“ రాతి చిగుళ్ళ” మెత్తదనం “గు౦డె పగిలిన దృశ్యాల” సౌకుమార్యం, తన కవితకు గుర్తింపు పత్రం ,చిరునామా అవసరం లేని కవయిత్రి శైలజామిత్ర . ఆవేదనా ప్రవాహం ,ఆలోచన అంతర్ దర్శనం, అస్తిత్వపోరాటం, అలసిపోయిన ఆరాటం, ఎల్లలు లేని ఆకాంక్ష అన్నీ కలగలిపి కవితాత్మ రంగులద్ది ఆరవేసిన పట్టువస్త్రం శైలజ కవిత్వం. అలాంటి కవిత్వానికి ఈ సంవత్సరం ఉమ్మడిసెట్టి రాధేయ అవార్డు లభించడం సంతోషకరం.
“ రాతి చిగుళ్ళు “ అక్షరాలా, అక్షరాల్లా యాభై ఆరు కవితల సమూహం. సమూహం అనడానికి కారణం ఏ రెండు కవితలూ ఒక శీర్షికకి౦ద ఇమడని వ్యక్తిత్వాన్ని ప్రదర్శించటమే. ఆరంభంలోనే తనదైన స్వప్నాన్ని పరిచయం చేసారు శైలజామిత్ర
“ఏదైనా ఒకటి
మనల్ని నిత్యం పలకరిస్తోంది అంటే
అది మనం వదిలి వచ్చిన బాల్యమే….
చిన్న చిన్న మాటలు అతిపెద్ద భావన. ఏదైనా ఒకటి … అదేదో ముందు చెప్పరు. కాని అది చేసే పని వివరిస్తారు. మనల్ని పలకరించడంలో చెప్పకనే చెప్పే ఆప్యాయత ,అనంత స్నేహభావం ,ఎక్కడో చిన్న తెలిసిన తనం లేకపోతె పనిగట్టుకుని రోజూ పలరి౦చరు గద, ఎవరబ్బా అంత చిరపరిచితులు ? అది మనం వదిలి వచ్చిన బాల్యం. ఇక్కడా లోతుగా తరచి చూస్తే బాల్యాని మనం వదిలి వచ్చాం-మానను బాల్యం వదిలి వెళ్ళలేదు. ఎంత వారలైనా అప్పుడో ఇప్పుడో చిన్నతనం పోనీ పిల్లల్లా ప్రవర్తించడం మన రెండో స్వభావమా?
ఇక్కడ బాల్యం మానవీకరి౦చ బడి౦ది. బాల్యం మనలను నిత్యం పలకరిస్తోంది, మనం దానిని పలకరించటం లేదు. వదిలి వచ్చినా విడవకుండా పలకరిస్తోంది. చిన్నప్పటి కళలు , అనుభవాలు , అనుభూతులు మనందరినీ ఎప్పుడో ఒకప్పుడు రోజుకోసారైనా పలకరించడం అందరికీ స్వానుభావమే. సర్వ జనీనమైన అనుభవాన్ని విశ్వైక భావనగా మనముందుంచారు శైలజ.
మరేదైనా ఒకటి
మనల్ని ధైర్యంగా నిలదీస్తో౦దీ అంటే
ఖచ్చితంగా మనం చేసిన పాపమే.
ఒక్క పలకరి౦తతో రోజు గడిచిపోదు. చేసిన పాపాలు నిలదీస్తాయి.
ఒక వెదుకులాట ,ఒక అంతర్ మదనం అంతేనా ఆరాతియ్యడం పనిలేనితనాన్నీ , ఆలోచించడం తప్పించుకునే ప్రయత్నాన్నీ వీటన్నింటి మధ్య జీవితం ఒక స్వప్నమే.
ఆకాశమంతా ఆవిరైపోతున్నట్టు
ఏమిటో ఈ అసహనపు జల్లులు
ఆకాశమే ఒక శూన్యం అది మొత్తం ఆవిరై మళ్ళీ కురిసే జల్లు
మానవీకరణ , ప్రతీక కవితవ పరికరాలిక్కడ. పాదరసాన్ని పట్టుకోవడం, లిప్త కాలపు తూటా చప్పుళ్ళు కదులుతున్న కలాలలన్నే కవికి ఎలా అనిపిస్తాయో వివరించారు.
ఒక భావన నుండి మరో భావానికి పాదరసంలా జారిపోయిన కవయిత్రి తనతో పాటు పాఠకులనూ లాక్కుపోతారు. ఒక వాస్తవిక వస్తుగత ప్రయోగం ద్వారా అమూర్త భావనల్లోకి ప్రవహించి అక్కడ మళ్ళీ తనదైన భానిలో ఆవేశ కావేశాలు, ఆకాంక్షలు ,నిరాశా నిస్పృహలు వెళ్ళగక్కి ఇది౦తే అన్న ఒక ఒక బలమైన ముగింపుకి వస్తారు రచనలో.
“కదులుతున్న కలాలన్నీ
నిశ్చలనిరాశల మధ్య
అనుభవాల దోబూచులాటలే..
……………….
నిరంతర ప్రయాణ సూచికలే …
అంటూ ఖచ్చితమైన ఆత్మాశ్రయ తత్వానికి వచ్చేస్తారు.
“ ప్రవహిస్తున్న క్షణాలు “ కవితలో
ప్రతి వ్యక్తీ ఒక గాజు గదిలో నివాసం
ఒకవైపును౦డి మరోవైపుకు రాళ్ళ ప్రహారం
ఒక అంచునుండి మరో అంచుకు బుల్లెట్ల విహారం
సగటు మానవుల స్థితి కళ్ళకు కట్టినట్టు వివరించారు.
వస్తు పరంగా చూసినపుడు ఒక విస్తృత వైవిధ్యాన్ని చూపారు కవయిత్రి వ్యక్తినుండి, పరిసరాలు, సమాజం, దేశం చివరకు విశ్వైక భావనతో ప్రపంచ సమస్యలూ కవితామయం చేశారు.
వ్యక్తికీ సమాజానికీ మధ్య, సమాజానికీ అంతః చేతనకూ మధ్య, సమాజ వైరుధ్యాల మధ్య, సంఘర్షణ సమయోచిత అభివ్యక్తి ఇవన్నే శైలజ కవితలు.
ఒంటరి తనం, అశక్తత వల్ల వచ్చిన నైరాశ్యం, జీవన వైరాగ్యం పర్యవేక్షణ, ఆత్మా పరిశీలన చక్కని భావచిత్రాల్లో అందంగా మలచబడ్డాయి. ఆ భావ చిత్రాలు కొన్ని ప్రగాధంగా ,కొన్ని తేలిపోయే మబ్బు తునకలంత తేలికగా , మరికొన్ని హరివిల్లు తీగలుగా సాగాయి.
అతి మామూలు దృశ్యాల నుండి అరూప భావనలకు తీసుకు వెళ్ళడంలో మాంత్రికురాలు శైలజ.
ఉత్తమ కవితల సరాగమాల తప్పకుండా తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటుందని చెప్పిన మూడో రోజునే ఈ పుస్తకం ఉమ్మిడి శెట్టి కవితా పురస్కారానికి ఎంపిక కావడం ఇంకా మిగిలి ఉన్న సాహితీ విలువలకు తార్కాణం.
మంచి కవితకు చక్కని రూపం “రాతి చిగుళ్ళు”
– స్వాతి శ్రీపాద