపుచ్చుకుని, మానసిక ప్రపంచంలో గతించిన కాలాన్ని గురించి, పల్లెలో ఒకనాడుండిన మానవ సంబంధాల గురించి వలపోసుకునే మధ్యతరగతి సాహిత్య జీవుల మన:స్థితిలోకి రచయిత ఇక్కడ పొరపాటున కూడా జారిపోలేదు. ఆ ఛాయలు ఎంతోకొంత రుక్మిణి కథల్లో అంతకు ముందు ఉండేవేమోగాని ఈ ప్రయత్నంలో అందులో నుంచి పూర్తిగా బైట పడ్డారు. అట్లాగే ఒక ప్రత్యేక పీడిత సమూహపు వేదనను వ్యక్తీకరించే అనుభవవాదమూ ఇందులో లేదు. అటువంటి వాటిల్లో సృజనకారులకు తమదైన ప్రత్యేక అనుభవం గురించి లోతైన అభివ్యక్తీకరణ సాధ్యమవుతుంది కాని చలనాలను, పరిణామాలను పట్టుకోవడం కష్టమే.

ప్రాంతీయ ఉద్యమాల సందర్భంలో కోస్తాఆంధ్ర ఆధిపత్యం, అంతర్గత వలస, వనరుల ఆక్రమణ గురించి చర్చ వచ్చినప్పుడల్లా ‘అభివృద్ధి’ గురించి మాటలుంటాయి. వాటి వెంట నీటి పారుదల, కాలువల కింది వ్యవసాయం తొట్టతొలిసారి అందిపుచ్చుకున్న ప్రాంతంగా ఆంధ్ర సంపన్నవర్గాలు ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయార్థిక, సాంస్కృతిక శాసనకర్తలుగా ఎదిగిన క్రమంమంతా నేపథ్యంగా ఉంటుంది. ఆ అభివృద్ధి వికాస క్రమం ఎటువంటిది? అది సాధించిందేమిటి? ఒండ్రుమట్టి నవల కాప్షన్‌ ‘ఒక తీర గ్రామం` యాభై ఏళ్ళ కథ’.

కాలువల కింద వ్యవసాయం ఆదాయంలో మిగులును సృష్టించడం మొదలు మార్కెట్‌ విస్తరణ సమాజాన్ని కదలబార్చిన మార్పు క్రమం కృష్ణాపురం అనే ఒక గ్రామం కేంద్రంగా ఈ కథ నడుస్తుంది. ప్రవాహానికి పోగుపడ్డ ఒండ్రుమట్టి పొరలు పొరలుగా కాలప్రవాహంలో వేగంగా కదులుతున్న జీవితాలను కనీసం ఓ రెండు మూడు తరాలను దృశ్యమానం చేస్తుంది. బకింగ్‌హాం కాలువ రావడం, బండ్లు ఓడలు కావడం, అదే క్రమంలో ఆ చిన్న గ్రామానికి విశాల ప్రపంచపు ద్వారాలు తెరుచుకుంటాయి. మరోవైపు నుండి జాతీయోద్యమ రాజకీయాలు, కమ్యూనిస్టు చైతన్యమూ ఆ ఊరును తాకుతుంది. పాత భూస్వామ్య కోటలు బీటలువారుతుంటాయి. కొత్త ఆధిపత్య వర్గం తలెత్తి బుసలు కొట్టడం మొదలు పెడుతుంది. తరాలుగా తొక్కిపెట్టబడిన కాలికింద మట్టి పైకెగిసి సవాలు చేస్తుంది. సమాజపు అన్ని పొరల్లోనూ ప్రకంపనలు బయలుదేరుతాయి. ఇవన్నీ 50 ఏళ్ళ విశాలమైన కాలపరిధిలో భిన్న వర్గాల, కులాలకు చెందిన అనేక సజీవ పాత్రలతో రూపగట్టడం చిన్న విషయం కాదు. సామాజిక పరిణామాల వెనకున్న ఉత్పత్తి సంబంధాల సూత్రాన్ని పట్టుకోవడం వల్లనే రచయితకు ఇది సాధ్యమైంది. అందుకే రచయిత తాను పుట్టిపెరిగిన మట్టి అయినప్పటికీ నోస్టాల్జియాలో పడిపోక తన అనుభవ జ్ఞానం పల్లె జీవితాన్ని లోతుగా పట్టివ్వడానికే ఉపయోగించుకున్నారు. ఈ జగ్రత్త వహించకపోతే ఏదో ఒక మూలకు జారిపోయే అవకాశం ఉంది. అనుభవానికి శాస్త్రీయ పరిశీలన తోడైనప్పుడే కనిపించే వాస్తవాల వెనక కదిలించే శక్తులు ఏవో నిగ్గుతేలుతుంది.

‘కాణీలు కనపడని రోజుల్లో’ కృష్ణాపురం వర్షాల మీదే ఆధారపడి ఇరవైనాలుగ్గంటలూ గొడ్డు చాకిరి చేసి జొన్న, కంది, రాగి, ధనియాలు పండిరచేది. ఇంటిక్కావలసిన తిండి, బట్ట కోసం ఇంటిల్లిపాదీ ఇరవైనాలుగ్గంటలూ కష్టపడే రైతు కుటుంబాలు, ఊరిని నమ్ముకుని ఉండే వృత్తి కులాలు, పూటకింత సంకటి ముద్ద కోసం జీవితాంతం నెత్తురు చెమటలుగా ధారపోసే జీతగాళ్ళు, అందరినీ అదుపాజ్ఞల్లో ఉంచే జమిందారు `అంతా కట్టుదిట్టంగా బిగించి ఉన్న ఒక బంధ వ్యవస్థ అది. ఆ ఊరివాళ్ళకు ఊరే ప్రపంచం. భూస్వామ్య వ్యవస్థ తాలూకు ఎన్ని ఎగుడు దిగుడులున్నా, ఎన్ని గాయాలు, బాధలున్నా తమ ప్రపంచాన్ని సమష్టిగా పరిరక్షించుకుంటారు. ఏ ఇంట్లో పెళ్ళైనా ఊరంతా ఒక్కటవుతుంది. మధ్యతరగతి రైతు రాయినీడు కోటయ్య కొడుకు తిరుపతయ్య పెళ్ళికి ఊర్లో అందరూ చుట్టాలను పిలుచుకుంటారు. ప్రతి ఇంటి నుండి పాలు, పెరుగు పెళ్ళింటికి తీసుకుపోతారు. అట్లాగే ఏరువాక పండగ రోజు ఊర్లోని రైతులంతా ఒకేసారి అరకలు వరుసగా పొలాలకు నడిపిస్తారు.

జమిందారు రంగస్వామి అరక ముందుంటే దాని వెంట ఊర్లో వారివారి హోదాని బట్టి వారి అరకల క్రమం నిలబడుతుంది. పల్లె స్వభావాన్ని పట్టిచ్చే ఈ రెండు సాంస్కృతిక విశేషాలను నవల చక్కగా ఉపయోగించుకుంది. యాభై ఏళ్ళు గడిచాక పెళ్ళి రూపురేఖలు ఎలా మారిపోయాయో అనే కాదు, ఏ సందర్భం వచ్చినా సమష్టితత్వం కన్నా సంపద ప్రదర్శన ప్రధానమైపోవడం కూడా ఇక్కడ కనపడుతుంది. అప్పటిదాకా మామూలుగా అనిపించిన ఊరు ఏదో కొత్తదనాననికి నాంది పలుకుతున్నట్టుగా ఏరువాక పండగ రోజు విశేషం కనపడుతుంది. ఏరువాక పండగరోజు అంతా సవ్యంగా నడిచినా ఆ ఏడు కొట్టొచ్చినట్టు కనిపించే మార్పు ఏమిటంటే జమిందారు అరక వెనక దానిని మించి తీర్చిదిద్దినట్టున్న వెంకటాద్రినాయుడి అరక . అది ఎదుగుతున్న కొత్త ఆధిపత్య వర్గానికి సూచిక. రంగస్వామి సడలిపోతున్న జమిందారీ వ్యవస్థకు ప్రతినిధి అయితే వెంకటాద్రినాయుడు మార్కెట్‌ విస్తరణ వల్ల తలెత్తిన కొత్త వ్యాపార వర్గానికి ప్రతినిధి. సంప్రదాయబద్ధుడైన జమిందారు రామస్వామి తండ్రి అతనికి కొన్ని సూత్రాలు చెప్పాడు.

రైతులకు అప్పు ఇవ్వుగాని పత్రం రాయించుకోకు. ఇనుప ముక్కల వ్యాపారం చేయొద్దు. అసలు వ్యాపారమంటేనే అవసరమైన చోట తగ్గి ఉండాలి. అది జమిందార్లు చేసే పని కాదు. అప్పుకు పత్రం రాయించుకోడమంటే తన రైతులు తన విశ్వాసం తప్పుతారని అనుమానం కలగడమే. ఆ భావన కూడా ఎన్నటికీ రాకూడదు. అయితే కాలం తీసు కొచ్చేమార్పులను ఎవరూ ఆపలేరు. కాలానుగుణంగా మారలేని పెద్దరికం, ఆధిపత్యం కూడా నశించక తప్పదు. మార్పును అర్థం చేసుకుని, వచ్చే అవకాశాల్ని పట్టుకుని ఎదిగే నూతన శక్తులు రంగం మీదికి రాక తప్పదు. వెంకటాద్రినాయుడు పిల్లలు మద్రాసు చదువులు చదువుకుని, ఓడల వ్యాపారంలో ఒడుపు తెలుసుకుని, మిగులు సంపాదించి పెట్టడంతో, అతను రైతులకు అప్పులు ఇవ్వడమే కాదు, పాత జమిందారులా కాకుండా కచ్చితంగా నోటు రాయించుకుని ముక్కు పిండి వసూలు చేస్తాడు. జమిందారు రంగస్వామే నయం అని రైతులనుకుంటేనేం, అతను అంతకంతకూ సంపన్నుడై ఊరు మీద పట్టు సంపాదిస్తాడు. ఆనాటి జాతీయోద్యమ రాజకీయాల కాలంలో రంగస్వామి జస్టిస్‌ పార్టీవైపు పోతే, వెంకటాద్రినాయుడు కాంగ్రెస్‌కు దగ్గరవుతాడు. ఇది అత్యంత సహజమే. రాజకీయంగా ఆయా వర్గాలకు ప్రాతినిధ్యం వహించే పార్టీలవి.

వ్యవసాయంలోకి వ్యాపారపంటగా పొగాకు రావడంతో రైతులు కూడా మెదటిసారిగా మిగులు కళ్ళజూస్తారు. చీరాల పట్టణంతో సంబంధం ఏర్పడి జాతీయోద్యమ రాజకీయాలు రైతులనూ తాకుతాయి. చీరాల`పేరాల పన్నుల నిరాకరణ ఉద్యమం, పుల్లరి వ్యతిరేక ఉద్యమం, జలియన్‌ వాలాబాగ్‌ దేశం నలుమూలలా ప్రతిధ్వనించిన రోజులు అవి. జాతీయోద్యమంతో ప్రభావితులైన మధ్యతరగతి రైతు యువకుల్లో రాయినీడు కోటయ్య రెండో కొడుకు పరమయ్య ఒకడు. పురోగామి రాజకీయాల వైపు నడిచిన మధ్యతరగతికి ప్రతినిధి పరమయ్య. ఇతను తర్వాతి కాలంలో గొప్ప కమ్యూనిస్టు అవుతాడు. ప్రపంచ యుద్ధంతో పొగాకు ధరలు పడిపోవడం, అతివృష్టి రైతుల కష్టార్జితాన్ని నీళ్ళపాలు చేసి అప్పులు మిగిలించడం వంటి ప్రతికూల పరిస్థితుల్లో కృష్ణాపురం రైతులకు తెలంగాణ ప్రాంతంలో నిజాం సాగర్‌ డ్యాం కింద కారుచవగ్గా దొరికే భూమి  ఆశలు కలిగిస్తుంది. సాహసం చేసి వలస పోయే రైతుల బృందంలో పరమయ్య కూడా ఒకడవుతాడు. కుటుంబాన్ని ఒడ్డుకు చేర్చడం కోసం అతను రాకూరు పయనమై రాత్రింబగళ్ళు గుట్టలు చదునుచేసి కండలు పిండి చేసుకుంటాడు. కుటుంబం ఎదిగివచ్చిన ఫలితం పరమయ్య తమ్ముడు  వెంకయ్యకు అన్ని విధాలుగా తోడ్పడుతుంది. వెంకయ్య పెద్దకొడుకును విదేశీ చదువులు వరిస్తే, చిన్న కొడుకు భాస్కరం క్రమంగా ధనిక రైతుల ప్రతినిధిగా కొత్త ఆధిపత్యవర్గంలో చేరతాడు. పరమయ్య మాత్రం తెలంగాణ రైతాంగ పోరాటానికి సారధ్యం వహిస్తున్న కమ్యూనిస్టు పార్టీలో భాగమవుతాడు. రాజ్యహింసను చవిస్తాడు. ప్రజల మనిషిగా రాటుదేలుతాడు. ప్రజల కోసం బతకడంలోని తృప్తిని పూర్తిగా పొందుతాడు. అతని కొడుకు చంద్రం అతని చైతన్యాన్ని అందిపుచ్చుకొని దానిని మరింత ముందుకు తీసుకుపోయే రాడికల్‌ అవుతాడు.

ondrumatti cover

            మొదట బతుకుకోసమే నిజాం పోయిన రైతులు తదనంతరం దొరికినంత భూమీ సంపాదించుకోవడం మొదలు పెడతారు. వ్యవసాయంలోకి యంత్రాలు ప్రవేశించి మార్పుల్ని మరింత వేగవంతం చేస్తాయి. ఎప్పుడూ కళ్ళజూడని డబ్బు పోగవుతుంది. కృష్ణాపురం రైతుల్ని నడమంత్రపు సిరి ముంచేస్తుంది. పాత విలువలు నశిస్తాయి. రైతుల దగ్గర అందిన కాడికి దోచుకునే వ్యాపార వర్గం పుట్టుకొస్తుంది. అప్పు చేయడమే తమ స్థాయిని దిగజార్చుకోవడమని, బాకీ తీర్చమని పదేపదే అడిగించుకోవడం మరింత నామర్దా అని భావించే మధ్యతరగతి రైతు కుటుంబాల నుండే అప్పు ఎగ్గొట్టి తిరిగే దళారీ వ్యాపారులు తయారవుతారు.

అనాయాసంగా పోగుపడుతున్న సంపద ఆధిపత్యపోకడల్లో అరాచకత్వానికి దారితీస్తుంది. తమ ఆధిక్యతను కింది కులాలపై అవకాశం కల్పించుకుని మరీ ప్రదర్శిస్తారు. మార్పు మట్టిమనుషుల్నీ ప్రభావితం చేస్తుంది. ఒకప్పుడు ఆధిపత్య వర్గానికే పట్టణాలతో సంబంధం ఉండేది. కాలక్రమంలో పల్లె ప్రజలందరికీ పట్టణాలతో సంబంధం ఏర్పడుతుంది. కూలీనాలీ జనం పనుల కోసం పట్నాలకు పోవడం బస్సుల రాకతో మరింత సానుకూలమవుతుంది. ఊరిని కాదంటే బతికేదెట్లా అనే భయం ఉండనక్కర్లేని పరిస్థితులొస్తాయి. పీడిత కులాలకూ అంతో ఇంతో చదువులు అందుబాటులోకి వస్తాయి. తమ అవ్వతాతల్లాగా, తల్లిదండ్రుల్లాగా మట్టిముద్దల్లా కాకుండా మనుషుల్లా బతకాలనుకుంటారు. ఒకవైపు కొత్తగా వచ్చిన ఆధిపత్యాన్ని అనుభవించాలని దూకుడుగా ఉన్న నయా భూస్వామ్య వర్గాలు, మార్పును అంగీకరించలేని పాత ఫ్యూడల్‌ శక్తులు (మార్పు తమ జీవితాల్ని సుఖమయం చేయొచ్చుగాని అలగా జనాల్ని అంటకూడదు), మరోవైపు గతంలో మాదిరి అవమానాల్ని సహించి ఊరుకోలేని జ్ఞానం పొందిన పీడిత కులాల కొత్త తరాలు. పరస్పర విరుద్ధ శక్తులు అనివార్యంగా ఘర్షణ పడాల్సిందే.

ఆధితపత్య వర్గాల అసహనం కింది కులాలపై హింసాత్మక అణచివేతను మరింత ఎక్కువ చేస్తుంది. సరుకుల మార్కెట్‌ తీసుకొచ్చిన క్షీణ సంస్కృతి విలువలు ఊర్లో లంపెన్‌ కుర్రకారును తయారు చేస్తాయి. దళిత స్త్రీలపై అత్యాచారాలు చేస్తే కులాధిపత్య భూస్వామ్య సమాజంలో మామూలుగా అడిగేవాళ్ళుండరు. అది మరింత దిగజారుతుంది. అక్కడి నుంచి కనిపించే ఆడపిల్లలనంతా అల్లరిపెట్టే ఆ ఊరి అల్లరి మూక చివరికి పండుగపూట ఊరికోలాహలం మధ్యలో కోమటిశెట్టి భార్యను రేప్‌ చేస్తారు. మంచీ చెడ్డా మాట చెప్పే పెద్దమనుషులు ఊర్లో కరువవుతారు. పాత ఫ్యూడల్‌ విలువలూ పోయి, ఆధునిక సంస్కారమూ అలవడక ఒక విధమైన అరాచక, సంకర సంస్కృతి వృద్ధి అవుతుంది. ఈ నవలలో ఒక్కో సంఘటనకు కార్యాకారణ సంబంధాలు గతితార్కికంగా అల్లుకునిపోయి ఉంటాయి.

కదలబారుతున్న ఆర్థిక పునాదిపై సాంఘిక సంబంధాల పట్టు సడలడంలో ప్రగతిశీల రాజకీయాలు ఉపరితలంలో పోషించిన పాత్ర ఎంతో ఉంది. వర్గపోరాటంలో భాగమైన భూపోరాటాలకు, రైతుకూలీ పోరాటాలకు జమిలిగా సాంఘిక అణచివేతపై పోరాటాలు సాగాయి. కృష్ణాపురంలోనూ కమ్యూనిస్టు రాజకీయాలు ప్రజల్ని సంఘటితం చేసి సన్న కులాలకు అండగా నిలుస్తాయి. జీతగాళ్ళ వ్యవస్థ రద్దవుతుంది. రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో మొదటిసారి అట్టడుగు కులాల వాళ్ళు అగ్రకుల అహంభావంపై దెబ్బకొడతారు. దళితులకు భూమి పంచడానికి పార్టీ ముందుకు వస్తుంది. అయితే ప్రజల్ని మహోజ్వల పోరాటాల వైపు కదిలించిన కమ్యూనిస్టు పార్టీ పోరాటాన్ని పక్కన పెట్టి ఎన్నికల్లో దిగడంతో చైతన్యవంతమవుతున్న పీడిత ప్రజలకు నాయకత్వం లేకుండా పోయింది.

భూమి సమస్య అలా ఉంచితే ఆధునిక కాలంలో దళిత కులాల నుండి కొత్త తరం లేవనెత్తుతున్న ప్రశ్నలకు పోరాట రూపం లేకుండా పోతుంది. ఎన్నికల్లో ఓడిపోయిన కమ్యూనిస్టు పార్టీ ప్రజాఉద్యమాల క్షేత్రంలోనూ నీరసిస్తుంది. పార్టీ బలహీనపడటం పీడిత ప్రజల్ని ఎంతగానో నిరాశపరుస్తుంది. మనదేశంలో రివిజనిజం మార్పుని దీర్ఘకాలానికి వాయిదావేసింది. అయినా పరస్పర విరుద్ధ శక్తుల మధ్య ఎక్కడో ఒక చోట ఘర్షణ బద్దలు కాక తప్పదు. నక్సల్బరీ శ్రీకాకుళాలు అట్లానే విస్ఫోటనం చెందాయి. కృష్ణాపురంలోనూ రాడికల్‌ ఉద్యమం పొద్దుపొడిసింది. సాల్మన్‌ల, మోషేల ఆరాటాలకు పోరాట వేదికనిచ్చింది. అది ఆత్మగౌరవ చైతన్యమే కాదు, ఆయుధం ధరించే తెగువనూ ఇచ్చింది. ఊర్లలో రాడికల్‌ విద్యార్థులు, యువజనలు, జననాట్యమండలి సాంస్కృతిక కార్యకర్తలు చేసిన ప్రచారం కృష్ణాపురం యువతను ఆకర్షిస్తుంది. నిత్య అవమానాలతో వేగిపోతున్న అత్యంత పీడిత సమూహాల పిల్లలు అన్యాయాన్ని ఎదిరించి దెబ్బకు దెబ్బ సమాధానమిచ్చే చర్యలకు పూనుకుంటారు. అటు బోయవాళ్ళూ తిరగబడి, మాదిగలూ తిరగబడి, ఇట్లా ఊర్లో సన్నకులాలు తిరగబడితే మాటలా? సబ్బండకులాలూ ఏకమైతే ఇంకేమైనా ఉందా? అట్లా జరగకుండా మొగ్గలోనే తుంచెయ్యాలనుకుంటాయి ఆధిపత్యశక్తులు. కులం మంటను ఎగదోస్తాయి. మాదిగపేట బూడిద కుప్పవుతుంది.

ఇది కృష్ణాపురంగా కథగా మన ముందుకొచ్చిన కారంచేడు కథ. కారంచేడు ఏం చెప్పింది? చిట్టచివరిగా చర్చికాంపౌండులో ఏర్పాటు చేసిన శిబిరంలో చంద్రం మాటల్లో అది వ్యక్తమవుతుంది. ‘‘ప్రవాహ సదృశ్యమైన సమాజాన్నీ, కాలాన్నీ వ్యక్తులు ఆపలేరు. అలా ప్రయత్నిస్తే వారు దానికింద నలిగి పోవడమే! ఇప్పటికి వాడిదే పైచేయి కావచ్చు… భవిష్యత్తు ప్రజలదే.’’

ఆ తర్వాత ఏం జరిగింది? ప్రపంచీకరణ, ఉదారవాద ఆర్థిక విధానాలు ఏ మార్పుల్ని వేగవంతం చేశాయి? వర్గపోరాట రాజకీయాలు ఏ విజయాలు సాధించాయి? ఏ ఎదురుదెబ్బలు తిన్నాయి? సమాజం ఏ మార్పు దిశగా పోతోంది? ఈ నవల పరిధిదాటి ఇటువంటి ఆసక్తి కొంతమందికైనా కలుగుతుంది. ‘ఇదంతా యువతరం రచయితలు రాయాలి’ అని సాహిత్యంలో సమాజ చలనపు ప్రతిఫలనంపై ఏర్పాటు చేసిన ఒక సెమినార్‌లో ఒండ్రుమట్టి నవలా నేపథ్యాన్ని చర్చిస్తున్నప్పుడు రచయిత అన్నారు. మరి ఈ సవాలును ఎవరు స్వీకరిస్తారో.

 -పి.వరలక్ష్మి

1464695_615025941892480_1810339123_n

 

మీ మాటలు

  1. ఈ నవలను నేనింకా చూడలేదు, చదవలేదు. ‘ఇది కృష్ణాపురం కథగా మన ముందుకొచ్చిన కారంచేడు కథ’ అని చెప్పారు. దీంతో ‘ఒండ్రుమట్టి’ని తప్పకుండా చదవాలన్న తపనను కలిగిస్తోంది. నవలలో అంశంగా మీరు ప్రస్తావించినప్పటికీ చాలా సామాజిక సమస్యల పోరాటంలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయనే ఆరోపణ ఇటీవలి కాలంలో ఎక్కువగానే వినిపిస్తోంది.

మీ మాటలు

*