అతడు – ఆమె – ఓ బొల్లిగిత్త !

కేశవరెడ్డి మేజిక్‌ రియలిజమ్‌

ఫ్రాయిడిన్‌ సిద్ధాంతాల ఆధారంగా మనిషులకు, పశువులకి మధ్య లైంగిక సంబంధాల ఆధారంగా కొంత ఆంగ్ల సాహిత్యం యిప్పటికే వచ్చింది. అయితే అదంతా ఒక అసాధారణ మానవ ప్రవృత్తిని గురించి విశ్లేషించేదే, కానీ కేశవరెడ్డి ఈ అసాధారణ మానవ ప్రవృత్తికి ‘‘అంతర్‌ దృష్టి’’ అనీ, అవధులు లేని వేదన ద్వారా పొందిన యోగమని భ్రమింపచేయడం ఎంతవరకు సబబు? మానవ సంబంధాలలోని కాంప్లెక్స్‌టీస్‌ లేదూ, బహుళత్వాన్ని, సంక్లిష్టతలను చిత్రించాలనుకుని మేజిక్‌ రీయలిజమ్‌ మంత్రనగరిలో తనను తాను కోల్పోయిన మునెమ్మలో ఆధునిక స్త్రీ లక్షణాలని చూసిన జయప్రభ మునెమ్మ స్వాతంత్య్రపు పూర్వపు స్త్రీ అనే కాలిక సృహను ఎలా మరిచారు? ఈ మరపుకూడా మేజిక్‌ రియలిజమ్‌ మాయేనా? మునెమ్మ ఒక్కసారి కూడా దైవాన్ని స్మరించుకోలేదని ఇలాంటి చైతన్యం ఆ కాలంలోనే మునెమ్మకు ఉండటం అసాధ్యం కనుక ఆవిడ ఖచ్చితంగా కేశవరెడ్డి మానస పుత్రికే అని సంబరపడ్డ జయప్రభకి మునెమ్మ చైతన్యానికి మునెమ్మ అంతర్‌దృష్టికి మధ్య వున్న విరోదాభాస అర్ధం కాక పోవడం విచిత్రమే. మళ్ళీ మనం త్రిపురనేని మదుసూధనరావు దగ్గరకు వస్తే భ్రమాజనిత సంబంధాలు పురాణాలు అవుతాయే తప్పితే నిజమయిన మానవ సంబందాలు కావు. కేశవరెడ్డి లాంటి ఇంటలెక్చువల్‌ రచయిత మానవ సంబంధాలలోని సంక్లిష్టతలను సమగ్రమయిన అవగాహనతో సరళతరం చేయ్యాలి తప్పితే పురాణాల స్థాయికి తీసుకెళ్ళి పాఠకులను సంభ్రమాశ్చర్యచకితులను చేయడం తగదు.

   తెలుగులో రచనని, సామాజిక మార్పుకోసం ఒక పరికరంగా మార్చుకున్న సృజనకారులలో కేశవరెడ్డి ప్రముఖుడు. అధోజగత్‌ సహోదరుల వ్యదార్ధ జీవితాఇన్న కేశవరెడ్డి ఎన్నో నవలల్లో ప్రతిభావంతంగా చిత్రీకరించారు. కేశవరెడ్డి తాజా నవల ‘మునెమ్మ’ మిగతా నవలల కంటే కొంత భిన్నమయినది. సహజంగానే కేశవరెడ్డి రచనలలో విజువల్‌ ఇమేజ్‌ ఎక్కువ. దీనికి మేజిక్‌ రియలిజమ్‌ కలగలవడంతో, మునెమ్మ ఒక అద్భుతమయిన పఠన, దృశ్య కావ్యంగా మారింది.
శైలి, శిల్పము, వస్తువు ఈ మూడూ పడుగు పేకల్లా కలిసిపోతేనే ఏ రచనకయినా జవమూ, జీవమూ! ఈ మూడిరటిలో ఏది బ్యాలెన్స్‌ తప్పినా రచనలో ఏదో లోపించినట్లుగా వుండి పాఠకుడికి మేధోపరమయిన అసంతృప్తి ఏర్పడుతుంది.
అసలు రచన అంటే ఏమిటి? రచయిత స్థల కాలాలకి అతీతుడా లాంటి ప్రశ్నల్లోకి వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఎవరయినా రచన జీవితానికి రెండో వైపు అని చెప్పగలరు. ‘మునెమ్మ’లో కేశవరెడ్డి చూపిస్తున్న ‘రెండో వైపు’ ఎలా వుందో పరిశీలించడమే ఈ వ్యాసం.
‘‘స్థలకాల బద్దుడయిన సామాజిక వ్యక్తి కాకుండా రచయిత రచన చేయలేడు. అందుకనే రచయిత వ్యక్తిగానే రచన చేస్తున్నట్టు కనిపించినా సమిష్టి జీవితపు వేళ్ళు లేకుండా రచనా వృక్షం మొలకెత్తడానికి కూడా అవకాశం లేదు. రచయిత చుట్టూ వున్న సామాజిక జీవితం రచయిత మెదడులో ఆవేశ భావ రూపాల స్థితని పొంది క్రమబద్ధంగా రూపొందుతుంది. ఈ క్రమాన్నే సృష్టి అంటాం. మనిషి అంతరింద్రియ వ్యాపార క్రమాలకు, సామాజిక క్రమాలకు వుండే సంబంధం అవగాహన చేసుకోకపోవడం వలన సాహిత్య సృజన విషయంలో అనేక తప్పుడు అభిప్రాయాలు ప్రపంచానికి వచ్చాయి’’
ఇది కేశవరెడ్డి ‘‘ఇన్‌క్రెడిబుల్‌ గాడెస్‌’’ నవలకు ముందు మాట రాస్తూ త్రిపురనేని మధుసూధనరావు వెలిబుచ్చిన అభిప్రాయం. ఆయన యింకా యిలా అంటున్నారు.
‘‘ మానవులు తమ సంకల్ప శక్తితో తమ యిష్టం వచ్చినట్టు మానవ సంబంధాలు పెట్టుకుంటారా? అలాగే కనిపించవచ్చు కానీ అది వాస్తవం కాదు. చచ్చిపోయిన వాళ్ళతో కానీ, పుట్టబోయే వాళ్ళతో కాని మానవులు యిష్టం వున్నా సంబంధం పెట్టుకోవడం కనీసం ప్రస్తుతానికి సాధ్యం కాదు. జీవించే వ్యక్తుల మధ్యన సంబంధాలు వుంటాయనేది వుల్లంఘించడానికి వీల్లేని సత్యం. ఎప్పుడో చచ్చిపోయిన ముత్తాతతో ముని మనుమడు సంబంధం పెట్టుకున్నట్టు ఎవరయినా రాయెచ్చు.

చచ్చిపోయిన తన పెళ్ళాం ఎక్కడో పుట్టి వయసొచ్చి ఏ బస్సులోనో కనపడినట్టు పూర్వజన్మ స్మృతితో ఆ పిల్ల ముసలాడిని పట్టుకుని నువ్వే నా మొగుడివి వదలను గాక వదలను అన్నట్టు రాయెచ్చు. కానీ అది నవల కాదు. అవి మానవ సంబంధాలు కావు. అది పురాణం, ఆ సంబంధాలు భ్రమాజనితాలు. భ్రమలకు కూడ పరిమితులుంటాయి. మానవ సంబంధాలను పెట్టుకునేది మానవులే! అయితే ఆ సంబంధాలని నిర్ధిష్ట దశలో, నిర్ధిష్ఠ రూపంలోనే పెట్టుకునేది మానవులే! అయితే ఆ సంబంధాలని నిర్ధిష్ట దశలో, నిర్ధిష్ట రూపంలోనే పెట్టుకోగలుగుతారు. ఆ సంబంధాలు స్థల కాల మార్పులకు ఆధీనంగా వుండలవసిందే’’.

munemma
మునెమ్మ నవలలో స్థలము, కాలము రెండు వున్నాయి. రచయితకు మాత్రమే కాలిక స్పృహ లోపించింది. అయితే కేశవరెడ్డి తన కధన చాతుర్యంతో ఏ అంశాన్నయినా పురాణం స్థాయికి తీసుకెళ్ళగలడు. ‘అతడు అడవిని జయించాడు’, ‘ఇన్‌క్రెడిబుల్‌ గాడెస్‌’, ‘మూగవాని పిల్లనగ్రోవి’, ‘మునెమ్మ’ ఇలా ఏ నవల నయినా పురాణం స్థాయికి తీసుకెళ్ళగలడు. పాఠకుడి తను చదువుతున్నది వాస్తవమా, పురాణమా అన్న సంశయం కలుగుతూ వుంటుంది పదే పదే. మూగవాని పిల్లనగ్రోవి నవలలో బక్కిరెడ్డి చనిపోయినప్పుడు ప్రకృతి యావత్తు భోరు భోరుమని విలపించడమూ, మునెమ్మలో తరుగులోడిని సంహరించే సన్నివేశంలో బొల్లిగిత్త ఎవరెవరికి ఎలా ఎలా కనిపించింది అన్న సన్నివేశాన్ని చిత్రీకరించడం లాంటి లక్షణాలు కేశవరెడ్డి కధనాపటిమకు మెచ్చుతునకలు.
మేజిక్‌ రియలిజమ్‌ తోడ్పాటుతో కేశవరెడ్డిలోని ఈ లక్షణం మునెమ్మలో తారాస్థాయిని అందుకుంది. గాబ్రయేల్‌ గార్షియా మార్కుజ్‌ లాంటి నోబుల్‌ బహుమతి గ్రహీతలు తమ భావాలని స్వేచ్ఛగా వ్యక్తీకరించలేని వ్యవస్థలో మేజిక్‌ రియలిజమ్‌ మాటున దాక్కున్నారు. తెలుగులో మేజిక్‌ రియలిజమ్‌ కొత్తదేమీ కాదు. మునిపల్లె రాజు మేజిక్‌ రియలిజమ్‌ కథల పేరుతో ఒక కథా సంపుటాన్నే ప్రచురించాడు. వి. చంద్రశేఖరరావు చాలా కథలలో మేజిక్‌ రియలిజమ్‌ పోలికలు స్పష్టంగా కనిపిస్తాయి. మునిపల్లె రాజులో మేజిక్‌ రియలిజమ్‌ పరాకాష్ట నందుకుంటే కేశవరెడ్డి మునెమ్మలో ఇది తేటనీటి అడుగు చేపపిల్లల కదలికల్లాగా కనిపించీ కనిపించకుండా కనిపిస్తూ పాఠకుడిని సంభ్రమాశ్చర్యచకితులని చేస్తుంది. నిజానికి ఈ కధన పద్దతిని కనుక కేశవరెడ్డి కనుక ఎన్నుకోక పోయినట్లయితే యిది ఒక సాదా సీదా క్రైమ్‌ థ్రిల్లర్‌లాగా, షాడో ఇనవెస్టగేషన్‌లాగా మిగిలిపోయేది.
కథ గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. చిత్తూరు జిల్లాలోని ఒంటిల్లు అనే కుగ్రామంలో మునెమ్మ, జయరాముడు అనే పడుచు జంట. వీళ్ళ బతుకు రధాన్ని లాగడానికి ఆధారమయిన ఓ బొల్లిగిత్త. బొల్లిగిత్తకి మునెమ్మపైన లైంగికపరమయిన ఆకాంక్ష కలగిందన్న ఒక చిన్న అనుమానం జయరాముడిలో మొదలయి, బొల్లిగిత్తను కసిదీరా చావ బాది, ఆ తర్వాత మద్దిపాలెం పరసలో అమ్మెయ్యాలని నిశ్చయించుకుంటాడు.
బొల్లిగిత్తను మద్దిపాలెం పరసకు తోలుకుపోయిన తర్వాత, ఒంటరిగా బొల్లిగిత్త తిరిగివస్తుంది. కానీ జయరాముడు రాడు. ఆ రాత్రి మునెమ్మకి కలలో తన భర్త జయరాముడిని ఎవరో హత్యచేశారన్న విషయం తెలుస్తుంది. ఆ తర్వాత జయరాముడి హంతకుల కోసం మునెమ్మ వేట/ప్రయాణం మొదలవుతుంది. ఈ ప్రయాణంలో మునెమ్మకి సినబ్బ తోడవుతాడు. సినబ్బకి ఆమెకి ఒక వరుసలో తమ్ముడు. ఒక వరుసలో మరిది. మునెమ్మ సినబ్బను మరిదిలాగా భావిస్తుంది. సినబ్బ మునెమ్మని తమ్ముడులాగా భావించుకుంటాడు. సినబ్బ ద్వారానే పాఠకుడికి కథను రచయిత చెప్తాడు. ఒక రకంగా రచయితకు సినబ్బ ప్రతినిధి.
ఒంటిల్లు నుండి మద్దిపాలెం దాకా, అక్కడినుండి రామినాయుడిపల్లె మీదుగా కాణిపాకం తిరగి ఒంటిల్లు దాకా సాగిన ఈ ప్రతీకార యాత్ర యావత్తు మునెమ్మ అతీంద్రీయ, తార్కిక, జ్ఞానశక్తికి ప్రతీకగా నిలుస్తుంది. మునెమ్మ అనే ఈ సాధారణ వ్యకిలోని అసాధారణ తత్వానికి సినబ్బ అడుగడుగునా ఆశ్చర్య చకితుడు అవుతూ వుంటాడు.
తనకు వచ్చిన కల ఆధారంగా జయరాముడు ‘మరిక లేడు’ అన్న నమ్మకం మునెమ్మలో బలపడుతుంది. ఆ నమ్మకాన్ని సినబ్బకి చెపితే ‘‘అది ఆమెలో వున్న మూర్ఖత్వానికి పరాకాష్ట’’ అని భావించిన సినబ్బ నాలుగు రోజుల తరువాత అది మూర్ఖత్వం కాదని, ‘‘అంతర్‌దృష్టి’’అనీ అవధువుల లేని ఆవేదన ద్వారా పొందిన యోగమే ‘‘అంతరదృష్టి’’ అనీ అర్ధం చేసుకుంటాడు.
ఈ నవలలో కేశవరెడ్డి వదిలేసిన లూస్‌ ఎండ్స్‌ ఎన్నొ. జయరాముడి వ్యక్తిత్వంలో వస్తున్న ప్రతి మార్పుకి ఒక ఆధారభూతమయిన అంశాన్ని వివరిస్తూ, జయరాముడి కూడా తండ్రిలాగే తయారయ్యాడన్న వాస్తవానికి ఒక లాజికల్‌ రీజనింగ్‌ యిచ్చిన కేశవరెడ్డి, జయరాముడి హత్య వరకు అతి సాధారణ గృహిణిలాగా వ్ను మునెమ్మలో ఆ తర్వాత అద్భుతమయిన, ప్రేరణ, అతీంద్రీయ శక్తులకు మించిన జ్ఞానం కలగడం కావలసిన తాత్విక భూమికను ఏదీ చూపించలేదు. జయరాముడి వ్యక్తితవ్వంలో మార్పులకు ఇన్‌హెరిడిటీ/ జన్యుపరమయిన అంశాలు కారణం అయినట్లుగా మునెమ్మ అంతర్‌దృష్టికి ఏ రీజన్‌ లేదు.
వ్యవసాయక సమాజంలో పశువులకు, మనుషులకి మధ్య సన్నిహిత సంబంధాలు వుండటం సహజమే. పల్లె పట్టులలో వుండే ఎవరికయాని, తమతో సన్నిహితంగా వుండే మనుషులను పశువులను నాలుకతో నాకడమూ, మొహం మీదకు ముట్టె సాచి ముద్దుపెట్టుకోవడానికి ప్రయత్నించడం లాంటి అంశాలు అనుభవంలోకి వచ్చేవే. మనుషుల స్పర్శను పశువులు కోరుకోవడంలో లైంగిక పరమయిన కాంక్ష వుంటుందా? నాలుగు కాళ్ళ జంతువులా కనిపించిన మునెమ్మ మీదికి బొల్లిగిత్త రెండు కాళ్ళు ఎత్తి నడుము మీద వేయడం యితరేతర పశువుల ప్రవర్తన కంటే భిన్నమయినదా? వ్యవసాయిక సమాజమునుండి వచ్చిన జయరాముడికి పశువుకి, మనిషికి మధ్య వుండే సంబంధం గురించిన అవగాహన లేశ మాత్రమయిన లేదా!
కథాకాలం స్వాతంత్య్రానికి  పూర్వం. అప్పటికి మనుషులు యింకా యింతగా కలుషితం కాలేదు. అలాంటప్పుడు తరుగులోడు , నాటువైద్యుడి సహాయంతో జయరాముడిని హత్యచేయండ కేవలం డబ్బుకోసమే అనుకుంటే అందులో సమంజసత్వం వుందా! హత్యకి మోటివ్‌ ఏం లేదు?
జయరాముడి హత్యకి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోవడం వెనుక మునెమ్మలో అపరాధ భావం వుండా? జయరాముడి బొల్లిగిత్తను చావబాదడానికి కారణం అది తనను కామించడమే అయితే, దాన్ని యాక్సెప్ట్‌ చెయ్యడం ద్వారా జయరాముడికి అన్యాయం చేశానన్న భావం/గిల్టీ మునెమ్మలో వుందా? మునెమ్మకి జయరాముడి పైన వున్న ప్రేమకి, బొల్లిగిత్తపైన వున్న ప్రేమకి వున్న సాంద్రతలో తేడాలున్నాయా? ఒక మనిషి ఏక కాలంలో మనిషిని, పశువుని ప్రేమించడం సాధ్యంకాదా? అది నేరమా?
జయరాముడి స్థానంలో బొల్లిగిత్తను అంగీకరించడం ద్వారా పోయటిక్‌ జస్టిస్‌ జరిగిందన్న సురేంద్రరాజు మాటలో కేశవరెడ్డి ఏకీభవిస్తున్నారా? ఇన్‌క్రెడిబుల్‌ గాడెస్‌కి త్రిపురనేని మదుసూధనరావు రాసిన ముందు మాటని ‘‘నవలలోని కొన్న అంశాలను గురించి రచయిత పునరాలోచించవలసి వుందని’’ పేర్కొన్నారు. ‘‘కానీ అనాటి పరిస్థితులలో అలా పునరాలోచించాల్సిన అవసరం వుందని నేను భావించలేదు’’ అంటూ ఖండిరచిన కేశవరెడ్డి సురేంద్రరాజు మాటను ఖండిరచలేదు అంటే తన జస్టిస్‌గా అదే అనే కదా అర్ధం. అలాంటప్పుడు సింగిల్‌ ఉమెన్‌ సమస్యల పట్ల కేశవరెడ్డి దృక్పధం ఎలాంటి సంకేతాలని ఇస్తుంది.
ఫ్రాయిడిన్‌ సిద్ధాంతాల ఆధారంగా మనిషులకు, పశువులకి మధ్య లైంగిక సంబంధాల ఆధారంగా కొంత ఆంగ్ల సాహిత్యం యిప్పటికే వచ్చింది. అయితే అదంతా ఒక అసాధారణ మానవ ప్రవృత్తిని గురించి విశ్లేషించేదే, కానీ కేశవరెడ్డి ఈ అసాధారణ మానవ ప్రవృత్తికి ‘‘అంతర్‌ దృష్టి’’ అనీ, అవధులు లేని వేదన ద్వారా పొందిన యోగమని భ్రమింపచేయడం ఎంతవరకు సబబు?
మానవ సంబంధాలలోని కాంప్లెక్స్‌టీస్‌ లేదూ, బహుళత్వాన్ని, సంక్లిష్టతలను చిత్రించాలనుకుని మేజిక్‌ రీయలిజమ్‌ మంత్రనగరిలో తనను తాను కోల్పోయిన మునెమ్మలో ఆధునిక స్త్రీ లక్షణాలని చూసిన జయప్రభ మునెమ్మ స్వాతంత్య్రపు పూర్వపు స్త్రీ అనే కాలిక సృహను ఎలా మరిచారు? ఈ మరపుకూడా మేజిక్‌ రియలిజమ్‌ మాయేనా? మునెమ్మ ఒక్కసారి కూడా దైవాన్ని స్మరించుకోలేదని ఇలాంటి చైతన్యం ఆ కాలంలోనే మునెమ్మకు ఉండటం అసాధ్యం కనుక ఆవిడ ఖచ్చితంగా కేశవరెడ్డి మానస పుత్రికే అని సంబరపడ్డ జయప్రభకి మునెమ్మ చైతన్యానికి మునెమ్మ అంతర్‌దృష్టికి మధ్య వున్న విరోదాభాస అర్ధం కాక పోవడం విచిత్రమే.
మళ్ళీ మనం త్రిపురనేని మదుసూధనరావు దగ్గరకు వస్తే భ్రమాజనిత సంబంధాలు పురాణాలు అవుతాయే తప్పితే నిజమయిన మానవ సంబందాలు కావు. కేశవరెడ్డి లాంటి ఇంటలెక్చువల్‌ రచయిత మానవ సంబంధాలలోని సంక్లిష్టతలను సమగ్రమయిన అవగాహనతో సరళతరం చేయ్యాలి తప్పితే పురాణాల స్థాయికి తీసుకెళ్ళి పాఠకులను సంభ్రమాశ్చర్యచకితులను చేయడం తగదు.

– వంశీకృష్ణ

మీ మాటలు

  1. mosuru santhamani says:

    చాలా బాగుంది.కేసవరెడ్డి క్రాఫ్ట్ గొప్పదే,గానీ విషయమో?వంశీకృష్ణ గారు అభినందనలు.

  2. కేశవరెడ్డి గారు చాలా లబ్ధ ప్రతిstuలైన ర చై త .వారి కలం నుండి ఇలాంటి నవల రావటం బాగా ledu .అసలు ఎంచుకున్న కధావస్తువు సరిగ్గా లేదు.జంతువులకి మనిషికీ మద్య లైంగిక సంబధం అనేది చాలా abserd గా వుంది. ఇక ఇలాంటి కdhaaవస్తువుకి అనవసరమైన హంగులు, రంగులు అద్ది చదువరులకి అందిచారు. kadhaa antaa nela viడిచి సాము చేసింది. వంసీకృష్ణ గారి కామెంట్ బాగుంది.

Leave a Reply to mosuru santhamani Cancel reply

*